Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 2-5

ఆలయ, రాజగృహ నిర్మాణానికి సొలొమోను యత్నం

యెహోవా పేరు ఘనపర్చబడేలా ఆలయ నిర్మాణానికి సొలొమోను సన్నాహం చేశాడు. తన కొరకై ఒక రాజభవనాన్ని కూడ నిర్మించుకోవాలని సొలొమోను తలంచాడు. సొలొమోను డెబ్బైవేల మందిని సరుకు చేరవేయటానికి నియమించాడు. ఎనబైవేల మందిని కొండల్లో రాళ్లు కొట్టడానికి అతడు నియమించాడు. పనివాళ్ల మీద నిఘావుంచడానికి మూడువేల ఆరువందల మందిని నియమించాడు.

తరువాత సొలొమోను హీరాముకు ఒక వర్తమానం పంపాడు. హీరాము తూరు నగరపు రాజు. సొలొమోను హీరాముకు యిలా చెప్పి పంపాడు:

“నీవు నా తండ్రి దావీదుకు సహాయపడినట్లు నాకు కూడ సహాయం చెయ్యి. తను నివసించే భవన నిర్మాణానికి నీవాయనకు సరళ వృక్షాల కలపను పంపావు. నా దేవుడైన యెహోవా గౌరవార్థం నేనొక ఆలయం నిర్మింపదలిచాను. నా ప్రజలు ఆరాధించుకొనటానికి వీలుగా దానిని నా దేవునికి అంకితం చేస్తాను. యెహోవా ముందు ధూపం వేసి, ఆయన సన్నిధిని ప్రతినిత్యం పవిత్రమైన రొట్టెను నైవేద్యంగా వుంచి, బలిపీఠంపై ఉదయం, సాయంత్రం దహనబలులు అర్పిస్తూ, మేము మా దేవుని ఆరాధిస్తాము. సబ్బాతు దినాలలోను, అమావాస్య రోజులందును, మరి ఇతర ప్రత్యేక ఉత్సవ దినాలలోను, తనను ఆరాధించుమని మా దేవుడైన యెహోవా మాకు ఆజ్ఞ యిచ్చాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు శాశ్వతంగా పాటించే ఒక నియమం.

“మా దేవుడు మిగిలిన దైవాలకంటె మహోన్నతుడు గనుక, ఆయనకు నేను నిర్మించే ఆలయం కూడా ఉన్నతంగా ఉంటుంది. నిజానికి మానవ మాత్రుడెవ్వడూ మా దేవునికి ఆలయం నిర్మించలేడు. పరలోక భూలోకాలే మా దేవునికి నిలయాలు కాలేనప్పుడు, నేను ఆయనకు ఆలయం నిర్మాణం చేయలేను. నేను కేవలం ఆయన సన్నిధిని ధూపం వేయటానికి ఒక పీఠం మాత్రమే నిర్మించగలను.

“కావున వెండి బంగారు పనులలోను; కంచు, ఇనుము పనులలోను నేర్పరియైన ఒక పనివానిని ఇప్పుడు నా వద్దకు పంపించు. అతడు ఊదా, నీలిరంగు తెరల పనిలో కూడా నేర్పరియై ఉండాలి. నావద్ద వున్న యూదా, యెరూషలేము శిల్పులతో కలిసి అతడు చెక్కడపు పనులు చేయగలిగి ఉండాలి. నా తండ్రియగు దావీదు ఇక్కడ ఈ మనుష్యులను ఎంపిక చేశాడు. సరళ వృక్షాల, దేవదారు వృక్షాల, చందనపు చెట్ల కలపను లెబానోను అడవుల నుండి పంపించు. లెబానోనులో చెట్లను కొట్టడంలో నీ మనుష్యులు అనుభవం కలవారని నాకు తెలుసు. నా సేవకులు నీ మనుష్యులకు సహాయపడతారు. సాధ్యమైనంత ఎక్కువ కలపను నాకు పంపించు. నేను నిర్మించబోయే ఆలయం చాల గొప్పదై, అద్భుతమైనదిగా వుంటుంది. 10 కలప నరికే పనివారికి ఆహారం నిమిత్తం నేను నాలుగు వందల గరిసెల[a] గోధుములు, నాలుగు వందల గరిసెల యవలు, ఒక లక్షా పదిహేను వేల గేలనుల (మూడు వేల ఎనిమిది వందల పడులు లేక ఇరువది వేల బాదులు) ద్రాక్షారసమును, అదే పరిమాణములో నూనెను కేటాయిస్తున్నాను.”

11 సొలొమోనుకు సమాధానమిస్తూ, హీరాము ఒక వర్తమానాన్ని పంపాడు. ఆ వర్తమానం ఇలా వుంది:

“సొలొమోనూ, యెహోవా తన ప్రజలను ప్రేమిస్తున్నాడు. అందువల్లనే ఆయన నిన్ను వారికి రాజుగా నియమించాడు.” 12 హీరాము తన సందేశంలో ఇంకా యిలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవాకు స్తోత్రం చేయండి! ఆయన ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన రాజైన దావీదుకు ఒక తెలివైన కుమారుని ప్రసాదించాడు. సొలొమోనూ, నీకు తెలివి, అవగాహన వున్నాయి. నీవు యెహోవా కోసం ఒక ఆలయాన్ని నిర్మిస్తున్నావు. నీకొరకు నీవొక రాజభవనాన్ని కూడా నిర్మింప తలపెట్టావు. 13 నేను నీ వద్దకు ఒక నైపుణ్యంగల పనివానిని పంపుతాను. అతడు రకరకాల కళలలో అభిరుచి, అనుభవం వున్నవాడు. అతని పేరు హూరాము అబీ. 14 అతని తల్లి దాను వంశస్థురాలు. అతని తండ్రి తూరు నగరవాసి. హూరాము – అబీ బంగారం, వెండి, కంచు, ఇనుము, రాతి, కలప పనులలో బహు నేర్పరి. హూరాము – అబీ ఊదా, నీలి, ఎర్రపు రంగుల వస్తువుల, ఖరీదైన వస్త్రాల పనులలో కూడ మంచి నేర్పరి. పైగా హూరాము – అబీ చెక్కడపు పనులలో కూడా నిపుణుడు. నీవు చూపిన ఏ నమూనానైనా అతడు అర్థం చేసికొని దాని ప్రకారం పనిచేయగల నేర్పరి. అతడు నీ వద్ద వున్న శిల్పులకు, కళాకారులకు సహాయకారిగా వుంటాడు. దావీదు ఏర్పరచిన కళాకారులకు కూడ సహాయపడతాడు. నీ తండ్రియగు దావీదు మాటను నేను అనుసరిస్తాను.

15 “నీవు గోధుమలు, యవలు, నూనె, ద్రాక్షారసం నాకు పంపుతానని వ్రాశావు. వాటిని నా పనివాళ్ల నిమిత్తం పంపించు. 16 లెబానోను దేశంలో మేము కలప నరుకుతాము. నీకు ఎంత కలప కావాలో అంత కలప నరుకుతాము. ఆ కలపనంతా తెప్పలుగా కట్టి యొప్పె పట్టణం మీదుగా సముద్రం మీద పంపుతాము. తరువాత ఆ కలపను నీవు యెరూషలేముకు బండ్లమీద మోయించవచ్చు.”

17 అప్పుడు సొలొమోను ఇశ్రాయేలులో నివసిస్తున్న విదేశీయులందరినీ లెక్కించాడు. ఇది దావీదు జనాభా లెక్కలు తీయించిన తరువాత జరిగింది. దావీదు సొలొమోను తండ్రి. దేశంలో ఒక లక్షా ఏబై మూడువేల ఆరువందల మంది పరదేశీయులున్నట్లు వారు కనుగొన్నారు. 18 బరువులు మోయటానికి డెబ్బై వేలమంది విదేశీయులను సొలొమోను నియమించాడు. కొండల్లో రాళ్లు చెక్కటానికి ఎనబై వేల మంది విదేశీయులను దావీదు నియమించాడు. పనివారిపై విచారణ చేయడానికి మరి మూడువేల ఆరువందల విదేశీయులను సొలొమోను ఎంపిక చేశాడు.

సొలొమోను ఆలయాన్ని నిర్మించటం

యెరూషలేములో మోరీయా పర్వతం మీద సొలొమోను ఆలయ నిర్మాణం మొదలు పెట్టాడు. ఈ మోరీయా పర్వతం మీదే సొలొమోను తండ్రియైన దావీదుకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. దావీదు సిద్ధపర్చిన స్థలంలోనే సొలొమోను ఆలయాన్ని నిర్మించాడు. ఈ స్థలం ఒర్నానుకు చెందిన నూర్పిడి కళ్లంవద్ద వుంది. ఒర్నాను యెబూసీయుడు. తన పాలన ఇశ్రాయేలులో నాల్గవ సంవత్సరం రెండవ నెల జరుగుతూ వుండగా సొలొమోను ఆలయ నిర్మాణం చేపట్టాడు.

ఆలయ నిర్మాణ విషయంలో సొలొమోనుకు కొలతలు యివ్వబడ్డాయి: దాని పునాది తొంబై అడుగుల (అరవై మూరలు) పొడవు: ముప్పై అడుగుల (ఇరవై మూరలు) వెడల్పు. ఆలయ కొలతలు తీసుకొన్నుప్పుడు. సొలొమోను పాత మూర కొలతనే అనుసరించాడు. ఆలయ మండపం పొడవు ముప్పై అడుగులు; ఎత్తు ముప్పై అడుగులు. అతడు మండపము యొక్క లోపలి భాగమంతా మేలిమి బంగారంతో పొదిగించాడు. పెద్దగది గోడల మీద తమాల వృక్షముల (ఖర్జూరపు చెట్లు) చెక్కలు అమర్చాడు. ఆ తమాల వృక్షపు చెక్కలమీద మేలిమి బంగారపు రేకులు తాపించాడు. ఈ బంగారపు రేకుల మీద ఖర్జూరపు చెట్ల బొమ్మలు చెక్కించి గొలుసుల నగిషీ పని చేయించాడు. ఆలయంలో అందం ఇనుమడించే విధంగా విలువైన రత్నాలు పొదిగించాడు. పర్వయీము నుండి తెచ్చిన బంగారాన్ని ఈ పనికి వినియోగించాడు. (అక్కడ బంగారం విస్తారంగా లభించేది. బహుశః ఆ ప్రదేశం ఓఫీరు దేశంలో ఉండి వుండవచ్చు). ఆలయపు లోపలి భాగాన్నంతా బంగారు రేకులతో కప్పించాడు. పై కప్పు దూలాలకు దర్వాజాలకు, గోడలకు, తలుపులకు సొలొమోను బంగారు పూత వేయించాడు. గోడల మీద దేవదూతల (కెరూబులు) చిత్రాలు చెక్కించాడు.

తరువాత సొలొమోను అతి పవిత్ర స్థలం[b] ఏర్పాటు చేశాడు. అతి పవిత్ర స్థలం పొడవు ముప్పై అడుగులు; వెడల్పు ముప్పై అడుగులు. ఆలయం వెడల్పంత వెడల్పు దీనికి కూడ వుంది. అతి పవిత్ర స్థలం గోడల నిండా మేలిమి బంగారు రేకులు వేయించాడు. ఈ బంగారపు బరువు ఇరవై మూడు టన్నులు (ఆరువందల తలాంతులు). బంగారపు మేకుల తూకము ఏబై తులాలు. (ఇంచుమించు ఒకటింపావు పౌనులు). పై గదులకు బంగారు పూత వేయించాడు. 10 రెండు కెరూబుల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలో పెట్టించటానికి చేయించాడు. పనివారు ఆ కెరూబుల బొమ్మలకు బంగారు తొడుగు వేశారు. 11 ఆ కెరూబుల ప్రతిదాని రెక్క పొడవు ఏడున్నర అడుగులు ఉంది. ఆ రెండు కెరూబుల నాలుగు రెక్కల పొడవు ముప్పై అడుగులు. మొదటి కెరూబు ఒక రెక్క ఒక పక్క గోడకు ఆనుకొని వుంటుంది. రెండవ రెక్క రెండవ కెరూబు రెక్కకు తగులుతూ వుంటుంది. 12 రెండవ కెరూబు ఒక రెక్క గది గోడకు రెండవ వైపున ఆనుతుంది. 13 రెండు కెరూబుల రెక్కలు మొత్తం ముప్పై అడగుల దూరం వ్యాపించి వుంటాయి. దేవదూతల బొమ్మలు అతి పరిశుద్ధ స్థలంలోకి చూస్తున్నట్లు నిలబడి వుంటాయి.

14 నీలం, ఊదా, ఎరుపు బట్టలతోను, ఖరీదైన పట్టుతోను సొలొమోను తెరలు[c] చేయించాడు. ఈ తెరల మీద కూడ కెరూబుల చిత్రాలు చిత్రించాడు.

15 ఆలయం ముందు రెండు స్తంభాలను ఏర్పాటు చేయించాడు. ఒక్కొక్క స్తంభం ఏబై రెండున్నర అడుగుల (ముప్పైయైదు మూరలు) ఎత్తు వుంటుంది. ఒక్కొక్క స్తంభం యొక్క శిఖరంమీది పీట యెత్తు ఏడున్నర అడుగులు. 16 కంఠాహారం లాంటి గొలుసులను సొలొమోను చేయించాడు. ఆ గొలుసులను స్తంభాల మీద పీటలకు అలంకరించాడు. వంద దానిమ్మ కాయల బొమ్మలు చేయించి గొలుసులకు తగిలించాడు. 17 ఇలా అలంకరించిన స్తంభాలను సొలొమోను ఆలయం ముందు నిలిపాడు. ఒక స్తంభం కుడి ప్రక్క, రెండవ స్తంభం ఎడమ ప్రక్కన నిలిపారు. సొలొమోను కుడి ప్రక్క స్తంభానికి “యాకీను”[d] అని పేరు పెట్టాడు. ఎడమ ప్రక్క స్తంభానికి “బోయజు”[e] అని పేరు పెట్టాడు.

ఆలయ సామగ్రి

ఒక బలిపీఠాన్ని చేయటానికి సొలొమోను కంచును వినియోగించాడు. ఆ కంచు పీఠం ముప్పై అడుగుల పొడవు, ముప్పై అడుగుల వెడల్పు, పద్దెనిమిది అడుగుల ఎత్తు గలిగి వుంది. కరిగిన కంచును వినియోగించి సొలొమోను ఒక పెద్ద కోనేరును[f] (సముద్రం) చేయించాడు. ఆ కోనేరు (సముద్రం) గుండ్రని ఆకారంలో వుంది. దాని వ్యాసం పద్దెనిమిది అడుగులు. దాని ఎత్తు ఏడున్నర అడుగులు. దాని చుట్టు కొలత నలుబదియైదు అడుగులు. కోనేరు (సముద్రం) క్రింది అంచు చుట్టూ పద్దెనిమిది అడుగుల మేరకు కంచుగిత్తల బొమ్మలున్నాయి. ఆ గిత్తలు రెండు వరుసల్లో కోనేరు (సముద్రం) ను పోతపోసినప్పుడే పోతలో వచ్చాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) పన్నెండు పెద్ద గిత్తల విగ్రహాలపై నిలపబడింది. మూడు గిత్తలు ఉత్తరానికి, మూడు దక్షిణానికి, మూడు తూర్పుకు, మూడు గిత్తలు పడమటి వైపుకు తిరిగి వున్నాయి. ఆ పెద్ద కోనేరు (సముద్రం) ఈ గిత్తల మీద నిలపబడింది. ఆ గిత్తలన్నీ వాటి వెనుక భాగాల క్రింద మధ్యలో ఒకదానికొకటి ఆనుకొని వుండి నిలబడి వున్నాయి. కంచు కోనేరు (సముద్రపు) మందం మూడు అంగుళాలు. కోనేరు సముద్రపు అంచు గిన్నె అంచులాగా వుంది. అంచు తామర పుష్పంలా అగపడుతుంది. దానిలో పదిహేడు వేల ఐదువందల గేలనుల (ముప్పై పుట్లు) నీరు పడుతుంది.

సొలొమోను పది వెడల్పైన తొట్టెలను నిర్మించాడు. వాటిలో ఐదింటిని కోనేరు (సముద్రం) సముద్రంకు కుడి పక్కన, ఐదింటిని ఎడమ ప్రక్కన వుంచాడు. ఈ తొట్లను దహన బలులుగా అర్పించే జంతువులను కడగటానికి వినియోగిస్తారు. కాని పెద్ద కోనేరు (సముద్రం) ను మాత్రం యాజకులు తాము బలులు యిచ్చేముందు పవిత్ర స్నానాలు చేయటానికి వినియోగించేవారు.

సొలొమోను పది బంగారపు దీపస్తంభాలు చేయించాడు. ఈ దీపస్తంభాలు చేయటానికి, మునుపటి దీపస్తంభాల నమూనాలనే సొలొమోను అనుకరించాడు. ఈ దీపస్తంభాలను అతడు ఆలయంలో వుంచాడు. కుడిప్రక్క ఐదు, ఎడమప్రక్క ఐదు దీపస్తంభాలను వుంచాడు. సొలొమోను పది బల్లలు చేయించి ఆలయంలో వుంచాడు. ఆలయంలో ఐదు బల్లలు కుడిప్రక్కన, ఐదు బల్లలు ఎడమప్రక్కన వుంచాడు. సొలొమోను వంద తొట్లు చేయించటానికి బంగారం వినియోగించాడు. ఆలయం వెలుపల సొలొమోను యాజకుల పురాన్ని, పెద్ద ఆవరణను నిర్మించి వాటికి వెలుపలి ద్వారాలను ఏర్పాటు చేశాడు. ఆ ద్వారాల తలుపులకు కంచు రేకులు తాపడం చేయించాడు. 10 పిమ్మట పెద్ద కంచు కోనేరు (సముద్రం) ను ఆలయంకి కుడి పక్కగా ఆగ్నేయ (తూర్పు-దక్షిణాల మూల) భాగాన వుంచాడు.

11 హూరాము కుండలను, పారలను, గిన్నెలను తయారు చేశాడు. పిమ్మట హూరాము రాజైన సొలొమోను తలపెట్టిన ఆలయంలో తన పనంతా పూర్తి చేశాడు. 12 హూరాము మరి రెండు స్తంభాలు, వాటిపైన వెడల్పు పళ్ళెములను చేశాడు. ఆ స్తంభాలపైనున్న వెడల్పైన పళ్లెములను అలంకారంగా కప్పటానికి రెండు వలల్లాంటి అల్లికలను కూడ చేశాడు. 13 ఆ రెండు అల్లికల మీద వేలాడదీయటానికి నాలుగు వందల దానిమ్మకాయల ప్రతిమలు కూడా చేశాడు. అలంకరణగా రెండు వరుసల దానిమ్మకాయల బొమ్మలు చుట్టబడ్డాయి. స్తంభాల మీదనున్న పెద్ద పళ్ళెములను వలలు కప్పివున్నాయి. 14 హూరాము తొట్లను, వాటి కింది కుదురులను కూడా చేశాడు. 15 హూరాము కంచు కోనేరును (సముద్రం), దాని కింది పన్నెండు గిత్తలను చేశాడు. 16 హూరాము పాత్రలను, పారలను, శూలాలను, మరియు రాజైన సొలొమోను నిర్మిస్తున్న ఆలయానికి కావలసిన తదితర వస్తువులను చేశాడు. ఈ వస్తుసామగ్రంతా మెరుగు దిద్దిన కంచుతో చేయబడింది. 17 రాజైన సొలొమోను ముందుగా ఈ వస్తువులను మట్టి మూసలలో పోతపోయించాడు. ఈ మూసలు యోర్దానులోయలో సుక్కోతు, జెరేదాతను పట్టణాల మధ్య తయారు చేయబడ్డాయి. 18 సొలొమోను చేయించిన ఈ రకమైన వస్తుసామగ్రి ఎంత వుందనగా వాటికి పట్టిన కంచును తూచి లెక్క గట్టటానికి ఎవ్వరూ ప్రయత్నించియుండలేదు.

19 సొలొమోను ఆలయానికి కావలసిన సామాన్లు కూడా చేయించాడు. సొలొమోను బంగారు బలిపీఠం చేయించాడు. దైవ సన్నిధిలో నైవేద్యం వుంచాటానికి తగిన బల్లలు చేయించాడు. 20 సొలొమోను దీపస్తంభాలు, దీపాలు మేలిమి బంగారంతో చేయించాడు. అతి పవిత్ర స్థలం ముందు ఈ దీపాలు నిర్ణయించిన ఒక క్రమపద్ధతిలో వెలుగుతాయి. 21 ప్రమిదలు నిలిపే పుష్పాలవంటి కుదుర్లు, ప్రమిదలు, పట్టుకారులు, అన్నీ మేలిమి బంగారంతో సొలొమోను చేయించాడు. 22 వత్తులు ఎగదోయు పని ముట్లను, తొట్లను, గిన్నెలను, సాంబ్రాణి పొగవేయు ధూప కలశాలు చేయటానికి కూడా సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు. ఆలయ ద్వారాలకు, అతి పవిత్ర స్థలం తలుపులకు, ఆలయం తలుపులకు సొలొమోను శుద్ధ బంగారం వినియోగించాడు.

దానితో సొలొమోను యెహోవా ఆలయ నిర్మాణానికి తలపెట్టిన పనంతా పూర్తయ్యంది. తన తండ్రి దావీదు ఆలయానికిచ్చిన వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయంలోకి తెచ్చాడు. వెండి బంగారాలతో చేసిన వస్తువులను, తదితర సామానులన్నిటినీ సొలొమోను లోనికి తెచ్చాడు. ఆ వస్తువులన్నిటినీ సొలొమోను ఆలయపు ఖజానాలో భద్రపర్చాడు.

పవిత్ర పెట్టె ఆలయానికి తేబడటం

ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశనాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు. ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.

ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు. పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని వున్నాయి. తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద వుంచారు. ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి. అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి. 10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.

11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుభ్రంగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు. 12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబురలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు. 13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్ద శబ్దం వచ్చేలా చేశారు. వారు యిలా పాడారు:

“ప్రభువు మంచివాడు,
    దేవుని కరుణ శాశ్వత మైనది!”

అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది. 14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణమేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International