Old/New Testament
ఒడంబడిక పెట్టెను తిరిగి తీసుకొని రావటం
13 దావీదు తన సైన్యంలోని సేనాధిపతులతో మాట్లాడాడడు. అతడు శతదళాధిపతులతోను, సహస్రదళాధిపతులతోను మాట్లాడాడు. 2 పిమ్మట దావీదు ఇశ్రాయేలు ప్రజలందరినీ సమావేశపర్చాడు. అతడు వారికి ఇలా చెప్పాడు: “మీ అందరికీ ఇది మంచిదనిపించితే, ఇది యెహోవా సంకల్పమే అయితే మనం ఇప్పుడు ఇశ్రాయేలులో మన సోదరులందరికీ ఒక వర్తమానం పంపుదాము. ఈ వర్తమానాన్ని మన సోదరులతో పాటు వారి పట్టణాలలోను, పొలాలలోను నివసిస్తున్న యాజకులకు, లేవీయులకు కూడ అందజేద్దాము. వారందరినీ వచ్చి మనల్ని కలవమని వర్తమానం పంపండి. 3 ఒడంబడిక పెట్టెను మనం యెరూషలేముకు తీసుకొనివద్దాము. సౌలు రాజుగా వున్నన్నాళ్ళూ ఒడంబడిక పెట్టెను మనం అశ్రద్ధ చేశాము.” 4 దావీదు చెప్పిన విషయం సరియైనదని గుర్తించి, ఇశ్రాయేలు ప్రజలంతా అతని సూచనను అంగీకరించారు.
5 కావున ఈజిప్టులోని షీహోరు నది మొదలు లెబోహమాతు పట్టణం వరకుగల ఇశ్రాయేలీయులందరినీ దావీదు సమావేశపర్చాడు. ఒడంబడిక పెట్టెను కిర్యత్యారీము పట్టణం నుండి తిరిగి తెచ్చే నిమిత్తం వారంతా ఒక చోటికి పిలవబడ్డారు. 6 దావీదు మరియు అతనితో వున్న ఇశ్రాయేలీయులు కలిసి యూదాలోని బాలా పట్టణానికి వెళ్లారు. (బాలా అనేది కిర్యత్యారీముకు మరో పేరు.) ఒడంబడిక పెట్టెను బయటకు తేవటానికి వారక్కడికి వెళ్లారు. ఒడంబడిక పెట్టె అనేది యెహోవా దేవుని పవిత్రపెట్టె. యెహోవా కెరూబుల మధ్య ఆసీనుడై వుంటాడు. ఈ పెట్టె యెహోవా పేరుతో పిలవబడుతుంది.
7 ఒడంబడిక పెట్టెను ప్రజలు అబీనాదాబు ఇంటి నుండి బయటకు తీసారు. వారు దానిని ఒక కొత్త బండిమీద పెట్టారు. ఉజ్జా, అహ్యో అనేవారు బండిని తోలారు.
8 దావీదు, ఇశ్రాయేలు ప్రజలు దేవుని ముందు తమ శక్తికొలది భక్తి శ్రద్ధలతో ఉత్సవం చేస్తున్నారు. వారు భక్తిగీతాలు పాడుతూ, తంబుర, సితారాలను వాయిస్తూ, తాళాలు మ్రోగిస్తూ, మద్దెలలు వాయిస్తూ, బూరలు ఊదుతూ వేడుక చేస్తున్నారు.
9 వారు కీదోను నూర్పిడి కళ్ళం వద్దకు వచ్చారు. అక్కడికి రాగానే బండిని లాగే ఎద్దులు కాళ్లు జారి తడబడ్డాయి. దానితో బండిమీద ఉన్న ఒడంబడిక పెట్టె ఇంచుమించు క్రిందపడినంత పని అయ్యింది. అప్పుడు ఉజ్జా తనచేయి చాపి పెట్టెను పట్టుకోబోయాడు. 10 ఉజ్జా పట్ల దేవునికి చాలా కోపం వచ్చింది. ఉజ్జా పెట్టెను ముట్టుకున్న నేరానికి దేవుడు అతనిని చంపివేసాడు. ఉజ్జా దేవుని ముందే పడి చనిపోయాడు. 11 ఉజ్జా పట్ల యెహోవా కోపగించినందుకు దావీదు కలత చెందాడు. అప్పటినుండి ఇప్పటివరకు ఆ ప్రదేశం “పెరెజ్ ఉజ్జా”[a] అని పిలవబడుతూ వుంది.
12 ఆ రోజు దావీదు దేవునికి భయపడ్డాడు. “ఒడంబడిక పెట్టెను నా వద్దకు ఏ విధంగా తీసుకొని వెళ్లగలను?” అని అనుకున్నాడు. 13 కావున దావీదు ఒడంబడిక పెట్టెను తనతో దావీదు నగరానికి తీసుకొని వెళ్లలేదు. ఒడంబడిక పెట్టెను ఓబేదెదోము ఇంటివద్ద వదిలిపెట్టాడు. ఓబేదెదోము గాతు నగరంవాడు. 14 మూడు నెలల పాటు ఒడంబడిక పెట్టె ఓబేదెదోము ఇంటిలో అతని ఇంటివారి సంరక్షణలో వుంది. యెహోవా ఓబేదెదోము కుటుంబం వారిని, అతను కలిగివున్న ప్రతి దానిని దీవించాడు.
దావీదు రాజ్య విస్తరణ
14 తూరు నగర రాజు పేరు హీరాము. దావీదు వద్దకు హీరాము దూతలను పంపాడు. హీరాము దేవదారు కలపను, రాళ్లు చెక్కే వాస్తు శిల్పులను, వడ్రంగులను దావీదు వద్దకు పంపాడు. దావీదుకు ఒక భవనం నిర్మించటానికి హీరాము వారిని పంపాడు. 2 యెహోవా నిజంగానే తనను ఇశ్రాయేలుకు రాజుగా చేసినట్లు దావీదు అప్పుడు గుర్తించాడు. యెహోవా దావీదును, ఇశ్రాయేలు ప్రజలను బాగా ప్రేమించాడు. అందువల్ల దేవుడు దావీదు రాజ్యాన్ని విస్తరించి, బలమైన రాజ్యంగా రూపొందించాడు.
3 యెరూషలేము నగరంలో దావీదు చాలా మంది స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. అతనికి చాలామంది కొడుకులు, కూతుళ్లు కలిగారు. 4 యెరూషలోములో దావీదుకు పుట్టిన పిల్లల పేర్లు ఏవనగా: షమ్మూయ, షోబాబు, నాతాను, సొలొమోను, 5 ఇభారు, ఎలీషూవ, ఎల్పాలెటు, 6 నోగహు, నెపెగు, యాఫీయ, 7 ఎలీషామా, బెయెల్యెదా మరియు ఎలీపెలెటు.
దావీదు ఫిలిష్తీయులను ఓడించటం
8 దావీదు ఇశ్రాయేలు రాజుగా అభిషిక్తుడయినట్లు ఫిలిష్తీయులు విన్నారు. కావున ఫిలిష్తీయులంతా దావీదును వెదుక్కుంటూ పోయారు. ఆ విషయం దావీదు విని వారిని ఎదుర్కోవటానికి వెళ్లాడు. 9 ఫిలిష్తీయులు రెఫాయీము లోయలో నివసిస్తున్న వారిపై దాడిచేసి, వారిని దోచుకున్నారు. 10 అప్పుడు దావీదు దేవుని ప్రార్థించి, “దేవా, నేను ఫిలిష్తీయులతో యుద్ధం చేయనా? వారిని ఓడించేలా నీవు నాకు సహాయం చేస్తావా?” అని అడిగాడు.
యెహోవా అందుకు సమాధానంగా, “వెళ్లు, ఫిలిష్తీయులను నీవు ఓడించేలా నేను చేస్తాను” అని చెప్పాడు.
11 తరువాత దావీదు, అతని మనుష్యులు బయల్పెరాజీము పట్టణానికి వెళ్లారు. అక్కడ వారు ఫిలిష్తీయులను ఓడించారు. అప్పుడు దావీదు, “తెగిన ఆనకట్టలో నుండి నీరు ఉరుకులు పరుగులతో ప్రవహించి పోయేలా, దేవుడు నా శత్రువులను నానుండి చెల్లా చెదురు చేశాడు! దేవుడు ఈ కార్యం నాచేత చేయించాడు” అని అన్నాడు. అందువల్లనే ఆ ప్రదేశానికి బయల్పెరాజీము[b] అని పేరు పెట్టబడింది. 12 ఫిలిష్తీయులు వారి విగ్రహాలను బయల్పెరాజీములో వదిలి పెట్టిపోయారు. ఆ విగ్రహాలన్నిటినీ తగులబెట్టమని దావీదు తన ప్రజలకు ఆజ్ఞయిచ్చాడు.
ఫిలిష్తీయులపై మరో విజయం
13 రెఫాయీము లోయలో నివసిస్తున్న ప్రజలపై ఫిలిష్తీయులు మళ్ళీ దాడి చేశారు. 14 దావీదు మరల దేవుని ప్రార్థించాడు. దావీదు ప్రార్థనను దేవుడు ఆలకించాడు. యెహోవా ఇలా అన్నాడు: “దావీదూ, నీవు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నప్పుడు కొండమీద నీవు వారి ముందుకు పోవద్దు. దానికి బదులు నీవు వారిని చుట్టుముట్టి వెళ్లు. కంబళి చెట్లు వున్న చోటున దాగివుండు. 15 ఒక కాపలాదారుని చెట్ల మీద కూర్చుండబెట్టు. ఆ చెట్ల క్రింద నుండి వాళ్లు నడిచివెళ్లే అడుగుల చప్పుడు అతడు వినగానే నీవు ఫిలిష్తీయులను ఎదిరించు. నేను నీకు ముందుగా వెళ్లి ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడిస్తాను!” 16 దేవుడు చెప్పిన రీతిగా దావీదు చేసాడు. ఆ విధంగా దావీదు, అతని మనుష్యులు ఫిలిష్తీయుల సైన్యాన్ని ఓడించారు. గిబియోను పట్టణం నుండి గాజెరు వరకు వారు ఫిలిష్తీయుల సైనికులను చంపివేసారు. 17 అప్పుడు దావీదు అన్ని దేశాలలోను పేరు పొందాడు. వివిధ రాజ్యాల వారు దావీదును చూచి భయపడేలా దేవుడు చేశాడు.
ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట
15 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. 2 “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను సేవించడానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.
3 తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు. 4 అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.
5 కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.
6 మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.
7 గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.
8 ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.
9 హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.
10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.
దావీదు యాజకులతో, లేవీయులతో సంప్రదించటం
11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు. 12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి. 13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”
14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు. 15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.
గాయకులు
16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.
17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు. 18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.
19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు. 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి. 21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని. 22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.
23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.
25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు. 26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు. 27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.
28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్ములు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.
29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.
యేసు మరియు ఆయన సోదరులు
7 ఇది జరిగిన తర్వాత, యేసు గలిలయలో మాత్రమే పర్యటన చేసాడు. యూదులు ఆయన ప్రాణం తీయాలనుకోవటం వలన ఆయన కావాలనే యూదయలో పర్యటన చెయ్యలేదు. 2 యూదుల పర్ణశాలల పండుగ దగ్గరకు వచ్చింది. 3 యేసు సోదరులు యేసుతో, “నీవీ ప్రాంతం వదిలి యూదయకు వెళ్ళు. అలా చేస్తే నీ శిష్యులు నీవు చేసే కార్యాల్ని చూడగలుగుతారు. 4 నీవు ఈ కార్యాల్ని చేస్తున్నావు. కనుక నీవు ప్రజలముందుకు రావాలి. ఎందుకంటే, ప్రజానాయకుడు కాదలచినవాడు రహస్యంగా కార్యంచేయడు” అని అన్నారు. 5 అంటే ఆయన సోదరులు కూడా ఆయన్ని నమ్మలేదన్నమాట!
6 యేసు వాళ్ళతో, “నాకింకా సమయం రాలేదు. మీకు ఏ సమయమైనా మంచిదే. 7 ప్రపంచం మిమ్మల్ని ద్వేషించదు. కాని నేను దాని పనులు దుర్మార్గములని అంటాను. కనుక అది నన్ను ద్వేషిస్తున్నది. 8 మీరు పండుగకు వెళ్ళండి. నాకు తగిన సమయం యింకా రాలేదు కనుక నేను యిప్పుడు రాను” అని అన్నాడు. 9 ఇలాగు అన్న తర్వాత యేసు గలిలయులోనే ఉండి పోయాడు.
10 ఆయన సోదరులు వెళ్ళాక ఆయన కూడా పండుగకు వెళ్ళాడు. కాని బహిరంగంగా కాదు. రహస్యంగా. 11 అక్కడ పండుగ జరుగే స్థలంలో యూదులు, “అతడెక్కడున్నాడు?” అని అంటూ ఆయన కోసం వెదకసాగారు.
12 ప్రజలు ఆయన్ని గురించి రహస్యంగా మాట్లాడటం మొదలు పెట్టారు. కొందరు ఆయన మంచివాడన్నారు. మరి కొందరు, “కాదు, అతడు ప్రజల్ని మోసం చేస్తున్నాడు!” అని అన్నారు. 13 యూదులకు భయపడి ఆయన్ని గురించి బహిరంగంగా ఎవ్వడూ ఏమీ అనలేదు.
యేసు పండుగ సమయంలో బోధించటం
14 పండుగ సగం కాకముందే యేసు మందిరంలోకి వెళ్ళి బోధించటం మొదలుపెట్టాడు. 15 యూదులు ఆశ్చర్యపడి, “చదవకుండా యితడు యింత జ్ఞానాన్ని ఏ విధంగా సంపాదించాడు” అని అన్నారు.
16 యేసు, “నేను బోధించేవి నావి కావు. అవి నన్ను పంపిన దేవునివి. 17 దైవేచ్చానుసారం జీవించ దలచిన వానికి నా బోధనలు దేవునివా లేక నేను స్వయంగా నా అధికారంతో మాట్లాడుతున్నానా అన్న విషయం తెలుస్తుంది. 18 స్వతహాగా మాట్లాడేవాడు గౌరవం సంపాదించాలని చూస్తాడు. కాని తనను పంపిన వాని గౌరవం కోసం మాట్లాడేవాడే నిజమైనవాడు. అలాంటి వాడు అసత్యమాడడు. 19 మోషే మీకు ధర్మశాస్త్రాన్ని అందించాడు కదా! అయినా మీలో ఒక్కడు కూడా దాన్ని పాటించలేదు. నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు” అని అన్నాడు.
20 “నీకేమన్నా దయ్యం పట్టిందా? నిన్ను చంపటానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు?” అని ప్రజలు అన్నారు.
21 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నేను ఒక మహత్కార్యాన్ని చేసాను. దానికే మీరింత ఆశ్చర్యపడిపోయారు. 22 మోషే మీకు సున్నతి[a] చేయించుకోమని చెప్పాడు. నిజానికి యిది మోషే నుండి కాదు కాని పితరులనుండి ప్రారంభమైనది. 23 కనుక అవసరమైతే మీరు విశ్రాంతి రోజున సున్నతి చేస్తే తప్పుకాదు కాని, నేను ఒక మనిషి దేహాన్ని సంపూర్ణంగా నయంచేసినందుకు మీకు కోపం వస్తోంది? 24 పైన చూసి తీర్పు చెప్పటం మానుకోండి. న్యాయంగా తీర్పు చెప్పండి.”
యేసు, “క్రీస్తా”?
25 అదే క్షణాన కొందరు యెరూషలేము ప్రజలు ఈ విధంగా అనటం మొదలుపెట్టారు: “వాళ్ళు చంపాలని ప్రయత్నిస్తున్నది ఈయనే కదా! 26 ఆయనిక్కడ బహిరంగంగా మాట్లాడుతున్నా వాళ్ళు ఆయన్ని ఒక్క మాట కూడా అనటం లేదే! అధికారులు కూడా ఈయన నిజంగా క్రీస్తు అని తలంచారా ఏమి? 27 కాని క్రీస్తు వచ్చేటప్పుడు ఎక్కడనుండి వస్తాడో ఎవ్వరికీ తెలియదు. మరి ఈయనెక్కడి నుండి వచ్చాడో మనకందరికి తెలుసు!”
© 1997 Bible League International