Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 4-6

దేవుని ఆదేశాలు పాటించమని మోషే ప్రజలను హెచ్చరించటం

“ఇక, ఇశ్రాయేలీయులారా, నేను మీకు ప్రబోధించే చట్టాలు, ఆజ్ఞలు వినండి. వాటికి విధేయులవ్వండి. అప్పుడు మీరు బతికి, మీ పూర్వీకుల దేవుడైన యెహోనా మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరేమీ అదనంగా చేర్చకూడదు. అందులో నుంచి మీరేవీ తీసివేయకూడదు. నేను మీకు ఇచ్చిన మీ యెహోవా దేవుని ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.

“బయల్ పెయోరు వద్ద యెహోవా చేసింది మీరు చూశారు. అక్కడ బయలును[a] వెంబడించిన వాళ్లందరిని మీ దేవుడైన యెహోవా నాశనం చేసాడు. అయితే మీ దేవుడైన యెహోవా వైపు నిలిచి ఉన్న మీరంతా ఈనాడు బతికి ఉన్నారు.

“చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన చట్టాలు, నియమాలు నేను మీకు ప్రబోధించాను. మీరు ఏ దేశంలోనైతే ప్రవేశించి, దానిని మీ స్వంతం చేసుకో బోతున్నారో ఆ దేశంలో మీరు ఈ చట్టాలకు విధేయులు కావాలని వాటిని నేను మీకు ప్రబోధించాను. ఈ ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడండి. మీకు జ్ఞానం, తెలివి ఉన్నట్టు యితర రాజ్యాల ప్రజలకు యిది తెలియజేస్తుంది. ఆ దేశాల ప్రజలు ఈ ఆజ్ఞలను విన్నప్పుడు ‘నిజంగా ఈ గొప్ప రాజ్య ప్రజలు (ఇశ్రాయేలీయులు) జ్ఞానులు, తెలివి గలవారు’ అని చెబుతారు.

“మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు. ఈనాడు నేను మీ ఎదుట ఉంచిన ప్రబోధాలంతటి మంచి ఆజ్ఞలు, నియమాలు కలిగి ఉండేందుకు ఏ జాతికూడ అంత గొప్పది కాదు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి. 10 హోరేబు కొండ దగ్గర మీరు మీ దోవుడైన యెహోవా యెదుట నిలిచిన రోజును జ్ఞాపకం చేసుకోండి. ‘నేను చెప్పే సంగతులు వినడానికి ప్రజలందరినీ సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించినంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు. 11 మీరు దగ్గరకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు ఎగసిన అగ్నితో ఆ కొండ మండింది. దట్టమైన కారుమబ్బులు, కటిక చీకటి. 12 అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది. 13 యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు. 14 ఆ సమయంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధించాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు స్వాధీనం చేసుకొని, నివసించబోతున్న దేశంలో మీరు పాటించాల్సిన చట్టాలు ఇవి.

15 “హోరేబు (సీనాయి) కొండమీద ఆగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన రోజున భౌతిక మైన ఎలాంటి రూపంతోను మీరు ఆయనను చూడలేదు. దేవునికి ఆకారం లేదు. 16 కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రాణి రూపంలోనైనా ఒక ప్రతిమను లేక విగ్రహాన్ని చేసుకోవడం ద్వారా పాపంచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పురుషునివలె లేక స్త్రీవలె కనబడే విగ్రహాన్ని చేయవద్దు. 17 భూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు. 18 నేలమీద ప్రాకే దేనివలెగాని, సముద్రపు చేపవలెగాని కనబడే ఏ విగ్రహం చేయవద్దు, 19 మరియు మీరు పైన ఆకాశంలోనికి చూచినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో మీకు కనిపించే వాటన్నింటిని చూచినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటిని పూజించి, సేవించాలనే శోధన మీకు కలుగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో ఆ పనులు ఇతరులు చేస్తే చేసుకోనిచ్చాడు మీ దేవుడైన యెహోవా. 20 ఆయితే మీరు ఆయన ప్రజలు, యెహోవా మిమ్మును ఉజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈజిప్టు ఇనుప కొలిమిలాంటిది. ఇప్పుడు మీరు ఉన్నట్టుగా, మిమ్మును ఆయన తన స్వంత ప్రజలుగా చేసేందుకు ఆయన మిమ్మును బయటకు తీసుకొని వచ్చాడు.

21 “మీ మూలంగా యెహోవా నా మీద కొపగించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. నేను యొర్దాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఆ మంచి దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు. 22 కనుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను యొర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు. 24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు. పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.

25 “మీరు ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత, మీకు పిల్లలు, పిల్లల పిల్లలు కలుగుతారు. మీరు ముసలి వాళ్లవుతారు. అప్పుడు మారిపొయి మీ జీవితాన్ని పాడు చేసుకొనవద్దు. దేని రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయవద్దు. అలాగు యెహోవాకు విరుద్ధరగా కీడు చేస్తే, అది ఆయనకు కోపం పుట్టిస్తుంది. 26 ఆ కీడు మీరు జరిగిస్తే, ఇలా జరుగుతుందని నేడు ఆకాశం భూమి మీమీద సాక్షులుగా ఉంటారు; త్వరలోనే మీరు ఆ దేశంలో ఉండకుండాపోతారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇప్పుడు మీరు యొర్దాను నది దాటుతున్నారు. కానీ అక్కడ మీరు ఎక్కువ కాలం జీవించరు. మీరు సర్వనాశనం అవుతారు. 27 దేశదేశాలకు యెహోవా మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా మిమ్మల్ని పంపించే ఆ దేశాల్లో జీవించేందుకు మీరు కొద్దమంది మాత్రమే ఉంటారు. 28 మనుష్యులు చేసిన దేవుళ్లను చెక్కతో రాయితో చేయబడి, కానలేని, వినలేని, తినలేని, వాసన చూడలేని దేవుళ్లను అక్కడ మీరు సేవిస్తారు. 29 అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు. 30 మీరు కష్టంలో ఉన్నప్పుడు – ఆ సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు – మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు. 31 మీ దేవుడైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను ఆయన మరచిపోడు.

దేవుడు చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఆలోచించండి

32 “ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు. 33 దేవుడు అగ్నిలోనుండి మీతో మాట్లాడగా మీరు వినికూడ యింకా బ్రతికే ఉన్నారు. అలా యింకెవరికైనా ఎన్నడైనా జరిగిందా? లేదు. 34 మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు. 35 ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. 36 యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు.

37 “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. 38 మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే.

39 “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు. 40 మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీ దేశంగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఈ దేశంలో మీరు దీర్ఘకాలం జీవిస్తారు.”

భద్రతా పట్టణాలను మోషే ఏర్పాటు చేయటం

41 అప్పుడు యొర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు. 42 ప్రమాదవ శాత్తూ ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపేస్తే, ఆ వ్యక్తి ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి క్షేమంగా ఉండొచ్చు. అతడు చంపేసిన మనిషిని అతడు ద్వేషించలేదు, అతణ్ణి చంపాలని అనుకొలేదు అంటే, అతడు ఈ పట్టణాల్లో ఒకదానికి వెళ్లి, మరణ శిక్షలేకుండా ఉండవచ్చు. 43 మోషే ఏర్పాటు చేసిన ఈ మూడు పట్టణాలు ఏవంటేః రూబేను ప్రజలకోసం అరణ్యపు పీఠభూముల్లోని బేసెరు; గాదు ప్రజలకోసం గిలాదులోని రామోతు, మనష్షే ప్రజలకోసం బాషానులోని గోలాను.

మోషే ధర్మశాస్త్రానికి పీఠిక

44 ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని మోషే యిచ్చాడు. 45 ఆ ప్రజలు ఈజిప్టునుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు మోషే వారికి యిచ్చాడు.

46 యొర్దాను నదికి తూర్పు వైపున వారు ఉన్నప్పుడు బేత్‌పయోరు అవతల లోయలో మోషే వారికి ఈ ఆజ్ఞలు యిచ్చాడు. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో అప్పుడు వారు ఉన్నారు. (వారు ఉజిప్టునుండి బయటకు వచ్చినప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలూ సీహోనును ఓడించారు. 47 వారికోసం ఉంచుకొనేందుకు వారు సీహోను దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. బాషాను రాజైన ఓగు దేశాన్ని కూడ వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ యిద్దరు అమోరీ రాజులు యొర్దాను నది తూర్పువైపున నివసించారు. 48 అర్నోను లోయను ఆనుకొనివున్న అరోయేరు పట్టణం నుండి, హెర్మోను కొండ అనబడిన సిరియోను[b] కొండవరకు ఉంది ఈ దేశం. 49 యొర్దాను నదికి తూర్పునవున్న యొర్దాను లోయ ప్రదేశం అంతా ఈ దేశంలోనే ఉంది. దక్షిణాన మృత సముద్రాన్ని, తూర్పున పిస్గా కొండ చరియను తాకుతుంది ఈ దేశం.)

పది ఆజ్ఞలు

మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపరచి, వారితో యిలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలారా, నేడు మీకు నేను చెప్పే ఆజ్ఞలను, నియమాలను వినండి. ఈ ఆజ్ఞలను నేర్చుకొని, తప్పక వాటికి విధేయులవ్వండి. హోరేబు (సీనాయి) కొండ దగ్గర మన దేవుడైన యెహోవా మనతో ఒక ఒడంబడిక చేసాడు. యెహోవా ఈ ఒడంబడికను మన పూర్వీకులతో చేయలేదుగాని మనతో, అవును నేడు సజీవులుగా ఇక్కడ ఉన్న మన అందరితో చేసాడు. ఆ కొండ దగ్గర యెహోవా మీతో ముఖాముఖిగా మాట్లాడాడు. అగ్నిలో నుండి ఆయన మీతో మాట్లడాడు. ఎందుకంటే మీరు ఆ అగ్నికి భయపడి. కొండమీదికి వెళ్లేందుకు నిరాకరించారు. కనుక ఆ సమయంలో యెహోవా చెప్పిన దానిని మీతో చెప్పడానికి నేను యెహోవాకు, మీకు మధ్య నిలబడ్డాను. యెహోవా ఇలా చెప్పాడు:

“మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుణ్ణి యెహోవాను నేనే. కనుక మీరు ఈ ఆజ్ఞలకు విధేయలుగా ఉండండి.

“నన్ను తప్ప మరి ఏ దేవుళ్లనూ ఆరాధించవద్దు.

“పైన ఆకాశంలోగాని, క్రింద భూమిమీదగాని, ఆ క్రింద సముద్రంలోగాని దేని విగ్రహమైనా, రూపం అయినా చేసుకోవద్దు. ఎలాంటి విగ్రహాలను కూడా పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే నేనే మీ దేవుడైన యెహోవాను. మరియు వాళ్ల పిల్లలను, పిల్లల పిల్లలను, ఆ పిల్లల పిల్లలను నేను శిక్షిస్తాను. 10 అయితే నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలకు విధేయు లయ్యే ప్రజలయెడల నేను చాలా దయ చూపిస్తాను. అలాంటివారి వంశీయుల్లో వెయ్యితరాల వారివరకు నేను దయ చూపిస్తాను.

11 “మీ దేవుడైన యెహోవా పేరును వ్యర్థంగా పలుకవద్దు. ఒక వ్యక్తి యెహోవా పేరును వ్యర్థంగా పలికితే ఆతడు దోషి. యెహోవా ఆతణ్ణి నిర్దోషిగా ఎంచడు.

12 “సబ్బాతు రోజుకు ప్రత్యేక ప్రాముఖ్యతను ఇచ్చేందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి. వారం లోని ఇతర దినాలకంటే విశ్రాంతి దినాన్ని వేరుగా ఉంచమని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞ యిచ్చాడు. 13 మొదటి ఆరు రోజులు మీ పని చేసుకొనేందుకు. 14 అయితే ఏడో రోజు మీ దేవుడైన యెహోవా గౌరవార్థం విశ్రాంతి రోజు అవుతుంది. కనుక విశ్రాంతి రోజున ఏ వ్యక్తీ పనిచేయకూడదు. అంటే మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ ఆడ, మగ బానిసలు, మీ ఆవులు, మీ గాడిదలు, ఏ ఇతర జంతువులు, మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులు, మీ బానిసలు కూడ మీవలెనే విశ్రాంతి తీసుకోగలగాలి. 15 ఈజిప్టులో ఉన్నప్పుడు మీరూ బానిసలే అని మరచిపోవద్దు. మీ దేవుడైన యెహోవా తన మహా శక్తితో ఈజిప్టునుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. ఆయన మిమ్మల్ని స్వతంత్రులుగా చేసాడు. అందుచేతనే ఎల్లప్పుడూ సబ్బాతు రోజును ఒక ప్రత్యేక రోజుగా ఆచరించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపిస్తున్నాడు.

16 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీవు యిలా చేయాలని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞ యిచ్చాడు. నీవు ఈ ఆజ్ఞను పాటిస్తే, నీవు చాలాకాలం బ్రతుకుతావు. నీ దేవుడైన యెహోవా నీకు ఇస్తున్న దేశంలో అంతా శుభం అవుతుంది.

17 “ఎవరినీ హత్య చేయవద్దు.

18 “వ్యభిచార పాపం చేయవద్దు.

19 “ఏమీ దొంగిలించకు.

20 “మరో వ్యక్తి చేసిన దాన్నిగూర్చి అబద్ధసాక్ష్యము చెప్పకు.

21 “మరొకరికి చెందినవి నీవై యుంటే బాగుండునని ఆశించకు. ఇంకో వ్యక్తి భార్యను, అతని యింటిని, అతని పొలాలను, అతని మగ లేక ఆడ పనివారిని, అతని ఆవులను, అతని గాడిదలనుగాని ఇతరులకు చెందిన దేనినిగాని నీవు ఆశించకూడదు.”

ప్రజలు దేవునికి భయపడటం

22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.

23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధకారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. 24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము. 25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు. 26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బ్రతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు. 27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’

మోషేతో యెహోవా మాట్లాడటం

28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. 29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.

30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. 31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.

32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. 33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.

ఎల్లప్పుడూ దేవున్ని ప్రేమించి, లోబడండి.

“నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞలకు లోబడండి. మీరూ, మీ సంతతివారు బ్రతికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు. ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవుతుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. ఐశ్వర్యవంతమైన ఆ మంచి దేశంలో[c] వీటన్నింటినీ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసాడు.

“ఇశ్రాయేలు ప్రజలారా వినండి: యెహోవా ఒక్కడు మాత్రమే మన దేవుడు. మరియు మీరు మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను, మీ నిండు బలంతోను మీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈవేళ నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ పిల్లలకు నేర్పించేందుకు జాగ్రత్త వహించండి. మీరు మీ యింట్లో కూర్చున్నప్పుడు, మార్గంలో నడుస్తున్నప్పుడు ఈ ఆజ్ఞలను గూర్చి మాట్లాడుతూ ఉండండి. మీరు పడుకొనేప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుతూ ఉండండి. నా ప్రబోధాలను జ్ఞాపకం ఉంచుకొనేందుకు సహాయకరంగా ఈ ఆజ్ఞలను మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంలా ధరించండి. మీ ఇండ్ల ద్వార బంధాలమీద, గవునుల మీద వాటిని వ్రాయండి.”

10 “మీకు యిస్తానని చెప్పి మీ పూర్వీకులైన అబ్రాహాము ఇస్సాకు, యాకోబులకు ఆయన వాగ్దానం చేసిన ఆ దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొనివస్తాడు. అప్పుడు మీరు నిర్మించని గొప్ప, ధనిక పట్టణాలను ఆయన మీకు ఇస్తాడు. 11 మీరు సమకూర్చని మంచి వస్తువులతో నిండిపోయిన గృహాలను ఆయన మీకు ఇస్తాడు. మీరు త్రవ్వని బావులను యెహోవా మీకు ఇస్తాడు. మీరు నాటని ద్రాక్షాతోటలను, ఒలీవ చెట్లను యెహోవా మీకు ఇస్తాడు. భోజనానికి మీకు సమృద్ధిగా ఉంటుంది.

12 “కానీ జాగ్రత్తగా ఉండండి. మీరు బానిసలుగా జీవించిన ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చిన యెహోవాను మరచిపోకండి. 13 మీ దేవుడైన యెహోవాను గౌరవించి ఆయనను మాత్రమే సేవించండి. ఆయన పేరు మీద మాత్రమే ప్రమాణాలు చేయాలి. (బూటకపు దేవుళ్ల పేర్లు ఉపయోగించవద్దు). 14 మీరు యితర దేవుళ్లను అనుసరించకూడదు. మీ చుట్టూ నివసించే ప్రజల దేవుళ్లను మీరు అనుసరించకూడదు. 15 మీ దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ మీతో ఉన్నాడు. మరియు మీరు ఆ ఇతర దేవుళ్లను వెంబడిస్తే, యెహోవాకు మీ మీద చాలా కొపం వస్తుంది. మిమ్మల్ని ఈ భూమి మీద ఉండకుండా ఆయన నాశనం చేస్తాడు. ఆయన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించటం యెహోవా ద్వేషిస్తాడు.

16 “మస్సాలో మీరు ఆయనను పరీక్షించినట్టుగా మీ దేవుడైన యెహోవాను మీరు పరీక్షించకూడదు. 17 మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు తప్పనిసరిగా విధేయులు కావాలి. ఆయన మీకు ఇచ్చిన ప్రబోధాలు, ఆజ్ఞలు అన్నింటినీ మీరు పాటించాలి. 18 సరైనవి, మంచివి, యెహోవాను సంతోషపెట్టేవి మాత్రమే మీరు చేయాలి. అప్పుడు మీకు అంతా మేలు జరిగి, యెహోవా మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 19 మరియు యెహోవా చెప్పినట్టు మీరు మీ శత్రువులందరినీ బలవంతంగా బయటకు వెళ్లగొడ్తారు.

దేవుడు చేసిన వాటిని పిల్లలకు నేర్పించాలి

20 “భవిష్యత్తులో ‘మన దేవుడైన యెహోవా మనకు ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు యిచ్చాడు గదా వాటి అర్థం ఏమిటి?’ అని నీ కుమారుడు నిన్ను అడగవచ్చును. 21 అప్పుడు నీవు నీ కుమారునితో ఇలా చెప్పాలి, ‘మనం ఈజిప్టులో ఫరోకు బానిసలం, అయితే యెహోవా మహా బలంతో ఈజిప్టునుండి మనలను బయటకు తీసుకొని వచ్చాడు. 22 మహాగొప్ప, ఆశ్చర్యకరమైన నిదర్శనాలు, అద్భుతాలు యెహోవా మనకు చూపించాడు. ఈజిప్టు ప్రజలకు, ఫరోకు, ఫరో ఇంటివాళ్లకు ఆయన ఈ సంగతులు జరిగించటం మనం చూశాము. 23 మరియు యెహోవా మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకు ఇచ్చేందుకు ఆయన మనలను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. 24 ఈ ప్రబోధాలన్నీ పాటించాలని యెహోవా మనకు ఆజ్ఞాపించాడు. అప్పుడు, మనం ఇప్పుడు ఉన్నట్టుగా ఎల్లప్పుడూ క్షేమంగా సజీవులంగా ఉండేటట్లు మన దేవుడైన యెహోవా మనలను కాపాడతాడు. 25 మనం పాటించాలని ఆయన మనకు ఆజ్ఞాపించిన ప్రకారం మనం ఆజ్ఞలన్నింటికీ విధేయులం అవటం మనకు మంచిదిగా దేవుడైన యెహోవా చూస్తాడు.’

మార్కు 11:1-18

యేసు యెరూషలేము ప్రవేశించటం

(మత్తయి 21:1-11; లూకా 19:28-40; యోహాను 12:12-19)

11 వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’[a] అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.

శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు.

వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు. ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు,

“‘హోసన్నా,[b]
    ప్రభువు పేరిట వచ్చుచున్న వాడు ధన్యుడు.’(A)

10 “రానున్న మన తండ్రి
    దావీదు రాజ్యం ధన్యమైనది.
మహోన్నతుడైన వానికి హోసన్నా!”

అని బిగ్గరగా కేకలు వేసారు.

11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి[c] వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.

ఎండిపొయిన అంజూరపు చెట్టు

(మత్తయి 21:18-19)

12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.

యేసు ఆలయంలోనికి వెళ్ళటం

(మత్తయి 21:12-17; లూకా 19:45-48; యోహాను 2:13-22)

15 యెరూషలేము చేరుకొన్నాక యేసు దేవాలయంలోకి ప్రవేశించి వ్యాపారం చేస్తున్న వాళ్ళను తరిమి వేయటం మొదలుపెట్టాడు. డబ్బు మార్చే వ్యాపారస్తుల బల్లల్ని, పావురాలు అమ్ముతున్న వ్యాపారస్తుల బల్లల్ని క్రింద పడవేసాడు. 16 దేవాలయం ద్వారా ఎవరూ సరుకులు మోసుకు పోనీయకుండా చేసాడు. 17 ఆయన బోధిస్తూ, “‘నా ఆలయం అన్ని జనాంగాలకు ప్రార్థనా ఆలయం అనిపించుకొంటుంది’ అని గ్రంథాల్లో వ్రాసారు.(B) కాని మీరు దాన్ని దోపిడి దొంగలు దాచుకొనే గుహగా మార్చారు”(C) అని అన్నాడు.

18 అక్కడున్న ప్రజలు యేసు బోధను విని ఆశ్చర్యపొయ్యారు. ప్రధానయాజకులు, శాస్త్రులు భయపడి యేసును చంపటానికి మార్గం వెతకటం మొదలు పెట్టారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International