Print Page Options
Previous Prev Day Next DayNext

Book of Common Prayer

Daily Old and New Testament readings based on the Book of Common Prayer.
Duration: 861 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:97-120

మేమ్

97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
    దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
    జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
    ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
    కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
    ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
    కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
    అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.

నూన్

105 యెహోవా, నీ వాక్యాలు
    నా బాటను వెలిగించే దీపాల్లా ఉన్నాయి.
106 నీ న్యాయ చట్టాలు మంచివి.
    నేను వాటికి విధేయుడనవుతానని వాగ్దానం చేస్తున్నాను. మరియు నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.
107 యెహోవా, నేను చాలాకాలం శ్రమ అనుభవించాను.
    దయచేసి ఆజ్ఞయిచ్చి, నన్ను మరల జీవించనిమ్ము!
108 యెహోవా, నా స్తుతి అంగీకరించు.
    నీ న్యాయ చట్టాలు నాకు నేర్పించుము.
109 నా జీవితం ఎల్లప్పుడూ ప్రమాదంలోనే ఉంది.
    కాని యెహోవా, నేను నీ ఉపదేశాలు మరచిపోలేదు.
110 దుర్మార్గులు నన్ను ఉచ్చులో పట్టాలని ప్రయత్నించారు
    కాని నేను నీ ఆజ్ఞలకు అవిధేయుడను కాలేదు.
111 యెహోవా, శాశ్వతంగా నేను నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాను.
    అది నన్ను ఎంతో సంతోషింపజేస్తుంది.
112 నీ ఆజ్ఞలు అన్నిటికీ విధేయుడనగుటకు
    నేను ఎల్లప్పుడూ కష్టపడి ప్రయత్నిస్తాను.

సామెహ్

113 స్థిరమైన మనస్సు లేనివాళ్లంటే నాకు అసహ్యం.
    నేను నీ ఉపదేశాలను ప్రేమిస్తున్నాను.
114 నన్ను దాచిపెట్టి, కాపాడుము.
    యెహోవా, నీవు చెప్పే ప్రతిదీ నేను నమ్ముతాను.
115 యెహోవా, దుర్మార్గపు ప్రజలను నా దగ్గరకు రానీయకుము.
    నేను మాత్రం నా దేవుని ఆజ్ఞలకు విధేయుడనవుతాను.
116 యెహోవా, నీ వాగ్దానం ప్రకారం నాకు చేయూత నిమ్ము.
    నేను జీవిస్తాను. నేను నిన్ను నమ్ముకొన్నాను, నన్ను నిరాశపరచకు.
117 యెహోవా, నాకు సహాయం చేయుము. నేను రక్షించబడతాను.
    నీ ఆజ్ఞలను నేను నిరంతరం అధ్యయనం చేస్తాను.
118 యెహోవా, నీ ఆజ్ఞలను ఉల్లంఘించే ప్రతి మనిషినీ నీవు తిప్పికొడతావు.
    ఎందుకంటే ఆ మనుష్యులు నిన్ను అనుసరిస్తామని ఒడంబడిక చేసుకున్నప్పుడు అబద్ధం చెప్పారు.
119 యెహోవా, భూమి మీద దుష్టులను నీవు చెత్తలా చూస్తావు.
    కనుక నేను శాశ్వతంగా నీ ధర్మశాస్త్రాన్ని ప్రేమిస్తాను.
120 యెహోవా, నీవంటే నాకు భయం,
    నీ చట్టాలకు నేను భయపడి వాటిని గౌరవిస్తాను.

కీర్తనలు. 81-82

సంగీత నాయకునికి: గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.

81 సంతోషించండి, మన బలమైన దేవునికి గానం చేయండి.
    ఇశ్రాయేలీయుల దేవునికి సంతోషంతో కేకలు వేయండి.
సంగీతం ప్రారంభించండి.
    గిలక తప్పెట వాయించండి.
    స్వరమండలం, సితారాలను శ్రావ్యంగా వాయించండి.
నెలవంకనాడు గొర్రెపోతు కొమ్ము ఊదండి.
    పౌర్ణమినాడు[a] గొర్రెపోతు కొమ్ము ఊదండి. ఆనాడే మన పండుగ ఆరంభం.
అది ఇశ్రాయేలు ప్రజలకు న్యాయచట్టం.
    ఆ ఆదేశాన్ని యాకోబుకు దేవుడు ఇచ్చాడు.
ఈజిప్టునుండి యోసేపును[b] దేవుడు తీసుకొనిపోయిన సమయంలో
    దేవుడు వారితో ఈ ఒడంబడిక చేసాడు.
ఈజిప్టులో నేను గ్రహించని భాష విన్నాను.
దేవుడు ఇలా చెబుతున్నాడు: “మీ భుజంమీద నుండి బరువు నేను దింపాను.
    నేను మీ మోతగంప పడవేయనిచ్చాను.
మీరు కష్టంలో ఉన్నప్పుడు మీరు సహాయం కోసం వేడుకొన్నారు. నేను మిమ్మల్ని స్వతంత్రుల్ని చేశాను.
    తుఫాను మేఘాలలో దాగుకొని నేను మీకు జవాబు ఇచ్చాను.
    నీళ్ల వద్ద నేను మిమ్మల్ని పరీక్షించాను.”

“నా ప్రజలారా, నా మాట వినండి. నా ఒడంబడిక[c] నేను మీకు యిస్తాను.
    ఇశ్రాయేలూ, నీవు దయచేసి నా మాట వినాలి!
విదేశీయులు పూజించే తప్పుడు దేవుళ్ళను
    ఎవరినీ ఆరాధించవద్దు.
10 నేను యెహోవాను, నేనే మీ దేవుడను.
    మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చిన దేవుడను నేనే.
ఇశ్రాయేలూ, నీ నోరు తెరువు,
    నేను దానిని నింపుతాను.

11 “కాని నా ప్రజలు నా మాట వినలేదు.
    ఇశ్రాయేలు నాకు విధేయత చూపలేదు.
12 కనుక వారు చేయగోరిన వాటిని నేను చేయనిచ్చాను.
    ఇశ్రాయేలీయులు వారి ఇష్టం వచ్చిందల్లా చేసారు.
13 ఒకవేళ నా ప్రజలు గనుక నిజంగా నా మాట వింటే ఇశ్రాయేలు జీవించాలని నేను కోరిన విధంగా గనుక వారు జీవిస్తే,
14     అప్పుడు నేను ఇశ్రాయేలీయుల శత్రువులను ఓడిస్తాను.
    ఇశ్రాయేలీయులకు కష్టాలు కలిగించే ప్రజలను నేను శిక్షిస్తాను.
15 యెహోవా శత్రువులు యెహోవాను కాదంటారు,
    అందుచేత వారు శిక్షించబడతారు.
16 దేవుడు తన ప్రజలకు శ్రేష్ఠమైన గోధుమలు ఇస్తాడు.
    తన ప్రజలకు తృప్తి కలిగేంతవరకు వారికి ఆ కొండ తేనె ఇస్తాడు.”

ఆసాపు స్తుతి కీర్తన.

82 దైవ సమాజంలో దేవుడు తన స్థానాన్ని తీసుకొన్నాడు. సమాజంలో దేవుడు నిలుచున్నాడు.
    ఆ దేవుళ్ళ సమాజంలో ఆయన తీర్పునిస్తాడు.
ప్రజలారా, “ఎంతకాలం మీరు అన్యాయపు తీర్పు తీరుస్తారు?
    దుర్మార్గులు శిక్షించబడకుండా ఎన్నాళ్లు తప్పించుకోనిస్తారు?” అని దేవుడు అంటున్నాడు.

“అనాధలను, పేద ప్రజలను కాపాడండి.
    న్యాయం జరగని పేద ప్రజల, అనాధుల హక్కులను కాపాడండి.
పేదలకు, నిస్సహాయ ప్రజలకు సహాయం చేయండి.
    దుర్మార్గుల బారినుండి వారిని రక్షించండి.

“ఏమి జరుగుతుందో ఇశ్రాయేలు ప్రజలకు తెలియదు.
    వారు గ్రహించరు.
వారు చేస్తున్నది ఏమిటో వారికి తెలియదు.
    వారి ప్రపంచం వారి చుట్టూరా కూలిపోతుంది.”
నేను (దేవుడు) మీతో చెప్పాను,
    “మీరు దైవాలు, మీరందరూ సర్వోన్నతుడైన దేవుని కుమారులు.
కాని మనుష్యులందరూ మరణించినట్టుగానే మీరు కూడా మరణిస్తారు.
    ఇతర నాయకులందరి వలెనే మీరు కూడా మరణిస్తారు.”

దేవా, లెమ్ము. నీవే న్యాయమూర్తివిగా ఉండుము!
    దేవా, రాజ్యములన్నీ నీకు చెందినవే.

ఎస్తేరు 6

మొర్దెకైకి గౌరవ సత్కారాలు

సరిగ్గా ఆ రాత్రి మహారాజుకి నిద్రపట్టలేదు. అందుకని రాజవంశ చరిత్ర గ్రంథాన్ని తెచ్చి తనకి చదివి వినిపించమని ఒక ఉద్యోగికి పురమాయించాడు. (ఆ చరిత్ర గ్రంథంలో ఒక్కొక్క రాజు పరిపాలన కాలంలో సంభవించిన ప్రతి సంఘటనా నమోదు చెయ్యబడుతుంది.) ఆ ఉద్యోగి మహారాజుకి ఆ గ్రంథం చదివి వినిపించాడు. అహష్వేరోషు మహారాజును హత్య చేసేందుకు బిగ్తాను, తెరెషు అనే యిద్దరు రాజభవన ద్వారపాలకులు చేస్తున్న కుట్ర గురించి మొర్దెకై పసిగట్టి, ఆ సమాచారాన్ని ఎపరికో తెలియజెయ్యడం గురించి ఆ ఉద్యోగి చదివాడు.

అప్పుడు మహారాజు, “ఇందుకు ప్రతిఫలంగా ఆ మొర్దెకైకి ఎలాంటి ఆదర సత్కారాలు జరిగాయి?” అని ప్రశ్నించాడు.

“మొర్దెకైకి ఎలాంటి పారితోషికమూ దొరకలేదు మహారాజా” అని ఉద్యోగులు సమాధానమిచ్చారు.

హామాను సరిగ్గా అప్పుడే రాజభవనపు వెలుపటి ఆవరణలో ప్రవేశించాడు. తను నాటింపజేసిన ఉరి కంబం మీద మొర్దెకైని ఉరితీయించేందుకు మహారాజు అనుమతిని కోరేందుకే అతను వచ్చాడు. అతని అడుగుల చప్పుడు మహారాజు విన్నాడు. “ఆవరణ లోపలికి వచ్చింది ఎవరు?” అన్న మహారాజు ప్రశ్నకి రాజోద్యోగులు “హామాను ఆవరణలో వేచివున్నాడు మహారాజా” అని సమాధానమిచ్చారు.

మహారాజు, “అతన్ని లోపలికి తీసుకురండి” అని ఆదేశించాడు.

హామాను లోపలికి వచ్చాక మహారాజు అతన్ని, “మహారాజు ఎవరికైనా గౌరవ సత్కారాలు చెయ్యాలంటే, ఏం చెయ్యాలి హామానూ” అని ప్రశ్నించాడు.

హామాను తనలో తను, “మహారాజు నన్ను కాక మరెవరిని సత్కరించాలని అనుకుంటారు? మహారాజు అంటున్నది నిస్సందేహంగా నన్ను సత్కరించాలనే అయివుంటుంది.” అని తర్కించుకున్నాడు.

దానితో హమాను మహారాజుకి ఇలా సమాధాన మిచ్చాడు: “మహారాజు గౌరవించాలనుకున్న వ్యక్తి విషయంలో యిలా చెయ్యాలి. మహారాజు స్వయంగా ధరించిన రాజవస్త్రాలను సేవకులచేత తెప్పించాలి. మహారాజు స్వారీచేసిన ఒక గుర్రాన్ని కూడా తెప్పించాలి. సేవకులచేత ఆ గుర్రం ముఖాన తురాయివంటి ప్రత్యేకమైన ఒక గుర్తు వేయించాలి. తర్వాత ఆ పట్టు వస్త్రాన్ని, ఆ గుర్రాన్నీ ఒక ప్రముఖ ఉద్యోగి వద్ద వుంచాలి. అప్పుడు మహారాజు సత్కరించాలనుకున్న ఆ వ్యక్తిని ఆ ముఖ్య అధికారి గుర్రం మీద కూర్చోబెట్టి నగర వీధుల్లో ఊరేగిస్తూ, ‘ఈయనకి మహారాజు చేస్తున్న సన్మానం ఇది’ అంటూ చాటాలి.”

10 అప్పుడు మహారాజు హామానుకి ఇలా ఆజ్ఞాశించాడు: “వెన్వెంటనే పోయి, పట్టు వస్త్రాలూ గుర్రము తీసుకువచ్చి. భవనద్వారం దగ్గర కూర్చున్న యూదుడైన మొర్దెకైకి నువ్వు చెప్పిన సత్కార కార్యక్రమమంతా అమలు జరుపుము.”

11 హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. ఆ వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర వీధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.

12 అటు తర్వాత మొర్దెకై రాజభవన ద్వారం దగ్గరికి తిరిగి వెళ్లాడు. కాని, హామాను సిగ్గుతో తల్లడిల్లుతూ హడావిడిగా ఇంటికి వెళ్లిపోయాడు. 13 తన భార్య జెరెషుకీ, తన మిత్రులందరికీ తనకి జరిగిన పరాభవ మంతటిని గురించి వివరంగా చెప్పాడు. హామాను భార్య, అతనికి ఇంతకు ముందు సలహా ఇచ్చిన మిత్రులూ అతనితో ఇలా అన్నారు: “మొర్దెకై యూదుడే అయితే, నీవు జయం పొందడం అసాధ్యం. నీ పతనం యిప్పటికే ప్రారంభమైంది. నీ నాశనం తథ్యం!”

14 హామానుతో వాళ్లింకా మాట్లాడుతూనే పున్నారు. అంతలోనే మహారాజుగారి నపుంసకులు హామాను ఇంటికి వచ్చారు. వాళ్లు హామానుని ఎస్తేరు సన్నద్ధం చేసిన విందుకి వెళ్లేందుకు తొందరచేశారు.

అపొస్తలుల కార్యములు 19:1-10

ఎఫెసులో పౌలు

19 అపొల్లో యింకా కొరింథులోనే ఉన్నాడు. పౌలు భూమార్గం ద్వారా ప్రయాణం చేసి ఎఫెసు చేరుకున్నాడు. అక్కడ కొంత మంది శిష్యుల్ని కలుసుకొని వాళ్ళతో, “మీరు విశ్వసించిన పిదప పవిత్రాత్మను పొందారా?” అని అడిగాడు.

వాళ్ళు, “లేదు! పవిత్రాత్మ ఉన్నాడనేది కూడా మేము వినలేదు” అని సమాధానం చెప్పారు.

పౌలు, “మీరు ఎలాంటి బాప్తిస్మం పొందారు?” అని అడిగాడు.

“యోహాను బాప్తిస్మం” అని వాళ్ళు చెప్పారు.

పౌలు, “యోహాను మారుమనస్సుకు సంబంధించిన బాప్తిస్మము నిచ్చాడు. అతడు, తన తర్వాత రానున్నవాణ్ణి, అంటే యేసును నమ్మమని ప్రజలకు బోధించాడు కదా!” అని అన్నాడు.

ఇది విన్నాక వాళ్ళు యేసు ప్రభువు పేరిట బాప్తిస్మము పొందారు. పౌలు తన చేతుల్ని వాళ్ళ తలలపై ఉంచగానే పరిశుద్ధాత్మ వాళ్ళ మీదికి వచ్చాడు. వాళ్ళంతా తమకు రాని భాషల్లో మాట్లాడారు. దేవుడు ప్రేరేపించిన సత్యాలు ప్రకటించారు. అక్కడ మొత్తం పన్నెండు మంది ఉన్నారు.

పౌలు యూదుల సమాజమందిరానికి మూడు నెలలు వెళ్ళాడు. దేవుని రాజ్యాన్ని గురించి ధైర్యంగా వాదించి వాళ్ళను ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని కొందరు నమ్మలేదు. తమ పట్టు వదులుకోలేదు. పైగా ప్రభువు చూపిన మార్గాన్ని బహిరంగంగా దూషించారు. అందువల్ల పౌలు వాళ్ళను వదిలి, శిష్యుల్ని తన వెంట పిలుచుకు వెళ్ళాడు. అతడు, తురన్ను ఉపన్యాస శాలలో ప్రతి రోజూ తర్కించేవాడు. 10 ఇలా రెండు సంవత్సరాలు గడిచాయి. ఫలితంగా ఆసియ ప్రాంతాల్లో నివసిస్తున్న యూదులు, గ్రీకులు అందరూ ప్రభువు సందేశాన్ని విన్నారు.

లూకా 4:1-13

సైతాను యేసును శోధించటం

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.

యేసు,

“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)

ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.

యేసు,

“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
    ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)

అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.

సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.

10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)

11 అంతేకాక:

‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
    నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)

అని వ్రాయబడింది” అని అన్నాడు.

12 యేసు,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)

అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International