Chronological
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మార్కు 2:23-28; లూకా 6:1-5)
12 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు. 2 పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
3-4 యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు. 5 అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు. 6 నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. 7 ‘నాకు దయకావాలి, బలికాదు’(A) అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.
8 “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మార్కు 3:1-6; లూకా 6:6-11)
9 ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. 10 అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.
11 ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? 12 మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.
13 అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది. 14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.
యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు
15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
18 “ఆయన నేనెన్నుకున్న
నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(B)
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మత్తయి 12:9-14; లూకా 6:6-11)
3 ఒక రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళాడు. అక్కడ చెయ్యి ఎండిపోయిన వాడొకడు ఉన్నాడు. 2 అక్కడున్న వాళ్ళలో కొందరు, యేసు ఆ చేయి ఎండిపోయిన వానికి విశ్రాంతి రోజు నయం చేస్తాడేమో చూడాలని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. అలా చేస్తే ఆయనపై నేరం మోపాలని వాళ్ళ ఉద్దేశ్యం. 3 యేసు ఆ చేయిపడిపోయిన వానితో, “అందరి ముందుకి వచ్చి నిలుచో” అని అన్నాడు.
4 అప్పుడు యేసు అక్కడున్న వాళ్ళతో, “విశ్రాంతి రోజున మంచి చెయ్యటం ధర్మమా? లేక చెడు చేయటం ధర్మమా? ప్రాణాన్ని రక్షించటం ధర్మమా లేక చంపటం ధర్మమా?” అని అన్నాడు. కాని దానికి వాళ్ళు ఏ సమాధానమూ చెప్పలేదు.
5 ఆయన కోపంతో చుట్టూ చూసాడు. వాళ్ళవి కఠిన హృదయాలైనందుకు ఎంతో దుఃఖిస్తూ, ఆ చేయి ఎండిపోయిన వానితో, “నీ చేయి చాపు” అని అన్నాడు. వాడు చేయి చాపాడు. వెంటనే అతని చేయి పూర్తిగా నయమైపోయింది. 6 ఆ తర్వాత పరిసయ్యులు బయటికి వెళ్ళి, హేరోదీయులతో కలిసి యేసును చంపాలని కుట్రపన్నటం మొదలు పెట్టారు.
ప్రజలు యేసును అనుసరించటం
7 యేసు తన శిష్యులతో కలిసి సముద్రం దగ్గరకు వెళ్ళాడు. గలిలయ నుండి చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 8 యేసు చేస్తున్నవన్నీ విని చాలామంది ప్రజలు యూదయ నుండి, యెరూషలేము నుండి, ఇదూమియ నుండి, యోర్దాను నది అవతలి వైపునున్న ప్రాంతాలనుండి, తూరు, సీదోను పట్టణాల చుట్టూవున్న ప్రాంతాలనుండి ఆయన దగ్గరకు వచ్చారు.
9 చాలామంది ప్రజలు ఉండటం వల్ల వాళ్ళు తనను త్రోయకుండా ఉండాలని యేసు తన శిష్యులతో ఒక చిన్న పడవను తన కోసం సిద్ధం చేయమని చెప్పాడు. 10 ఆయన చాలామందికి నయం చేసాడు. అందువల్ల రోగాలున్నవాళ్ళు ఆయన్ని తాకాలని ముందుకు త్రోసుకుంటూ వస్తూ ఉన్నారు. 11 చెడు ఆత్మలు ఆయన్ని చూసినప్పుడల్లా ఆయన ముందుపడి బిగ్గరగా, “నీవు దేవుని కుమారుడివి” అని కేకలు వేసేవి. 12 యేసు తానెవరో ఎవ్వరికి చెప్పవద్దని ఆ ప్రజల్ని గట్టిగా ఆజ్ఞాపించాడు.
యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం
(మత్తయి 10:1-4; లూకా 6:12-16)
13 యేసు కొండపైకి వెళ్ళి తనకు కావలసిన వాళ్ళను పిలిపించాడు. వాళ్ళు ఆయన దగ్గరకు వెళ్ళారు. 14 ఆయన పన్నెండుగురిని తన అపొస్తలులుగా నియమించాడు. వాళ్ళు తనతో ఉండాలని, ప్రకటించటానికి వాళ్ళను ప్రపంచంలోకి పంపాలని ఆయన ఉద్దేశ్యం. 15 దయ్యాలను వదిలించే అధికారం వాళ్ళకిచ్చాడు. 16 ఆయన నియమించిన పన్నెండుగురు అపొస్తలుల పేర్లు యివి:
సీమోను, ఇతనికి పేతురు అనే పేరునిచ్చాడు.
17 జెబెదయి కుమారులైన యాకోబు అతని సోదరుడు యోహాను, వీళ్ళకు బోయనేర్గెసు అనే పేరునిచ్చాడు. బోయనేర్గెసు అంటే “ఉరుముకు పుత్రులు” అని అర్థం.
18 అంద్రెయ,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
తద్దయి,
జెలటు అని పిలవబడే సీమోను,
19 యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-32; లూకా 11:14-23; 12:10)
20 ఆ తర్వాత యేసు యింటికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజలు సమావేశమయ్యారు. దీనితో ఆయనకు, ఆయన శిష్యులకు తినటానికి కూడా సమయం దొరకలేదు. 21 ప్రజలు “ఆయనకు మతిపోయింది” అని అంటూ ఉండటంవల్ల ఆయన బంధువులు ఆయన భారం వహించటానికి వచ్చారు.
22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు, “అతనికి బయల్జెబూలు దయ్యం పట్టింది. దయ్యాల రాజు సహాయంతో అతడు దయ్యాలను వదిలిస్తున్నాడు” అని అన్నారు.
23 అందువల్ల యేసు వాళ్ళను గురించి, ఉపమానాలు ఉపయోగించి వారితో ఈ విధంగా అన్నాడు: “సైతాను తనను తాను ఏవిధంగా పారద్రోలుతాడు? 24 ఏ రాజ్యంలో చీలికలు వస్తాయో ఆ రాజ్యం నిలువదు. 25 కుటుంబంలో చీలికలు వస్తే ఆ కుటుంబం నిలువదు. 26 సైతాను తనకు తాను విరోధి అయి తన అధికారంతో చీలికలు తెచ్చుకొంటే ఆ సైతాను నిలవడు. వాని అధికారం అంతమౌతుంది.
27 “నిజానికి బలవంతుని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని దోచుకోవాలనుకొంటే మొదట ఆ బలవంతుణ్ణి కట్టివేయవలసి వస్తుంది. అప్పుడే ఆ యింటిని దోచుకోగల్గుతాడు.
28 “నేను నిజం చెబుతున్నాను. మానవులు చేసిన అన్ని పాపాలను, వాళ్ళ దూషణలను, దేవుడు క్షమిస్తాడు. 29 కాని పవిత్రాత్మను దూషించిన వాణ్ణి దేవుడు ఎప్పటికి క్షమించడు. అతణ్ణి శాశ్వతమైన పాపం చేసిన వానిగా పరిగణిస్తాడు.”
30 ధర్మశాస్త్ర పండితులు తనలో దురాత్మ ఉందని అనటం వలన ఆయన పై విధంగా అన్నాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మత్తయి 12:46-50; లూకా 8:19-21)
31 యేసు తల్లి, ఆయన సోదరులు అక్కడికి వచ్చారు. బయటే నిలుచుని యేసును పిలవమని ఒకణ్ణి లోపలికి పంపారు. 32 యేసు చుట్టూ జనసమూహం ఉంది. వాళ్ళు ఆయనతో, “మీ తల్లి, సోదరులు మీకోసం అడుగుతూ బయట నిలుచున్నారు” అని అన్నారు.
33 “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అంటూ 34 చుట్టూ కూర్చున్న వాళ్ళవైపు చూసి, “వీరే నా తల్లి, నా సోదరులు. 35 దైవేచ్చానుసారం నడుచుకొనే వాళ్ళు నా సోదరులు, నా అక్కచెల్లెండ్లు, నా తల్లి” అని అన్నాడు.
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మత్తయి 12:1-8; మార్కు 2:23-28)
6 ఒక విశ్రాంతి రోజు యేసు ధాన్యపు పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు కంకులు త్రుంచి వాటిని నలిపి తినటం మొదలుపెట్టారు. 2 కొందరు పరిసయ్యులు, “విశ్రాంతి రోజున చెయ్యరాని పనులు ఎందుకు చేస్తున్నారు?” అని అడిగారు.
3 యేసు, “దావీదు తనకు, తనతో ఉన్న వాళ్ళకు ఆకలి వేసినప్పుడు ఏమిచేసాడో మీరు చదవలేదా? 4 అతడు దేవుని ఆలయంలోకి వెళ్ళాడు. అక్కడ దేవుని సన్నిధిని పెట్టిన రొట్టెలు ఉండినవి. వాటిని యాజకులు తప్ప యితర్లు తిన కూడదు. అతడు వాటిని తీసుకొని తాను తిని, తనతో ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాడు” అని సమాధానం చెప్పాడు. 5 యేసు మళ్ళీ, “మనుష్యకుమారుడు విశ్రాంతి రోజుకు ప్రభువు!” అని అన్నాడు.
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మత్తయి 12:9-14; మార్కు 3:1-6)
6 మరొక విశ్రాంతి రోజు యేసు సమాజ మందిరానికి వెళ్ళి బోధిస్తూ ఉన్నాడు. అక్కడ కుడి చేయి పడిపోయిన వాడొకడున్నాడు. 7 పరిసయ్యులు, శాస్త్రులు యేసును ఏదో ఒక కారణంతో నిందించాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక వాళ్ళు విశ్రాంతి రోజు ఆయన ఆ చేయి పడిపోయిన వానిని నయం చేస్తాడేమోనని ఆయన్ని జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. 8 యేసుకు వాళ్ళేమాలోచిస్తున్నారో తెలుసు. ఆయన ఆ చేయి పడిపోయిన వానితో, “లేచి అందరి ముందు నిలుచో!” అని అన్నాడు. ఆ చేయి పడిపోయిన వాడు లేచి నిలుచున్నాడు. 9 ఆ తదుపరి యేసు వాళ్ళతో, “విశ్రాంతి రోజు ఏది చెయ్యటం న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నాను? ఒకరికి మేలు చేయటమా? లేక కీడు చేయటమా? ప్రాణాన్ని రక్షించటమా? లేక నాశనం చేయటమా?” అని అన్నాడు.
10 యేసు వాళ్ళ వైపు ఒకసారి చూసి, చేయి పడిపోయిన వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. ఆచేయి పడిపోయినవాడు యేసు చెప్పినట్లు చేశాడు. అతని చేయి పూర్తిగా నయమై పోయింది. 11 ఇది చూసి అక్కడున్నవాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు యేసును ఏమి చెయ్యాలో తమలో తాము ఆలోచించుకొన్నారు.
యేసు పన్నెండు మంది అపోస్తలుల్ని ఎన్నుకొనటం
(మత్తయి 10:1-4; మార్కు 3:13-19)
12 ఆ తర్వాత యేసు ఒక రోజు ప్రార్థించటానికి కొండ మీదికి వెళ్ళాడు. రాత్రంతా దేవుణ్ణి ప్రార్థిస్తూ గడిపాడు. 13 ఉదయం కాగానే తన శిష్యులందర్ని దగ్గరకు పిలిచి వాళ్ళలో పన్నెండు మందిని ఎన్నుకొని వాళ్ళను తన అపొస్తలులుగా నియమించాడు. వారెవరనగా,
14 సీమోను, యేసు ఇతనికి “పేతురు” అని పేరు పెట్టాడు,
అతని తమ్ముడు అంద్రెయ.
యాకోబు,
యోహాను,
ఫిలిప్పు,
బర్తొలొమయి,
15 మత్తయి,
తోమా,
అల్ఫయి కుమారుడు యాకోబు,
జెలోతె[a] అని పిలువబడే సీమోను
16 యాకోబు కుమారుడు యూదా,
యూదా ఇస్కరియోతు. (ఈ యూదా ఇస్కరియోతు మున్ముందు ద్రోహిఔతాడు).
యేసు బోధించి రోగులను నయం చేయటం
(మత్తయి 4:23-25; 5:1-12)
17 యేసు వాళ్ళతో సహా కొండ దిగి సమంగా ఉన్న స్థలంలో నిలుచున్నాడు. చాలా మంది శిష్యులు ఆయనతో ఉన్నారు. ఆయన శిష్యులే కాక యూదయ నుండి, యెరూషలేం నుండి చాలా మంది ప్రజలు వచ్చారు. సముద్ర తీరంలో ఉన్న తూరు, సీదోను పట్టణాల నుండి కూడా చాలా మంది ప్రజలు వచ్చారు. 18 ఆయన బోధనలు వినాలని ఆయన ద్వారా తమ రోగాలు బాగు చేయించుకోవాలని వాళ్ళ ఉద్దేశ్యం. దయ్యాలు పట్టి బాధపడ్తున్న వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళకు కూడా నయమైపోయింది. 19 ఆయన నుండి శక్తి ప్రవహించి అందరికి నయం చేస్తూవుండటం వల్ల అందరూ ఆయన్ని తాకటానికి ప్రయత్నించారు.
20 యేసు తన శిష్యుల వైపు చూసి ఈ విధంగా అన్నాడు:
“దీనులైన మీరు ధన్యులు.
దేవుని రాజ్యం మీది.
21 ఇప్పుడు ఆకలితో ఉన్న మీరు ధన్యులు.
మీ ఆకలి తీరుతుంది.
ఇప్పుడు దుఃఖిస్తున్న మీరు ధన్యులు.
భవిష్యత్తులో మీరు నవ్వుతారు.
22 “మనుష్యకుమారుని కారణంగా ప్రజలు మిమ్ముల్ని ద్వేషించినప్పుడు, మిమ్మల్ని దూరం చేసి అవమానించినప్పుడు, మీ పేరే హానికరమైనదని వారు భావించినప్పుడు మీరు ధన్యులౌతారు! 23 మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక యిది జరిగిన రోజు ఆనందంతో గంతులు వెయ్యండి! వీళ్ళ పూర్వీకులు కూడా ఆనాడు ప్రవక్తల పట్ల యిదే విధంగా ప్రవర్తించారు.
24 “ఓ ధనికులారా! మీకు శ్రమ తప్పదు!
మీరు అనుభవించవలసిన సుఖాన్ని యిదివరకే అనుభవించారు!
25 కడుపులు నిండిన ప్రజలారా మీకు శ్రమ తప్పదు.
మీకు ఆహారం దొరకదు!
నవ్వుతున్న ప్రజలారా! మీకు శ్రమ తప్పదు!
మీరు దుఃఖిస్తారు, శోకిస్తారు!
26 “పొగడ్తులుపొందే ప్రజలారా! మీకు శిక్ష తప్పదు! వాళ్ళ పూర్వులు యిదే విధంగా అబద్ధ ప్రవక్తల్ని పొగిడారు.
శత్రువులను ప్రేమించు
(మత్తయి 5:38-48; 7:12)
27 “కాని, నా మాటలు వినే వాళ్ళకు యిది నేను చెబుతున్నాను: మీ శత్రువుల్ని ప్రేమించండి. మిమ్మల్ని ద్వేషించే వాళ్ళకు మంచి చెయ్యండి. 28 మిమ్మల్ని దూషించే వాళ్ళను దీవించండి. మీకు కీడు చేసిన వాళ్ళకు మంచి కలగాలని ప్రార్థించండి. 29 ఒక చెంప మీద కొట్టిన వానికి రెండవ చెంప కూడా చూపండి. నీ పైకండువాను తీసికొనే వానిని నీ చొక్కాను కూడ తీసికోనివ్వు. 30 అడిగిన వాళ్ళకు యివ్వండి. మీ వస్తువుల్ని ఎవరైనా తీసుకుంటే వాటిని తిరిగి అడక్కండి. 31 ఇతర్లు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారో అదేవిధంగా మీరు యితర్ల పట్ల ప్రవర్తించండి.
32 “మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తే అందులో గొప్పేముంది? పాపులు కూడా తమను ప్రేమించిన వాళ్ళను ప్రేమిస్తారు. 33 మీకు మంచి చేసిన వాళ్ళకు మీరు మంచి చేస్తే అందులో గొప్పేముంది? పాపులుకూడా అదే విధంగా చేస్తారు. 34 అప్పు తిరిగి చెల్లిస్తారని ఆశించి అప్పిస్తే అందులో గొప్పేముంది? తమ అప్పు పూర్తిగా చెల్లిస్తారని పాపులు కూడా తమలో తాము యిచ్చి పుచ్చుకుంటారు.
35 “మీ శత్రువుల్ని ప్రేమించండి. వాళ్ళకు మంచి చెయ్యండి. తిరిగి చెల్లిస్తారని ఆశించకుండా అప్పివ్వండి. విశ్వాస ఘాతుకుల మీద, దుర్మార్గుల మీద కూడా దేవుడు దయ చూపుతాడు. మీరు నేను చెప్పినట్లు చేస్తే సర్వోన్నతుడైన దేవుడు మిమ్మల్ని తన కుమారులుగా పరిగణిస్తాడు. మీకు గొప్ప బహుమతి లభిస్తుంది. 36 మీ తండ్రివలె మీరు కూడా దయ, ప్రేమ చూపుతూ జీవించండి.
ఇతరులను విమర్షించటంలో జాగ్రతపడుము
(మత్తయి 7:1-5)
37 “ఇతర్లపై తీర్పు చెప్పకండి. అప్పుడు ఇతర్లు మీపై తీర్పు చెప్పరు. ఇతర్లను నిందించకండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని నిందించరు. ఇతరులను క్షమించండి. అప్పుడు యితర్లు మిమ్మల్ని క్షమిస్తారు. 38 ఇతర్లకు యివ్వండి, మీకివ్వబడుతుంది. అప్పుడు మీకు కొలతలు నింపి, అదిమి, కుదిల్చి ఒలికిపోతుండగా మీ ఒడిలో పోస్తారు. మీరు ఏ కొలతతో యిస్తే ఆ కొలతతో మీకు లభిస్తుంది.”
39 ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! 40 శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు.
41 “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? 42 నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు.
చెట్టు, దాని ఫలము
(మత్తయి 7:17-20; 12:34-35)
43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. 44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. 45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.
తెలివిగలవాడు, తెలివిలేనివాడు
(మత్తయి 7:24-27)
46 “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? 47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. 48 అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు.
49 “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
© 1997 Bible League International