Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నెహెమ్యా 8-10

ఎజ్రా ధర్మశాస్త్రాన్ని చదవటం

ఆ విధంగా, ఇశ్రాయేలీయులందరూ ఆ ఏడాది ఏడవ నెలలో సమావేశమయ్యారు. వాళ్లందరూ నీటి గుమ్మం ముందరి మైదానంలో ఏక మనస్కులై ఒకే మనిషి అన్నట్లు గుమికూడారు. వాళ్లు ఎజ్రా ఉపదేశకుణ్ణి మోషే ధర్మశాస్త్రాన్ని పైకి తీసి పఠించ వలసిందిగా కోరారు. ఇశ్రాయేలీయులకు యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రమది. యాజకుడైన ఎజ్రా సమావేశమైన జనం ముందుకి ధర్మశాస్త్రాన్ని తెచ్చాడు. అది నెల మొదటి రోజు. అది ఏడాదిలో ఏడవ నెల. ఆ సమావేశంలో స్త్రీలు, పురుషులు విని, అర్థం చేసుకోగల వయస్కులు వున్నారు. ఎజ్రా ఉదయాన్నుంచి మిట్ట మధ్యాహ్నంవరకు ధర్మశాస్త్రాన్ని చదివాడు. నీటి గుమ్మం ఎదుటవున్న మైదానానికి ఎదురుగా నిలబడి, ఎజ్రా స్త్రీలనీ, పురుషుల్నీ విని అర్థం చేసుకోగల వాళ్లందర్నీ ఉద్దేశించి చదివాడు. జనం అందరూ ధర్మశాస్త్ర గ్రంథం పట్ల భక్తి శ్రద్ధలతో విన్నారు.

ఎజ్రా ఈ ప్రత్యేక సందర్భంకోసం నిర్మింపబడిన ఎత్తైన కొయ్య వేదిక మీద నిలబడ్డాడు. ఎజ్రా కుడి ప్రక్కన మత్తిత్యా, షెమ, అనాయా, ఊరియా, హిల్కియా, మయశేయాలు ఉన్నారు. ఎజ్రా ఎడమ ప్రక్కన పెదాయా, మిషాయేలు, మల్కీయా, హాషుము, హష్బద్దానా, జెకర్యా, మెషుల్లాములు వున్నారు.

అప్పుడు ఎజ్రా గ్రంథం విప్పాడు. ఎజ్రా ఎతైన వేదిక మీద నిలబడి ఉన్నందున జనులందరూ అతన్ని చూడగలుగుతున్నారు. ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తెరవగానే, జనం అందరూ గౌరవంగా లేచి నిలబడ్డారు. ఎజ్రా మహా దేవుడైన యెహోవాను స్తుతించాడు. జనులందరూ తమ చేతులు పైకెత్తి బిగ్గరగా, “ఆమేన్! ఆమేన్!” అన్నారు. తర్వాత జనులందరూ నేలమీదవంగి నమస్కరించి యెహోవాను ఆరాధించారు.

జనం అక్కడ నిలబడి వుండగా లేవీయులు ధర్మశాస్త్ర నియమాలను జనానికి బోధించారు. అలా బోధించిన లేవీయులు: యేషూవ, బానీ, షేరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బెతై, హూదీయా, మయశాయా, కెలీటా, అజర్యా, యెజాబాదు, హానాను, పెలాయా. ఆ లేవీయులు దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివారు. వాళ్లు జనానికి అర్థం వివరించి దాన్ని సులభం చేశారు. చదివినదాన్ని జనం తేలిగ్గా అర్థం చేసుకోగలిగేందుకు గాను వాళ్లు తాత్పర్యాలను వివరించి చెప్పారు.

తర్వాత పాలనాధికారి నెహెమ్యా, యాజకుడును, ఉపదేశకుడునైన ఎజ్రా, జనానికి బోధిస్తున్న లేవీయులు మాట్లాడారు. వాళ్లు, “ఈ రోజు మీ దేవుడైన యెహోవాకి ప్రత్యేక దినం[a] మీరు విచారంగా వుండకండి, ఏడ్వకండి!” అని చెప్పారు. ధర్మశాస్త్రంలోని సందేశాలను వింటూ జనం అందరూ రోదించనారంభించిన మూలంగా వాళ్లీ మాటలు చెప్పారు.

10 నెహెమ్యా ఇలా చెప్పాడు: “పోయి కొవ్విన మాంసంతో భోజనం చేయండి, మధుర ద్రాక్షారసం సేవించండి. ఏ ఆహారమూ తయారు చేసుకోని వాళ్లకికొంత ఆహారమూ పానీయాలూ ఇవ్వండి. ఈ రోజు యెహోవాకి ప్రత్యేకమైన రోజు. విచారాన్ని విడనాడండి! ఎందుకంటే, యెహోవా ఆనందం మీకు పుష్టిని చేకూరుస్తుంది.”

11 జనం శాంతచిత్తులయ్యేందుకు లేవీయులు తోడ్పడ్డారు. “శాంతించండి, మౌనంగా వుండండి. ఇదొక ప్రత్యేక దినం, దుఃఖించకండి.”

12 అప్పుడిక అందరూ విందు భోజనం చేసేందుకు వెళ్లారు. వాళ్లు తమ ఆహార పదార్థాలనీ, పానీయాలనీ పరస్పరం పంచుకున్నారు. ఆ ప్రత్యేక దినాన్ని వాళ్లెంతో సంతోషంగా జరుపుకున్నారు. వాళ్లు చివరికి బోధకులు తమకి బోధించ ప్రయత్నిస్తున్న ధర్మశాస్త్ర గుణపాఠాలను అర్థం చేసుకున్నారు.

13 అటు తర్వాత, నెల రెండవ రోజున[b] అన్ని కుటుంబాల పెద్దలూ ఎజ్రానూ, యాజకులనూ, లేవీయులనూ కలుసుకునేందుకు వెళ్లారు. వాళ్లందరూ ధర్మశాస్త్రంలోని ప్రవచనాలను అధ్యయనం చేసేందుకు ఉపదేశకుడైన ఎజ్రాచుట్టూ చేరారు.

14-15 వాళ్లు ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేయగా దానిలో ఈ దిగువ ఆజ్ఞలు వాళ్లకి కనిపించాయి యెహోవా మోషే ద్వారా ఈ ఆజ్ఞ ఇచ్చాడు: ఏడాది ఏడవ నెలలో ఇశ్రాయేలీయులు యెరూషలేముకు ప్రత్యేకమైన పండుగ జరుపుకునేందుకు విధిగా పోవాలి. వాళ్లు తాత్కాలిక పర్ణశాలల్లో ఉండాలి. తమ పట్టణాలన్నింటికీ, యెరూషలేముకీ పోయి, ఈ క్రింది మాటలు ప్రకటించాలి. “పర్వత ప్రాంతానికి పోయి రకరకాల ఒలీవ చెట్ల కొమ్మలు తీసుకురావాలి. కదంబ, తాటి, ఈత ఆకులను, అలాగే నీడనిచ్చే ఇతర మొక్కలను తీసుకురావాలి. ఆ కొమ్మలతో తాత్కాలికమైన పర్ణశాలలు వెయ్యాలి. ధర్మశాస్త్ర గ్రంథం చెప్పినట్లు చెయ్యండి.”

16 సరే, జనం పోయి, ఆ చెట్ల కొమ్మలు తెచ్చారు. తర్వాత వాటితో వాళ్లు తమకి తాత్కాలిక పర్ణశాలలు నిర్మించుకున్నారు. వాళ్లు పర్ణశాలలను తమ ఇళ్ల కప్పులపైనా, తమ ఆవరణల్లోనూ వేసుకున్నారు. వాళ్లు ఆలయ ప్రాంగణంలో, నీటి గుమ్మం దగ్గరి ఖాళీ స్థలంలో, ఎఫ్రాయిము ద్వారం దగ్గర పర్ణశాలలు నిర్మించారు. 17 చెరనుంచి బంధవిముక్తులై తిరిగివచ్చిన ఇశ్రాయేలీయుల బృందమంతా పర్ణశాలలు కట్టు కున్నారు. వాళ్లు తాము కట్టుకున్న పర్ణశాలల్లో నివసించారు. నూను కుమారుడైన యెహోషువా కాలంనుంచి ఆనాటిదాకా ఇశ్రాయేలీయులు పర్ణశాలల పండుగను ఇంత చక్కగా జరుపుకోలేదు. అందరూ ఎంతో సంతోషించారు!

18 ఆ పండుగ ప్రతి రోజూ, మొదటి రోజునుంచి చివరి రోజు వరకు ఎజ్రా వాళ్లకి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి వినిపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ పండగను వారం రోజులపాటు జరుపుకున్నారు. అటు తర్వాత ఎనిమిదో రోజున, ధర్మ శాస్త్రం నిర్దేశించినట్టు ఒక ప్రత్యేక సమావేశం కోసం ఒక చోట కూడారు.

ఇశ్రాయేలీయులు తమ పాపాలను ఒప్పుకొనటం

తర్వాత అదే నెల 24 వ రోజున, ఇశ్రాయేలీయులు ఒక చోట చేరి సామూహిక ఉపవాసం చేశారు. వాళ్లు విచార సూచకమైన దుస్తులు ధరించారు. (తమ విచారాన్ని చూపేందుకు గాను) నెత్తిన బూడిద పోసుకున్నారు. నిజంగా ఇశ్రాయేలీయులైన వాళ్లు అన్య జనులనుంచి వేరుపడి, ఆలయంలో నిలబడి, తమ పాపాలనూ, తమ పూర్వీకుల పాపాలనూ ఒప్పుకొన్నారు. వాళ్లక్కడ సుమారు మూడు గంటలసేపు నిలబడ్డారు, తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని చదివారు, తర్వాత మరో మూడు గంటలు తమ పాపాలు ఒప్పుకొని, యెహోవా ముంగిట సాగిల పడ్డారు.

అటు తర్వాత, ఈ క్రింది లేవీయులు మెట్లపైన నిలబడ్డారు: యేషూవా, బానీ, కద్మీయేలు, షెబన్యా, బున్నీ, షేరేబ్యా, బానీ, కెనానీ. వాళ్లు ఉచ్చ స్వరాల్లో యెహోవాను పిలిచారు. తర్వాత ఈ లేవీయులు మళ్వీ ప్రసంగించారు: యేషువా, బానీ, కద్మీయేలు, హషబ్నెయా, షెరేబ్యా, హోదీయా, షబన్యా, పెతహాయా, వాళ్లు, “లేచి నిలబడి, ప్రభువైన దేవుణ్ణి స్తుతించండి” అని చెప్పారు.

“దేవుడు ఎల్లప్పుడు ఉండును. ఆయన ఎల్లప్పుడూ జీవించును!
నీ ఘననామం స్తుతించబడాలి.
    నీ ఘనమైన నామం సకలాశీర్వచన స్తోత్రాలనూ అధిగమించి పోవాలి!
యెహోవా నీవే దేవుడివి!,
యెహోవా ఆకాశం, అత్యున్నత పరలోకాలు,
    వాటిలోవున్న సమస్తాన్ని నీవే సృజించావు!
భూమినీ, దానిపైనున్న సమస్తాన్నీ
    నీవే సృజించావు!
సముద్రాలను సృజించింది నీవే.
    వాటిలో ఉన్న సమస్తాన్నీ సృజించింది నీవే!
ప్రతిదానికీ ప్రాణంపోసింది నీవే,
    దేవదూతలు నీకు నమస్కరిస్తారు. నీ సన్నిధియందు సాగిలపడతారు నిన్ను ఆరాధిస్తారు!
యెహోవా, నీవే దేవుడివి.
    అబ్రామును ఎంచుకున్నది నీవే.
అతన్ని బబులోనులోని ఊరునుంచి నడిపించింది నీవే.
    అబ్రాహాముగా అతని పేరు మార్చింది నీవే.
అతడు నీకు నమ్మకంగా, విశ్వాసంగా ఉండేలా చూసుకున్నావు.
    అతనితో నీవొక ఒడంబడిక చేసుకున్నావు.
అతని సంతతి వారికి వాగ్దానం చేశావు
    నీవు కనాను, హిత్తీ, అమోరీ, పెరిజ్జీ, యెబూసీ, గిర్గాషి జాతుల దేశాన్ని ఇస్తానన్న.
నీ మాటను నీవు నిలుపుకున్నావు!
    నీవు నిజాయితీగలవాడవు, మాట నిలుపుకున్నావు!
మా పూర్వీకులు ఈజిప్టులో బాధలు పడటం చూశావు!
    సహాయార్థం ఎర్ర సముద్ర తీరాన వారి మొరలు ఆలకించావు.
10 నీవు ఫరోకి అద్భుతాలు ప్రదర్శించావు
    అతని ఉద్యోగులకీ, ప్రజలకీ దిగ్ర్భాంతికరమైన పనులు చేసి చూపావు.
మా పూర్వీకుల కంటె తాము గొప్ప అని
    ఈజిప్టీయులు అనుకోవడం నీకు తెలుసు.
అయితే నీవు, నీ వెంత గొప్పవాడివో నిరూపించుకొన్నావు!
    ఈనాటికీ అది వాళ్లు జ్ఞాపకం ఉంచుకొంటారు.
11 నీవు వాళ్ల కళ్ల ముందు ఎర్ర సముద్రాన్ని విభాగించావు.
    వాళ్లు పొడినేల మీద నడిచి పోయారు!
ఈజిప్టు సైనికులు వాళ్లని తరుముతున్నారు కాని, నీవు ఆ శత్రువుని సముద్రంలో ముంచేశావు.
    మరి వాళ్లు ఒక రాయిలా నీటిలో మునిగారు.
12 పగటి పూట మేఘస్థంభంలో వుండి వాళ్లని నడిపించావు,
    రాత్రివేళ దీపస్ధంభంలో వుండి వాళ్లని నడిపించావు,
ఆ విధంగా నీవు వారి మార్గాన్ని వెలిగించితివి.
    వాళ్లు చేరవలసిన గమ్యాన్ని చూపావు.
13 అప్పుడిక సీనాయి పర్వతం మీదికి దిగి
    ఆకాశంనుంచి వాళ్లతో మాట్లాడాపు.
వాళ్లకి చక్కటి. ధర్మనియమాలిచ్చావు.
    వాళ్లకి సదుపదేశాలిచ్చావు.
మంచి ఆజ్ఞలిచ్చావు, చక్కటి ఆదేశాలిచ్చావు!
14 నీ ప్రత్యేక విశ్రాంతి దినమైన సబ్బాతుని గురించి వాళ్లకి చెప్పావు.
వాళ్లకి ఆజ్ఞలు, చట్టాలు, ఉపదేశాలు ఇచ్చేందుకు నీ సేవకుడు మోషేని వినియోగించావు.
15 వాళ్లు ఆకలిగొన్నప్పుడు
    వాళ్లకి నీవు ఆకాశంనుంచి తిండినిచ్చావు.
వాళ్లు దప్పి గొన్నప్పుడు
    వాళ్లకి నీవు బండ నుంచి మంచి నీళ్లిచ్చావు.
వాళ్లకి చెప్పావు,
    ‘రండి, ఈ భూమి తీసుకోండని’
నీవు నీ శక్తిని వినియోగించి
    వారికోసం ఆ భూమిని తీసుకున్నావు!
16 కాని వాళ్లు, మా పూర్వీకులు గర్వపడి కన్ను గానక ప్రవర్తించారు.
    వాళ్లు మొండి వారై నీ ఆజ్ఞలు పాటించక నిరాకరించారు.
17 వాళ్లు నీ మాటలు తిరస్కరించారు.
    వాళ్లకు నీవు చేసిన ఆశ్చర్యకారాలను అద్భుతాలను మరిచారు.
వాళ్లు మొండివారై ఎదురు తిరిగినప్పుడు,
    వాళ్లు మళ్లీ వెనుకకు తిరిగి బానిసలయ్యారు.

“నీవు క్షమాశీలివి!
    నీవు దయామయుడివి. కరుణామయుడివి.
    నీవు ఓర్పుగలవాడివి. ప్రేమామయుడవు.
అందుకే నీవు వాళ్లను విడువలేదు.
18 వాళ్లు లేగ దూడల బంగారు బొమ్మలు చేసి, ‘మమ్మల్ని ఈజిప్టు నుంచి వెలికి తెచ్చిన దేవుళ్ళు వీరే’
    అన్నా నీవు వాళ్లని వదిలేయలేదు!
19 నీవెంతో దయామయుడివి!
    అందుకే వాళ్లని ఎడారిలో వదిలేయలేదు.
పగటివేళ మేఘస్థంభాన్ని
    వాళ్లనుంచి తప్పించలేదు.
వాళ్లని నడిపిస్తూనే వచ్చావు.
రాత్రివేళ దీపస్తంభాన్ని
    వాళ్ల దృష్టినుంచి తొలగించ లేదు.
వాళ్ల బాటకి వెలుగు చూపుతూనే వచ్చి
    వాళ్లకి మార్గదర్శనం చేస్తూనే వచ్చావు.
20 వాళ్లని వివేకవంతుల్ని చేసేందుకు నీవు వారికి నీ మంచి ఆత్మను ఇచ్చావు.
    వాళ్లకి ఆహారంగా మన్నానిచ్చావు.
    వాళ్ల దప్పిక తీర్చేందుకు మంచి నీరిచ్చావు.
21 నీవు వాళ్లని నలుబదియేండ్లు పోషించావు!
    ఎడారిలో అవసరమైనవన్నీ వాళ్లు పొందారు.
వాళ్ల దుస్తులు చిరిగి పోలేదు.
    వాళ్ల పాదాలు వాయలేదు, గాయపడలేదు.
22 యెహోవా, నీవు వాళ్లకి రాజ్యాలిచ్చావు, దేశాలిచ్చావు,
    జనాభా పలచగావున్న సుదూర ప్రాంతాలనిచ్చావు.
హెష్బోను రాజైన సీహోను దేశాన్నీ,
    బాషాను రాజైన ఓగు దేశాన్నీ పొందారు వాళ్లు.
23 యెహోవా నీవు వాళ్ల సంతతివారిని విస్తరింప చేసావు.
    వాళ్లు ఆకాశంలోని నక్షత్రాలంత మంది ఉండిరి.
వాళ్ల పూర్వీకులకి నీవివ్వ జూపిన దేశానికి
    నీవు వాళ్లని తీసుకొచ్చావు.
    వాళ్లు ఆ భూమిలో ప్రవేశించి, దాన్ని స్వాధీన పరుచుకున్నారు.
24 ఆ బిడ్డలు ఆ భూమిని వశపరచుకున్నారు.
అక్కడ నివసిస్తున్న కనానీయుల్ని వాళ్లు ఓడించారు.
    ఆ ప్రజలను వాళ్లోడించేటట్టు నీవు చేశావు!
ఆ దేశ ప్రజలను, రాజులను
    నీ ప్రజలేమి చేయదలచుకుంటే, అది చేయనిచ్చావు!
25 వాళ్లు బలీయమైన నగరాలను ఓడించారు.
    సారవంతమైన భూమిని కైవసం చేసుకున్నారు.
మంచి వస్తువులతో నిండిన ఇళ్లూ,
    అంతకు ముందే తవ్విన బావులూ వాళ్లకి చిక్కాయి.
వాళ్లకి ద్రాక్షాతోటలు, ఒలీవ చెట్లు, ఎన్నెన్నో రకాల ఫలవృక్షాలు చిక్కాయి.
    వాళ్లు కడువునిండ తిని, కొవ్వెక్కారు.
వాళ్లకి నీవిచ్చిన ఎన్నెన్నో వింత వస్తుపులు వాళ్లు తనివితీరా అనుభవించారు.
26 మరి తర్వాత వాళ్లు నీకు ఎదురు తిరిగారు!
    వాళ్లు నీ బోధనలను త్రోసిపుచ్చారు!
    వాళ్లు నీ ప్రవక్తల్ని హతమార్చారు.
ఆ ప్రవక్తలు చేసిన తప్పిదం జనాన్ని హెచ్చరించడం,
    వాళ్లని తిరిగి నీ వైపుకి తిప్ప ప్రయత్నించడం కొరకే కాని మా పూర్వీకులు నీకు ప్రతికూలంగా దారుణాలెన్నో చేశారు!
27 వాళ్ల శత్రువులు వాళ్లని చెరపట్టడానికి అందుకనే నీవు అనుమతించావు.
    శత్రువులు వాళ్లని నానా ఇబ్బంది పెట్టారు.
కష్టాలు ఎదురైనప్పుడు మా పూర్వీకులు సహాయంకోసం నీకు మొర పెట్టుకున్నారు.
    పరలోకంలో వున్న నీవు వాళ్ల మొర విన్నావు.
నీవు చాలా దయాశీలివి.
    అందుకని నీవు వాళ్లని కాపాడేందుకు మనుషుల్ని పంపావు.
    ఆ మనుష్యులు వాళ్లని వాళ్ల శత్రువుల నుంచి విడిపించారు.
28 సరే, పరిస్థితులు మెరుగవగానే మా పూర్వీకులు తిరిగి
    ఎన్నెన్నో దారుణాలు చేయనారంభించారు!
నీవు మరలా శత్రువులు వారిని ఓడించి, శిక్షించేటట్టు చేశావు.
వాళ్లు మళ్లీ నీకు మొర పెట్టుకున్నారు.
    పరలోకంలో ఉన్న నీవు ఆ మొర విని వాళ్లకి తోడ్డడావు.
నీవెంతో దయామయుడివి!
    ఇలా జరిగింది ఎన్నెన్నోసార్లు!
29 నీవు వాళ్లని హెచ్చరించావు.
    మంచి మార్గానికి తిరిగి రమ్మన్నావు.
    అయితే, వాళ్లు మరీ గర్వపడి,
    నీ ఆదేశాలను, ఆజ్ఞలను మీరారు.
జనం నీ ఆజ్ఞలను పాటిస్తే
    వాళ్లు నిజంగా బ్రతుకుతారు.
కాని మా పూర్వీకులు నీ ఆజ్ఞలు ఉల్లంఘించారు
వాళ్లు మొండివారై,
    నీకు పెడ ముఖమయ్యారు,
    నీ ఆజ్ఞలు పెడచెవిన పెట్టారు.

30 “నీవు మా పూర్వీకుల పట్ల చాలా ఓర్పు వహించావు.
    వాళ్లు నీతో సరిగా వ్యవహరించక పోయినా చాలా సంవత్సరాలు వాళ్లని సహించావు.
నీ ఆత్మతో వాళ్లని హెచ్చరించావు.
    వాళ్లని హెచ్చరించేందుకు ప్రవక్తల్ని పంపావు.
కాని మా పూర్వీకులు వాళ్ల మాటలు వినలేదు.
    అందుకే నీవు వాళ్లని విదేశాల్లోని మనుష్యులకు అప్పగించావు.

31 “అయితే, నీవెంతో దయామయుడివి!
    వాళ్లని నీవు సర్వనాశనం చేయలేదు.
నీవు వాళ్లని విడువలేదు.
    నీవెంతో దయామయుడివి, దేవా, నీవెంతో కరుణామయుడివి!
32 మా దేవా, నీవు మహా దేవుడివి,
    భయంకరుడివి, శక్తిశాలియైన యోధుడివి!
నీవు దయామయుడివి, విశ్వాసనీయుడివి!
    ఒడంబడికను తప్పని వాడివి!
మాకెన్నో కష్టాలు, కడగళ్లు వచ్చాయి.
    మా కష్టాలు నీవు పట్టించుకుంటావు!
మా ప్రజలందరికీ,
    మా రాజులకీ, మా పెద్దలకీ,
    మా యాజకులకీ, మా ప్రవక్తలకీ ఎన్నెన్నో కష్టాలు వచ్చాయి.
అష్షూరు రాజు పాలన కాలం నుంచి నేటిదాకా అవి వున్నాయి!
    కష్టాలు మమ్మల్ని వెన్నాడుతూనే వున్నాయి!
33 అందుకని దేవా మాకు సంభవించే ప్రతి దాన్నిగురించీ నీదే ఒప్పు,
    మాదే తప్పు.
34 మా రాజులు, నాయకులు, యాజకులు, మరి మా పూర్వీకులు నీ ధర్మనిబంధనలు పాటించలేదు.
    వాళ్లు నీ ధర్మశాస్త్రాన్ని మీరారు,
    నీ హెచ్చరికను ఖాతరు చేయలేదు.
35 తమ స్వదేశంలో నివసించినప్పుడు సైతం మా పూర్వీకులు నీకు సేవ చేయలేదు.
    వాళ్లు దుష్టకార్యాలు చేయడం మానలేదు.
    నీవు వాళ్లకిచ్చిన అద్భుతమైన వాటన్నిటినీ హాయిగా అనుభవించారు.
వాళ్లు సారవంతమైన భూమిని అనుభవించారు సువిశాల దేశాన్ని ఏలుకున్నారు,
    అయినా, తమ దుర్మార్గాలు వీడలేదు.
36 మరి ఇప్పుడు, మేము బానిసలము.
మేమీ భూమిలో ఏ భూమినీ,
    దేని ఫలసాయాలనూ, ఇక్కడ పెరిగే మంచివాటన్నిటినీ
    అనుభవించమని మా పూర్వీకులకు నీవిచ్చావో,
    ఆ భూమిలో మేము ఈనాడు దాసులము.
37 ఈ భూమిలో పంట పుష్కలమైనదే
    కాని మేము పాపాలు చేశాము కదా, అందుకని ఆ పంట నీవు మా నెత్తిన పెట్టిన రాజులకు పోతుంది.
ఆ రాజులు మామీదా, మా పశువుల పైనా పెత్తనం చలాయిస్తారు.
    తమకిష్టము వచ్చినట్లు వ్యవహరిస్తారు.
    దేవా, మేము చాలా కష్టాల్లోవున్నాము.
38 వీటన్నింటి మూలంగా,
    మార్చరాని స్థిరమైన ఒడంబడిక ఒకటి మేము చేసుకుంటున్నాము.
    మేమీ ఒడంబడికను రాత పూర్వకంగా చేసుకొంటున్నాము.
మా నాయకులూ, లేవీయులూ, యాజకులూ ఈ ఒడంబడిక మీద సంతకాలు చేసి,
    ఒక ముద్రతో దానికి ముద్ర[c] వేస్తున్నారు.”

10 అలా ముద్ర వేయబడిన ఒడంబడిక మీద ఉన్న పేర్లు ఇవి:

పాలనాధికారి నెహెమ్యా, నెహెమ్యా హకల్యా కుమారుడు. సిద్కీయా, శెరాయా, అజర్యా, యిర్మీయా, పషూరు, అమర్యా, మల్కీయా, హట్టూషు, షెబన్యా, మల్లూకు, హరిము, మెరేమోతు, ఓబద్యా, దానియేలు, గిన్నెతోను, బారూకు, మెషుల్లాము, అబీయా, మీయామిను, మయజ్యా, బిల్గయి, షెమయా. ఇవన్నీ ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన యాజకుల పేర్లు.

ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు పెట్టిన లేవీయుల పేర్లు ఇవి:

అజన్యా కుమారుడు యేషువా, హేనాదాదు వంశానికి చెందిన బిన్నూయి, కద్మీయేలు, 10 వాళ్ల సోదరులు: షెబన్యా, హోదీయా, కెలీటా, పెలాయా, హానాను, 11 మీకా, రెహోబు, హషబ్యా, 12 జక్కూరు, షేరేబ్యా, షెబన్యా, 13 హోదీయా, బానీ, బెనీను.

14 ముద్రవేయబడిన ఒడంబడిక మీద సంతకాలు చేసిన నాయకుల పేర్లు:

పరోషు, పహత్నోయాబు, ఏలాము, జత్తూ, బానీ, 15 బున్నీ, అజ్గాదు, బేబై, 16 అదోనీయా, బిగ్వయి, అదీను, 17 అటేరు, హిజ్కియా, అజ్జూరు, 18 హోదీయా, హాషుము, బేజయి, 19 హారీఫు, అనాతోతు, నేబై, 20 మగ్పీయాషు, మెషుల్లాము, హెజీరు, 21 మెషేయేలు, సాదోకు, యద్దూవ, 22 పెలట్యా, హానాను, అనాయా, 23 హోషేయ, హనన్యా, హష్షూబు, 24 హల్లోహెషు, పిల్హా, షోబేకు, 25 రెహూము, హషబ్నా, మయశేయా, 26 అహీయా, ఆనాను, అనాను, 27 మల్లూకు, హరీము, బయనా.

28-29 ఈ విధంగా, ఇప్పుడు వీళ్లందరూ దేవునికి ఈ ప్రత్యేక ప్రమాణం చేస్తున్నారు. తమ ఈ ప్రమాణాన్ని నిలుపుకోకపోతే, తామందరికీ చెడు, కీడు జరపమని వీళ్లంతా అర్థించారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్ర నియమాలను అనుసరిస్తామని ప్రమాణం చేస్తున్నారు ధర్మశాస్త్రం దేవుని సేవకుడైన మోషే ద్వారా మాకు ప్రసాదించబడింది. మన దేవుడైన యెహోవా ఆదేశాలను, నియమ నిబంధనలను, ఉపదేశాలను అన్నింటినీ విధేయతతో పాటిస్తామని వీళ్లందరూ ప్రమాణం చేస్తారు. ఈ ప్రమాణం చేస్తున్నది ఈ మనుష్యులే: మిగిలిన వాళ్లు యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, ఆలయ సేవకులు, తమచుట్టూ నివసిస్తున్నవారినుంచి తమని తాము వేరు చేసుకున్న ఇశ్రాయేలీయులందరూ తాము దేవుని ధర్మశాస్త్రాన్ని విదేయతతో పాటించేందుకుగాను వాళ్లు తమని తాము వేరు చేసుకున్నారు. అంతేకాదు, వాళ్లందరి భార్యలు, విని అర్థం చేసుకోగల వాళ్లందరి కొడకులు, కూతుళ్లు కూడా తమని తాము వేరు చేసుకున్నారు. వీళ్లందరూ దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తామని ప్రమాణం చేసేందుకుగాను తమ సోదరులతోనూ, పెద్దలతోనూ జతకూడారు. తాము దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే, తమకి కీడు కలిగించే శాపాన్ని తలదాల్చేందుకు కూడా సిద్ధపడ్డారు.

30 “మా చుట్టు ప్రక్కల వున్న ఇతర ప్రజలను మా కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా, అలాగే మా కొడుకులు ఇతర ప్రజల కూతుళ్లను పెళ్లి చేసుకోకుండానూ చూస్తామని మేము ప్రమాణం చేస్తున్నాము.

31 “మేము సబ్బాతు (విశ్రాంతి) రోజున పని చేయమని ప్రమాణం చేస్తున్నాము. మా చుట్టూ ఉన్న ఇతర ప్రజలు సబ్బాతు రోజున తిండి గింజలో, ఇతర వస్తువులో అమ్మకానికి తెస్తే ఆ ప్రత్యేక దినానగాని, మరే ఇతర పండగ దినాల్లోగాని మేము వాటిని కొనము. ప్రతి ఏడేళ్లకీ ఒకసారి ఇతరులు మాకియ్యవలసిన బాకీ మొత్తాలను రద్దు చేస్తాము.

32 “దేవుని ఆలయం విషయంలో శ్రద్ధ తీసుకోవాలన్న ఆదేశాల మేరకు మేమా బాధ్యతను స్వీకరిస్తాము. దేవునికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరిగేందుకోసం మేము ప్రతియేటా తులము వెండిలో[d] మూడోవంతు ఇస్తాము. 33 ఆలయంలో వారు బల్లమీద పెట్టే ప్రత్యేక రొట్టెలకోసం, ప్రతి రోజూ అర్పించే ధాన్యార్పణలు దహనబలుల కోసం ఈ సొమ్ము యాజకులచేత వినియోగించబడుతుంది. అలాగే, ఈ సొమ్ము ధాన్యాలు కొనేందుకు, ధూప దీపాలు పెట్టేందుకు ఉపయోగింపబడుతుంది. సబ్బాతు రోజుల్లో, అమావాస్య[e] దినాల్లో నైవేద్యం నిమిత్తం ఈ సొమ్ము వినియుక్తమవుతుంది. అది పవిత్ర బలులకోసం, ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేసే పాపపరిహారార్థ బలులకోసం వినియోగింపబడుతుంది.

34 “యాజకులము, లేవీయులము, సామాన్య జనమైన మనము చీట్లు[f] వేసుకున్నాము. తద్వారా, మా కుటుంబాల్లో ఏటా మన ఆలయానికి ఏయే నిర్ణీతదినాల్లో కట్టెల మోపులు (సమిధలు) తేవాలో తెల్సుకున్నాము. ఆ కట్టెలు మన దేవుడైన యెహోవా గట్టు మీద హోమం కోసం తెచ్చేవి. అదంతా మేము సరిగ్గా ధర్మశాస్త్రంలో వ్రాసిన నిబంధనల ప్రకారం చెయ్యాలి.

35 “మా పంట చేలనుంచీ, ప్రతి ఒక్క ఫల వృక్షం నుంచీ తోలి ఫలాలను ఏటా యెహోవా ఆరాధనాలయానికి తెచ్చి ఇచ్చే బాధ్యతను మేము స్వీకరిస్తున్నాము.

36 “ధర్మశాస్త్రంలో సరిగ్గా లిఖించబడినట్లే, మేమిలా చేస్తాము: మా తొలిచూలు కొడుకుల్నీ, అలాగే, మొదటి ఈత ఆవుల దూడల్నీ, గొర్రెల, మేకల పిల్లల్నీ మన దేవుని ఆలయానికి, మన యాజకుల దగ్గరికి తెస్తాము.

37 “యెహోవా ఆలయపు సరుకుల కొట్ల దగ్గరికి తెచ్చి, ఈ క్రింది వస్తువులు యాజకులకి సమర్పిస్తాము: మొదటివిడత ఆడిన పిండి, ధాన్యార్పణలో మొదటి భాగం, మా ఫల వృక్షాలన్నింటి మొదటి పండ్లు మా కొత్త ద్రాక్షారసం నుంచీ, నూనె నుంచీ మొదటి భాగం, మా పంటల్లొ పదోవంతును లేవీయులకి సమర్పిస్తాము. మేము పనిచేసే ఆయా ప్రాంతాల్లో లేవీయులు వీటిని వసూలు చేస్తారు. అందుకే మేము వారికి ఇస్తాము. 38 ఆ పంట భాగాలు లేవీయులు వసూలు చేసేటప్పుడు, వాళ్లతో అహరోను వంశానికి చెందిన యాజకుడొకడు ఉండాలి. తర్వాత ఆ లేవీయులు ఆ పంటల్ని విధిగా ఆలయానికి తీసుకురావాలి. అప్పుడు వాటిని వాళ్లు ఆలయపు ఖజానాలోని సరుకుల కొట్లలో ఉంచుతారు. 39 ఇశ్రాయేలీయులు, లేవీయులు తమ ఆహార ధాన్యాలు, కొత్త ద్రాక్షారసం, నూనె కానుకలను సరుకుల గదుల వద్దకు తెస్తారు. ఆలయానికి తెచ్చే వస్తువులన్నీ అక్కడ ఉంచబడతాయి. సేవలో వున్న యాజకులు అక్కడే ఉంటారు. గాయకులు, ద్వారపాలకులు కూడా అక్కడేవుంటారు.

“మా దేవుని ఆలయాన్ని భద్రంగా చూసుకుంటామని మేమంతా ప్రమాణం చేశాము!”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International