Old/New Testament
ముగ్గురు అతిథులు
18 తర్వాత మళ్లీ అబ్రాహాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు. మమ్రేలోని సింధూర వనమునకు దగ్గర్లో అబ్రాహాము నివసిస్తున్నాడు. ఒకనాడు మిట్ట మధ్యాహ్నం అబ్రాహాము తన గుడార ద్వారం దగ్గర కూర్చున్నాడు. 2 అబ్రాహాము తలెత్తి చూడగా, తన ముందర నిలచిన ముగ్గురు మనుష్యులు కనబడ్డారు. అబ్రాహాము వాళ్లను చూడగానే అతడు వారి దగ్గరకు వెళ్లి, వారి ముందు వంగి, 3 ఇలా అన్నాడు, “అయ్యలారా, మీ దాసుడనైన నా దగ్గర దయచేసి కొంత కాలం ఉండండి. 4 మీ కాళ్లు కడుక్కొనేందుకు నేను నీళ్లు తెస్తాను. చెట్ల క్రింద మీరు విశ్రాంతి తీసుకోవచ్చు. 5 మీ కోసం నేను భోజనం తెస్తాను, కడుపు నిండా భోంచేయండి. తర్వాత మీ దారిన మీరు వెళ్లొచ్చు.”
“చాలా బాగుంది, అలాగే కానీయి” అని ఆ ముగ్గురు మనుష్యులు అన్నారు.
6 అబ్రాహాము తన గుడారము దగ్గరకు త్వరత్వరగా వెళ్లాడు. “మూడు రొట్టెలకు సరిపడె గోధుమలు త్వరగా తయారు చేయి” అని అబ్రాహాము శారాతో అన్నాడు. 7 తర్వాత అబ్రాహాము తన పశువుల దగ్గరకు పరుగెత్తాడు. అబ్రాహాము చాలా మంచి లేత దూడను తీసుకొని తన సేవకునికి ఇచ్చాడు. త్వరగా ఆ దూడను వధించి, దానితో భోజనం సిద్ధం చేయమని అబ్రాహాము చెప్పాడు. 8 ఆ మాంసాన్ని ఆ ముగ్గురు మనుష్యులు భోంచేసేందుకు అబ్రాహాము ఇచ్చాడు. అతడు పాలు, వెన్న కూడ వాళ్లకు ఇచ్చాడు. ఆ ముగ్గురు చెట్టు క్రింద భోజనం చేస్తూ ఉండగా అబ్రాహాము వారి దగ్గర నిలబడ్డాడు.
9 “నీ భార్య శారా ఎక్కడ?” అంటూ ఆ ముగ్గురు అబ్రాహామును అడిగారు.
“ఆమె అక్కడ గుడారంలో ఉంది” అని అబ్రాహాము అన్నాడు.
10 అప్పుడు యెహోవా, “మళ్లీ వసంతకాలంలో నేను వస్తాను. అప్పటికి నీ భార్య శారాకు ఒక కుమారుడు కలిగి ఉంటాడు” అని అన్నాడు.
గుడారం లోపల శారా ఈ విషయాలు విన్నది. 11 అబ్రాహాము శారాలు చాలా ముసలివాళ్లు. స్త్రీలు పిల్లలను కనగల వయస్సు శారాకు దాటిపోయింది. 12 అందుచేత తాను విన్న మాటలను శారా నమ్మలేదు. “ఇప్పుడు నేను ముసలిదాన్ని, నా భర్త ముసలివాడు. నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా” అనుకొంది తనలో తాను.
13 అప్పుడు అబ్రాహాముతో యెహోవా ఇలా అన్నాడు: “నేను చెప్పింది శారా నమ్మటం లేదు. ఆమె నవ్వింది. ‘నాకు కొడుకు పుట్టటానికి నేను మరీ ముసలిదాన్ని కదా!’ అంది. 14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? నేను వస్తానని చెప్పిన వసంతకాలంలో మళ్లీ వస్తాను, అప్పుడు నీ భార్య శారాకు కుమారుడు ఉంటాడు.”
15 అయితే శారా, “నేను నవ్వలేదు” అంది. (భయపడి ఆమె అలా అంది.)
కాని యెహోవా, “కాదు, నీవు చెప్పేది నిజం కాదని నాకు తెలుసు. నీవు నవ్వావు” అన్నాడు.
16 అప్పుడు ఆ మనుష్యులు వెళ్లటానికి లేచారు. వారు సొదొమ వైపు చూసి, ఆ దిశగా నడక ప్రారంభించారు. వారికి వీడ్కోలు చెప్పటానికి అబ్రాహాము వాళ్లతో కొంత దూరం నడిచాడు.
దేవునితో అబ్రాహాము బేరం
17 యెహోవా తనలో తాను ఇలా అనుకొన్నాడు: “ఇప్పుడు నేను చేయబోతున్నది అబ్రాహాముకు నేను చెప్పాలా? 18 అబ్రాహాము గొప్ప శక్తిగల జనానికి మూల పురుషుడు అవుతాడు. అతని మూలంగా భూమి మీది ప్రజలంతా ఆశీర్వదించబడుతారు. 19 అబ్రాహాముతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేసుకున్నాను. అతని పిల్లలు, సంతానము యెహోవా ఇష్ట ప్రకారం జీవించేటట్లు అబ్రాహాము వారికి ఆజ్ఞాపించాలని నేను ఇలా చేశాను. సక్రమంగా న్యాయంగా వాళ్లు జీవించాలని నేను ఇలా చేశాను. అప్పుడు, యెహోవానైన నేను వాగ్దానం చేసిన వాటిని అతనికి ఇవ్వగలను.”
20 మరల యెహోవా ఇలా అన్నాడు: “సొదొమ గొమొఱ్ఱాల అరుపులు చాలా పెద్దవి. వారి పాపం చాలా భయంకరమైనది అని నేను విన్నాను. 21 కనుక నేను వెళ్లి, అక్కడి విషయాలు నేను విన్నంత చెడ్డగా ఉన్నాయేమో చూస్తాను. అప్పుడు నాకు నిశ్చయంగా తెలుస్తుంది.”
22 అంచేత ఆ మనుష్యులు మళ్లీ సొదొమవైపు నడక ప్రారంభించారు. అయితే అబ్రాహాము యెహోవాతో అక్కడ ఉండిపోయాడు. 23 అప్పుడు అబ్రాహాము యెహోవాను సమీపించి ఇలా అడిగాడు. “యెహోవా, నీవు దుష్టులను నాశనం చేసేటప్పుడు మంచివారిని కూడా నాశనం చేస్తావా? 24 ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది మంచివాళ్లు ఉంటే ఎలా? ఆ పట్టణాన్ని నాశనం చేసేస్తావా? అక్కడ నివసిస్తున్న 50 మంది మంచివాళ్ల కోసం తప్పక నీవు ఆ పట్టణాన్ని కాపాడు. 25 ఆ పట్టణాన్ని నీవు అసలు నాశనం చేయనే చేయవు. చెడ్డవాళ్లను చంపడంకోసం 50 మంది మంచివాళ్లను నీవు నాశనం చేయవు. అలా గనుక జరిగితే మంచివాళ్లు చెడ్డవాళ్లు సమానమై, ఇద్దరూ శిక్షించబడుతారు. భూలోకమంతటికి నీవు న్యాయమూర్తివి. నిజంగా నీవు సరైనదే చేస్తావని నాకు తెలుసు.”
26 అప్పుడు, “సొదొమ పట్టణంలో 50 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణం అంతటిని కాపాడుతాను” అన్నాడు యెహోవా.
27 దానికి అబ్రాహాము ఇలా అన్నాడు: “ప్రభూ, నీతో పోల్చుకొంటే, నేను ధూళిని, బూడిదను మాత్రమే. అయినా నేను మరోసారి తెగించి ఈ ప్రశ్న అడుగుతున్నాను. 28 ఒకవేళ అయిదుగురు మంచివాళ్లు తప్పిపోయి, 45 మంది మంచివాళ్లు మాత్రమే ఆ పట్టణంలో ఉంటే ఎలా? కేవలం అయిదుగురు తక్కువ అయినందువల్ల మొత్తం పట్టణమంతటిని నాశనం చేస్తావా?”
“అక్కడ 45 మంది మంచివాళ్లు గనుక నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను వదిలివేస్తాను” అన్నాడు యెహోవా.
29 మరల అబ్రాహాము, “అక్కడ 40 మంది మంచివాళ్లు మాత్రమే నీకు కనబడినా, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని యెహోవాను అడిగాడు.
“40 మంది మంచివాళ్లు నాకు కనబడితే, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయను” అన్నాడు యెహోవా.
30 అందుకు అబ్రాహాము, “ప్రభూ, నా మీద కోపగించకు. మరొక్క మాట అడుగుతాను. ఆ పట్టణంలో 30 మంది మంచివాళ్లు మాత్రమే కనబడితే, నీవు ఆ పట్టణాన్ని నాశనం చేస్తావా?” అని అడిగాడు.
అందుకు యెహోవా, “అక్కడ 30 మంది మంచివాళ్లు నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని చెప్పాడు.
31 అప్పుడు అబ్రాహాము, “నా ప్రభువుతో మరోసారి మాటలాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది మంచివాళ్లే ఉంటే” అన్నాడు.
“20 మంది మంచివాళ్లు నాకు కనబడితే ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అని జవాబిచ్చాడు యెహోవా.
32 అప్పుడు అబ్రాహాము ఇలా అన్నాడు, “ప్రభూ, నాపై కోపగించకు, ఈ ఒక్కసారే చివరిగా నీతో మాటలాడ తెగిస్తున్నాను. పదిమంది మంచివాళ్లే గనుక అక్కడ నీకు కనబడితే, నీవేం చేస్తావు?”
“పదిమంది మంచివాళ్లు గనుక అక్కడ నాకు కనబడితే, ఆ పట్టణాన్ని నేను నాశనం చేయను” అన్నాడు యెహోవా.
33 యెహోవా అబ్రాహాముతో మాట్లాడటం అయిపోయింది గనుక యెహోవా వెళ్లిపోయాడు. అబ్రాహాము తన ఇంటికి వెళ్లిపోయాడు.
లోతు అతిథులు
19 ఆ సాయంకాలం, ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ పట్టణానికి చేరుకున్నారు. పట్టణ ద్వారం దగ్గర కూర్చొని ఉన్న లోతు ఆ దేవదూతల్ని చూశాడు. లోతు లేచి, దేవదూతల దగ్గరకు వెళ్లి, సాష్టాంగ పడ్డాడు. 2 లోతు ఇలా అన్నాడు: “అయ్యలారా, దయతో నా ఇంటికి రండి, నేను మీకు సేవ చేస్తాను. అక్కడ మీరు మీ కాళ్లు కడుక్కొని, రాత్రి బస చేయవచ్చును. ఆ తరువాత మీరు మీ ప్రయాణం కొనసాగించవచ్చు.”
“లేదు. ఈ రాత్రికి మేము ఈ ఖాళీ స్థలంలో బస చేస్తాం” అన్నారు దేవదూతలు.
3 కాని, వారిని తన ఇంటికి రమ్మని లోతు బలవంతము చేశాడు. అందుచేత లోతు ఇంటికి వెళ్లడానికి దేవదూతలు ఒప్పుకొన్నారు. వారు ఇంటికి వెళ్లగానే, వారు తినేందుకు లోతు భోజనం తయారు చేశాడు, వాళ్ల కోసం రొట్టెలు చేశాడు. లోతు వండిన భోజనం దేవదూతలు తిన్నారు.
4 ఆ రాత్రి పండుకొనక ముందు, పట్టణం నలుమూలల నుండి పురుషులు చిన్నలూ, పెద్దలూ లోతు ఇంటికి వచ్చారు. సొదొమ ప్రజలు లోతు ఇంటిని చుట్టుముట్టి, లోతును పిల్చారు. 5 “ఈ రాత్రి నీ ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) ఎక్కడ? వాళ్లను బయటకు మా దగ్గరకు తీసుకురా. మేము వాళ్లను సంభోగించాలి” అన్నారు.
6 లోతు బయటకు వెళ్లి, తన వెనుకగా తలుపు మూశాడు. 7 “వద్దు, నా సోదరులారా, దయచేసి ఈ చెడ్డపని మీరు చేయవద్దని బ్రతిమలాడుతున్నాను” అని ఆ మనుష్యులతో చెప్పాడు. 8 “చూడండి, నాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు ఇదివరకు ఎన్నడూ ఏ పురుషునివద్ద పడుకోలేదు. నా కూతుళ్లను మీకు ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్లు వాళ్లను చేసుకోండి. కాని దయచేసి ఈ మనుష్యులను మాత్రం ఏమీ చేయకండి. వీళ్లు నా ఇంటికి వచ్చారు, నేను వాళ్లను కాపాడాలి” అని లోతు ఆ మనుష్యులతో అన్నాడు.
9 “దారిలోనుంచి తప్పుకో” అంటూ ఇంటి చుట్టూ ఉన్నవాళ్లంతా అరిచారు. “ఈ లోతు ఒక యాత్రికుడుగా మన పట్టణం వచ్చాడు. ఇప్పుడు మనకే నీతులు చెబుతున్నాడు” అని వాళ్లలో వాళ్లు చెప్పుకొన్నారు. అప్పుడు వాళ్లు లోతుతో, “వాళ్లకు చేసే వాటికంటే ఎక్కువ కీడు నీకు చేస్తాం” అని చెప్పి, లోతుకు మరింత సమీపంగా వెళ్లి, తలుపు బద్దలు కొట్టడానికి సిద్ధమయ్యారు.
10 అయితే లోతు ఇంటిలో వున్న ఆ యిద్దరు మనుష్యులు తలుపు తెరచి లోతును లోపలికి లాగేశారు. తర్వాత వాళ్లు తలుపు మూసేశారు. 11 ద్వారమునకు వెలుపల ఉన్న మనుష్యులు గ్రుడ్డివాళ్లు అయ్యేటట్లు ఆ దేవదూతలు చేశారు. కనుక ఇంటిలోనికి ప్రవేశించాలని ప్రయత్నించిన ఆ మనుష్యులు, పెద్దవాళ్లు, చిన్నవాళ్లు అందరు గ్రుడ్డివాళ్లయిపోయి ద్వారం ఎక్కడుందో కనుక్కోలేక పోయారు.
సొదొమ నుండి తప్పించుకోవటం
12 “మీ కుటుంబాలకు చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉన్నారా? అల్లుళ్లు, కుమారులు, కుమార్తెలు, లేక ఇంకెవరైనా మీ కుటుంబంలో ఉన్నారా? మీ కుటుంబానికి చెందినవాళ్లు ఇంకెవరైనా ఈ పట్టణంలో ఉంటే, వాళ్లను ఇప్పుడే ఈ చోటు విడిచిపెట్టమని చెప్పాలి. 13 మేము ఈ పట్టణాన్ని నాశనం చేస్తున్నాం. ఈ పట్టణంలో ఉన్న దుష్టత్వాన్ని గూర్చి యెహోవా అంతా చూశాడు. కనుక ఈ పట్టణాన్ని నాశనం చేయటానికి యెహోవా మమ్మల్ని పంపించాడు” అని ఆ ఇద్దరు మనుష్యులు లోతుకు చెప్పారు.
14 కనుక లోతు బయటకు వెళ్లి, తన కుమార్తెలను పెళ్లాడనైయున్న తన అల్లుళ్లతో మాట్లాడాడు. “త్వరగా ఈ పట్టణం వదిలిపెట్టిండి. యెహోవా దీన్ని త్వరగా నాశనం చేస్తాడు” అని లోతు అన్నాడు. అయితే లోతు పరిహాసం చేస్తున్నాడనుకొన్నారు వాళ్లు.
15 మర్నాడు సూర్యోదయాన దేవదూతలు లోతును తొందరపెట్టి ఈలాగన్నారు. “చూడు, ఈ పట్టణం శిక్షించబడుతుంది. కనుక ఇంక నీతో ఉన్న నీ భార్యను, నీ యిద్దరు కుమార్తెలను తోడుకొని ఈ స్థలం విడిచిపెట్టు. అప్పుడు ఈ పట్టణంతోబాటు నీవు నాశనంగాకుండా ఉంటావు.”
16 కాని, లోతు కలవరపడి, వెళ్లిపోయేందుకు త్వరపడలేదు. కనుక ఆ ఇద్దరు మనుష్యులు (దేవదూతలు) లోతు, అతని భార్య, అతని యిద్దరు కుమార్తెల చేతులు పట్టుకొన్నారు. లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుంచి క్షేమంగా బయటకు నడిపించారు. లోతు, అతని కుటుంబం యెడల యెహోవా దయ చూపాడు. 17 అందుచేత లోతును అతని కుటుంబాన్ని ఆ ఇద్దరు మనుష్యులు ఆ పట్టణంలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. వారు బయటకు వచ్చాక, ఆ మనుష్యులలో ఒకరు ఇలా అన్నారు: “ఇప్పుడు మీ ప్రాణం కాపాడుకోవటానికి పారిపొండి. మళ్లీ వెనక్కు తిరిగి పట్టణం వైపు చూడకండి. లోయలో ఎక్కడా ఆగకండి. పర్వతాలు చేరేంత వరకు పరుగెత్తండి. అలా చేయకపోతే, పట్టణంతో పాటు మీరూ నాశనం అయిపోతారు.”
18 అయితే ఆ ఇద్దరు మనుష్యులతో లోతు ఇలా చెప్పాడు: “అయ్యలారా, అంత దూరం పరుగెత్తమని నన్ను బలవంతం చేయవద్దు. 19 మీ సేవకుడనైన నా మీద మీరు చాలా దయ చూపించారు. నన్ను రక్షించటం మీరు చూపించిన మహా గొప్ప దయ. కానీ, నేను పర్వతాల వరకు పరుగెత్తలేను. నేను మరీ నిదానమైతే, ఆ నగరానికి సంభవించవలసిన శిక్ష నాకు తగిలి నేను మరణిస్తాను. 20 అయితే చూడండి, ఇక్కడికి సమీపంలో ఒక చిన్న ఊరుంది. నన్ను ఆ ఊరికి పారిపోనివ్వండి, అక్కడ నా ప్రాణం రక్షించబడుతుంది.” 21 దేవదూత లోతుతో, “సరే మంచిది, అలాగే కానివ్వు. నీవు వెళ్తున్న ఆ ఊరిని నేను నాశనం చేయను. 22 అయితే అక్కడికి వేగంగా పరుగెత్తు. నీవు క్షేమంగా ఆ ఊరు చేరేంతవరకు, సొదొమను నేను నాశనం చేయను” అన్నాడు. (ఆ ఊరు చిన్నది గనుక అది సోయరు అని పిలువబడింది.)
సొదొమ, గొమొర్రాల నాశనం
23 సూర్యోదయం అయ్యేటప్పటికి లోతు సోయరులో ప్రవేశిస్తున్నాడు. 24 సొదొమ గొమొర్రాలను యెహోవా నాశనం చేయటం మొదలు బెట్టాడు. ఆకాశం నుండి అగ్ని గంధక వర్షాన్ని యెహోవా పంపించాడు. 25 కనుక ఆ పట్టణాలను యెహోవా నాశనం చేశాడు, మరియు ఆ లోయను, ఆ నగరాల్లో నివసిస్తోన్న ప్రజలందరిని, చెట్లన్నింటిని ఆయన నాశనం చేశాడు.
26 వారు పారిపోతూ ఉండగా లోతు భార్య వెనుకకు తిరిగి ఆ పట్టణం వైపు చూసింది. ఆమె వెనుకకు తిరిగిచూడగానే ఉప్పుస్తంభం అయిపోయింది.
27 ఆ ఉదయమే పెందలకడ అబ్రాహాము లేచి నిన్న యెహోవా ఎదుట నిలిచిన స్థలానికి వెళ్లాడు. 28 అబ్రాహాము సొదొమ గొమొర్రాలవైపు క్రిందుగా చూశాడు. ఆ లోయ ప్రదేశమంతా అబ్రాహాము చూశాడు. ఆ చోటనుండి విస్తారమైన పొగలు రావటం చూశాడు. అది ఒక మహాగొప్ప మంటనుండి లేచిన పొగలా కనబడింది.
29 ఆ లోయలోని పట్టణాలను దేవుడు నాశనం చేశాడు. అయితే దేవుడు ఇది చేసినప్పుడు, అబ్రాహాము అడిగిన దానిని ఆయన జ్ఞాపకం చేసుకొన్నాడు. లోతు ప్రాణాన్ని దేవుడు రక్షించాడు, కాని లోతు నివసించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేశాడు.
లోతు, అతని కుమార్తెలు
30 సోయరులో జీవితం గడిపేందుకు లోతు భయపడ్డాడు. కనుక అతడు, అతని ఇద్దరు కుమార్తెలు వెళ్లి పర్వతాల్లో నివాసం చేశారు. అక్కడ ఒక గుహలో వారు నివసించారు. 31 ఒక రోజున పెద్ద కుమార్తె చిన్న కుమార్తెతో ఇలా చెప్పింది: “భూమిమీద అంతటా స్త్రీలు పురుషులు పెళ్లి చేసుకొని కుటుంబం కలిగి ఉంటారు. కానీ మనం పెళ్లి చేసుకొని పిల్లలు కలిగేందుకు ఇక్కడ ఎవ్వరూ మగవాళ్లు లేరు. మన తండ్రి ముసలివాడు. 32 కానీ మన కుటుంబం సాగాలి గనుక మనకు పిల్లలు పుట్టడం కోసం మనం మన తండ్రిని ఉపయోగించుకోవాలి. మనం మన తండ్రి దగ్గరకు వెళ్లి, ఆయనతో పాటు మధుపానం చేసి, ఆయనకు మత్తు కలిగిద్దాం. అప్పుడు మనం ఆయనతో పడుకోవచ్చు.”
33 ఆ రాత్రి ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రి దగ్గరకు వెళ్లి, అతనికి ద్రాక్షారసాన్ని త్రాగించి మత్తుగా చేశారు. అప్పుడు పెద్దమ్మాయి తన తండ్రి పడక మీదకు వెళ్లి, అతనితో లైంగికంగా కలిసికొన్నది. లోతు త్రాగిన మత్తులో ఉన్నాడు గనుక, ఆమె ఎప్పుడు తనతో పడుకొన్నదో, ఎప్పుడు లేచి వెళ్లినదో అతనికి తెలియలేదు.
34 మర్నాడు పెద్దమ్మాయి చిన్నమ్మాయితో చెప్పింది: “గత రాత్రి నా తండ్రితో నేను పండుకొన్నాను. ఈ రాత్రి మళ్లీ మనం ఆయనకు ద్రాక్షారసముతో మత్తు కలిగిద్దాం. అప్పుడు నీవు ఆయన పడక మీదికి వెళ్లి ఆయనతో లైంగికంగా కలిసికొనవచ్చు. ఈ విధంగా మన కుటుంబం అంతం కాకుండా పిల్లలు పుట్టేందుకు మనం మన తండ్రిని ఉపయోగించుకోవచ్చు.” 35 కనుక ఆ రాత్రి తమ తండ్రికి మత్తు ఎక్కేంతవరకు ఆ ఇద్దరు అమ్మాయిలూ తమ తండ్రికి ద్రాక్షారసాన్ని త్రాగించారు. అప్పుడు చిన్నమ్మాయి అతని పడక మీదికి వెళ్లి అతనితో పడుకొన్నది. అతని కుమార్తె అతనితో పడుకొన్నట్లు లోతుకు మరల తెలియలేదు.
36 అందుచేత లోతు కుమార్తెలు ఇద్దరూ గర్భవతులయ్యారు. వారి తండ్రి వారి శిశువులకు తండ్రి. 37 పెద్ద కుమార్తెకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె ఆ కుమారునికి మోయాబు[a] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న మోయాబీయులందరికీ అతడు తండ్రి. 38 చిన్న కుమార్తెకు కూడ ఒక కొడుకు పుట్టాడు. ఆమె తన కుమారునికి బెన్నమ్మి[b] అని పేరు పెట్టింది. నేటికీ జీవిస్తోన్న అమ్మోనీయులందరికీ బెన్నమ్మి తండ్రి.
యేసు ఇచ్చుటను గురించి బోధించటం
6 “జాగ్రత్త! మీరు చేసే నీతికార్యాలు ఇతర్లు చూసేలా చెయ్యకండి. అలా చేస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మీకు ప్రతిఫలమివ్వడు.
2 “అందువల్ల మీరు దానం చేసినప్పుడు చాటింపు వేయించుకొని నలుగురికి తెలుపకండి. కపటులు సమాజాల్లో, వీధుల్లో, ప్రజలు గౌరవించాలని అలా చేస్తారు. ఇది సత్యం, వాళ్ళకు లభించవలసిన ప్రతి ఫలం అప్పుడే పూర్తిగా లభించింది. 3 కాని, మీరు దానం చేసేటప్పుడు మీ కుడిచేయి ఏమి యిస్తుందో మీ ఎడమచేతికి తెలియనివ్వకండి. 4 అప్పుడే మీ దానం గుప్తంగా ఉంటుంది. అప్పుడు, మీరు రహస్యంగా చేస్తున్నది చూసి మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(లూకా 11:2-4)
5 “మీరు ప్రార్థించేటప్పుడు కపటుల్లా ప్రార్థించకండి. వాళ్ళు సమాజమందిరాల్లో, వీధుల ప్రక్కన నిలుచొని నలుగురూ చూడాలని ప్రార్థిస్తారు. అది వాళ్ళకు ఆనందాన్నిస్తుంది. కాని ఇది సత్యం—వాళ్ళకు లభించవలసిన ఫలితం వాళ్ళకప్పుడే పూర్తిగా లభించింది. 6 మీరు ప్రార్థించేటప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసికొని కనిపించని మీ తండ్రికి ప్రార్థించండి. అప్పుడు రహస్యంలో ఉండే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
7 “అంతేకాక, మీరు ప్రార్థించేటప్పుడు యూదులు కాని వాళ్ళవలె మాట్లాడవద్దు. ఆలా చేయడంవల్ల దేవుడు వింటాడని వాళ్ళు అనుకొంటారు. 8 వాళ్ళవలె చేయకండి. మీకేం కావాలో మీరడగక ముందే మీ తండ్రికి తెలుసు. 9 కాబట్టి మీరి విధంగా ప్రార్థించాలి:
‘పరలోకంలో ఉన్న మా తండ్రీ,
నీ పేరు సదా పవిత్ర పర్చబడాలని మేము ప్రార్థిస్తున్నాము.
10 నీ రాజ్యం రావాలనీ, పరలోకంలో నీ చిత్తం నెరవేరునట్లే
ఈ లోకంలో కూడా నెరవేరాలని మేము ప్రార్థిస్తున్నాము.
11 ప్రతి రోజు మాకు కావలసిన ఆహారం మాకు దయ చేయుము.
12 ఇతరులు మా పట్ల చేసిన పాపాలను మేము క్షమించినరీతి,
మేము చేసిన పాపాలను కూడా క్షమించుము.
13 మేము శోధనకు గురిఅయ్యేలా చేయవద్దు.
పైగా మమ్ములను దుష్టుని నుండి కాపాడుము.’[a]
14 ఇతర్ల తప్పుల్ని మీరు క్షమిస్తే పరలోకంలో ఉన్న మీ తండ్రి మిమ్మల్ని క్షమిస్తాడు. 15 కాని యితర్లను మీరు క్షమించకపోతే మీ తండ్రి మీ తప్పుల్ని క్షమించడు.
యేసు ఉపవాసమును గురించి బోధించటం
16 “కపటులు ఉపవాసం చేసినప్పుడు ప్రజలు గమనించాలని తమ ముఖాలు నీరసంగా కనిపించేటట్లు చేసుకొంటారు. మీరు ఉపవాసం చేసినప్పుడు అలా చేయకండి. ఇది సత్యం, వాళ్ళు పొందవలసిన ఫలాన్ని పొందారు. యింకేమీ లభించదు. 17 మీరు ఉపవాసం చేసినప్పుడు తలకు నూనె రాసుకొని ముఖాన్ని కడుక్కొండి. 18 అలా చేస్తే, మీరు ఉపవాసం చేస్తున్నట్లు ప్రజలకు కనిపించదు. కాని కనిపించని మీ తండ్రికి మాత్రమే మీరు ఉపవాసం చేస్తున్నట్లు తెలుస్తుంది. అందువలన రహస్యంగా చూసే మీ తండ్రి మీకు ప్రతిఫలం యిస్తాడు.
© 1997 Bible League International