Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 1-2

కనానీయులతో యూదా యుద్ధం చేయటం

యెహోషువ చనిపోయాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ప్రార్థన చేసారు: యెహోవాతో, “మా వంశాలలో ఏది ముందుగా వెళ్లి, మా పక్షంగా కనానీయులకు విరోధంగా యుద్ధం చేయాలి?” అని వారు అడిగారు.

యెహోవా, “యూదా వంశస్థులు వెళతారు. నేను వారిని ఈ దేశం తీసుకోనిస్తాను” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.

యూదా పురుషులు, వారి సోదరులైన షిమ్యోను వంశంవారిని సహాయం అడిగారు. “సోదరులారా, మనలో ప్రతి ఒక్కరికి కొంత భూమి ఇస్తానని యెహోవా వాగ్దానం చేశాడు. మీరు వచ్చి, మా భూమి కోసం పోరాడటంలో సహాయం చేస్తే, అప్పుడు మేము మీ భూమి కోసం పోరాడేందుకు మీకు సహాయం చేస్తాం” అన్నారు యూదా మనుష్యులు. యూదా సోదరులతో కలిసి పోరాడేందుకు షిమ్యోను మనుష్యులు అంగీకరించారు.

కనానీయులను, పెరిజ్జీయులను ఓడించుటకు యూదా మనుష్యులకు యెహోవా సహాయం చేశాడు. బెజెకు పట్టణం దగ్గర యూదావారు 10,000 మందిని చంపేసారు. బెజెకు పట్టణంలో బెజెకు పాలకుని యూదా మనుష్యులు చూసి అతనితో పోరాడారు. యూదా వారు కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.

బెజెకు పాలకుడు[a] పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ యూదా వారు అతనిని తరిమి పట్టుకొన్నారు. వారు అతనిని పట్టుకున్నప్పుడు అతని కాళ్లు చేతుల బొటన వేళ్లను వారు కోసివేసారు. అప్పుడు బెజెకు పాలకుడు, “డెబ్బై మంది రాజుల కాళ్లు, చేతుల బొటన వేళ్లను నేను కోసివేసాను. ఆ రాజులు నా బల్ల మీదనుండి క్రింద రాలిన ఆహారం ముక్కలు తినవలసి వచ్చేది. ఆ రాజులకు నేను చేసిన దానిని దేవుడు ఇప్పుడు తిరిగి నాకు చెల్లించాడు” అని చెప్పాడు. బెజెకు పరిపాలకుని యూదా మనుష్యులు యెరూషలేముకు తీసుకొని వెళ్లారు. అతడు అక్కడ మరణించాడు.

యూదావారు యెరూషలేము మీద యుద్ధం చేసి దానిని పట్టుకొన్నారు. యెరూషలేము ప్రజలను చంపేందుకు యూదావారు వారి ఖడ్గాలు ఉపయోగించారు. తర్వాత వారు పట్టణాన్ని కల్చేశారు. ఆ తర్వాత యూదావారు మరికొంత మంది కనానీయులతో యుద్ధం చేయటానికి వెళ్లారు. నెగెవులోని కొండ దేశంలోను, పశ్చిమ కొండ చరియల్లోను ఆ కనానీయులు నివసించారు.

10 తర్వాత హెబ్రోను పట్టణంలో నివసించిన కనానీయులతో యుద్ధం చేసేందుకు యూదావారు వెళ్లారు. (హెబ్రోను కిర్యతర్బా అని పిలువబడేది.) షేషయి, అహీమాను, తల్మయి[b] అనే వారిని యూదావారు ఓడించారు.

కాలేబు, అతని కుమార్తె

11 యూదా వారు ఆ చోటు విడిచిపెట్టేశారు. దెబీరులో ఉన్న ప్రజలతో యుద్ధం చేయటానికి వారు దెబీరు పట్టణం వెళ్లారు. (గతంలో దెబీరు కిర్యత్సేఫెరు అని పిలువబడింది). 12 యూదావారు యుద్ధం ప్రారంభించక ముందు, ఆ మనుష్యులకు కాలేబు ఒక వాగ్దానం చేసాడు, “కిర్యత్సేఫెరు మీద దాడిచేయాలని నేను కోరుతున్నాను. ఆ పట్టణాన్ని ముట్టడించి, దానిని పట్టుకొనేవాడికి నేను నా కుమార్తె అక్సాను ఇస్తాను. అతనిని నా కుమార్తెను వివాహం చేసుకోనిస్తాను” అని చెప్పాడు కాలేబు.

13 కాలేబుకు కనజు అనే పేరుగల చిన్న తమ్ముడు ఉన్నాడు. కనజుకు ఒత్నీయేలు అను పేరుగల ఒక కుమారుడు ఉన్నాడు. కిర్యత్సేఫెరు పట్టణాన్ని ఒత్నీయేలు పట్టుకున్నాడు. అందుచేత ఒత్నీయేలుకు భార్యగా ఉండేందుకు కాలేబు తన కుమార్తె అక్సాను అతనికి ఇచ్చాడు.

14 అక్సా ఒత్నీయేలుతో కాపురానికి వెళ్లింది. తన తండ్రిని కొంత భూమి అడగమని అక్సాతో చెప్పాడు ఒత్నీయేలు. అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది. ఆమె తన గాడిద మీదనుండి దిగగానే, “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.

15 అక్సా జవాబిచ్చింది: “నాకు ఒక ఆశీర్వాదం ఇవ్వుము. నీవు నాకు నెగెవులో ఎండిపోయిన ఎడారి భూమి ఇచ్చావు. దయచేసి నీళ్లుగల భూమి నాకు కొంత ఇవ్వుము.” కనుక ఆమె కోరినట్టు కాలేబు ఆమెకు ఇచ్చాడు. అప్పుడు ఎగువ, దిగువ నీటి మడుగులను కాలేబు ఆమెకు ఇచ్చాడు.

16 కెనెతీ ప్రజలు అంజూరపు చెట్ల పట్టణం (యెరికో) విడిచి, యూదా ప్రజలతో వెళ్ళారు. వారు యూదా అరణ్యంలోని ప్రజలతో కలిసి జీవించటానికి అక్కడికే వెళ్లారు. అది అరాదు పట్టణానికి సమీపంగానే నెగెవులో ఉంది. (కెనెతీ ప్రజలు మోషే మామగారి కుటుంబానికి చెందినవారు).

17 కనానీ ప్రజలు కొందరు జెఫతు పట్టణంలో నివసించారు. కనుక యూదావారు, షిమ్యోను వంశం వారు ఆ కనానీయుల మీద దాడిచేశారు. ఆ పట్టణాన్ని వారు పూర్తిగా ధ్వంసం చేశారు. అందుచేత వారు ఆ పట్టణానికి హోర్మా[c] అని పేరు పెట్టారు.

18 యూదావారు గాజా పట్టణాన్ని, దాని చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను పట్టుకొన్నారు. అష్కెలోను, ఎక్రోను పట్టణాలను, వాటి చుట్టూరా ఉన్న చిన్న పట్టణాలను కూడా యూదావారు పట్టుకొన్నారు.

19 యూదావారు యుద్ధం చేసినప్పుడు యెహోవా వారి పక్షంగా ఉన్నాడు. కొండ దేశంలోని భూమిని వారు స్వాధీనం చేసుకున్నారు. కానీ లోయల్లో ఉన్న ప్రజల వద్ద ఇనుప రథాలు ఉండటం చేత ఆ భూమిని యూదావారు తీసుకోలేక పోయారు.

20 హెబ్రోను దగ్గర ఉన్న భూమిని కాలేబుకు ఇస్తానని మోషే వాగ్దానం చేసాడు. కనుక ఆ భూమి కాలేబు కుటుంబానికి ఇవ్వబడినది. కాలేబు మనుష్యులు అనాకు యొక్క ముగ్గురు కుమారులను ఆ చోటు నుండి బలవంతంగా వెళ్లగొట్టారు.

21 బెన్యామీను వంశపు వారు యెరూషలేము నుండి యెబూసీ ప్రజలను వెళ్లగొట్టలేకపోయారు. కనుక నేటికీ బెన్యామీను ప్రజలతో బాటు యెబూసీ ప్రజలు కూడా యెరూషలేములో నివసిస్తున్నారు.

యోసేపు మనుష్యులు బేతేలును పట్టుకోవటం

22-23 యోసేపు వంశం వారు బేతేలు పట్టణం మీద యుద్ధానికి వెళ్లారు. (పూర్వం బేతేలు లూజు అని పిలువబడింది.) యోసేపు వంశం వారి పక్షంగా యెహోవా ఉన్నాడు. యోసేపు వంశం వారు బేతేలు పట్టణానికి కొందరు గూఢాచారులను పంపించారు. (వీళ్లు బేతేలు పట్టణాన్ని ఓడించే మార్గాల కోసం వెదికారు). 24 గూఢచారులు బేతేలు పట్టణాన్ని గమనించి చూస్తూండగా ఆ పట్టణంలో నుండి ఒక మనిషి బయటకు రావటం వారు చూశారు. ఆ గూఢచారులు, “పట్టణంలోనికి ఒక రహస్య మార్గం మాకు చూపించు. మేము పట్టణం మీద దాడి చేస్తాము. కానీ నీవు మాకు సహాయం చేస్తే, మేము నీకు హాని చేయము” అని అతనితో చెప్పారు.

25 ఆ మనిషి పట్టణంలోనికిగల రహస్య మార్గాన్ని గూఢాచారులకు చూపించాడు. యోసేపు వంశస్థులు బేతేలు ప్రజలను చంపటానికి వారి ఖడ్గాలు ప్రయోగించారు. కానీ వారికి సహాయం చేసిన మనిషికి వారు హాని చేయలేదు. అతని కుటుంబం వారికి కూడ వారు హాని చేయలేదు. అతడు, అతని కుటుంబం స్వేచ్ఛగా వెళ్లనివ్వబడ్డారు. 26 అతడు హిత్తీ ప్రజలు నివసించే దేశానికి వెళ్లి, ఒక పట్టణం నిర్మించాడు. ఆ పట్టణానికి లూజు అని అతడు పేరు పెట్టాడు. ఆ పట్టణం నేటికీ లూజు అని పిలువ బడుతూవుంది.

మిగిలిన వంశాలు కనానీయులతో పోరాడటం

27 బేత్షెయానును, తయినాకు, దోరు, ఇబ్లెయామును, మెగిద్దో పట్టణాల్లో, ఆ పట్టణాల చుట్టుపక్కల ఉన్న చిన్న పట్టణాల్లో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. మనష్షే వంశం వారు ఆ ప్రజలను ఆ పట్టణాల నుండి వెళ్లగొట్టలేకపోయారు. అందుచేత కనానీయులు ఉండిపోయారు. వారు తమ గృహాలు విడిచిపెట్టేందుకు నిరాకరించారు. 28 తర్వాత ఇశ్రాయేలు ప్రజలు బలవంతులై కనానీ ప్రజలను తమకు బానిసలుగా చేసుకున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కనాను ప్రజలందరినీ వారి దేశంనుండి వెళ్లగొట్టలేకపోయారు.

29 (ఎఫ్రాయిము వంశం వారి విషయం కూడ అలాగే జరిగింది.) గెజెరులో కనానీ ప్రజలు నివసిస్తున్నారు. ఎఫ్రాయిము వంశస్తులు ఆ కనాను ప్రజలందరినీ వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఎఫ్రాయిము ప్రజలతోబాటు కనాను ప్రజలు కూడ గెజెరులో నివసించటం కొనసాగించారు.

30 జెబూలూను వంశం వారి విషయంలో కూడ అలాగే జరిగింది. కిత్రోను, నహలోలు పట్టణాల్లో కొందరు కనానీయులు నివసించారు. జెబూలూను ప్రజలు ఆ మనుష్యులను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. ఆ కనానీయులు ఉండిపోయి, జెబూలూను వారితో నివసించారు. కానీ జెబూలూను వారు ఆ ప్రజలను తమకు బానిసలుగా పని చేయించుకొన్నారు.

31 (ఆషేరు వంశం వారి విషయంలో కూడా అలాగే జరిగింది.) అక్కో, సీదోను, అహ్లాబు, అక్జీబు, హెల్బా, అఫెకు, రెహోబు పట్టణాలనుండి ఇతర మనుష్యులను ఆషేరువారు వెళ్లగొట్టలేదు 32 ఆషేరువారు కనాను ప్రజలను వారి దేశం నుండి వెళ్లగొట్టలేదు. కనుక ఆ కనానీయులు ఆషేరు ప్రజలతో కలిసి జీవించటం కొనసాగించారు.

33 (నఫ్తాలి వంశం వారి విషయంలో కూడా ఇలాగే జరిగింది). బేత్షెమెషు, బేతనాతు పట్టణాలలోని ప్రజలను నఫ్తాలీ ప్రజలు వెళ్లగొట్టలేదు. కనుక నఫ్తాలి ప్రజలు ఇతరులతో కలసి ఆ పట్టణాలలోనే నివసించటం కొనసాగించారు. ఆ కనానీ ప్రజలు నఫ్తాలీ వారికి బానిసలుగా పని చేసారు.

34 అమోరీయులు, దాను వంశం వారిని కొండ దేశంలో నివసించేట్టుగా బలవంతం చేసారు. దాను ప్రజలు లోయలలో నివసించేందుకు అమోరీ ప్రజలు రానివ్వ లేదు. కనుక దాను వారు కొండలలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 35 అమోరీయులు అయ్యాలోను, హెరెసు కొండలోను, షయల్బీములోను నివసించేందుకు తీర్మానించుకున్నారు. తరువాత యోసేపువంశం బలమైనదిగా పెరిగింది. అప్పుడు వారు అమోరీయులను తమకు బానిసలుగా పని చేయించుకున్నారు. 36 అమోరీయుల దేశం తేలు కనుమనుండి హస్సెలా వరకు, ఆ పైన హస్సెలాకు అవతల కొండ దేశంలోనికీ విస్తరించింది.

బోకీము దగ్గర యెహోవాదూత

యెహోవాదూత గిల్గాలు పట్టణం నుండి బోకీము పట్టణానికి వెళ్లాడు. యెహోవా నుండి వచ్చిన ఒక సందేశాన్ని ఆ దూత ఇశ్రాయేలు ప్రజలకు అందించాడు. ఇదే ఆ సందేశం: “నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకుని వచ్చాను. నేను మీ పూర్వీకులకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి నేను మిమ్మల్ని నడిపించాను. మీతో నేను చేసిన నా ఒడంబడికను నేను ఎన్నడూ ఉల్లంఘించను. ఈ దేశంలో నివసించే వారితో మీరు ఏ ఒడంబడిక చేసుకోకూడదు. వారి బలిపీఠాలను మీరు నాశనం చేయాలి అని నేను చెప్పాను. కాని మీరు నాకు విధేయులు కాలేదు.

“నేను మీకు చెబుతాను: ‘ఇతరులను ఇక మీదట ఈ దేశం నుండి బలవంతంగా నేను వెళ్లగొట్టను. ఈ ప్రజలు మీకు ఒక సమస్య అవుతారు. వారు మీకు ఉరిగా ఉంటారు. వారి దేవతలు మీకు ఉరిలాగా ఉంటారు.’”

యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవదూత చెప్పగానే ప్రజలు గట్టిగా ఏడ్చారు. కనుక ఇశ్రాయేలీయులు ఏడ్చిన ఆ స్థలానికి బోకీము[d] అని పేరు పెట్టారు. బోకీములో ఇశ్రాయేలీయులు యెహోవాకు బలులు అర్పించారు.

అవిధేయతవలన అపజయం

అప్పుడు యెహోషువ ప్రజలను ఇంటికి పొమ్మని చెప్పాడు. అందుచేత ప్రతి వంశంవారు నివసించుటకు వారికి యివ్వబడిన భూమిని తీసుకొనుటకు వెళ్లారు. యెహోషువ బ్రతికి ఉన్నంతవరకు ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించారు. యెహోవాషువ మరణించిన తరువాత జీవించిన నాయకుల (పెద్దలు) జీవిత కాలంలో వారు యెహోవాను సేవించారు. ఇశ్రాయేలు ప్రజలకోసం యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ ఈ వృద్ధులు చూశారు. నూను కుమారుడు, యెహోవా సేవకుడునగు యెహోవాషువ 110 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇశ్రాయేలు ప్రజలు, యెహోవాషువకు ఇవ్వబడిన స్థలంలో వారు అతనిని సమాధి చేసారు. అది ఎఫ్రాయిము కొండ దేశంలో గాయషు పర్వతానికి ఉత్తరాన తిమ్నాతుహెరెసు దగ్గర ఉంది.

10 ఆ తరం వారంతా చనిపోయాక తరువాత తరం పెరిగింది. యెహోవాను గూర్చిగాని, ఇశ్రాయేలీయులకు యెహోవా చేసిన వాటిని గూర్చిగాని ఈ కొత్త తరం వారికి తెలియదు. 11 అందుచేత ఇశ్రాయేలు ప్రజలు కీడు చేస్తూ తప్పుడు దేవత బయలును సేవించారు. ప్రజలు ఈ కీడు చేయటం యెహోవా చూశాడు. 12 ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టు నుండి యెహోవా బయటకు తీసుకుని వచ్చాడు. ఈ ప్రజల పూర్వీకులు యెహోవాను ఆరాధించారు. కాని ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను అనుసరించటం మానుకొన్నారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసించిన ప్రజలయొక్క తప్పుడు దేవుళ్లను[e] పూజించటం మొదలు పెట్టారు. అది యెహోవాకు కోపం కలిగించింది. 13 ఇశ్రాయేలీయులు యెహోవాను అనుసరించటం మానివేసి బయలు, అష్తారోతులను పూజించటం మొదలు పెట్టారు.

14 ఇశ్రాయేలు ప్రజలమీద యెహోవాకు కోపం వచ్చింది. కనుక శత్రువులు ఇశ్రాయేలీయుల మీద దాడిచేసి వారి ఆస్తులను తీసుకునేట్టుగా యెహోవా చేశాడు. యెహోవా వారి చుట్టూరా ఉన్న వారి శత్రువుల ద్వారా వారు ఓడిపోయేట్టు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువులనుండి వారిని వారు కాపాడుకోలేక పోయారు. 15 ఇశ్రాయేలు ప్రజలు యుద్ధానికి బయటకు వెళ్లినప్పుడల్లా ఓడిపోయారు. యెహోవా వారి పక్షంగా లేని కారణంచేత వారు ఓడిపోయారు. ఇశ్రాయేలీయులు వారి చుట్టూరా నివసిస్తున్న ప్రజల దేవతలను సేవిస్తే, వారు ఓడిపోతారని యెహోవా ముందుగానే వారిని హెచ్చరించాడు. ఇశ్రాయేలు ప్రజలు చాలా శ్రమ అనుభవించారు.

16 అప్పుడు యెహోవా న్యాయాధిపతులు అనే నాయకులను ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలు ప్రజల ఆస్తులను తీసుకున్న శత్రువులనుండి వారిని ఈ నాయకులు రక్షించారు. 17 కాని ఇశ్రాయేలు ప్రజలు వారి న్యాయాధిపతుల మాట వినలేదు. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక ఇతర దేవుళ్లను అనుసరించారు.[f] పూర్వం ఇశ్రాయేలీయుల పూర్వీకులు యెహోవా ఆజ్ఞలకు విధేయులయ్యారు. కానీ ఇశ్రాయేలీయులు ఇప్పుడు మారిపోయి, యెహోవాకు విధేయులు కావటం లేదు.

18 ఇశ్రాయేలీయుల శత్రువులు ఇశ్రాయేలు ప్రజలకు అనేకసార్లు చెడు సంగతులు జరిగించారు. అందుచేత ఇశ్రాయేలీయులు సహాయం కోసం ఏడ్చేవారు. ప్రతీసారీ, ప్రజల విషయమై యెహోవా సంతాప పడ్డాడు. ప్రతీసారీ ప్రజలను వారి శత్రువుల నుండి రక్షించేందుకు ఆయన ఒక న్యాయమూర్తిని పంపించాడు. యెహోవా ఎల్లప్పుడూ ఆ న్యాయమూర్తులతో ఉండేవాడు. కనుక ప్రతిసారీ ఇశ్రాయేలు ప్రజలు వారి శత్రువుల నుండి రక్షించబడ్డారు. 19 అయితే ప్రతీ న్యాయమూర్తి చనిపోయినప్పుడూ, ఇశ్రాయేలీయులు మరల పాపం చేసి, బూటకపు దేవుళ్లను పూజించటం మొదలుపెట్టారు. ఇశ్రాయేలీయులు చాలా మొండి వాళ్లు వారు తమ చెడు మార్గాలు విడిచి పెట్టేందుకు నిరాకరించారు.

20 అందుచేత ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపగించి, ఆయన చెప్పాడు: “ఈ ప్రజలు నేను వారి పూర్వీకులతో చేసిన ఒడంబడికనే ఉల్లంఘించారు. వారు నా మాట వినలేదు. 21 కనుక నేను ఇంకెంత మాత్రం ఇతర రాజ్యాలను జయించి, ఇశ్రాయేలీయుల కోసం దారి సులభం చేయను. యెహోషువ చనిపోయినప్పుడు ఆ రాజ్యాలు ఇంకా ఈ దేశంలోనే ఉన్నాయి. మరియు ఆ రాజ్యాలను నేను ఈ దేశంలోనే ఉండనిస్తాను. 22 ఇశ్రాయేలు ప్రజలను పరీక్షించేందుకు నేను ఆ రాజ్యాలను ప్రయోగిస్తాను. ఇశ్రాయేలు ప్రజలు, వారి పూర్వీకులు యెహోవా ఆజ్ఞలను పాటించినట్టుగా, పాటించగలరేమో నేను చూస్తాను.” 23 యెహోవా ఆ రాజ్యాలను దేశంలో ఉండనిచ్చాడు. ఆ రాజ్యాలు వెంటనే దేశం విడిచిపోయేట్టు యెహోవా బలవంతం చేయలేదు. వారిని ఓడించేందుకు ఆయన యెహోషువ సైన్యానికి సహాయం చేయలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International