Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 10-12

కొత్త రాతి పలకలు

10 “ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే వీటి కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను వ్రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’

“కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”

(ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసేరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసేరునుండి గుద్గోదకు వెళ్లారు. మరియు వారు గుద్గోదనుండి నదులుగల యొత్బాతా దేశం వెళ్లారు. ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను[a] మోయాల్సిన పని వారిది. యెహోవా ఆలయంలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు. అందువల్లనే యితర వంశాలవలె లేవీ వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే.)

10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’” అని నాతో చెప్పాడు.

నిజంగా యెహోవా కోరేది

12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.

14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజలు కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.

16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.

20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.

యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి

11 “అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన చేసే శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు, ఆతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూసారు. వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, వాళ్లను యెహోవా ఎర్ర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ నాశనం చేయటం మీరు చూసారు. మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే మీ పిల్లలు కాదు. రూబేను వంశానికి చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములకు యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పనిమనిషిని, ప్రతి జంతువును మింగి వేసింది. యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నింటినీ చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు.

“కనుక ఈ వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యొర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచివాటితో నిండిన దేశం.[b] 10 మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. 11 అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. 12 మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.

13 “‘మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే, అప్పుడు 14 సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. 15 మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు తినే ఆహారం సమృద్ధిగా ఉంటుంది.’

16 “అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు. 17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.

18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి. 19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి. 20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.

22 “మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గాలన్నింటినీ వెంబడించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి. 23 అప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 24 మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా సముద్రంవరకు వ్యాపించి ఉంటుంది. 25 మీకు వ్యతిరేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో మీరు ఎక్కడికి వెళ్లినాసరే ప్రజలు మీకు భయపడేటట్టుగా మీ దేవుడైన యెహోవా చేస్తాడు. ఇంతకు ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.

ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశీర్వాదములా లేక శాపములా

26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమో లేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. 27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. 28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.

29 “మీరు నివసించబోతున్న దేశానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు గెరీజీము కొండమీదికి వెళ్లి, అక్కడనుండి ఆ ఆశీర్వాదాలు చదివి ప్రజలకు వినిపించాలి. అలాగే ఏబాలు కొండమీదికి కూడా మీరు వెళ్లి అక్కడనుండి శాపాలు చదివి ప్రజలకు వినిపించాలి. 30 అరాబాలో నివసించే కనానీ ప్రజల దేశంలో యొర్దాను నదికి ఆవలి ప్రక్క ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమాన గిల్గాలు పట్టణానికి దగ్గరగా మోరేలోని సింధూర వృక్షాలకు సమీపంగా ఉన్నాయి. 31 మీరు యొర్దాను నది దాటివెళ్తారు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. ఈ దేశం మీది అవుతుంది. మీరు ఈ దేశంలో నివసించేటప్పుడు, 32 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ జాగ్రత్తగా లోబడాలి.

దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం

12 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి. వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.

“కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం. ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం[c] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.

“ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం. ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలిసి సంతోషంగా సమయం గడపండి. 13 మీకు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో మీ దహనబలులు అర్పించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. 14 మీ వంశాలకు చెందిన ఒక ప్రాంతంలో యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొంటాడు. దహన బలులు అర్పించటం, నేను మీతో చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి.

15 “మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును. 16 కాని రక్తంతో మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.

17 “మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా: దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదట పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్ఛార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని, 18 మీ దేవుడైన యెహోవా నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన వాటితో ఆనందించండి. 19 మీరు ఎల్లప్పుడూ ఈ భోజనాలను లేవీయులతోకూడ పంచుకొనే విషయంలో ఖచ్చితంగా ఉండండి. మీరు మీ దేశంలో బతికినంతకాలం ఇలా చేయండి.

20-21 “మీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసినప్పుడు, ఆయన తన ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొనే స్థలానికి మీ నివాసం చాలా దూరం కావచ్చు. అది చాలా దూరమై, మాంసం కోసం మీరు ఆకలిగా ఉంటే, అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మాంసమైనా తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల మందలోనుండిగాని, గొర్రెల మందలోనుండిగాని, ఏ జంతువునైనా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం తినవచ్చును. 22 జింక, దుప్పి మాంసం తిన్నట్టుగానే మీరు ఈ మాంసం తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా యిలా చేయవచ్చును. 23 రక్తంతో మాత్రం తినకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ఇంకా ప్రాణం ఉన్న మాంసం మీరు తినకూడదు. 24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి. 25 సరైనది అని యెహోవా చెప్పిన ప్రతిదీ మీరు చేయాలి. అందుచేత రక్తంతో తినవద్దు. మీకు మీ సంతతివారికి మేలు కలుగుతుంది.

26 “మీరు ప్రతిష్ఠించిన వాటిని, మీ మొక్కు బడులను, మీ దేవుడైన యెహోవా నియమించే ప్రత్యేక స్థలానికి మీరు తీసుకొని వెళ్లాలి. 27 మీరు మీ దహన బలులను ఆ స్థలంలో అర్పించాలి. మీ దహనబలుల రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. మీ యితర బలుల విషయంలో రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును. 28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికి జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.

29 “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు. 30 అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు. 31 ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.

32 “నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా చేయాలి. నేను మీకు చెప్పేవాటికి మరేమీ కలుపవద్దు, ఏమీ తీసివేయవద్దు.

మార్కు 12:1-27

రైతుల ఉపమానం

(మత్తయి 21:33-46; లూకా 20:9-19)

12 ఆ తర్వాత ఆయన వాళ్ళతో దృష్టాంతాలు చెబుతూ ఇలా మాట్లాడటం మొదలు పెట్టాడు: “ఒకడు ద్రాక్షాతోట వేసి, చుట్టూ ఒక గోడ కట్టాడు. ద్రాక్షపళ్ళు త్రొక్కటానికి ఒక తొట్టి కట్టించాడు. అక్కడే ఒక గోపురం కట్టించాడు. ఆ తర్వాత ఆ ద్రాక్షతోటను కొంతమంది రైతులకు కౌలుకిచ్చి ప్రయాణమై వెళ్ళిపోయాడు.

“పంటకాలం రాగానే పంటలో తనకు రావలసిన భాగం తీసుకు రమ్మని ఒక సేవకుణ్ణి వాళ్ళ దగ్గరకు పంపాడు. కాని ఆ రైతులతణ్ణి పట్టుకొని కొట్టి వట్టిచేతులతో పంపివేసారు. ఆ తర్వాత అతడు యింకొక సేవకుణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తలపై బాది అవమానపరిచారు. అతడు యింకొక సేవకుణ్ణి కూడా పంపాడు. వాళ్ళతణ్ణి చంపివేసారు. అతడింకా చాలామందిని పంపాడు. కాని ఆ రైతులు వారిలో కొందరిని చంపారు. మరి కొందరిని కొట్టారు.

“తన ప్రియమైన కుమారుడు తప్ప పంపటానికి యింకెవ్వరూ మిగల్లేదు. వాళ్ళు తన కుమారుణ్ణి గౌరవిస్తారనుకొని చివరకు తన కుమారుణ్ణి పంపాడు.

“కాని ఆ రైతులు, ‘ఇతడు వారసుడు! యితణ్ణి చంపుదాం; అప్పుడు ఆ వారసత్వం మనకు దక్కుతుంది’ అని పరస్పరం మాట్లాడుకొన్నారు. ఆ కారణంగా వాళ్ళతణ్ణి పట్టుకొని చంపి ఆ ద్రాక్షతోటకు అవతల పడవేసారు.

“అప్పుడు ఆ ద్రాక్షతోట యజమాని ఏం చేస్తాడు? వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షతోటను యితరులకు కౌలుకిస్తాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు: ఇది మీరు చదువలేదా?

‘ఇల్లు కట్టువాళ్ళు పనికిరాదని పారవేసిన రాయి తలరాయిగా మారింది.
11 ఇది ప్రభువు చేసాడు. ఆ అద్భుతాన్ని మనం కండ్లారా చూసాము.’”(A)

12 ఈ దృష్టాంతం తమనుగూర్చి చెప్పాడని యూదులు గ్రహించారు. కనుక ఆయన్ని బంధించటానికి మార్గం ఆలోచించారు. కాని ప్రజల గుంపును చూసి భయపడిపొయ్యారు. అందువల్ల ఆయన్ని వదిలి వెళ్ళిపొయ్యారు.

యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:15-22; లూకా 20:20-26)

13 ఆ తర్వాత యేసును ఆయన మాటల్లో పట్టేయాలని కొంతమంది పరిసయ్యుల్ని[a] హేరోదు రాజు పక్షముననున్న వాళ్ళను ఆయన దగ్గరకు పంపారు. 14 వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! మీరు సత్యవంతులని మాకు తెలుసు. మీరు మానవుల మాటలకు లొంగిపోరు. వాళ్ళెవరనే విషయం మీకు అవసరం లేదు. సత్యమార్గాన్ని మీరు ఉన్నది ఉన్నట్లు బోధిస్తారు. మరి చక్రవర్తికి పన్నులు కట్టటం న్యాయమా? కాదా? మేము పన్నులు కట్టాలా మానాలా?” అని అడిగారు.

15 యేసుకు వాళ్ళ కుట్ర తెలిసి పోయింది. “నన్నెందుకు మోసం చేయాలని అనుకుంటున్నారు? ఒక దేనారా[b] యివ్వండి. నన్ను దాన్ని చూడనివ్వండి” అని అన్నాడు. 16 వాళ్ళు ఒక నాణాన్ని తీసుకు వచ్చారు. యేసు, “దీని మీద ఎవరి బొమ్మ ఉంది? ఎవరి శాసనం ఉంది?” అని అడిగాడు. “చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

17 అప్పుడు యేసు వారితో, “చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి, దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు. ఆయన సమాధానం విని వాళ్ళు ఆశ్చర్యపొయ్యారు.

కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం

(మత్తయి 22:23-33; లూకా 20:27-40)

18 చనిపోయిన వాళ్ళు మళ్ళీ బ్రతకరని వాదించే సద్దూకయ్యులు ఆయన దగ్గరకు వచ్చి ఒక ప్రశ్న వేసారు. 19 “అయ్యా, ఒకని సోదరుడు చనిపోతే, ఆ చనిపోయిన సోదరునికి సంతానం లేకపోయినట్టయితే, ఆ చనిపోయిన సోదరుని భార్యను బ్రతికివున్న సోదరుడు వివాహమాడి, చనిపోయిన సోదరునికి సంతానం కలిగేటట్లు చెయ్యాలని మోషే మనకోసం ధర్మశాస్త్రంలో వ్రాసాడు. 20 ఒకప్పుడు ఏడుగురు సోదరులుండే వాళ్ళు. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా చనిపొయ్యాడు. 21 రెండవ వాడు అతని వితంతువును వివాహమాడాడు. కాని అతడు కూడా సంతానం లేకుండా చనిపొయ్యాడు. మూడవ వానికి కూడా అదే సంభవించింది. 22 ఆ ఏడుగురిలో ఎవ్వరికి సంతానం కలగలేదు. చివరకు ఆ స్త్రీకూడా చనిపోయింది. 23 చనిపోయిన వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు ఆమె ఎవరి భార్యగా పరిగణింపబడుతుంది? ఆమెను ఆ ఏడగురు పెండ్లి చేసుకొన్నారు కదా?” అని అడిగారు.

24 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు, దేవుని శక్తి తెలియవు. కనుక పొరబడుతున్నారు. 25 చనిపోయిన వాళ్ళు బ్రతికివచ్చాక వివాహం చేసుకోరు. వాళ్ళు ఆడ, మగ అని ఉండరు. వాళ్ళు పరలోకంలో ఉన్న దేవదూతల్లా ఉంటారు. 26 ఇక చనిపోయిన వాళ్ళు బ్రతకటం విషయంలో మోషే తాను వ్రాసిన గ్రంథంలో ‘పొదను’ గురించి వ్రాసినప్పుడు, దేవుడు అతనితో ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(B) అని అతనితో చెప్పాడు. 27 ‘నేను వాళ్ళ దేవుణ్ణి’ అని ఆయన అన్నప్పుడు, వాళ్ళు నిజంగా చనిపోలేదన్న మాట. అంటే ఆయన బ్రతికివున్న వాళ్ళకు మాత్రమే దేవుడు. మీరు చాలా పొరబడుతున్నారు.”[c]

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International