Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
దానియేలు 10-12

హిద్దెకెలు నది దగ్గర దానియేలు దర్శనము

10 పారసీక రాజగు కోరెషు పాలన మూడవ సంవత్సరంలో, బెల్తెషాజరు అను దానియేలుకు ఒక విషయం తెలియపర్చబడింది. అది యుద్ధమును గూర్చిన నిజ సంగతి. ఇది దర్శనం ద్వారా దానియేలుకు బయలుపడింది గనుక అతడు గ్రహించాడు.

ఆ దినాల్లో దానియేలు అను నేను మూడు వారాలు దుఃఖాక్రాంతుడనయ్యాను. ఆ మూడు వారాల్లో, నేను ఎలాంటి పుష్ఠికరమైన ఆహారాన్ని భుజించలేదు, మాంసాన్ని, ద్రాక్షారసాన్ని తీసుకోలేదు, తలకు నూనె రాసుకోలేదు.

మొదటి నెల ఇరవై నాల్గవ రోజున, గొప్ప నది అయిన టైగ్రిసు (హిద్దెకెలు) నది గట్టుమీద నేను నిలబడి ఉన్నాను. నేనక్కడ నిలబడి కన్నులెత్తి చూస్తూండగా ఒక వ్యక్తి నార బట్టలు ధరించుకొని, నడుము చుట్టూ మేలిమి బంగారపు దట్టి ధరించుకొని యున్నాడు. ఆయన శరీరం గోమేధికంవలె పసుపుగాను, ముఖం మెరుపువలె ప్రకాశవంతంగాను, కళ్లు ప్రకాశిస్తున్న దీపాలవలె కనిపించానియి చేతులూ, కాళ్లూ మెరుస్తున్న కంచువలెను, మాటల శబ్దం నర సమూహపు కంఠధ్వని వలెను ఉన్నాయి.

దానియేలు అను నేనొక్కడనే ఆ దర్శనం చూశాను. నా వెంటనున్న మనుష్యులు ఆ దర్శనం చూడలేదు. కాని వారు భయంతో వణుకుచూ పారిపోయి దాగుకొన్నారు. అందువల్ల నేను ఒంటరి వాడనై, ఆ గొప్ప దర్శనాన్ని చూచి, నాలో బలము లేనివాడనయ్యాను. మృతుడైనవాని ముఖంవలె నా ముఖం పాలిపోయి బలంలేని వాడనయ్యాను. దర్శనంలో కనిపించిన వ్యక్తి మాటలాడడం విన్నాను. అతను మాటలాడడం వినగా, నేను గాఢనిద్ర పొందిన వాడనై నేలమీద సాష్టాంగ పడ్డాను.

10 అప్పుడు ఒకని చెయ్యి నన్ను తాకి, వణకుచున్న నా చేతులను, మోకాళ్లను బలపరచి నన్ను నిలువ బెట్టింది. 11 అతడు నాతో, “బహు ప్రియుడవైన దానియేలూ! నేను నీతో చెప్పు మాటల్ని జాగ్రత్తగా వినుము. సరిగా నిలువబడు. నేను నీ కోసమే నీ యొద్దకు పంపబడ్డాను” అని అన్నాడు. అతడు నాతో ఈ మాట చెప్పుచుండగా వణకుతూ నేను నిలబడ్డాను. 12 అప్పుడు అతడు నాతో, “దానియేలూ, భయపడకు. నీ దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకొని గ్రహించటానికి నీ మనస్సు నిలుపుకొన్న ఆ మొదటి రోజునుండి నీ మాటలు వినబడ్డాయి. నీవు ప్రార్థిస్తూంన్నందువల్లనే నేను నీ వద్దకు వచ్చాను. 13 పారసీక రాజ్యాధిపతి ఇరవై యొక్క రోజులు నన్ను అడ్డగించాడు. కాని ప్రధాన దూతలలో ఒకడైన మిఖాయేలు నా సహాయం కోసం వచ్చాడు. అతన్ని నేను పారసీక రాజ్యాధి పతియొద్ద విడిచి వచ్చాను. 14 అంత్య దినాల్లో నీ జనులకు జరుగబోయే సంగతుల్ని నీకు తెలియ జేయటానికి నేను వచ్చాను. ఈ దర్శనం రాబోయే దినాలకు సంబధించింది” అని చెప్పాడు.

15 అతడు అలా మాటలాడుతూ ఉండగా, నా ముఖము నేలకు వంచి నేను మౌనంగా ఉండిపోయాను. 16 మానవ పుత్రులను పోలిన ఒకతను నా పెదవులు తాకాడు. నేను నా నోరు తెరిచి, మాటలాడటానికి ప్రారంభించాను. నేను నా ఎదుట నిలబడిన ఆ వ్యక్తితో, “అయ్యా, దర్శనంలో కనిపించిన వాటివల్ల బాధనొంది బలము లేని వాడనయ్యాను. 17 అయ్యా! నీ సేవకుడనైన నేను నీతో ఎలా మాట్లాడగలను? నా బలంపోయింది. నాకు ఊపిరి ఆడనట్లయింది” అని అన్నాను.

18 మానవునిలా కనిపించిన ఆ వ్యక్తి మళ్లీ నన్ను ముట్టి, బలపరిచాడు. 19 అతడు నాతో, “బహు ప్రియుడవయిన మనుష్యుడా! భయపడవద్దు. నీకు శాంతి కలుగునుగాక! శక్తివంతుడవై ధైర్యంగా ఉండు” అని అన్నాడు.

అతడు మాటలాడగానే నేను బలం పొంది ఇలాగన్నాను: “అయ్యా, నాకు నీవు శక్తినిచ్చావు. ఇప్పుడు నీవు మాట్లాడవచ్చును.”

20 అప్పుడు అతను, “దానియేలూ, నేను ఎందుకు నీవద్దకు వచ్చానో నీకు తెలుసా? నేను త్వరగా మరలి పోయి పారసీక రాజ్యాధిపతితో యుద్ధం చేయాలి. నేను వెళ్లినప్పుడు, గ్రీకు యువరాజు వస్తాడు. 21 సత్య గ్రంథంలో ఏమి వ్రాయబడిందో అది నేను నీకు చెపుతాను. ఈ సంగతుల్లో మీ అధిపతి మిఖాయేలు తప్ప మరి యెవ్వరూ నా పక్షంగా నిలబడరు.

11 “మాదీయుడైన దర్యావేషు రాజుగా ఉన్న మొదటి సంవత్సరంలో, నేను మిఖాయేలుకు తోడుగా నిలబడ్డాను.

“దానియేలూ! ఇప్పుడు నేను నీకు నిజం వివరిస్తాను, మరి ముగ్గురు రాజులు పారసీకలో రాజ్యం చేస్తారు. తర్వాత నాలుగవ రాజు వస్తాడు. తనకంటె ముందున్న ఇతర పారసీక రాజులకంటె, ఆ నాలుగవ రాజు ఐశ్వర్యవంతుడై, గొప్పవాడై వుంటాడు. అతడు గ్రీకు రాజ్యానికి విరోధంగా అందర్ని పురికొల్పుతాడు. తర్వాత శక్తిమంతుడైన గొప్పరాజు ఒకడు వస్తాడు. అతను ఎక్కువ అధికారం కలిగి తన ఇష్టానుసారంగా చేస్తాడు. అతడు అభివృద్ధి పొందుచూ ఉండగా అతని రాజ్యము ముక్కలుగా విరిగి ఆకాశపు నాలుగు దిక్కులకు విభాగమవుతుంది. అతని రాజ్యం అతని పిల్లలకు గాని మనుమలకి గాని విభాగితం కాదు. అతని రాజ్యానికి అతను పాలించిన నాటి శక్తి వుండదు. ఎందుకనగా అతని రాజ్యం లాగివేయబడి ఇతరులకు ఇవ్వబడుతుంది.

“దక్షిణ రాజు బలవంతుడవుతాడు. కాని అతని రాజుల్లో ఒకడు అతనికంటె బలవంతుడౌతాడు, మరియు ఇతని రాజ్యం గొప్పదవుతుంది.

“కొన్ని సంవత్సరాల తర్వాత, ఈ ఇద్దరు రాజులు ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. దక్షిణ రాజు యొక్క కుమార్తె ఉత్తర రాజుయొద్ద ఒప్పందం చేసు కటానికి వస్తుంది. కాని ఆమె తన బలాన్ని నిలుపుకోదు. అతడు తన మాటను, బలాన్ని నిలుపుకోడు. కాని, ఆమెను, ఆమెను తెచ్చిన వారిని, ఆమెను కన్న వారిని, ఆమెను బలపరచిన వారిని, ఆ సమయాల్లో విడిచిపెడతారు.

“కాని ఆమె కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి దక్షిణ రాజు యొక్క స్థానం ఆక్రమించడానికి వస్తాడు. అతడు ఉత్తర రాజు సైన్యాలను ఎదిరించి ఆ రాజు యొక్క బలమైన దుర్గంలోకి ప్రవేశిస్తాడు. అతను యుద్ధం చేసి జయిస్తాడు. అతను దేవతా ప్రతిమల్ని, లోహ విగ్రహాల్ని, వెండి బంగారాలతో చేయబడిన విలువగల వస్తువుల్ని ఈజిప్టుకి తీసుకు వెళతాడు. ఆ తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు ఉత్తర రాజును ఎదిరించడు. ఉత్తర రాజు రాజ్యాన్ని ఎదుర్కొని తర్వాత తన దేశానికి మరలిపోతాడు.

10 “ఉత్తర రాజు కుమారులు యుద్ధ సన్నద్ధులై ఒక పెద్ద సైన్యాన్ని సమకూర్చుతారు. ఆ సైన్యం ఆ ప్రదేశంగుండా గొప్ప ప్రవాహంవలె దక్షిణ రాజు యొక్క బలమైన దుర్గం వరకు యుద్ధం సాగిస్తుంది. 11 అప్పుడు దక్షిణ రాజు మహోగ్రుడై ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు పెద్ద సైన్యంతో ఎదిరిస్తాడు కాని ఆ సైన్యం దక్షిణ రాజు వశమవుతుంది. 12 ఉత్తర సైన్యం ఓడిపోయి తీసుకొని పోబడుతుంది. దక్షిణ రాజు గర్విష్ఠి అవుతాడు. ఉత్తర సైన్యంలో వేలాది సైనికుల్ని హతమార్చుతాడు. కాని అతని విజయం కొనసాగదు. 13 ఉత్తర రాజు మరో సైన్యం సమకూర్చుకుంటాడు. ఆ సైన్యం మొదటి సైన్యం కంటె చాలా పెద్దది. చాలా సంవత్సరాల తర్వాత, అతను ఈ పెద్ద సైన్యాన్ని చాలా ఆయుధాల్ని సిద్ధం చేసికొని యుద్ధానికి వెళతాడు.

14 “ఆ రోజుల్లో దక్షిణ రాజుకి చాలామంది వ్యతిరేకులై ఉంటారు. దర్శన నెరవేర్పుగా నీ ప్రజల్లో తిరుగుబాటుదారులు ఎదురు తిరుగుతారు గాని ఓడి పోతారు. 15 తర్వాత ఉత్తర రాజు వచ్చి, గోడలకు ముట్టడి దిబ్బలు కట్టి, ఒక దృఢమయిన నగరాన్ని ఆక్రమిస్తాడు. దక్షిణ సైన్యానికి మరల యుద్ధం చేయడానికి శక్తి ఉండదు. దక్షిణ సైన్యానికి చెందిన ఉత్తమ సైనికులు కూడా ఉత్తర సైన్యాన్ని ఆపలేక పోతారు.

16 “తన ఇష్టము వచ్చినట్లు ఉత్తర రాజు చేస్తాడు. ఎవ్వరూ అతనిని విరోధించలేరు. అతను అధికారం పొంది, సుందర దేశాన్ని అదుపులో ఉంచుకొంటాడు. మరియు అతనికి దాన్ని నాశనం చేసే శక్తికూడా ఉంటుంది. 17 ఉత్తర రాజు తన సర్వ సైనిక బలంతో వచ్చి, దక్షిణ రాజుతో ఒప్పందం చేసుకోటానికి నిర్ణయిస్తాడు. ఉత్తర రాజు దక్షిణ రాజుకు పెళ్లి చేసుకునేందుకు తన కుమార్తెలలో ఒకదానిని అనుమతిస్తాడు, ఎందుకంటే దక్షిణ రాజుని ఓడించాలని. కాని ఆ పథకాలు నెరవేరవు, అతనికి తోడ్పడవు.

18 “అప్పుడు ఉత్తర రాజు తన దృష్టిని సముద్ర తీరాననున్న దేశాల మీదికి మరల్చుతాడు, పెక్కు నగరాల్ని జయిస్తాడు. కాని తర్వాత ఒక సైన్యాధిపతి ఉత్తర రాజు యొక్క తిరుగుబాటుని, అతని గర్వాన్ని అణచి అతడు సిగ్గుచెందేలా చేస్తాడు.

19 “అది జరిగిన తర్వాత, ఉత్తర రాజు తన స్వదేశంలోని బలమైన దుర్గాలకు తిరిగి వెళతాడు. కాని అతను బలహీనుడై పతనం చెంది మరణము పాలవుతాడు.

20 “ఆ ఉత్తర రాజు తర్వాత మరో క్రొత్త పరిపాలకుడు వస్తాడు. ఆ పరిపాలకుడు పన్నులు వసూలు చేసే అధికారిని రాజ వైభవం కోసం డబ్బు సంపాదించటానికి పంపుతాడు. కాని కొన్ని సంవత్సరాలలోనే, ఆ పరిపాలకుడు కోపము వల్లగాని, యుద్ధమువల్లగాని కాకుండ నాశనం చేయబడతాడు.

21 “ఆ పరిపాలకుని తర్వాత అతి క్రూరుడు, ద్వేషింపబడినవాడు అయిన ఒక వ్యక్తి వస్తాడు. రాజ వంశానికి చెందినవాడనే గౌరవం వానికి ఉండదు. మాయోపాయముచేత అతతడు పరిపాలకుడవుతాడు. ప్రజలు నెమ్మదిగా ఉన్న సమయాన, అతడు రాజ్యముమీద దాడి చేస్తాడు. 22 ప్రవాహంలాంటి ఆ సైన్యాలు వాని ఎదుటనుండి తుడిచి వేయబడతాయి. ఒప్పందం కుదుర్చుకున్న రాజు కూడా నశిస్తాడు. 23 ఆ రాజుతో ఒప్పందం కుదుర్చుకొన్న తర్వాత మోసంగా ప్రవర్తించి, కొద్దిమందితోనే అతడు అధికారాన్ని పొందుతాడు.

24 “సంపన్న దేశాలు నెమ్మదిగా ఉన్నప్పుడు, అతడు (క్రూరుడూ ద్వేషింపబడినవాడూ అయిన ఆ పరిపాలకుడు) వాటిమీద దాడి చేస్తాడు. అతని తండ్రులుగాని, అతని పూర్వీకులుగాని చేయలేనిదాన్ని అతడు సాధిస్తాడు. దోపిడి, లూటి చేసి పొందిన సంపత్తును వాని అనుచరుల మధ్య పంచుతాడు. బలమైన కోటల్ని పడగొట్టడానికి కుట్ర చేస్తాడు, కాని అది ఒక కాలము వరకు మాత్రమే.

25 “దక్షిణ రాజుకు విరోధంగా గొప్ప సైన్యంతో తన బలాన్ని, ధైర్యాన్ని ఎక్కువ చేసుకొంటాడు. గొప్ప బలమైన సేనతో దక్షిణ రాజు యుద్ధానికి దిగుతాడు గాని, అతనికి వ్యతిరేకంగా శత్రువు పన్నిన పన్నాగాల వల్ల దక్షిణ రాజు ఓడిపోతాడు. 26 దక్షిణ రాజు భోజన పదార్థాలనుండి తినేవారే అతన్ని నాశనము చేయాలని ప్రయత్నిస్తారు. అతని సైన్యం ఓడించ బడుతుంది. యుద్ధంలో చాలామంది సైనికులు చంపబడతారు. 27 ఆ రాజులిద్దరూ దురుద్దేశముతో ఒకే భోజన బల్లవద్ద కూర్చొని ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకొంటారు. అందువల్ల వారిలో ఎవరికీ మంచి కలుగదు. ఎందుకంటే దేవుడు వారి అంతానికి ఒక కాలం నిర్ణయించాడు.

28 “ఉత్తర రాజు అధిక సంపదతో తన దేశానికి తిరిగి వెళతాడు. కాని, పవిత్ర ఒడంబడికకు విరుద్ధంగా అతను తన హృదయాన్ని మార్చుకొంటాడు. తన ఇష్టానుసారంగా జరిగిస్తూ అతడు స్వదేశానికి మరలి పోతాడు.

29 “నియమిత సమయాన, ఉత్తర రాజు దక్షిణ రాజు మీద మరల దాడి చేస్తాడు, కాని ఈ సారి, పూర్వంవలె అతడు గెలుపొందలేడు. 30 కిత్తీము నుండి ఓడలువచ్చి ఉత్తర రాజును ఎదిరిస్తాయి. ఆ ఓడలు రావటం చూసి, అతడు భయభ్రాంతుడవుతాడు. అప్పుడతను వెనుదిరిగి, పవిత్ర ఒడంబడిక పట్ల తన కోపాన్ని తీర్చుకొంటాడు. అతడు వెనక్కి తిరిగి పవిత్ర ఒడంబడికను విసర్జించేవాళ్ల మాట వింటాడు. 31 వానినుండి వచ్చిన సైన్యాలు కోటను, దేవాలయాన్ని అపవిత్ర పరచి, అనుదిన బలి అర్పణలను నిలుపు చేస్తాయి. వాళ్లు నాశనకరమైన ఆ అసహ్యమైన దాన్ని దేవాలయంలో నిలుపుతారు.

32 “ఉత్తర రాజు పవిత్ర ఒడంబడికను అతిక్రమించినవాళ్లను (యూదులు) తన ఇచ్ఛకపు మాటలచేత దుష్టత్వానికి మళ్లించుతాడు. కాని తమ దేవుణ్ణి ఎరిగిన ప్రజలు స్థిరముగా నిలబడి అతనిని ఎదిరిస్తారు.

33 “కొన్ని దినాలపాటు వారు ఖడ్గంతోను, అగ్నితోను, చెరసాల బంధనతోను, దోపుడుతోను హింసించబడతారు. వారిలో జ్ఞానవంతులైనవారు అనేకులను సంగతులు అర్థము చేసికొనేటట్లు చేస్తారు. 34 జ్ఞాన వంతులైన ఆ యూదులు హింసించబడ్డ తర్వాత, వారికి కొద్దిపాటి సహాయం లభిస్తుంది. అనేకులు వారికి వారే జ్ఞానులైన యూదులతో ముఖస్తుతి చేస్తూ కలిసి పోతారు. 35 నియమితమైన అంత్యకాలం ఇంకను రాలేదు. ఆ అంత్యకాలం వరకు జ్ఞానుల్లో కొందరు కూలుటద్వారా మిగిలిన వరు శుద్ధిగాను, నిర్మలులుగాను, పరిశుద్ధులుగాను చేయబడటానికి ఇలాగున జరుగుతుంది.

ఆత్మ ప్రశంస చేసుకునే రాజు

36 “ఉత్తర రాజు తన ఇష్టానుసారముగా చేస్తాడు. ప్రతి దేవతకు పైగా తనకు తానే హెచ్చించుకొంటూ, ఘనపరచుకొంటాడు. అంతేకాక, దేవాది దేవునికి విరోధంగా విచిత్రమైన విషయాలు మాట్లాడుతాడు. ఉగ్రత తీరే వరకు వాడు వర్ధిల్లుతాడు. ఏది నిర్ణయమైందో అది వానికి జరుగుతుంది.

37 “తన పూర్వీకులపట్ల ఆ ఉత్తర రాజు శ్రద్ధ వహింపడు. స్త్రీల ఇష్ట దేవతలను కూడ లక్ష్యపెట్టడు. ఏ దేవుని గురించీ అతడు లక్ష్యపెట్టడు. అన్ని దేవుళ్లు, దేవతల కంటే తనను తాను హెచ్చించుకొంటాడు. 38 వీటన్నిటికి బదులుగా కోటల దేవతను గౌరవిస్తాడు. తన పూర్వీకులు ఎరుగని దేవతను బంగారు, వెండి, వెలగల రాళ్లు మరియు వెలగల బహుమానాలతో గౌరవిస్తాడు.

39 “ఆ ఉత్తర రాజు బలమైన కోటల మీదికి అన్యదేవుని సహాయంతో దాడి చేస్తాడు, తనను గుర్తించే వాళ్లను హెచ్చించి గౌరవిస్తాడు. వాళ్లను చాలామంది ప్రజలమీద పరిపాలకులుగా ఉంచి, దేశాన్ని వెలకు విభాగిస్తాడు.

40 “అంత్యకాలంలో, దక్షిణ రాజు ఉత్తర రాజుతో యుద్ధం చేస్తాడు. ఉత్తర రాజు ఉగ్రుడై సుడిగాలివలె దక్షిణ రాజు మీద రథాలు, గుర్రపు రౌతులు, అనేక ఓడలతో విరుచుకు పడతాడు. అదే విధంగా దేశాల మీదికి ప్రవాహంవలె వెళతాడు. 41 అతడు మహిమదేశం మీద కూడా దాడి చేస్తాడు. అనేక దేశాల్లో వేలాదిమందిని పడగొడతాడు, కాని ఎదోము, మోయాబు, అమ్మోనీయల నాయకులు అతని చేతినుండి రక్షింపబడతారు. 42 చాలా దేశాల్లో ఉత్తర రాజు తన అధికారాన్ని వ్యాపింప జేస్తాడు కాని ఈజిప్టు తప్పించుకోలేదు. 43 ఈజిప్టుకు చెందిన వెండి, బంగారం, సర్వ సంపదలకు అతడు అధిపతి అవుతాడు. లిబియావాళ్లు, కూషీయులు (ఇతియోపియావాళ్లు) అతని ఎడల విధేయులై ఉంటారు. 44 కాని ఉత్తర రాజు తూర్పు, ఉత్తర దిశలనుంచి వచ్చిన సమాచారము తెలిసికొని. భయభ్రాంతుడై, మహోగ్రుడై చాలా మందిని సర్వ నాశనం చేయడానికి ముందుకు సాగుతాడు. 45 సుందరమైన పరిశుద్ధ పర్వతానికి,[a] సముద్రానికి మధ్య అతను రాజవైభవంగల గుడారాలు నెలకొల్పుతాడు. చివరికి అతడు నిస్సహాయుడై మరణిస్తాడు.

12 “ఆ సమయాన నీ ప్రజలైన యూదుల పక్షం వహించిన గొప్ప రాజు మిఖాయేలు (ప్రధాన దూత) జోక్యం కలిగించుకొంటాడు. నీ ప్రజలు ఒకే దేశంగా కూడిన కాలంనుండి అప్పటి వరకు ముందెన్నడూ సంభవించనంత మహా విపత్తు వారికి కలుగుతుంది. కాని, నీ ప్రజల్లో ఎవరి పేరు గ్రంథమందు వ్రాయబడిందో వారు తప్పించుకొంటారు. సమాధి చేయబడిన పెక్కుమంది మృతులు, మేల్కొంటారు. కొందరు నిత్యజీవానికి, కొందరు సిగ్గుపొందటానికి, శాశ్వతంగా తిరస్కారం పొందటానికి మేల్కొంటారు. జ్ఞానవంతులు ఆకాశమందలి జ్యోతుల్లాగ ప్రకాశిస్తారు, అనేకులను నీతి మార్గానికి నడిపించేవారు నక్షత్రాల్లాగ శాశ్వతంగా వెలుగుతారు

“కాని, దానియేలూ, నీవు, ఈ సందేశాన్ని రహస్యంగా ఉంచు. ఈ పుస్తకాన్ని నీవు అంత్యకాలం వరకు మూసి ఉంచు. చాలా మంది అటు ఇటు భూసంచారం చేయటంవల్ల తెలివి పెరుగుతుంది” అని గాబ్రియేలు నాతో చెప్పాడు.

అప్పుడు దానియేలు అను నేను చూస్తూండగా ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. నది ఈ ఒడ్డున ఒకడు నది ఆ ఒడ్డున మరియొకడు నిలబడి ఉన్నారు. నార బట్టలు ధరించిన వ్యక్తి నదీజలాలమీద ఉన్నాడు. ఆ ఇరువురిలో ఒకడు, “ఈ ఆశ్చర్య సంగతులు నెరవేరటానికి ఎంతకాలము పడుతుంది?” అని నార బట్టలు ధరించినవాన్ని అడిగాడు.

నార బట్టలు ధరించి నదీజలాలమీదనున్న వ్యక్తి ఆకాశం వైపుగా తన కుడి, ఎడమ చేతులు ఎత్తి, సజీవుడైన దేవుని నామం మీద ప్రమాణం చేయటం నేను విన్నాను. ఏమనగా “ఒక కాలము, కాలములు, అర్ధకాలము (మూడున్నర సంవత్సరాలు) పడతాయి. పరిశుద్ధ ప్రజల బలం నాశనం చేయబడటం అంతం కాగానే ఈ సంగతులన్నీ నెరవేరుతాయి.”

నేను విన్నాను, కాని అర్థము చేసుకోలేకపోయాను. అందువల్ల, “అయ్యా, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏమవుతుంది?” అని అడిగాను.

అందుకతడు, “దానియేలూ! నీవు దాటిపో. ఈ మాటలు అంత్యకాలం వరకు ముద్ర వేయబడి రహస్యంగా ఉంటాయి. 10 చాలామంది తమ్మును తాము పరిశుద్ధులుగా చేసుకొంటారు. తమ్మును తాము తెలుపుగాను, శుద్ధులుగాను చేసుకొంటారు. కాని చెడ్డవాళ్లు చెడ్డవాళ్లగానే ఉంటారు. ఆ దుర్జనులు ఈ విషయాలు అర్థం చేసుకోలేరు. కాని జ్ఞానవంతులు అర్థం చేసుకొంటారు.

11-12 “అనుదిన బలులు నిలిపివేసిన కాలం మొదలుకొని నాశనకరమైన అసహ్య వస్తువు నిలబెట్టబడిన కాలం వరకు ఒక వెయ్యి మూడువందల ముప్పైయైదు రోజులు వేచియుండి, ఆ దినముల అంతము వరకు ఉండువాడు ధన్యుడు.

13 “నీవు నీ జీవిత అంతం వరకు బ్రతికి, నీ విశ్రాంతిలో ప్రవేశించు. దినాల అంతమందు నీవు లేపబడి నీ స్థానములో నీవు నిలుస్తావు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International