Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
లేవీయకాండము 11-12

మాంసం తినేందుకు నియమాలు

11 మోషే, అహరోనులతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పండి: మీరు తినదగిన జంతువులు ఏవంటే: ఏ జంతువు డెక్కలు చీలి ఉండి, నెమరు వేస్తుందో దాని మాంసం మీరు తినవచ్చును.

4-6 “కొన్ని జంతువులు నెమరు వేస్తాయి గాని వాటి డెక్కలు చీలి ఉండవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. ఒంటెలు, సిరాయారకపు పొట్టికుందేలు, కుందేలు అలాంటివే కనుక అవి మీకు అపవిత్రం. మరికొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయి గాని అవి నెమరు వేయవు. అలాంటి జంతువుల్ని తినవద్దు. పందులు కూడా మీకు అపవిత్రం. ఆ జంతువుల (పందుల) మాంసం తినవద్దు. వాటి శవాలను కనీసం తాకవద్దు అవి మీకు అపవిత్రం.

సముద్ర ఆహార నియమాలు

“సముద్రంలోగాని, నదిలోగాని ఉండే జలచరాలకు రెక్కలు, పొలుసు ఉంటే, మీరు వాటిని తినవచ్చును. 10-11 అయితే సముద్రంలోగాని నదిలో గాని ఉండే జలచరం దేనికైనా రెక్కలు, పొలుసు లేకపోతే, వాటిని మీరు తినకూడదు. అలాంటిది అసహ్యమయినది. దాని మాంసం తినవద్దు. కనీసం దాని శవాన్ని కూడా తాకవద్దు. 12 సముద్రంలోనూ, నదిలోనూ ఉండే ఏ జలచరానికైనా రెక్కలు, పొలుసులు లేకపోతే అది అసహ్యమయిందిగానే మీరు ఎంచుకోవాలి.

తినకూడని పక్షులు

13 “అలానే మీరు తినకూడని పక్షులు ఇవి. ఈ పక్షుల్లో దేనినీ తినవద్దు: పక్షిరాజులు, రాబందులు, క్రౌంచ పక్షులు, 14 గద్ద, అన్నిరకాల గద్దలు, 15 అన్ని రకాల నల్ల పక్షులు, 16 నిప్పుకోళ్లు, కపిరిగాళ్లు, అన్ని రకాల డేగలు, 17 గుడ్లగూబలు, పగిడికంటెలు, పెద్దగుడ్ల గూబలు, 18 నీటి కాకులు, కొంగలు, నల్లబోరువలు, 19 గూడ బాతులు, సంకుబుడి కొంగలు, అన్నిరకాల కొంగలు, కుకుడుగువ్వలు, గబ్బిలాలు.

పురుగుల్ని తినటాన్ని గూర్చిన విధులు

20 “రెక్కలు ఉండి మొత్తం నాలుగు కాళ్లతో నడిచే జీవులన్నీ అసహ్యమైనవే. రెక్కలు ఉండి, నాలుగు కాళ్లతో నడిచే కీటకాలన్నీ అసహ్యమైనవే. ఆ కీటకాలను తినవద్దు. 21 అయితే కీటకాలకు రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో నడిస్తే, వాటికి కనుక పాదాలకు పైగా కీళ్లు ఉండి అవి ఎగురగలిగినవైతే, అలాంటి కీటకాలను మీరు తినవచ్చును. 22 ఏ కీటకాలను మీరు తినవచ్చునంటే: అన్ని రకాల మిడతలు, రెక్కలున్న అన్నిరకాల మిడతలు, అన్ని రకాల పెద్ద మిడతలు, అన్నిరకాల ఆకు మిడతలు.

23 “అయితే రెక్కలు, నాలుగు పాదాలు ఉన్న మిగిలిన కీటకాలు అన్నీ మీకు అసహ్యం. 24 ఆ కీటకాలు మిమ్మల్ని అపవిత్రపరుస్తాయి. ఈ కీటకాల శవాలను తాకిన ఏ వ్యక్తి అయినా సరే సాయంత్రంవరకు అపవిత్రం అవుతాడు. 25 ఒక వ్యక్తి చచ్చిన కీటకాల్లో ఒకదాన్ని గనుక పట్టుకొంటే ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు.

తువుల్ని గూర్చి మరికొన్ని నియమాలు

26-27 “కొన్ని జంతువులకు డెక్కలు చీలి ఉంటాయిగాని డెక్కలు సమానంగా చీలి ఉండవు. కొన్ని జంతువులు నెమరు వేయవు. కొన్ని జంతువులకు డెక్కలు ఉండవు, అవి వాటి పాదాలమీద నడుస్తాయి. ఆ జంతువులన్నీ మీకు అపవిత్రం. వాటిని ఎవరైనా తాకితే వారు అపవిత్రం అవుతారు. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడు 28 వాటి శవాలను ఎవరైనా ఎత్తితే, ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రంవరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువులు మీకు అపవిత్రము.

ప్రాకే జంతువులను గూర్చిన నియమాలు

29 “ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం: ముంగిసలు, పందికొక్కులు అన్ని రకాల పెద్ద బల్లులు. 30 అడవి ఎలుకలు, మొసళ్లు, తొండలు, సరటాలు, ఊసరవెల్లులు. 31 ప్రాకే ఈ జంతువులు మీకు అపవిత్రం. వాటిలో చచ్చిన వాటిని ఎవరైనా తాకితే అలాంటివారు సాయంత్రం వరకు అపవిత్రులవుతారు.

అపవిత్ర జంతువులను గూర్చిన నియమాలు

32 “అపవిత్రమైన ఆ జంతువుల్లో ఏదైనా చచ్చి దేనిమీదైనా పడితే, అది అపవిత్రం అవుతుంది. అది చెక్కతో, బట్టతో, తోలుతో చేయబడిన వస్తువులు కానీ, లేక ఏదైనా పనిముట్టుగానీ కావచ్చును. అది ఏదైనాసరే దాన్ని నీళ్లతో కడగాలి. సాయంత్రం వరకు అది అపవిత్రం. తర్వాత అది మరల పవిత్రం అవుతుంది. 33 అపవిత్రమైన ఆ జంతువుల శవం ఏదైనా మట్టి పాత్రలో పడితే, ఆ ప్రాతలో ఉన్నది ఏదైనా సరే అది అపవిత్రం అవుతుంది. నీవు ఆ పాత్రను పగులగొట్టి తీరాలి. 34 అపవిత్రమైన మట్టి పాత్రలోని నీళ్లు ఏ ఆహారపదార్థం మీద పడినా, అందులోని ఆహారం అపవిత్రం అవుతుంది. అపవిత్రమైన పాత్రలోని పానీయం ఏదైనా అపవిత్రం అవుతుంది. 35 అపవిత్రమై చచ్చిన జంతువుయొక్క అవయవం ఒకటి దేనిమీద పడినా అది అపవిత్రం. అది మట్టి పొయ్యికావచ్చును, మట్టి కుంపటి కావచ్చును. దాన్ని ముక్కలుగా పగులగొట్టాలి. అవి ఇంకెంత మాత్రం పరిశుద్ధంగా ఉండవు. అవి మీకు ఎప్పటికీ అపవిత్రంగానే ఉంటాయి.

36 “నీళ్లు ఊరుతూండే ఊటగాని, బావిగాని, పరిశుద్ధంగా ఉంటుంది. అయితే అపవిత్రమైన ఏ జంతువు శవాన్నీ, తాకిన ఏ వ్యక్తి అయినాసరే అపవిత్రుడు. 37 అపవిత్ర జంతువుల్లోని ఏ శవమైనా, నాట్లువేసే ఏ విత్తనంమీద పడినా, ఆ విత్తనం ఇంకా పరిశుద్ధంగానే ఉంటుంది. 38 అయితే ఆ విత్తనాలమీద నీళ్లు పోసిన తర్వాత అపవిత్ర జంతువుయొక్క శవంలోని ఏ భాగమైనా ఆ విత్తనాలమీద మరల పడితే, అప్పుడు మీకు ఆ విత్తనాలు అపవిత్రం.

39 “మీరు ఆహారానికి ఉపయోగించే జంతువు ఏదైనా చస్తే, దాని శవాన్ని తాకిన వ్యక్తి ఆ సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. 40 మరియు ఈ జంతువు మాంసం తిన్న వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. ఈ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు. ఆ జంతువు శవాన్ని ఎత్తే మనిషి తప్పక తన బట్టలు ఉతుక్కోవాలి. ఆ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడవుతాడు.

41 “నేలమీద ప్రాకే ప్రతి జంతువు అసహ్యమయిందే. దాన్ని తినకూడదు. 42 పొట్టతో ప్రాకే జంతువుల్లో దేనిని గాని లేక నాలుగు పాదాలతో నడిచే ఏ జంతువునుగాని లేక చాలా పాదాలుగల జంతువును గాని మీరు తినకూడదు. అవి మీకు అసహ్యమైనవి. 43 అసహ్యమైన ఆ జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు హేయం చేసుకోవద్దు. వాటితో మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 44 ఎందుచేతనంటే నేను మీ దేవుడైన యెహోవాను గనుక. నేను పరిశుద్ధుడ్ని కనుక మీరు పరిశుద్ధంగా ఉండాలి. అసహ్యమైన ఆ ప్రాకే జంతువుల మూలంగా మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు. 45 మిమ్మల్ని ఈజిప్టునుండి నేను తీసుకొచ్చాను. మీరు నాకు ప్రత్యేకమైన ప్రజలుగా ఉండేందుకు నేను ఇలా చేసాను. మీకు నేను దేవుడిగా ఉండాలని నేను ఇలా చేసాను. నేను పరిశుద్ధుడ్ని గనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి!”

46 భూమిమీద ఉండే పశువులు, పక్షులు, ఇతర జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. సముద్రంలో ఉండే జలచరాలు, నేలమీద ప్రాకే జంతువులు అన్నింటిని గూర్చిన నియమాలు అవి. 47 పవిత్ర జంతువులు ఏవో అపవిత్ర జంతువులు ఏవో ప్రజలు తేలుసుకోగలిగేందుకే ఆ ప్రబోధాలు. అందుచేత ఏ జంతువుల్ని తినవచ్చో, ఏ జంతువుల్ని తినకూడదో ప్రజలకు తెలుస్తుంది.

ప్రసవించిన తల్లులకు నియమాలు

12 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు:

“ఒక స్త్రీ మగ శిశువుకు జన్మనిస్తే ఆ స్త్రీ ఏడు రోజుల వరకు అపవిత్రంగావుంటుంది. ఇది ఆమె నెలసరి రక్తస్రావం విషయంలో అపవిత్రంగా ఉన్నట్టే. ఎనిమిదో రోజున ఆ మగ శిశువుకు సున్నతి చేయాలి. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు ముప్పయిమూడు రోజులు పడుతుంది. పరిశుద్ధమయింది దేన్నీ ఆమె తాకగూడదు. ఆమె పవిత్రపరచబడటం పూర్తి అయ్యేంతవరకు పరిశుద్ధ స్థలంలో ఆమె ప్రవేశించకూడదు. కానీ ఆ స్త్రీ ఒక ఆడ శిశువుకు జన్మనిస్తే నెలసరి రక్తస్రావ సమయంలో ఉన్నట్టే రెండు వారాలు ఆమె అపవిత్రంగా ఉంటుంది. ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అయ్యేందుకు అరవై ఆరు రోజులు అవుతుంది.

“ప్రసవించిన తల్లి పవిత్రం అయ్యేందుకు ఒక ప్రత్యేక సమయం ఉంటుంది. పవిత్రపర్చబడే ఆ ప్రత్యేక సమయం అయిపోగానే ఆడపిల్ల తల్లియైనా, మగపిల్ల తల్లియైనా, ఆ తల్లి ప్రత్యేకమైన బలి అర్పణలను సన్నిధి గుడారానికి తీసుకొనిరావాలి. సన్నిధి గుడార ద్వారం దగ్గర ఆ బలి అర్పణలను ఒక యాజకునికి ఇవ్వాలి. దహన బలికోసం ఒక సంవత్సరం వయస్సుగల ఒక గొర్రెపిల్లను, పాపపరిహారార్థబలిగా ఒక పావురం పిల్లను లేక ఒక గువ్వను ఆమె తీసుకొనిరావాలి. 7-8 ఒకవేళ ఆ స్త్రీ గొర్రెపిల్లను ఇవ్వలేక పోతే, రెండు పావురపు పిల్లల్నిగాని రెండుగువ్వలనుగాని ఆమె తీసుకొని రావచ్చును. అందులో ఒకటి దహనబలి కోసం, మరొకటి పాప పరిహారార్థ బలికోసం. వాటిని యాజకుడు యెహోవా ఎదుట అర్పిస్తాడు. ఈ విధంగా ఆమెకోసం అతడు ఆమె పాపాలను తుడిచి వేస్తాడు. అప్పుడు ఆమె తన రక్తస్రావంనుండి పవిత్రం అవుతుంది. ఒక మగశిశువుకు లేదా ఆడశిశువుకు జన్మనిచ్చే స్త్రీకి అవి నియమాలు.”

మత్తయి 26:1-25

యూదా నాయకులు యేసును చంపుటకు కుట్ర పన్నటం

(మార్కు 14:1-2; లూకా 22:1-2; యోహాను 11:45-53)

26 యేసు చెప్పటం ముగించాడు. ఆ తదుపరి శిష్యులతో “రెండు రోజుల తర్వాత పస్కాపండుగ వస్తొందని మీకు తెలుసు. ఆ తర్వాత మనుష్య కుమారునికి శ్రమ సంభవిస్తుంది. తత్ఫలితంగా ఆయన శత్రువులు ఆయన్ని సిలువకు వేస్తారు” అని అన్నాడు.

ప్రధానయాజకులు, పెద్దలు, కయప అని పిలువబడే ప్రధానయాజకుని యింటి ఆవరణంలో సమావేశమై యేసును ఏదో ఒక కుట్రతో బంధించి చంపాలని పన్నాగం పన్నారు. “కాని పండుగ రోజుల్లో కాదు. అలా చేస్తే ప్రజల్లో అల్లర్లు చెలరేగవచ్చు” అని అనుకొన్నారు.

బేతనియ గ్రామంలో తైలాభిషేకం

(మార్కు 14:3-9; యోహాను 12:1-8)

బేతనియ గ్రామంలో కుష్టురోగియగు సీమోను అని పిలువబడే ఒక వ్యక్తి యింట్లో యేసు ఉన్నాడు. యేసు భోజనానికి కూర్చొని ఉండగా ఒక స్త్రీ చలువరాతి బుడ్డిలో అతి విలువైన అత్తరుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన తలపై పోసింది.

ఇది చూసి శిష్యులకు కోపం వచ్చింది. “ఎందుకిలా వ్యర్థంచేయటం? ఈ అత్తరు పెద్ద మొత్తానికి అమ్మి ఆ డబ్బు పేదవాళ్ళ కివ్వవలసింది!” అని వాళ్ళన్నారు.

10 యేసుకు ఈ విషయం తెలిసి, “ఆమెనెందుకంటున్నారు? ఆమె సరియైన పని చేసింది, 11 పేద వాళ్ళు మీతో ఎప్పుడూ ఉంటారు. కాని నేను మీతో ఎల్లకాలం ఉండబోను. 12 ఆమె ఆ అత్తరు నా శరీరం మీద పోసి నన్ను సమాధి చెయ్యటానికి సిద్ధం చేసింది. 13 ఇది సత్యం—ఈ సువార్తను ప్రపంచంలో ఏ చోట ప్రకటించినా ఆమె జ్ఞాపకార్థం ఆమె చేసింది కూడా చెప్పబడుతుంది” అని అన్నాడు.

యేసుకు ద్రోహం చేయటానికి యూదా అంగీకరించటం

(మార్కు 14:10-11; లూకా 22:3-6)

14 ఆ తర్వాత పన్నెండుగురిలో ఒకడైన యూదా ఇస్కరియోతు ప్రధాన యాజకుల దగ్గరకు వెళ్ళాడు. 15 “ఆయన్ని మీ కప్పగిస్తే మీరు నాకేమివ్వాలనుకొన్నారు?” అని వాళ్ళనడిగాడు. వాళ్ళు ముప్పై వెండి నాణెములు లెక్క పెట్టి యిచ్చారు. 16 అప్పటినుండి యూదా ఆయన్ని పట్టివ్వాలని అవకాశం కోసం ఎదురు చూడసాగాడు.

పస్కా భోజనం

(మార్కు 14:12-21; లూకా 22:7-14, 21-23; యోహాను 13:21-30)

17 పులియని రొట్టెలు తినే పండుగ రోజులు వచ్చాయి. మొదటి రోజు శిష్యులు యేసు దగ్గరకు వచ్చి, “పస్కా పండుగ భోజనం ఎక్కడ సిద్ధం చేయమంటారు?” అని అడిగారు.

18 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పట్టణంలోకి నేను చెప్పిన వ్యక్తి దగ్గరకు వెళ్ళండి. అతనితో ‘నా సమయం దగ్గరకొచ్చింది. నేను నా శిష్యులతో కలసి పస్కా పండుగ భోజనం మీ యింట్లో చెయ్యాలనుకొంటున్నానని మా ప్రభువు చెప్పమన్నారు’ అని చెప్పండి.” 19 శిష్యులు యేసు సూచించిన విధంగా పస్కాపండుగ విందు సిద్దం చేసారు.

20 సాయంత్రం కాగానే యేసు పన్నెండు మందితో కలసి భోజనానికి కూర్చున్నాడు. 21 అంతా భోజనం చేస్తుండగా ఆయన, “ఇది సత్యం. మీలో ఒకడు నాకు ద్రోహం చేస్తాడు” అని అన్నాడు.

22 వాళ్ళకు దుఃఖం కలిగింది. ప్రతి ఒక్కడు ఆయనతో, “ప్రభూ! నేను కాదు కదా!” అని అన్నాడు.

23 యేసు సమాధానం చెబుతూ, “నాతో కలసి గిన్నెలో చెయ్యి ఉంచిన వాడు నాకు ద్రోహం చేస్తాడు. 24 మనుష్యకుమారుడు లేఖనాల్లో వ్రాసినట్లు చనిపోతాడు. కాని ఆయనకు ద్రోహంచేసిన వానికి బహుశ్రమ కలుగుతుంది. వాడు జన్మించి ఉండక పోయినట్లయితే బాగుండేది” అని అన్నాడు.

25 అప్పుడు ఆయనకు ద్రోహం చేయనున్న యూదా, “నేను కాదు కదా రబ్బీ”[a] అని అన్నాడు.

యేసు, “ఔను! నువ్వే!”[b] అని సమాధానం చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International