Revised Common Lectionary (Complementary)
స్తుతి కీర్తన.
98 యెహోవా, నూతన అద్బుత క్రియలు చేశాడు
గనుక ఆయనకు ఒక క్రొత్త కీర్తన పాడండి.
ఆయన పవిత్ర కుడి హస్తం
ఆయనకు విజయం తెచ్చింది.
2 యెహోవా రక్షించగల తన శక్తిని రాజ్యాలకు చూపెట్టాడు.
యెహోవా తన నీతిని వారికి చూపించాడు.
3 ఇశ్రాయేలీయుల యెడల ఆయన తన దయను, నమ్మకమును జ్ఞాపకముంచుకొన్నాడు.
రక్షించగల మన దేవుని శక్తిని దూరదేశాల ప్రజలు చూసారు.
4 భూమి మీది ప్రతి జనము యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
త్వరగా స్తుతి కీర్తనలు పాడటం ప్రారంభించండి.
5 స్వరమండలములారా, యెహోవాను స్తుతించండి.
స్వరమండలసంగీతమా, ఆయనను స్తుతించుము.
6 బూరలు, కొమ్ములు ఊదండి.
మన రాజైన యెహోవాకు ఆనంద ధ్వని చేయండి.
7 భూమి, సముద్రం, వాటిలో ఉన్న
సమస్త జీవుల్లారా, బిగ్గరగా పాడండి.
8 నదులారా, చప్పట్లు కొట్టండి.
పర్వతములారా, ఇప్పుడు మీరంతా కలిసి గట్టిగా పాడండి.
9 యెహోవా ప్రపంచాన్ని పాలించుటకు వస్తున్నాడు
గనుక ఆయన ఎదుట పాడండి.
ఆయన ప్రపంచాన్ని న్యాయంగా పాలిస్తాడు.
నీతితో ఆయన ప్రజలను పాలిస్తాడు.
యెహోవా మహిమ దేవాలయమును వదలుట
10 తరువాత నేను కెరూబు దూతల తలలపైవున్న పాత్రవైవు చూశాను. అది స్వచ్చమైన నీలపు మణిగా కనబడింది. ఆ పాత్రమీద సింహాసనం వంటిది ఒకటుంది. అక్కడ నుండి దేవుణ్ణి చూడవచ్చు. 2 నారబట్టలు వేసుకున్న వ్యక్తితో దేవుడు ఇలా అన్నాడు: “నీవు కెరూబు చక్రాల మధ్య ప్రాంతంలోకి రమ్ము. కెరూబు దూతల మధ్య నుండి కొన్ని మండే నిప్పు కణికెలను తీసుకో. ఆ నిప్పును నీ చేతిలో పట్టుకొని వెళ్లి, దానిని యెరూషలేము నగరంపై విసిరివేయి.”
ఆ వ్యక్తి నా ప్రక్క నుండి వెళ్లాడు. 3 ఆ వ్యక్తి మేఘంలోకి ప్రవేశించినప్పుడు ఆలయానికి దక్షిణానవున్న ప్రదేశంలో కెరూబు దూతలు నిలబడ్డారు. మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మిఉంది. 4 పిమ్మట దేవుని మహిమా ప్రకాశం కెరూబు దూతల మీదినుండి పైకి లేచింది. ఆ దూతలు ఆలయం గడపమీద నిలబడి ఉన్నారు. పిమ్మట ఆలయాన్ని మేఘం నింపి వేసింది. యెహోవా తేజస్సు ఆలయ ఆవరణాన్నంతా ఆవరించింది. 5 ఆ తరువాత కెరూబుల రెక్కల ధ్వని వెలుపలి ఆవరణమంతా వినబడ్డది. సర్వశక్తి మంతుడైన దేవుడు మాట్లాడినప్పుడు వచ్చే ఆ శబ్దం ఉరుములాంటి స్వరంలా గంభీరంగా ఉంది. రెక్కల చప్పుడు చాలా దూరంలో గల బయటి ఆవరణ వరకు వినవచ్చింది.
6 నారబట్టలు ధరించిన వ్యక్తికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. నీవు కెరూబుల మద్య చక్రాల నడిమి ప్రాంతంలోకి వెళ్లి, మండే నిప్పును తీసుకొని రమ్ము. కావున ఆ వ్యక్తి ఒక చక్రం ప్రక్కగా నిలబడ్డాడు. 7 కెరూబులలో ఒకరు తన చేయిచాపి వాటి మధ్యనున్న మండే నిప్పును తీశాడు. ఆ నిప్పును ఆ వ్యక్తి చేతిలో వేశాడు. దానిని తీసుకొని ఆ వ్యక్తి వెళ్లిపోయాడు. 8 (కెరూబుల రెక్కల క్రింద మానవుల చేతుల వంటివి ఉన్నాయి.)
9 అక్కడ నాలుగు చక్రాలున్నట్లు నేనప్పుడు చూశాను. ప్రతి కెరూబుల ప్రక్క ఒక చక్రం చొప్పున ఉన్నాయి. చక్రాలు స్వచ్చమైన విలువైన రాయిగా కనిపించాయి. 10 మొత్తం నాలుగు చక్రాలున్నాయి. అవన్నీ ఒకే రీతిగా కన్పించాయి. ఒక చక్రంలో మరి యొకటి ఉన్నట్లు అవి కన్పించాయి. 11 కదిలినప్పుడు ఆ నాలుగూ ఒకేసారి ఏ దిశలోనైనా వెళ్ళగలిగినవి. కాని కెరూబులు కదలినప్పుడు అటు ఇటు తిరిగేవారు కాదు. తమ తలలు చూస్తున్న దిశలోనే వారు కదలి వెళ్లేవారు. వారు కదలినప్పుడు అటు ఇటు తిరుగలేదు. 12 వారి శరీరాల నిండా కన్నులున్నాయి. వారి వీపుల మీద. చేతుల మీద, వారి రెక్కల మీద. వారి చక్రాల మీద కన్నులున్నాయి. అవును, నాలుగు చక్రాల మీద కన్నులున్నాయి! 13 నేను విన్నది ఈ చక్రాలనే. వీటినే “చక్రాల మధ్యనున్న స్థలం” అంటారు.
14-15 ప్రతి కెరూబుకూ నాలుగు ముఖాలున్నాయి. మొదటి ముఖం కెరూబు ముఖం.[a] రెండవ ముఖం మనుష్య ముఖం. మూడవది సింహపు ముఖం. నాల్గవది గద్దముఖం. ఈ కెరూబు దూతలు నేను కెబారు కాలువ వద్ద దర్శనంలో చూచిన జీవులే.
పిమ్మట కెరూబు గాలిలోకి పైకి లేచారు. 16 వాటితో పాటు చక్రాలు లేచాయి. కెరూబులు రెక్కలు లేపి గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు తమ దిశను మార్చలేదు. 17 కెరూబులు గాలిలోకి ఎగిరినప్పుడు చక్రాలు వారితో వెళ్లాయి. కెరూబు దూతలు నిలకడగా ఉన్నప్పుడు చక్రాలు కూడా అలానే ఉండేవి. ఎందువల్లనంటే ఆ జీవియొక్క ఆత్మ (శక్తి) అంతా చక్రాలలోనే ఉంది.
18 తరువాత యోహోవా మహిమ ఆలయ గుమ్మం మీది నుండి పైకిలేచి, కెరూబుల మీదికి వచ్చి అగింది. 19 అప్పుడు కెరూబులు తమ రెక్కలు విప్పి గాలిలోకి ఎగిరిపోయారు. వారు దేవాలయాన్ని వదిలి వెళ్లటం నేను చూశాను! చక్రాలు వారితో వెళ్లాయి. తరువాత వారు ఆలయపు తూర్పు ద్వారం వద్ద ఆగారు. ఇశ్రాయేలు దేవుని మహిమ గాలిలో వారిపై నిలిచింది.
దేవుని రాజ్యం రావటం
(మత్తయి 24:23-28, 37-41)
20 కొందరు పరిసయ్యులు, “దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది” అని అడిగారు.
యేసు, “దేవుని రాజ్యం అందరికి కనిపించేలా రాదు. 21 ‘ఇదిగో, దేవుని రాజ్యం ఇక్కడ ఉంది; అదిగో అక్కడ ఉంది’ అని ఎవరూ అనరు. ఎందుకంటే దేవుని రాజ్యం మీలో ఉంది!” అని సమాధానం చెప్పాడు.
22 ఆ తర్వాత, తన శిష్యులతో, “మనుష్యకుమారుడు మీతో ఒక్క రోజన్నా ఉండాలని మీరు తహతహలాడే సమయం వస్తుంది. కాని అలా జరగదు. 23 ప్రజలు, ‘అదిగో అక్కడ ఉన్నాడని’ కాని, లేక ‘ఇదిగో ఇక్కడున్నాడని’ కాని అంటే వాళ్ళ వెంట పరుగెత్తి వెళ్ళకండి.
24 “ఎందుకంటే మనుష్యకుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఆకాశంలో ఈ చివరినుండి ఆ చివరి దాకా మెరిసే మెరుపులా ఉంటాడు. 25 కాని దానికి ముందు ఆయన ఎన్నో కష్టాలు అనుభవించాలి. ఈ తరం వాళ్ళతో తృణీకరింపబడాలి.
26 “నోవహు కాలంలో జరిగిన విధంగా మనుష్యకుమారుని కాలంలో కూడా జరుగుతుంది. 27 నోవహు నావలో ప్రవేశించేదాకా ప్రజలు తింటూ, త్రాగుతూ, వివాహాలు చేస్తూ, వివాహాలు చేసుకొంటూ గడిపారు. అతడు నావలో ప్రవేశించాక వరదలు రాగా మిగిలిన వాళ్ళందరూ నాశనమయ్యారు.
28 “లోతు కాలంలో కూడా అదేవిధంగా జరిగింది. ప్రజలు తింటూ, త్రాగుతూ, అమ్ముతూ, కొంటూ, పొలాలు సాగుచేస్తూ, ఇళ్ళు కడుతూ జీవించారు. 29 కాని లోతు సొదొమ పట్టణం వదిలి వెళ్ళిన వెంటనే ఆకాశం నుండి మంటలు, గంధకము వర్షంలా కురిసి అందర్ని నాశనం చేసింది. 30 మనుష్యకుమారుణ్ణి దేవుడు వ్యక్తం చేసిన రోజు కూడా ఇదే విధంగా జరుగుతుంది.
31 “ఆ రోజు ఇంటి కప్పు మీదనున్న వాళ్ళు తమ వస్తువులు తెచ్చుకోవటానికి ఇళ్ళలోకి వెళ్ళరాదు. అదే విధంగా పొలాల్లో ఉన్నవాళ్ళు ఏ వస్తువు కోసం ఇంటికి తిరిగి వెళ్ళరాదు. 32 లోతు భార్యను జ్ఞాపకం తెచ్చుకొండి.
33 “తన ప్రాణాన్ని కాపాడు కోవాలనుకొన్నవాడు పోగొట్టుకొంటాడు. ప్రాణం పోగొట్టుకోవటానికి సిద్దంగా ఉన్నవాడు తన ప్రాణం కాపాడుకొంటాడు. 34 ఆ రాత్రి ఒక పడక మీద ఇద్దరు నిద్రిస్తూ ఉంటే ఒకడు వదిలి వేయబడి మరొకడు తీసుకొని వెళ్ళబడతాడు. 35 ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుతూ ఉంటే ఒకామె తీసుకు వెళ్ళబడుతుంది, మరొకామె వదిలి వేయబడుతుంది” అని అన్నాడు. 36 [a]
37 “ఇవి ఎక్కడ సంభవిస్తాయి ప్రభూ!” అని వాళ్ళు అడిగారు.
ఆయన, “ఎక్కడ శవముంటే అక్కడ రాబందులుంటాయి” అని సమాధానం చెప్పాడు.
© 1997 Bible League International