Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెకర్యా 1-7

యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.

యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”

నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం

పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)

రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.

అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.

10 అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.

11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.

12 అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.

13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.

14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:

“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15     మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
    నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
    కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16 కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
    మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.

17 “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
    ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
    నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.

నాలుగు కొమ్ములు మరియు నలుగురు పనివారు

18 అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను. 19 నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”

20 తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు. 21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి, వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”

యెరూషలేమును కొలవటం

నేను పైకిచూశాను. వస్తువులను కొలవటానికి ఒకడు తాడు పట్టుకుని ఉన్నట్లు చూశాను. “నీవెక్కడికి వెళ్తున్నావు?” అని అతన్ని అడిగాను.

“నేను యెరూషలేమును కొలవటానికి వెళ్తున్నాను. అది ఎంత వెడల్పు, ఎంత పొడవు వున్నదో చూడాలి” అని అతడు నాకు చెప్పాడు.

అప్పుడు నాతో మాట్లాడుతున్న దేవదూత వెళ్లిపోయాడు. మరొక దేవదూత అతనితో మాట్లాడటానికి వెళ్లాడు. అతనితో ఇలా చెప్పాడు: “పరుగున పొమ్ము. వెళ్లి ఆ యువకునితో యెరూషలేము కొలవలేనంత పెద్దగా ఉంటుందని చెప్పు. అతనికి ఈ విషయాలు చెప్పు:

‘యెరూషలేము ప్రాకారం లేని నగరంగా ఉంటుంది.
    ఎందుకంటే అక్కడ ఎంతోమంది మనుష్యులు, ఎన్నో జంతువులు నివసిస్తాయి.’
యెహోవా చెపుతున్నాడు,
‘యెరూషలేమును రక్షిస్తూ దానిచుట్టూ నేనొక అగ్ని గోడలా ఉంటాను.
    ఆ నగరానికి మహిమను కలుగజేస్తూ, నేనక్కడ నివసిస్తాను.’”

దేవుడు తన ప్రజలను ఇంటికి పిలవటం

యెహోవా చెపుతున్నాడు,
“త్వరపడు! ఉత్తర దేశం నుండి పారిపొమ్ము!
    అవును. నీ ప్రజలను ప్రతి చోటికి నేను చెదర గొట్టిన మాట నిజమే.
సీయోను ప్రజలారా! మీరు బబులోనులో బందీలయ్యారు. కాని ఇప్పుడు తప్పించుకోండి! ఆ నగరంనుండి పారిపొండి!” సర్వశక్తిమంతుడైన యెహోవా నా గురించి ఈ విషయాలు చెప్పాడు: ఆ రాజ్యాలు యుద్ధంలో నీనుండి వస్తువులు తీసుకున్నాయి.
ఆ రాజ్యాలు ఘనత సంపాదించాయి.
    కాని ఆ తరువాత యెహోవా నన్ను వారి మీదికి పంపుతాడు.
ఎందుకంటే, మీకు హాని కలిగించడమంటే, దేవుని కంటిపాపలకు హాని కలిగించడమే అవుతుంది.
    అప్పుడు ఆ రాజ్యాలు వాటి గౌరవాన్ని పొందుతాయి.
మరియు నేనా ప్రజలను బాధిస్తాను.
    వారి బానిసలు వారి ధనాన్ని తీసుకుంటారు.
బబులోను ప్రజలు నా ప్రజలను బంధించి వారిని బానిసలుగా చేశారు.
    కాని నేను వాళ్లను దెబ్బ తీస్తాను. వారు నా ప్రజలకు బానిసలవుతారు.
అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవాయే నన్ను
    పంపినట్టు మీరు తెలుసుకుంటారు.

10 యెహోవా చెపుతున్నాడు:
“సీయోనూ, సంతోషంగా ఉండు! ఎందుకంటే, నేను వస్తున్నాను.
    మరియు నేను నీ నగరంలో నివసిస్తాను.
11 ఆ సమయంలో అనేక దేశాల ప్రజలు
    నా వద్దకు వస్తారు.
పైగా వారు నా ప్రజలవుతారు.
    నేను నీ నగరంలో నివసిస్తాను.”
సర్వశక్తిమంతుడైన యెహోవా నీ వద్దకు
    నన్ను పంపాడని నీవు తెలుసుకుంటావు.

12 యెహోవా మళ్లీ యెరూషలేమును తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేస్తాడు.
    మరియు యూదా పవిత్ర భూమిలో తన భాగంగా ఉంటుంది.
13 ప్రతి ఒక్కడూ ప్రశాంతంగా ఉండాలి!
    యెహోవా తన పవిత్ర నివాసంనుండి వస్తున్నాడు.

ప్రధాన యాజకుడు

పిమ్మట దేవదూత ప్రధాన యాజకుడైన యెహోషువను నాకు చూపించాడు. యెహోవా దూత ముందు యెహోషువ నిలబడి ఉన్నాడు. యెహోషువకు కుడి పక్కగా సాతాను నిలబడి ఉన్నాడు. యెహోషు మీద చెడు పనులు చేసినట్లు నింద మోపటానికి సాతాను అక్కడ ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత ఇలా చెప్పాడు: “సాతానూ, యెహోవా నిన్ను విమర్శించు గాక! నీవు అపరాధివని యెహోవా తీర్పు ఇచ్చుగాక! యెరూషలేమును యెహోవా తన ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకున్నాడు. ఆయన ఆ నగరాన్ని రక్షించాడు. అది నిప్పులోనుండి లాగిన మండే కట్టెలా ఉంది.”

యెహోషువ దేవదూత ముందు నిలుచున్నాడు. యెహోషువ ఒక మురికి వస్త్రం ధరించివున్నాడు. అప్పుడు దేవదూత తనవద్ద నిలబడిన ఇతర దేవ దూతలతో, “యెహోషువ వేసుకున్న మురికి వస్త్రాలను తీసివేయండి” అని చెప్పాడు. పిమ్మట దేవదూత యెహోషువతో మాట్లాడాడు. అతడు ఇలా అన్నాడు: “ఇప్పుడు నీ నేరాన్ని నేను తీసివేశాను. నీకు నూతన వస్త్రాలను ఇస్తున్నాను.”

అప్పుడు నేను, “అతని తలపై శుభ్రమైన తలపాగా ఉంచు” అని అన్నాను. కావున ఒక శుభ్రమైన తల పాగాను వారతని తలపై పెట్టారు. యెహోవా దూత అక్కడ నిలబడి వుండగా వారు అతనికి నూతన వస్త్రాలు తొడిగారు. పిమ్మట యెహోషువకు యెహోవా దేవదూత ఈ విషయాలు చెప్పాడు:

సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు:
“నేను చెప్పిన విధంగా జీవించు.
    నేను చెప్పినవన్నీ చెయ్యి.
నీవు నా ఆలయానికి అధికారివిగా ఉంటావు.
    నీవు దాని ఆవరణ విషయం శ్రద్ధ తీసుకుంటావు.
ఇక్కడ నిలబడిన దేవదూతలవలె
    నీవు నా ఆలయంలో ఎక్కడికైనా వెళ్లటానికి నీకు స్వేచ్ఛ ఉంది.
కావున యెహోషువా, నీవూ, నీతో ఉన్న ప్రజలూ నేను చెప్పేది తప్పక వినాలి.
    నీవు ప్రధాన యాజకుడవు. నీతో ఉన్న జనులు నిజంగా అద్భుతాలు నెరవేర్చగలరు.
నేను నిజంగా నా ప్రత్యేక సేవకుని తీసుకువస్తాను.
    అతడు ‘కొమ్మ’ (చిగురు) అని పిలువబడతాడు.
చూడండి, యెహోషువ ముందు నేనొక రాతిని పెట్టాను.
    ఆ రాతికి ఏడు పక్కలు (కండ్లు) ఉన్నాయి.
ఆ రాతి మీద నేనొక ప్రత్యేక వర్తమానం చెక్కుతాను.
    నేను ఒక్క రోజులో ఈ దేశంలోని పాపాలన్నీ తీసివేస్తానని ఇది తెలియ జేస్తుంది.”

10 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు:
“ఆ సమయంలో ప్రజలు తమ స్నేహితులతోను,
    పొరుగువారితోను కూర్చొని మాట్లాడుకుంటారు.
ప్రతి ఒక్కడూ తన అంజూరపు చెట్టు క్రింద,
    తన ద్రాక్షాలత క్రింద ప్రశాంతంగా కూర్చుంటాడు.”

దీపస్తంభం-రెండు ఒలీవ చెట్లు

పిమ్మట నాతో మాట్లాడుతూవున్న దేవదూత నా వద్దకు వచ్చి నన్ను లేపాడు. నేను నిద్ర నుండి మేల్కొంటున్న వ్యక్తివలె ఉన్నాను. “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.

నేను ఇలా చెప్పాను: “ఒక గట్టి బంగారు దీపస్తంభాన్ని చూస్తున్నాను. ఆ స్తంభం మీద ఏడు దీపాలు (ప్రమిదెలు) ఉన్నాయి. దీపస్తంభం మీద ఒక గిన్నెఉంది. గిన్నెనుండి ఏడు గొట్టాలు వచ్చాయి. ప్రతి దీపానికీ ఒక గొట్టం చొప్పున వెళ్లాయి. ఆ గొట్టాలు దీపాలకు కావలసిన నూనెను గిన్నెనుండి చేరవేస్తున్నాయి. గిన్నె పక్కగా కుడి వైవున ఒకటి, ఎడమవైపున ఒకటి ఒలీవ చెట్లు ఉన్నాయి.” తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూతను, “అయ్యా, ఈ వస్తువులు ఏమి తెలియజేస్తున్నాయి?” అని అడిగాను.

“ఈ వస్తువులు ఏమిటో నీకు తెలియదా?” అని నాతో మాట్లాడుతూ ఉన్న దేవదూత అన్నాడు.

“లేదయ్యా” అని నేను చెప్పాను.

అతడు నాతో ఇలా అన్నాడు: “యెహోవానుంచి జెరుబ్బాబెలుకు వచ్చిన వర్తమానం ఇది: ‘నీ శక్తి సామర్థ్యాలవల్ల నీకు సహాయం రాదు. నీ సహాయం నా ఆత్మ నుండి వస్తుంది.’ సర్వశక్తిమంతుడైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు! ఆ ఎత్తైన పర్వతం జెరుబ్బాబెలుకు సమమైన ప్రదేశంగా ఉంటుంది. అతడు ఆలయ నిర్మాణం చేస్తాడు. దానికి చివరి రాయి పెట్టబడినప్పుడు, ‘అందంగా ఉంది! అందంగా ఉంది!’ అని ప్రజలు కేకలు పెడతారు.”

నాకు వచ్చిన యెహోవా వర్తమానం ఇంకా ఇలా చెప్పింది: “నా ఆలయానికి జెరుబ్బాబెలు పునాదులు నిర్మిస్తాడు. మరియు జెరుబ్బాబెలు ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. అప్పుడు సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలైన మీ వద్దకు నన్ను పంపినట్టు మీరు తెలుసుకుంటారు. 10 సామాన్యంగా ప్రారంభించబడే పనులపట్ల ప్రజలు సిగ్గుచెందరు. జెరుబ్బాబెలు గుండు, దారం తీసికొని, తయారైన భవనాన్ని తనిఖీచేసి, కొలవటం చూసినప్పుడు, ప్రజలు నిజంగా సంతోషిస్తారు. ఆ రాతికి మీరు ఇప్పుడు చూసిన ఏడు పక్కలు యెహోవా యొక్క ఏడు కండ్లకు చిహ్నాలుగా ఉండి, అన్ని దిశలకూ చూస్తూ ఉంటాయి. అవి భూమి మీద ప్రతిదాన్నీ చూస్తాయి.”

11 పిమ్మట నేను (జెకర్యా) అతనికి చెప్పాను: “దీపస్తంభానికి కుడి పక్కన ఒక ఒలీవ చెట్టును, ఎడమ పక్కన మరొక చెట్టును నేను చూశాను. ఆ రెండు ఒలీవ చెట్ల అర్థం ఏమిటి?” 12 నేనింకా ఇలా అన్నాను: “బంగారు రంగుగల నూనె ప్రవహించే బంగారు గొట్టాలవద్ద నేను రెండు ఒలీవ కొమ్మలు చూశాను. వీటి అర్థం ఏమిటి?”

13 తరువాత దేవదూత నాతో, “వీటి అర్థం ఏమిటో నీకు తెలియదా?” అని అన్నాడు.

“లేదయ్యా” అని నేను చెప్పాను.

14 “ఈ సర్వజగత్తుకు ప్రభువైన యెహోవాను సేవించటానికి ఎంపిక చేయబడిన ఇద్దరు మనుష్యులను అవి సూచిస్తాయి,” అని అతడు చెప్పాడు.

ఎగిరే చుట్టబడిన పత్రం

నేను మళ్లీ పైకి చూడగా, చుట్టబడిన ఒక ఎగిరే పత్రాన్ని చూశాను. “నీవు ఏమి చూస్తున్నావు?” అని దేవదూత నన్ను అడిగాడు.

“నేనొక చుట్టగా వున్న ఎగిరే పత్రాన్ని చూస్తున్నాను. ఆ చుట్ట ముప్పై అడుగుల పొడవు, పదిహేను అడుగుల వెడల్పు ఉంది” అని నేను చెప్పాను.

అప్పుడు దేవదూత నాతో చెప్పాడు, “ఆ చుట్టబడిన పత్రంమీద ఒక శాపం వ్రాయబడి ఉంది. ఆ పత్రంలో ఒక ప్రక్కన దొంగలకు ఒక శాపం ఉంది. ఆ పత్రానికి మరొక పక్కన అబద్ధపు వాగ్దానాలు చేసేవారికి ఒక శాపం ఉంది. సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: ‘దొంగల ఇండ్లకు, నా పేరు మీద దొంగ వాగ్దానాలు చేసేవారి ఇండ్లకు ఆ చుట్టబడిన పత్రాన్ని నేను పంపిస్తాను. ఆ పత్రం అక్కడ వుండి, ఆ ఇండ్లను నాశనం చేస్తుంది. రాళ్లు, కొయ్యస్తంభాలు సహితం నాశనం చేయబడతాయి.’”

స్త్రీ మరియు తొట్టి

తరువాత నాతో మాట్లాడుతూవున్న దేవదూత బయటికి వెళ్లాడు. అతడు నాతో, “చూడు! నీవు ఏమి జరుగుతున్నట్లు చూస్తున్నావు?” అని అన్నాడు.

“అదేమిటో నాకు తెలియదు” అని నేను అన్నాను.

అతడు ఇలా చెప్పాడు: “అది ఒక కొలతొట్టి. ఈ దేశంలో ప్రజలు చేసే పాపాలను కొలవటానికి ఆ బుట్ట ఉద్దేశించబడింది.”

ఆ తొట్టి మీదనుంచి సీసపు మూత తొలగించబడింది. ఆ బుట్టలో ఒక స్త్రీ కూర్చుని ఉంది. దానితో బరువైన (డెబ్బై ఐదు పౌనులు) సీసపు తూనికరాయి ఉంది. “ఈ స్త్రీ చెడును తెలియజేస్తుంది” అని దేవ దూత చెప్పాడు. పిమ్మట దేవదూత ఆ స్త్రీని తొట్టిలో పడదోసి, దానిమీద సీసపు మూతను పెట్టాడు. పాపాలు ఘోరమైనవని (బరువైనవని) ఇది తెలుపుతుంది. తరువాత నేను పైకి చూశాను. అక్కడ సంకుబుడ్డి కొంగవలె రెక్కలు గల ఇద్దరు స్త్రీలను చూశాను. వారు ఎగిరి వచ్చారు. వారి రెక్కల్లో గాలి ఉంది. వారు బుట్టను పట్టి లేవనెత్తారు. బుట్టను పట్టుకొని వారు గాలిలోకి పోయారు. 10 “వారు ఆ బుట్టను ఎక్కడికి మోసుకు పోతున్నారు?” అని నాతో మాట్లాడుతూవున్న దేవదూతను నేనడిగాను.

11 దేవదూత నాతో ఇలా చెప్పాడు: “షీనారులో[a] దానికొక ఆలయం నిర్మించటానికి వారు వెళ్తున్నారు. వారా ఆలయాన్ని నిర్మించాక ఆ బుట్టను అక్కడ ఉంచుతారు.”

నాలుగు రథాలు

నేను పిమ్మట నలు పక్కలా తిరిగి, పైకి చూశాను. అక్కడ నాలుగు రథాలు నాలుగు కంచుపర్వతాల మధ్యగా వెళ్లుచున్నట్లు నేను చూశాను. ఎర్రగుర్రాలు మొదటి రథాన్ని లాగుతున్నాయి. నల్లగుర్రాలు రెండవ రథాన్ని లాగుతున్నాయి. తెల్లగుర్రాలు మూడవ రథాన్ని లాగుతున్నాయి. మరియు ఎర్రమచ్చలున్న గుర్రాలు నాలుగో రథాన్ని లాగుతున్నాయి. నాతో మాట్టాడుచున్న దేవదూతను, “అయ్యా వీటి అర్థమేమిటి?” అని అడిగాను.

దేవదూత ఇలా సమాధానమిచ్చాడు: “ఇవి నాలుగు గాలులు.[b] ఇవి కేవలం ఈ సర్వలోకానికి ప్రభువైన దేవుని ముందునుండి వచ్చాయి. నల్లగుర్రాలు ఉత్తరానికి వెళతాయి. ఎర్రగుర్రాలు తూర్పుకు వెళతాయి. తెల్ల గుర్రాలు పడమటికి వెళతాయి. ఎర్ర మచ్చల గుర్రాలు దక్షిణానికి వెళతాయి.”

ఎర్రమచ్చల గుర్రాలు తమకు చెందిన భూభాగాన్ని చూడాలని ఆత్రంగా ఉన్నాయి. కావున దేవదూత వాటితో, “వెళ్లి, భూమి మీద నడవండి” అని అన్నాడు. అందుచే అవి వాటికి చెందిన ప్రాంతంలో నడుస్తూ వెళ్లాయి.

తరువాత యెహోవా నన్ను బిగ్గరగా పిలిచి ఇలా అన్నాడు: “చూడు, ఉత్తరానికి వెళ్తున్న గుర్రాలు బబులోనులో తమ పని పూర్తి చేశాయి. అవి నా ఆత్మను శాంతింపజేశాయి. నేనిప్పుడు కోపంగా లేను!”

యాజకుడైన యెహోషువ కిరీటాన్ని పొందటం

పిమ్మట యెహోవానుండి నేను మరొక వర్తమానం అందుకున్నాను. 10 ఆయన ఇలా చెప్పాడు: “బబులోనులో బందీలుగాఉన్న వారిలోనుండి హెల్దయి, టోబీయా, యెదాయా అనేవారు వచ్చారు. వారి వద్దనుండి వెండి బంగారాలు తీసికొని, జెఫన్యా కుమారుడైన యోషీయా ఇంటికి వెళ్లు. 11 ఆ వెండి బంగారాలను ఒక కిరీటం చేయటానికి వినియోగించు. ఆ కిరీటాన్ని యెహోషువ తలమీద పెట్టు. (యెహోషువ ప్రధాన యాజకుడు. యెహోజాదాకు కుమారుడే యెహోషువ) తరువాత యెహోషువకు ఈ విషయాలు చెప్పు. 12 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:

“కొమ్మ అని పిలువబడే ఒక మనిషి ఉన్నాడు.
    అతడు బలంగా పెరుగుతాడు.
    అతడు యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
13 అతడు యెహోవా ఆలయాన్ని నిర్మించి,
    గౌరవాన్ని పొందుతాడు.
అతడు తన సింహాసనంపై కూర్చుని, పాలకుడవుతాడు.
    ఒక యాజకుడు అతని సింహాసనంవద్ద నిలబడతాడు.
ఈ ఇద్దరు మనుష్యులూ శాంతియుత వాతావరణంలో కలిసి పనిచేస్తారు.

14 వారు కిరీటాన్ని ప్రజల జ్ఞాపకార్థం ఆలయంలో ఉంచుతారు. ఆ కిరీటం హెల్దయి, టోబీయా, యెదాయా మరియు జెఫన్నా కుమారుడైన యోషీయాలకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.”

15 మిక్కిలి దూరంలో నివసిస్తున్నవారు వచ్చి ఆలయాన్ని నిర్మిస్తారు. అప్పుడు ప్రజలైన మీవద్దకు యెహోవా నన్ను పంపినట్లు మీరు నిశ్చయంగా తెలుసుకుంటారు. యెహోవా ఏమి చెపుతున్నాడో అది మీరు చేస్తే ఈ విషయాలన్నీ జరుగుతాయి.

యెహోవా దయాదాక్షిణ్యాలను కోరుట

దర్యావేషు పర్షియా రాజుగావున్న కాలంలో నాలుగవ సంవత్సరంలో యెహోవానుండి జెకర్యా ఒక వర్తమానం అందుకున్నాడు. ఇది తొమ్మిదవ నెలలో (కిస్లేవు) నాల్గవ రోజున జరిగింది. బేతేలు ప్రజలు షెరెజెరును, రెగెమ్మెలెకును, వారి మనుష్యులను యెహోవా వద్దకు ఒక ప్రశ్న అడగటానికి పంపారు. వారు సర్వశక్తిమంతుడైన యెహోవా ఆలయంలో ఉన్న ప్రవక్తలు, యాజకుల వద్దకు వెళ్లారు. ఆ మనుష్యులు వారిని ఈ ప్రశ్న అడిగారు: “ఆలయ వినాశనానికి కొన్ని సంవత్సరాలుగా మా విషాదాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాము. ప్రతి సంవత్సరం ఐదవ నెలలో ఒక ప్రత్యేక సంతాపదినాన్ని, నిరాహార దీక్షను పాటిస్తున్నాము. మేము ఇలా చేస్తూ ఉండవలసిందేనా?”

సర్వశక్తిమంతుడైన యెహోవానుండి నేను ఈ వర్తమానం అందుకున్నాను: “ఈ దేశంలోని యాజకులకు, తదితర ప్రజలకు ఈ విషయం చెప్పు, ‘మీరు ఉపవాసాలు చేసి, మీ సంతాపాన్ని ఐదవ నెలలోను, ఏడవ నెలలోను ప్రకటించారు. నిజానికి ఆ ఉపవాసం నా కొరకకేనా? కాదు! మరియు మీరు తినటం, తాగటం కూడ నా కొరకేనా? కాదు! అది మీ మంచి కొరకు మాత్రమే. దేవుడు ఏనాడో ఈ విషయాలు చెప్పటానికి ఆనాటి ప్రవక్తలను వినియోగించాడు. యెరూషలేము జనంతో నిండి, ఐశ్వర్యంతో తులతూగేనాడే ఆయన ఈ విషయాలు చెప్పాడు. యెరూషలేము చుట్టూవున్న పట్టణాలలో, దక్షిణ పల్లపు ప్రాంతంలో, పడమటి కొండవాలులలో ప్రజలు నివసిస్తున్న రోజులలోనే దేవుడు ఈ విషయాలు చెప్పాడు.’”

యెహోవా నుండి జెకర్యాకు వచ్చిన వర్తమానం ఇది:
సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
“ఏది ధర్మమో, ఏది న్యాయమో మీరది చేయాలి.
    మీరందరూ ఒకరికొకరు దయ,
    కరుణ కలిగి ఉండాలి.
10 విధవ స్త్రీలను, అనాథ పిల్లలను,
    కొత్తవారిని, పేదవారిని బాధించవద్దు.
కనీసం ఒకరికొకరు కీడు చేసుకోవాలనే
    ఆలోచన కూడా మీరు రానీయకండి!”

11 కాని ఆ ప్రజలు ఇది వినటానికి నిరాకరించారు.
    ఆయన కోరింది చేయటానికి వారు నిరాకరించారు.
దేవుడు చెప్పింది వినకుండా వుండేటందుకు వారు
    తమ చెవులు మూసుకున్నారు.
12 వారు చాలా మొండి వైఖరి దాల్చారు.
    వారు న్యాయాన్ని పాటించరు.
ఆత్మ ప్రేరణతో సర్వశక్తిమంతుడైన యెహోవా తన ప్రజలకు
    ప్రవక్తల ద్వారా వర్తమానాలు పంపాడు.
కాని ప్రజలు వాటిని వినలేదు.
    అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా మిక్కిలి కోపగించాడు.
13 కావున సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్పాడు,
“నేను వారిని పిలిచాను,
    కాని వారు పలకలేదు.
అందువల్ల ఇప్పుడు వారు పిలిస్తే
    నేను పలకను.
14 ఇతర దేశాలను వారి మీదికి ఒక తుఫానులా తీసుకువస్తాను.
    వారెవరో వీరికి తెలియదు;
కాని వారు దేశంలో తిరిగాక
    అది నాశనమై పోతుంది.
రమ్యమైన ఈ దేశం నాశనమై పోతుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International