Print Page Options
Previous Prev Day Next DayNext

Beginning

Read the Bible from start to finish, from Genesis to Revelation.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహెజ్కేలు 37-39

ఎండిన ఎముకల దర్శనం

37 యెహోవా శక్తి నా మీదికి వచ్చింది. దేవుని ఆత్మ (సుడిగాలి రూపంలో) నన్ను నగరం నుండి ఎత్తుకుపోయి ఒక లోయ మధ్యలో దించింది. ఆ లోయ అంతా మానవ అస్థిపంజరాలతో నిండిఉంది. లోయలో భూమిమీద ఎముకలు లెక్కకు మించి పడివున్నాయి. ఆ ఎముకల మధ్యగా యెహోవా నన్ను నడిపించాడు. ఎముకలు బాగా ఎండిపోయి ఉన్నట్లు నేను చూశాను.

నా ప్రభువైన యెహోవా నన్ను, “నరపుత్రుడా, ఈ ఎముకలు తిరిగి ప్రాణం పోసుకోగలవా?” అని అడిగాడు.

“నా ప్రభువైన యెహోవా, ఈ ప్రశ్నకు సమాధానం నీకే తెలుసు” అని నేనన్నాను.

అందుకు నా ప్రభువైన యెహోవా ఇలా అన్నాడు: “ఆ ఎముకలతో నా తరపున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఎండిన ఎముకల్లారా, యెహోవా మాట వినండి! నా ప్రభువైన యెహోవా మీకు ఈ విషయాలు చెపుతున్నాడు: మీలోకి ఊపిరి వచ్చేలా చెస్తాను. మీరు ప్రాణం పోసుకుంటారు! మీమీద మళ్లీ నరాలు, కండరాలు కలుగజేస్తాను. మిమ్మల్ని చర్మంతో కప్పుతాను. పిమ్మట మీలో ఊపిరి పోస్తాను. మీరు బతుకుతారు! అప్పుడు ప్రభువును, యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.’”

ఆయన చెప్పిన రీతిలో నేను యెహోవా తరపున ఎముకలతో మాట్లాడాను. నేను ఇంకా మాట్లాడుతూ ఉండగానే ఒక పెద్ద శబ్దం విన్నాను. ఎముకలలో గలగల శబ్దం వినవచ్చింది. ఒక ఎముకతో మరొక ఎముక కలవటం మొదలు పెట్టింది! తరువాత నా కళ్ల ముందే వాటిమీద నరాలు, కండరాలు ఏర్పడటం జరిగింది. వాటిమీద చర్మం కప్పివేయటం మొదలయింది. కాని శరీరాలు మాత్రం కదలలేదు. వాటిలో ఊపిరి లేదు.

పిమ్మట నా ప్రభువైన యెహోవా నాతో ఇలా అన్నాడు: “వాయువుతో మాట్లాడు. ఓ నరపుత్రుడా, ఊపిరితో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని ఊపిరితో చెప్పు: ‘ఊపిరి, అన్ని దిశలనుండి నీవు వీచి ఈ శవాలలో జీవంపోయుము! వాటికి ఊపిరి పోయుము; అవి తిరిగి బ్రతుకుతాయి!’”

10 ఆయన చెప్పిన విధంగా నేను యెహోవా తరపున ఆత్మతో మాట్లాడాను. వెంటనే శవాలలోకి ఊపిరి వచ్చింది. వాటికి ప్రాణం వచ్చి లేచి నుంచున్నాయి. అక్కడ ఎంతో మంది మనుష్యులున్నారు. వారంతా ఒక పెద్ద సైన్యం!

11 తరువాత నా ప్రభువైన యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నరపుత్రుడా, ఈ ఎముకలు మొత్తం ఇశ్రాయేలు వంశంలా ఉన్నాయి. ఇశ్రాయేలీయులు, ‘మా ఎముకలు ఎండిపోయాయి. మా ఆశలు అడుగంటాయి. మేము సర్వనాశనమయ్యాము!’ అని అంటున్నారు. 12 కావున నీవు నా తరపున వారితో మాట్లాడి ప్రభువైన యెహోవా ఈ రకంగా చెపుతున్నాడని తెలుపు, ‘నా ప్రజలారా నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని బయటికి తెస్తాను! పిమ్మట మిమ్మల్ని ఇశ్రాయేలు దేశానికి తీసుకొని వస్తాను. 13 నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరచి, మిమ్మల్ని వాటినుండి బయటకు తెస్తాను! అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. 14 నా ఆత్మను మీలో పెడతాను. దానితో మీరు మళ్లీ జీవిస్తారు. అప్పుడు మిమ్మల్ని మీ స్వదేశానికి తిరిగి నడిపిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు. ఈ విషయాలు నేనే చెప్పానని, వాటిని జరిగేలా చేశానని మీరు తెలుసుకుంటారు!’” ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

యూదా, ఇశ్రాయేలు ఏకమవటం

15 యెహోవా వాక్కు నాకు మళ్నీ వినిపించింది. ఆయన ఇలా అన్నాడు: 16 “నరపుత్రుడా, ఒక కట్టెపుల్లను తెచ్చి ఈ వర్తమానం దానిమీద వ్రాయి, ‘ఈ పుల్ల యూదాకు, దాని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది.’ తరువాత మరో పుల్లను తీసుకొని దాని మీద; ‘ఈ ఎఫ్రాయిము పుల్ల యోసేపుకు, అతని స్నేహితులైన (తోటివారు) ఇశ్రాయేలీయులకు చెందింది,’ అని వ్రాయుము. 17 పిమ్మట ఆ రెండు పుల్లలను కలుపుము. నీ చేతిలో ఆ రెండూ ఒక్క పుల్లలా ఉంటాయి.

18 “దీని భావమేమిటని నీ ప్రజలు నిన్నడుగుతారు. 19 ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని వారికి చెప్పు. ‘ఎఫ్రాయిము చేతిలో ఉన్న యోసేపు పుల్లను మరియు అతని స్నేహితులగు ఇశ్రాయేలీయులను నేను తీసుకుంటాను. దానిని యూదా యొక్క పుల్లతో కలిపి ఒక్క పుల్లగా చేస్తాను. నా చేతిలో అవి ఒక్క కట్టె పుల్ల అవుతాయి!’

20 “నీకు ముందుగా వారి కండ్ల ఎదుట ఆ కర్రలను నీ చేతిలో ఎత్తి పట్టుకొనుము. ఆ పేర్లను ఆ కట్టెపుల్లల మీద నీవు వ్రాశావు. 21 నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెపుతున్నాడని అనుము, ‘వారు చెదరిపోయిన దేశాల నుండి ఇశ్రాయేలు ప్రజలను నేను తీసుకొంటాను. అన్ని చోట్ల నుండి వారిని సమావేశపర్చి, వారి స్వంత దేశానికి తిరిగి తిసుకొని వస్తాను. 22 ఇశ్రాయేలు పర్వతం మీద వారిని ఒక్క దేశంగా చేస్తాను. వారందరికి ఒక్కడే రాజు ఉంటాడు. వారు రెండు రాజ్యాలుగా కొనసాగరు. వారిక ఎంతమాత్రం రెండు రాజ్యాలుగా విడిపోరు. 23 వారి విగ్రహాలతోను, భయంకర శిల్పాలతోను, తదితర ఘోరమైన నేరాలతోను వారు తమను తాము మలినపర్చుకోవటం కొనసాగించరు. వారెక్కడున్నా వారి భయంకర పాపాలన్నిటి నుండి వారిని నేను కాపాడుతాను. నేను వారిని కడిగి పవిత్ర పర్చుతాను. వారు నా ప్రజలవుతారు. నేను వారికి దేవుడనై యుంటాను.

24 “‘నా సేవకుడైన దావీదు వారికి రాజుగా ఉంటాడు. వారంతా ఒకే ఒక్క కాపరిని కలిగి ఉంటారు. వారు నా నీతికి, న్యాయానికి బద్ధులై జీవిస్తారు. నేను చెప్పినవన్నీ వారు చేస్తారు. 25 నేను నా సేవకుడైన యాకోబుకు ఇచ్చిన భూమి మీద వారు నివసిస్తారు. నీ పూర్వీకులు ఆ ప్రదేశంలో నివసించారు. నా ప్రజలూ అక్కడే నివసిస్తారు. వారు, వారి పిల్లలు మరియు వారి మనుమలు అక్కడే శాశ్వతంగా నివసిస్తారు. మరియు నా సేవకుడైన దావీదు సదా వారికి రాజై ఉంటాడు. 26 నేను వారితో శాంతి ఒడంబడిక ఒకటి చేసుకుంటాను. ఈ ఒడంబడిక ఎల్లకాలం కొనసాగుతుంది. వారి దేశాన్ని వారికి ఇవ్వటానికి నేను అంగీకరించాను. వారి సంతానం విస్తారమవడానికి నేను అంగీకరించాను. పైగా నా పవిత్ర స్థలాన్ని అక్కడ శాశ్వతంగా వారితో ఉంచటానికి నేను అంగీకరించాను. 27 నా పవిత్ర గుడారం వారి మధ్య అక్కడ ఉంటుంది. అవును, నేను వారి దైవంగా, వారు నా ప్రజలుగా ఉంటాము. 28 మరియు ఇతర దేశాలు కూడ నేను యెహోవానని తెలుసుకుంటాయి. నా పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా ఇశ్రాయేలు ప్రజల మధ్య ఉంచటం ద్వారా నేను ఇశ్రాయేలీయులను నా ప్రత్యేక జనులుగా చేశానని కూడ వారు తెలుసుకుంటారు.’”

గోగుకు వ్యతిరేకంగా వర్తమానం

38 యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది. ఆయన ఇలా అన్నాడు: “నరపుత్రుడా, మాగోగు దేశపువాడైన గోగువైపు చూడు. అతడు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడు. నీవు నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడుము. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని నీవతనికి తెలుపు, ‘గోగూ, నీవు మెషెకు మరియు తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నీకు నేను విరోధిని. నిన్ను నేను పట్టుకుని వెనుకకు తీసుకొని వస్తాను. నీ సైన్యంలోని వారందరినీ నేను పట్టుకు వస్తాను. గుర్రాలను, గుర్రపు సైన్యం వారందరిని పట్టుకు వస్తాను. మీ నోళ్లకు గాలం తగిలించి, మీ అందరినీ తిరిగి తీసుకు వస్తాను. మీ సైనికులంతా వారి దుస్తులు, డాళ్లు, కత్తులు ధరిస్తారు. పెర్షియా (పారసీకము), ఇథియోపియ (కూషు) మరియు పూతు సైనికులందరు కూడ మీతో ఉంటారు. వారంతా తమ డాళ్లు, శిరస్త్రాణాలు ధరిస్తారు. అక్కడ గోమరు కూడ తన సైన్యమంతటితో ఉంటుంది. తన సైనిక పటాలాలన్నిటితో దూరాన గల ఉత్తర దేశమైన తోగర్మా కూడ ఉంటుంది. ఆ బందీల ప్రదర్శనలో ఇంకా అనేకానేక మంది ప్రజలు ఉంటారు.

“‘సిద్ధంకండి. అవును. నీవు నీతో కలిసిన సైన్యాలు సిద్ధం కండి. మీరు సిద్ధమై మెలకువతో ఉండండి. ఎంతో కాలం తరువాత మీరు విధులకు పిలవబడుతారు. తరువాతి సంవత్సరాలలో యుద్ధ బాధలనుండి విముక్తి చెందిన దేశంలోకి మీరు వస్తారు. ఆ దేశపు ప్రజలు తాము ఇతర దేశాలనుండి సమ కూర్చబడి ఇశ్రాయేలు పర్వతం మీదికి తిసుకొని రాబడతారు. గతంలో ఇశ్రాయేలు పర్వతాలు పదే పదే నాశనం చేయబడ్డాయి. అయితే ఈ ప్రజలు మాత్రం ఇతర దేశాల నుండి తిరిగి వచ్చినవారు. వారంతా క్షేమంగా నివసిస్తారు. కాని నీవు వారిని ఎదిరించటానికి వస్తావు. నీవొక తుఫానులా వస్తావు. దేశాన్ని ఆవరించి గర్జించే మేఘంలా నీవు వస్తావు. నీవు, నీతో వున్న అన్య దేశాల సైనిక దళాలు ఈ ప్రజల మీదికి వచ్చి పడతారు.’”

10 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఆ సమయంలో నీ మనస్సుకు ఒక ఆలోచన వస్తుంది. నీవు కుయుక్తి పన్నటం మొదలు పెడతావు. 11 నీవు ఈ విధంగా అంటావు, ‘నగరాలకు రక్షణ గోడలు లేకుండా ఉన్న దేశంపై (ఇశ్రాయేలు) నేను దాడిచేస్తాను. వారు ప్రశాంతంగా జీవిస్తున్నారు. సురక్షితంగా ఉన్నామని వారనుకుంటున్నారు. నగరాలను రక్షించటానికి వాటిచుట్టూ గోడలే లేవు. వారి ద్వారాలకు తాళాలు లేవు. అసలు ద్వారాలే లేవు! 12 ఆ ప్రజలను నేను ఓడించి, వారి విలువైన సొమ్ములను నేను కొల్లగొడతాను. ఒకప్పుడు నాశనం చేయబడి, ఇప్పుడు జనంతో క్రిక్కిరిసిన ప్రాంతాలపై నేను యుద్ధం చేస్తాను. అన్యదేశాల నుండి వెనుకకు తీసుకొని రాబడిన ఆ ప్రజలతో (ఇశ్రాయేలు) నేను యుద్ధం చేస్తాను. ఇప్పుడా ప్రజలకు పశువులు, ఆస్తిపాస్తులు సమకూడాయి. వారు ప్రపంచానికి నాలుగుబాటల కూడలి స్థలంలో నివసిస్తున్నారు. కొన్ని అగ్ర రాజ్యాలు ఇతర బలమైన రాజ్యాలకు ఆ ప్రాంతం గుండానే వెళ్లాలి.’

13 “సెబా, దదానువారు; తర్షీషు వ్యాపారులు, ఇతర వ్యాపార కేంద్రాలైన నగరాల వారు నిన్ను చూచి ఇలా అంటారు, ‘విలువైన వస్తువులు పట్టుకు పోవడానికి వచ్చావా? మంచి మంచి వస్తువులు, వెండి బంగారాలు, పశువులు, ఇతర సంపద కొల్లగొట్టి పట్టుకుపోవటానికి నీవు నీ సైనిక దళాలను తీసుకొని వచ్చావా? ఆ విలువైన వస్తువులు పట్టుకు పోవటానికి వచ్చావా?’”

14 దేవుడు ఇలా అన్నాడు, “నరపుత్రుడా, నా తరఫున గోగుతో మాట్లాడు. ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయి, ‘నా ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా జీవిస్తున్న సమయంలో నీవు వారిమీద దండయాత్రకు వస్తావు. 15 సుదూర ఉత్తర ప్రాంతంలో గల నీ దేశంనుండి నీవు వస్తావు. నీతో అనేక మందిని తీసుకొని వస్తావు. వారంతా గుర్రాల మీద వస్తారు. మీరంతా ఒక శక్తివంతమైన మహా సైన్యంగా ఉంటారు. 16 నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయటానికి మీరు వస్తారు. దేశాన్ని ఆవరించే గర్జించే ఒక మేఘంలా నీవుంటావు. ఆ సమయం వచ్చినప్పుడు నా దేశం మీద యూద్ధానికి నిన్ను తీసుకొనివస్తాను. గోగూ, అప్పుడు నేనెంత శక్తిమంతుడనో దేశాలన్నీ తెలుసుకొంటాయి! వారు నన్ను గౌరవించటం నేర్చుకుంటారు. నేను మహనీయుడనని వారు తెలుసుకుంటారు. నీకు నేనేమి చేస్తానో వారు చూస్తారు!’”

17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “గతంలో నేను నిన్ను గురించి మాట్లాడినట్లు ఆ సమయంలో ప్రజలు గుర్తు తెచ్చుకుంటారు. నా సేవకులైన ఇశ్రాయేలు ప్రవక్తల సేవలను నేను వినియోగించుకున్నట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు. ఇశ్రాయేలు ప్రవక్తలు గతంలో నా తరపున మాట్లాడుతూ, వారిపై యుద్ధానికి నేను నిన్ను తీసుకొని వస్తానని చెప్పినట్లు వారు గుర్తు తెచ్చుకుంటారు.”

18 నా ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు: “ఆ సమయంలో ఇశ్రాయేలు దేశంపై యుద్ధానికి గోగు వస్తాడు. నేను నా కోపాన్ని చూపిస్తాను. 19 నా కోపంలో, ఉద్రేకంలో నేనిలా ప్రమాణం చేస్తున్నాను, ఇశ్రాయేలు దేశంలో ఒక తీవ్రమైన భూకంపం వస్తుందని నేను ఖచ్చితంగా చెపుతున్నాను. 20 ఆ సమయంలో జీవరాశులన్నీ భయంతో కంపించిపోతాయి. సముద్రంలో చేపలు, గాలిలో పక్షులు, అడవుల్లో క్రూరమృగాలు తదితర పాకే జీవులు, మానవులందరూ భయంతో వణికిపోతారు. పర్వతాలు కూలిపోతాయి. కొండ శిఖరాలు విరిగి పడతాయి. ప్రతి గోడా నేలకూలు తుంది!”

21 నా ప్రభువైన యెహోవా ఇలా చెపుతున్నాడు: “అంతేగాదు. ఇశ్రాయేలు పర్వతాల మీద అన్ని రకాల భయోత్పాతాలను గోగు మీదికి రప్పిస్తాను. అతని సైనికులు తమ కంగారులో ఒకరిపై ఒకరు పడి, తమ కత్తులతో ఒకరి నొకరు పొడుచుకొని చంపుకుంటారు. 22 రోగాలతోను, మరణంతోను గోగును శిక్షిస్తాను. గోగు మీదను, అనేక దేశాల నుండి వచ్చిన అతని సైన్యం మీదను వడగళ్లు, అగ్ని, గంధకం వర్షించేలా చేస్తాను. 23 నేనెంత గొప్పవాడినో నేనప్పుడు చూపిస్తాను. నేను మహనీయుడనని రుజువు చేస్తాను. నేను ఈ పనులు చేయటం అనేక దేశాల వారు చూస్తారు. నేనెవరినో అప్పుడు వారు కనుగొంటారు. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకుంటారు.”

గోగు, అతని సైన్యం యొక్క అంతం

39 “నరపుత్రుడా, నా తరపున గోగుకు వ్యతిరేకంగా మాట్లాడు. యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడని అతనికి తెలియజేయుము, ‘గోగూ, నీవు మెషెకు, తుబాలు దేశాలకు అతి ముఖ్యమైన నాయకుడవు! కాని నేను నీకు వ్యతిరేకిని. నిన్ను నేను పట్టుకొని వెనుకకు తీసుకొని వస్తాను. దూరపు ఉత్తర ప్రాంతం నుండి నిన్ను తీసుకు వస్తాను. ఇశ్రాయేలు పర్వతాలపై యుద్ధానికి నిన్ను నేను తీసుకు వస్తాను. కాని నీ ఎడమచేతి నుండి నీ ధనుస్సును నేల రాల్చుతాను. నీకుడి చేతి నుండి నీ బాణాలు పడిపోయేలా చేస్తాను. ఇశ్రాయేలు పర్వతాల మీద నీవు చంపబడతావు. నీవు, నీ సైనిక దళాలు, నీతో ఉన్న అన్య దేశాల జనులు యుద్ధంలో చంపబడతారు. మాంసం తినే ప్రతి పక్షి, క్రూర మృగాలకి నిన్ను ఆహారంగా పడవేస్తాను. నీవు నగర ప్రవేశం చేయవు. నీవు ఆరు బయటనే పొలాల్లో చంపబడతావు. ఇది చెప్పినది నేనే!’” నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు.

దేవుడు ఇలా చెప్పాడు, “మాగోగు మీదికి, తీరం వెంబడి నిర్భయంగా నివసిస్తున్న ప్రజల మీదికి అగ్నిని పంపిస్తాను. నేనే యెహోవానని వారప్పుడు తెలుసుకొంటారు. నేనొక్కడినే ఇశ్రాయేలులో మహనీయుణ్ణి. ప్రజలు నా పవిత్ర నామాన్ని ఇక ఎంతమాత్రం పాడు చేయకుండా చూస్తాను. దేశాలన్నీ నేనే యెహోవానని తెలుసుకుంటాయి. నేను ఇశ్రాయేలులో నెలకొన్న పవిత్రుడినైన యెహోవానని వారు తెలుసుకుంటారు. ఆ సమయం ఆసన్నమవుతూ ఉంది! అది జరిగి తీరుతుంది!” యెహోవా ఈ విషయాలు చెప్పాడు. “ఆ రోజును గురించే నేను మాట్లాడుతున్నాను.

“ఆ సమయంలో ఇశ్రాయేలు నగరాలలో నివసిస్తున్న ప్రజలు ఆ పొలాలలోకి వెళతారు. వారు శత్రువుల ఆయుధాలన్నీ ఏరి తగలబెడతారు. డాళ్లు, ధనుస్సులు, బాణాలు, దుడ్డు కర్రలు, ఈటెలు అన్నీ వారు తగులబెడతారు. ఆ ఆయుధాలన్నిటినీ వారు ఏడేండ్ల పాటు వంట చెరకుగా ఉపయోగిస్తారు. 10 ఈ ఆయుధాలనే వారు వంట చెరకుగా ఉపయోగించటంతో వారు పొలాల్లో పుల్లలు ఏరటం గాని, అడవిలో కట్టెలు కొట్టటం గాని చేయవలసిన అవసరం లేదు. వారిని దోచుకోవాలని వచ్చిన సైనికుల నుండి విలువైన వస్తువులను వారే తీసుకుంటారు. తమవద్ద విలువైన వస్తువులను దోచుకున్న సైనికుల నుండి వారే మంచి వస్తువులను తీసుకుంటారు.” ఈ విషయాలు నా ప్రభువైన యెహోవా చెప్పాడు.

11 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “ఆ సమయంలో గోగును సమాధి చేయటానికి ఇశ్రాయేలులో నేనొక స్థలాన్ని ఎంపిక చేస్తాను. మృత సముద్రానికి తూర్పున ఉన్న ప్రయాణీకుల లోయలో అతడు సమాధి చేయబడతాడు. అది ప్రయాణికుల బాటను మూసివేస్తుంది. గోగు మరియు అతని సైన్యమంతా అక్కడే సమాధి చేయబడతారు గనుక అలా జరుగుతుంది. ప్రజలు ఆ ప్రదేశాన్ని ‘గోగు సైన్యపు లోయ’ అని పిలుస్తారు. 12 దేశాన్ని శుద్ధి చేయటానికి ఇశ్రాయేలు వంశం వారు వారిని ఏడు నెలల పాటు పాతిపెడతారు. 13 దేశంలోని సామాన్య ప్రజలంతా ఆ శత్రు సైనికులను పాతిపెడతారు. నేను ఖ్యాతి తెచ్చుకున్న ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు కీర్తి వహిస్తారు.” నా ప్రభువైన యెహోవా ఆ విషయం చెప్పాడు.

14 దేవుడు ఇలా చెప్పాడు: “ఆ చనిపోయిన సైనికులను పాతి పెట్టటానికి పనివారిని పూర్తి సమయ ప్రాతిపదికపై ప్రజలు నియమించవలసి ఉంటుంది. ఈ రకంగా వారు దేశాన్ని పవిత్రం చేస్తారు. పనివారు ఏడునెలల పాటు పని చేస్తారు. వారు శవాలను వెదుకుతూ నలుదిశలా తిరుగుతారు. 15 పనివారు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఏ ఒక్కడైనా ఒక ఎముకను చూస్తే దాని ప్రక్కన ఒక గుర్తు పెడతాడు. సమాధులు త్రవ్వేవారు వచ్చి ఆ ఎముకను గోగు సైన్యపులోయలో పాతిపెట్టే వరకు ఆ గుర్తు అక్కడ ఉంటుంది. 16 ఆ మృతుల నగరానికి హమోనా[a] అని పేరు పెడతారు. ఈ విధంగా వారు దేశాన్ని శుద్ధి చేస్తారు.”

17 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “నరపుత్రుడా, అన్ని పక్షుల, అడవి జంతువులతో నా తరఫున మాట్లాడు. వాటికి ఈ విధంగా చెప్పు, ‘ఇక్కడికి రండి! ఇక్కడికి రండి! చుట్టూ మూగండి. నేను మీ కొరకు సిద్ధం చేస్తున్న బలిని మీరు తినండి. ఇశ్రాయేలు పర్వతాల మీద చాలా పెద్ద బలి ఇవ్వబడుతుంది. రండి. మాంసం తినండి. రక్తం తాగండి. 18 బలాఢ్యులైన సైనికుల శరీరాల మాంసం మీరు తింటారు. మహా రాజుల రక్తాన్ని మీరు తాగుతారు. బాషానుకు చెందిన పొట్టేళ్లు, గొర్రె పిల్లలు, మేకలు, బలిసిన గిత్తల్లా వారుంటారు. 19 మీకు కావలసిన కొవ్వునంతా మీరు తినవచ్చు. మీ పొట్టలు నిండేలా మీరు రక్తం తాగవచ్చు. మీ కొరకు నేను ఇచ్చే బలి మాంసం మీరు తిని, తాగుతారు. 20 నా బల్లవద్ద తినటానికి మీకు మాంసం పుష్కలంగా లభిస్తుంది. వారిలో గుర్రాలు, రథసారధులు బలిష్ఠులైన సైనికులు, ఇతర పోరాట యోధులు ఉన్నారు.’” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు.

21 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు, “నేనేమి చేశానో ఇతర దేశాల వారు చూసేలా చేస్తాను. ఆ అన్యదేశాల వారు నన్ను గౌరవించటం మొదలు పెడతారు! ఆ శత్రువు మీద నేను ఉపయోగించిన నా శక్తిని వారు చూస్తారు. 22 ఆ రోజునుంచి ఇశ్రాయేలు వంశం వారు నేను తమ దేవుడగు యెహోవానని తెలుసుకుంటారు. 23 అన్యదేశాలు ఇశ్రాయేలు వంశం వారు ఎందుకు బందీలుగా కొనిపోబడ్డారో తెలుసుకుంటాయి. నా ప్రజలు నామీద తిరుగుబాటు చేసినట్లు వారు తెలుసుకుంటారు. కావున నేను వారికి విముఖుడనయ్యాను. వారి శత్రువులు వారిని ఓడించేలా చేశాను. అందుచే నా ప్రజలు యుద్ధంలో చంపబడ్డారు. 24 వారు పాపం చేసి, వారిని వారు మలినపర్చుకున్నారు. కావున వారు చేసిన పనులకు నేను వారిని శిక్షించాను. నేను వారికి విముఖుడనై, వారికి సహాయం చేయ నిరాకరించాను.”

25 కావున నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “ఇప్పుడు యాకోబు వంశాన్ని దేశ బహిష్కరణ నుండి విముక్తిచేసి తీసుకు వస్తాను. ఇశ్రాయేలు వంశమంతటి మీద దయ చూపుతాను. నా పవిత్ర నామ పరిరక్షణ విషయంలో నేను నా రోషాన్ని తెలియజేస్తాను. 26 ప్రజలు వారి అవమానాలను, వారు నాపై తిరుగుబాటు చేసిన రోజులను వారు మర్చిపోతారు. వారు తమ స్వంత దేశంలో సురక్షితంగా నివసిస్తారు. వారి నెవరూ భయపెట్టరు. 27 అన్య దేశాలనుంచి నా ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాను. వారి శత్రు రాజ్యాల నుండి వారిని కూడదీస్తాను. నేనెంత పవిత్రుడనో అనేక దేశాలు అప్పుడు చూస్తాయి. 28 వారు తమ ఇండ్లను వదిలి ఇతర దేశాలకు బందీలుగా పోయేటట్లు ఇంతకు ముందు నేను చేశాను. తరువాత మళ్లీ వారిని కూడదీసి తమ స్వంత దేశానికి తీసుకొని వచ్చాను. అందువల్ల నేను వారి దేవుడనైన యెహోవానని వారు తెలుసుకుంటారు. 29 ఇశ్రాయేలు వంశం మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. దాని తరువాత మరెన్నడూ నేను నా ప్రజలకు విముఖుడనై ఉండను.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International