Chronological
నెబుకద్నెజరు రాజు యూదాకు వచ్చుట
24 యెహోయాకీము కాలంలో బబులోను రాజయిన నెబుకద్నెజరు యూదా దేశానికి వచ్చాడు. యెహోయాకీము నెబుకద్నెజరుని మూడేండ్లు సేవించాడు. తర్వాత యెహోయాకీము నెబుకద్నెజరుకు ప్రతికూలుడై అతని పరిపాలన నుండి విముక్తుడయ్యాడు. 2 యెహోవా బబులోనువారి బృందాలు, సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులు మొదలైన వారిని యెహోయాకీముకి విరుద్ధంగా యుద్ధము చేయునట్లు చేశాడు. యెహోవా ఆ బృందాలను యూదాని ధ్వంసం చేయమని పంపించాడు. ఇది యెహోవా చెప్పినట్లుగానే జరిగింది. యెహోవా తన సేవకులైన ప్రవక్తలను అవి చెప్పడానికి ఉపయోగించాడు.
3 యూదాలో అవి జరుగేటట్లు యెహోవా ఆజ్ఞాపించాడు. ఈ విధంగా యెహోవా వారిని తన దృష్టినుండి మరల్చాడు. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణాన యెహోవా ఇలా చేశాడు. 4 మనష్షే పలువురు అమాయకులను చంపినందువల్ల, యెహోవా ఇదంతా చేశాడు. మనష్షే యెరూషలేమును వారి రక్తముతో నింపివేశాడు. మరియు యెహోవా ఆ పాపాలను మన్నించడు.
5 యెహోయాకీము చేసిన ఇతర కార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 6 యెహోయాకీము మరణించగా, అతని పూర్వికులతో పాటుగా అతనిని సమాధి చేశారు. యెహోయాకీము కుమారుడు యెహోయాకీను, అతని తర్వాత కొత్తగా రాజయ్యాడు.
7 బబులోను రాజు ఈజిప్టు వాగుకి యూఫ్రటీసు నదికి మధ్యగల ప్రదేశమంతటిని స్వాధీనము చేసుకున్నాడు. ఈ ప్రదేశము అంతకు ముందు ఈజిప్టువారు తమ అదుపులో ఉంచుకున్నారు. అందువల్ల ఈజిప్టు రాజు ఈజిప్టుని ఏ మాత్రమూ విడువదలచుకోలేదు.
నెబుకద్నెజరు యెరూషలేమును వశం చేసుకొనుట
8 యెహోయాకీను, పరిపాలన ప్రారంభించిన నాడు, అతను 18 యేండ్లవాడు. అతను యెరూషలేములో 3 మాసాలు పరపాలించాడు. అతని తల్లి పేరు నెహుష్తా ఆమె యెరూషలేముకు చెందిన ఎల్నాతాను కుమార్తె. 9 యెహోవా తప్పని చెప్పిన పనులు యెహోయాకీను చేశాడు. అతను తన తండ్రి చేసిన అవే పనులు చేసాడు.
10 ఆ సమయమున బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క అధికారులు యెరూషలేముకు వచ్చి ముట్టిడించారు. 11 తర్వాత బబులోను రాజైన నెబుకద్నెజరు నగరానికి వచ్చాడు. అతని సైన్యము అప్పటికే నగరాన్ని చుట్టుముట్టుతూ ఉంది. 12 యూదా రాజు యెహోయాకీను బబులోను రాజుని కలుసుకోడానికి వెలుపలికి వచ్చాడు. యెహోయాకీను తల్లి, అతని అధికారులు, నాయకులు, ఉద్యోగులు కూడా అతనితో పాటు వెళ్లారు. అప్పుడు బబులోను రాజు యెహోయాకీనుని బంధించాడు. ఇది నెబుకద్నెజరు పరిపాలనాకాలపు 8వ సంవత్సరమున జరిగింది.
13 నెబుకద్నెజరు యెరూషలేమునుండి, యెహోవా యొక్క ఆలయములోని నిధులన్నిటినీ, రాజభవనములోని నిధులన్నిటినీ తీసుకొనెను. నెబుకద్నెజరు ఇశ్రాయేలు రాజయిన సొలొమోను యెహోవా యొక్క ఆలయములో ఉంచిన అన్ని బంగారు పాత్రలను ముక్కలు చేశాడు. యెహోవా చెప్పినట్లుగానే ఇది సంభవించింది.
14 నెబుకద్నెజరు యెరూషలేములోని ప్రజలందరిని బంధించాడు. అతను నాయకులందరినీ, ధనవంతులను బంధించాడు. అతను 10,000 మంది ప్రజలను బందీలుగా తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పనిలో చెయ్యి తిరిగినవారిని, నిపుణులను తీసుకు వెళ్లాడు. సామాన్యులలోని నిరుపేదలను తప్ప మరెవ్వరిని విడిచి పెట్టలేదు. 15 నెబుకద్నెజరు యెహోయాకీనుని బందీగా చేసి బబులోనుకు తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు పైగా రాజమాతను, అతని భార్యలను, అధికారులను, ప్రముఖ వ్యక్తులను తీసుకువెళ్లాడు. నెబుకద్నెజరు వారిని యెరూషలేము నుండి బబులోనుకి బందీలుగా చేసి తీసుకువెళ్లాడు. 16 7,000 మంది సైనికులుండిరి. నెబుకద్నెజరు సైనికులందరినీ, 1,000 మంది పనిలో చెయ్యి తిరిగినవారినీ, నిపుణులను తీసుకు వెళ్లాడు. ఈ వ్యక్తులందరు యుద్ధానికి సిద్ధంగా వుండే సుశిక్షుతులైన సైనికులు. బబులోను రాజు వారినందరినీ బబులోనుకు బందీలుగా తీసుకు వెళ్లాడు.
సిద్కియా రాజు
17 బబులోను రాజు మత్తన్యాను కొత్త రాజుగా చేశాడు. మత్తన్యా యెహోయాకీము యొక్క పిన తండ్రి. అతను అతని పేరుని సిద్కియా అని మార్చి వేశాడు. 18 సిద్కియా పరిపాలన ప్రారంభించే నాటికి ఇరవై ఒక్క సంవత్సరములవాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నాకి చెందిన యిర్మీయా కుమార్తె. 19 యెహోవా తప్పు అని చెప్పిన పనులు సిద్కియా చేశాడు. సిద్కియా యెహోయాకీను చేసిన పనులే చేశాడు. 20 యెహోవా యెరూషలేము యూదాల పట్ల ఆగ్రహం చెందాడు. యెహోవా వారిని దూరపరచెను.
నెబుకద్నెజరు సిద్కియా పరిపాలనను అంతము చేయుట
25 సిద్కియా తిరుగుబాటు చేసి, బబులోను రాజుకు విధేయుడై వుండటానికి సమ్మతించలేదు.
అందువల్ల, బబులోను రాజైన నెబుకద్నెజరు, అతని మొత్తము సైన్యము యెరూషలేముకు ప్రతికూలముగా యుద్ధము చేయడానికి వచ్చింది. సిద్కియా రాజు యొక్క తొమ్మిదో సంవత్సరాన, 10వ నెలలో 10వ రోజున ఇది సంభవించింది. నెబుకద్నెజరు తన సైన్యాన్ని యెరూషలేము చుట్టు ఉంచి, ప్రజలను నగరం నుండి వెలుపలికిగాని లోపలికిగాని రానీయకుండ చేశాడు. ఆ తర్వాత నగరం చుట్టు అతను ఒక మురికి గోడ నిర్మించాడు. 2 నెబుకద్నెజరు సైన్యము సిద్కియా యూదా రాజుగా వున్న 11వ సంవత్సరము దాకా యెరూషలేము చుట్టూ ఉండెను. 3 నగరంలో కరువు ఘోరంగా తయారయింది. నాలుగవ నెలలో 9వ రోజున నగరంలోని సామాన్యులకు ఆహారము లేకపోయింది.
4 నెబుకద్నెజరు సైన్యము చివరికి నగర ప్రాకారమును బద్దలు చేసింది. ఆ రాత్రి సిద్కియా రాజు అతని సైనికులు పారిపోయారు. వారు రాజుగారి ఉద్యనవనము ద్వారా రహస్య ద్వారాన్ని ఉపయోగించి జంట గోడలద్వారా వెళ్లారు. విరోధి సైనికులు నగరం చుట్టూ వుండిరి. కాని సిద్కియా అతని మనుష్యులు మార్గము మీదికి తప్పించుకుని ఎడారికి పారిపోయారు. 5 బబులోను సైన్యము సిద్కియా రాజుని వెన్నంటిపోయి అతనిని యెరికో అనే చోట పట్టుకున్నారు. సిద్కియా సైనికులందరు అతనిని విడిచిపెట్టి పారి పోయారు.
6 బబులోనువారు సిద్కియా రాజుని బబులోను రాజు వద్దకు రిబ్లా అనే చోటికి తీసుకు వెళ్లారు. బబులోనువారు సిద్కియాని శిక్షింప నిశ్చయించారు. 7 వారు సిద్కియా కుమారులను అతని ఎదుటనే చంపివేశారు. ఆ తర్వాత సిద్కియా యొక్క కండ్లు పెరికివేశారు. అతనికి గొలుసులు బిగించి అతనిని బబులోనుకు తీసుకువెళ్లారు.
యెరూషలేమును ధ్వంసం చేయుట
8 నెబుకద్నెజరు బబులోను రాజుగా వున్న 19 వ సంవత్సరమున, 5 వ నెలలో 7వ తేదీన యెరూషలేముకు వచ్చాడు. నెబూజరదాను నెబుకద్నెజరు అత్యుత్తమ సైనికులకు అధిపతి. 9 నెబూజరదాను యెహోవాయొక్క ఆలయమును దగ్ధం చేశాడు. రాజు భవనాన్ని, యెరూషలేములోని అన్ని ఇళ్లను కూడా దగ్ధం చేశాడు. అతను పెద్ద ఇళ్లను కూడా దగ్ధం చేశాడు.
10 అప్పుడు నెబూజరదానుతో పాటువున్న బబులోను సైన్యము యెరూషలేము పరిసరాలలోవున్న ప్రాకారములను కూలదోసింది. 11 నెబూజరదాను నగరంలో ఇంకా మిగిలివున్న ప్రజలను బంధించాడు. నెబూజరదానుకు లోబడిన వారిని సయితము బందీలుగా తీసుకువెళ్లాడు. 12 సామాన్యులలో అతి పేదవారిని మాత్రం నెబూజరదాను విడిచిపెట్టాడు. ద్రాక్షాలు ఇతర పంటలను చూసే నిమిత్తం వారిని అక్కడే నివసింప జేశాడు.
13 బబులోను సైనికులు యెహోవా యొక్క ఆలయములోని అన్ని ఇత్తడి వస్తువులను ముక్కలు చేశారు. వారు కంచు స్తంభాలను, కంచు మట్లను, పెద్ద ఇత్తడి చెరువుని ధ్వంసం చేశారు. తర్వాత ఆ కంచునంతా బబులోనుకు తీసుకువెళ్లారు. 14 బబులోనువారు యెహోవా యొక్క ఆలయంలో ఉపయోగింపబడే కుండలు, నిప్పు తీసే గరిటలు, దీపాలు చక్కబరిచే ఉపకరణాలు, చెంచాలు, కంచు పాత్రలు మొదలైనవాటిని తీసుకువెళ్లారు. 15 నెబూజరదాను బానలు, పాత్రలు కూడా తీసుకు వెళ్లాడు. బంగారము కోసము బంగారముతో చేయబడిన వస్తువులను వెండి కోసము వెండితో చేయబడిన వస్తువులను కూడా తీసుకువెళ్లాడు. 16-17 2 కంచు స్తంభాలు (ప్రతి స్తంభం 27 అడుగుల యెత్తు కలవి. స్తంభాల మీది పై పీటలు నాలుగున్నర అడుగుల ఎత్తు కలవి. దానిమ్మ పండు మరియు అల్లిక విన్యాసాలు కంచుతో చేయబడినవి. రెండు స్తంభాల విన్యాసం ఒకే మోస్తరుగా వుంటుంది) విశాలమైన కంచు చెరువు. యెహోవాయొక్క ఆలయానికి సొలొమోను సిద్ధపరిచిన రెండు స్తంభములు. ఆ వస్తువుల నుండి గ్రహించిన కంచు తూకం వేయడానికి అలవి కానిది.
యూదా ప్రజలను బందీలుగా తీసుకుని వెళ్లుట
18 ఆలయము నుండి నెబూజరదాను ప్రధాన యాజకుడైన శెరాయాను పట్టుకున్నాడు. జెఫన్యా అనే రెండవ యాజకుడు, ప్రవేశమును కాచే ఆ ముగ్గురు మనుష్యులను తీసుకెళ్లాడు.
19 నగరంనుండి నెబూజరదాను సైన్యానికి అధికారిగా ఉన్న ఉద్యోగిని, నగరంలో మిగిలివున్న ఐదుగురు రాజుగారి సలహాదారులను తీసుకొన్నాడు. సైన్యాధిపతి యొక్క ఒక కార్యదర్శి. అతను సామాన్య ప్రజలను లెక్కించేవాడు. మరియు అతను వారిలోనుండి కొందరు సైనికులను ఎంచుకునేవాడు. నగరంలో అప్పుడున్న 60 మంది ప్రజలను నెబుకద్నెజరు తీసుకొన్నాడు.
20-21 తరువాత నెబూజరదాను హమాతు ప్రదేశంలోని రిబ్లా దగ్గర ఉన్న బబులోను రాజువద్దకు ప్రజలందరినీ తీసుకువెళ్లాడు. బబులోను రాజు రిబ్లా అనే చోట వారిని చంపివేశాడు. మరియు యూదా ప్రజలను వారి దేశమునుండి బందీలుగా తీసుకొని పోయెను.
యూదా రాజ్య పాలకుడు అయిన గెదల్యా
22 బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా దేశంలో కొందరు ప్రజలను విడచి పెట్టాడు. షాఫాను కుమారుడైన అహీకాం, అతని కుమారుడైన గెదల్యా అనే అతడు ఒకడుండెను. నెబుకద్నెజరు యూదా ప్రజల మీద గెదల్యాను అధిపతిగా నియమించాడు.
23 నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు కారేహకు కుమారుడైన నెటోఫాతుకు చెందిన తన్హుమెతు కుమారుడైన శెరాయా, మాయాకాతు కుమారుడైన యజన్నా మొదలయిన వారు సైన్యాధిపతులు. ఈ సైన్యాధిపతులు, వారి మనుష్యులు, బబులోను రాజు గెదల్యాను అధిపతిగా చేసినట్లు విన్నారు. అందువల్ల గెదల్యాను కలుసుకోవడానికి వారు మిస్పాకి వెళ్లారు. 24 ఈ అధికారులకు, వారి మనుష్యులకు గెదల్యా వాగ్దానాలు చేశాడు. గెదల్యా వారితో ఇట్లన్నాడు: “బబులోను అధికారులను చూసి మీరు భయపడకండి. ఇక్కడే ఉండి బబులోను రాజుని కొలవండి. ఆ తరువాత, అంతయు మీకు సక్రమముగా ఉంటుంది.”
25 ఎలీషా కుమారుడైన నెతన్యా కుమారుడు ఇష్మాయేలు రాజు కుటుంబము నుండి వచ్చినవాడు. ఏడవ నెలలో ఇష్మాయేలు మరియు పదిమంది అతని మనుష్యులు గెదల్యా మీద దాడిచేసి, మిస్పా వద్ద గెదల్యాతో పాటు ఉన్న కల్దీయులను, యూదులను చంపివేశాడు. 26 అప్పుడు సైన్యాధికారులు అందరు మనుష్యులు ఈజిప్టుకు పారిపోయారు. అతి సామాన్యుడు మొదలుకొని అతి ప్రాముఖ్యము కలవాడి వరకు అందరూ పారి పోయారు. ఎందుకనగా, కల్దీయులనగా వారు భయపడ్డారు.
27 ఆ తర్వాత ఎవీల్మెరోదకు బబులోనుకు రాజయ్యాడు. అతను యూదా రాజైన యెహోయాకీనును చెరసాలనుండి విముక్తి చేసెను. ఇది యెహోయాకీను బంధింపబడిన 37వ సంవత్సరమున సంభవించింది. ఇది ఎవీల్మెరోదకు పరిపాలన ప్రారంభం చేసిన 12వ నెలనుండి 27వ తేదీ వరకు జరిగింది. 28 ఎవీల్మెరోదకు యెహోయాకీను పట్ల దయకలిగి ఉండెను. అతను యెహోయాకీనుకి బబులోనులో తనతో బాటు ఆసీనులయ్యే ఇతర రాజుల కంటె ఎక్కువ ప్రాముఖ్యముగల చోటు ఇచ్చాడు. 29 ఎవీల్మెరోదకు యెహోయాకీను చెరసాల దుస్తులు ధరించడం ఆపివేశాడు. మరియు యెహోయాకీను ఒకే మేజాబల్ల మీద కూర్చుని ఎవీల్మెరోదకుతో కలిసి భుజించాడు. ఇట్లు అతని శేష జీవితము వరకు జరిగింది. 30 అందువల్ల ఎవీల్మెరోదకు రాజు యెహోయాకీనుకు అతని శేష జీవితము వరకూ ప్రతిరోజూ భోజనము పెట్టాడు.
యూదా రాజుగా యెహోయాహాజు
36 యెరూషలేములో కొత్త రాజుగా యూదా ప్రజలు యెహోయాహాజును ఎన్నుకొన్నారు. యెహోయాహాజు యోషీయా కుమారుడు. 2 యుదాకు రాజయ్యేనాటికి యెహోయాహాజు ఇరువది మూడేండ్లవాడు. అతడు యెరూషలేములో మూడు నెలలపాటు రాజుగా వున్నాడు. 3 పిమ్మట ఈజిప్టు రాజైన నెకో యెహోయాహాజును బందీగా పట్టుకున్నాడు. నెకో యూదా ప్రజలను రెండువందల మణుగుల (మూడు ముప్పావు టన్నులు) వెండిని, రెండు మణుగుల (డెబ్బదియైదు పౌనులు) బంగారాన్ని అపరాధ రుసుముగా చెల్లించేలా చేశాడు. 4 యెహోయాహాజు సోదరుని యూదా, యెరూషలేములపై నూతన రాజుగా నెకో నియమించాడు. యెహోయాహాజు సోదరుని పేరు ఎల్యాకీము. పిమ్మట ఎల్యాకీముకు నెకో ఒక క్రొత్త పేరు పెట్టాడు. అతనికి యెహోయాకీము అను మారుపేరు పెట్టాడు. కాని యెహోయాహాజును నెకో ఈజిప్టుకు తీసికొని వెళ్లాడు.
యూదా రాజుగా యెహోయాకీము
5 యూదాకు కొత్త రాజయ్యేనాటికి యెహోయాకీము ఇరువదియైదేండ్లవాడు. యెహోవా కోరిన విధంగా యెహోయాకీము ధర్మంగా ప్రవర్తించలేదు. దేవుడైన యెహోవా పట్ల అతడు పాపం చేశాడు.
6 బబులోను (బాబిలోనియా) రాజైన నెబుకద్నెజరు యూదాపై దండెత్తి వచ్చాడు. అతడు యెహోయాకీమును బందీగాచేసి అతనికి కంచు గొలుసులు తగిలించాడు. తరువాత యెహోయాకీమును నెబుకద్నెజరు బబులోనుకు తీసికొని వెళ్లాడు. 7 యెహోవా ఆలయం నుండి నెబుకద్నెజరు కొన్ని వస్తువులను దోచుకుపోయాడు. అతడా వస్తువులను బబులోనుకు పట్టుకుపోయి వాటిని తన స్వంత ఇల్లయిన రాజగృహంలో వుంచాడు. 8 యెహోయాకీము చేసిన ఇతర విషయాలు, అతడు చేసిన భయంకరమైన పాపాలు, మరియు అతనిని దోషిగా నిరూపించే అతని ప్రతి కార్యం గురించి ఇశ్రాయేలు, యూదా రాజుల గ్రంథంలో వ్రాయబడ్డాయి. యెహోయాకీము స్థానంలో అతని కుమారుడు యెహోయాకీను కొత్తగా రాజయ్యాడు.
యూదా రాజుగా యెహోయాకీను
9 యూదాకు రాజయ్యేనాటికి యెహోయాకీను పద్దెనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో మూడు నెలల పది రోజులు రాజుగా వున్నాడు. యెహోవా కోరిన విధంగా అతడు తన కార్యాలను నిర్వర్తించలేదు. యెహోవా పట్ల యెహోయాకీను పాపం చేశాడు. 10 వసంత ఋతువులో యెహోయాకీనును పట్టి తెమ్మని రాజైన నెబకద్నెజరు తన మనుష్యులను పంపాడు. వారు యెహోయాకీనును, యెహోవా ఆలయం నుండి కొన్ని ధనరాసులను బబులోనుకు తెచ్చారు. యూదా, యెరూషలేములకు నూతన రాజుగా సిద్కియాను నెబకద్నెజరు నియమించాడు. సిద్కియా అనువాడు యెహోయాకీనుకు బంధువు.
యూదా రాజుగా సిద్కియా
11 యూదాకు రాజుయ్యేనాటికి సిద్కియా ఇరువైఒక సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో పద కొండు సంవత్సరాలు రాజుగా వున్నాడు. 12 యెహోవా కోరినట్లు సిద్కియా ఉత్తమ కార్యాలు చేయలేదు. యెహోవా పట్ల సిద్కియా పాపం చేశాడు. దేవుని ముందు అతడు వినయ విధేయతలు చూపించలేదు. ప్రవక్త యిర్మీయా చెప్పిన విషయాలను పాటించలేదు. యెహోవా సందేశాన్ని యిర్మీయా ప్రవచించాడు.
యెరూషలేము నాశనమగుట
13 రాజైన నెబుకద్నెజరుపై సిద్కియా తిరుగుబాటు చేశాడు. గతంలో నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియాతో బలవంతంగా నెబుకద్నెజరు ప్రమాణం చేయించాడు. నెబుకద్నెజరుకు విశ్వాసంగా వుంటానని సిద్కియా దేవుని మీద ప్రమాణం చేశాడు. కాని సిద్కియా తన జీవన విధానం మార్చుకొని, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా మాటవిని, ఆయనకు విధేయుడైయుండటానికి నిరాకరించి మొండి వైఖరి దాల్చాడు. 14 యాజకుల నాయకులు, యూదా ప్రజల నాయకులంతా కూడా మరీ ఎక్కువ పాపం చేసి, యెహోవాకు విశ్వాస ఘాతకులయ్యారు. వారు అన్యదేశీయుల చెడు మార్గాన్నే అనుసరించారు. ఆ నాయకులంతా యెహోవా ఆలయాన్ని అపవిత్రపర్చి పాడుచేశారు. యెరూషలేములో ఆలయాన్ని యెహోవా పవిత్రపర్చాడు. 15 తమ పూర్వీకుల దేవుడగు యెహోవా తన ప్రజలను హెచ్చిరించటానికి అనేక పర్యాయములు ప్రవక్తలను పంపినాడు. తన ప్రజలపట్ల, తన ఆలయంపట్ల సానుభూతిగలవాడుగుటచే యెహోవా అలా చేస్తూ వచ్చాడు. యెహోవా తన ప్రజలనుగాని, తన ఆలయాన్నిగాని నాశనం చేయదల్చలేదు. 16 కాని దేవుని యొక్క ప్రజలే దేవుడు పంపిన ప్రవక్తలను ఎగతాళి చేశారు. వారు ప్రవక్తలు చెప్పేదానిని వినలేదు. వారు దేవుని వర్తమానములను అసహ్యించుకున్నారు. ఆఖరికి దేవుడు తన కోపాన్ని ఎంత మాత్రమూ ఆపుకోలేకపోయాడు. దేవుడు తన ప్రజలపట్ల కోపపడ్డాడు. ఆ కోపాన్ని ఆపగల శక్తి ఎవరికీ లేదు. 17 అందువల్ల యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు వారి మీదికి బబులోను రాజును రప్పించాడు.[a] బబులోను రాజు యువకులను ఆలయంలో వుండగానే చంపివేశాడు. అతడు యూదా, యెరూషలేము ప్రజలమీద ఏమాత్రం కనికరం చూపలేదు. బబులోను రాజు యువకులను, వృద్ధులను కూడ చంపివేశాడు. అతడు పురుషులను, స్త్రీలను చంపాడు. రోగులను, ఆరోగ్యవంతులను కూడ చంపివేశాడు. యూదా, యెరూషలేము ప్రజలను శిక్షించటానికి దేవుడు నెబుకద్నెజరుకు అనుమతి ఇచ్చినాడు. 18 ఆలయంలోని వస్తువులన్నిటినీ నెబుకద్నెజరు బబులోనుకు పట్టుకుపోయాడు. ఆలయంలోను, రాజువద్ద, రాజు యొక్క అధికారులవద్దగల విలువైన వస్తువులన్నిటినీ అతడు పట్టుకుపోయాడు. 19 నెబుకద్నెజరు, అతని సైన్యం ఆలయాన్ని తగులబెట్టారు. వారు యెరూషలేము గోడను పడగొట్టి రాజుకు, రాజాధికారులకు చెందిన ఇండ్లన్నీ తగులబెట్టారు. ప్రతి విలువైన వస్తువును వారు తీసికొనటం గాని, లేక నాశనం చేయటంగాని చేశారు. 20 చనిపోగా మిగిలిన ప్రజలను నెబుకద్నెజరు బబులోనుకు తీసుకొని వెళ్లి బానిసలుగా పనిచేయించాడు. పర్షియా రాజ్యం (పారసీకము) బబులోను రాజ్యాన్ని ఓడించేవరకు ఆ ప్రజలు బబులోనులో బానిసలుగా వుండి పోయారు. 21 ప్రవక్తయగు యిర్మీయా ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చెప్పిన విషయాలన్నీ ఆ విధంగా సంభవించాయి. యిర్మీయా ద్వారా యెహోవా యిలా చెప్పినాడు: “ఈ ప్రదేశం డెబ్బది యేండ్లపాటు బంజరు[b] భూమిగా మారిపోతుంది. ప్రజలు సబ్బాతు దినాలను[c] పాటించని కారణాన, దానికి పరిహారంగా ఇది జరుగుతుంది.”
22 పర్షియా (పారసీక) రాజు కోరెషు (సైరస్) పాలన మొదటి సంవత్సరంలో[d] ఈ విధంగా జరిగింది. ప్రవక్తయగు యిర్మీయా ద్వారా యెహోవా ప్రకటించిన విషయాలు ఆయన నిజంగా జరిగేలా చేసినాడు. యెహోవా సైరస్ (కోరెషు) హృదయాన్ని స్పందింపజేసి, అతనిచే ఒక ఆజ్ఞ వ్రాయించి దూతల ద్వారా తన రాజ్యమంతా ప్రకటింపజేసినాడు:
23 పర్షియా రాజైన కోరెషు తెలియజేయున దేమనగా:
ఆకాశమందు ప్రభువైన యెహోవా నన్ను ఈ భూమండలానికంతకు రాజుగా చేసినాడు. యెరూషలేములో ఆయనకొక ఆలయం కట్టించే బాధ్యత నాకు అప్పజెప్పినాడు. దేవుని ప్రజలైన మీరంతా ఇప్పుడు యెరూషలేము వెళ్లటానికి స్వేచ్ఛ కలిగియున్నారు. మీ దేవుడైన యెహోవా మీకు తోడై వుండుగాక.
© 1997 Bible League International