Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 11-12

11 యెఫ్తా గిలాదు వంశంవాడు. అతడు బలమైన సైనికుడు. అయితే యెఫ్తా ఒక వేశ్య కుమారుడు. అతని తండ్రి పేరు గిలాదు. గిలాదు భార్యకు చాలామంది కుమారులు ఉన్నారు. ఆ కుమారులు పెద్దవారైనప్పుడు, యెఫ్తా అంటే వారికి ఇష్టంలేకపోయింది. ఆ కుమారులు యెఫ్తాను అతని స్వగ్రామం నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. “మా తండ్రి ఆస్తిలో నీకు ఎలాంటి భాగం లేదు. నీవు మరో స్త్రీ కుమారుడివి” అని వారు అతనితో చెప్పారు. కనుక యెఫ్తా తన సోదరుల మూలంగా వెళ్లిపోయాడు. అతడు టోబు దేశంలో నివసించాడు. టోబు దేశంలో కొందరు అల్లరి జనం యెఫ్తాను వెంబడించటం మొదలు పెట్టారు.

కొంతకాలం తర్వాత అమ్మోనీ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేశారు. అమ్మోనీయులు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేస్తున్నారు గనుక గిలాదులోని పెద్దలు (నాయకులు) యెఫ్తా దగ్గరకు వెళ్లారు. యెఫ్తా టోబు దేశం విడిచిపెట్టి, గిలాదుకు తిరిగి రావాలని వారు కోరారు.

ఆ పెద్దలు, “మనం అమ్మోనీయులతో యుద్ధం చేయగలిగేటట్టు, నీవు వచ్చి మాకు నాయకునిగా ఉండు” అని యెఫ్తాతో చెప్పారు.

కానీ యెఫ్తా, “మీరే నన్ను నా తండ్రి ఇంటి నుండి బలవంతంగా వెళ్లగొట్టారు. నేనంటే మీకు అసహ్యం. కనుక మీకు కష్టం వచ్చిందని మీరు ఇప్పుడు నా దగ్గరకు రావటం ఎందుకు?” అని గిలాదు దేశపు పెద్దలను (నాయకులను) అడిగాడు.

“ఆ కారణం వల్లనే ఇప్పుడు మేము నీ దగ్గరకు వచ్చాము. దయచేసి మాతో వచ్చి అమ్మోనీయుల మీద యుద్ధం చేయి. గిలాదులో నివసిస్తున్న ప్రజలందరి మీద నీవు సైన్యాధికారిగా ఉంటావు” అని గిలాదు పెద్దలు యెఫ్తాతో చెప్పారు.

అప్పుడు యెఫ్తా, “నేను గిలాదుకు తిరిగి వచ్చి, అమ్మోనీయులతో యుద్ధం చేయాలని మీరు కోరితే, మంచిదే. కానీ గెలిచేందుకు యెహోవా నాకు సహాయం చేస్తే, అప్పుడు మీకు నేను కొత్త నాయకునిగా ఉంటాను” అని గిలాదు పెద్దలతో చెప్పాడు.

10 గిలాదు పెద్దలు (నాయకులు), “మనం చెప్పుకొంటున్నది అంతా యెహోవా వింటున్నాడు. మేము చేయాలని నీవు చెప్పేది అంతా మేము చేస్తామని వాగ్దానం చేస్తున్నాము” అని యెఫ్తాతో చెప్పారు.

11 కనుక గిలాదు పెద్దలతో యెఫ్తా వెళ్లాడు. ఆ ప్రజలు యెఫ్తాను తమ నాయకునిగా, సైన్యాధికారిగా చేసుకున్నారు. మిస్పా పట్టణంలో యెహోవా ఎదుట యెఫ్తా తన మాటలన్నింటినీ మళ్లీ చెప్పాడు.

అమ్మోను రాజు వద్దకు యెఫ్తా సందేశకులను పంపుట

12 అమ్మోను ప్రజల రాజు దగ్గరకు యెఫ్తా సందేశకులను పంపించాడు. ఆ సందేశకులు రాజుకు ఈ సందేశం అందించారు: “అమ్మోను ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు మధ్యగల సమస్య ఏమిటి? మాపై యుద్ధానికి నీవెందుకు వచ్చావు?”

13 అమ్మోను ప్రజల రాజు, “ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి వచ్చినప్పుడు, వారు మా భూమిని ఆక్రమించుకున్నారు గనుక ఇశ్రాయేలీయులతో మేము యుద్ధం చేస్తున్నాము. అమ్మోను నది నుండి యబ్బోకు నది వరకు, యోర్దాను నది వరకు వారు మా భూమిని ఆక్రమించారు. ఇప్పుడు మా భూమిని శాంతియుతంగా తిరిగి మాకు ఇచ్చివేయమని ఇశ్రాయేలీయులతో చెప్పండి” అని యెఫ్తా సందేశకులతో చెప్పాడు.

14 యెఫ్తా సందేశకులు ఈ సందేశాన్ని తిరిగి యెఫ్తాకు అందించారు. అప్పుడు యెఫ్తా ఆ సందేశకులను తిరిగి అమ్మోనీయుల రాజు దగ్గరకు పంపించాడు. 15 వారు తిరిగి తీసుకుని వెళ్లిన సందేశం ఇది:

“యెఫ్తా చెప్పేది ఇది: మోయాబు ప్రజల భూమిగాని, అమ్మోను ప్రజల భూమిగాని ఇశ్రాయేలీయులు తీసుకోలేదు. 16 ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చినప్పుడు, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలోనికి వెళ్లారు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రానికి వెళ్లారు. తర్వాత వారు కాదేషు వెళ్లారు. 17 ఇశ్రాయేలీయులు ఎదోము రాజు దగ్గరకు సందేశకులను పంపించారు. ఒక సహాయం కోసం ఆ సందేశకులు అడిగారు. ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి పోనియ్యి’ అని వారు అడిగారు. కానీ ఎదోము రాజు మమ్మల్ని వారి దేశంలో నుండి వెళ్లనివ్వ లేదు. అదే సందేశాన్ని మేము మోయాబు రాజుకు కూడ పంపించాము. కానీ మోయాబు రాజుగూడ మమ్మల్ని తన దేశంలోనుండి వెళ్లనివ్వలేదు. కనుక ఇశ్రాయేలు ప్రజలు కాదేషులో నిలిచిపోయారు.

18 “తర్వాత ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నుండి, ఎదోము, మోయాబు దేశాల సరిహద్దుల నుండి తిరిగి వెళ్లారు. ఇశ్రాయేలు ప్రజలు మోయాబు దేశానికి తూర్పు దిశగా ప్రయాణం చేశారు. అర్నోను నదికి అవతలవైపు వారు విడిది చేసారు. మోయాబు దేశ సరిహద్దును వారు దాటలేదు. (అర్నోను నది మోయాబు దేశానికి సరిహద్దు.)

19 “తర్వాత ఇశ్రాయేలీయులు అమ్మోరీయుల రాజు సీహోను దగ్గరకు సందేశకులను పంపించారు. సీహోను హెష్బోను పట్టణపు రాజు, ‘ఇశ్రాయేలు ప్రజలను నీ దేశంలో నుండి వెళ్లనియ్యి. మేము మా దేశానికి వెళ్లగోరుతున్నాము.’ అని ఆ సందేశకులు సీహోనుతో చెప్పారు. 20 కానీ అమ్మోరీయుల రాజు సీహోను ఇశ్రాయేలు ప్రజలను తన సరిహద్దులు దాటనివ్వలేదు. సీహోను తన ప్రజలందరినీ సమావేశపరచి, యాహసు దగ్గర విడిది చేసాడు. అప్పుడు అమ్మోరీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేసారు. 21 అయితే సీహోనును, అతని సైన్యాన్ని ఓడించేందుకు ఇశ్రాయేలు దేవుడు యెహోవా, ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేసాడు. కనుక అమ్మోరీయుల దేశం ఇశ్రాయేలీయుల ఆస్తి అయింది. 22 కనుక అమ్మోరీయుల దేశం అంతా ఇశ్రాయేలీయుల వంశం అయింది. ఆ దేశం అర్నోను నదినుండి యబ్బోకు నదివరకు ఉంది. ఆ దేశం అరణ్యంనుండి యోర్దాను నదివరకు ఉంది.

23 “అమ్మోరీ ప్రజలను వారి దేశంనుండి వెళ్లగొట్టినవాడు యెహోవా, ఇశ్రాయేలు దేవుడు. మరియు ఆ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ దేశాన్ని విడిచి వెళ్లిపోయేట్టు నీవు చేయగలవని అనుకొంటున్నావా? 24 నీ కెమోషు దేవత నీకు ఇచ్చిన దేశంలో నిశ్చయంగా నీవు ఉండవచ్చును. కనుక మా యెహోవా దేవుడు మాకు ఇచ్చిన దేశంలో మేము ఉంటాము. 25 సిప్పోరు కుమారుడు బాలాకు[a] కంటె నీవు మంచివాడవా? అతను మోయాబు దేశానికి రాజు. అతడు ఇశ్రాయేలు ప్రజలతో ఏమైనా వాదించాడా? అతడు ఇశ్రాయేలు ప్రజలతో నిజంగా యుద్ధం చేశాడా? 26 హెష్బోను పట్టణంలో, దాని చుట్టూరా ఉన్న ఊళ్లలోను మూడువందల సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు నివసించారు. ఇశ్రాయేలు ప్రజలు అరోయేరు పట్టణంలోను, దాని చుట్టూరా ఉన్న ఊళ్ళలోను మూడువందల సంవత్సరాలు నివసించారు. అర్నోను నది పొడవునా ఉన్న పట్టణాలు అన్నింటిలోనూ ఇశ్రాయేలు ప్రజలు మూడువందల సంవత్సరాలు నివసించారు. ఆ కాలమంతటిలోనూ ఈ పట్టణాలను తీసుకునేందుకు నీవు ఎందుకు ప్రయత్నం చేయలేదు? 27 ఇశ్రాయేలు ప్రజలు నీకు విరోధంగా పాపం చేయలేదు. కానీ నీవు ఇశ్రాయేలు ప్రజలకు విరోధంగా చాలా చెడ్డ పని చేస్తున్నావు. ఇశ్రాయేలు ప్రజలు సరియైనది చేస్తున్నారో, అమ్మోనీయులు సరియైనది చేస్తున్నారో అనేది నిజమైన న్యాయమూర్తి యెహోవా నిర్ణయించునుగాక!”

28 యెఫ్తా దగ్గర్నుండి వచ్చిన ఈ సందేశాన్ని అమ్మోనీయుల రాజు నిరాకరించాడు.

యెఫ్తా వాగ్దానం

29 అప్పుడు యెహోవా అత్మ యెఫ్తా మీదికి వచ్చింది. గిలాదు, మనష్షే ప్రాంతాలలో యెఫ్తా సంచారం చేశాడు. అతడు గిలాదులోని మిస్పా పట్టణానికి వెళ్లాడు. గిలాదులోని మిస్పా పట్టణంనుండి యెఫ్తా అమ్మోనీయుల దేశంలోనికి వెళ్లాడు.

30 యెహోవాకు యెఫ్తా ఒక ప్రమాణం చేసాడు, “అమ్మోనీయులను నేను ఓడించేటట్టుగా నీవు చేస్తే, 31 ఆ విజయంతో నేను తిరిగి వచ్చేటప్పుడు నా ఇంటిలోనుండి మొట్టమొదట బయటకు వచ్చేదానిని నేను నీకు అర్పిస్తాను. దానిని నేను దహన బలిగా యెహోవాకు అర్పిస్తాను” అని అతడు చెప్పాడు.

32 అప్పుడు యెఫ్తా అమ్మోనీ ప్రజల దేశం వెళ్ళాడు. అమ్మోనీయులతో యెఫ్తా యుద్ధం చేశాడు. వారిని ఓడించటానికి యెహోవా అతనికి సహాయం చేశాడు. 33 అరోయేరు పట్టణంనుండి మిన్నీతు పట్టణం వరకు అతడు వారిని ఓడించాడు. యెఫ్తా ఇరవై పట్టణాలను పట్టుకొన్నాడు. ఆబేల్కెరామీము పట్టణంవరకు అమ్మోనీయులతో అతడు పోరాడాడు. ఇశ్రాయేలీయులు అమ్మోనీ ప్రజలను ఓడించారు. అది అమ్మోనీ ప్రజలకు ఒక గొప్ప పరాజయం.

34 యెఫ్తా తిరిగి మిస్పా వెళ్లాడు. యెఫ్తా తన ఇంటికి వెళ్లగా, అతని కుమార్తె అతన్ని ఎదుర్కొనేందుకు ఇంటిలో నుండి బయటకు వచ్చింది. ఆమె తంబుర వాయిస్తూ, నాట్యం చేస్తూ వచ్చెను. ఆమె అతనికి ఒక్కతే కుమార్తె. యెఫ్తా ఆమెను ఎంతో ప్రేమించాడు. యెఫ్తాకు ఇంకా కుమారులు, కుమార్తెలు ఎవరూ లేరు. 35 యెఫ్తా ఇంటి నుండి మొట్టమొదట బయటకు వచ్చింది తన కుమార్తె అని అతడు చూడగానే, అతడు తన దుఃఖాన్ని వ్యక్తం చేయటానికి తన బట్టలు చింపివేసికున్నాడు. అప్పుడు అతడు, “అయ్యో, నా కుమారీ, నీవు నన్ను దుఃఖంతో నింపివేశావు. నీవు నన్ను ఎంతో ఎంతో భాధపెట్టేశావు. యెహోవాకు నేను వాగ్దానం చేశాను, దానిని నేను మార్చలేను” అని చెప్పాడు.

36 అప్పుడు అతని కుమార్తె, “నా తండ్రీ, నీవు యెహోవాకు ఒక వాగ్దానం చేశావు. కనుక నీ వాగ్దానం నిలబెట్టుకో. నీవు చెప్పినట్టే చేయి. నీ శత్రువులైన అమ్మోనీయులను ఓడించటానికి యెహోవాయేగదా నీకు సహాయం చేసాడు” అని యెఫ్తాతో చెప్పింది.

37 అప్పుడు యెఫ్తా కుమార్తె, “అయితే నా కోసం ముందుగా ఈ ఒక్కటి చేయి. రెండు నెలలు నన్ను ఏకాంతంగా ఉండనివ్వు. నన్ను కొండలకు వెళ్లనివ్వు. నేను పెళ్లి చేసుకోను, పిల్లలు ఉండరు, కనుక నన్ను నా స్నేహితురాండ్రను కలిసి ఏడ్వనివ్వు” అని తన తండ్రితో చెప్పింది.

38 “వెళ్లి అలాగే చేయి” అని చెప్పాడు యెఫ్తా. రెండు నెలల కోసం యెఫ్తా ఆమెను పంపించివేశాడు. యెఫ్తా కుమార్తె, ఆమె స్నేహితురాండ్రు కొండలలో నివసించారు. ఆమెకు పెళ్లి, పిల్లలు ఉండరు కనుక వారు ఆమె కోసం ఏడ్చారు.

39 రెండు నెలల అనంతరం, యెఫ్తా కుమార్తె తన తండ్రి దగ్గరకు తిరిగి వచ్చింది. యెఫ్తా యెహోవాకు వాగ్దానం చేసిన ప్రకారమే జరిగించాడు. యెఫ్తా కుమార్తెకు ఎవరితోనూ ఎన్నడూ లైంగిక సంబంధాలు లేవు. కనుక ఇశ్రాయేలులో ఇది ఒక ఆచారం అయ్యింది. 40 గిలాదు వాడైన యెఫ్తా కుమార్తెను ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం జ్ఞాపకం చేసుకుంటారు. యెఫ్తా కుమార్తె కోసం ఇశ్రాయేలు స్త్రీలు ప్రతి సంవత్సరం నాలుగు రోజుల పాటు ఏడుస్తారు.

యెఫ్తా మరియు ఎఫ్రాయిము

12 ఎఫ్రాయిము వంశంలోని మనుష్యులు వారి సైనికులందరినీ సమావేశ పరిచారు. తరువాత వారు నది దాటి సఫోను పట్టణం వెళ్లారు. వారు, “అమ్మోనీయులతో పోరాడేందుకు సహాయంగా నీవు మమ్మల్ని ఎందుకు పిలువలేదు? నీతోపాటే నీ ఇంటిని కాల్చివేస్తాము” అని యెఫ్తాతో అన్నారు.

వారికి యెఫ్తా జవాబు చెప్పాడు: “అమ్మోనీయులు మాకు చాలా కష్టాలు కలిగించారు. కనుక నేను, నా ప్రజలు వారి మీద యుద్ధం చేశాము. నేను మిమ్మల్ని పిలిచాను, కాని మాకు సహాయం చేయటానికి మీరు రాలేదు. మీరు మాకు సహాయం చేయరని నాకు తెలిసింది. కనుక నేను నా ప్రాణాన్ని లెక్కచేయలేదు. అమ్మోనీయులతో యుద్ధం చేయటానికి నేను నది దాటివెళ్లాను. వారిని ఓడించేందుకు యెహోవా నాకు సహాయం చేశాడు. ఇప్పుడు నాతో పోరాడటానికి మీరెందుకు ఈ వేళ వచ్చారు?”

అప్పుడు యెఫ్తా గిలాదు మనుష్యులను సమావేశ పరిచాడు. వారు ఎఫ్రాయిము మనుష్యులతో యుద్ధం చేసారు. ఎఫ్రాయిము మనుష్యులు గిలాదు వారిని అవమానించారు గనుక ఆ మనుష్యులతో వారు పోరాడారు. “గిలాదు వారైన మీరు ఎఫ్రాయిము మనుష్యులలో మిగిలిన వారే తప్ప మరేమీ కాదు. మీకు కనీసం సొంత దేశం కూడా లేదు. మీలో కొందరు ఎఫ్రాయిముకు మరికొందరు మనష్షేకు చెందినవారు” అని వారు అన్నారు. గిలాదు మనుష్యులు ఎఫ్రాయిము మనుష్యులను ఓడించారు.

ప్రజలు యోర్దాను నదిని దాటే రేవులను గిలాదు మనుష్యులు పట్టుకొన్నారు. ఆ రేవులు ఎఫ్రాయిము దేశానికి పోయేదారులు. ఎఫ్రాయిము వారిలో తప్పించుకున్నవాడు ఎప్పుడైనా నది దగ్గరకు వచ్చి, “నన్ను దాటనివ్వండి” అని చెబితే గిలాదువారు, “నీవు ఎఫ్రాయిము వాడవా?” అని అడుగుతారు. “లేదు” అని వాడు చెబితే “షిబ్బోలెతు అనే మాట పలుకు” అని వారు అంటారు. ఎఫ్రాయిము మనుష్యులు ఆ మాటను సరిగ్గా పలుకలేరు. వారు ఆ మాటను “సిబ్బోలెతు” అని పలుకుతారు. కనుక అటువంటి వారిని ఒకడు “సిబ్బోలెతు” అని చెబితే అతడు ఎఫ్రాయిము వాడని గిలాదు వారికి తెలిసిపోతుంది. కనుక ఆ రేవు దగ్గరే వారు చంపేస్తారు. అలాగున వారు నలభై రెండువేల మంది ఎఫ్రాయిము మనుష్యులను చంపివేశారు.

ఆరు సంవత్సరాలు ఇశ్రాయేలీయులకు యెఫ్తా న్యాయమూర్తిగా ఉన్నాడు. అప్పుడు గిలాదు వాడైన యెఫ్తా చనిపోయాడు. వారు అతని పట్టణమైన గిలాదులో అతనిని పాతిపెట్టారు.

న్యాయాధిపతి ఇబ్సాను

యెఫ్తా తర్వాత ఇబ్సాను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. ఇబ్సాను బేత్లెహేము నగరానికి చెందినవాడు. ఇబ్సానుకి ముప్ఫై మంది కొడుకులు, ముప్ఫై మంది కుమార్తెలు ఉన్నారు. తమ బంధువులు కాని వారిని వివాహం చేసుకోవలసిందిగా అతను ముప్ఫై మంది కుమార్తెలను కోరాడు. తమ బంధువులు కాని ముప్ఫై మంది స్త్రీలను అతను కనుగొన్నాడు. వారిని అతని కుమారులు వివాహం చేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలకు ఇబ్సాను ఏడు సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 10 తర్వాత ఇబ్సాను మరణించాడు. అతనిని బేత్లెహేం నగరంలో సమాధి చేశారు.

న్యాయాధిపతి ఏలోను

11 ఇబ్సాను అనంతరం, ఇశ్రాయేలు ప్రజలకు ఏలోను న్యాయాధిపతి అయ్యాడు. ఏలోను జెబూలూను వంశమునుండి వచ్చినవాడు. అతను ఇశ్రాయేలు ప్రజలకు పది సంవత్సరాల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 12 అప్పుడు జెబూలూను వంశంనుండి వచ్చిన ఏలోను చనిపోయాడు. అతను ఆయ్యాలోను లోని జెబూలూను పట్టణంలో సమాధి చేయబడ్డాడు.

న్యాయాధిపతి అబ్దోను

13 ఏలోను మరణానంతరం, హిల్లేలు కుమారుడైన అబ్దోను అనే అతను ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతి అయ్యాడు. 14 అబ్దోను పిరాతోను అనే నగరానికి చెందినవాడు. అబ్దోనుకు 40 మంది కుమారులు, 30 మంది మనుమలు ఉన్నారు. వారు డెబ్భయి గాడిదలెక్కి తిరిగారు. ఇశ్రాయేలు ప్రజలకు అబ్దోను ఎనిమిదేళ్ల పాటు న్యాయాధిపతిగా ఉన్నాడు. 15 ఆ తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను మరణించాడు. అతనిని పిరాతోను నగరంలో సమాధి చేశారు. పిరాతోను ఎఫ్రాయిము అనే ప్రదేశంలో ఉంది. ఇది కొండదేశం లోనిది, అక్కడ అమాలేకీయుల ప్రజలు నివసించేవారు.

లూకా 6:1-26

యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు

(మత్తయి 12:1-8; మార్కు 2:23-28)

ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.

యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.

విశ్రాంతి రోజు యేసు నయం చేయటం

(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)

మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.

10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.

యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం

(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)

12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,

14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,

అతని తమ్ముడు అంద్రెయ.

యాకోబు,

యోహాను,

ఫిలిప్పు,

బర్తొలొమయి,

15 మత్తయి,

తోమా,

అల్ఫయి కుమారుడు యాకోబు,

జెలోతె[a] అని పిలువబడే సీమోను

16 యాకోబు కుమారుడు యూదా,

యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).

యేసు బోధించి రోగులను నయం చేయటం

(మత్తయి 4:23-25; 5:1-12)

17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.

20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:

“దీనులైన మీరు ధన్యులు.
    దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
    మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
    భవిష్యత్తులో మీరు నవ్వుతారు.

22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.

24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
    మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
    మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!

26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International