Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 35-36

లేవీ వారి పట్టణాలు

35 యెహోవా మోషేతో ఇలా మాట్లాడాడు: ఇది మోయాబులో యొర్దాను లోయలో, యొర్దాను నది దగ్గర, యెరికో అవతల జరిగింది. యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలు వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను లేవీ వారికి ఇవ్వవలెనని వారితో చెప్పుము. ఆ పట్టణాలను, వాటి చుట్టూ ఉండే పచ్చిక బయళ్లను ఇశ్రాయేలు ప్రజలు లేవీ వారికి ఇవ్వవలెను. లేవీయులు ఆ పట్టణాల్లో నివసించగలుగుతారు. వారి పశువులు, వారికి ఉన్న జంతువులు అన్నీ ఆ పట్టణాల చుట్టూ ఉండే పచ్చిక బయళ్లలో మేత మేయగలుగుతాయి. మీ భూమిలో ఎంతభాగం మీరు లేవీయులకు ఇవ్వవలెను? పట్టణాల ప్రాకారాలనుండి 1,500 అడుగుల వరకు భూమి లేవీయులకే చెందుతుంది. మరియు పట్టణానికి తూర్పున 3,000 అడుగులు, పట్టణానికి దక్షిణాన 3,000 అడుగులు, పట్టణానికి పశ్చిమాన 3,000 అడుగులు, పట్టణానికి ఉత్తరాన 3,000 అడుగులు మొత్తం లేవీయులకు చెందుతాయి. ఆ భూమి అంతటికీ మధ్యలో పట్టణం ఉంటుంది, ఆ పట్టణాల్లో ఆరు ఆశ్రయ పురాలుగా ఉంటాయి. ఒక వ్యక్తి ప్రమాద వశాత్తూ మరొకర్ని చంపేస్తే, అప్పుడు అతడు ఆశ్రయంకోసం ఆ పట్టణాలకు పారిపోవచ్చు. ఈ ఆరు పట్టణాలు గాక, ఇంకా 42 పట్టణాలను మీరు లేవీయులకు ఇవ్వాలి. కనుక మీరు మొత్తం 48 పట్టణాలను లేవీయులకు ఇవ్వవలెను. ఆ పట్టణాల చుట్టూ ఉండే భూమిని కూడ మీరు లేవీయులకు ఇవ్వవలెను. ఇశ్రాయేలీయులలో పెద్ద కుటుంబాలు ఉన్న వారు ఎక్కువ భూభాగాలు ఇవ్వవలెను. ఇశ్రాయేలు చిన్న కుటుంబాలవారు చిన్న భూభాగాలు ఇవ్వవలెను. అయితే అన్ని వంశాల వారూ దేశంలోని వారి భాగంలోనుంచి కొన్ని పట్టణాలను మాత్రం తప్పక లేవీవారికి ఇవ్వవలెను.”

తర్వాత యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: 10 “ప్రజలతో ఈ సంగతులు చెప్పుము. మీరు యొర్దాను నది దాటి కనాను దేశంలో ప్రవేశిస్తారు. 11 ఆశ్రయ పురాలుగా పట్టణాలను మీరు ఏర్పాటుచేయాలి. ఒక వ్యక్తి ప్రమాదవశాత్తూ మరో వ్యక్తిని చంపేస్తే, అప్పుడు అతడు భద్రత కోసం ఆ పట్టణాల్లో ఒకదానికి పారిపోవచ్చును. 12 చనిపోయిన మనిషి కుటుంబంనుండి, దెబ్బకు దెబ్బతీయాలని చూచే వారి బారినుండి అతడు క్షేమంగా ఉంటాడు. అతనికి న్యాయస్థానంలో తీర్పు జరిగేంతవరకు అతడు క్షేమంగా ఉంటాడు. 13 ఆశ్రయపురాలు ఆరు ఉంటాయి. 14 ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి తూర్పువైపున ఉంటాయి. ఆ పట్టణాల్లో మూడు యొర్దాను నదికి పశ్చిమాన కనాను దేశంలో ఉంటాయి. 15 ఇశ్రాయేలు పౌరులకు, విదేశీయులకు, యాత్రికులకు ఆ పట్టణాలు క్షేమమైన స్థలాలుగా ఉంటాయి. వారిలో ఎవరైనా సరే మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపేస్తే వారు ఆ పట్టణాల్లో ఒక దానికి పారిపోగలుగుతారు.

16 “ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని ఇనుప ఆయుధంతో చంపితే, అప్పుడు చంపినవాడూ చావాల్సిందే. 17 ఒక వ్యక్తి బండతో ఇంకో మనిషిని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ బండ సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించేది) 18 ఒక వ్యక్తి కర్రను ప్రయోగించి మరొకడ్ని చంపితే, అతడు కూడ చావాల్సిందే. (ఆ కర్ర సాధారణంగా మనుష్యులను చంపేందుకు ప్రయోగించే ఆయుధం) 19 చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఒకరు హంతకుణ్ణి తరిమి చంపవచ్చును.

20-21 “ఒక వ్యక్తి మరో వ్యక్తిని చేతితో కొట్టి చంపవచ్చు. లేదా ఒక వ్యక్తి మరొకరిని తోసేసి చంపవచ్చు. లేక ఒక వ్యక్తి మరో వ్యక్తిమీద ఏదైనా విసరడం ద్వారా వానిని చంపవచ్చును. ఆ హంతకుడు ద్వేషంతో అలా చేస్తే అతడు హంతకుడు. ఆ మనిషిని చంపివేయాలి. చనిపోయిన వాని కుటుంబ సభ్యుల్లో ఎవరైనా అతనిని తరిమి చంపవచ్చును.

22 “కానీ ఒక వ్యక్తి మరొకర్ని ప్రమాదవశాత్తూ చంపవచ్చును. అతడు తాను చంపిన వాడిని ద్వేషించలేదు. అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. లేక ఒక వ్యక్తి మరొకరి మీద ఏదో విసిరినప్పుడు అవతల మనిషి చావవచ్చు – చంపాలని అతడు అలా చేయలేదు. 23 లేక ఒక వ్యక్తి ఒక బండను విసిరివేయవచ్చును. అతడు చూడని మరో వ్యక్తిమీద ఆ బండపడి, అతనిని చంపవచ్చు. అతడు ఎవరినీ చంపాలని పథకం వేయలేదు. తాను చంపినవాడిని అతడు ద్వేషించలేదు – అది కేవలం ప్రమాదవశాత్తూ జరిగింది. 24 అలా జరిగితే ఏమి చేయాలనేదీ సమాజం నిర్ణయం చేయాలి. 25 చనిపోయిన వాని కుటుంబంలో వారు ఎవరైనా తిరిగి అతడిని చంపవచ్చేమో సమాజపు న్యాయస్థానం నిర్ణయించాలి. న్యాయస్థానం హంతకుడిని బ్రతకనివ్వాలని ఒకవేళ నిర్ణయిస్తే, అప్పుడు ఈ వ్యక్తి తన ‘ఆశ్రయపురానికి’ వెళ్లాలి. పవిత్ర తైలంతో అభిషేకించబడిన ప్రధాన యాజకుడు మరణించేంత వరకు అతడు అక్కడే ఉండాలి.

26-27 “ఆ మనిషి తన ‘ఆశ్రయ పురం’ హద్దులు దాటి ఎన్నడూ బయటకి వెళ్లకూడదు. అతడు ఆ హద్దులు దాటి బయటికి వెళ్తే, చనిపోయినవాని కుటుంబ సభ్యుల్లో ఒకరు అతన్ని పట్టుకొని చంపివేస్తే, అప్పుడు, ఆ సభ్యుని మీద హత్యా నేరం ఉండదు. 28 ప్రమాదవశాత్తూ చంపిన వ్యక్తి, ప్రధాన యాజకుడు మరణించేంతవరకు తన ‘ఆశ్రయ పురం’లోనే ఉండాలి. ప్రధాన యాజకుడు మరణించాక, అతడు తిరిగి తన చోటికి వెళ్లవచ్చును. 29 మీ ప్రజల పట్టణాలన్నింటిలోనూ ఆ నియమాలు శాశ్వత చట్టంగా ఉంటాయి.

30 “సాక్ష్యాలు ఉన్నప్పుడు మాత్రమే హంతకుడు హంతకునిగా చంపబడాలి. ఒకే ఒక్క సాక్షి ఉంటే ఏ వ్యక్తినీ చంపకూడదు.

31 “ఒక్క వ్యక్తి హంతకుడైతే, అతడ్ని చంపి వేయాలి. డబ్బు తీసుకుని ఈ శిక్షను మార్చవద్దు. ఆ హంతకుడు తప్పక చంపబడాలి.

32 “ఒక వ్యక్తి మరొకర్ని చంపి, ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోతే, వాడిని ఇంటికి పోనిచ్చేందుకు డబ్బు తీసుకోవద్దు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండాలి.

33 “నిరపరాధుల రక్తంతో మీ దేశాన్ని నాశనం కానివ్వవద్దు. ఒక వ్యక్తి మరో వ్యక్తిని హత్య చేస్తే, ఆ నేరానికి ఒకే శిక్ష. అది ఆ హంతకుడు చంపబడటమే. ఆ నేరంనుండి దేశాన్ని మరే శిక్షకూడ విమోచించదు. 34 నేనే యెహోవాను. నేను మీ దేశంలో ఇశ్రాయేలు ప్రజలతో నివసిస్తాను. ఆ దేశంలో నేను నివసిస్తాను గనుక నిర్దోషుల రక్తంతో దానిని పాడు చేయవద్దు.”

సెలోపెహాదు కుమార్తెల భూమి

36 యోసేపు కుమారుడు మనష్షే. మనష్షే కుమారుడు మాకీరు. మాకీరు కుమారుడు గిలాదు. గిలాదు వంశపు నాయకులు మోషేతో, ఇశ్రాయేలు వంశాల నాయకులతో మాట్లాడటానికి వెళ్లారు. వారు ఇలా అన్నారు: “అయ్యా, చీట్లు వేసి భూమిని తీసుకోమని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. మరియు అయ్యా, సెలోపెహాదు భూమిని అతని కుమార్తెలకు ఇవ్వాలని యెహోవా ఆజ్ఞాపించాడు. సెలోపెహాదు మా సోదరుడు. ఒకవేళ మరేదైనా ఇశ్రాయేలు వంశంలోనుండి మరెవరైనా సెలోపెహాదు కుమార్తెల్లో ఒకరిని వివాహము చేసుకోవచ్చు. ఆ భూమి మా కుటుంబం నుండి పోతుందా? ఆ మరో వంశంవారు ఆ భూమిని తీసుకుంటారా? చీట్లు వేయడం ద్వారా మాకు లభించిన ఆ భూమిని మేము పొగొట్టుకుంటామా? ప్రజలు వారి భూమిని అమ్మివేయవచ్చు. అయితే బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో భూమి అంతా దాని అసలైన సొంతదారులకు తిరిగి ఇవ్వబడుతుంది. ఆ సమయంలో, సెలోపెహాదు కుమార్తెలకు చెందిన భూమి ఎవరికి లభిస్తుంది? అలా గనుక జరిగితే మా కుటుంబం శాశ్వతంగా ఆ భూమిని పోగొట్టుకుంటుంది కదా?”

మోషే ఇశ్రాయేలీయులకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞ యెహోవానుండి వచ్చింది. “యోసేపు వంశపు మనుష్యులు సరిగ్గా చెప్పారు. ఇది సెలోపెహాదు కుమార్తెలకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ. మీరు ఎవరినైనా వివాహమాడాలనుకుంటే మీ స్వంతవంశంలో వారినే వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో భూమి ఒక వంశంనుండి మరో వంశానికి మారిపోదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి. ఒకవేళ ఎవరైవా స్త్రీకి తన తండ్రి భూమి సంక్రమిస్తే, ఆమె తన స్వంత వంశం వారినే ఎవరినైనా వివాహము చేసుకోవాలి. ఈ విధంగా ప్రతి వ్యక్తీ తన పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి. కనుక ఇశ్రాయేలు ప్రజల్లో ఒక వంశంనుండి మరో వంశానికి భూమి పోకూడదు. ఇశ్రాయేలీయులు ప్రతి ఒక్కరూ వారి పూర్వీకులకు చెందిన భూమిని కాపాడాలి.”

10 మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు సెలోపెహాదు కుమార్తెలు విధేయులయ్యారు. 11 అందుచేత సెలోపెహాదు కుమార్తెలు మహలా, తిర్సా, హొగ్లా, మిల్కా, నోయా, వారి తండ్రి సోదరుని కుమారులను వివాహము చేసుకున్నారు. 12 వారి భర్తలు మనష్షే వంశం వారు గనుక వారి భూమి తమ తండ్రి కుటుంబం, వంశం వారికే చెందింది.

13 కనుక అర్బోతు మోయాబు ప్రాంతంలో, శ్రేష్ఠ యొర్దాను నది ప్రక్కన, యెరికో దగ్గర మోషేకు యెహోవా ఇచ్చిన చట్టాలు, ఆజ్ఞలు అవి. ఆ చట్టములను, ఆజ్ఞలను మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు.

మార్కు 10:1-31

విడాకులను గురించి బోధించటం

(మత్తయి 19:1-12)

10 యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్ళకు బోధించాడు.

కొందరు పరిసయ్యులు[a] ఆయన్ని పరీక్షించాలని అనుకొని వచ్చి, “ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయ సమ్మతమేనా?” అని అడిగారు.

యేసు, “మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు?” అని అడిగాడు.

వాళ్ళు, “విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతి ఇచ్చాడు” అని అన్నారు.

యేసు, “మీరు దేవునికి లోబడనివారు కనుక మోషే అలా వ్రాశాడు. కాని, దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ‘ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు’(A) అందువల్లే, పురుషుడు తన తల్లి తండ్రుల్ని వదిలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు.(B) వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు యిద్దరివలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్ళను ఏ మానవుడూ వేరు చేయకూడదు” అని అన్నాడు.

10 అంతా యింట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. 11 యేసు ఇలాగన్నాడు: “తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకొన్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడౌతాడు. 12 అదే విధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకొన్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.”

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మత్తయి 19:13-15; లూకా 18:15-17)

13 యేసు తాకాలని, ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకొని వస్తూవుంటే శిష్యులు వాళ్ళని గద్దించారు. 14 ఇది చూసి యేసుకు మనస్సులో బాధ కలిగింది. ఆయన వాళ్ళతో, “చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం చిన్న పిల్లల్లాంటి వారిది. 15 ఇది నిజం. చిన్న పిల్లవాని వలే దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు” అని అన్నాడు. 16 ఆయన ఆ చిన్న పిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్ళపై తన చేతులుంచి ఆశీర్వదించాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; లూకా 18:18-30)

17 యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరుగెత్తుకొంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి, “మంచి బోధకుడా! నేను నిత్యజీవం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

18 యేసు, “నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు. దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసు కదా! 19 హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యం చెప్పరాదు. మోసం చెయ్యరాదు. నీ తల్లి తండ్రుల్ని గౌరవించు” అని అన్నాడు.

20 అతడు, “అయ్యా! నా చిన్నతనంనుండి నేను వీటిని పాటిస్తున్నాను!” అని అన్నాడు.

21 యేసు అతని వైపు చూసాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో, “నీవు యింకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.

22 ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడినుండి వెళ్ళిపొయ్యాడు.

23 యేసు చుట్టూ చూసి తన శిష్యులతో, “ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం” అని అన్నాడు.

24 శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ, “శిష్యులారా! దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం! 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

26 ఇది విని శిష్యులు యింకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే, “ఎవరికి రక్షణ లభిస్తుంది?” అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు.

27 యేసు వాళ్ళవైపు చూసి, “మానవునికి ఇది అసాధ్యమైన పని కాని, దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

28 పేతురు ఆయనతో, “మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29-30 యేసు, “ఇది నిజం. నా కోసం, సువార్తకోసం, తన యింటినికాని, సోదరులనుకాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లినికాని, తండ్రినికాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని, విడిచినవాడు ఈ తరంలోనే నూరు రెట్లు యిళ్ళను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్యజీవం పొందుతాడు. 31 కాని ముందున్న వాళ్ళు చివరివాళ్ళై, చివర వున్న వాళ్ళు ముందుకు వెళ్తారు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International