Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆమోసు 4-6

విలాసవంతులైన స్త్రీలు

సమరయ (షోమ్రోను) కొండమీదగల బాషాను ఆవుల్లారా[a] నేను చెప్పేది వినండి. మీరు పేద ప్రజలను గాయపరుస్తారు. ఆ పేద ప్రజానీకాన్ని మీరు అణగదొక్కుతారు. “మేము తాగటానికి ఏదైనా తీసికొని రండి!” అని మీరు మీ భర్తలకు చెపుతారు.

నా ప్రభువైన యెహోవా ఒక వాగ్దానం చేసాడు. మీకు కష్టాలు వస్తాయని ఆయన తన పవిత్రత సాక్షిగా చెప్పాడు. శత్రు ప్రజలు మీకు కొంకెలు తగిలించి లాగుతారు. మీ పిల్లను లాక్కుపోవటానికి చేపలు పట్టే గాలాలను ఉపయోగిస్తారు. మీ నగరం నాశనం చేయబడుతుంది. మీ స్త్రీలలో ప్రతి ఒక్కరూ గోడ కంతలగుండా నగరంనుండి బయటకు పోతారు. చనిపోయిన మీ పిల్లలను గుట్టమీదికి విసరివేస్తారు.

యెహోవా ఇది చెపుతున్నాడు: “బేతేలుకు వెళ్లి పాపం చేయండి! గిల్గాలుకు వెళ్లి మరింత పాపం చేయండి. మీ బలులను ఉదయ వేళల్లో ఇవ్వండి. మీ పంటలో పదవవంతు మూడు రోజులకొకసారి తీసికొని రండి. పులియబెట్టిన పదార్థాన్ని స్తోత్రార్పణగా ఇవ్వండి. స్వేచ్ఛార్పణల విషయం అందరికీ చెప్పండి. ఇశ్రాయేలూ, నీవు ఈ పనులు చేయటానికి ఇష్టపడతావు. కావున నీవు వెళ్ళి వాటిని చేయి. యెహోవా చెప్పేది ఇదే.

“నిన్ను నా వద్దకు వచ్చేలా చేయటానికి నేను చాలా పనులు చేశాను. నేను, మీరు తినటానికి ఏమీ ఆహారం ఇవ్వలేదు. మీ నగరాలలో దేనిలోనూ ఆహారం ఇవ్వలేదు. అయినా నీవు నా వద్దకు తిరిగి రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“నేను వర్షాన్ని కూడా నిలుపు చేశాను. పైగా అది పంట కోతకు మూడు నెలల ముందు సమయం. అందువల్ల పంటలు పండలేదు. పిమ్మట ఒక నగరంలో వర్షం కురిపించి, మరో నగరంలో వర్షం లేకుండా చేశాను. దేశంలో ఒక భాగంలో వర్షం పడింది. కాని దేశంలో మరొక ప్రాంతం వర్షాలు లేక పూర్తిగా ఎండిపోయింది. కావున రెండు మూడు నగరాల ప్రజలు తడబడుతూ నీళ్లకోసం మరొక నగరానికి వెళ్లారు. కాని అక్కడ ప్రతి ఒక్కరికీ సరిపోయేటంత నీరు లేదు. అయినా మీరు సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

“ఎండ వేడిమివల్ల, తెగుళ్లవల్ల మీ పంటలు పాడైపోయేలా చేశాను. మీ ఉద్యానవనాలను, ద్రాక్షా తోటలను నేను నాశనం చేశాను. మీ అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను మిడుతలు తినివేశాయి. కాని మీరు మాత్రం సహాయం కొరకు నా వద్దకు రాలేదు. యెహోవా చెప్పేది ఇదే.

10 “ఈజిప్టు విషయంలో చేసినట్లు నేను మీ మీదికి రోగాలను పంపించాను. మీ యువకులను నేను కత్తులతో సంహరించాను. మీ గుర్రాలను నేను తీసుకున్నాను. మీ స్థావరం కుళ్లిన శవాలతో దుర్గంధ పూరితమయ్యేలా చేశాను. కాని, మీరు సహాయం కొరకు నావద్దకు తిరిగి రాలేదు.” యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

11 “సొదొమ, గొమొర్రా నగరాలను నేను నాశనం చేసినట్లు నేను నిన్ను నాశనం చేశాను. ఆ నగరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పొయ్యిలో నుండి లాగబడి కాలిన కట్టెలా మీరున్నారు. కాని, మీరు సహాయంకొరకు నా వద్దకు రాలేదు” అని యెహోవా చెపుతున్నాడు.

12 “కావున ఇశ్రాయేలూ, మీకు నేనీ విషయాలు కలుగజేస్తాను. ఇది మీకు నేను చేస్తాను. ఇశ్రాయేలూ, మీ దేవుని కలుసుకోటానికి సిద్ధమవ్వు.”

13 నేనెవరిని? పర్వతాలను ఏర్పాటు చేసింది నేనే.
    మీ మనస్సులను[b] సృష్టించింది నేనే.
    ఎలా మాట్లాడాలో ప్రజలకు నేర్పింది నేనే.
సంధ్యవేళను చీకటిగా మార్చేదీ నేనే. భూమిపైగల పర్వతాలపై నేను నడుస్తాను.
    ఇట్టి నేను ఎవరిని?
    సర్వశక్తిమంతుడగు దేవుడను. నా పేరు యెహోవా.

ఇశ్రాయేలు కొరకు విషాద గీతిక

ఇశ్రాయేలు ప్రజలారా, ఈ పాట వినండి. ఈ విలాపగీతం మిమ్మల్ని గురించినదే.

ఇశ్రాయేలు కన్యక పతనమయింది.
    ఆమె ఇక లేవలేదు.
మట్టిలోపడి ఆమె ఒంటరిగా వదిలి వేయబడింది.
    ఆమెను లేవనెత్తే వ్యక్తే లేడు.

ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“వెయ్యిమంది సైనికులతో నగరం వదిలివెళ్ళే
    అధికారులు కేవలం వందమంది మనుష్యులతో తిరిగి వస్తారు
వందమంది సైనికులతో నగరం వదలి వెళ్లే
    అధికారులు కేవలం పదిమంది మనుష్యులతో తిరిగి వస్తారు.”

తిరిగి రమ్మని ఇశ్రాయేలును యెహోవా ప్రోత్సహించుట.

ఇశ్రాయేలీయులతో యెహోవా ఇలా చెపుతున్నాడు:
“నన్ను వెదుక్కుంటూ వచ్చి జీవించండి.
    కాని బేతేలులో వెదకవద్దు.
గిల్గాలుకు వెళ్లవద్దు.
    సరిహద్దును దాటి బెయేర్షెబాకు వెళ్లకండి.
గిల్గాలు ప్రజలు బందీలుగా తీసుకుపోబడతారు.
    బేతేలు నాశనం చేయబడుతుంది.
యెహోవా దరిచేరి జీవించండి.
    మీరు యెహోవా వద్దకు వెళ్లకపోతే యోసేపు (పది వంశాలవారు) ఇంటిమీద నిప్పు పడుతుంది.
    ఆ అగ్ని యోసేపు ఇంటిని దగ్ధం చేస్తుంది. బేతేలులో చెలరేగిన ఆ అగ్నిని ఎవ్వరూ ఆపలేరు.
7-9 మీరు యెహోవా కొరకు చూడండి.
    సప్త ఋషీ నక్షత్రాలను, మృగశీర్ష నక్షత్రాన్ని సృష్టించింది ఆయనే.
చీకటిని ఉదయ కాంతిగా ఆయన మార్చుతాడు.
    పగటిని చీకటిగా ఆయన మార్చుతాడు.
ఆయన సముద్ర జలాలను బయట నేలమీద కుమ్మరిస్తాడు.
    ఆయన పేరు యెహోవా!
ఒక బలమైన నగరాన్ని ఆయన సురక్షితంగా ఉంచుతాడు.
    మరో బలమైన నగరం నాశనమయ్యేలా ఆయన చేస్తాడు.”

ఇశ్రాయేలీయులు చేసిన చెడుపనులు

ప్రజలారా! ఇది మీకు తగని పని. మీరు మంచిని విషంగా మార్చుతారు.
    న్యాయాన్ని హత్యచేసి నేలకు కూలేలా చేస్తారు.
10 ప్రవక్తలు బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి, ప్రజలు చేసే చెడ్డపనులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. అందుచేత ప్రజలా ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
    ప్రవక్తలు మంచివైన సామాన్య సత్యాలను బోధిస్తారు. అందుచే ప్రజలు ఆ ప్రవక్తలను అసహ్యించుకుంటారు.
11 మీరు ప్రజలనుండి అన్యాయంగా పన్నులు వసూలు చేస్తారు.
    మీరు పేదవారినుండి గోధుమ మోపులను తీసుకుంటారు.
ఈ ధనంతో మీరు చెక్కిన రాళ్లతో అందమైన ఇండ్లు కట్టుకుంటారు.
    కాని మీరు ఆ ఇండ్లలో నివసించరు.
మీరు అందమైన ద్రాక్షాతోటలను నాటుతారు.
    కాని మీరు వాటినుండి ద్రాక్షారసం తాగరు.
12 ఎందుకంటే మీరు చేసిన అనేక పాపాలగురించి నాకు తెలుసు.
    మీరు నిజంగా కొన్ని ఘోరమైన పాపాలు చేశారు.
మంచిపనులు చేసే ప్రజలను మీరు బాధించారు.
    చెడు చేయటానికి మీరు డబ్బు తీసుకుంటారు.
    బహిరంగ ప్రదేశాలలో పేదవారిని మీరు నెట్టివేస్తారు.
13 ఆ సమయంలో తెలివిగల బోధకులు ఊరుకుంటారు.
    ఎందుకంటే అది చెడు కాలం గనుక.
14 దేవుడు మీతోనే ఉన్నట్లు మీరు చెపుతారు.
    అందుచే మీరు మంచిపనులు చేయాలేగాని చెడు చేయరాదు.
అప్పుడు మీరు బతుకుతారు.
    సర్వశక్తుడగు యెహోవా నిజంగా మీతోవుంటాడు.
15 చెడును ద్వేషించు. మంచిని ప్రేమించు.
    న్యాయస్థానాలలో న్యాయాన్ని పునరుద్ధరించండి.
అప్పుడు యోసేపు వంశంలో మిగిలినవారిమీద దేవుడు,
    సర్వశక్తిమంతుడు అయిన యెహోవా కనికరం కలిగి ఉండవచ్చు.

మిక్కిలి దుఃఖకాలం రాబోవుట

16 అందువలన ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన దేవుడు ఈ విషయం చెపుతున్నాడు:
“బహిరంగ ప్రదేశాలన్నిటిలోనూ ప్రజలు విలపిస్తారు.
    ప్రజలు వీధులలో రోదిస్తారు.
    ఏడ్చేటందుకు ప్రజలు కిరాయి మనుష్యులను నియమిస్తారు.
17 ద్రాక్షాతోటలన్నిటిలో ప్రజలు విలపిస్తారు.
    ఎందుకనగా నేను అటుగా వెళ్లి మిమ్మల్ని శిక్షిస్తాను.” అని
    యెహోవా చెపుతున్నాడు.
18 మీలో కొంతమంది
    యెహోవాయొక్క ప్రత్యేక తీర్పు రోజును చూడగోరుతారు.
అ రోజును మీరెందుకు చూడగోరుతున్నారు?
    యెహోవా యొక్క ఆ ప్రత్యేక దినము మీకు చీకటిని తెస్తుందేగాని, వెలుగును కాదు!
19 ఒక సింహపు బారినుండి తప్పించుకుపోయే వ్యక్తిపై
    ఎలుగుబంటి మీదపడినట్లు మీరుంటారు!
ఇంటిలోకి వెళ్లి, గోడమీద చేయి వేయగా
    పాము కరచినవాని మాదిరి మీరుంటారు!
20 కావున యెహోవాయొక్క ప్రత్యేక దినము
    చీకటిని తెస్తుంది గాని, వెలుగును కాదు. అది దుఃఖ సమయంగాని, సంతోష సమయం కాదు!
    ఆ రోజు మీకు వెలుగు ఏమాత్రమూ లేని కారు చీకటిగా ఉంటుంది.

ఇశ్రాయేలీయుల ఆరాధనను యెహోవా తిరస్కరించటం

21 “మీ పవిత్ర దినాలను నేను ద్వేషిస్తాను!
    నేను వాటిని అంగీకరించను!
    మీ ప్రార్థనా సమావేశాలపట్ల నేను సంతోషంగా ఉండను!
22 మీరు నాకు దహనబలులు అర్పించినా, ధాన్యార్పణలు పెట్టినా,
    నేను వాటిని స్వీకరించను!
మీరు సమాధాన బలులుగా అర్పించే బలిసిన జంతువులవైపు
    నేను కనీసం చూడనైనా చూడను.
23 మీరు బిగ్గరగా పాడే పాటలను ఇక్కడనుండి తొలగించండి.
    మీ స్వరమండలమునుండి వచ్చే సంగీతాన్ని నేను వినను.
24 మీ దేశమంతటా న్యాయం నీళ్లలా ప్రవహించేలా మీరు చేయాలి.
    మంచితనాన్ని ఎన్నడూ ఎండని నీటి వాగువలె ప్రవహించేలా చేయండి.
25 ఇశ్రాయేలూ, నలుబది సంవత్సరాలపాటు
    నీవు ఎడారిలో నాకు బలులు, అర్పణలు సమర్పించావు.
26 కాని మీరు మీ రాజుయొక్క సక్కూతు విగ్రహాలను, కైవాను[c] విగ్రహాలను కూడ తీసికొని వెళ్లారు.
    పైగా మీకై మీరు ఆ నక్షత్రాన్ని మీ దేవునిగా చేసుకున్నారు.
27 కావున దమస్కు (డెమాస్కస్) పట్టణం అవతలకి మిమ్మల్ని బందీలుగా పట్టుకుపోయేలా చేస్తాను.”
    దేవుడును, సర్వశక్తిమంతుడును
    అయిన యెహోవా ఆ విషయాలు చెపుతున్నాడు.

ఇశ్రాయేలు నుండి మంచిరోజులు తొలగింపబడటం

సీయోను వాసులారా, మీలో కొంతమంది చాలా సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు.
    సమరయ పర్వతంమీద ఉన్న ప్రజలలో కొంతమంది సురక్షితంగా ఉన్నట్లు తలంచుచున్నారు.
కాని మీకు చాలా దుఃఖము కలుగుతుంది. మీరు ప్రాముఖ్యమైన జనాంగపు ముఖ్య నాయకులు.
    ఇశ్రాయేలు ప్రజలు సలహా కొరకు మీ వద్దకు వస్తారు.
మీరు వెళ్లి కల్నేలో[d] చూడండి.
    అక్కడనుండి పెద్ద నగరమైన హమాతుకి[e] వెళ్లండి.
    ఫిలిష్తీయుల నగరమైన గాతుకు వెళ్లండి.
ఆ రాజ్యాలకంటే మీరేమైనా గొప్పవారా?
    లేదు. మీ దానికంటే వారి రాజ్యాలు విశాలమైనవి.
శిక్షా దినము బహు దూరాన ఉన్నదనుకొని,
    దౌర్జన్య పరిపాలనకు దగ్గరవుతున్నారు.
కాని మీరు అన్ని సుఖాలు అనుభవిస్తారు.
    మీరు దంతపు మంచాలపై పడుకుంటారు.
మీ పాన్పులపై మీరు చాచుకొని పడుకుంటారు. మందలోని మంచి లేత గొర్రె పిల్లలను,
    పశువులశాలలోని మంచి చిన్న గిత్త దూడలను మీరు తింటారు.
మీరు స్వరమండలాలను వాయిస్తారు.
    దావీదువలె మీరు కనిపెట్టిన వాద్య విశేషాలపై సాధన చేస్తారు.
చిత్రమైన గిన్నెల్లో మీరు ద్రాక్షారసం తాగుతారు.
    మీరు శ్రేష్ఠమైన పరిమళ తైలాలు వాడతారు.
యోసేపు వంశం నాశనమవుతూ
    ఉందని కూడా మీరు కలవరం చెందరు.

ఆ ప్రజలు వారి పాన్పులపైన చాచుకొని పడుకున్నారు. కాని వారి మంచి రోజులు అంతమవుతాయి. వారు బందీలవలె అన్యదేశాలకు తీసుకొనిపోబడతారు. ముందుగా అలా పట్టుకుపోబడే వారిలో ఈ ప్రజలు వుంటారు. ప్రభువైన యెహోవా ఈ ప్రమాణం చేశాడు. దేవుడును, సర్వ శక్తిమంతుడును అయిన యెహోవా తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

“యాకోబుకు గర్వకారణమైన వస్తువులను నేను అసహ్యించుకుంటాను.
    అతని బలమైన బురుజులను నేను అసహ్యించుకుంటాను.
అందుచేత ‘శత్రువు’ నగరాన్ని,
    దానిలోని ప్రతి వస్తువును తీసుకునేలా చేస్తాను.”

ప్రాణంతో మిగిలే ఇశ్రాయేలీయులు తక్కువ

ఆ సమయంలో ఒకానొక ఇంట్లో పదిమంది జీవించియుండవచ్చు. ఆ ఇంటిలో మరి కొంతమంది మరణించవచ్చు. 10 ఒక బంధువు ఆ శవాన్ని బయటకు తీసికొనిపోయి దహనం చేయవచ్చు. ఆ బంధువు ఇంటినుంచి ఎముకలు తేవటానికి వెళ్తాడు. ఇంటిలో దాగిన ఏ వ్యక్తినైనా ప్రజలు పిలిచి, “నీ వద్ద ఇంకా ఏమైనా శవాలు మిగిలియా?” అని అడుగుతారు.

ఆ వ్యక్తి, “లేవు …” అని సమాధానమిస్తాడు.

అప్పుడా వ్యక్తియొక్క బంధువు ఇలా అంటాడు: “నిశ్శబ్దం! మనం యెహోవా మాట ఎత్తకూడదు.”

11 చూడు, దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇవ్వగా,
    పెద్ద ఇండ్లు ముక్కలుగా పగిలిపోతాయి.
    చిన్న ఇండ్లు చిన్న ముక్కలైపోతాయి.
12 గుర్రాలు బండలపై పరుగిడతాయా?
    లేదు! ప్రజలు ఆవులను నేల దున్నటానికి వినియోగిస్తారా?
అవును! కాని మీరు అన్నిటినీ తారుమారు చేస్తారు.
    మీరు మంచిని, న్యాయాన్ని విషంగా మార్చారు.
13 మీరు లో-దెబారులో సుఖంగా ఉన్నారు.
    “మేము కర్నయీమును మా స్వశక్తిచే తెచ్చుకున్నాం” అని మీరంటారు.

14 “కాని ఇశ్రాయేలూ, నేను మీ మీదికి ఒక దేశాన్ని రప్పిస్తాను. ఆ రాజ్యం మీకు కష్టాలు తెచ్చిపెడుతుంది. లేబో-హమాతు నుండి అరాబా వాగువరకూ మీ అందరికీ కష్టాలు వస్తాయి.” దేవుడును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

ప్రకటన 7

దేవుని సేవకులు రక్షింపబడతారు

ఇది జరిగిన తర్వాత భూమి నాలుగు మూలలా నలుగురు దేవదూతలు నిలబడి ఉండటం చూసాను. వాళ్ళు భూమ్మీద, సముద్రం మీద, చెట్ల మీద గాలి వీయకుండా భూమి యొక్క నలుదిశలనుండి వీచే గాలిని పట్టుకొన్నారు. అతడు వారిని పిలిచాడు. ఈ నలుగురి దూతలకు భూమికి, సముద్రానికి హాని చేయగల శక్తి ఉంది. మరొక దూత తూర్పునుండి రావటం చూసాను. అతని దగ్గర చిరంజీవి అయిన దేవుని ముద్ర ఉంది. అతడు బిగ్గరగా ఆ నలుగురి దూతలతో, “దేవుని సేవకుల నొసళ్ళపై ముద్ర వేసే వరకు, భూమికి గాని, సముద్రానికి గాని, చెట్లకు గాని హాని కలిగించకండి” అని అన్నాడు.

ఆ తర్వాత ముద్రలు వేయబడ్డవారి సంఖ్య నాకు వినబడింది. వాళ్ళ సంఖ్య మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేలు. వీళ్ళందరు ఇశ్రాయేలు జనాంగం, అన్ని గోత్రాలకు చెందిన వాళ్ళు.

యూదా గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

రూబేను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

గాదు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

ఆషేరు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

నఫ్తాలి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

మనష్షే గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

షిమ్యోను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

లేవి గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

ఇశ్శాఖారు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

జెబూలూను గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

యోసేపు గోత్రం నుండి పన్నెండు వేలమందికి,

బెన్యామీను గోత్రం నుండి పన్నెండు వేలమందికి ముద్ర వేయబడింది.

ఒక పెద్ద ప్రజల గుంపు

దీని తర్వాత ఎవ్వరూ లెక్క వెయ్యలేని ఒక పెద్ద ప్రజల గుంపు నా ముందు కనిపించింది. వాళ్ళలో ప్రతి దేశానికి చెందినవాళ్ళు ఉన్నారు. ప్రతి భాషకు చెందినవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెల్లటి దుస్తులు వేసుకొని, చేతుల్లో ఖర్జూర మట్టలు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు, గొఱ్ఱెపిల్ల ముందు నిలబడి ఉండటం నాకు కనిపించింది. 10 వాళ్ళందరు, “సింహాసనంపై కూర్చున్న మన దేవునికి, గొఱ్ఱెపిల్లకు రక్షణ చెందుగాక!” అని బిగ్గరగా అన్నారు.

11 సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ నాలుగు ప్రాణుల చుట్టూ దేవదూతలు నిలబడి ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు సాష్టాంగపడి దేవుణ్ణి స్తుతించటం మొదలు పెట్టారు. 12 “ఆమేన్! మన దేవుణ్ణి స్తుతించుదాం! ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొందాం. ఆయనలో తేజస్సు, జ్ఞానము, గౌరవము, అధికారము, శక్తి చిరకాలం ఉండుగాక! ఆమేన్!”

13 పెద్దల్లో ఒకడు నాతో, “తెల్లటి దుస్తులు వేసుకొన్న వాళ్ళెవరు? ఎక్కడి నుండి వచ్చారు?” అని అడిగాడు.

14 “అయ్యా! మీకే తెలియాలి!” అని నేను సమాధానం చెప్పాను.

“మహా శ్రమలనుండి వచ్చినవాళ్ళు వీళ్ళే. తమ దుస్తుల్ని గొఱ్ఱెపిల్ల రక్తంలో ఉతికి శుభ్రం చేసుకొన్నారు. 15 అందువల్ల వాళ్ళు దేవుని సింహాసనం ముందున్నారు. రాత్రింబగళ్ళు ఆయన మందిరంలో ఉండి ఆయన సేవ చేస్తారు. ఆ సింహాసనంపై కూర్చొన్నవాడు వాళ్ళందరిపై తన గుడారం కప్పుతాడు. 16 వాళ్ళకిక మీదట ఆకలి కలుగదు. దాహం కలుగదు. సూర్యుడు తన ఎండతో వాళ్ళను మాడ్చడు. వాళ్ళకు ఏ వేడీ తగులదు. 17 సింహాసనంపై కూర్చొన్న గొఱ్ఱెపిల్ల వాళ్ళ కాపరిగా ఉంటాడు. ఆయన సజీవమైన నీటి ఊటల దగ్గరకు వాళ్ళను పిలుచుకు వెళతాడు. దేవుడు వాళ్ళ కళ్ళనుండి కారే ప్రతి కన్నీటి బొట్టును తుడిచి వేస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International