Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెషయా 34-36

దేవుడు తన శత్రువులను శిక్షిస్తాడు

34 సకల రాజ్యములారా, దగ్గరగా వచ్చి, వినండి. ప్రజలారా, మీరంతా దగ్గరగా ఉండి వినండి. భూమి, భూమిమీద ఉన్న ప్రజలు అందరూ ఈ సంగతులు వినాలి. సకల రాజ్యాల మీదా, వాటి సైన్యాల మీదా యెహోవా కోపంగా ఉన్నాడు. యెహోవా వాళ్లందర్ని నాశనం చేస్తాడు వాళ్లందరు చంపబడేట్టు యెహోవా చేస్తాడు. వారి శరీరాలు బయట పారవేయబడతాయి. ఆ శవాలనుండి కంపువస్తుంది. వారి రక్తం కొండల నుండి ప్రవహిస్తుంది. ఆకాశాలు కాగితం చుట్టలా చుట్టబడతాయి. నక్షత్రాలు చచ్చి, ద్రాక్ష లేక అంజూర చెట్ల ఆకులు రాలినట్లు రాలిపోతాయి. ఆకాశంలోని నక్షత్రాలన్నీ కరిగి పోతాయి. “ఆకాశంలో నా ఖడ్గం రక్తసిక్తమైనప్పుడు ఇది జరుగుతుంది” అని యెహోవా చెబుతున్నాడు.

చూడండి! యెహోవా ఖడ్గం ఎదోముగుండా దూసుకొనిపోతుంది. ఆ ప్రజలు దోషులని యెహోవా తీర్పు చెప్పాడు, గనుక వారు చావాల్సిందే. ఎందుకంటే, బొస్రాలో, ఎదోములో చంపబడే సమయం ఒకటి ఉండాలని యెహోవా నిర్ణయించాడు. కనుక పొట్టేళ్లు, పశువులు, బలమైన కోడెదూడలు చంపబడతాయి. దేశం వాటి రక్తంతో నిండిపోతుంది. దుమ్ము వాటి కొవ్వుతో నిండిపోతుంది.

శిక్షా సమయం ఒకటి యెహోవా ఏర్పాటు చేశాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి. ప్రజలు సీయోనుకు చేసిన కీడులకు వారు బదులు చెల్లించటానికి యెహోవా ఒక సంవత్సరాన్ని ఎంచుకొన్నాడు. ఎదోము నదులు వేడి తారులా ఉంటాయి. ఎదోము నేల మండుతున్న గంధకంలా ఉంటుంది. 10 అగ్ని రాత్రింబవళ్లు మండుతూ ఉంటుంది. అగ్నిని ఎవ్వరూ ఆర్పివేయలేరు. ఎదోమునుండి పొగ శాశ్వతంగా లేస్తుంది. ఆ దేశం శాశ్వతంగా ఎప్పటికీ నాశనం చేయబడుతుంది. ఆ దేశంగుండా మళ్లీ ఎవ్వరూ ఎన్నడూ ప్రయాణం చేయరు. 11 పక్షులు, చిన్న జంతువులు ఆ దేశాన్ని స్వంతంగా వాడుకొంటాయి. గుడ్లగూబలు, కాకులు అక్కడ నివసిస్తాయి. ఆ దేశం “శూన్య ఎడారి” అని పిలువబడుతుంది. 12 స్వతంత్రులు, నాయకులు అంతా పోతారు. వారు పాలించేందుకు అక్కడ ఏమీ మిగిలి ఉండదు.

13 అక్కడి అందమైన గృహాలన్నింటిలో ముళ్ల కంపలు, పిచ్చిపొదలు పెరుగుతాయి. అడవి కుక్కలు, గుడ్లగూబలు ఆ ఇండ్లలో నివసిస్తాయి. అడవి జంతువులు అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొంటాయి. అక్కడ పెరిగే గడ్డి దుబ్బుల్లో పెద్ద పక్షులు నివసిస్తాయి. 14 అడవి పిల్లులు నక్కలతో కలిసి అక్కడ నివసిస్తాయి. అడవి మేకలు వాటి స్నేహితులను పిలుచుకొంటాయి. రాత్రులు తిరిగే జంతువులు అక్కడ విశ్రాంతి స్థలం చూచుకొంటాయి. 15 పాములు అక్కడ పుట్టలు పెడ్తాయి. పాములు అక్కడ గుడ్లు పెడ్తాయి. గుడ్లు పగులుతాయి పాము పిల్లలు ఆ చీకటి స్థలాల్లో పాకుతాయి. చచ్చిన శవాలను తినే పక్షులు, ఆడవాళ్లు వారి స్నేహితురాళ్లను కలుసుకొన్నట్టుగా అక్కడ కలుసుకొంటాయి.

16 యెహోవా గ్రంథాన్ని చూడండి. అక్కడ ఏమి వ్రాసి ఉందో చదవండి. ఏమీ తప్పిపోలేదు. ఆ జంతువులు కలిసి ఉంటాయని ఆ గ్రంథములో వ్రాయబడిఉంది. వాటిని ఒక్క చోట చేరుస్తానని దేవుడు చెప్పాడు. కనుక దేవుని ఆత్మ వాటిని ఒక్క చోట చేర్చటం జరుగుతుంది. 17 వాటి విషయంలో చేయాల్సిన దాన్ని దేవుడు నిర్ణయం చేశాడు. అప్పుడు దేవుడు వాటికి ఒక చోటు నిర్ణయించాడు. దేవుడు ఒక గితగీసి, వాటి స్థలం వాటికి చూపించాడు. అందుచేత ఆ దేశం ఆ జంతువులకు శాశ్వతంగా స్వంతం. సంవత్సరం వెంబడి సంవత్సరం అవి అక్కడే నివసిస్తాయి.

దేవుడు తన ప్రజలను ఓదారుస్తాడు

35 ఎండిన అరణ్యం సంతోషిస్తుంది. అరణ్యం ఉల్లసించి, కస్తూరి పుష్పంలా పూస్తుంది. అరణ్యం వికసించే పూలతో నిండిపోయి దాని సంతోషాన్ని వ్యక్తం చేయటం మొదలు పెడ్తుంది. అరణ్యం ఆనందంతో నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. లెబానోను అరణ్యంలా, కర్మెలు పర్వతంలా, షారోనులోయలా అరణ్యం సౌందర్యంగా ఉంటుంది. ప్రజలంతా యెహోవా మహిమ[a] చూస్తారు గనుక ఇలా జరుగుతుంది. ప్రజలు మన యెహోవా మాహాత్మ్యం చూస్తారు.

బలహీనమైన చేతుల్ని మళ్లీ బలపర్చండి. బలహీనమైన మోకాళ్లను బలపర్చండి. ప్రజలు భయంతో, కలవరపడుతున్నారు. “బలంగా ఉండండి, భయపడవద్దు” అని ఆ మనుష్యులతో చెప్పండి. చూడండి, మీ దేవుడు వచ్చి, మీ శత్రువులను శిక్షిస్తాడు. ఆయన వచ్చి మీ బహుమానం మీకు ఇస్తాడు. యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడు. అప్పుడు గుడ్డివాళ్లు మళ్లీ చూస్తారు. వారి నేత్రాలు తెరువబడతాయి. అప్పుడు చెవిటివాళ్లు వినగలుగుతారు. వారి చెవులు తెరువబడుతాయి. కుంటివాళ్లు లేడిలా గంతులు వేస్తారు. ఇప్పుడు మాట్లాడలేని మూగవాళ్లు, వారి కంఠం ఎత్తి ఆనంద గీతాలు పాడుతారు. అరణ్యంలో జల ఊటలు పారటం మొదలైనప్పుడు ఇది జరుగుతుంది. ఎండిన భూమిలో నీటి ఊటలు ప్రవహిస్తాయి. ఇప్పుడు నీళ్లలా కనిపించే ఎండమావుల్ని ప్రజలు చూస్తున్నారు. కానీ ఆ సమయంలో నిజంగానే నీళ్ల కొలనులు ఉంటాయి. ఎండిన భూమిలో బావులు ఉంటాయి. భూమిలో నుండి నీళ్లు ఉబుకుతాయి. ఒకప్పుడు అడవిమృగాలు ఏలిన చోట ఎత్తయిన నీటి మొక్కలు పెరుగుతాయి.

ఆ సమయంలో అక్కడ ఒక రాజమార్గం ఉంటుంది. ఈ రాజమార్గం “పవిత్ర రాజమార్గం” అని పిలువబడుతుంది. ఆ రాజమార్గంలో చెడ్డవాళ్లను నడవనీయరు. తెలివి తక్కువ వాళ్లెవరూ ఆ మార్గానికి వెళ్లరు. మంచివాళ్లు మాత్రమే ఆ మార్గంలో వెళ్తారు. ఆ మార్గంలో అపాయాలు ఏమీ ఉండవు. ప్రజలకు హానిచేసేందుకు ఆ మార్గంలో సింహాలు ఉండవు. ప్రమాదకరమైన జంతువులు ఏమీ ఆ మార్గంలో ఉండవు. ఆ మార్గం దేవుడు రక్షించే ప్రజలకోసమే ఉంటుంది.

10 దేవుడు తన ప్రజలను స్వతంత్రులను చేస్తాడు. ఆ ప్రజలు ఆయన దగ్గరకు తిరిగి వస్తారు. ప్రజలు సీయోను లోనికి వచ్చినప్పుడు సంతోషిస్తారు. ఆ ప్రజలు ఎప్పటికీ సంతోషంగా ఉంటారు. వారి సంతోషం వారి తలల మీద ఒక కిరీటంలా ఉంటుంది. వారి సంతోషం, ఆనందం వారిని సంపూర్ణంగా నింపేస్తాయి. విచారం, దుఃఖం దూరదూరాలకు పారిపోతాయి.

అష్షూరీయులు యూదాను ముట్టడించుట

36 యూదాకు హిజ్కియా రాజు. అష్షూరుకు సన్హెరీబు రాజు. హిజ్కియా రాజైన పదునాలుగవ సంవత్సరంలో సన్హెరీబు యూదా పట్టణాల మీద యుద్ధం చేశాడు. మరియు సన్హెరీబు ఆ పట్టణాలను ఓడించేశాడు. యెరూషలేము మీద యుద్ధం చేయటానికి సన్హెరీబు తన సైన్యాధిపని పంపించాడు. ఆ సైన్యాధిపతి లాకీషును విడిచి, యెరూషలేములోని హిజ్కియా దగ్గరకు వెళ్లాడు. ఆ సైన్యాధిపతి బలమైన తన సైన్యాన్ని తనతో కూడా నడిపించాడు. ఆ సైన్యాధిపతి, అతని సైన్యం చాకలివాని పొలం దగ్గర ఉన్న దారికి వెళ్లారు. మెట్ట మీది కొలను నుండి వచ్చే జంట కాల్వల దగ్గర ఈ మార్గం ఉంది.

ఆ సైన్యాధిపతితో మాట్లాడుటకు ముగ్గురు మనుష్యులు యెరూషలేము నుండి బయటకు వెళ్లారు. వీరు హిల్కీయా కుమారుడు ఎల్యాకీము, ఆసాపు కుమారుడు యోవాహు, షెబ్నా, ఎల్యాకీము రాజభవన సంరక్షకుడు. యెహోవా అధికార పత్రాలు భద్రపరచేవాడు; షెబ్నా రాజ్యపు కార్యదర్శి.

సైన్యాధిపతి వారితో చెప్పాడు, “మీరు రాజైన హిజ్కియాతో ఈ సంగతులు చెప్పండి:

“మహారాజు, అష్షూరు రాజు చెబుతున్నాడు, మీ సహాయం కోసం మీరు దేనిని నమ్ముకొంటున్నారు? మీరు గనుక మీ బలాన్నీ, తెలివిగల మీ యుద్ధ తంత్రాలనూ నమ్ముకొంటే అవన్నీ నిష్ప్రయోజనమే అని నేను చెబుతున్నాను. అవి వట్టి మాటలు తప్ప ఇంకేమీ లేదు. కనుక మీరు నాకు విరోధంగా ఎందుకు యుద్ధం చేస్తారు? ఇప్పుడు నేను మళ్లీ అడుగుతున్నాను, మీ సహాయం కోసం మీరు ఎవరిని నమ్ముకొంటున్నారు? మీ సహాయం కోసం మీరు ఈజిప్టు మీద ఆధారపడ్తున్నారా? ఈజిప్టు విరిగిపోయిన కర్రలా ఉంది. ఆధారంగా మీరు దానిమీద ఆనుకొంటే, అది మీకు బాధ మాత్రమే కలిగిస్తుంది, మీ చేతికి గాయం చేస్తుంది. ఈజిప్టు రాజు ఫరో సహాయంకోసం అతని మీద ఆధారపడే వాళ్లెవ్వరూ అతణ్ణి నమ్మలేరు.

“అయితే మీరు అనవచ్చు, ‘మా సహాయం కోసం మేం మా దేవుడు యెహోవాను విశ్వసిస్తున్నాం’ అని. అయితే యెహోవా బలిపీఠాలను, ఆరాధించే ఉన్నత స్థలాలను హిజ్కియా నాశనం చేసేశాడు అని నేనంటున్నాను. ఇది నిజం, అవునా? యూదాకు, యెరూషలేముకు హిజ్కియా ఈ సంగతులు చెప్పటం సత్యం, ‘ఇక్కడ యెరూషలేములో ఒకే బలిపీఠం దగ్గర మీరు ఆరాధిస్తారు.’

“అయినా మీరు ఇంకా యుద్ధం చేయాలనే అనుకొంటే, నా ప్రభువు, అష్షూరు రాజు మీతో ఈ ఒడంబడిక చేస్తాడు! యుద్ధ రంగంలో స్వారీ చేయగల రెండువేల మంది మీకు ఉంటే, నేను మీకు అన్ని గుర్రాలు ఇస్తాను. అలాగైనా సరే, నా యజమాని బానిసల్లో ఒక్కడిని, చివరికి ఒక చిన్న అధికారిని కూడా మీరు ఓడించలేరు. అందుచేత ఈజిప్టు సైనికుల మీద రథాల మీద ఎందుకు మీరు ఆధారపడతారు?

10 “మరియు నేను వచ్చి ఈ దేశంలో యుద్ధం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడని కూడ జ్ఞాపకం ఉంచుకోండి. నేను పట్ణణాలను నాశనం చేసినప్పుడు యెహోవా నాతో ఉన్నాడు. ‘లేచి నిలబడే ఈ దేశానికి వెళ్లి, దీన్ని నాశనం చేయి’” అని యెహోవా నాతో చెప్పాడు.

11 ఎల్యాకీము, షెబ్నా, యోవాహు, “దయచేసి సిరియా భాషలో మాతో మాట్లాడు. మా యూదా భాషలో మాతో మాట్లాడవద్దు. నీవు యూదా భాషలో మాట్లాడితే, నగరం గోడమీద మనుష్యులు అర్థం చేసుకొంటారు” అని ఆ సైన్యాధిపతితో చెప్పారు.

12 కానీ సైన్యాధిపతి, “మీకూ, మీ యజమానుడు హిజ్కియాకూ మాత్రమే చెప్పమని మా యజమాని నన్ను పంపించలేదు. ఆ గోడల మీద కూర్చొన్న మనుష్యులతో కూడ చెప్పమని నా యజమాని నన్ను పంపించాడు. ఆ మనుష్యులకు ఆహారంగాని భోజనం గాని ఉండదు. వాళ్లు కూడా మీలాగే, వారి మల మూత్రాలనే తిని, త్రాగుతారు” అని చెప్పాడు.

13 అప్పుడు సైన్యాధికారి లేచి, పెద్ద స్వరంతో మాట్లాడాడు. అతడు యూదా భాషలో మాట్లాడాడు. 14 సైన్యాధికారి చెప్పాడు, “మహారాజు అష్షూరు రాజు మాటలు వినండి:

“హిజ్కియా మిమ్మల్ని మోసం చేయనివ్వకండి. అతడు మిమ్మల్ని రక్షించలేడు. 15 ‘యెహోవా మీద విశ్వాసం ఉంచండి, యోహోవా మనలను రక్షిస్తాడు. అష్షూరు రాజు మన పట్టణం గెలవకుండా యెహోవా చేస్తాడు’ అని హిజ్కియా చెప్పినప్పుడు అతని మాటలు నమ్మవద్దు.

16 “హిజ్కియా చెప్పే ఆ మాటలు వినవద్దు. అష్షూరు రాజు మాట వినండి. అష్షూరు రాజు చెబుతున్నాడు, ‘మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. ప్రజలారా, మీరు పట్టణం వదలి పెట్టి నా దగ్గరకు రండి. అప్పుడు ప్రతి ఒక్కరు స్వతంత్రులుగా ఇంటికి వెళ్లవచ్చును. ప్రతి ఒక్కరు తన స్వంత ద్రాక్షవల్లినుండి ద్రాక్షపండ్లు తినేందుకు స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత అంజూరపు చెట్టు ఫలాలు తినే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతి వ్యక్తీ తన స్వంత బావి నుండి నీళ్లు తాగే స్వేచ్ఛ ఉంటుంది. 17 నేను వచ్చి, మీ స్వంత దేశంలాంటి దేశానికి మిమ్మల్ని ఒక్కొక్కరిని తీసుకొని వెళ్లేంత వరకు మీరు ఇలా చేయవచ్చు. ఆ క్రొత్త దేశంలో మీకు మంచి ధాన్యం, క్రొత్త ద్రాక్షరసం ఉంటాయి. ఆ దేశంలో భోజనం, ద్రాక్షవనాలు ఉంటాయి.’

18 “హిజ్కియా మిమ్మల్ని వెర్రి వాళ్లనుగా చేయనియ్యకండి. ‘యెహోవా మనలను రక్షిస్తాడు.’ అని అతడు అంటాడు. అయితే యితర రాజ్యాల్లోని యితర దేవుళ్లు ఎవరైనా సరే వారిని అష్షూరు బలంనుండి రక్షించారా అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు. 19 ఆ ప్రజల్లో ప్రతి ఒక్కరినీ మేము ఓడించాం. హమాతు, అర్పదు దేవుళ్లు ఏమయ్యారు? వారు ఓడించబడ్డారు. సెపర్యయీం దేవతలు ఎక్కడ? వారు ఓడించబడ్డారు. సమరయ దేవుళ్లు ఆ ప్రజలను నా బలంనుండి రక్షించారా? లేదు. 20 ఆ రాజ్యాలన్నింటిలో నా బలం నుండి తన ప్రజలను రక్షించగలిగిన ఒక్క దేవుని పేరు నాకు చెప్పండి. నేను వాళ్లందర్నీ ఓడించేశాను. అందుచేత నా బలంనుండి యెహోవా యెరూషలేమును రక్షించజాలడు.”

21 యెరూషలేములోని ప్రజలు చాలా మౌనంగా ఉన్నారు. ఆ సైన్యాధికారికి వారు జవాబు చెప్పలేదు. (హిజ్కియా ప్రజలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. “ఆ సైన్యాధికారికి జవాబు చెప్పవద్దు” అని హిజ్కియా ఆజ్ఞాపించాడు.)

22 అప్పుడు రాజభవన అధికారి (హిజ్కియా కుమారుడు ఎల్యాకీము) రాజ్య కార్యదర్శి (షెబ్నా) అధికార పత్రాలు భద్రపరిచే అధికారి (ఆసాపు కుమారుడు యోవాహు) వారి బట్టలు చింపివేశారు. (వారు చాలా విచారించినట్టు ఇది సంకేతం) ఆ ముగ్గురు మనుష్యులూ హిజ్కియా దగ్గరకు వెళ్లి, సైన్యాధికారి తమతో చెప్పిన సంగతులన్నీ అతనితో చెప్పారు.

కొలొస్సయులకు 2

మీకోసం, లవొదికయలో ఉన్నవాళ్ళకోసం, నన్ను ఇంతవరకూ కలుసుకోకుండా ఉన్నవాళ్ళకోసం నేను ఎంత శ్రమిస్తున్నానో మీరు గ్రహించాలని నా కోరిక. మీ హృదయాలు ధైర్యంతో నిండిపోవాలనీ, ప్రేమతో మీరు ఐక్యము కావాలనీ నా అభిలాష. అప్పుడు మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతారు. అదే ఒక సంపద. ఈ విధంగా మీరు దేవుణ్ణి గురించి, అంటే క్రీస్తును గురించి రహస్య జ్ఞానం పొందుతారు. క్రీస్తులో వివేకము, జ్ఞానము అనే సంపదలు దాగి ఉన్నాయి.

తియ్యటి మాటలతో మిమ్మల్నెవ్వరూ మోసం చెయ్యకుండా ఉండాలని మీకీ విషయాలు చెబుతున్నాను. నేను శరీరంతో అక్కడ మీ దగ్గర లేకపోయినా నా ఆత్మ మీ దగ్గరే ఉంది. మీ క్రమశిక్షణను, క్రీస్తు పట్ల మీకున్న సంపూర్ణ విశ్వాసాన్ని చూసి నా ఆత్మ ఆనందిస్తోంది.

క్రీస్తు వల్ల సంపూర్ణమైన జీవితం

మీరు యేసు క్రీస్తును ప్రభువుగా స్వీకరించినట్లే ఆయనలో ఐక్యమై జీవించండి. మీ వేర్లు ఆయనలో నాటి, ఆయనలో అభివృద్ధి చెందుతూ జీవించండి. మీకు ఉపదేశించిన విధంగా సంపూర్ణమైన విశ్వాసంతో ఉండండి. మీ కృతజ్ఞత పొంగిపోవాలి.

మోసంతో, పనికిరాని తత్వజ్ఞానంతో మిమ్మల్ని ఎవ్వరూ బంధించకుండా జాగ్రత్త పడండి. వాళ్ళ తత్వజ్ఞానానికి మూలం క్రీస్తు కాదు. దానికి మానవుని సాంప్రదాయాలు, అతని నైజంవల్ల కలిగిన నియమాలు కారణం. ఎందుకంటే, దేవుని ప్రకృతి క్రీస్తులో సంపూర్ణంగా మానవ రూపంతో జీవిస్తోంది. 10 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీకు ఆ సంపూర్ణత లభించింది. క్రీస్తు అన్ని శక్తులకూ, అన్ని అధికారాలకూ అధిపతి.

11 ఆయనతో మీకు కలిగిన ఐక్యతవల్ల మీరు సున్నతి పొందారు. ఈ సున్నతి మానవులు చేసింది కాదు. ఇది క్రీస్తు స్వయంగా చేసిన సున్నతి. పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి విముక్తి పొందటమే ఈ సున్నతి. 12 మీరు బాప్తిస్మము పొందటంవల్ల క్రీస్తులో సమాధి పొందారు. క్రీస్తును బ్రతికించిన దేవుని శక్తి పట్ల మీకున్న విశ్వాసం వలన మిమ్మల్ని కూడా దేవుడు ఆయనతో సహా బ్రతికించాడు. అంటే బాప్తిస్మము వల్ల యిది కూడా సంభవించింది. 13 మీరు చేసిన పాపాలవల్ల, పాపాలతో కూడుకొన్న ఈ దేహం నుండి స్వేచ్ఛ పొందకుండా మీరు గతంలో ఆత్మీయంగా మరణించారు. కాని దేవుడు మీ పాపాలన్నిటినీ క్షమించి, క్రీస్తుతో సహా మిమ్మల్ని బ్రతికించాడు. 14 ఆ పద్ధతులను గురించి, నియమాలను గురించి మనం వ్రాత మూలంగా అంగీకరించిన పత్రాన్ని, అది మనకు వ్యతిరేకంగా ఉంది కనుక, ఆయన దానిని తీసుకెళ్ళి మేకులతో సిలువకు కొట్టాడు. 15 అధికారాలను, శక్తుల్ని పనికి రాకుండా చేసి వాటిని బహిరంగంగా హేళన చేసి, సిలువతో వాటిపై విజయం సాధించాడు.

మానవకల్పిత నియమాలు పాటించకు

16 అందువల్ల అన్నపానాల విషయంలో గాని, మత సంబంధమైన పండుగ విషయాల్లో గాని, అమావాస్య పండుగ విషయంలో గాని, యూదుల విశ్రాంతి రోజు విషయంలో కాని యితరులు మీపై తీర్పు చెప్పకుండా జాగ్రత్తపడండి. 17 ఇవి నీడలా రానున్న వాటిని సూచిస్తున్నాయి. కాని సత్యం క్రీస్తులో ఉంది. 18 కొందరు తాము దివ్యదర్శనం చూసామని, కనుక తాము గొప్ప అని చెప్పుకొంటారు. అతి వినయం చూపుతూ దేవదూతల్ని పూజిస్తుంటారు. వాళ్ళు మిమ్మల్ని అయోగ్యులుగా పరిగణించకుండా జాగ్రత్తపడండి. వాళ్ళు ప్రాపంచిక దృష్టితో ఆలోచిస్తారు. కనుక, నిష్కారణంగా గర్విస్తూ ఉంటారు. 19 శిరస్సు కారణంగా కీళ్ళు, నరాలు దేహాన్ని ఒకటిగా ఉంచి ఆ దేహానికి శక్తిని కలిగిస్తున్నాయి. శిరస్సు కారణంగా దేవుని ఆదేశానుసారం ఆ దేహం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాంటి శిరస్సుతో వాళ్ళు సంబంధం తెంచుకొన్నారు.

20 మీరు క్రీస్తుతో మరణించినప్పుడే ఈ ప్రపంచం యొక్క ప్రాథమిక నియమాల నుండి స్వేచ్ఛను పొందారు. మరి అలాంటప్పుడు ఈ ప్రపంచానికి చెందినవాళ్ళైనట్లు, ఆ ప్రాథమిక నియమాలను ఎందుకు పాటిస్తున్నారు? 21 “ఇది వాడకు, దాన్ని రుచి చూడకు, ఇది ముట్టుకోకు.” 22 ఈ నియమాలు మానవుల ఆజ్ఞలతో, బోధలతో సృష్టింపబడినవి కనుక అవి వాడుక వల్ల నశించిపోయే వస్తువుల్లాంటివి. 23 ఇలాంటి నియమాలు పైకి తెలివైనవిగా కనిపిస్తాయి. అవి దొంగపూజలకు, దొంగవినయం చూపటానికి, దేహాన్ని అనవసరంగా, కఠినంగా శిక్షించటానికి ఉపయోగపడవచ్చు. కాని శారీరక వాంఛల్ని అదుపులో పెట్టుకోవటానికి పనికి రావు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International