Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 15

ఒడంబడిక పెట్టె యెరూషలేముకు తేబడుట

15 దావీదు నగరంలో తన కొరకు దావీదు ఇండ్లు కట్టుకున్నాడు. తరువాత ఒడంబడిక పెట్టెను పెట్టటానికి అతడొక ప్రదేశాన్ని సిద్ధం చేశాడు. అతడక్కడ ఒక గుడారం దాని కొరకు నిర్మించాడు. “ఒడంబడిక పెట్టెను మోయటానికి కేవలం లేవీయులు మాత్రమే అనుమతించబడ్డారు. ఒడంబడిక పెట్టెను మోయటానికి, ఆయనను సేవించడానికి యెహోవా లేవీయులను శాశ్వతంగా ఎంపిక చేశాడు” అని దావీదు చెప్పాడు.

తాను ఏర్పాటు చేసిన స్థలానికి ఒడంబడిక పెట్టెను తేవటానికి యెరూషలేము ప్రజలందరినీ దావీదు సమావేశపర్చాడు. అహరోను సంతతి వారిని, లేవీయులను దావీదు పిలిపించాడు.

కహాతు సంతతివారు నూట ఇరవై మంది వున్నారు. వారి నాయకుని పేరు ఊరియేలు.

మెరారి వంశీయులు రెండు వందల ఇరవై మంది వున్నారు. అశాయా వారికి పెద్ద.

గెర్షోను కుటుంబం వారు నూటముప్పది మంది వున్నారు. యోవేలు వారి అధిపతి.

ఎలీషాపాను సంతతివారు రెండువందల మంది. షెమయా వారి నాయకుడు.

హెబ్రోను సంతతివారు ఎనుబది మంది. ఎలీయేలు వారి నాయకుడు.

10 ఉజ్జీయేలు కుటుంబం వారు నూట పన్నెండు మంది. అమ్మీనాదాబు వారి పెద్ద.

దావీదు యాజకులతో, లేవీయులతో సంప్రదించటం

11 యాజకులైన సాదోకును, అబ్యాతారును తన వద్దకు రమ్మని దావీదు కబురు పంపాడు. మరియు లేవీయులైన ఊరియేలు, అశాయా, యోవేలు, షెమయా, ఎలీయేలు, అమ్మీనాదాబు అనువారిని కూడ దావీదు తన వద్దకు రమ్మని కబురు పంపాడు. 12 దావీదు వారితో ఇలా అన్నాడు: “మీరంతా లేవి సంతతి వారికి నాయకులు. మీరు, మీతోటి వారైన ఇతర లేవీయులు పవిత్రంగా వుండి, ఒడంబడిక పెట్టెను నేను ఏర్పాటు చేసిన స్థలానికి తీసుకొనిరండి. 13 కిందటి సారి ఒడంబడిక పెట్టెను ఎలా తీసుకొని రావాలి అనే విషయం మనం యెహోవాను అడుగలేదు. లేవీయులైన మీరు ఒడంబడిక పెట్టెను మోయలేదు. అందువల్ల యెహోవా మనల్ని శిక్షించాడు.”

14 పిమ్మట ఇశ్రాయేలు దేవుని ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి యాజకులు, లేవీయులు శుద్ధియైనారు. 15 ఒడంబడిక పెట్టెను మోషే ఆజ్ఞాపించిన విధంగా వారి భుజాలపై మోయటానికి లేవీయులు ప్రత్యేకమైన కర్రలను వినియోగించారు. యెహోవా సెలవిచ్చిన ప్రకారమే వారు ఆ ఒడంబడిక పెట్టెను మోసారు.

గాయకులు

16 వారి సోదరులైన గాయకులను తీసుకొని రమ్మని దావీదు లేవీయులతో చెప్పాడు. గాయకులంతా వీణలు, తంబూరాలు, సితారలు, తాళాలు వాయిస్తూ ఆనందంతో హాయిగా పాడాలి.

17 అప్పుడు లేవీయులు హేమానును, అతని సోదరులను, ఆసాపును, ఏతానును తీసుకొని వచ్చారు. హేమాను తండ్రి పేరు యోవేలు. ఆసాపు తండ్రి పేరు బెరెక్యా. ఏతాను తండ్రి పేరు కూషాయాహు. వీరంతా మెరారి సంతతివారు. 18 లేవీయులో రెండవ వర్గం వారు కూడ వున్నారు. వారు జెకర్యా, యహాజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, బెనాయా, మయశేయా, మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు. వీరంతా లేవీయులకు చెందిన ద్వారపాలకులు.

19 గాయకులైన హేమాను, ఆసాపు, ఏతాను కంచు తాళాలు వాయించేందుకు నియమితులయ్యారు. 20 జెకర్యా, అజీయేలు, షెమీరామోతు, యెహీయేలు, ఉన్నీ, ఏలీయాబు, మయశేయా, బెనాయా హెచ్చు స్థాయి వీణలు వాయించాలి. 21 మత్తిత్యా, ఎలీప్లేహు, మిక్నేయాహు, ఓబేదెదోము, యెహీయేలు మరియు అజజ్యాహు తగ్గుస్థాయి వీణలు వాయించటానికి నియమింప బడ్డారు. శాశ్వతంగా అది వారిపని. 22 లేవీయుల నాయకుడు కెనన్యా సంగీత కార్యక్రమ నిర్వాహకుడు. కెనన్యా ఈ కార్యక్రమం నిర్వహించటానికి కారణం అతడు ప్రసిద్ధ గాయకుడు కావటమే.

23 ఒడంబడిక పెట్టెకు కాపలాదారులుగా నియమితులైన వారిలో బెరెక్యా, ఎల్కానా వున్నారు. 24 యాజకులైన షెబన్యా, యెహోషాపాతు, నెతనేలు, అమాశై, జెకర్యా, బెనాయా మరియు ఎలీయెజెరు ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదారు. ఓబేదెదోము, యెహీయాలిరువురూ కూడ ఒడంబడిక మందసానికి కాపలాదార్లు.

25 దావీదు, ఇశ్రాయేలు పెద్దలు, వెయ్యిమంది సైనికులు గల దళాలకు నాయకులు ఒడంబడిక పెట్టెను తీసుకొని రావటానికి వెళ్లారు. వారు దానిని ఓబేదెదోము ఇంటినుండి బయటకు తెచ్చినప్పుడు చాలా ఆనందంగా వున్నారు. 26 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులకు దేవుడు సహాయపడ్డాడు. వారు ఏడు ఎద్దులను, ఏడు పొట్టేళ్లను బలియిచ్చారు. 27 ఒడంబడిక పెట్టెను మోసిన లేవీయులంతా సన్నని నారబట్టలు ధరించారు. భజన సంకీర్తన నిర్వాహకుడుగా వున్న కెనన్యా, ఇతర గాయకులు సన్నని నారబట్టలు ధరించారు. దావీదు కూడ సన్నని నారబట్టలు ధరించాడు. సన్నని నారతో నేసిన ఏఫోదు అనబడే ఒక అంగీని కూడా దావీదు ధరించాడు.

28 ఇశ్రాయేలు ప్రజలు జయజయ ధ్వనులు చేస్తూ, పొట్టేలు కొమ్ములు, బాకాలు వూదుతూ, వీణలు, స్వరమండలాలు, తాళాలు వాయిస్తూ ఒడంబడిక పెట్టెను తీసుకొని వచ్చారు.

29 దేవుని ఒడంబడిక పెట్టె దావీదు నగరం చేరినప్పుడు మీకాలు కిటికీ గుండా చూసింది. మీకాలు సౌలు కుమార్తె. రాజైన దావీదు చిందులేస్తూ పాటలు పాడటం ఆమె చూసింది. అతనినొక మూర్ఖునిగా భావించడంతో దావీదు పట్ల ఆమెకున్న గౌరవం పోయింది.

యాకోబు 2

పక్షపాతం చూపరాదు

నా సోదరులారా! తేజోవంతుడైన మన యేసుక్రీస్తు ప్రభువును విశ్వసిస్తున్న మీరు పక్షపాతం చూపకూడదు. బంగారు ఉంగరాలు, మంచి దుస్తులు వేసుకొన్నవాడొకడు, మాసిన దుస్తులు వేసుకొన్నవాడొకడు మీ సమావేశానికి వస్తారనుకోండి. అప్పుడు మీరు మంచి దుస్తులు వేసుకొన్నవాని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనపరుస్తూ, “రండి! ఈ మంచి స్థానంలో కూర్చోండి” అని అంటూ, పేదవానితో, “నీవక్కడ నిలబడు!” అనిగాని, “నా కాళ్ళ దగ్గర కూర్చో” అనిగాని అంటే, మీరు వ్యత్యాసము చూపుతున్నట్లే కదా! దుర్బుద్ధితో తీర్పు చెప్పినట్లే కదా!

నా ప్రియమైన సోదరులారా! ప్రపంచం దృష్టిలో పేదవాళ్ళు విశ్వాసంలో ధనికులు కావాలనీ, వాళ్ళు తన రాజ్యానికి వారసులు కావాలనీ దేవుడు వాళ్ళను ఎన్నుకోలేదా? తనను ప్రేమించినవాళ్ళకు రాజ్యాన్నిస్తానని దేవుడు యింతకు క్రితమే వాగ్దానం చేసాడు. మీరు పేదవాళ్ళను అవమానిస్తున్నారు. మిమ్మల్ని దోచుకొనే వాళ్ళు ధనికులే కదా! వాళ్ళేకదా మిమ్ములను న్యాయస్థానానికి ఈడ్చేది? మీరు ఎవరికి చెందారో గౌరవప్రదమైన ఆయన పేరును దూషిస్తున్నది వాళ్ళే కాదా?

“నీ పొరుగింటివాణ్ణి నిన్ను నీవు ప్రేమించుకొన్నంతగా ప్రేమించు”(A) అని ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞను మీరు నిజంగా పాటిస్తే మీలో సత్‌ప్రవర్తన ఉన్నట్లే. కాని ఒకవేళ మీరు పక్షపాతం చూపితే పాపం చేసినవాళ్ళౌతారు. తద్వారా ధర్మశాస్త్రం ప్రకారం మీరు నీతిని ఉల్లంఘించినవాళ్ళౌతారు.

10 ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్న నియమాలన్నిటినీ పాటిస్తూ ఒకే ఒక నియమాన్ని ఉల్లంఘిస్తే అలాంటివాడు ధర్మశాస్త్రాన్నంతా ఉల్లంఘించినవాడౌతాడు. 11 ఎందుకంటే, “వ్యభిచారం చేయరాదు”(B) అని అన్నవాడే “హత్యచేయరాదు” అని కూడా అన్నాడు. మీరు వ్యభిచారం చేసివుండక పోవచ్చు. కాని హత్య చేసి ఉంటే! అలాంటప్పుడు మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించినట్లే కదా!

12 స్వేచ్ఛను కలిగించే క్రొత్త ధర్మశాస్త్రాన్ని బట్టి తీర్పు పొందనున్న వాళ్ళలా ప్రవర్తించండి. అదేవిధంగా మాట్లాడండి. 13 దేవుడు తీర్పు చెప్పేటప్పుడు దయాహీనులపై దయ చూపడు. కాని దయచూపిన వాళ్ళు తీర్పు చెప్పే సమయంలో ఆనందిస్తారు.

విశ్వాసము, క్రియ

14 నా సోదరులారా! “నాకు విశ్వాసం ఉంది” అని అన్న వ్యక్తి ఆ విశ్వాసాన్ని క్రియా రూపకంగా చూపకపోతే అది నిష్ప్రయోజనం. అలాంటి విశ్వాసం అతణ్ణి రక్షించగలదా? 15 ఒక సోదరుడో లేక సోదరియో కూడూ గుడ్డా లేక బాధపడ్తున్నారనుకోండి. 16 అప్పుడు మీరు అతనితో, “క్షేమంగా వెళ్ళిరా! కడుపునిండా తిని, ఒంటి నిండా దుస్తులు వేసుకో!” అని అంటూ వాళ్ళ అవసరాలు తీర్చకపోతే దానివల్ల వచ్చిన లాభమేమిటి? 17 విశ్వాసంతో పాటు క్రియ లేకపోతే ఆ విశ్వాసం పూర్తిగా నిష్ప్రయోజనమైపోతుంది.

18 కాని, “ఒకనిలో విశ్వాసం ఉండవచ్చు. మరొకనిలో క్రియ ఉండవచ్చు!” అని మీరనవచ్చు! అలాగైతే క్రియలు లేకుండా మీలో ఉన్న విశ్వాసాన్ని నాకు చూపండి. నేను క్రియారూపకంగా నా విశ్వాసాన్ని చూపుతాను. 19 ఒక్కడే దేవుడున్నాడని మీరు విశ్వసిస్తారు. మంచిదే. దయ్యాలు కూడా దాన్ని నమ్ముతాయి. అయినా, దేవుడు తమను శిక్షిస్తాడేమోనని భయపడ్తూ ఉంటాయి.

20 ఓ మూర్ఖుడా! క్రియలు లేని విశ్వాసం వ్యర్థమన్న[a] దానికి నీకు ఋజువు కావాలా? 21 మన పూర్వికుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠంపై బలిగా యివ్వటానికి సిద్ధమైనందుకు దేవుడతణ్ణి, అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణించలేదా? 22 అతనిలో ఉన్న విశ్వాసము క్రియతో కలిసి పని చెయ్యటం మీరు గమనించారు. అతడు చేసిన క్రియ అతని విశ్వాసానికి పరిపూర్ణత కలిగించింది. 23 “అబ్రాహాము దేవుణ్ణి నమ్మాడు. తద్వారా దేవుడతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు”(C) అని లేఖనాల్లో చెప్పిన విషయం నిజమైంది. దేవుడతణ్ణి తన మిత్రునిగా పిలిచాడు. 24 మానవునిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా అతడు చేసిన క్రియలను బట్టి నీతిమంతునిగా పరిగణింపబడటం మీరు చూసారు.

25 మరొక ఉదాహరణ రాహాబు. ఆమె గూఢచారులకు ఆతిథ్యమిచ్చి వాళ్ళను వేరొక దారిన పంపివేసింది. ఆమె చేసిన క్రియను బట్టి దేవుడు ఆమెను నీతిమంతురాలిగా పరిగణించ లేదా?

26 ఆత్మలేని శరీరం ఏ విధంగా నిర్జీవమైందో అదే విధంగా క్రియలేని విశ్వాసము నిర్జీవమైనది.

ఆమోసు 9

యెహోవా బలిపీఠం పక్కన నిల్చున్నట్లు దర్శనం

నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు:

“స్తంభాల తలలపై కొట్టు.
    దానితో అది గుమ్మాల వరకు కదులుతుంది.
స్తంభాలు ప్రజల తలలపై పడేలా కొట్టు.
    ఇంకా ఎవరైనా మిగిలితే వారిని నేను కత్తితో చంపుతాను.
ఏ వ్యక్తి అయినా పారిపోవచ్చు; కాని అతడు తప్పించుకోలేడు.
    ప్రజలలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
వారు పాతాళం లోపలికి పోయినా నేను వారిని
    అక్కడనుండి బయటకు లాగుతాను.
వారు ఆకాశంలోకి దూసుకుపోతే,
    నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.
వారు కర్మెలు పర్వత శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను.
    వారిని అక్కడ పట్టుకొని తీసుకొస్తాను.
వారు నా నుండి సముద్ర గర్భంలో దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ ఇస్తాను.
    అది వారిని కాటేస్తుంది.
వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే,
    నేను కత్తికి ఆజ్ఞ ఇస్తాను.
    అది వారిని అక్కడ చంపివేస్తుంది.
అవును. నేను వారిపై నిఘా వేసి ఉంటాను.
    వారికి కష్టాలు తెచ్చి పెట్టే ఉపాయాలను నేను అన్వేషిస్తాను.
    అంతేగాని, వారికి మంచి చేసే విధానాలను నేను చూడను.”

శిక్ష ప్రజలను నాశనం చేస్తుంది

నా ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
    అది కరిగిపోతుంది.
    అప్పుడు భూమిపై నివసించేవారంతా చనిపోయినవారి కొరకు విలపిస్తారు.
ఈజిప్టులో నైలు నదిలా
    భూమి పెల్లుబికి పడుతుంది.
యెహోవా తన పై అంతస్థు గదులు ఆకాశంపై నిర్మించాడు.
    ఆయన తన పరలోకాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు.
సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు.
    పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు.
    ఆయన పేరు యెహోవా.

ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా వాగ్దానం

యెహోవా ఇది చెపుతున్నాడు:

“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయుల) వంటివారు.
    ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశంనుండి బయటకు తీసికొని వచ్చాను.
    ఫిలిష్తీయులనుకూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
    మరియు అరామీయులను (సిరియనులను) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”

నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలును) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలంనుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
    కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
    ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
    అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది.

10 “నా ప్రజలలో పాపులైనవారు,
    ‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”

రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట

11 “దావీదు గుడారం పడిపోయింది.
    కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
    దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
    మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
    అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
    ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
    మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
    తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
    ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
    ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
    వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
    నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

లూకా 4

సైతాను యేసును శోధించటం

(మత్తయి 4:1-11; మార్కు 1:12-13)

యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు. అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.

సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.

యేసు,

“‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.(A)

ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు. ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను. నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.

యేసు,

“‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి,
    ఆయన సేవ మాత్రమే చెయ్యి’(B)

అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.

సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.

10 ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు.’(C)

11 అంతేకాక:

‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా
    నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’(D)

అని వ్రాయబడింది” అని అన్నాడు.

12 యేసు,

“‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు.’(E)

అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు. 13 ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.

గలిలయలో యేసుని సేవా ప్రారంభం

(మత్తయి 4:12-17; మార్కు 1:14-15)

14 యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది. 15 ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.

యేసు తన స్వగ్రామానికి వెళ్ళటం

(మత్తయి 13:53-58; మార్కు 6:1-6)

16 ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు. 17 అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:

18 “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు
    నన్ను సువార్త ప్రకటించుమన్నాడు.
అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు.
బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని,
    గుడ్డివారికి చూపు కలిగించాలని,
హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
19     ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”(F)

20 ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి. 21 ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.

22 అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.

23 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు. 24 ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.

25 “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది. 26 సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.

27 “ప్రవక్త ఎలీషా[a] కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే[b] వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”

28 సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది. 29 వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు. 30 కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.

యేసు ఒక మనుష్యుని దయ్యంనుండి విడిపించటం

(మార్కు 1:21-28)

31 అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు. 32 ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.

33 అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా, 34 “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది. 35 యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.

36 అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు. 37 ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.

యేసు పేతురు అత్తను నయం చేయటం

(మత్తయి 8:14-17; మార్కు 1:29-34)

38 యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు. 39 యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.

యేసు అనేకులను నయం చేయటం

40 సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు. 41 “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.

యేసు ఇతర పట్టణాలకు వెళ్ళటం

(మార్కు 1:35-39)

42 తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు. 43 కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.

44 ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International