Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 1-7

హోషేయద్వారా యెహోవా దేవుని సందేశం

బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలురాజుగా ఉన్న కాలం అది.

ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను.[a] ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.

యెజ్రెయేలు పుట్టుక

కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది. యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.

లో-రూహామా పుట్టుక

మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను. కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలనుగాని, సైనికులనుగాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తిచేతనే వారిని రక్షిస్తాను.”

లో-అమ్మీ పుట్టుక

గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది. అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుట

10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.

11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.

“అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ అని చెబుతారు.

“మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయమని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.

“అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని అంటుంది. “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్ధంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసుకొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసుకొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. 10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. 11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులను, ఆమె అమావాస్య విందులను, ఆమె విశ్రాంతి దినాలను, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. 12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.

13 “ఆమె బయలు[b] దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.

18 “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. 21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“నేను ఆకాశాలతో మాట్లాడుతాను.
    అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది.
    అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను.
    లో-రూహామాకు నేను దయచూపిస్తాను.
లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను.
    ‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”

గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనుట

అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల చెప్పాడు.

కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.

అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, లేక ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని, లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని, లేక, గృహ దేవతలు గాని ఉండవు. దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.

ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపంగా ఉండుట

ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు. ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు. అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి. ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్దు. మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోపాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.

“నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను. వారు గర్విష్ఠులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.

“యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకొన్నారు. కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను. 10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయారయ్యారు.

11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి. 12 నా ప్రజలు కట్టెముక్కలను సలహా అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు. 13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సిందూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లుకూడా పాపాలు చేస్తారు.

14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి, వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి, ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.

ఇశ్రాయేలీయుల సిగ్గుకరమైన పాపాలు

15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ, యూదాను అపరాధిగా ఉండనియ్యకు. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు. 16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ, ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది. 17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి. 18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేస్తూ ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు. 19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”

ఇశ్రాయేలును, యూదాను వారి నాయకులే పాపం చేయించారు

“యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా, తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి.

“మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు. మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను! ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు. ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది. ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలను వెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు. ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటే కాలు తప్పి పడిపోతుంది.

“ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడిచిపెట్టాడు. వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టారు. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో పాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”

ఇశ్రాయేలీయుల నాశనంగూర్చి ఒక ప్రవచనం

“గిబియాలో కొమ్ము ఊదండి.
    రామాలో బాకా ఊదండి.
బేతావెను వద్ద హెచ్చరిక చేయండి.
    బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
శిక్షా సమయంలో
    ఎఫ్రాయిము పాడై పోతాడు.
ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు)
    ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
10 యూదా నాయకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు.
    కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు.
    అతడు ద్రాక్షాపళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు.
    ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను.
    చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు.
    కనుక వారు సహాయంకోసం అష్షూరు వెళ్లారు.
తమ సమస్యలనుగూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు.
    కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను.
    యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను.
గనుక నేను, అవును, యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను.
నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను.
    నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు
    నాకోసం వారు వెదుకుతూ వచ్చేంత వరకు
    నేను నా స్థలానికి వెళ్లిపోతాను.
అవును, తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”

యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు బహుమతులు

“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం.
    ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు.
    ఆయన మనలను గాయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు.
    మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు.
    అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము.
    ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం.
సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే
    ఆయన వస్తున్నాడని మనకు తెలుసు.
యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు.
    నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”

ప్రజలు నమ్మకస్తులు కారు

“ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి?
    యూదా, నిన్ను నేను ఏమి చేయాలి?
నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది.
    వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
నేను ప్రవక్తలను ఉపయోగించి
    ప్రజల కోసం న్యాయచట్టం చేశాను.
నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు.
    కాని, ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే.
    అంతేగాని బలిఅర్పణ కాదు.
ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక
    దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు.
    వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం.
    ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
బందిపోటు దొంగలు దాగుకొని,
    ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు.
అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు.
    వారు దుర్మార్గపు పనులు చేశారు.
10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను.
ఎఫ్రాయిము దేవునికి అపనమ్మకస్తుడు.
    ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది.
    బానిసత్వంనుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”

“ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను!
    ఎఫ్రాయిము యొక్క పాపంగూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
    ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు.
    వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి.
    వారి పాపాలను నేను తేటగా చూడగలను.
ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి.
    వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
రొట్టెలు చేసేవాడు రొట్టె చేసేందుకు పిండి పిసుకుతాడు.
    అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు.
రొట్టె పొంగుతున్నప్పుడు
    అతడు మంట ఎక్కువ చేయడు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు.
    ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు.
    ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు.
    కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
ప్రజలు రహస్య పథకాలు వేస్తారు.
    వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకంతో మండుతాయి.
వారి కోపం రాత్రి అంతా మండుతుంది.
    మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు.
    వారు వారి పాలకులను నాశనం చేశారు.
వారి రాజులంతా పతనం అయ్యారు.
    వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”

ఇశ్రాయేలు, ఇతర జనాంగాలు

“ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది.
    ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు.
    కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి,
    కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది.
    ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి.
అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు.
    ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు.
    ప్రజలు సహాయంకోసం ఈజిప్టును పిలిచారు.
    సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు.
    కానీ నేను వారిని వలలో పడవేస్తాను.
వారి మీద నేను నా వల విసిరి,
    ఆకాశపక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను.
    వారి ఒడంబడిక[c] విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు.
    నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు.
ఆ ప్రజలను నేను రక్షించాను.
    కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు.
    వారు ఇతరుల భూములలో ధాన్యం,
కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు.
    కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారి చేతులను బలపర్చాను.
    కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
16 దేవుళ్లు కానివారివైపు (బయలు దేవత) వారు తిరిగారు.
    వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు.
వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు.
    కానీ వారు కత్తులతో చంపబడతారు.
అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు.
    విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International