Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెకర్యా 1-4

యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.

యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”

నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం

పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)

రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.

అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.

10 అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.

11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.

12 అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.

13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.

14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:

“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15     మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
    నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
    కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16 కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
    మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.

17 “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
    ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
    నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.

నాలుగు కొమ్ములు మరియు నలుగురు పనివారు

18 అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను. 19 నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”

20 తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు. 21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి, వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”

యెరూషలేమును కొలవటం

నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.

“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని అతడు నాకు చెప్పాడు.

అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లిపోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు:

‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది.
    ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’
యెహోవా చెపుతున్నాడు,
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను.
    ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”

దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం

యెహోవా చెపుతున్నాడు,
“త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము!
    అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే.
సీయోను ప్రజలారా! మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరంనుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నాయి.
ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి.
    కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు.
ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది.
    అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
మరియు నేనా ప్రజలను బాధిస్తాను.
    వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు.
బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు.
    కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను. వారు నా ప్రజలకు బానిసలవుతారు.
అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవాయే నన్ను
    పంపినట్టు మీరు తెలుసుకుంటారు.

10 యెహోవా చెపుతున్నాడు:
“సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను.
    మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు
    నా వద్దకు వస్తారు.
పైగా వారు నా ప్రజలవుతారు.
    నేను నీ నగరంలో నివసిస్తాను.”
సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు
    నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.

12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు.
    మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.
13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి!
    యెహోవా తన పవిత్ర నివాసంనుండి వస్తున్నాడు.

ప్రధాన యాజకుడు

పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువకు కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషు మీద చెడు పనులు చేసినట్లు నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”

యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేసుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”

అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు. పిమ్మట యెహోషువకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:

సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
    నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు.
    నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
    నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
కావున యెహోషువా, నీవూ, నీతో ఉన్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
    నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
    అతడు ‘కొమ్మ’ (చిగురు) అని పిలువబడతాడు.
చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
    ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
    నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”

10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
    పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద,
    తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”

దీపస్తంభం-రెండు ఒలీవ చెట్లు

పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.

నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమవైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.

“ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు.

“లేదయ్యా” అని నేను చెప్పాను.

అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవానుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్టబడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”

నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: “నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. 10 సామాన్యంగా ప్రారంభించబడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు, దారం తీసికొని, తయారైన భవనాన్ని తనిఖీచేసి, కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి, అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”

11 పిమ్మట నేను (జెకర్యా) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” 12 నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాలవద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”

13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు.

“లేదయ్యా” అని నేను చెప్పాను.

14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.

ప్రకటన 18

బాబిలోను పతనము

18 ఇది జరిగిన తర్వాత పరలోకం నుండి మరొక దూత దిగి రావటం చూసాను. అతని తేజస్సు భూమిని ప్రకాశింప చేసింది. అతడు బిగ్గరగా యిలా అన్నాడు:

“బాబిలోను మహానగరం
    కూలిపోయింది, కూలిపోయింది.
అది అక్కడ దయ్యాలకు నివాసమైంది.
    ప్రతి దురాత్మకు అది తిరుగులాడు స్థలమైంది.
    ప్రతి ఏవగింపు కలిగించే అపవిత్రమైన పక్షికి
    అది సంచరించు స్థలమైంది.
దేశాలన్నీ దాని వ్యభిచారమనే మద్యాన్ని త్రాగాయి.
దేవుని ఆగ్రహమనే మద్యాన్ని త్రాగి మత్తెక్కి పోయాయి.
    భూరాజులు దాంతో వ్యభిచరించారు. ప్రపంచంలోని వర్తకులు, దాని మితి మీరిన విలాసాలతో ధనవంతులయ్యారు.”

ఆ తదుపరి ఇంకొక స్వరం పరలోకంలో నుండి ఈ విధంగా అనటం విన్నాను:

“నా ప్రజలారా! దానిలో నుండి బయటకు రండి.
    ఎందుకంటే దాని పాపాల్లో మీరు పాలుపంచుకోరు.
అప్పుడు దానికున్న తెగుళ్ళు మీకు రావు.
దాని పాపాలు ఆకాశం అంత ఎత్తుగా పేరుకుపోయాయి.
    దేవునికి దాని నేరాలు జ్ఞాపకం ఉన్నాయి.
అది యిచ్చింది తిరిగి దానికే యివ్వండి.
    అది చేసిన దానికి రెండింతలు దానికి చెల్లించండి.
దాని పాత్రలో రెండింతలు ఘాటుగా ఉన్న మద్యాన్ని పొయ్యండి.
ఆ పట్టణం అనుభవించిన పేరు ప్రతిష్ఠలకు సమానంగా
    అది అనుభవించిన సుఖాలకు సమానంగా దానికి దుఃఖాలు కలిగించి హింసించండి.
అది తన మనస్సులో, ‘నేను రాణిలా సింహాసనంపై కూర్చుంటాను.
    నేను ఎన్నటికీ వితంతువును కాను.
    నేను ఎన్నటికీ దుఃఖించను’ అని తనలో గర్విస్తుంది.
అందువల్ల చావు, దుఃఖము, కరువు,
    తెగులు ఒకేరోజు వచ్చి దాన్ని బాధిస్తాయి.
దానిపై తీర్పు చెప్పే మన ప్రభువైన దేవుడు శక్తివంతుడు
    కనుక దాన్ని మంటల్లో కాల్చి వేస్తాడు.

“దానితో వ్యభిచరించి సుఖాలనుభవించిన భూరాజులు అది మండుతున్నప్పుడు వచ్చిన పొగలు చూసి దానికోసం గుండెలు బాదుకొని దుఃఖిస్తారు. 10 దానికి జరుగుతున్న హింసను చూసి భయపడి దూరంగా నిలబడి,

‘అయ్యో! అయ్యో! మహానగరమా!
    శక్తివంతమైన బాబిలోను నగరమా!
ఒకే ఒక గంటలో నీకు నాశనం వచ్చింది’

అని విలపిస్తారు.

11 “ప్రపంచంలోని వర్తకులు తమ వస్తువులు యిక మీదట కొనేవారు ఎవ్వరూ ఉండరు కనుక తమ నష్టానికి దానిమీద విలపిస్తారు. 12 వీళ్ళు బంగారు, వెండి వస్తువులు, రత్నాలు, ముత్యాలు, సున్నితమైన నార బట్టలు, ఊదారంగు వస్త్రాలు, పట్టు వస్త్రలు, ఎర్రటి రంగుగల వస్త్రాలు, దబ్బచెట్ల పలకలు, దంతంతో, మంచి చెక్కతో, కంచుతో, ఇనుముతో, చలువరాతితో చేసిన అన్ని రకాల వస్తువులు, 13 దాల్చిన చెక్క, ఓమము, అగరుబత్తులు, మంచి అత్తరు, సాంబ్రాణి, ద్రాక్షారసం, ఒలీవ నూనె, మెత్తని పిండి, గోధుమలు, పశువులు, గొర్రెలు, గుర్రాలు, బండ్లు, బానిసలు, మనుష్యుల శరీరాలు, ప్రాణాలు అమ్మేవాళ్ళు. 14 వాళ్ళు,

‘నీవు కోరిన ఫలము దొరకలేదు.
నీ ఐశ్వర్యము, నీ భోగము నశించిపొయ్యాయి.
    అవి మళ్ళీ రావు’

అని అన్నారు.

15 “వస్తువులు అమ్మి ధనం గడించిన వర్తకులు ఆమె అనుభవిస్తున్న హింసను చూసి భయపడి దూరంగా నిలుచుంటారు. వాళ్ళు దుఃఖంతో విలపిస్తారు. 16 వాళ్ళు,

‘అయ్యో! అయ్యో! సున్నితమైన వస్త్రాల్ని,
    ఊదారంగు వస్త్రాల్ని, ఎర్రటి రంగు వస్త్రాల్ని ధరించిన మహానగరమా!
    బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన
    నగలు ధరించిన మహానగరమా!
17 ఒకే ఒక గంటలో నీ ఐశ్వర్యమంతా నశించిపోయిందే!’

అని విలపిస్తారు.

“ప్రతి నావికాధికారి, ఓడలో ప్రయాణం చేసే ప్రతి యాత్రికుడు, నావికులు, సముద్రం ద్వారా తమ జీతం గడించి జీవించే వాళ్ళు అందరూ దూరంగా నిలబడి ఉన్నారు. 18 ఆ పట్టణం కాలుతున్నప్పుడు వచ్చే పొగలను చూసి వాళ్ళు ఆశ్చర్యంతో, ‘ఈ మహానగరమంత గొప్పగా ఏ పట్టణమైనా ఉందా?’ అని అంటారు. 19 వాళ్ళు దుఃఖంతో విలపిస్తూ, దుమ్మును నెత్తిన వేసుకొంటూ,

‘అయ్యో! అయ్యో! మహానగరమా!
సముద్రంలో ఓడ ఉన్న ప్రతి ఒక్కడూ దాని ధనంవల్ల ధనికులయ్యారే!
    ఒకే ఒక గంటలో ఆమె నాశనమయ్యిందే! అని ఏడుస్తారు.
20 పరలోకమా! దాని పతనానికి ఆనందించు!
విశ్వాసులారా! అపొస్తలులారా! ప్రవక్తలారా! ఆనందించండి.
అది మీతో ప్రవర్తించిన విధానానికి దేవుడు దానికి తగిన శిక్ష విధించాడు’”

అని అంటారు.

21 అప్పుడు ఒక శక్తివంతుడైన దూత తిరుగటిరాయి వంటి పెద్దరాయిని ఎత్తి సముద్రంలో పారవేసి ఈ విధంగా అన్నాడు:

“గొప్ప శక్తితో బాబిలోను మహానగరం క్రిందికి పారవేయబడుతుంది.
    అది మళ్ళీ కనిపించదు.
22 వీణను వాయించేవాళ్ళ సంగీతం, యితర వాయిద్యాలు వాయించేవాళ్ళ సంగీతం, పిల్లనగ్రోవి ఊదేవాళ్ళ సంగీతం, బూర ఊదేవాళ్ళ సంగీతం, నీలో మళ్ళీ వినిపించదు.
పని చేయగలవాడు నీలో మళ్ళీ కనిపించడు.
తిరుగటి రాయి శబ్దం మళ్ళీ నీలో వినిపించదు.
23 దీపపు కాంతి నీలో మళ్ళీ ప్రకాశించదు.
కొత్త దంపతుల మాటలు నీలో మళ్ళీ వినిపించవు.
నీ వర్తకులు ప్రపంచంలో గొప్పగా ఉన్నారు.
నీ గారడీలతో దేశాలు తప్పుదారి పట్టాయి.
24 ఆ పట్టణంలో ప్రవక్తల రక్తం, పవిత్రుల రక్తం కనిపించింది.
    ప్రపంచంలో వధింపబడిన వాళ్ళందరి రక్తం, ఆ పట్టణంలో కనిపించింది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International