Book of Common Prayer
137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
4 కాని విదేశంలో మనం యెహోవాకు
కీర్తనలు పాడలేము!
5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
వాగ్దానం చేస్తున్నాను.
7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
9 నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
దావీదు కీర్తన.
144 యెహోవా నా దుర్గం.[a] యెహోవాను స్తుతించండి.
యెహోవా నన్ను యుద్ధానికి సిద్ధం చేస్తాడు.
యెహోవా నన్ను పోరాటానికి సిద్ధం చేస్తాడు.
2 యెహోవా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను కాపాడుతున్నాడు.
పర్వతం మీద ఎత్తయిన స్థలంలో యెహోవా నా క్షేమ స్థానం.
యెహోవా నన్ను రక్షిస్తాడు,
యెహోవా నా కేడెం.
నేను ఆయనను నమ్ముతాను.
నేను నా ప్రజలను పాలించుటకు యెహోవా నాకు సహాయం చేస్తాడు.
3 యెహోవా, మనుష్యులు ఎందుకు నీకు ముఖ్యం?
నీవు మనుష్యకుమారులను ఎందుకు గమనిస్తావు?
4 మనిషి జీవితం గాలి బుడగలాంటిది.
వాని జీవితం దాటిపోతున్న నీడలాంటిది.
5 యెహోవా, ఆకాశం తెరచి దిగి రమ్ము.
పర్వతాలను తాకు, వాటినుండి పొగ వస్తుంది.
6 యెహోవా, మెరుపును పంపించి, నా శత్రువులు పారిపోవునట్లు చేయుము.
నీ బాణాలు వేసి, వారు పారిపోవులట్లు చేయుము.
7 యెహోవా, ఆకాశంనుండి నీ చేయి చాపి నన్ను రక్షించుము.
ఈ శత్రు సముద్రంలో నన్ను మునిగి పోనీయకుము.
ఇతరుల నుండి నన్ను రక్షించుము.
8 ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్య విషయాలు చెబుతారు.
9 యెహోవా, నీవు చేసే ఆశ్చర్యకార్యాలను గూర్చి నేను క్రొత్త కీర్తన పాడగలిగేలా నన్ను రక్షించుము.
పది తంతుల సితారాతో నిన్ను నేను స్తుతిస్తాను.
10 రాజులు యుద్ధాల్లో జయించుటకు యెహోవా సహాయం చేస్తాడు.
యెహోవా సేవకుడు దావీదును అతని శత్రువు ఖడ్గాలనుండి ఆయన రక్షించాడు.
11 ఇతరుల చేతినుండి నన్ను రక్షించుము.
ఈ శత్రువులు అబద్ధీకులు.
వారు అసత్యాలు చెబుతారు.
12 మన యువ కుమారులు బలమైన పెద్ద వృక్షాల్లా ఉంటారని నేను ఆశిస్తున్నాను.
మన కుమార్తెలు రాజభవన నిర్మాణానికి చెక్కబడిన మూల స్థంభాలవలె ఉంటారు.
13 మన ధాన్యపు కొట్టాలు అన్ని రకాల పంటలతో
నిండి ఉంటాయని నేను ఆశిస్తున్నాను.
మన పొలాల్లోని గొర్రెలు వేలకు వేలుగా
పిల్లల్ని పెడతాయని నేను ఆశిస్తున్నాను.
14 మన బలమైన పశువులు భారమైన బరువులను లాగగలవని నేను ఆశిస్తున్నాను.
శత్రువులు ఎవరూ మన మీద దాడి చేయటానికి రారని నేను ఆశిస్తున్నాను.
మనం ఎన్నటికీ యుద్ధానికి వెళ్లం అని నేను ఆశిస్తున్నాను.
మన వీధుల్లో ప్రమాదాల కేకలు ఏమీ ఉండవని నేను ఆశిస్తున్నాను.
15 ఆ సంగతులు జరిగినప్పుడు ప్రజలు చాలా సంతోషిస్తారు.
యెహోవా ఎవరికి దేవుడో ఆ మనుష్యులు చాలా సంతోషిస్తారు.
104 నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవా, నా దేవా, నీవు ఎంతో గొప్పవాడవు.
మహిమ, ఘనత నీవు వస్త్రాలుగా ధరించావు.
2 ఒక వ్యక్తి నిలువుపాటి అంగీ ధరించినట్లుగా నీవు వెలుగును ధరిస్తావు.
ఆకాశాలను నీవు తెరగా పరుస్తావు.
3 దేవా, వాటికి పైగా నీవు నీ ఇంటిని నిర్మించావు.
దట్టమైన మేఘాలను నీవు నీ రథంగా ఉపయోగిస్తావు.
గాలి రెక్కల మీద నీవు ఆకాశంలో ప్రయాణం చేస్తావు.
4 దేవా, నీ దూతలను నీవు గాలిలా చేశావు.
నీ సేవకులను అగ్నిలా చేశావు.
5 దేవా, భూమిని దాని పునాదులపై నీవు నిర్మించావు.
కనుక అది ఎప్పటికీ నాశనం చేయబడదు.
6 దుప్పటి కప్పినట్టుగా నీవు భూమిని నీళ్లతో కప్పివేశావు.
నీళ్లు పర్వతాలను కప్పివేశాయి.
7 కాని నీవు ఆజ్ఞ ఇవ్వగానే, నీళ్లు వేగంగా వెళ్లిపోయాయి.
దేవా, నీవు నీళ్లతో చెప్పగానే నీళ్లు వెంటనే వెళ్లిపోయాయి.
8 పర్వతాలనుండి లోయల్లోనికి, ఆ తరువాత
నీవు వాటికోసం చేసిన స్థలాల్లోకి నీళ్లు ప్రవహించాయి.
9 సముద్రానికి నీవు హద్దులు నియమించావు.
నీళ్లు భూమిని కప్పివేసేట్టుగా మరల ఎన్నటికీ ఉప్పొంగవు.
10 దేవా, నీటి ఊటలనుండి నీటి కాలువలలోనికి నీవే నీళ్లను ప్రవహింప చేస్తావు.
పర్వతాల జలధారల ద్వారా నీవు నీటిని క్రిందికి కాలువలా ప్రవహింపజేసావు.
11 నీటి ప్రవాహాలు అడవి జంతువులన్నిటికీ నీళ్లను ఇస్తాయి.
అక్కడ నీళ్లు త్రాగటానికి అడవి గాడిదలు కూడ వస్తాయి.
12 నీటి మడుగుల చెంత నివసించుటకు అడవి పక్షులు వస్తాయి.
సమీపంలో ఉన్న చెట్ల కొమ్మల మీద నుండి అవి పాడుతాయి.
13 దేవుడు పర్వతాల మీదికి వర్షం పంపిస్తాడు.
దేవుడు చేసిన పనులు భూమికి అవసరమైన ప్రతి దాన్నీ ఇస్తాయి.
14 దేవా, పశువులకు ఆహారంగా గడ్డి ఎదిగేలా నీవు చేస్తావు.
మేము పెంచుటకు ప్రయాసపడే మొక్కల్ని నీవు మాకిస్తావు. ఆ మొక్కలే ఈ భూమి మీద నుండి మాకు లభించే ఆహారం.
15 దేవా, మమ్మల్ని సంతోషపెట్టే ద్రాక్షారసం నీవు మాకు ఇస్తావు.
మా చర్మాన్ని నునుపు చేసే[a] తైలాన్ని నీవు మాకిస్తావు.
మమ్మల్ని బలంగలవారిగా చేయుటకు నీవు మాకు భోజనం ఇస్తావు.
16 లెబానోను మహా దేవదారు వృక్షాలను దేవుడు నాటాడు.
ఆ మహా వృక్షాలు ఎదుగుటకు వాటికి సమృద్ధిగా నీళ్లున్నాయి.
17 పక్షులు ఆ వృక్షాలపై గూళ్లు పెడతాయి.
పెద్ద కొంగలు దేవదారు వృక్షాలలో నివాసం చేస్తాయి.
18 పెద్ద కొండలు అడవి మేకలకు నివాసం,
పెద్ద బండలు కుందేళ్లు దాక్కొనే చోట్లు.
19 దేవా, కాల సూచికగా ఉండుటకు నీవు మాకు చంద్రుణ్ణిచ్చావు. దాని మూలంగా పండుగ రోజులను తెలుసుకోగలుగుతాము.
ఎక్కడ అస్తమించాలో సూర్యునికి ఎల్లప్పుడూ తెలుసు.
20 చీకటిని నీవు రాత్రిగా చేశావు.
ఆ సమయాన అడవి జంతువులు బయటికి వచ్చి చుట్టూరా సంచరిస్తాయి.
21 సింహాలు దాడి చేసేటప్పుడు గర్జిస్తాయి.
అవి దేవుడు వాటికిచ్చే ఆహారంకోసం ఆయనను అడుగుతున్నట్టు ఉంటుంది.
22 మరల సూర్యుడు ఉదయించినప్పుడు
ఆ జంతువులు తిరిగి వాటి నివాసాలకు వెళ్లి విశ్రమిస్తాయి.
23 అప్పుడు ప్రజలు వారి పనుల కోసం బయటకు వెళ్తారు.
సాయంత్రం వరకు వారు పని చేస్తారు.
24 యెహోవా, నీవు ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశావు.
భూమి నీ కార్యాలతో నిండిపోయింది.
నీవు చేసే ప్రతి పనిలో నీవు నీ జ్ఞానాన్ని ప్రదర్శిస్తావు.
25 మహా సముద్రాన్ని చూడు. అది ఎంతో పెద్దది.
మహా సముద్రంలో రకరకాల ప్రాణులు నివసిస్తాయి. వాటిలో కొన్ని ప్రాణులు పెద్దవి, కొన్ని చిన్నవి.
మహా సముద్రంలో ఉండే వాటిని లెక్కించుటకు అవి చాలా విస్తారంగా ఉన్నాయి.
26 మహా సముద్రంలో ఓడలు ప్రయాణం చేస్తాయి.
నీవు చేసిన సముద్ర ప్రాణి మకరం[b] ఆ సముద్రంలో ఆడుకుంటుంది.
27 దేవా, ఆ ప్రాణులన్నీ నీ మీద ఆధారపడి ఉన్నాయి.
దేవా, వాటికి సరియైన సమయంలో నీవు ఆహారం ఇస్తావు.
28 దేవా, జీవించే ప్రాణులన్నీ తినే ఆహారం నీవే వాటికి ఇస్తావు.
మంచి భోజనంతో నిండిన నీ గుప్పిళ్లు నీవు విప్పగా అవి కడుపు నిండేంత వరకు భోజనము చేస్తాయి.
29 నీవు వాటి నుండి తిరిగిపోయినప్పుడు
అవి భయపడిపోతాయి.
వాటి ప్రాణం వాటిని విడిచినప్పుడు అవి బలహీనమై చస్తాయి.
మరియు అవి మరల మట్టి అయిపోతాయి.
30 కాని యెహోవా, నీ ఆత్మను పంపినప్పుడు, అవి మరల ఆరోగ్యంగా ఉంటాయి.
భూమి మరల క్రొత్తదిగా అవుతుంది.
31 యెహోవా మహిమ శాశ్వతంగా కొనసాగును గాక.
యెహోవా చేసిన వాటిని చూచి ఆయన ఆనందించునుగాక.
32 యెహోవా భూమివైపు చూసేటప్పుడు
అది వణకుతుంది.
ఆయన పర్వతాలను ముట్టేటప్పుడు
వాటినుండి పొగ లేవటానికి ప్రారంభిస్తుంది.
33 నా జీవితకాలం అంతా నేను యెహోవాకు పాడుతాను.
నేను బ్రతికి ఉండగా యెహోవాకు స్తుతులు పాడుతాను.
34 నేను చెప్పిన విషయాలు ఆయనను సంతోషపెడతాయని నేను ఆశిస్తున్నాను.
యెహోవా విషయమై నేను సంతోషిస్తున్నాను.
35 భూమి మీద నుండి పాపం కనబడకుండా పోవును గాక.
దుర్మార్గులు శాశ్వతంగా తొలగిపోవుదురు గాక.
నా ప్రాణమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను స్తుతించు!
12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”
బిలాము చివరి సందేశం
15 అప్పుడు బిలాము ఈ విషయాలు చెప్పాడు:
“బెయెరు కుమారుడైన బిలాము మాటలు ఇవి.
విషయాలను తేటగా చూడగలవాని మాటలు ఇవి.
16 మాటలను దేవుని దగ్గరనుండి వినగల వాని మాటలు ఇవి.
మహోన్నతుడైన దేవుడు నాకు నేర్పినవాటిని నేను నేర్చుకున్నాను.
నేను చుడాలని సర్వశక్తుడైన దేవుడు కోరినవాటిని నేను చూసాను.
నేను ఆయనకు సాగిల పడుతున్నాను. దేవునికి కావలసినదానిని నేను తేటగా చూడగలను.
17 “యెహోవా రావటం నేను చూస్తున్నాను, కానీ ఇప్పుడే కాదు.
ఆయన రాక నేను చూస్తున్నాను, కానీ అది త్వరలోనే జరగదు.
యాకోబు వంశంనుండి ఒక నక్షత్రం వస్తుంది.
ఇశ్రాయేలు నుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
ఆ పాలకుడు మోయాబు ప్రజల తలలు చితకగొడ్తాడు.
షేతు కుమారులందరి తలలు ఆ పాలకుడు చితకగొడ్తాడు.
18 ఇశ్రాయేలీయులు బలము గలవారవుతారు.
అతనికి ఏదోము దేశము, అతని శత్రువైన శేయీరు[a] దొరుకుతాయి.
19 “యాకోబు వంశంనుండి ఒక కొత్త పాలకుడు వస్తాడు.
పట్టణంలో ఇంకా బ్రతికి ఉన్న వాళ్లను ఆ పాలకుడు నాశనం చేస్తాడు.”
20 తర్వాత బిలాము అమాలేకు ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:
“దేశాలన్నింటిలో అమాలేకు అతి బలంగలది.
కానీ అమాలేకు కూడ నాశనం చేయబడుతుంది”!
21 తర్వాత బిలాము కెనాతీ ప్రజలను చూచి ఈ మాటలు చెప్పాడు:
“మీ దేశం క్షేమంగా ఉందని మీ నమ్మకం.
ఎత్తయిన కొండమీద పక్షి గూడులా అది కాపాడ బడుతోందని మీ నమ్మకం.
22 అయితే మీరు కెనాతీ ప్రజలు నాశనం చేయబడతారు.
అష్షూరు మిమ్మల్ని బందీలుగా చేస్తుంది.”
23 అప్పుడు బిలాము ఈ మాటలు చెప్పాడు:
“దేవుడు ఇలా చేసినప్పుడు ఏ వ్యక్తి బ్రతకలేడు.
24 కిత్తీము తీరాలకు ఓడలు వస్తాయి.
ఆ ఓడలు అష్షూరు, ఎబెరులను ఓడిస్తాయి.
అయితే తర్వాత ఆ ఓడలు కూడ నాశనం చేయ బడతాయి.”
25 అప్పుడు బిలాము లేచి, తన స్వంత ఊరికి తిరిగి వెళ్లి పోయాడు.
రానున్న తేజస్సు
18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మార్కు 12:18-27; లూకా 20:27-40)
23 అదే రోజు పునరుత్ధానంలేదని వాదించే సద్దూకయ్యులు యేసు దగ్గరకు వచ్చి ఇలా అన్నారు: 24 “బోధకుడా! ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే, అతని సోదరుడు ఆ వితంతువును వివాహమాడి చనిపోయిన సోదరునికి సంతానం కలిగించాలని మోషే అన్నాడు. 25 మాలో ఏడుగురు సోదరులున్న ఒక కుటుంబం ఉండింది. మొదటివాడు వివాహం చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. కనుక ఆ వితంతువును చనిపోయిన వాని సోదరుడు వివాహం చేసుకొన్నాడు. 26 రెండవవాడు, మూడవవాడు, ఏడవవాని దాకా అదేవిధంగా ఆమెను పెళ్ళి చేసుకొని మరణించారు. 27 చివరకు ఆ స్త్రీ కూడా మరణించింది. 28 ఆ ఏడుగురు ఆ స్త్రీని వివాహం చేసుకొన్నారు కదా, మరి పునరుత్ధానం తర్వాత ఆమె ఆ ఏడుగురిలో ఎవరి భార్యగా ఉంటుంది?”
29 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీకు లేఖనాలు తెలియవు. దేవుని శక్తి గురించి మీకు తెలియదు. అందువల్ల మీరు పొరబడుతున్నారు. 30 పునరుత్థానమందు పెళ్ళి చేసుకోవటం కాని, చెయ్యటం కాని ఉండదు. వాళ్ళు పరలోకంలోని దేవదూతల్లా ఉంటారు. 31 ఇక చనిపోయిన వారు బ్రతకడాన్ని గురించి దేవుడు మీకేం చెప్పాడో మీరు చదువలేదా? 32 ‘నేను అబ్రాహాముకు దేవుణ్ణి, ఇస్సాక్కు దేవుణ్ణి, యాకోబుకు దేవుణ్ణి’(A) అని అన్నాడు. ఆయన చనిపోయిన వాళ్ళ దేవుడు కాదు. జీవిస్తున్న వాళ్ళ దేవుడు.”
33 ప్రజలు ఈ బోధన విని ఆశ్చర్యపొయ్యారు.
అతి ముఖ్యమైన ఆజ్ఞ ఏది?
(మార్కు 12:28-34; లూకా 10:25-28)
34 యేసు సద్దూకయ్యుల నోరు మూయించాడని విని పరిసయ్యులు అక్కడ సమావేశమయ్యారు. 35-36 వాళ్ళలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడొకడు యేసును పరీక్షించాలని, “బోధకుడా! ధర్మశాస్త్రాల్లో ఉన్న ఆజ్ఞలన్నిటిలో ఏ ఆజ్ఞ గొప్పది?” అని ప్రశ్నించాడు.
37 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “మీ ప్రభువైన దేవుణ్ణి సంపూర్ణమైన హృదయంతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితో ప్రేమించండి.(B) 38 ఇది అన్ని ఆజ్ఞలకన్నా మొదటిది, గొప్పది. 39 రెండవ ఆజ్ఞ కూడా అట్టిదే. ‘నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా నీ పొరుగువాణ్ణి ప్రేమించు’(C) 40 ధర్మశాస్త్రాలలో ఉన్న వాటన్నిటికి, ప్రవక్తలు వ్రాసిన వాటన్నిటికి ఈ రెండు ఆజ్ఞలే ఆధారం.”
© 1997 Bible League International