Chronological
మీకాయా అహాబును హెచ్చరించుట
22 తరువాత రెండు సంత్సరాల కాలంలో ఇశ్రాయేలు, అరాము దేశాల మధ్య శాంతి సామరస్యాలు నెలకొన్నాయి. 2 మూడవ సంవత్సరంలో యూదా రాజైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబును చూడటానికి వెళ్లాడు.
3 అదే సమయంలో అహాబు తన అధికారులతో, “రామోత్గిలాదు పట్టణాన్ని అరాము రాజు మనవద్ద నుండి తీసుకున్న సంగతి నీకు జ్ఞాపకమున్నదా? మనం రామోత్గిలాదును తిరిగి తీసుకొని రావటానికి ఏ రకమైన చర్యనూ ఎందుకు తీసుకోలేదు? అది మన పట్టణమై తీరాలి” అని అన్నాడు. 4 అప్పుడు అహాబు తన వద్దకు వచ్చిన రాజైన యెహోషాపాతును, “రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడటానికి నీవు మాతో కలుస్తావా?” అని అడిగాడు.
“అవును, నేను మీతో కలుస్తాను. నీ సైన్యంతో సహకరించటానికి నా సైనికులు, గుర్రాలు సిద్ధంగా వున్నాయి. 5 కాని ముందుగా మనం యెహోవాను మనకు సహాయం చేయమని అడగాలి” అని యెహోషాపాతు అన్నాడు.
6 అందుచేత అహాబు ప్రవక్తలందరినీ సమావేశపర్చాడు. ఆ సయయంలో అక్కడ సుమారు నాలుగువందల మంది ప్రవక్తలున్నారు. “నేను వెళ్లి అరాము సైన్యంతో రామోత్గిలాదు వద్ద యుద్ధం చేయవచ్చునా? లేక నేనింకా మరో సమయం కొరకు వేచివుండాలా?” అని అహాబు వారినడిగాడు.
“నీవు వెళ్లి ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నీకు విజయం చేకూర్చుతాడు” అని ప్రవక్తలన్నారు.
7 కాని యెహోషాపాతు, “యెహోవా యొక్క ప్రవక్త మరెవరైనా ఇక్కడ వున్నారా? వుంటే అతడు అహాబు ఏమి చేయాలో దేవుని అడిగి తెలుసుకోవాలి” అని అన్నాడు.
8 “మరో ప్రవక్త వున్నాడు. అతని పేరు మీకాయా, అతడు ఇమ్లా కుమారుడు. కాని నేనతనిని అనహ్యించుకుంటాను. అతడు యెహోవా తరపున మాట్లాడినప్పుడు, అతడెప్పుడూ నాకు మంచి చెప్పడు. నాకు ఇష్టం లేని విషయాలే అతడెప్పుడూ చెపుతాడు” అని అహాబు అన్నాడు.
“అహాబు రాజా, నీవు అలా అనకూడదు” అని యెహోషాపాతు అన్నాడు.
9 కావున రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి మీకాయా కొరకు వెళ్లి ఎక్కడున్నాడో చూడమన్నాడు.
10 ఆ సమయంలో ఆ రాజులిద్దరూ తమ తమ రాజ దుస్తుల్లో వున్నారు. వారు సింహాసనాల మీద కూర్చుని వున్నారు. అది షోమ్రోను నగర ద్వారం వద్దగల న్యాయస్థానం. ప్రవక్తలందరూ వారి ముందు నిలబడ్డారు. ప్రవక్తలు ప్రత్యేకమైన విషయాలనేకం యెహోవా నుండి తెలుసుకుని ప్రకటిస్తున్నారు. 11 వారిలో కెనయనా కుమారుడు సిద్కియా అను వాడొకడున్నాడు. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు[a] చేయించి తెచ్చాడు. అతడు అహాబుతో యెహోవా ఇలా అంటున్నాడని చెప్పాడు: “అరాము సైన్యంతో పోరాడటానికి నీవు ఈ ఇనుప కొమ్ములు ఉపయోగిస్తావు. నీవు వారిని ఓడించి, సర్వనాశనం చేస్తావు.” 12 మిగిలిన ప్రవక్తలు కూడ సిద్కియా చెప్పిన దానితో ఏకీభవించారు. ఆ ప్రవక్త ఇంకా ఇలా అన్నాడు: “నీ సైన్యం ఇప్పుడే కదిలి వెళ్లాలి. అరాము సైన్యంతో వారు రామోత్గిలాదు వద్ద పోరు సల్పాలి. నీవా పోరాటంలో గెలుస్తావు. యెహోవా నీవు గెలిచేలా చేస్తాడు.”
13 ఈ కార్యక్రమం ఇలా కొనసాగుతూ వుండగా ప్రభుత్వాధికారి మీకాయాకొరకు వెళ్లాడు. అతడు మీకాయాను చూసి, “ప్రవక్తలంతా రాజు గెలుస్తాడని చెబుతున్నారు. నేననేదేమంటే నీవు కూడా అదే మాదిరిగా చెపితే నీకు చాలా క్షేమకరం” అని అన్నాడు.
14 “కాదు! యెహోవా ప్రసాదించిన శక్తిచేత యెహోవా నన్ను ఏది చెప్పమని ఆజ్ఞయిస్తే అదే చెబుతానని ప్రమాణం చేసియున్నాను” అని మీకాయా సమాధానం చెప్పాడు.
15 తరువాత మీకాయా వచ్చి రాజైన అహాబు ముందు నిలబడ్డాడు. రాజు అతనిని ఇలా అడిగాడు: “మీకాయా, రాజైన యెహోషాపాతు, నేను మా సైన్యాలను కలుపవచ్చా? ఇప్పుడు మేము వెళ్లి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడవచ్చునా?” “అవును. మీరు వెళ్లి వారితో ఇప్పుడు యుద్ధం చేయవచ్చు. యెహోవా నిన్ను గెలిపిస్తాడు” అని మీకాయా సమాధానం చెప్పాడు.
16 కాని ఇలా అన్నాడు: “నీవు ఈ మాటలు యెహోవా శక్తితో చెప్పటం లేదు. ఇది నీ ఊహాగానం. అందువల్ల నాకు నిజం చెప్పు! నేనేం చేయాలో యెహోవా శక్తి ఆధారంగా నాకు తెలియజెప్పు! ఎన్నిసార్లు నేను నీకు చెప్పాను!”
17 అందుకు మీకాయా ఇలా అన్నాడు: “ఏమి జరుగుతుందో నేను చూడగలను. ఇశ్రాయేలు సైన్యం కొండల్లో చిందరవందరై పోతుంది. కాపరిలేని గొర్రెల్లా వారు వికలమైపోతారు. ‘ఈ మనుష్యులకు నాయకుడులేడు. పోరుమాని వారు ఇండ్లకు పోతే మంచిది’ అని యెహోవా అంటున్నాడు.”
18 యెహోషాపాతుతో అప్పుడు అహాబు ఇలా అన్నాడు: “చూడు! నేను చెప్పాను గదా! ఈ ప్రవక్త నన్ను గురించి ఎన్నడూ మంచి చెప్పడు. ప్రతిసారీ నేను విననొల్లని మాటలే అతడు చెబుతాడు.”
19 కాని మీకాయా యెహోవా తరపున మాట్లాడటం కొనసాగించాడు. మీకాయా ఇలా అన్నాడు: “వినండి! ఇవి యెహోవా చెప్పిన మాటలు. యెహోవా పరలోకంలో సింహాసనాసీనుడై వున్నట్లు చూశాను. దేవదూతలు ఆయనకు చేరువలో నిలబడియున్నారు. 20 యెహోవా వారితో ఇలా చెప్పినాడు: ‘మీలో ఎవరైనా రాజైన అహాబును మోసగించగలరా? అతడు రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో పోరాడేలా చేయాలని నా వాంఛ. అప్పుడతడు చంపబడతాడు.’ దేవదూతలు తాము చేయవలసిన పనిపై ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రాలేకపోయారు. 21 అప్పుడు ఒక దేవదూత యెహోవా ముందుకు వచ్చి, ‘నేనతనిని మాయ జేయగలను!’ అని చెప్పాడు. 22 ‘ఎలామాయలో పడవేయగలవు?’ అని యెహోవా అడిగాడు. ‘అహాబు ప్రవక్తలందరినీ కలవరపెడతాను. రాజైన అహాబుతో అన్నీ అబద్ధాలు చెప్పమని ప్రవక్తలను ప్రోత్సహిస్తాను. ప్రవక్తల సమాచారాలన్నీ అబద్ధాలే’ అని దేవదూత అన్నాడు. అందుకు యెహోవా, ‘మంచిది! వెళ్లి అహాబు రాజును మాయలో పడవేయి; నీకు విజయం చేకూరుతుంది’” అని అన్నాడు.
23 మీకాయా తన కథనం ముగించాడు. అతనిలా అన్నాడు: “ఇదీ ఇక్కడ జరిగిన విషయం. యెహోవా నీ ప్రవక్తలను నీతో అబద్దమాడేలా చేశాడు. యెహోవా తనకు తానే నీకు కష్టనష్టాలు రావాలని కోరి నిశ్చయించాడు.”
24 తరువాత ప్రవక్తయగు సిద్కియా, మీకాయా వద్దకు వెళ్లాడు. సిద్కియా మీకాయాను చెంప మీదకొట్టి, “యెహోవా శక్తి నన్ను వదిలి నీద్వారా మాట్లాడుతున్నదని నీవు నిజంగా నమ్ముతున్నావా?” అని అడిగాడు.
25 “నీవు వెంటనే వెళ్లి ఒక చిన్న గదిలో దాగివుండు. అప్పుడు నేను నిజం చెబుతున్నట్లు నీకు తెలుస్తుంది” అన్నాడు మీకాయా.
26 మీకాయాను బంధించమని అహాబు తన అధికారులకు ఆజ్ఞ ఇచ్చాడు. “ఇతనిని బంధించి నగరపాలకుడగు ఆమోను వద్దకు తీసుకుని వెళ్లండి. రాజకుమారుడైన యెవాషును ఇతనిపై తీర్పు చెప్పనీయండి. 27 మీకాయాను కారాగారంలో వుంచమని అతనికి చెప్పండి. వీనికి కేవలం రొట్టె, నీరు మాత్రం ఇవ్వండి. నేను యుద్ధంనుండి ఇంటికి తిరిగి వచ్చేవరకు ఇతనిని అక్కడే వుంచండి” అని రాజైన అహాబు అన్నాడు.
28 అది విన్న మీకాయా ఇలా ప్రకటించాడు: “సర్వప్రజలారా, నే చెప్పేది సావధానంగా వినండి! అహాబు రాజా, యుద్ధం నుండి నీవు క్షేమంగా ఇంటికి తిరిగివస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండనట్లే.”
రామోతు గిలాదు వద్ద యుద్ధం
29 తరువాత రాజైన అహాబు, మరియు రాజైన యెహోషాపాతు కలిసి రామోత్గిలాదు వద్ద అరాము సైన్యంతో యుద్ధం చేయటానికి వెళ్లారు. గిలాదు అనే ప్రాంతంలో ఇది వుంది. 30 అహాబు యెహోషాపాతుతో ఇలా అన్నాడు: “మనం యుద్ధానికి సిద్ధమవుదాం. నేను రాజునని తెలియకుండా వుండేలాగున తగిన దుస్తులు వేసుకుంటాను. కాని నీవు మాత్రం రాజఠీవి ఉట్టిపడే నీ యొక్క ప్రత్యేక దుస్తులు ధరించు.” ఇశ్రాయేలు రాజు మారువేషం వేసుకున్నాడు. యుద్ధం మొదలయింది.
31 అరాము రాజుకు ముప్పది యిద్దరు రథాధిపతులున్నారు. ఈ ముప్పది యిద్దరు రథాధిపతులకూ ఇశ్రాయేలు రాజు ఎక్కడ వున్నాడో చూడమని చెప్పాడు. ఇశ్రాయేలు రాజును చంపేయమని అరాము రాజు అధిపతులకు ఆజ్ఞ ఇచ్చాడు. 32 యుద్దం సాగుతూవుండగా ఈ అధిపతులు రాజైన యెహోషాపాతును చూశారు. వారు అతనినే ఇశ్రాయేలు రాజుగా భావించారు. అందుచే వారతనిని చంపటానికి వెళ్లారు. యెహోషాపాతు తను రాజు కాదన్నట్లు అరవటం ప్రారంభించాడు. 33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు.
34 కాని ఒక సైనికుడు తన బాణాన్ని గాలిలోకి వదిలాడు. అతడు కావాలని దానిని ఎవరిపైకీ గురిచూసి వదలలేదు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. రాజు కవచం అతని శరీరాన్ని కప్పని చోట బాణం తగిలింది. రాజైన అహాబు తనసారధితో, “నాకు ఒక బాణం తగిలింది. త్వరగా రథాన్ని ఈ ప్రదేశంనుండి బయటికి నడిపించు. యుద్ధంనుండి మనం వెళ్లిపోవాలి” అని అన్నాడు.
35 సైన్యాలు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాయి. రాజైన ఆహాబు తన రథం మీదే వుండిపోయాడు. రథంలో ఒక పక్కగా ఆనుకొని వున్నాడు. అతడు అరాము సైన్యంవైపు చూస్తూ వుండిపోయాడు. అతని గాయం నుండి కారిన రక్తం రథంలో పేరుకుపోయింది. బాగా సాయంత్ర మయ్యేసరికి రాజు చనిపోయాడు. 36 సూర్యాస్తమయసమయంలో ఇశ్రాయేలు సైన్యం తమ స్వదేశానికి, నగరానికి తిరిగి వెళ్లటానికి ఆజ్ఞ ఇవ్వబడింది.
37 రాజైన అహాబు ఆ విధంగా చనిపోయాడు. అతని భౌతిక కాయాన్ని కొందరు షోమ్రోనుకు తీసుకొని వెళ్లారు. వారు దానిని అక్కడ సమాధి చేశారు. 38 అహాబు రథాన్ని సైనికులు షోమ్రోనులో ఒక చెరువు వద్ద కడిగారు. అక్కడ కొన్ని కుక్కలు రథం చుట్టూ చేరి రథంలో పేరుకు పోయిన రాజైన అహాబు రక్తాన్ని నాకాయి. పైగా ఆ నీటిలో వేశ్యలు స్నానం చేశారు. ఇవన్నీ ఎలా జరుగుతాయని యెహోవా చెప్పియున్నాడో అలానే జరిగాయి.
39 రాజైన అహాబు తన పరిపాలనాకాలంలో చేసిన పనులన్నీ ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో పొందు పర్చబడ్డాయి. రాజు తన భవనాన్ని అందంగా తీర్చిదిద్దటానికి ఉపయోగించిన దంతాన్ని గూర్చి కూడ ఆ గ్రంథం వివరిస్తుంది. అందులో రాజు నిర్మించిన నగరాన్ని గూర్చి కూడా వుంది. 40 అహాబు చనిపోయిన పిమ్మట అతని కుమారుడైన అహజ్యా అతని స్థానంలో రాజు అయ్యాడు.
యూదా రాజుగా యెహోషాపాతు
41 ఆసా కుమారుడైన యెహోషాపాతు ఇశ్రాయేలు రాజైన అహాబు ఏలుబడి నాలుగవ సంవత్సరంలో యూదాకు రాజయ్యాడు. 42 యెహోషాపాతు రాజు అయ్యే నాటికి ఇతని వయస్సు ముప్పై అయిదు సంవత్సరాలు. యెహోషాపాతు యెరూషలేములో ఇరవై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. యెహోషాపాతు తల్లి షిల్హీ కుమార్తె. అతని తల్లి పేరు అజూబా. 43 యెహోషాపాతు మంచి వ్యక్తి. గతంలో తన తండ్రి నడచిన రీతినే ఇతడు కూడ నడిచాడు. యెహోవా ఆజ్ఞలను శిరసావహించాడు. కాని యెహోషాపాతు ఉన్నత స్థలాలను తీసివేయలేదు. ఆ స్థలాలలో ప్రజలు బలులు సమర్పించటం, ధూపం వేయటం వంటి కార్యక్రమాలు కొనసాగించారు.
44 యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో ఒక శాంతి ఒడంబడికను కుదుర్చుకున్నాడు. 45 యెహోషాపాతు మిక్కిలి ధైర్యవంతుడు. అతడు చాలా యుద్ధాలు చేశాడు. అతడు చేసిన పనులన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి.
46 వ్యభిచార విషయంగా తమ శరీరాలను అమ్ముకొనే స్త్రీ పురుషులను ఆరాధనా స్థలాలనుండి యెహోషాపాతు వెళ్లగొట్టాడు. తన తండ్రియగు ఆసా రాజ్యం చేసిన కాలంలో ఆ రకమైన స్త్రీ పురుషులు ఆరాధనా స్థలాలలో సేవచేస్తూ వుండేవారు.
47 ఆ కాలంలో ఎదోము దేశానికి రాజు లేడు. అది ఒక పాలనాధికారి అధీనంలో వుండేది. ఆ అధికారి యూదా రాజుచేత ఎంపిక చేయబడేవాడు.
48 రాజైన యెహోషాపాతు సముద్రయానానికి అనువైన ఓడలను నిర్మించాడు. యెహోషాపాతు ఆ ఓడలను ఓఫీరు దేశానికి పంపాడు. ఓడలు బంగారాన్ని తేవాలని అతని ఆశయం. కాని ఓడలు ఎసోన్గెబెరు వద్ద మునిగిపోయాయి. ఓడలు బంగారాన్ని అసలు తేలేక పోయాయి. 49 ఇశ్రాయేలు రాజైన అహజ్యా యెహోషాపాతుకు సహాయం చేయటానికి వెళ్లాడు. యెహోషాపాతుతో నౌకా నిర్మాణ యానాలలో సమర్థులైన వారిని తీసుకొని వస్తానని అహజ్యా అన్నాడు. కాని యెహోషాపాతు అహజ్యా మనుష్యులను వినియోగించుకోడానికి నిరాకరించాడు.
50 యెహోషాపాతు చనిపోయాడు. అతనిని తన పూర్వికులతో దావీదు నగరంలో సమాధిచేశారు. తరువాత అతని కుమారుడు యెహోరాము రాజయ్యాడు.
ఇశ్రాయేలు రాజుగా అహజ్యా
51 అహాబు కుమారుడు అహజ్యా, యెహోషాపాతు పాలన యూదాలో పదునేడవ సంవత్సరం జరుగుతుండగా అహజ్యా ఇశ్రాయేలుకు రాజైనాడు. అహజ్యా షోమ్రోనులో రెండు సంవత్సరాలు పాలించాడు. 52 అహజ్యా యెహోవా దృష్టిలో పాపం చేశాడు. తన తండ్రి అహాబు, తన తల్లి యెజెబెలు, మరియు నెబాతు కుమారుడైన యరొబాము నడచిన చెడునడతనే అహజ్యా కూడ అనుసరించాడు. ఈ పాలకులంతా ఇశ్రాయేలు ప్రజలు పాపం చేయటానికి కారుకులయ్యారు. 53 అహజ్యా బూటకపు దేవత బయలును ఆరాధించాడు. తనకు ముందున్న తన తండ్రి వలెనే ఆ అసత్య దేవతను కొలిచాడు. తన ఈ చెడు నడవడితో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు చాలా కోపం కలిగించాడు. తనకు ముందున్న తన తండ్రిపట్ల కోపగించినట్లు యెహోవా అహజ్యా పట్ల కూడా కోపంతో వున్నాడు.
మీకాయా రాజైన అహాబును హెచ్చరించటం
18 యెహోషాపాతుకు ఎక్కువగా ధనం, గౌరవం లభించాయి. రాజైన అహాబుతో అతడు వివాహం[a] ద్వారా ఒక ఒడంబడిక ఏర్పరచుకొన్నాడు. 2 కొద్ది సంవత్సరాల తరువాత యెహోషాపాతు సమరయ (షోమ్రోను) లో అహాబును చూడటానికి వెళ్లాడు. యెహోషాపాతు, అతని పరివారం యొక్క గౌరవార్థం అహాబు అనేక గొర్రెలను, ఆవులను వధించాడు. ఆ సమయాన రామోత్గిలాదు పట్టణంపై దాడి చేయటానికి అహాబు యెహోషాపాతును ప్రోత్సహించాడు. 3 “రామోత్గిలాదుపై దండెత్తటానికి నీవు నాతో వస్తావా?” అని అహాబు యెహోషాపాతును అడిగాడు. అహాబు ఇశ్రాయేలు రాజు. యెహోషాపాతు యూదా రాజు. అహాబుకు యెహోషాపాతు యిలా సమాధాన మిచ్చాడు: “నేను నీవాడను. నా మనుష్యులు నీవారు. మేము యుద్ధానికి నీతో వస్తాము. 4 కాని ముందుగా మనం యెహోవా వర్తమానం ఏమైనా వుంటుందేమో చూద్దాం,” అని యెహోషాపాతు అన్నాడు.
5 అందువల్ల అహాబు నాలుగు వందల మంది ప్రవక్తలను పిలిపించాడు. అహాబు వారితో, “మేము రామోత్గిలాదు పట్టణం మీదికి యుద్ధానికి వెళ్లవచ్చా? లేదా?” అని అన్నాడు.
అప్పుడు ప్రవక్తలు, “వెళ్లండి; ఎందువల్లనంటే దేవుడు రామోత్గిలాదును మీరు ఓడించేలా చేస్తాడు” అని అహాబుకు సమాధాన మిచ్చారు.
6 కాని యెహోషాపాతు యిలా అన్నాడు: “ఇక్కడ యెహోవా యొక్క ప్రవక్త ఎవరైనా వున్నారా? యెహోవా ప్రవక్తలలో ఒకని ద్వారా ఆయన ఏమి చెబుతున్నాడో తెలుసుకోవలసిన అవసరం వుంది.”
7 అప్పుడు రాజైన అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “ఇక్కడ ఇంకా ఒక మనిషి వున్నాడు. మనం అతని ద్వారా యెహోవాను అడుగుదాం. కాని ఈ మనిషిని నేను అసహ్యించుకుంటాను. ఎందువల్లనంటే అతడు యెహోవా నుండి నాకు ఒక్క మంచి వర్తమానం కూడ అందచేయడు. నాకు ఎప్పుడూ చెడువార్తలే తెస్తాడు. ఆ వ్యక్తి పేరు మీకాయా. అతడు ఇమ్లా కుమారుడు.”
కాని యెహోషాపాతు, “అహాబూ నీవు అలా అనరాదు” అని అన్నాడు.
8 అప్పుడు రాజైన అహాబు తన అధికారులలో ఒకనిని పిలిచి, “ఇమ్లా కుమారుడైన మీకాయాను త్వరగా తీసుకొని రమ్మని పంపాడు.”
9 ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు తమతమ రాజదుస్తులు ధరించారు. వారిద్దరు సమరయ (షోమ్రోను) నగర ముఖద్వారం దగ్గర వున్న నూర్పిడి కళ్లం వద్ద తమతమ సింహాసనాలపై కూర్చున్నారు. అక్కడకు వచ్చియున్న నాలుగువందల మంది ప్రవక్తలు రాగల సంగతుల వర్తమానాలను రాజుల ముంగిట చెబుతున్నారు. 10 కెనయనా కుమారుని పేరు సిద్కియా. సిద్కియా కొన్ని ఇనుప కొమ్ములు చేయించుకు వచ్చాడు. సిద్కియా యిలా అన్నాడు: “యెహోవా ఈ రకంగా చెప్పుచున్నాడు: ‘నీవు ఈ ఇనుప కొమ్ములు వినియోగించి, అరామీయులు (సిరియనులు) నశించిపోయే వరకు వారిని పొడుస్తావు.’” 11 ప్రవక్తలంతా అదే విషయం చెప్పారు. వారిలా అన్నారు: “రామోత్గిలాదు పట్టణానికి వెళ్లు. నీకు విజయం చేకూరుతుంది. రాజు అరాము ప్రజలను ఓడించేలా యెహోవా తోడ్పడుతాడు.”
12 మీకాయాను పిలవటానికి వెళ్లిన దూత అతనితో యీలా చెప్పాడు: “మీకాయా, వినండి; ప్రవక్తలంతా ఒకే రీతిగా ప్రవచిస్తున్నారు. రాజుకు విజయం చేకూరుతుందని వారు చెబుతున్నారు. వారు చెప్పినట్లుగానే నీవు కూడా తెలియజేయి. నీవు కూడ మంచి విషయాలే చెప్పు.”
13 “యెహోవా జీవముతోడు నేను నా దేవుడు తెలియజేసిన రీతినే చెబుతాను” అని మీకాయా అన్నాడు.
14 పిమ్మట మీకాయా రాజైన అహాబు వద్దకు వచ్చాడు. రాజు అతనితో, “మీకాయా, మేము రామోత్గిలాదు పట్టణంపై దండెత్తటానికి వెళ్లవచ్చునో, లోదో తెలియజేయి” అని అన్నాడు.
అందుకు మీకాయా, “వెళ్లి దాడి చేయి, దేవుడు నీవాప్రజలను ఓడించేలా చేస్తాడు,” అని చెప్పాడు.
15 అహాబు రాజు మీకాయాతో, “గతంలో చాలా సార్లు నిజమే ప్రవచించేలా యెహోవా పేర నీచేత ప్రమాణం చేయించాను,” అని అన్నాడు.
16 అప్పుడు మీకాయా యీలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలంతా పర్వతాలపై చిందరవందరై పోయినట్లు నేను చూశాను. వారు కాపరిలేని గొర్రెల్లా వున్నారు. యెహోవా చెప్పినదేమంటే, ‘వారికి నాయకుడు లేడు. కావున ప్రతి ఒక్కడినీ క్షేమంగా ఇంటికి పోనిమ్ము.’”
17 అది విని ఇశ్రాయేలు రాజు అహాబు యెహోషాపాతుతో యిలా అన్నాడు: “మీకాయా నాకు ఎప్పుడూ యెహోవా నుండి మంచి వార్త తేడని నేను నీకు ముందే చెప్పాను! నా గురించి అతడు తెచ్చేవన్నీ చెడు వర్తమానాలే!”
18 మీకాయా ఇంకా యిలా అన్నాడు: “యెహోవా వర్తమానాన్ని వినండి! యెహోవా తన సింహాసనంపై కూర్చుని వున్నట్లు నేను చూశాను. పరమండల సైన్యమంతా ఆయన చుట్టూ చేరివుంది. 19 యెహోవా, ‘ఇశ్రాయేలు రాజైన అహాబు అక్కడ చంపబడే విధంగా, యుక్తిగా రామోత్గిలాదుపై అతనిని యుద్ధానికి ఎవరు పంపగలరు?’ అని అడిగినాడు. ఆయన చుట్టూ చేరిన పలువురు పలురకాలుగా చెప్పారు. 20 పిమ్మట ఒక ఆత్మవచ్చి యెహోవా ముందు నిలబడి, ‘అహాబును నేను మోసపుచ్చుతాను’ అని అన్నది. ‘ఎలా?’ అని యెహోవా ఆత్మని అడిగాడు. 21 ‘నేను అసత్యలాడే ఆత్మగా మారి అహాబు ప్రవక్తలలో ప్రవేశించి వారి నోట అబద్ధాలు పలికిస్తాను’ అని ఆత్మ చెప్పింది. అది విని ‘అహాబును మోసగించటంలో నీకు జయమగు గాక! నీవు బయటకు వెళ్లి కార్యము సాధించు’ అని యెహోవా అన్నాడు.
22 “అహాబూ, ఇప్పుడు చూడు; యెహోవా ఒక అసత్య ఆత్మను నీ ప్రవక్తలలో ప్రవేశపెట్టాడు. నీకు కీడు మూడుతుందని యెహోవా చెప్పియున్నాడు.”
23 పిమ్మట సిద్కియా తిన్నగా మీకాయా వద్దకు వెళ్లి చెంపమీద చాచికొట్టాడు. సిద్కియా తండ్రి పేరు కెనయనా. సిద్కియా యిలా అన్నాడు: “మీకాయా, యెహోవా వద్దనుండి వచ్చిన ఆత్మ నన్ను వదిలి నిన్నావరించటానికి ఎటునుండి వచ్చింది?”
24 దానికి మీకాయా “సిద్కియా, నీవు లోపలి గదిలోకి పోయి దాగుకొనే రోజున నీవది తెలుసుకొంటావు!” అని సమాధానమిచ్చాడు.
25 పిమ్మట రాజైన అహాబు యిలా అన్నాడు: “మీకాయాను తీసుకొని వెళ్లి నగరపాలకుడైన ఆమోనుకు, రాజకుమారుడైన యెవాషుకు అప్పజెప్పండి. 26 రాజాజ్ఞగా ఆమోనుకు, యెవాషుకు యిలా చెప్పండి: ‘మీకాయాను చెరసాలలో పెట్టండి. నేను యుద్ధం నుండి తిరిగి వచ్చేవరకు అతనికి రొట్టె నీరు తప్ప ఇతర ఆహారమేదీ యివ్వవద్దు.’”
27 మీకాయా యిలా సమాధానమిచ్చాడు: “అహాబూ, నీవు యుద్ధాన్నుండి క్షేమంగా తిరిగి వస్తే, యెహోవా నా ద్వారా మాట్లాడి యుండలేదని అర్థం. ఓ ప్రజలారా, నా మాటలు విని జ్ఞాపకం పెట్టుకోండి!”
రామోత్గిలాదులో అహాబు చంపబడటం
28 పిమ్మట ఇశ్రాయేలు రాజైన అహాబు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్గిలాదు పట్టణాన్ని ముట్టడించారు. 29 అహాబు రాజు యెహోషాపాతుతో, “యుద్ధంలోకి వెళ్లే ముందు నేను నా వేషం మార్చివేస్తాను. కాని నీవు మాత్రం నీ రాజదుస్తులే ధరించు” అని అన్నాడు. ఇశ్రాయేలు రాజు మారువేషం వేసిన పిమ్మట రాజులిద్దరూ యుద్ధానికి వెళ్లారు.
30 అరాము (సిరియా) రాజు తన రథాల అధిపతులకు ఒక ఆజ్ఞ యిచ్చాడు. అతడు వారితో యిలా అన్నాడు: “ఎంత గొప్ప వాడేగాని, ఎంత సామాన్యుడే గాని, మీరు ఎవ్వరితోనూ పోరాడవద్దు. కాని మీరు ఇశ్రాయేలు రాజైన అహాబుతోనే యుద్ధం చేయండి.” 31 రథాధిపతులు యెహోషాపాతును చూచినప్పుడు అతడే ఇశ్రాయేలు రాజైన అహాబు అనుకున్నారు! అతన్ని ఎదిరించటానికి వారు యెహోషాపాతు మీదికి తిరిగారు. కాని యెహోషాపాతు కేకలు పెట్టటంతో యెహోవా అతనికి సహాయపడ్డాడు. రథాధిపతులు యెహోషాపాతును వదిలి పోయేలాగు దేవుడు వారి మనస్సు మార్చాడు. 32 వారు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజు కాదని తెలిసికొన్నప్పుడు వారతనిని తరమటం మానివేశారు.
33 కాని ఒక సైనికుడు దేనికీ గురిపెట్టకుండా ఒక బాణాన్ని మామూలుగా వదిలాడు. కాని ఆ బాణం ఇశ్రాయేలు రాజైన అహాబుకు తగిలింది. కవచం కప్పకుండా వున్న అతని శరీర భాగంలో ఆ బాణం తగిలింది. అప్పుడు అహాబు తన రథసారధితో, “రథాన్ని వెనుకకు తిప్పి నన్ను యుద్ధరంగం నుండి బయటకు తీసుకొని వెళ్లు. నేను గాయపడ్డాను.” అని చెప్పాడు.
34 ఆ రోజు యుద్ధం తీవ్రంగా జరిగింది. అహాబు తన రథంలో ఆనుకొని సాయంత్రంమయ్యే వరకు అరామీయులను (సిరియనులు) చూస్తూ నిలబడివున్నాడు. సూర్యుడు అస్తమించే సమయంలో అహాబు చనిపోయాడు.
© 1997 Bible League International