Chronological
దేవుడు మరల సొలొమోను వద్దకు వచ్చుట
9 సొలొమోను యెహోవా దేవాలయాన్ని, తన రాజ భవనాన్ని నిర్మించటం పూర్తి చేశాడు. తాను నిర్మించదలచుకొన్నవన్నీ పూర్తి చేశాడు. 2 తరువాత యెహోవా సొలొమోనుకు పూర్వం గిబియోను పట్టణంలో ప్రత్యక్షమైనట్లు మళ్లీ కన్పించాడు. 3 యెహోవా అతనితో ఇలా అన్నాడు,
“నీ ప్రార్థన విన్నాను. నీవు నన్ను చేయమని అడిగిన విషయాలను కూడా విన్నాను. నీవు ఈ దేవాలయము కట్టించావు. నేను దానిని పవిత్రస్థలంగా చేశాను. కావున నేనక్కడ శాశ్వతంగా ఆరాధించబడతాను. నేను దానిని కనిపెట్టుకుని ఉండి ఎల్లప్పుడూ దానిని గూర్చి ఆలోచన చేస్తాను. 4 నీ తండ్రివలె నీవు సదా నన్ను ఆరాధిస్తూ వుండాలి. అతడు న్యాయవర్తనుడు; నిజాయితీపరుడు. నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను నీవు పాటించాలి. 5 నీవు ఇవన్నీ పాటిస్తే, ఇశ్రాయేలు రాజు ఎల్లప్పుడూ నీ వంశంలో నుండి వచ్చేలా చేస్తాను. ఈ వాగ్దానం నేను నీ తండ్రి దావీదుకు చేశాను. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ అతని సంతానంలోని వాడొకనిచే పరిపాలింపబడుతుందని నేనతనితో చెప్పాను.
6-7 “అయితే నీవు గాని, నీ సంతతి గాని నన్ను అనుసరించక పోయినా, నా న్యాయసూత్రాలను, నేను నిర్దేశించిన కట్టుబాట్లను పాటించకపోయినా, లేక మీరు ఇతర దేవుళ్లను సేవించి, ఆరాధించినా, నేను ఇచ్చిన రాజ్యంలో నుంచి ఇశ్రాయేలీయులు బయటికి పోయేలా ఒత్తిడి తెస్తాను. ఇశ్రాయేలీయులు నలుగురిలో నవ్వులపాలై, క్రమశిక్షణారాహిత్యంలో ఒక ఉదాహరణగా మిగిలిపోతారు. నేను ఈ దేవాలయాన్ని పవిత్రపరిచాను. ఇది ప్రజలు నన్ను గౌరవించే స్థలం. కాని మీరు నా ఆజ్ఞలను మన్నించకపోతే ఈ దేవాలయాన్ని నేలమట్టం చేస్తాను. 8 ఈ దేవాలయం సర్వనాశనం చేయబడుతుంది. ఇది చూచిన ప్రతివాడూ విస్మయము చెందుతాడు. వారంతా, ‘యెహోవా ఈ రాజ్యానికి, ఈ దేవాలయానికి ఈ భయంకర పరిస్థితిని ఎందుకు కల్పించాడు?’ అని అడుగుతారు. 9 మరికొందరు, ‘ఈ పరిణామం ఎందుకు వచ్చిందంటే ఆ ప్రజలు వారి యెహోవా దేవుని మర్చిపోయారు. వారి దేవుడు వారి పూర్వీకులను ఈజిప్టునుండి తీసుకుని వచ్చాడు. కాని వారు ఇతర దైవాలను సేవించటం మొదలు పెట్టారు’ అని సమాధానం చెపుతారు.”
10 ఇరవై సంవత్సరాల కాలవ్యవధిలో రాజైన సొలొమోను యెహోవా యొక్క దేవాలయాన్ని, తన రాజగృహాన్ని కట్టించాడు. 11 ఇరవై సంవత్సరాల తరువాత రాజైన సొలొమోను గలిలీయ దేశమందున్న ఇరవై పట్టణాలను తూరు రాజైన హీరాముకు ఇచ్చాడు. హీరాము రాజు ఆలయ నిర్మాణంలోను, రాజ భవన నిర్మాణంలోను సహాయపడినందుకు, సొలొమోను ఈ పట్టణాలను ఇచ్చాడు. సొలొమోను కోరినంత దేవదారు కలపను, సరళ వృక్షాలను, బంగారాన్ని హీరాము ఇచ్చాడు. 12 కావున సొలొమోను ఇచ్చిన ఆ పట్టణాలను చూడటానికి తూరు నుండి హీరాము బయలుదేరి వెళ్లాడు. హీరాము ఆ పట్టణాలను చూచి తృప్తిపడలేదు. 13 “ఈ పనికిరాని పట్టణాలను నాకు ఎందుకిచ్చినట్లు సోదరా?” అని హీరాము రాజు అన్నాడు. హీరాము రాజు ఆ పట్టణ ప్రాంతాలకు కాబూల్[a] ప్రాంతమని పేరు పెట్టాడు. ఈ నాటికి ఆ ప్రాంతం కాబూల్ అని పిలవబడుతోంది. 14 హీరాము సుమారు రెండు వందల నలభై[b] మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు.
15 రాజైన సొలొమోను దేవాలయ నిర్మణానికి, రాజభవన నిర్మణానికి బానిసలను బలవంతంగా పని చేయించాడు. ఈ బానిసలను చాలా ఇతర కట్టడాల విషయంలో కూడ రాజైన సొలొమోను వినియోగించుకున్నాడు. అతడు మిల్లోను[c] నిర్మించాడు. అతడింకా నగరానికి చుట్టూ ప్రాకారం కట్టించాడు. అతను హాసోరు, మెగిద్దో, మరియు గెజెరు నగరాలను కూడ పునర్మించాడు.
16 గతంలో ఈజిప్టు రాజు గెజెరు నగరంపై దండెత్తి దానిని తగులబెట్టాడు. అక్కడ నివసించే కనానీయులను చంపేశాడు. ఫరో కుమార్తెను సొలొమోను వివాహం చేసుకొన్నాడు. పెండ్లి కానుకగా ఫరో ఆ నగరాన్ని సొలొమోనుకు ఇచ్చాడు. 17 సొలొమోను ఆ నగరాన్ని తిరిగి నిర్మించాడు. సొలొమోను దిగువ బేత్ హోరోనును కూడ నిర్మించాడు. 18 రాజైన సొలొమోను బయలాతును, యూదయ అరణ్యములోనున్న తామారు నగరాలను కూడా నిర్మించాడు. 19 రాజైన సొలొమోను ధాన్యాగారములు, తదితర వస్తువులు నిల్వచేయు గోదాములుండు నగరాలను కూడ కట్టించాడు. తన రథాలకు, గుర్రాలకు తగిన శాలలు కూడ నిర్మింపజేశాడు. యెరూషలేములోను, లెబానోను లోను, ఇంకా తాను రాజ్యం చేసిన ప్రాంతాలలోను సొలొమోను రాజు కావాలనుకున్న కట్టడాలను చాలా నిర్మించాడు.
20 ఇశ్రాయేలీయులు కానివారు రాజ్యంలో చాలా మంది వున్నారు. వారు అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు. 21 ఇశ్రాయేలీయులు ఈ ప్రజలను నాశనం చేయలేక పోయారు. సొలొమోను వారిని బానిసలుగా పనిచేసేటందుకు బలవంతం చేశాడు. వారంతా ఈ నాటికీ బానిసలే. 22 కాని సొలొమోను ఇశ్రాయేలీయుల నెవ్వరినీ తన బానిసలు కమ్మని బలవంతం చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సైనికులుగాను, ప్రభుత్వ అధికారులుగాను, ఉద్యోగులుగాను, సైన్యాధిపతులుగాను, రథాధిపతులుగాను, రథసారథులుగాను పని చేశారు. 23 సొలొమోను చేపట్టిన కార్యక్రమాలను పరిశీలించడానికి ఐదువందల ఏభై మంది అధికారులున్నారు. వారు పనివారి మీద అధికారులు.
24 ఫరో కుమార్తె దావీదు నగరం నుండి సొలొమోను ఆమెకు కట్టించిన భవనానికి వెళ్లింది. అప్పుడు సొలొమోను మిల్లోను నిర్మించాడు.
25 సంవత్సరానికి మూడుసార్లు సొలొమోను బలిపీఠం మీద దహన బలులు మరియు సమాధాన బలులు అర్పించాడు. ఈ బలిపీఠం సొలొమోను యెహోవా కొరకు నిర్మించింది. రాజైన సొలొమోను యెహోవా ముందు ధూపం వేసేవాడు. కావున దేవాలయ నిర్వహణకు కావలసిన వస్తువులన్నీ అతడు సరఫరా చేసేవాడు.
26 ఎసోన్గెబెరు వద్ద రాజైన సొలొమోను ఓడలను కూడ నిర్మించాడు. ఈ పట్టణం ఏలతు దగ్గర వుంది. ఇది ఎదోము రాజ్యంలో ఎర్ర సముద్రపు తీరాన వుంది. 27 రాజైన హీరాము వద్ద సముద్ర విషయాలలో ఆరితేరిన మనుష్యులు కొందరున్నారు. వీరు తరచు ఓడలలో ప్రయాణం చేసేవారు. సొలొమోను మనుష్యులతో కలిసి సొలొమోను ఓడలలో పని చేయటానికి హీరాము రాజు ఆ మనుష్యులను పంపాడు. 28 సొలొమోను ఓడలు ఓఫీరను స్థలానికి వెళ్లాయి. ఆ ఓడలు ఓఫీరు నుండి ఎనిమిది వందల నలభై మణుగుల[d] బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చాయి.
సొలొమోను నిర్మించిన నగరాలు
8 ఆలయ నిర్మాణానికి, తన స్వంత ఇంటి నిర్మాణానికి సొలొమోనుకు ఇరవై సంవత్సరాలు పట్టింది. 2 పిమ్మట హీరాము తనకు ఇచ్చిన పట్టణాలను తిరిగి నిర్మించాడు. ఆ పట్టణాలలో కొంత మంది ఇశ్రాయేలీయులను సొలొమోను నివసింపనిచ్చాడు. 3 దీని తరువాత సొలొమోను సోబాలోని హమాతు నగరాన్ని వశపర్చుకున్నాడు. 4 సొలొమోను తద్మోరు అనే పట్టణాన్ని కూడా ఎడారిలో నిర్మించాడు. హమాతులోని పట్టణాలన్నిటినీ వస్తుసామగ్రులను నిలవచేయటానికి నిర్మించాడు. 5 సొలొమోను ఎగువ బేత్ హోరోను, దిగువ బేత్ హోరోను పట్టణాలను కూడ కట్టించాడు. అతడీ పట్టణాలను బలమైన కోటలుగా తయారు చేశాడు. వాటి చుట్టూ గోడలు, వాటి ద్వారాలు, ద్వారాలకు కడ్డీలు ఏర్పాటు చేశాడు. 6 బయలతు పట్టణాన్ని వస్తువులు నిల్వచేసే ఇతర పట్టణాలను సొలొమోను మళ్లీ కట్టించాడు. రథశాలలున్న పట్టణాలను, గుర్రాలను నడిపే రౌతుల నగరాలన్నిటినీ సొలొమోను కట్టించాడు. యెరూషలేములోను, లెబానోనులోను, తాను రాజుగా వున్న ప్రాంతాలన్నిటిలోను సొలొమోను తనకు కావలసిన వాటినన్నిటినీ కట్టించాడు.
7-8 ఇశ్రాయేలీయులు నివసిస్తున్న దేశంలో చాలా మంది పరదేశీయులున్నారు. వారిలో హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు వున్నారు. ఆ పరదేశీయులందరినీ సొలొమోను బానిసలుగా పనిచేయించాడు. వారు ఇశ్రాయేలీయులు కారు. వారంతా దేశాన్ని వదలిపోగా మిగిలిన వారంతా పరదేశీయుల సంతతివారు. పైగా వారు ఇశ్రాయేలీయులచే చంపబడకుండా మిగిలిపోయినవారు. ఈవెట్టి చాకిరి ఈనాటికీ కొనసాగుతూనే వుంది. 9 ఇశ్రాయేలీయులైన వారెవరినీ బానిసలుగా చేయమని సొలొమోను వత్తిడి చేయలేదు. ఇశ్రాయేలు ప్రజలు సొలొమోను యొక్క పోరాట యోధులు వారు అతని సైనికాధికారులలో ముఖ్యులుగాను, రథాలకు అధిపతులుగాను, రథసారధులకు నాయకులుగాను నియమింప బడ్డారు. 10 కొంతమంది ఇశ్రాయేలీయులు సొలొమోను ముఖ్యాధిపతులకు పైఅధికారులుగా వున్నారు. ప్రజల కార్యకలపాలు తనిఖీ చేయటానికి ఇలాంటివారు రెండు వందల ఏబై మంది ఉన్నారు.
11 ఫరోరాజు కుమార్తెను దావీదు నగరం నుండి ఆమె కొరకు కట్టించిన భవంతికి సొలొమోను తీసుకొని వచ్చాడు. “నా భార్య రాజైన దావీదు ఇంటిలో నివసించ కూడదు. ఎందువల్లనంటే దేవుని ఒడంబడిక పెట్టె వెళ్లిన ప్రతిచోటూ పవిత్రమైనది” అని సొలొమోను అన్నాడు.
12 యెహోవా బలిపీఠం మీద సొలొమోను దహన బలులు అర్పించాడు. 13 మోషే ఆజ్ఞాపించిన విధంగా సొలొమోను ప్రతిరోజూ బలులు అర్పించాడు. బలులు ప్రతి సబ్బాతు దినాన, ప్రతి అమావాస్య రోజున, మరియు సంవత్సరంలో వచ్చే మూడు పండుగ సెలవు రోజులలోను అర్పించేవారు. ఆ మూడు పండుగలకు పులియని రొట్టెల పండుగ, వారాల పండుగ మరియు పర్ణశాలల పండుగ అని పేర్లు. 14 తన తండ్రి దావీదు ఉపదేశాలన్నిటినీ సొలొమోను పాటించాడు. సొలొమోను వివిధ కార్యాలకు అర్హతగల యాజక వర్గాలను నియమించాడు. లేవీయులను కూడ వారికి తగిన పనులకు సొలొమోను నియమించాడు. భక్తిగీతాల కార్యక్రమ నిర్వహణ, ఆలయంలో దేవుని సేవలో నిత్యం కావలసిన వస్తువులు చేయుటలో యాజకులకు తోడ్పడటం లేవీయుల పని. ప్రతి ద్వారంవద్ద సేవ చేయటానికి తగిన విధంగా జట్లను సొలొమోను ఎంపిక చేశాడు. ఈ రకంగా చేయమని యెహోవా సేవకుడైన దావీదు ఆజ్ఞాపించాడు. 15 యాజకులకు, లేవీయులకు సొలొమోను ఇచ్చిన ఆదేశాలను ఇశ్రాయేలు ప్రజలు మార్చటంగాని, అనాదరించటంగాని చేయలేదు. కనీసం విలువైన వస్తువుల భద్రత విషయాలలో కూడ వారు ఏ ఒక్క ఆదేశాన్నీ మార్చలేదు.
16 సొలొమోను చేయవలసిన పనంతా పూర్తి అయ్యింది. ఆలయ నిర్మాణం మొదలైనప్పటి నుండి అది పూర్తి అయ్యేవరకు పనియావత్తూ ఒక క్రమ పద్ధతిలో సాగింది. ఆ విధంగా ఆలయం నిర్మింపబడింది.
17 పిమ్మట సొలొమోను ఎసోన్గెబరు, ఏలతు పట్టణాలకు వెళ్లాడు. ఆ పట్టణాలు ఎదోము దేశంలో ఎర్ర సముద్ర తీరంలో వున్నాయి. 18 హీరాము ఓడలను సొలొమోను వద్దకు పంపాడు. హీరాము స్వంత మనుష్యులు ఓడలను నడిపారు. సముద్రయానంలో హీరాము మనుష్యులు ఆరితేరినవారు. హీరాము మనుషష్యులు సొలొమోను సేవకులతో కలిసి ఓఫీరుకు వెళ్లి పదిహేడు టన్నుల[a] బంగారాన్ని రాజైన సొలొమోనుకు తీసుకొని వచ్చారు.
© 1997 Bible League International