Old/New Testament
ఏశావు కుటుంబం
36 ఏశావు (ఎదోము అని కూడ అతనికి పేరు) కుటుంబ జాబితా ఇది: ఏశావు కనాను దేశపు స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. 2 ఏశావు భార్యలు ఎవరంటే: హిత్తీవాడైన ఏలోను కుమార్తె ఆదా, హివ్వీవాడైన సిబ్యోను కుమారుడు అనా కుమార్తె అహోలీబామా, 3 ఇశ్మాయేలు కుమార్తెయు నెబాయోతు సోదరియైన బాశెమతు. 4 ఎలీఫజు అనే కుమారుని ఆదా ఏశావుకు కన్నది. రగూయేలు అనే కుమారుని బాశెమతు ఏశావుకు కన్నది. 5 అహోలీబామా ఏశావుకు ముగ్గురు కుమారులను కన్నది: యూషు, యాలాము, కోరహు. వీరు ఏశావు కుమారులు. వీరు కనాను దేశంలో పుట్టారు.
6-8 ఏశావు కుటుంబం, యాకోబు కుటుంబం కలిసి ఒకే చోట నివసించటం వల్ల ఆ ప్రాంతం వాళ్ల పోషణకు చాలలేదు. కనుక ఏశావు కనాను విడిచిపెట్టి తన సోదరుడు యాకోబుకు దూరంగా మరో దేశం వెళ్లిపోయాడు. ఏశావు తనకు కలిగినదంతా తనతోబాటు తీసుకొని పోయాడు. ఇవన్నీ అతడు కనానులో నివసించినప్పుడు సంపాదించుకొన్నాడు. కనుక తన భార్యలను, కుమారులను, కుమార్తెలను, తన బానిసలందరిని, పశువులను, ఇతర జంతువులను ఏశావు తనతో కూడ తెచ్చుకొన్నాడు. కనుక ఏశావు శేయీరు కొండ ప్రాంతానికి తరలి పోయాడు. (ఏశావుకు ఎదోము అని కూడ పేరు. మరియు ఎదోము, శేయీరు దేశానికి మరో పేరు.)
9 ఎదోము ప్రజలకు ఏశావు తండ్రి. శేయీరు (ఎదోము) కొండ ప్రాంతంలో నివసిస్తోన్న ఏశావు కుటుంబంలోని వాళ్ల పేర్లు యివి:
10 ఏశావు కుమారులు: ఏశావు, ఆదాలకు పుట్టిన కుమారుడు ఎలీఫజు. ఏశావు, బాశెమతులకు పుట్టిన కుమారుడు రగుయేలు.
11 ఎలీఫజుకు అయిదుగురు కుమారులు: తేమాను, ఓమారు, సెపో, గాతాము మరియు కనజు.
12 ఎలీఫజుకు తిమ్నా అనే ఒక దాసి కూడ ఉంది. తిమ్నా, ఎలీఫజులకు అమాలేకు పుట్టాడు.
13 రగూయేలుకు ముగ్గురు కుమారులు: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
వీరు బాశెమతు మూలంగా ఏశావుకు మనుమళ్లు.
14 అనా (సిబ్యోను కుమారుడు) కుమార్తె అహోలీబామా ఏశావుకు మూడవ భార్య. ఏశావు, అహోలీబామాలకు పుట్టిన పిల్లలు: యూషు, యాలాము, కోరహు.
15 ఏశావు ద్వారా వచ్చిన వంశాలు యివి:
ఏశావు మొదటి కుమారుడు ఎలీఫజు. ఎలీఫజుకు పుట్టిన వారు: తేమాను, ఓమారు, సెపో, కనజు. 16 కోరహు, గాతాము, అమాలేకు.
ఈ వంశాలన్నీ ఏశావు భార్య ఆదానుండి ఉద్భవించాయి
17 ఏశావు కుమారుడు రగూయేలు ఈ క్రింది కుటుంబాలకు తండ్రి: నహతు, జెరహు, షమ్మా, మిజ్జ.
ఈ కుటుంబాలన్నీ ఏశావు భార్య బాశెమతు నుండి ఉద్భవించాయి.
18 అనా కుమార్తె, ఏశావు భార్య అహోలీబామాకు యూషు, యగ్లాము, కోరహు పుట్టారు. ఈ ముగ్గురు వారికి పుట్టిన కుటుంబాలకు పెద్దలు.
19 ఈ కుటుంబాలన్నీ ఏశావునుండి ఉద్భవించాయి.
20 ఏశావుకంటె ముందు హోరీవాడైన శేయీరు ఎదోములో నివసించాడు. శేయీరు కుమారులు వీరు:
లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 21 దిషోను, ఏసెరు, దీషాను. వీరు ఏశావు (ఎదోము) ప్రాంతంనుండి వచ్చిన హోరీయ కుటుంబ నాయకులు.
22 హోరీ, హేమీములకు లోతాను తండ్రి. (తిమ్నా లోతాను సోదరి.)
23 అల్వాన్, మానహదు, ఏబాలు, షపో, ఓనాముల తండ్రి శోబాలు.
24 సిబ్యోనుకు ఇద్దరు కుమారులు. అయ్యా, అనా. (అనా తన తండ్రి గాడిదలను కాస్తూ ఉండగా ఎడారిలో ఉష్ణధారలను కనుగొన్నవాడు.)
25 దిషోను, అహోలీబామా అనే వారికి అనా తండ్రి.
26 దిషోనుకు నలుగురు కుమారులు: హెన్దూను, ఎష్బాను, ఇత్రాను, కెరాను.
27 ఏసెరుకు ముగ్గురు కుమారులు: బిల్హాను, జవాను, అకాను.
28 దీషానుకు ఇద్దరు కుమారులు: ఊజు, అరాను.
29 హోరీ కుటుంబాల పెద్దల పేర్లు ఇవి: లోతాను, శోబాలు, సిబ్యోను, అనా, 30 దిషోను, ఏసెరు, దీషాను, శేయీరు (ఎదోము) దేశంలో నివసించిన కుటుంబాల పెద్దలు వీరంతాను.
31 అప్పట్లో, ఎదోములో రాజులు ఉన్నారు. ఇశ్రాయేలీయుల రాజులకంటె చాలా ముందే ఎదోములో రాజులు ఉన్నారు.
32 బెయారు కుమారుడు బెల ఎదోమును పాలించిన ఒక రాజు. అతడు దిన్హాబా పట్టణమును పాలించాడు.
33 బెల చనిపోయినప్పుడు యోబాబు రాజయ్యాడు. యోబాబు బొస్రావాడైన జెరహు కుమారుడు.
34 యోబాబు చనిపోయినప్పుడు హుషాము పాలించాడు. హుషాము తేమాని ప్రజల దేశవాసి.
35 హుషాము చనిపోయాక హదదు ఆ ప్రాంతాన్ని పాలించాడు. బదదు కుమారుడు హదదు. (మోయాబు దేశంలో మిద్యానును జయించినవాడు హదదు.) హదదు అవీతు పట్టణంవాడు.
36 హదదు మరణించాక శమ్లా ఆ దేశాన్ని పాలించాడు. శమ్లా మశ్రేకనుండి వచ్చినవాడు.
37 శమ్లా మరణించాక షావూలు ఆ ప్రాంతాన్ని పాలించాడు. యూఫ్రటీసు నదీ ప్రాంతంలోని రహెబోతువాడు షావూలు.
38 షావూలు మరణానంతరం బయల్ హానాను ఆ దేశాన్ని పాలించాడు. అక్బోరు కుమారుడు బయల్ హనాను.
39 బయల్ హనాను మరణించాక హదదు (హదరు) ఆ దేశాన్ని పాలించాడు. హదదు పాయు నగరవాసి. అతని భార్య పేరు మహేతబేలు. ఆమె మత్రేదు కుమార్తె. (మత్రేదు తండ్రి మేజాహాబు).
40-43 తిమ్నా, అల్వా, యతేతు, అహోలీబామా, ఏలా, పీనోను, కనజు, తేమాను, మిబ్సారు, మగ్దీయేలు, ఈరాము: ఈ ఎదోమీ కుటుంబాలకు పితరుడు ఏశావు. వీటిలో ఒక్కో కుటుంబం, తన కుటుంబం పేరుతోనే పిలువబడే ప్రాంతంలో నివసించింది.
కలలుగనే యోసేపు
37 యాకోబు కనాను దేశంలో ఉంటూ, అక్కడే నివసించాడు. ఇదీ, అతని తండ్రి నివసించినదీ ఒకటే దేశం. 2 ఇది యాకోబు కుటుంబ గాధ.
యోసేపు 17 సంవత్సరాల యువకుడు. గొర్రెల్ని, మేకల్ని కాయటం అతని పని. బిల్హా, జిల్ఫా కుమారులైన తన సోదరులతో కలిసి యోసేపు ఈ పని చేశాడు. (బిల్హా, జిల్ఫా అతని తండ్రి భార్యలు.) అతని సోదరులు చేసే చెడ్డ పనులను గూర్చి యోసేపు తన తండ్రితో చెప్పేవాడు. 3 అతని తండ్రి ఇశ్రాయేలు (యాకోబు) చాలా వృద్ధుడుగా ఉన్నప్పుడు యోసేపు పుట్టాడు. కనుక ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారులందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించాడు. యాకోబు తన కుమారునికి ఒక ప్రత్యేకతగల అంగీ ఇచ్చాడు. ఈ అంగీ చాలా పొడుగ్గా, అందంగా ఉంది. 4 యోసేపు సోదరులు వారి తండ్రి వారందరికంటే యోసేపును ఎక్కువగా ప్రేమించటం గమనించారు. అందుచేత వారు వారి సోదరుణ్ణి ద్వేషించారు. వాళ్లు యోసేపుతో స్నేహభావంతో మాట్లాడలేదు.
5 ఒకసారి యోసేపుకు ఒక ప్రత్యేకమైన కల వచ్చింది. తర్వాత ఈ కల విషయం యోసేపు తన అన్నలతో చెప్పాడు. దీని తర్వాత అతని అన్నలు అతణ్ణి మరింతగా ద్వేషించారు.
6 “నాకో కల వచ్చింది, 7 మనమంతా పొలంలో పని చేస్తున్నాం. మనం గోధుమ పనలు కడ్తున్నాం. నా పన నిలబడింది, దాని చుట్టూ మీ పనలు లేచి నిలబడ్డాయి. అప్పుడు మీ పనలన్నీ నా పనకు సాష్టాంగపడ్డాయి” అని చెప్పాడు యోసేపు.
8 అతని సోదరులు, “అంటే మా మీద నీవు రాజువై అధికారం చేస్తావా?” అని అడిగారు. వారిని గూర్చి యోసేపుకు వస్తోన్న కలల మూలంగా ఇప్పుడు వారు అతణ్ణి ఇంకా ఎక్కువగా ద్వేషించారు.
9 అప్పుడు యోసేపుకు మళ్లీ ఒక కల వచ్చింది. ఈ కలను గూర్చి యోసేపు తన సోదరులకు చెప్పాడు. “నాకు ఇంకో కల వచ్చింది. సూర్యుడు, చంద్రుడు, మరియు 11 నక్షత్రాలు నాకు సాష్టాంగపడటం నేను చూశాను” అంటూ చెప్పాడు యోసేపు.
10 ఈ కల విషయమై యోసేపు తన తండ్రితో కూడ చెప్పాడు. కాని అతని తండ్రి అతణ్ణి విమర్శించాడు. “ఇదేం కల? నేనూ, మీ అమ్మ, నీ సోదరులు అందరం నీకు సాష్టాంగపడతామని నీవు నమ్ముతున్నావా?” అన్నాడు అతని తండ్రి. 11 యోసేపు సోదరులు మాత్రం అతని మీద అసూయ పడుతూనే ఉన్నారు. అయితే యోసేపు తండ్రి వీటన్నింటిని గూర్చి చాలా ఆలోచన చేసి వీటి భావం ఏమై ఉంటుందా అని ఆశ్చర్యపడుతూ వున్నాడు.
12 ఒకరోజు, యోసేపు సోదరులు తమ తండ్రి గొర్రెల్ని మేపుకొనేందుకు షెకెం వెళ్లారు. 13 యాకోబు, “నీ సోదరులు షెకెంలో నా గొర్రెల్ని కాస్తున్నారు. నీవు అక్కడికి వెళ్లాలి” అని యోసేపుతో చెప్పాడు.
“అలాగే, నేను వెళ్తా,” అన్నాడు యోసేపు.
14 యోసేపు తండ్రి, “నీవు వెళ్లి నీ సోదరులు క్షేమంగా ఉన్నారో లేదో చూచి, మళ్లీ వచ్చి నా గొర్రెల క్షేమ సమాచారం నాకు చెప్పాలి” అన్నాడు. అందుచేత యోసేపు తండ్రి హెబ్రోను లోయనుండి షెకెముకు అతడ్ని పంపించాడు.
15 షెకెములో యోసేపు తప్పిపోయాడు. అతడు పొలాల్లో తిరుగుతోంటే ఒక మనిషి చూశాడు. “ఏమిటి వెదుకుతున్నావు” అన్నాడు ఆ మనిషి.
16 “నేను నా అన్నల కోసం వెదుకుతున్నాను. వాళ్లు గొర్రెల్ని మేపుకొంటూ ఎక్కడ ఉన్నారో నీవు చెప్పగలవా?” అన్నాడు యోసేపు.
17 ఆ మనిషి “అప్పుడే వాళ్లు వెళ్లిపోయారు గదా. వాళ్లు దోతాను వెళ్తాం అని చెప్పుకోవటం నేను విన్నాను” అన్నాడు. కనుక యోసేపు తన సోదరులను వెంబడించి, దోతానులో వారిని చూడగలిగాడు.
బానిసగా యోసేపును అమ్ముట
18 యోసేపు రావటం అతని అన్నలు అంత దూరం నుంచే చూశారు. అతణ్ణి చంపేందుకు ఒక పథకం వేయాలని వారు తీర్మానించుకొన్నారు. 19 ఆ సోదరులు వాళ్లలో వారు ఇలా చెప్పుకొన్నారు, “కలలుకనే యోసేపు ఇక్కడికి వస్తున్నాడు. 20 ఇప్పుడు మనకు వీలైనప్పుడే మనం వాణ్ణి చంపివేయాలి. వాని శవాన్ని ఇక్కడే ఏదో ఖాళీ బావిలో పడవేస్తే సరిపోతుంది. అడవి మృగం ఏదో వాణ్ణి చంపేసిందని మన తండ్రితో మనం చెప్పొచ్చు. అప్పుడు అతని కలలన్నీ అర్థము లేనివని వానికి మనం చూపెట్టవచ్చు.”
21 కానీ రూబేను యోసేపును కాపాడాలి అనుకొన్నాడు, “వాణ్ణి మనం చంపొద్దు. 22 వానికి హాని చేయకుండానే ఒక బావిలో పడవేస్తే సరిపోతుంది” అని చెప్పాడు రూబేను. యోసేపును రక్షించి, అతని తండ్రి దగ్గరకు పంపించాలని రూబేను వేసిన పథకం ఇది. 23 యోసేపు తన సోదరుల దగ్గరకు వచ్చాడు. వారు అతని మీద పడి, అందమైన అతని పొడవాటి అంగీని చింపేసారు. 24 తర్వాత, ఎండిపోయి ఖాళీగా ఉన్న ఒక బావిలో అతణ్ణి పడవేశారు.
25 యోసేపు బావిలో పడి ఉంటే, అతని సోదరులు భోజనం చేసేందుకు కూర్చున్నారు. అప్పుడు వారు చూడగా, గిలాదునుండి ఈజిప్టుకు ప్రయాణం చేస్తోన్న వ్యాపారస్తుల బృందం ఒకటి కనబడింది. వారి ఒంటెలు గుగ్గిలం, మస్తకి, బోళం, ఐశ్వర్యాలు మోస్తున్నాయి. 26 కనుక యూదా తన సోదరులతో “మనం మన సోదరున్ని చంపి, వాని మరణాన్ని దాచిపెడితే మనకేం లాభం? 27 ఈ వ్యాపారస్తులకు గనుక మనం వాణ్ణి అమ్మివేస్తే మనకు లాభం వస్తుంది. పైగా మన సొంత సోదరున్ని చంపిన అపరాధం మనమీద ఉండదు” అన్నాడు. మిగిలిన సోదరులు సమ్మతించారు. 28 మిద్యానీ వ్యాపారవేత్తలు అటు రాగానే, ఆ సోదరులు యోసేపును బావిలో నుండి బయటకు తీశారు. 20 వెండి నాణాలకు వారతణ్ణి ఆ వ్యాపారవేత్తలకు అమ్మివేశారు. వ్యాపారవేత్తలు అతణ్ణి ఈజిప్టుకు తీసుకువెళ్లారు.
29 ఇంతసేపూ రూబేను అక్కడ తన సోదరులతో లేడు. యోసేపును వారు అమ్మివేసినట్లు అతనికి తెలియదు. రూబేను బావి దగ్గరకు వచ్చినప్పుడు, యోసేపు బావిలో లేడు. రూబేనుకు ఎక్కడ లేని విచారం కలిగింది. తన విషాదాన్ని తెలియజేయడానికి తన గుడ్డలను చింపివేసుకొన్నాడు. 30 రూబేను తన సోదరుల దగ్గరకు వెళ్లి, “పిల్లవాడు బావిలో లేడు, నేనేం చేయాలి?” అని అడిగాడు. 31 ఆ సోదరులు ఒక మేకను చంపి, దాని రక్తాన్ని యోసేపుయొక్క అందమైన అంగీకి పూశారు. 32 తర్వాత ఆ సోదరులు ఆ అంగీని తమ తండ్రికి చూపించారు. “ఈ అంగీ మాకు దొరికింది. ఇది యోసేపుదా?” అంటూ అడిగారు ఆ సోదరులు.
33 తండ్రి అంగీని చూచి, అది యోసేపుదేనని తెలుసుకొన్నాడు. “అవును, అది అతనిదే, ఒకవేళ అడవి మృగం ఏదైనా అతణ్ణి చంపివేసిందేమో. నా కుమారుడు యోసేపును అడవి మృగం ఏదో భక్షించి వేసింది!” అన్నాడు ఆ తండ్రి. 34 యాకోబు తన కుమారుని గూర్చిన దుఃఖంతో తన వస్త్రాలు చింపివేసుకున్నాడు. అతడు దుఃఖంలో ఉన్నట్లు వ్యక్తం చేసేందుకు ప్రత్యేక వస్త్రాలు యాకోబు ధరించాడు. యాకోబు తన కుమారుని విషయం చాలా కాలం దుఃఖంగానే ఉన్నాడు. 35 యాకోబు కుమారులు, కుమార్తెలు అందరూ అతణ్ణి ఓదార్చాలని ప్రయత్నించారు. అయినా యాకోబుకు ఎన్నడూ ఆదరణ కలుగలేదు. యాకోబు “నా మరణ దినంవరకు నా కుమారుని గూర్చి దుఃఖిస్తూనే ఉంటాను” అన్నాడు. అందుచేత అతని కుమారుడైన యోసేపు కోసం యాకోబు దుఃఖంలోనే కాలం గడుపుతూ ఉండిపోయాడు.
36 యోసేపును కొన్న మిద్యాను వ్యాపారవేత్తలు దరిమిలా అతణ్ణి ఈజిప్టులో ఫరో సంరక్షక సేనాధిపతి పోతీఫరుకు అమ్మివేశారు.
యూదా మరియు తామారు
38 సుమారు అదే సమయంలో యూదా తన సోదరులను విడిచి, హీరా అనే ఒకతని దగ్గర ఉండేందుకు వెళ్లాడు. హీరా అదుల్లాము నివాసి. 2 అక్కడ యూదా ఒక కనానీ అమ్మాయిని కలుసుకొని ఆమెను పెళ్లి చేసుకొన్నాడు. ఆ అమ్మాయి తండ్రి పేరు షూయ. 3 ఆ కనానీ స్త్రీకి ఒక కుమారుడు పుట్టగా, వారు అతనికి ఏరు అని పేరు పెట్టారు. 4 తర్వాత ఆమె మరో కుమారుని కన్నది. ఆ కుమారునికి వారు ఓనాను అని పేరు పెట్టారు. 5 తర్వాత షేలా అనే పేరుగల ఇంకో కుమారుడు ఆమెకు పుట్టాడు. యూదాకు మూడో కుమారుడు పుట్టినప్పుడు, అతడు కజీబులో నివాసం ఉంటున్నాడు.
6 యూదా తన మొదటి కుమారుడైన ఏరుకు భార్యగా ఒక అమ్మాయిని ఏర్పాటు చేశాడు. ఆ అమ్మాయి పేరు తామారు. 7 కానీ ఏరు చాలా చెడ్డపనులు చేశాడు. అతని విషయంలో యెహోవాకు సంతోషం లేదు. అందుచేత యెహోవా అతణ్ణి చంపేశాడు. 8 అప్పుడు యూదా ఏరు సోదరుడైన ఓనానుతో, “పోయి, చనిపోయిన నీ సోదరుని భార్యతో శయనించు. ఆమెకు భర్తలా ఉండు. పిల్లలు పుడితే వారు నీ సోదరుడైన ఏరు పిల్లలుగా పరిగణించబడతారు” అని చెప్పాడు.
9 ఈ సంబంధంవలన కలిగే పిల్లలు తన పిల్లలుగా పరిగణింపబడరని ఓనానుకు తెలుసు. ఓనాను తామారుతో శయనించి, ఇంద్రియమును బయట పడవేశాడు. 10 దీనితో యెహోవాకు కోపము వచ్చి ఆయన ఓనానును చంపేశాడు. 11 అప్పుడు యూదా, “నీవు తిరిగి నీ తండ్రి యింటికి వెళ్లిపో. నా చిన్న కుమారుడు షేలా పెద్దవాడయ్యేంత వరకు నీవు మళ్లీ పెళ్లి చేసుకోకు” అని తన కోడలైన తామారుతో చెప్పాడు. షేలా కూడ తన అన్నల్లాగే చస్తాడేమోనని యూదాకు భయం. అతని కోడలు తామారు తిరిగి తన తండ్రి ఇంటికి వెళ్లిపోయింది.
12 ఆ తర్వాత షూయ కుమార్తె, యూదా భార్య చనిపోయింది. యూదాకు దుఃఖ కాలం తీరిపొయ్యాక, అతడు తన స్నేహితుడు, అదుల్లాము నివాసి హీరాతో కలిసి తిమ్నాతునకు వెళ్లాడు. తన గొర్రెల బొచ్చు కత్తిరించాలని యూదా తిమ్నాతునకు వెళ్లాడు. 13 తామారు తన మామగారు యూదా తన గొర్రెల బొచ్చు కత్తిరించేందుకు తిమ్నాతునకు వస్తున్నాడని తెలుసుకొంది. 14 తామారు ఎప్పుడు విధవరాలి గుడ్డలే ధరించేది. కనుక ఇప్పుడు వేరే వస్త్రాలు ధరించి, నెత్తిమీద ముసుగు వేసుకొంది. అప్పుడు తిమ్నాతునకు దగ్గర్లో ఏనాయిము అనే పట్టణానికి పోయే మార్గంలో కూర్చొంది. యూదా చిన్న కుమారుడు షేల ఇప్పుడు పెద్దవాడయ్యాడని తామారుకు తెలుసు. అయినా గాని ఆమె అతణ్ణి పెళ్లి చేసికొనే ఏర్పాట్లు యూదా చేయటం లేదు.
15 యూదా ఆ మార్గాన ప్రయాణం చేశాడు. అతడు ఆమెను చూశాడు గాని ఆమె వేశ్య అనుకొన్నాడు. (వేశ్యలా ఆమె ముఖం మీద ముసుగు వేసుకొంది.) 16 కనుక యూదా ఆమె దగ్గరకు వెళ్లి, “నన్ను నీతో లైంగింకంగా కలవనీ” అని అడిగాడు. (ఆమె తన కోడలు తామారు అని యూదాకు తెలియదు.)
“అసలు నీవు ఏ మాత్రం ఇస్తావేంటి?” అంది ఆమె.
17 యూదా, “నా మందలోనుంచి ఒక మేక పిల్లను పంపిస్తా” అని జవాబిచ్చాడు.
“సరే, ఒప్పుకొంటాను. కాని నీవు ఆ మేక పిల్లను పంపించేంత వరకు నా దగ్గర ఉంచుకొనేందుకు నీవు యింకేమైన నాకు ఇవ్వాలి సుమా” అని జవాబు చెప్పింది ఆమె.
18 “నేను నీకు మేకపిల్లను పంపిస్తానని రుజువుగా ఉండేందుకు నన్నేమి ఇవ్వమంటావు?” అడిగాడు యూదా.
తామారు, “నీవు నీ ఉత్తరాల మీద ఉపయోగించే నీ ముద్ర, దాని దారం, నీ చేతి కర్ర ఇవ్వు” అని చెప్పింది. యూదా అవన్నీ ఆమెకు ఇచ్చాడు. అప్పుడు యూదా తామారును కూడగా ఆమె గర్భవతి అయ్యింది. 19 తామారు ఇంటికి వెళ్లి, తన ముఖం మీద ముసుగు తీసివేసింది. మరల విధవ వస్త్రాలే ఆమె ధరించింది.
20 యూదా తామారుకు ఇచ్చిన మాట ప్రకారం ఒక మేకను ఇచ్చి తన స్నేహితుడు హీరాను ఏనాయిముకు పంపించాడు. మరియు ఆమె దగ్గర్నుండి ప్రత్యేక ముద్రను, చేతి కర్రను తీసుకొని రమ్మని యూదా అతనితో చెప్పాడు. కానీ హీరాకు ఆమె కనబడలేదు. 21 “ఇక్కడ దారి ప్రక్కగా ఉంటూండే ఆ వేశ్య ఏమయింది?” అని ఏనాయిము దగ్గర కొందరిని అడిగాడు హీరా.
“ఇక్కడ ఎన్నడూ వేశ్య నివసించలేదే” అని వాళ్లు అన్నారు.
22 కనుక యూదా స్నేహితుడు యూదా దగ్గరకు తిరిగి వెళ్లి, “ఆ స్త్రీ నాకు కనబడలేదు. అక్కడ ఎన్నడూ వేశ్య లేదని అక్కడ ఉండేవాళ్లు చెప్పారు” అన్నాడు.
23 అందుచేత యూదా, “ఆ వస్తువులు ఆమె దగ్గరే ఉండనివ్వు. మనుష్యులు నన్ను చూచి నవ్వటం నాకు ఇష్టం లేదు. ఆమెకు మేకను ఇవ్వాలని నేను ప్రయత్నం చేశాను, కానీ ఆమె మనకు కనబడలేదు. అది చాలు” అన్నాడు.
తామారు గర్భవతి
24 మూడు నెలల తర్వాత, “నీ కోడలు తామారు ఒక వేశ్యలా పాపం చేసింది, ఇప్పుడు గర్భవతిగా ఉంది” అని యూదాతో చెప్పారు.
అప్పుడు యూదా, “ఆమెను బయటకు లాగి చంపేసి, ఆమె శరీరాన్ని కాల్చివేయండి” అన్నాడు.
25 తామారును చంపటానికి మనుష్యులు వెళ్లారు. అయితే ఆమె తన మామగారికి ఒక సందేశం పంపింది. “నన్ను గర్భవతిగా చేసినవాడు ఈ వస్తువుల స్వంతదారుడే. (ప్రత్యేక ముద్ర, చేతి కర్ర ఆమె అతనికి చూపించింది.) ఈ వస్తువులు చూడు. ఇవి ఎవరివి? ఈ ముద్ర, దారం ఎవరివి? ఈ చేతి కర్ర ఎవరిది?”
26 వాటిని యూదా గుర్తుపట్టి, “ఆమెదే సరి. నాదే తప్పు. నేను వాగ్దానం చేసిన ప్రకారం నా కుమారుడైన షేలాను నేను ఆమెకు ఇవ్వలేదు” అన్నాడు. యూదా మళ్లీ ఇక ఆమెతో శయనించలేదు.
27 తామారు ప్రసవించే సమయం వచ్చినప్పుడు ఆమెకు కవలలు పుడతారని వారికి తెలిసింది. 28 ఆమె ప్రసవిస్తున్నప్పుడు ఒక శిశువు చేయి బయటకు వచ్చింది. మంత్రసాని ఆ చేతికి ఒక ఎర్ర దారం కట్టి, “ఈ శిశువు ముందు పుట్టాడు” అంది. 29 అయితే ఆ శిశువు తన చేయి లోపలకు లాగేసాడు. అప్పుడు మరో శిశువు ముందు పుట్టాడు. కనుక “మొత్తానికి నీవే ముందు భేదించుకొని పుట్టావన్న మాట” అంది మంత్రసాని. అంచేత వారు పెరెసు[a] అని వానికి పేరు పెట్టారు. 30 తర్వాత రెండో శిశువు పుట్టాడు. చేతికి ఎర్రదారం కట్టబడిన శిశువు వీడు. వారు వాడికి జెరహు అనే పేరు పెట్టారు.
21 “సోదరుడు సోదరుణ్ణి, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. పిల్లలు తమ తల్లి తండ్రులకు ఎదురు తిరిగి వాళ్ళను చంపుతారు. 22 ప్రజలందరూ నా పేరు కారణంగా మిమ్మల్ని ద్వేషిస్తారు. కాని చివరి దాకా సహనంతో ఉన్న వాళ్ళను దేవుడు రక్షిస్తాడు. 23 మిమ్మల్ని ఒక పట్టణంలో హింసిస్తే తప్పించుకొని యింకొక పట్టణానికి వెళ్ళండి. ఇది నిజం. మీరు ఇశ్రాయేలు దేశంలోని పట్టణాలన్ని తిరగక ముందే మనుష్యకుమారుడు వస్తాడు.
24 “విద్యార్థి గురువుకన్నా గొప్పవాడు కాడు. అలాగే సేవకుడు యజమానికన్నా గొప్పవాడు కాడు. 25 విద్యార్థి గురువులా ఉంటే చాలు. అలాగే సేవకుడు యజమానిలా ఉంటే చాలు. ఇంటి యజమానినే బయెల్జెబూలు[a] అని అన్న వాళ్ళు ఆ యింటివాళ్ళను యింకెంత అంటారో కదా!
దేవునికి భయపడుము, జనులకు కాదు
(లూకా 12:2-7)
26 “అందువల్ల వాళ్ళకు భయపడకండి. రహస్యమైనవి బయటపడతాయి. దాచబడినవి నలుగురికి తెలుస్తాయి. 27 నేను రహస్యంగా చెబుతున్న విషయాలను బాహాటంగా యితర్లకు చెప్పండి. మీ చెవుల్లో చెప్పిన విషయాలను యింటి కప్పులపై ఎక్కి ప్రకటించండి.
28 “వాళ్ళు దేహాన్ని చంపగలరు కాని ఆత్మను చంపలేరు. వాళ్ళను గురించి భయపడకండి. శరీరాన్ని, ఆత్మను నరకంలో వేసి నాశనం చెయ్యగల వానికి భయపడండి. 29 ఒక పైసాకు రెండు పిచ్చుకలు అమ్ముతారు కదా. అయినా మీ తండ్రికి తెలియకుండా ఒక్క పిచ్చుక కూడా నేల మీదికి పడదు. 30 మీ తల మీద ఉన్న వెంట్రుకల సంఖ్య కూడా ఆయనకు తెలుసు. 31 అందువలన భయపడకండి. ఎన్ని పిచ్చుకలైనా మీకు సాటి కాలేవు.
నీ విశ్వాసాన్ని గురించి సిగ్గుపడవద్దు
(లూకా 12:8-9)
32 “నన్ను ప్రజల సమక్షంలో అంగీకరించిన ప్రతి వ్యక్తిని పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో అంగీకరిస్తాను. 33 కాని ప్రజల సమక్షంలో నన్ను తిరస్కరించిన వాణ్ణి నేను పరలోకంలో ఉన్న నా తండ్రి సమక్షంలో తిరస్కరిస్తాను.
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(లూకా 12:51-53; 14:26-27)
34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,
‘తండ్రి కుమార్ల మధ్య,
తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)
37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.
నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును
(మార్కు 9:41)
40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
© 1997 Bible League International