Old/New Testament
సౌలు మరణం గురించి దావీదు వినటం
1 దావీదు అమాలేకీయులను ఓడించిన తర్వాత అతను సిక్లగుకు వచ్చి రెండు రోజులపాటు ఉన్నాడు. ఇది సౌలు మరణించిన తరువాత జరిగింది. 2 మూడవ రోజున సిక్లగుకు ఒక యువసైనికుడు వచ్చాడు. ఇతడు సౌలు శిబిరము నుండి వచ్చాడు. వాని బట్టలు చిరిగిపోయి వున్నాయి. తలనిండా మట్టి పడివుంది. అతను దావీదు వద్దకు వచ్చి ప్రణమిల్లాడు.
3 “నీవు ఎక్కడ నుండి వచ్చావు?” అని దావీదు వానిని అడిగాడు.
“నేను ఇశ్రాయేలీయుల శిబిరము నుండి తప్పించుకొని వచ్చాను” అని దావీదుకు సమాధాన మిచ్చాడు.
4 “దయచేసి యుద్ధంలో ఎవరు గెల్చారో చెప్పు” అని దావీదు అడిగాడు.
“జనం యుద్ధభూమి నుండి పారిపోయారు. అనేక మంది హతులయ్యారు. సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయారు” అని చెప్పాడా వ్యక్తి.
5 దావీదు, “సౌలు, ఆయన కుమారుడు యోనాతాను ఇద్దరూ చనిపోయినట్లు నీకు ఎలా తెలుసు?” అని అడిగాడు.
6 అందుకు యువసైనికుడు, ఇలా చెప్పాడు: “నేను ఆ సమయంలో గిల్బోవ పర్వతం మీదకు రావటం జరిగింది. సౌలు తన ఈటెపై ఆనుకొని వుండటం నేను చూశాను. ఫిలిష్తీయులు తమ రథాల మీద, గుర్రాల మీద సౌలుకు చేరువగా వస్తూవున్నారు. 7 సౌలు వెనుదిరిగి నన్ను చూశాడు. అతను నన్ను పిలవగా, ‘నన్నేమి చేయమంటారు?’ అంటూ వెళ్లాను. 8 ‘నీవెవడవు’ అని సౌలు నన్నడిగాడు. నేనొక అమాలేకీయుడనని చెప్పాను. 9 సౌలు నాతో, ‘దయచేసి కొంచెం ఆగి నన్ను చంపివేయి. నేను తీవ్రంగా గాయపడ్డాను. నేను ఇంచుమించు చనిపోయినట్లే’ అని చెప్పాడు. 10 అందువల్ల నేను ఆగి, అతన్ని చంపాను. అతను ఇక బ్రతకనంత తీవ్రంగా గాయపడ్డాడని నాకు తెలుసు. అప్పుడు నేనతని కిరీటాన్ని, కంకణాన్ని తీసుకొని, వాటిని నా యజమానివైన నీ యొద్దకు తెచ్చాను.”
11 తన దుఃఖాన్ని వెలిబుచ్చటానికి దావీదు తన బట్టలను చించుకున్నాడు. దావీదుతో వున్న మనుష్యులందరూ అలానే చేశారు. 12 వారు మిక్కిలి దుఃఖించారు. సాయంత్రం వరకు వారేమీ తినలేదు. సౌలు, అతని కుమారుడు యోనాతాను ఇరువురూ మరణించినందుకు వారు విలపించారు. మరణించిన ప్రజలకొరకు, ఇశ్రాయేలు కొరకు దావీదు, అతని మనుష్యులు దుఃఖించారు. సౌలు, అతని కుమారుడు యోనాతాను, తదితర ఇశ్రాయేలీయులు కత్తులతో నరకబడి చంపబడినందుకు వారు విలపించారు.
అమాలేకీయుని చంపమని దావీదు ఆజ్ఞ
13 సౌలు మరణవార్త తెచ్చిన ఆ యువసైనికుని, “నీవెక్కడ నుంచి వచ్చావు?” అని దావీదు అడిగాడు.
“నేనొక పరదేశీయుని కుమారుడను. అమాలేకీయుడను,” అని ఆ యువసైనికుడు అన్నాడు.
14 “యెహోవాచే ప్రతిష్ఠింపబడిన రాజును చంపటానికి నీవెందుకు భయపడలేదు?” అని దావీదు వానిని అడిగాడు.
15-16 తరువాత దావీదు తన యువభటులలో ఒకనిని పిలిచి ఆ అమాలేకీయుని చంపుమని చెప్పాడు. యువకుడైన ఇశ్రాయేలు సైనికుడు అమాలేకీయుని చంపివేశాడు. “నీ చావుకు నీవే కారకుడవు. నీకు వ్యతిరేకంగా నీవే మాట్లాడావు![a] ‘దేవునిచే ఎంపిక చేయబడిన రాజును నేనే చంపానని’ నీవే అన్నావు,” అని దావీదు ఆ అమాలేకీయునుద్దేశించి అన్నాడు.
సౌలు, యోనాతానులను గూర్చిన దావీదు ప్రలాప గీతిక
17 సౌలు, అతని కుమారుడు యోనాతానులను గూర్చి దావీదు ఒక ప్రలాప గీతం పాడాడు. 18 యూదా ప్రజలకు ఈ పాట నేర్పుమని దావీదు తన మనుష్యులకు చెప్పాడు. ఈ పాట “ధనుర్గీతిక” అని పిలవబడింది: ఈ పాట యాషారు గ్రంథంలో ఇలా వ్రాయబడింది.
19 ఓహో! “ఇశ్రాయేలూ నీ సౌందర్యం ఉన్నత స్థలాలపై ధ్వంసం చేయబడింది!
బలాఢ్యులు పడిపోయారు!
20 ఈ విషయం గాతులో చెప్పవద్దు,
అష్కెలోను[b] వీధులలో ప్రకటించ వద్దు!
ఏలయనగా ఫిలిష్తీయుల ఆడపడుచులు సంతసించ వచ్చు,
సున్నతి కాని వారి కుమార్తెలు ఉల్లసించవచ్చు!
21 “గిల్బోవ పర్వతాలపై హిమబిందువులు గాని
వాన చినుకులు గాని పడకుండుగాక!
ఆ పొలాలు బీడులైపోవుగాక!
యోధులైన వారి డాళ్లు అక్కడ మలినమైనాయి
అభిషిక్తుడైన సౌలు డాలు నూనెతో మెరుగు పెట్టబడలేదు.
22 యోనాతాను విల్లు దానివంతు శత్రు సంహారంచేసింది.
సౌలు కత్తి దానివంతు శత్రువులను తుత్తునియలు చేసింది
అవి శత్రురక్తాన్ని చిందించాయి యోధుల,
కొవ్వును స్పృశించాయి.
23 “సౌలును, యోనాతానును మేము ప్రేమించాము;
వారు బ్రతికి వుండగా వారి సహాయ సంపత్తును అనుభవించాము!
మరణంలో సైతం సౌలు, యోనాతాను ఎడబాటు ఎరుగరు!
వారు పక్షి రాజుల కంటె వేగం గలవారు,
వారు సింహాల కంటె బలంగలవారు!
24 ఇశ్రాయేలు కుమార్తెలారా, సౌలు కొరకు ఏడ్వండి!
సౌలు మిమ్మల్ని ఎర్రని ఛాయగల దుస్తులతో అలంకరించియున్నాడు;
మీ దుస్తులపై బంగారు నగలు పెట్టాడు.
25 “యుద్ధంలో బలవంతులు నేలకొరిగారు!
యోనాతాను గిల్భోవ కొండల్లో కన్ను మూశాడు.
26 యోనాతానూ, సహోదరుడా! నీ కొరకై విలపిస్తున్నాను.
నీ స్నేహపు మాధుర్యాన్ని చవిచూశాను;
నా పట్ల నీ ప్రేమ అద్భతం,
అది స్త్రీల ప్రేమకంటే మహోన్నతమైనది!
27 శక్తిమంతులు యుద్ధ రంగంలో నేలకొరిగారు!
వారి ఆయుధాలు నాశనమయ్యాయి.”
దావీదు తన మనుష్యులతో హెబ్రోనుకు వెళ్లటం
2 దావీదు యెహోవాకు ప్రార్థన చేసి, “నేను యూదా రాజ్యంలో ఏ నగరానికైనా వెళ్లనా?” అని అడిగాడు.
“వెళ్లు” అన్నాడు యెహోవా.
“ఎక్కడికి వెళ్లను?” అని దావీదు అడిగితే,
“హెబ్రోనుకు” అని యెహోవా సమాధానమిచ్చాడు.
2 కావున దావీదు అక్కడికి వెళ్లాడు. ఆయన భార్యలైన యెజ్రెయేలీయురాలగు అహీనోయము, కర్మెలీయుడగు నాబాలు భార్యయు విధవరాలునగు అబీగయీలు ఆయనతో వెళ్లిరి. 3 దావీదు తన మనుష్యులందరినీ వారి వారి కుటుంబాలతో సహా తనవెంట తీసుకొనివెళ్లాడు. వారంతా హెబ్రోను నగర ప్రాంతాలలో తమ నివాసాలను ఏర్పరచుకున్నారు.
4 యూదా ప్రజలు వచ్చి దావీదును యూదా రాజ్యానికి రాజుగా అభిషేకం చేశారు. ఆ పని చేసి, “సౌలుకు అంత్యక్రియలు జరిపినది యాబేష్గిలాదు” వారని దావీదుకు చెప్పారు.
5 యాబేష్గిలాదు ప్రజల వద్దకు దావీదు దూతలను పంపాడు. దావీదు మాటగా వారు యాబేషు ప్రజలకు ఈ విధంగా చెప్పారు: “మీ రాజైన సౌలు అస్థికలను[c] మీరు దయతో పాతిపెట్టినందుకు దేవుడు మిమ్మునాశీర్వదించు గాక! 6 దేవుడు ఇప్పుడు మీపట్ల దయగలవాడై, సత్య దృష్టితో వుంటాడు. మీరు సౌలు అస్థికలను పాతిపెట్టినందుకు నేను కూడా మీపట్ల దయగలిగి వుంటాను. 7 మీ రాజైన సౌలు చనిపోయాడు. కనుక ఇప్పుడు యూదావారు నన్ను పట్టాభిషిక్తునిగా చేశారు. అందువల్ల మీరు బలపరాక్రమ సంపన్నులుగా మెలగండి.”
ఇష్బోషెతు రాజవటం
8 నేరు కుమారుడైన అబ్నేరు సౌలు యొక్క సైన్యాధిపతిగా ఉన్నాడు. అబ్నేరు సౌలు కుమారుడైన ఇష్బోషెతును మహనయీమునకు తీసుకొని వెళ్లాడు. 9 అక్కడ అబ్నేరు అతనిని గిలాదు, ఆషేరి, యెజ్రెయేలు, ఎఫ్రాయిము, బెన్యామీను వారిమీద రాజుగా నియమించాడు. అనగా ఇష్బోషెతు ఇశ్రాయేలుకు రాజయ్యాడు.
10 ఇష్బోషెతు సౌలు కుమారుడు. అతడు ఇశ్రాయేలుకు రాజై పాలించేనాటికి నలుబది ఏండ్ల వయస్సువాడు. అతడు రెండు సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాని యూదా వంశంవారు దావీదును అనుసరించారు. 11 హెబ్రోనులో యూదా వంశవారికి దావీదు ఏడు సంవత్సరాల ఆరునెలలు రాజుగా ఉన్నాడు.
ఇష్బోషెతు, దావీదు రాజులుగా పోటి
12 నేరు కుమారుడైన అబ్నేరు, సౌలు కుమారుడైన ఇష్బోషెతు నౌకరులు మహనయీము వదిలి పయనమైపోయారు. వారు గిబియోను చేరారు. 13 సెరూయా కుమారుడుగు యోవాబు, దావీదు సేవకులు కూడా గిబియోనుకు వెళ్లారు. గిబియోను మడుగువద్ద వారు అబ్నేరును, ఇష్బోషెతు సేవకులను కలిసారు. అబ్నేరు తరపువారంతా కొలనుకు ఒక పక్క కూర్చున్నారు. యోవాబు పక్షం వారు మరొక ప్రక్క కూర్చున్నారు.
14 యోవాబుతో అబ్నేరు, “మన ఇరుపక్షాల యువకులనూ ప్రోత్సహించి వారి మధ్య బలప్రదర్శన ఇక్కడ జరుపుదాము” అన్నాడు.
పోటీ నిర్వహించటానికి యోవాబు ఒప్పుకున్నాడు.
15 అప్పుడు యువసైనికులు లేచారు. ఇరుపక్షాల వారూ వారి వారి యువసైనికులను పోటీకి లెక్కపెట్టారు. ఇష్బోషెతు పక్షాన బెన్యామీను వంశీయులు, దావీదు పక్షాన అతని అనుచరులు పన్నెండు మంది చొప్పున ఎంపిక చేయబడ్డారు. 16 ప్రతి ఒక్కడూ తన ప్రత్యర్థి తలను పట్టుకొని తమ కత్తులతో వారి డొక్కలలో పోడుచుకున్నారు. దానితో వారంతా ఒక్క పెట్టున నేలకొరిగారు. అందువల్ల ఆ ప్రదేశం “చురకత్తుల క్షేత్రం”[d] అని పిలవబడింది. ఆ ప్రదేశం గిబియోనులో ఉంది. 17 ఆ రోజు పోటీ ఒక భయంకర పోరాటంగా మారింది. దావీదు సైనికులు అబ్నేరును, ఇశ్రాయేలీయులను ఓడించారు.
అబ్నేరు అశాహేలును చంపటం
18 యోవాబు, అబీషై, అశాహేలు అనువారు ముగ్గురూ సెరూయా కుమారులు. అశాహేలు పరుగులో మిక్కిలి వడి గలవాడు. అడవిలేడిలా వేగంగా పరుగు తీయగలవాడు. 19 అశాహేలు అబ్నేరును తరుముకుంటూ పోయాడు. అశాహేలు తిన్నగా అబ్నేరును అనుసరించి తరిమాడు. 20 అబ్నేరు వెనుదిరిగి చూసి, “నీవు అశాహేలువా?” అని అడిగాడు.
“అవును నేనే” అన్నాడు అశాహేలు.
21 “(అబ్నేరు అశాహేలును గాయ పరచేందుకు ఇష్టపడలేదు) అయితే నీవు కుడి పక్కకు గాని, ఎడమ పక్కకు తిరిగి అక్కడ వున్న యువకులలో ఒకడిని పట్టుకుని వాని కవచం నీ కొరకు తీసుకో” అన్నాడు అబ్నేరు. కాని అశాహేలు అబ్నేరును వెంటాడటం మానటానికి ఒప్పుకోలేదు.
22 అబ్నేరు మళ్లీ అశాహేలుతో ఇలా అన్నాడు: “నన్ను తరమటం ఆపివేయుము. నీవు ఆపకపోతే నేను నిన్ను చంపుతాను. నేను నిన్ను చంపిన పక్షంలో నీ సోదరుడైన యోవాబు ముఖం మళ్లీ నేను చూడ లేను!”
23 కాని అశాహేలు అబ్నేరును తరమటం మానలేదు. దానితో అబ్నేరు తన ఈటె వెనుక భాగంతో అశాహేలు పొట్టలో పొడిచాడు. ఈటె మడం ఎంత తీవ్రంగా దిగబడిందంటే అది పొట్టలో నుండి వీపు ద్వారా బయటికి వచ్చింది. అశాహేలు అక్కడికక్కడే మరణించాడు.
యోవాబు, అబీషైలు అబ్నేరును వెంటాడటం
అశాహేలు శవం నేలమీద పడివుంది. అతని మనుష్యులందరూ అక్కడికి వచ్చి ఆగారు. (అశాహేలును చూసేందుకు) 24 కాని యోవాబు, అబీషై[e] లిరువురూ అబ్నేరును వెంటాడసాగారు. వారు అమ్మా కొండ చేరేసరికి సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు. గిబియోను ఎడారిమార్గంలో గీహ ఎదురుగా అమ్మా కొండవుంది. 25 బెన్యామీనీయులంతా అబ్నేరు వద్దకు వచ్చి కొండ మీద కూడారు.
26 అబ్నేరు యోవాబును పిలిచి, “కత్తివుంటే అది ఎల్లప్పుడూ చంపటానికేనా? నీకు తెలుసు; నిజానికి ఇది విషాదాంతమవుతుంది! తమ సోదరులనే వెంటాడటం మానివేయమని ఆ మనుష్యులకు చెప్పు” అని అన్నాడు.
27 “నీవామాట అన్నావు, మంచిదే. దేవుని జీవంతోడుగా చెబుతున్నాను. నీవు ఇప్పుడు మాట్లాడకుండా వుండివుంటే ఈ జనం వారి సోదరులను తెల్లవారేవరకు తరుముకుంటూ పోయేవారు” అని యోవాబు అన్నాడు. 28 అప్పుడు యోవాబు ఒక బూర వూదాడు. దానితో అతని మనుష్యులు ఇశ్రాయేలీయులను తరమటం మానివేశారు. ఆ తరువాత ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయాలని వారు ఎంతమాత్రం ప్రయత్నం చేయలేదు.
29 అబ్నేరు, అతని మనుష్యులు ఆ రాత్రంతా అరాబహు మైదానం గుండా ప్రయాణం చేసి యొర్దాను నదిని దాటారు. మరునాటి పగలంతా వారు ప్రయాణం చేసి మహనయీముకు చేరారు.
30 యోవాబు అబ్నేరును తరుముట మాని, తిరిగి వచ్చాడు, యోవాబు తన జనాన్ని సమావేశ పర్చినప్పుడు దావీదు అనుచరులలో పందొమ్మిది మంది తప్పియున్నారు. అశాహేలు కూడా లేడు. 31 అబ్నేరు అనుచరులలో మూడువందల అరువది మంది బెన్యామీనీయులను దావీదు సేవకులు వధించారు. 32 దావీదు మనుష్యులు అశాహేలు శవాన్ని బేత్లెహేముకు తీసుకొని వెళ్లి, అక్కడ ఉన్న అతని తండ్రి సమాధిలోనే పాతి పెట్టారు.
యోవాబు, అతని మనుష్యులు రాత్రంతా పయనించారు. వారు హెబ్రోను చేరేసరికి సూర్యోదయమయ్యింది.
యేసు ఒక రోగికి నయం చెయ్యటం
14 ఒక విశ్రాంతి రోజు యేసు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటికి భోజనానికి వెళ్ళాడు. వాళ్ళు ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 2 దేహమంతా నీరొచ్చిన[a] ఒక వ్యక్తి యేసు ముందు కొచ్చాడు. 3 యేసు శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం శాస్త్ర సమ్మతమా? కాదా?” అని అడిగాడు. 4 వాళ్ళు దానికి సమాధానం చెప్పలేదు. యేసు ఆ రోగి మీద తన చేతులుంచి నయం చేసి పంపాడు. 5 ఆ తర్వాత, “మీ కుమారుడో లేక మీ ఎద్దు విశ్రాంతి రోజు బావిలో పడితే మీరు వెంటనే పైకి లాగి రక్షించరా?” అని అడిగాడు. 6 దానికి వాళ్ళు సమాధానం చెప్పలేక పోయారు.
నిన్ను నీవు గొప్ప చేసికొనవద్దు
7 విందులకు వచ్చిన అతిథులు గౌరవ స్థానం ఆక్రమించుట గమనించి యేసు వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: 8 “మీరు పెళ్ళి విందుకు ఆహ్వానింపబడినప్పుడు, మీకన్నా ముఖ్యమైన అతిథులు ఆహ్వానించబడి ఉండవచ్చు. కనుక ముందు స్థానాల్లో కూర్చోకండి. 9 అలాచేస్తే ఆ యింకొక వ్యక్తిని ఆహ్వానించిన వాడు వచ్చి నీతో ‘ఈ స్థలం యితనికి యివ్వు’ అని అంటాడు. నీవు అవమానం పొంది చివరన ఉన్న స్థలంలో కూర్చోవలసి వస్తుంది.
10 “అందువల్ల నిన్ను ఆహ్వానించినప్పుడు చివరన ఉన్న స్థలంలో కూర్చో. అలా చేస్తే నిన్ను ఆహ్వానించిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ‘మిత్రమా! ముందుకు వచ్చి మంచి స్థలంలో కూర్చో’ అని అంటాడు. అప్పుడు అక్కడున్న వాళ్ళలో నీ గౌరవం పెరుగుతుంది. 11 ఎందుకంటే ఉన్నత స్థానాన్ని ఆక్రమించినవాడు అల్ప స్థానానికి దించబడతాడు. తనంతట తాను అల్ప స్థానాన్ని ఆక్రమించినవాడు ఉన్నత స్థానానికి ఎత్తబడతాడు.”
నీకు ప్రతిఫలము దొరుకుతుంది
12 అప్పుడు యేసు తన అతిథితో, “భోజనానికి లేక విందుకు ఆహ్వానించదలచినప్పుడు మీ స్నేహితుల్ని కాని, మీ సోదరుల్ని కాని, మీ బంధువుల్ని కాని ధనికులైన మీ ఇరుగు పొరుగు వాళ్ళను కాని ఆహ్వానించకండి. అలా చేస్తే మిమ్మల్ని కూడా వాళ్ళు ఆహ్వానిస్తారు. అప్పుడు వాళ్ళ రుణం తీరిపోతుంది. 13 కనుక మీరు విందు చేసినప్పుడు పేదవాళ్ళను, వికలాంగులను, కుంటివాళ్ళను, గ్రుడ్డివాళ్ళను ఆహ్వానించండి. 14 వాళ్ళు మీ రుణం తీర్చలేరు. కనుక మీరు ధన్యులౌతారు. ఎందుకంటే మంచి వాళ్ళు బ్రతికి వచ్చినప్పుడు దేవుడు మీరు చేసిన మంచి పనికి మంచి బహుమతి నిస్తాడు” అని అన్నాడు.
పెద్ద విందు ఉపమానం
(మత్తయి 22:1-10)
15 భోజనానికి కూర్చున్న వాళ్ళలో ఒకడు యిది విని యేసుతో, “దేవుని రాజ్యంలో జరిగే విందులో పాల్గొన్నవాడు ధన్యుడు” అని అన్నాడు.
16 యేసు యిలా చెప్పాడు: “ఒకడు పెద్ద విందు చేయదలచి చాలా మందిని ఆహ్వానించాడు. 17 వంటలు సిద్ధమయ్యాక తాను ఆహ్వానించిన వాళ్ళ దగ్గరకు తన సేవకుణ్ణి పంపి ‘రండి! అంతా సిద్ధం’ అని చెప్పమన్నాడు. 18 కాని అందరూ ఒకే రీతిగా సాకులు చెప్పారు. మొదటివాడు ‘నేను పొలం కొన్నాను, వెళ్ళి తప్పకుండా దాన్ని చూడాలి; నన్ను క్షమించు’ అని అన్నాడు. 19 ఇంకొకడు ‘నేను ఐదు జతల ఎద్దులు కొన్నాను. వెళ్ళి అవి ఏ విధంగా పనిచేస్తాయో చూడాలి, నన్ను క్షమించుము’ అని అన్నాడు. 20 మరొకడు ‘నేను ఈ రోజే పెళ్ళి చేసుకున్నాను కనుక రాలేను’ అని అన్నాడు.
21 “ఆ సేవకుడు తిరిగి వచ్చి జరిగినదంతా తన యజమానితో చెప్పాడు. అతనికి కోపం వచ్చి తన సేవకునితో, ‘వెంటనే పట్టణంలో ఉన్న అన్ని వీధుల్లోకి వెళ్ళి పేదవాళ్ళను, వికలాంగులను, గ్రుడ్డివాళ్ళను, కుంటివాళ్ళను పిలిచుకురా!’ అని అన్నాడు.
22 “ఆ సేవకుడు మళ్ళీవచ్చి, ‘అయ్యా! మీరు చెప్పినట్లు చేసాను. కాని భోజనశాలలు ఇంకా నిండలేదు’ అని అన్నాడు. 23 అప్పుడు ఆ యజమాని తన సేవకునితో ‘ఊరి బయటనున్న రహదారులకు, పొలాలకు వెళ్ళి అక్కడి వాళ్ళను తప్పక రమ్మనమని చెప్పు. వాళ్ళతో నా యిల్లంతా నిండి పోవాలి. 24 నేను చెప్పేదేమిటంటే నేనిదివరకు పిలిచిన వాళ్ళలో ఒక్కడు కూడా నా విందు రుచి చూడడు’ అని అన్నాడు.”
© 1997 Bible League International