Old/New Testament
దావీదును యోవాబు మందలించటం
19 ప్రజలు ఈ వార్తను యోవాబుకు అందజేశారు. “చూడు, రాజు దుఃఖిస్తున్నాడు. అబ్షాలోము కొరకు చాలా విచారిస్తున్నాడు” అని వారు యోవాబుకు చెప్పారు. 2 ఆ రోజు దావీదు సైన్యం యుద్ధంలో గెలిచింది. కాని అది వారందరికీ మిక్కిలి సంతాప దినంగా మారింది. విషాదమయ దినమయిన కారణమేమనగా “రాజు తన కుమారుని కొరకు మిక్కిలిగా విచారిస్తున్నాడని” ప్రజలంతా విన్నారు.
3 ప్రజలంతా నిశ్శబ్దంగా నగరంలోకి వచ్చారు. వారంతా యుద్ధంనుండి, పారిపోయి వచ్చిన వారిలా అగుపించారు. 4 రాజు తన ముఖాన్ని కప్పుకున్నాడు. “నా కుమారుడా, అబ్షాలోమా; ఓ అబ్షాలోమా, నా కుమారుడా, నా కుమారుడా!” అని బిగ్గరగా ఏడ్వసాగాడు.
5 యోవాబు రాజు ఇంటికి వచ్చాడు. యోవాబు రాజుతో ఇలా అన్నాడు: “ఈ రోజు నీవు నీ ముఖాన్ని కప్పుకున్నావు. అంతేగాదు, నీవు నీ సేవకుల ముఖాలన్నీ సిగ్గుతో కప్పివేశావు! ఈ రోజు నీ సేవకులు నీ ప్రాణాన్ని కాపాడారు! వారు నీ కుమారుల ప్రాణాలను, కుమార్తెలను, భార్యలను, నీ దాసీలను – అందరినీ కాపాడారు. 6 నీ సేవకులంతా సిగ్గుతో తలవంచుకున్నారు. కారణమేమంటే నిన్ను అసహ్యించుకునే వారిని నీవు ప్రేమిస్తున్నావు. నిన్ను ప్రేమించేవారిని నీవు అసహ్యించుకుంటున్నావు! నీ క్రింది అధికారులన్నా, నీ మనుష్యులన్నా నీకు లెక్కలేదని ఈ రోజు నీవు స్పష్టంచేశావు. నిజానికి అబ్షాలోము బ్రతికి, మేమంతా చచ్చిపోయి వుంటే నీవు చాలా సంతోషపడి వుండేవాడివని ఈ రోజు నాకు విశదమయింది! 7 లెమ్ము. ఇప్పుడు నీ సేవకులందరితో మాట్లాడి, వారిని ప్రోత్సహించు! నేను యెహోవా మీద ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీవు గనుక బయటికి వెళ్లి ఈ పని చేయకపోతే, రాత్రయ్యేసరికి నీతో ఒక్కడు కూడా వుండడు! నీ యవ్వనం నుండి ఇప్పటి వరకు నీవనుభవించిన కష్టాలన్నిటికంటె, ఇప్పటి నీ పరిస్థితి చాలా అధ్వాన్నమవుతుంది.”
8 అప్పుడు రాజు నగరద్వారం[a] వద్దకు వెళ్లాడు. రాజు నగర ద్వారం వద్ద వున్నాడన్న వార్త వ్యాపించింది. అందుచే ప్రజలంతా ఆయనను చూసేందుకు వచ్చారు.
దావీదు మరల రాజవటం
అబ్షాలోమును అనుసరించిన ఇశ్రాయేలీయులంతా ఇండ్లకు పారిపోయారు. 9 ఇశ్రాయేలు వంశాల ప్రజలందరూ ఒకరితో ఒకరు చర్చించటం మొదలు పెట్టారు. వారిలా అనుకున్నారు: “రాజైన దావీదు మనల్ని ఫిలిష్తీయులనుండి, తదితర శత్రువులనుండి కాపాడాడు. దావీదు అబ్షాలోముకు దూరంగా పారిపోయాడు. 10 మనల్ని పాలించటానికి అబ్షాలోమును ఎన్నుకున్నాము, కాని అతనిప్పుడు యుద్ధంలో చనిపోయాడు. కావున మనం మళ్లీ దావీదును రాజుగా చేసుకోవాలి.”
11 దావీదు రాజు యాజకులైన సాదోకుకు, అబ్యాతారుకు వర్తమానం పంపించాడు. దావీదు వారికిలా చెప్పాడు: “యూదా నాయకులతో మాట్లాడండి. వారితో, ‘రాజును (దావీదును) తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు వెనుకబడి వున్నారు? చూడండి. ఇశ్రాయేలీయులంతా రాజును తిరిగి ఇంటికి తీసుకొని వచ్చే విషయం మాట్లాడుతున్నారు. 12 మీరంతా నా సోదరులు. మీరు నా కుటుంబం వారు అయినప్పుడు రాజును తిరిగి ఇంటికి తీసుకొని రావటంలో మీరెందుకు చివరివంశం వారవుతున్నారు?’ అని చెప్పండి. 13 అమాశాతో, ‘నీవు నా కుటుంబంలో భాగస్వామివి. నేను నిన్ను యోవాబు స్థానంలో సైన్యాధికారిగా చేయకపోతే దేవుడు నన్ను శిక్షించు గాక!’ అని కూడ చెప్పండి.”
14 దావీదు యూదా ప్రజలందరి హృదయాలను చూర గొన్నాడు. వారంతా ఒకటయ్యేలా చేశాడు. యూదా ప్రజలు దావీదుకు వర్తమానం పంపారు. “నీ సేవకులందరితో కలిసి తిరిగి రమ్ము” అని వారన్నారు.
15 అప్పుడు రాజు (దావీదు) యొర్దాను నది వద్దకు వచ్చాడు యూదా ప్రజలు రాజును కలవటానికి గిల్గాలుకు వచ్చారు. వారు రాజును యొర్దాను నదిని దాటించి తీసుకొని రావటానికి వచ్చారు.
దావీదును షిమీ క్షమాభిక్ష కోరటం
16 గెరా కుమారుడైన షిమీ బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బహూరీములో నివసిస్తూండేవాడు. దావీదు రాజును కలవటానికి షిమీ వేగంగా ముందుకు వచ్చాడు. యూదా ప్రజలతో కలిసి షిమీ వచ్చాడు. 17 వేయిమంది బెన్యామీనీయులు కూడ షిమీతో వచ్చారు. సౌలు కుటుంబమువారి సేవకుడు సీబా కూడా వచ్చాడు. సీబా తన పదునైదుగురు కుమారులను ఇరవై మంది సేవకులను తనతో తీసుకొని వచ్చాడు. వీరంతా దావీదు రాజును కలవటానికి హుటాహుటిని యొర్దాను నది వద్దకు వెళ్లారు.
18 రాజ కుటుంబాన్ని యూదాకు తిరిగి తీసుకొని రావటంలో సహాయపడటానికి ప్రజలు యొర్దాను నదిని దాటి వెళ్లారు. రాజు ఏది కోరితే వారది చేయసాగారు. రాజు నదిని దాటుతూ వుండగా, గెరా కుమారుడైన షిమీ అతని వద్దకు వచ్చాడు. అతడు రాజు ముందు సాష్టాంగపడ్డాడు. 19 రాజుతో షిమీ ఇలా అన్నాడు, “నా ప్రభువా, నేను చేసిన పొరపాట్లను పట్టించుకోవద్దు! నా ప్రభువైన రాజా, నీవు యెరూషలేము వదిలి వెళ్లేటప్పుడు నేను నీ పట్ల చేసిన అపచారాలను మనసులో పెట్టుకోవద్దు. 20 పాపం చేసినట్లు నేను తెలుసుకున్నాను. అందువల్ల యోసేపు కుటుంబంలో[b] నుండి నేను ముందుగా నిన్ను నా ప్రభువైన రాజును, కలుసుకోవాలని వచ్చాను.”
21 కాని సెరూయా కుమారుడైన అబీషై ఇలా అన్నాడు: “యెహోవాచే అభిషిక్తము చేయబడిన రాజునకు కీడు జరగాలని కోరుకున్నందుకు షిమీని మనం తప్పక చంపివేయాలి.”
22 దావీదు వారిని వారించి, వారితో, “సెరూయా కుమారులారా, మీకును – నాకును ఏమి పొందిక! ఈ రోజు మీరు నాకు వ్యతిరేకులయ్యారు! ఇశ్రాయేలులో ఏ ఒక్కడూ చంపబడడు. నాకు తెలుసు. ఈ రోజు నేను ఇశ్రాయేలుకు రాజును!” అని అన్నాడు.
23 ఆ తరువాత రాజు షిమీతో, “నీవు చంపబడవు” అని అన్నాడు. పైగా తనకై తాను షిమీని చంపనని రాజు అతనికి ప్రమాణం చేసి చెప్పాడు.[c]
దావీదు దర్శనానికి మెఫీబోషెతు వెళ్లటం
24 సౌలు మనుమడైన మెఫీబోషెతు దావీదు రాజును కలియటానికి వచ్చాడు. రాజు యెరూషలేము వదిలి వెళ్లిన నాటినుండి ప్రశాంతంగా తిరిగి వచ్చేవరకు మెఫీబోషెతు కాళ్లు కడగలేదు; గడ్డం తీసుకోలేదు; తన బట్టలు కూడ ఉతుకుకొనలేదు. 25 మెఫీబోషెతు రాజును కలవటానికి యెరూషలేము నుండి వచ్చాడు. రాజు అతనిని చూచి, “మెఫీబోషెతూ, నేను యెరూషలేము నుండి పారిపోయినప్పుడు నీవెందుకు నాతో రాలేదు?” అని అడిగాడు.
26 అందుకు మెఫీబోషెతు ఇలా అన్నాడు: “నా ప్రభువైన రాజా, నా సేవకుడు (సీబా) నన్ను మోసం చేశాడు! నేను అవిటివాడిని గనుక నా సేవకుడైన సీబాను పిలిచి, ‘ఒక గాడిదపై గంత కట్టి సిద్ధం చేయమన్నాను. దానిపై రాజుతో వెళతానన్నాను.’ 27 కాని నా సేవకుడు నన్ను మోసగించాడు. నా గురించి నీకు చెడుగా చెప్పాడు. కాని నా ప్రభువైన రాజు దేవ దూతలాంటివాడు. నీకు ఏది మంచిదనిపించితే అది చేయుము. 28 నా తాత యొక్క కుటుంబాన్నంతటినీ నీవు చంపగలిగియుండే వాడివి. కాని నీవు అలా చేయలేదు. నీ బల్ల వద్ద భోజనం చేసే వారితో కలిసి తినే అర్హత నాకు కలిగించావు. కావున దేనిని గురించీ రాజుకు ఫిర్యాదు చేసే హక్కు నాకు లేదు!”
29 “ఇక నీ సమస్యల గురించి ఏమీ చెప్పకు! ఉన్న భూమిని నీకు, సీబాకు పంచాలని నిర్ణయించాను, అని రాజు మెఫీబోషెతుకు చెప్పాడు.
30 “సీబానే భూమినంతా తీసుకోనిమ్ము! ఎందువల్లనంటే నా ప్రభువైన రాజు శాంతంగా ఇంటికి తిరిగి వచ్చాడు గనుక” అని మెఫీబోషెతు రాజుతో అన్నాడు.
బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం
31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు. 33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”
34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా? 35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? 36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను. 37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లిదండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”
38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.
దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం
39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.
40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.
ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం
41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.
42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”
43 అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి.[d] కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!”
కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.
షెబ ఇశ్రాయేలీయులను దావీదుకు వ్యతిరేకంగా చేయటం
20 బిక్రి కుమారుడైన షెబ అనే పనికిమాలిన వాడొకడు అక్కడ వుండటం జరిగింది. షెబ అనేవాడు బెన్యామీను వంశానికి చెందినవాడు. అతడు బూర వూది,
“దావీదులో మనకు భాగం లేదు.
యెష్షయి కుమారునితో మనకేమీ సంబంధం లేదు!
కావున ఇశ్రాయేలీయులారా, మనమంతా మన గుడారాలకు పోదాం పదండి”
అని చెప్పాడు.
2 దానితో ఇశ్రాయేలీయులు దావీదును వదిలి, బిక్రి కుమారుడైన షెబను అనుసరించారు. కాని యూదా ప్రజలు మాత్రం యొర్దాను నది వద్ద నుండి యెరూషలేముకు వచ్చేవరకు దారి పొడవునా వారి రాజైన దావీదుతోనే వున్నారు.
3 దావీదు యెరూషలేములోని తన ఇంటికి వచ్చాడు. గతంలో దావీదు తన ఉపపత్నులను[e] పది మందిని ఇల్లు చక్కదిద్దేందుకై వదిలి వెళ్లాడు. ఇప్పుడు దావీదు ఈ స్త్రీలను ఒక ప్రత్యేకమైన ఇంటిలో వుంచాడు. ఆ ఇంటికి సైనిక కాపలా ఏర్పాటు చేశాడు. ఆ స్త్రీలు తమ జీవితాంతం ఆ ఇంటిలోనే వుండిపోయారు. దావీదు వారికి ఆహారాదులిచ్చాడు గాని, వారితో సాంగత్యం చేయలేదు. వారి మరణ పర్యంతం ఆ స్త్రీలు విధవరాండ్రవలె జీవించారు.
4 రాజు అమాశాను పిలిచి, “యూదా ప్రజలను మూడు రోజులలో నన్ను కలవమని చెప్పు. నీవు కూడా ఇక్కడ వుండాలి” అని అన్నాడు.
5 యూదా ప్రజలందరినీ పిలిచి కూడగట్టుకు రావటానికి అమాశా వెళ్లాడు. కాని రాజు పెట్టిన గడువుకంటె అమాశా ఎక్కువ కాలాన్ని తీసుకున్నాడు.
అబీషైతో షెబను చంపమని దావీదు చెప్పటం
6 దావీదు అబీషైని పిలిచి, “బిక్రి కుమారుడైన షెబ మనకు అబ్షాలోముకంటె ఎక్కువ ప్రమాద కరమైన మనిషి. కావున నా సైనికులను తీసుకొని షెబను వెంటాడు. షెబ ప్రాకారాలున్న నగరాలలోనికి తప్పించుకునే ముందుగానే నీవు త్వరపడాలి. షెబ గనుక ప్రాకారాలున్న నగరాలలోకి వెళ్లినాడంటే ఇక వాడు మననుండి తప్పించుకున్నట్లే,” అని అన్నాడు.
7 కనుక యోవాబు మనుష్యులు, కెరేతీయులు, పెలేతీయులు, తదితర సైనికులు యెరూషలేము నుండి బయలుదేరి వెళ్లారు. బిక్రి కుమారుడైన షెబను వారు వెంటాడారు.
యోవాబు అమాశాను చంపటం
8 గిబియోను గుట్ట వద్దకు యోవాబు తన సైనికులతో వచ్చినప్పుడు అమాశా వారిని కలవటానికి ఎదురేగాడు. యోవాబు తన సైనిక దుస్తుల్లో వున్నాడు నడికట్టు కట్టుకున్నాడు. అతని ఒరలో కత్తి వున్నది. అమాశాను కలవటానికి యోవాబు ముందుకు వెళ్లాడు. ఆ సమయంలో తన ఒరలోని కత్తి జారి క్రిందపడింది. యోవాబు ఆ కత్తిని తీసి చేతితో పట్టుకున్నాడు. 9 “సోదరా, నీవు క్షేమమేనా?” అని యోవాబు అమాశాను అడిగినాడు. యోవాబు తన కుడిచేతితో అమాశాను ముద్దు పెట్టుకునేందుకా అన్నట్టు గడ్డం పట్టుకున్నాడు. 10 యోవాబు చేతిలో వున్న కత్తిని అమాశా గమనించలేదు. యోవాబు తన కత్తితో అమాశా పొట్టలో పొడిచాడు. అమాశా పేగులన్నీ బైటకు వచ్చాయి. యోవాబు మళ్లీ పొడిచే అవసరం లేకుండా పోయింది – అమాశా అప్పుడే చనిపోయాడు.
దావీదు మనుష్యులు ఇంకా షెబను వెదకుట
యోవాబు, అతని సోదరుడు అబీషై కలిసి బిక్రి కుమారుడు షెబను తరమటం కొనసాగించారు. 11 యోవాబు సైనికులలో యువకుడైన వాడొకడు అమాశా శవం వద్ద నిలబడ్డాడు. ఆ యువకుడు మిగిలిన వారి నుద్దేశించి, “మీలో యోవాబును, దావీదును బలపర్చే ప్రతి ఒక్కడూ యోవాబును అనుసరించి వెళ్లాలి. షెబను వెంటాడటంలో అతనికి సహాయం చేయండి!” అని అన్నాడు.
12 మార్గం మధ్యలో అమాశ శవం రక్తపు మడుగులో పడివుంది. జనమంతా శవాన్ని చూసే నిమిత్తం అక్కడ ఆగుతూ ఉన్నారు కావున ఆ యువకుడు అమాశా శవాన్ని ప్రక్కనే వున్న పొలంలోనికి లాగి, దాని మీద ఒక బట్ట కప్పాడు. 13 అమాశా శవం బాట మీద నుంచి తీసివేయబడిన పిమ్మట జనమంతా యోవాబును అనుసరించారు. బిక్రి కుమారుడు షెబను తరిమేందుకు వారు యోవాబుతో కలిసి వెళ్లారు.
ఆబేలు బేత్మయకాకు షెబ తప్పించుకు పోవటం
14 బిక్రి కుమారుడు షెబ ఇశ్రాయేలు వంశపు వారు నివసించే ప్రాంతాల గుండా పోయి ఆబేలు బేత్మయకా నగరాన్ని చేరాడు. బెరీయులందరూ కూడి షెబను అనుసరించారు.
15 యోవాబు, అతని మనుష్యులు ఆబేలు బేత్మయకా వద్దకు వచ్చారు. యోవాబు సైన్యం నగరాన్ని ముట్టడించింది. నగరం చుట్టూవున్న గోడకు వారు ఒక చోట కందకం పూడ్చి బాగా మట్టి పోశారు. అలా మట్టి పోయటంతో వారు గోడ దగ్గరకు వెళ్ల గలిగారు. ఆ గోడను పడగొట్టే ఉద్దేశంతో వారప్పుడు దానిని పగులగొట్టటం మొదలుపెట్టారు.
16 ఇంతలో ఒక వివేకం గల స్త్రీ నగరంలో నుండి కేకలు పెట్టింది. “నే చెప్పేది వినండి. యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పండి. అతనితో నేను మాట్లాడదలిచాను!” అని అరిచింది.
17 ఆ స్త్రీ తో మాట్లాడటానికి యోవాబు దగ్గరగా వచ్చాడు. “యోవాబువు నీవేనా?” అని ఆమె అడిగింది.
“అవును. నేనే” అని యోవాబు సమాధానం చెప్పాడు.
“అయితే నేను చెప్పేది విను!” అని ఆ స్త్రీ యోవాబుతో అన్నది.
“వింటున్నాను” అని యోవాబు అన్నాడు.
18 ఆ స్త్రీ ఇలా అన్నది, “పూర్వం ప్రజలు ‘సలహా కొరకు ఆబేలులో అడగమని అనే వారు. అప్పుడు వారి సమస్య తీరిపోయేది.’ 19 శాంతిని కోరే వారిలో, ఇశ్రాయేలు పట్ల విశ్వాసముగల వారిలో నేనొక దానిని. ఇశ్రాయేలులో ఒక ముఖ్యనగరాన్ని నీవు నాశనం చేయటానికి ప్రయత్నిస్తున్నావు. యెహోవాకి చెందిన దానిని నీవెందుకు నాశనం చేయ సంకల్పించావు?”
20 “లేదు! లేదు! నేను దేనినీ నాశనం చేయదల్చలేదు[f] మీ పట్టణాన్ని నిర్మూలించను. 21 కాని ఎఫ్రాయిము కొండ ప్రాంతపు వాడొకడున్నాడు. వాని పేరు షెబ. అతడు బిక్రి యొక్క కుమారుడు. వాడు దావీదు రాజుపై తిరుగుబాటు చేశాడు. నీవు గనుక వానిని నా కప్పగించితే, నేను నగరాన్ని వదిలి పెడతాను,” అని యోవాబు అన్నాడు.
“అయితే సరే! అతని తల గోడ మీది నుంచి మీకు విసరివేయబడుతుంది” అని ఆస్త్రీ యోవాబుతో అన్నది.
22 తరువాత ఆ స్త్రీ నగర ప్రజలందరితో చాలా యుక్తిగా మాట్లాడింది. అది విని ఆ నగరవాసులు బిక్రి కుమారుడు షెబ తల నరికి దానిని గోడ మీదుగా యోవాబుకు విసరివేశారు.
అప్పుడు యోవాబు బూర వూదగా సైన్యం నగరం వదిలి వెళ్లిపోయింది. ప్రతివాడూ తన గుడారానికి వెళ్లిపోయాడు. యెరూషలేములో వున్న రాజు వద్దకు యోవాబు వెళ్లాడు.
దావీదు కొలువులో ముఖ్యమైన ఉద్యోగులు
23 ఇశ్రాయేలు రాజ్యంలో యోవాబు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. కాని కెరేతీయులకును, పెలేతీయులకును యెహోయాదా కుమారుడైన బెనాయా అధిపతి. 24 వెట్టి చాకిరీ వంటి శరీర కష్టం చేసే దండుకు అదోరాము నాయకత్వం వహించాడు. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు చరిత్రకారుడుగా నియమితుడయ్యాడు. 25 షెవా ప్రధాన కార్యదర్శిగాను; సాదోకు, అబ్యాతారు యాజకులుగాను; 26 మరియు యాయీరీయుడగు ఈరా రాజుకు ప్రధానాచార్యుడుగను వున్నారు.
పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం
18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: 2 “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. 3 అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. 4 చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. 5 కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
6 ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! 7 మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! 8 ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
యేసు చిన్నపిల్లల్ని దీవించటం
(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)
15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం
(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)
18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.
21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.
22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.
© 1997 Bible League International