Old/New Testament
యోనాతాను దావీదుకు సహాయం చేసాడు
19 దావీదును చంపి వేయుమని సౌలు తన కుమారుడైన యోనాతానుకు, మిగిలిన అధికారులకు చెప్పాడు. కానీ యోనాతాను దావీదును చాలా ప్రేమించాడు. 2 యోనాతాను దావీదును హెచ్చరించాడు. “జాగ్రత్తగా ఉండు. సౌలు నిన్ను చంపాలని అవకాశం కోసం చూస్తున్నాడు. ఉదయం పొలానికి వెళ్లి అక్కడ దాగి వుండు. 3 నేను నా తండ్రితో ఆ పొలానికి వస్తాను. నీవు దాగియున్న పొలాల వద్ద మేము నిలబడతాము. నీ విషయంలో నా తండ్రితో నేను మాట్లాడతాను. తరువాత నేను తెలుసుకున్నదంతా నీకు చెబ తాను” అని యోనాతాను దావీదుతో చెప్పాడు.
4 యోనాతాను తన తండ్రి సౌలుతో మాట్లాడుతూ దావీదు గుణగణాలను కొనియాడాడు. “నీవు రాజువు. దావీదు నీ సేవకుడు. దావీదు నీకు ఏమీ కీడు చేయలేదు. కనుక అతనికి ఏమీ కీడు చేయకు. దావీదు ఎల్లప్పుడూ నీ ఎడల మేలునే చేసాడు. 5 దావీదు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఫిలిష్తీయుడైన గొల్యాతును చంపాడు. దాని ద్వారా యెహోవా ఇశ్రాయేలు అంతటికీ ఘనవిజయం సమకూర్చి పెట్టాడు. అదంతా నీవు చూశావు, ఆనందించావు. పైగా అటువంటి దావీదుకు నీవు ఎందుకు కీడు తలస్తున్నావు? అతడు అమాయకుడు. అతనిని చంపటానికి తగిన కారణమే లేదు” అని అన్నాడు.
6 యోనాతాను చెప్పినదంతా విని సౌలు ఒక ప్రమాణం చేసాడు. “యెహోవా సజీవంగా ఉన్నాడు అన్నంత నిజంగా, దావీదు చంపబడడు” అని చెప్పాడు సౌలు.
7 కనుక యోనాతాను దావీదును పిలిచి జరిగినదంతా అతనితో చెప్పాడు. అప్పుడు యోనాతాను దావీదును తన తండ్రి వద్దకు తీసుకుని వెళ్లాడు. అప్పటి నుండి దావీదు మొదట్లోలాగే సౌలు దగ్గర ఉన్నాడు.
సౌలు మరల దావీదును చంపాలని చూచుట
8 మళ్లీ యుద్ధం వచ్చినప్పుడు దావీదు ఫిలిష్తీయులను ఎదుర్కోవటానికి వెళ్లాడు. దావీదు వారిని తరిమికొట్టాడు, వారు అతని దగ్గరనుండి పారిపోయారు. 9 కానీ ఒక దుష్ట ఆత్మ యెహోవా వద్దనుండి వచ్చి సౌలును ఆవరించింది. సౌలు తన ఇంట్లోనే కూర్చునివున్నాడు. సౌలు చేతిలో అతని ఈటెవుంది. దావీదు సితార వాయిస్తూ ఉన్నాడు. 10 సౌలు తన ఈటెను దావీదు మీదికి విసరి అతనిని వెనుక ఉన్న గోడకు గుచ్చివేయాలని ప్రయత్నించాడు. కాని ఈటెను దావీదు తప్పుకోవటంతో ఈటె గురి తప్పిగోడలోకి దిగిపోయింది. ఆ రాత్రి దావీదు పారిపోయాడు.
11 సౌలు తన మనుష్యులను దావీదు ఇంటికి పంపాడు. వారు దావీదు ఇంటిపై నిఘా వేసి రాత్రి అంతా అక్కడే ఉండి, ఉదయమే అతనిని చంపే ప్రయత్నంలో కనిపెట్టుకొని ఉన్నారు. కానీ దావీదు భార్య మీకాలు అతనిని హెచ్చరించింది. “ఈ రాత్రి నీవు పారిపోయి నీ ప్రాణాలను రక్షించుకో. లేనిచో ఉదయమే నీవు చంపబడతావు” అని ఆమె చెప్పింది. 12 అలా చెప్పి, దావీదును ఒక కిటికిగుండా బయటకుదింపింది. దావీదు తప్పించుకొని పారిపోయాడు. 13 మీకాలు గృహ దేవత విగ్రహాన్ని తెచ్చి పక్కమీద ఉంచి దుప్పట్లు కప్పింది. ఆ విగ్రహం తల మీద కొన్ని మేక వెంట్రుకలు కూడ ఆమె అమర్చింది.
14 దావీదును బంధించమని సౌలు తన సైనికులను పంపాడు. కానీ “దావీదుకు అనారోగ్యంగా వుందని” మీకాలు చెప్పింది.
15 ఈ విషయం తన మనుష్యులు చెప్పేసరికి, “అవసరమైతే దావీదును మంచంతో సహా ఎత్తుకు రండి. నేను అతనిని అవసరమైతే చంపేస్తాను” అని ఆ మనుష్యులతో సౌలు చెప్పాడు.
16 సౌలు మనుష్యులు దావీదు కోసం మళ్లీ దావీదు ఇంటికి వెళ్లి చూడగా పక్కమీద ఉన్నది ఒక దేవతా విగ్రహం మాత్రమేనని, దాని తలమీద ఉన్నవి కేవలం మేక వెంట్రుకలు మాత్రమేననీ వారు తెలుసుకున్నారు.
17 “ఇలా నన్నెందుకు మోసగించావు, నా శత్రువును వదిలిపెట్టావు, వాడు పారిపోయాడు” అని సౌలు మీకాలును అడిగాడు.
“తనకు సహాయం చేయకపోతే నన్ను చంపుతానని అతడు బెదిరించాడు. అందుకే నేను అలా చేశానని” మీకాలు జవాబు ఇచ్చింది.
దావీదు రామాలోని గుడారాలకు వెళ్లుట
18 దావీదు సౌలు బారి నుండి తప్పించుకుని రామాలోవున్న సమూయేలు వద్దకు వెళ్లాడు. సౌలు తన పట్ల చేసినదంతటినీ దావీదు సమూయేలుకు చెప్పాడు. తరువాత దావీదు, సమూయేలు కలిసి ప్రవక్తల గుడారాలకు వెళ్లారు. దావీదు అక్కడే ఉండి పోయాడు.
19 రామాలో వున్న గుడారాలలో దావీదు ఉంటున్నట్లు సౌలు విన్నాడు. 20 దావీదును బంధించి తీసుకుని రావలసిందిగా సౌలు మనుష్యులను పంపాడు. కానీ వారు ఆ గుడారాలకు వచ్చేసరికి అక్కడ ప్రవక్తల గుంపు ఒకటి ప్రవచిస్తూ ఉండటం కనబడింది. సమూయేలు ఆ ప్రవక్తలకు నాయకత్వం వహించి ఉన్నాడు. దేవుని ఆత్మ సౌలు పంపిన మనుష్యుల మీదికి రాగా వారు కూడ దేవుని విషయాలు చెప్పనారంభించారు.
21 ఈ వార్త సౌలు వరకూ పోయింది. అతను మరి కొంతమంది మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. కనుక మూడవసారి మళ్లీ సౌలు మనుష్యులను పంపాడు. వారుకూడ దేవుని విషయాలు చెప్పటం మొదలు పెట్టారు. 22 చివరికి సౌలు స్వయంగా బయలుదేరి రామా చేరుకున్నాడు. సేఖూలో ఒక నూర్పిడి కళ్లము దగ్గరవున్న పెద్ద బావి వద్దకు సౌలు వచ్చాడు. “సమూయేలు, దావీదు ఎక్కడ ఉన్నారని” సౌలు అక్కడున్న వారిని అడిగాడు.
“రామాదగ్గర ఉన్న నాయోతులో ఉన్నారని” వాళ్లు జవాబు చెప్పారు.
23 అప్పుడు సౌలు రామా దగ్గర్లో వున్న నాయోతుకు వెళ్లాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి కూడ రావటంతో అతను దేవుని విషయాలు చెబుతూ ముందుకు నడిచాడు. రామాలో వున్న నాయోతుకు వెళ్లేవరకు సౌలు మరింత ఎక్కువగా దేవుని విషయాలు చెబుతూనే ఉన్నాడు. 24 అప్పుడు సౌలు తన బట్టలు విడిచి, సమూయేలు ఎదుట అతడు దేవుని విషయాలు పలికాడు. ఆ పగలూ, ఆ రాత్రి శరీరంమీద బట్టలు లేకుండానే సౌలు గడిపాడు.
ఆ కారణం చేతనే, “సౌలుకూడ ప్రవక్తల్లో ఒకడు అయ్యాడా?” అని ప్రజలు అనుకోవటం మొదలయ్యింది.
దావీదు, యోనాతానుల ఒడంబడిక
20 దావీదు రామాలో వున్న నాయోతునుంచి పారిపోయాడు. తిన్నగా యోనాతాను వద్దకు వెళ్లి, “నేనేమి తప్పు చేశాను? నా నేరం ఏమిటి? నీ తండ్రి ఎందుకు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు?” అని అడిగాడు.
2 అది విన్న యోనాతాను ఇలా అన్నాడు, “నా తండ్రి నిన్ను చంపటానికి ప్రయత్నం చేయటం లేదు. నా తండ్రి ముందుగా నాకు చెప్పకుండా ఏ పనీచేయడు. అది అతి ముఖ్యమైన పనిగాని, లేక అతి స్వల్పమైన విషయంగాని మా తండ్రి ఎప్పుడూ నాకు చెబుతాడు. ఆయన నిన్ను చంపాలనే తన ఆలోచనను నాకెందుకు చెప్పకుండా ఉంటాడు? లేదు. అది నిజం కాదు!”
3 కానీ దావీదు, “నేను నీ స్నేహితుడనని నీ తండ్రికి బాగా తెలుసు. యోనాతానుకు ఈ విషయం తెలియకూడదు అతనికి తెలిస్తే దావీదుకు చెప్పేస్తాడు అని నీ తండ్రి అనుకుని ఉంటాడు. దేవుడు జీవిస్తున్నాడు అన్నంత నిజంగా, నీవు జీవుస్తున్నావన్నంత నిజంగా నేను మృత్యువుకు చాలా చేరువలో ఉన్నాను.” అని జవాబిచ్చాడు.
4 యోనాతాను, “సరే, ఇప్పుడు నీవు ఏమి చేయమంటే అది నేను చేస్తాను” అని దావీదుతో అన్నాడు.
5 అప్పుడు దావీదు, “అయితే చూడు. రేపు అమావాస్య విందు. నేను రాజుతో కలిసి విందారగించవలసివుంది. కాని రేపు సాయంత్రం వరకు నన్ను పొలాల్లో దాగివుండనీ. 6 నేను రాలేదని నీ తండ్రి గమనించినపుడు ‘దావీదు తన స్వగ్రామమైన బేత్లెహేముకు వెళ్లాలని కోరాడు. ఈ నెలసరి బలి అర్పణకు అతని కుటుంబంవారు స్వంతంగా విందు చేసుకోవాలని కోరారు. కనుక దావీదు తన కుటుంబంతో కలసి ఉండేందుకు తనను వెళ్లనివ్వాల్సిందిగా నన్ను అడిగాడు’ అని నీ తండ్రికి చెప్పు అన్నాడు. 7 ‘సరే మంచిది’ అని మీ తండ్రి అంటే నేను హాయిగా ఉన్నట్లే. కానీ ఆయనకు కోపం వస్తే మాత్రం నాకు కీడు చేస్తాడని నీవు నమ్మవచ్చు. 8 యోనాతానూ! నేను నీ సేవకుడను. నన్ను కనికరించు. యెహోవా ఎదుట నీవు నాతో ఒక ఒడంబడిక చేసావు. నేను దోషినయితే నీకై నీవే నన్ను చంపవచ్చు! కానీ నన్ను మాత్రం నీ తండ్రి వద్దకు తీసుకుని వెళ్లకు” అన్నాడు.
9 యోనాతాను, “లేదు ఎప్పటికీ అలా జరగదు! నా తండ్రి నీకు కీడు తలపెడితే నేను నీకు తెలియజేస్తాను” అని చెప్పాడు.
10 దావీదు, “నీ తండ్రి నిన్ను తిడితే అది నాకెవరు తెలియజేస్తారు?” అన్నాడు.
11 అప్పుడు యోనాతాను, “అయితే, రా! మనం పొలంలోకి వెళదాము” అని అనగా యోనాతాను, దావీదు కలిసి పొలంలోకి వెళ్లారు.
12 యెనాతాను దావీదుతో ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సమక్షంలో నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా తండ్రి నీ విషయంలో ఏ తలంపుతో ఉన్నాడో తెలుసుకుంటానని నీకు ప్రమాణం చేస్తున్నాను. నీ పట్ల ఆయన వైఖరి బాగుందో లేదో తెలుసుకుంటాను. ఆ విషయం మూడురోజుల్లో నీకు పొలానికి కబురు చేస్తాను. 13 నా తండ్రి గనుక నీకు కీడు తలపెడితే, అది నీకు తెలియపర్చి, నిన్ను క్షేమంగా వెళ్లిపోనిస్తాను. ఇది నేను చేయకపోతే యెహోవా నన్ను శిక్షించునుగాక! యెహోవా నా తండ్రికి తోడై యున్నట్లు, నీకు కూడ తోడైవుండునుగాక! 14 నేను జీవించినంత కాలం, నా మీద దయచూపించు. నేను మరణించాక 15 నా కుటుంబంపట్ల నీ దయాదాక్షిణ్యాలు చూపించటం ఎన్నడూ మానవద్దు. ఈ భూమి మీద నీ శత్రువుల నందరినీ యెహోవా నాశనం చేయునుగాక! 16 ఆ సమయంలో యోనాతాను కుటుంబం దావీదునుండి వేరు చేయబడాల్సి వస్తే, అలాగే జరుగనివ్వు. దావీదు శత్రువులను యెహోవా శిక్షించునుగాక!”
17 అప్పుడు యోనాతాను తన మీద దావీదుకు ఉన్న ప్రేమ వాగ్దానాన్ని మరల చూపించమన్నాడు. ఎందువల్ల నంటే యోనాతాను తనను తాను ప్రేమించుకున్నంతగా దావీదును ప్రేమించాడు గనుక అలా చేశాడు.
18 “రేపు అమావాస్య విందుగదా! అక్కడ నీ స్థానం ఖాళీగా వుంటుంది. కనుక నా తండ్రి నీవు రాలేదని గమనిస్తాడు. 19 ఈ కష్టాలన్నీ ప్రారంభమైనప్పుడు నీవు ముందుగా ఎక్కడ దాగివున్నావో అక్కడికే మూడవ రోజున కూడ నీవు వెళ్లు. అక్కడ కొండ పక్కన వేచివుండు. 20 మూడవ రోజున కొండ పక్కగా నేనొక గురిని బాణంతో కొడుతున్నట్టు నేను నటిస్తాను. నేను కొన్ని బాణాలు వదులుతాను. 21 అప్పుడు ఆ వదిలిన బాణాన్ని వెదికేందుకుగాను ఒక కుర్రవానిని పంపుతాను. వానితో నేను ‘మరీ దూరం వెళ్లిపోయావు. బాణాలు అక్కడ నాకు దగ్గర్లోనే ఉన్నాయి గదా, వెనక్కు వచ్చేసి వాటిని తీసుకొనిరా’ అని చెబుతాను. నేను గనుక అలా చెబితే అప్పుడు నీవు బయటకి రావచ్చు. యెహెవా జీవిస్తున్నంత వాస్తవంగా నీకు క్షేమం కలుగుతుందని వాగ్దానం చేస్తున్నాను. ప్రమాదం ఏమీ లేదు. 22 కానీ ఒకవేళ ఏదైనా తొందర ఉంటే, ‘బాణాలు చాలా దూరంగా ఉన్నాయి. వెళ్లి వాటిని తీసుకురా’ అని ఆ కుర్రవానితో నేను అంటాను. నేను గనుక అలా చెబితే నీవు తప్పక పారిపోవల్సిందే. అంటే యెహోవా నిన్ను దూరంగా పంపుతున్నాడన్న మాట. 23 మనిద్దరి మధ్యవున్న ఈ ఒడంబడిక జ్ఞాపకం ఉంచుకో. యెహోవా మనకు శాశ్వతంగా సాక్షి” అని యోనాతాను దావీదుకు చెప్పాడు.
24 అప్పుడు దావీదు పొలంలో దాక్కున్నాడు.
విందులో సౌలు వైఖరి
అమావాస్య విందు సమయం వచ్చింది. రాజు భోజనం చేయటానికి కూర్చున్నాడు. 25 మామూలుగా కూర్చునే చోటులో గోడ దగ్గరగా రాజు కూర్చున్నాడు. సౌలుకు ఎదురుగా యోనాతాను కూర్చున్నాడు. సౌలుకు పక్కగా అబ్నేరు కూర్చున్నాడు. కానీ దావీదు స్థానం ఖాళీగా ఉంది. 26 ఆరోజు సౌలు ఏమీ అనలేదు. “దావీదుకు ఏమైనా జరిగివుండవచ్చు; లేదా మైలపడి[a] ఉండవచ్చు” అనుకున్నాడు.
27 కానీ మరునాడు, అంటే ఆ నెల రెండో రోజున కూడా దావీదు స్థానం ఖాళీగావుంది. “యెష్షయి కుమారుడు నిన్న, ఈ రోజు కూడా అమావాస్యవిందుకు ఎందుకు రాలేదని సౌలు యోనాతానును” అడిగాడు.
28 “బేత్లెహేము వెళ్లనిమ్మని దావీదు నన్ను అడిగాడు. 29 అతని కుటుంబం వాళ్లున్న బేత్లెహేములో ఒక బలి అర్పణ ఇస్తున్నారని, అతడు చెప్పాడు. అతని సోదరుడు అతనిని రమ్మని పిలిచాడనీ, కాబట్టి తన సోదరులను చూడటానికి అనుమతి ఇమ్మని స్నేహితునిగా అడుగుతున్నాననీ దావీదు చెప్పాడు. అందుచేత దావీదు రాజు విందుకు రాలేక పోయాడు,” అని యోనాతాను చెప్పాడు.
30 సౌలుకు యోనాతాను మీద చాల కోపం వచ్చింది, “మాట తిరస్కరించే బానిస స్త్రీకి పుట్టినవాడివి నీవు! నీవు ఆ స్త్రీలాగే ప్రవర్తిస్తున్నావు. నాకు తెలుసు నీవు దావీదు పక్షాన ఉన్నావని. నీకూ, నిన్ను కన్నతల్లికి తలవంపులు తెస్తున్నావు. 31 యెష్షయి కుమారుడు బ్రతికి ఉన్నంత వరకూ నీవు రాజు కావటంగాని, రాజ్యాన్ని చేపట్టటం గాని జరుగదు. ఇప్పుడే దావీదును నా దగ్గరకు తీసుకునిరా! వాడు చచ్చిన వారితో సమానము!” అన్నాడు సౌలు.
32 “దావీదును ఎందుకు చంపాలి? దావీదు చేసిన నేరం ఏమిటి?” అని యోనాతాను తన తండ్రిని అడిగాడు.
33 సౌలు తన ఈటెను యోనాతాను మీదికి విసరి, అతనిని చంపటానికి ప్రయత్నం చేసాడు. దానితో తన తండ్రి నిజంగానే దావీదును చంపాలని తల పెట్టాడని యోనాతానుకు అర్థమయ్యింది. 34 యోనాతానుకు విపరీతంగా కోపం వచ్చింది. భోజనాల బల్ల వదిలి వెళ్లిపోయాడు. యోనాతాను తన తండ్రి మీద చాల కోపంతో ఆ విందు రెండో రోజు కూడ ఏమీ భోజనం చేయటానికి ఒప్పుకోలేదు. సౌలు తనను పరాభవించినందుకు, దావీదును చంపాలని చూస్తున్నందుకు యోనాతాను కోపగించాడు.
యోనాతాను, దావీదు వీడ్కోలు చెప్పుకోవడం
35 ఆ మరునాటి ఉదయం యోనాతాను పొలానికి వెళ్లాడు. వాళ్లనుకున్నట్లుగా దావీదును కలవటానికి అతడు వెళ్లాడు. యోనాతాను తన వెంట ఒక చిన్న పిల్లవానిని కూడ తీసుకొని వెళ్లాడు. 36 “నేను వేసే బాణాన్ని పరుగున పోయి వెదికి తీసుకొనిరా” అని యోనాతాను పిల్లవానితో చెప్పాడు. ఆ పిల్లవాడు పరుగెత్తుచుండగా యోనాతాను వాని తల మీదగా అవతలికి బాణాలు వేశాడు. 37 బాణాలు పడిన చోటుకి బాలుడు పరుగెత్తాడు. కానీ యోనాతాను “బాణాలు ఇంకా చాలా దూరంలో ఉన్నాయి” అని అరిచాడు. 38 “వెళ్లు! త్వరగా వెళ్లు! ఆ బాణాలు తీసుకురా, ఆగకు!” అంటూ యోనాతాను కేకలు వేశాడు. ఆ బాలుడు బాణాలు తీసుకొని తన యజమాని వద్దకు తెచ్చాడు. 39 ఈ సందర్భంలో ఇక్కడ అతి రహస్యంగా ఏమి జరిగిందో ఆ బాలునికి ఏమీ తెలియదు. యోనాతానుకు, దావీదుకు మాత్రమే అది తెలుసు. 40 యోనాతాను తన విల్లు, అంబులను ఆ బాలునికి ఇచ్చి, “పట్టణానికి వెళ్లి పో” అని చెప్పాడు.
41 ఆ కుర్రవాడు వెళ్లిపోయాక, కొండ ఆవలి ప్రక్క తాను దాగివున్న చోటనుండి దావీదు బయటకి వచ్చాడు. దావీదు యోనాతాను ముందు ప్రణమిల్లాడు. అలా మూడుసార్లు దావీదు చేశాడు. తరువాత దావీదు, యోనాతాను ఒకరినొకరు ముద్దు పెట్టుకున్నారు. వారు ఇద్దరూ బాగా ఏడ్చారు. దావీదు యోనాతాను కంటె ఎక్కువగా ఏడ్చాడు.
42 “శాంతితో వెళ్లు. మనము స్నేహితులుగా కొనసాగుతామని యెహోవా నామంలో వాగ్దానం చేసుకున్నాము. మనమధ్య, మన తరువాత మన తరాల వారి మధ్య యెహోవా శాశ్వతంగా సాక్షిగా ఉంటాడని మనము చెప్పుకున్నాము” అని యోనాతాను దావీదుతో అన్నాడు.
యాజకుడైన అహీమెలెకును చూచుటకు దావీదు వెళ్ళుట
21 తరువాత దావీదు వెళ్లిపోయాడు. యోనాతాను తిరిగి పట్టణానికి వెళ్లాడు.
అహీమెలెకు అనే యాజకుని చూడటానికి దావీదు నోబు పట్టణానికి వెళ్లాడు. దావీదును చూడగానే అహీమెలెకు భయంతో వణకిపోయాడు. “నీవు ఒంటరిగా ఎందుకున్నావు? నీకు తోడుగా ఎవ్వరూ ఎందుకు లేరు?” అని అహీమెలెకు దావీదును అడిగాడు.
2 దావీదు అహీమెలెకుతో, “రాజు నాకు ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. తాను ఏ పనిమీద నన్ను పంపిస్తున్నాడో అది వేరెవ్వరికీ తెలియ కూడదన్నాడు. నన్ను ఏమి చేయమని అతను చెప్పాడో అది ఎవ్వరికీ తెలియకూడదని అతని ఆజ్ఞ. నన్ను ఎక్కడ కలవాలో నా మనుష్యులకు నేను చెప్పాను. 3 ఇప్పుడు నీవద్ద ఏమైన ఆహారం ఉన్నదా? నాకు ఐదు రొట్టెలు లేదా ఏది ఉంటే అది ఇవ్వు” అని చెప్పాడు.
4 “తనవద్ద మాములు రొట్టెలేవీ లేవనీ, కేవలం ప్రతిష్ఠితంగా దేవుని సన్నిధిలో ఉంచిన రొట్టెలు[b] కొన్ని వున్నాయనీ, తన పరివారమంతా స్త్రీలకు దూరంగా వున్న వారైతే వారు ఈ రొట్టె తినవచ్చనీ” యాజకుడు దావీదుతో అన్నాడు.
5 అది విన్న దావీదు, “మేము ఏ స్త్రీలతోను ఉండలేదు. మేము యుద్ధానికి వెళ్లినప్పుడల్లా, అలాగే మాములు పనులు చేసేటప్పుడు కూడ నా మనుష్యులు తమ శరీరాలను పవిత్రంగా ఉంచు కుంటారు. ఇప్పుడు మేము బయలుదేరిన మా పని ఎంతో పవిత్రమైనది కనుక ఈ వేళ ఇది మరింత సత్యం” అన్నాడు.
6 పవిత్ర రొట్టె తప్ప మరొకటి లేక పోవటంతో యాజకుడు దావీదుకు దానినే ఇచ్చాడు. యాజకులు యెహోవా ఎదుట పీఠంపై ఆరగింపుగా ఉంచే రొట్టె ఇది. ప్రతి రోజూ వారు ఈ రొట్టెను తీసివేసి మళ్లీ కొత్త రొట్టెను దాని స్థానంలో ఉంచుతారు.
7 సౌలు అధికారులలో ఒకడు ఆ రోజున ఇక్కడ ఉన్నాడు. వాని పేరు దోయేగు. అతడు ఎదోమీయుడు. వాడు అక్కడ యెహోవా ఎదుట ఉంచబడ్డాడు. దోయేగు సౌలు యొక్క గొర్రెల కాపరులకు నాయకుడు.
8 యాజకుడైన అహీమెలెకును, “ఒక ఈటెగాని, కత్తిగాని అక్కడ ఉన్నదా అని దావీడు అడిగాడు. రాజుపని అతి ముఖ్యమైనదని, తను త్వరగా వెళ్లవలసి ఉందనీ, తాను కత్తిగాని మరి ఏ ఇతర ఆయుధంగాని తేలేదనీ చెప్పాడు.”
9 ఫిలిష్తీయుడైన గొల్యాతు ఆయుధం ఒక్కటే ఇక్కడ ఉందని యాజకుడు చెప్పాడు. “ఏలా లోయలో నీవు వానిని చంపినప్పుడు వాని దగ్గర నీవు తీసుకున్న ఖడ్గం అది. ఆ ఖడ్గం ఒక బట్టలో చుట్టబడి ఏఫోదు అంగీ వెనుక ఉంచబడింది కావాలంటే అది నీవు తీసుకోవచ్చు”
అని అహీమెలెకు అన్నాడు. “గొల్యాతు కత్తికి మించిన కత్తిలేదు. దానిని నాకు ఇవ్వుము” అన్నాడు దావీదు.
దావీదు గాతుకు పారిపోవుట
10 ఆ రోజు సౌలు నుంచి దావీదు అలా పారిపోయాడు. గాతు రాజైన ఆకీషు వద్దకు దావీదు వెళ్లాడు. 11 కానీ ఆకీషు అధికారులకు అది నచ్చలేదు. వారు అతనితో ఇలా అన్నారు: “ఇతని పేరు దావీదు. ఇశ్రాయేలు రాజ్యానికి రాజు. ఇశ్రాయేలీయులు పాటలు పాడేది ఇతనిని గూర్చే. అతనికోసం వారు పాటలు పాడి నాట్యం చేస్తారు. ఇశ్రాయేలీయులు ఇదిగో ఈ పాట పాడతారు:
“సౌలు వేల కొలదిగా హతము చేసాడు!
దావీదు పది వేల కొలదిగా హతము చేసాడు!”
12 ఈ మాటలను దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. గాతు రాజైన ఆకీషును గూర్చి దావీదు చాలా భయపడ్డాడు. 13 అందువల్ల ఆకీషు ముందు, అతని సిబ్బంది ముందు దావీదు పిచ్చి పట్టిన వానిలా నటించుట మొదలు పెట్టాడు. అక్కడున్నంత సేపూ దావీదు పిచ్చివానిలా ప్రవర్తించాడు. మార్గపు తలుపుల మీద అతడు ఉమ్మి వేశాడు. తన ఉమ్ము తన గడ్డం మీద పడేటట్టు ఉమ్మేసాడు.
14 ఆకీషు, “వీని వైపు చూడండి! వీడు పిచ్చివాడు! వీడిని నా వద్దకు ఎందుకు తిసుకుని వచ్చారు? 15 ఇప్పటికే నా వద్ద పిచ్చి వాళ్లు చాలామంది ఉన్నారు. నా ముందు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించటానికి వీనిని మీరు నా ఇంటికి తీసుకుని రానక్కర్లేదు! ఈ మనిషిని మళ్లీ నా ఇంటికి రానివ్వకండి” అని తన అధికారులతో చెప్పాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 12:38-42; మార్కు 8:12)
29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. 30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.
31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.
32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.
దేహం యొక్క వెలుగు
(మత్తయి 5:15; 6:22-23)
33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. 34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. 35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. 36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 20:45-47)
37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. 38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. 39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. 40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? 41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.
42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.
43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. 44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.
45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.
46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. 47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. 48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. 49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’
50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. 51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.
53 యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. 54 ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.
© 1997 Bible League International