Revised Common Lectionary (Semicontinuous)
దేవాలయ నిర్మాణానికి దావీదు ఆలోచన
7 దావీదు తన కొత్త ఇంటిలో నివసించుచున్న కాలంలో యెహోవా అతనికి చుట్టూ వున్న శత్రువుల నుండి ఏ బాధలూ లేకుండా శాంతిని సమకూర్చాడు. 2 రాజు (దావీదు) నాతాను అనే ఒక ప్రవక్త వద్దకు వెళ్లి, “చూడు, నేను దేవదారు కలపతో నిర్మించబడిన ఒక భవంతిలో ఉంటున్నాను. కాని దేవుని పవిత్ర పెట్టె ఇంకా గుడారంలోనే ఉంచబడింది!” అన్నాడు
3 రాజుతో (దావీదు) నాతాను, “వెళ్లు. నీవు వాస్తవంగా ఏమి చేయాలని అనుకుంటున్నావో అది చేయుము. యెహోవా నీతో ఉన్నాడు” అని చెప్పాడు.
4 కాని ఆ రాత్రి యెహోవా వాక్యం నాతానుకు చేరింది.
5 “యెహోవా నాతానును పిలచి ఆయన మాటగా, ఆయన సేవకుడైన దావీదుతో ఇలా చేప్పమన్నాడు: ‘నా కొరకు ఆలయ నిర్మాణం చేయవలసిన వ్యక్తివి నీవు కాదు. 6 ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుండి తీసుకొని వచ్చినప్పుడు నేను ఆలయంలో నివసించలేదు. ఒక గుడారంలో వుంటూనే అటూ ఇటూ పయనించాను. గుడారాన్నే నివాసంగా వినియోగించుకున్నాను. 7 ఇశ్రాయేలు వంశము వారిలో ఏ ఒక్కరికీ దేవదారు కలపతో నాకు ఆలయం నిర్మించే విషయంపై ఒక్క మాటకూడ చెప్పియుండలేదు.’
8 “సర్వశక్తిమంతుడైన యెహోవా నాతానును దావీదుతో ఇంకా ఇలా చెప్పమన్నాడు, ‘నిన్ను నేను పచ్చిక బయళ్ల నుండి పట్టుకొచ్చాను. నీవు గొర్రెలను కాస్తూ వుండగా నిన్ను పట్టుకొచ్చాను. నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు నాయకునిగా వుండేందుకు నిన్ను తెచ్చాను. 9 నీవు ఎక్కడికి వెళితే అక్కడికల్లా నేను నీతో వచ్చాను. నీ కొరకు నీ శత్రువులందకరినీ ఓడించాను. ఇప్పుడు ఈ భూమి మీద అతి ప్రముఖ వ్యక్తులలో ఒకరిగా నిన్ను నేను చేస్తాను. 10-11 ఇశ్రాయేలీయులైన నా ప్రజలకు నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. ఇశ్రాయేలీయులందరినీ అక్కడ స్థిరపడేలా చేసి వారి స్వంత స్థలంలో వారుండేలా చేస్తాను. ఆ తరువాత వారెన్నడూ కదిలే పనివుండదు. గతంలో నా ఇశ్రాయేలు ప్రజలకు మార్గదర్శకులుగా నేను న్యాయాధిపతులను పంపియున్నాను. కాని దుష్ట జనులు వారిని బాధించారు. అదిప్పుడు జరగదు. నీ శ్రతువులందరి నుండి నీకు శాంతి లభించేలా చేస్తాను. నీ వంశంలో రాజులు వర్ధిల్లేలా చేస్తానని కూడా చెబుతున్నాను.[a]
12 “‘నీకు అంత్యకాలం సమీపించినప్పుడు నీ పూర్వీకుల వద్దనే సమాధి చేయబడతావు. అప్పుడు నేను నీ స్వంత పిల్లలలో ఒకనిని రాజుగా చేస్తాను. 13 అతడు నా నామాన్ని ఘనపర్చే విధంగా ఒక దేవాలయం నిర్మిస్తాడు. అతని రాజ్యాన్ని శాశ్వత ప్రాతిపదికపై చాలా బలమైనదిగా చేస్తాను. 14 అతనికి తండ్రిగా నేను వ్యవహరిస్తాను. అతడు నాకు కుమారుడు. అతడు పాపం చేస్తే, అతనిని శిక్షించటానికి వేరే ప్రజలను వినియోగిస్తాను. వారు దండములు ధరించి నా తరుపున పనిచేస్తారు.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37 చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”
మనము క్రీస్తులో ఒకటిగా ఉన్నాము
11 మీరు యూదులుగా పుట్టలేదు. కనుక యూదులు మిమ్మల్ని “సున్నతి చేయించుకోనివాళ్ళు” అని అంటారు. తాము సున్నతి పొందినవాళ్ళైనందుకు వాళ్ళు గర్విస్తూవుంటారు. వీళ్ళ సున్నతి శారీరకమైనది. ఆత్మవల్ల పొందింది కాదు. ఇది మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 12 అంతేకాక ఒకప్పుడు మీరు క్రీస్తుతో కాక విడిగా ఉండేవాళ్ళు. ఇశ్రాయేలు దేశంలో మీకు పౌరసత్వం లేదు. దేవుడు వాగ్దానం చేసిన ఒడంబడికలో మీకు భాగం లేదు. మీరు రక్షణ లభిస్తుందన్న ఆశలేకుండా, ఈ ప్రపంచంలో దేవుడనేవాడు లేకుండా జీవించారు. ఇది కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి. 13 కాని ఒకప్పుడు దూరంగా ఉన్న మీరు క్రీస్తు రక్తం వల్ల దేవునికి దగ్గర అయ్యారు.
14 మనకు సంధి కలిగించిన వ్యక్తి క్రీస్తు. ఆయన యిద్దరినీ ఒకటిగా చేసి ద్వేషమనే అడ్డుగోడను నిర్మూలించాడు. 15 ధర్మశాస్త్రాన్ని, అందులో చెప్పిన ఆజ్ఞల్ని, నియమాల్ని తన ప్రాణం అర్పించి రద్దు చేసాడు. ఇద్దరినీ కలిపి తనలో ఒక క్రొత్త మనిషిని సృష్టించి శాంతి స్థాపించాలని ఆయన ఉద్దేశ్యం. 16 ఈ విధంగా సిలువ ద్వారా వాళ్ళ మధ్య ఉన్న ద్వేషాన్ని నిర్మూలించి ఒకటిగా ఉన్న ఆ క్రొత్త మనిషికి, దేవునికి సంధి కుదర్చాలని ఆయన ఉద్దేశ్యం. 17 క్రీస్తు వచ్చి దూరంగా ఉన్న మీకు, మరియు దగ్గరగా ఉన్న వాళ్ళకు శాంతి సువార్తను ప్రకటించాడు. 18 ఆయన కారణంగా మన యిద్దరికి, తండ్రి దగ్గరకు ఒక ఆత్మ ద్వారా వెళ్ళే అవకాశం కలిగింది.
19 అందువల్ల మీరిక మీదట పరులు కారు. పరదేశీయులు కారు. పవిత్రులతో కలిసి జీవిస్తున్న తోటి పౌరులు. దేవుని కుటుంబానికి చెందిన సభ్యులు. 20 మీరు కూడా అపొస్తలులు, ప్రవక్తలు వేసిన పునాదిపై కట్టబడ్డారు. క్రీస్తు దానికి ప్రధానమైన మూలరాయి. 21 ఆయనవల్ల ఈ ఇల్లు సక్రమంగా నిర్మింపబడి అభివృద్ధి చెందుతుంది. అది ప్రభువు పవిత్ర దేవాలయము. 22 ఆయనలో ఐక్యత పొందిన మిమ్మల్ని కూడా యితర్లతో చేర్చి ఈ ఇల్లు నిర్మింపబడుతుంది. ఈ యింటిలో దేవుని ఆత్మ నివసిస్తాడు.
యేసు ఐదువేల మందికి పైగా భోజనం పెట్టటం
(మత్తయి 14:13-21; లూకా 9:10-17; యోహాను 6:1-14)
30 అపొస్తలులు యేసు చుట్టూ చేరి తాము చేసిన వాటిని గురించి, బోధించిన వాటిని గురించి వివరంగా ఆయనకు చెప్పారు. 31 వాళ్ళ దగ్గరకు చాలామంది వస్తూ పోతూ ఉండటంవల్ల వాళ్ళకు తినటానికి కూడా సమయం లేకపోయింది. అందుకు యేసు వాళ్ళతో, “నాతో మీరు మాత్రమే ఏకాంత ప్రదేశానికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోండి” అని అన్నాడు.
32 అందువల్ల వాళ్ళు మాత్రమే ఒక పడవనెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్ళారు. 33 కాని, వాళ్ళు వెళ్ళటం చాలా మంది చూసారు. వాళ్ళెవరో గుర్తించి అన్ని పట్టణాల నుండి పరుగెత్తుకొంటూ వెళ్ళి, వాళ్ళకన్నా ముందే ఆ ఎడారి ప్రాంతాన్ని చేరుకొన్నారు. 34 యేసు పడవ దిగి ఆ ప్రజాసమూహాన్ని చూసాడు. కాపరి లేని గొర్రెల్లా ఉన్న ఆ ప్రజల్ని చూసి ఆయనకు జాలివేసింది. అందువల్ల వాళ్ళకు ఎన్నో విషయాలు బోధించటం మొదలు పెట్టాడు.
యేసు రోగులనేకులను నయం చేయటం
(మత్తయి 14:34-36)
53 సముద్రం దాటి గెన్నేసరెతు తీరాన్ని చేరుకొని అక్కడ పడవను నిలిపారు. 54 వాళ్ళు పడవ దిగగానే ప్రజలు యేసును గుర్తించారు. 55 ప్రజలు చుట్టూ ఉన్న ప్రాంతాలకు పరుగెత్తి వెళ్ళి రోగుల్ని చాపలపై పడుకోబెట్టి ఆయనున్న చోటికి తీసుకు వచ్చారు. 56 పల్లెల్లో, పట్టణాల్లో, పొలాల్లో, చుట్టూ, ఆయన వెళ్ళిన ప్రతిచోట రోగుల్ని వీథుల్లో పడుకోబెట్టారు. ఆయన వస్త్రానైనా తాకనీయమని ఆయన్ని బ్రతిమిలాడారు. ఆయన్ని తాకిన ప్రతి ఒక్కరికి నయమై పోయింది.
© 1997 Bible League International