Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 12-13

ఇశ్రాయేలీయులచే ఓడింపబడిన రాజులు

12 యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరాబాకు తూర్పు ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:

హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశంమొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు. అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరెతు సముద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు అతడు పాలించాడు. బెత్ ఎషిమోతు నుండి దక్షిణాన పిస్గా కొండల వరకు అతడు పాలించాడు.

బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. అష్టారోతు, ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు. హెర్మోను కొండ, సలెకా, బాషాను ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభాగాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు.

యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేసాడు మోషే.

యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం లెబానోను లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి. కొండ దేశం, పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, ఎడారి, నెగెవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:

యెరికో రాజు.

బేతేలు దగ్గరనున్న హాయి రాజు.

10 యెరూషలేము రాజు.

హెబ్రోను రాజు.

11 యార్ముతు రాజు.

లాకీషు రాజు.

12 ఎగ్లోను రాజు.

గెజెరు రాజు.

13 దెబీరు రాజు.

గెదెరు రాజు.

14 హోర్మా రాజు.

అరాదు రాజు.

15 లిబ్నా రాజు.

అదుల్లాం రాజు.

16 మక్కెద రాజు.

బేతేలు రాజు.

17 తపువ రాజు.

హెపెరు రాజు.

18 అఫెకు రాజు.

లాషారోను రాజు.

19 మదోను రాజు.

హిజోరు రాజు.

20 షిమ్రోన్ మెరోన్ రాజు.

అక్షపు రాజు.

21 తానాకు రాజు.

మెగిద్దో రాజు.

22 కెదెషు రాజు.

కర్మెలులోని యొకెనం రాజు.

23 దోరు పర్వతంలో దోరు రాజు.

గిల్గాలులోని గోయిం రాజు.

24 తిర్సా రాజు.

మొత్తం రాజులు 31 (ముఫ్పై ఒకటి).

ఇంకా స్వాధీన పరచుకొనని భూమి

13 యెహోషువ చాల ముసలివాడైనప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈజిప్టు దగ్గర షీహోరు నది[a] నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను, కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి. గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది.

“లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకు గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి. ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.”

భూమిని పంచటం

మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యొర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు. యొర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది. 10 అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. 11 గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది. 12 ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 13 గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు.

14 లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది.

15 రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది: 16 అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది. 17 హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్‌బయలు, బేత్‌బయల్మెయోను, 18 యహజ్, కెదెమోతు, మేఫాతు, 19 కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు, 20 బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్. 21 కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు. 22 బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు. 23 రూబేనుకు ఇచ్చిన భూమికి యొర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి.

24 గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు.

25 యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. 26 హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. 27 బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది. 28 ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు.

29 మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి.

30 ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు) 31 గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఈ భూమి దొరికింది.

32 మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యొర్దాను నది అవతల ఉంది. 33 అయితే లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు.

కీర్తనలు. 145

దావీదు ప్రార్థన.

145 నా దేవా, నా రాజా, నిన్ను నేను స్తుతిస్తాను.
    నిరంతరం నిన్ను నేను స్తుతిస్తాను.
ప్రతిరోజూ నిన్ను నేను స్తుతిస్తాను.
    ఎప్పటికీ నీ నామాన్ని నేను స్తుతిస్తాను.
యెహోవా గొప్పవాడు. ప్రజలు ఆయనను ఎంతో స్తుతిస్తారు.
    ఆయన చేసే గొప్ప కార్యాలన్నింటినీ మనం లెక్కించలేము.
యెహోవా, ఒక తరం నీ పనులను స్తుతిస్తూ ఇంకొక తరానికి అందిస్తారు.
    నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ప్రజలు ఇతర ప్రజలతో చెబుతారు.
ఆశ్చర్యకరమైన నీ ఘనత, మహిమను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీ అద్భుతాలను గూర్చి నేను చెబుతాను.
యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి మనుష్యులు చెప్పుకొంటారు.
    నీవు చేసే గొప్ప సంగతుల్ని గూర్చి నేను చెబుతాను.
నీవు చేసే మంచి పనులను గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
    యెహోవా, ప్రజలు నీ మంచితనం గూర్చి పాడుకొంటారు.

యెహోవా దయగలవాడు, కరుణగలవాడు.
    యెహోవా సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
యెహోవా, అందరి యెడలా మంచివాడు.
    దేవుడు చేసే ప్రతిదానిలో తన కరుణ చూపిస్తాడు.
10 యెహోవా, నీవు చేసే పనులు నీకు స్తుతి కలిగిస్తాయి.
    నీ అనుచరులు నిన్ను స్తుతిస్తారు.
11 ఆ ప్రజలు నీ మహిమ రాజ్యం గూర్చి చెప్పుకొంటారు.
    నీవు ఎంత గొప్పవాడవో ఆ ప్రజలు చెప్పుకొంటారు.
12 కనుక యెహోవా, నీవు చేసే గొప్ప కార్యాలను గూర్చి ఇతర జనులు ఈ రీతిగా నేర్చుకొంటారు.
    మహా ఘనమైన నీ మహిమ రాజ్యం గూర్చి ప్రజలు చెప్పుకొంటారు.
13 యెహోవా, నీ రాజ్యం శాశ్వతంగా ఉంటుంది.
    నీవు శాశ్వతంగా పాలిస్తావు.

14 పడిపోయిన మనుష్యులను యెహోవా లేవనెత్తుతాడు.
    కష్టంలో ఉన్న మనుష్యులకు యెహోవా సహాయం చేస్తాడు.
15 యెహోవా, జీవిస్తున్న సకల ప్రాణులూ వాటి ఆహారం కోసం నీవైపు చూస్తాయి.
    సకాలంలో నీవు వాటికి ఆహారం యిస్తావు.
16 యెహోవా, నీవు నీ గుప్పిలి విప్పి,
    జీవిస్తున్న సకల ప్రాణులకు కావాల్సినవన్నీ యిస్తావు.
17 యెహోవా చేసే ప్రతీదీ మంచిది.
    యెహోవా చేసే ప్రతి దానిలోనూ ఆయన తన నిజప్రేమను చూపిస్తాడు.
18 యెహోవా సహాయం కోసం తనను పిలిచే ప్రతి యొక్కనికీ సమీపంగా ఉన్నాడు.
    యెహోవాను యదార్థంగా ఆరాధించే ప్రతి వ్యక్తికీ ఆయన సమీపంగా ఉన్నాడు.
19 ఆయన జరిగించాలని ఆయన అనుచరులు కోరేవాటినే యెహోవా జరిగిస్తాడు.
    యెహోవా తన అనుచరుల మొర విని వారిని రక్షిస్తాడు.
    మరియు యెహోవా వారి ప్రార్థనలకు జవాబిచ్చి, వారిని రక్షిస్తాడు.
20 యెహోవాను ప్రేమించే ప్రతి వ్యక్తినీ ఆయన కాపాడుతాడు.
    దుర్మార్గులను యెహోవా నాశనం చేస్తాడు.
21 నేను యెహోవాను స్తుతిస్తాను!
    ప్రతి మనిషీ సదా ఆయన పవిత్ర నామాన్ని స్తుతించాలని నా కోరిక!

యిర్మీయా 6

శత్రువులు యెరూషలేమును ముట్టడించుట

బెన్యామీనీయులారా, మీరు సురక్షిత ప్రాంతానికి పారిపోండి!
    యెరూషలేము నగరం నుండి పారిపోండి!
తెకోవ నగరంలో యుద్ధ సంకేతంగా బూరవూదండి.
    బేత్‌హక్కెరెము నగరంలో హెచ్చరిక ధ్వజాన్ని ఎగురవేయండి!
ఉత్తర దిశ[a] నుండి ఆపద తొంగిచూస్తూ వున్నది కనుక మీరీ పనులు చేయండి.
మహా భయంకరమైన విపత్తు మీకు రాబోతూ ఉంది!
సీయోను కుమారీ, నీవెంతో అందమైన దానివి, సుకుమారివి.[b]
కాపరులు తమ గొర్రెల మందలను తోలుకొని
    యెరూషలేముకు వస్తారు.
వారు నగరం చుట్టూ తమ గుడారాలు నిర్మించుకుంటారు.
    ప్రతి గొర్రెల కాపరీ తన మంద విషయమై తగిన జాగ్రత్త తీసుకుంటాడు.

వారిలా అంటారు: “యెరూషలేము నగరాన్ని ముట్టడించటానికి తగిన సన్నాహాలు చేయండి.
    లేవండి! మధ్యాహ్నం నగరంపై దండెత్తుదాం!
ఇప్పటికే ఆలస్యమైంది.
    సాయంకాలపు నీడలు సాగుతున్నాయి.
కావున లేవండి! మనం నగరాన్ని రాత్రిపూట ముట్టడిద్దాం.
    యెరూషలేము యొక్క రక్షణ దుర్గాలను కూల్చివేద్దాం!”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు:
    “యెరూషలేము చుట్టూ ఉన్న వృక్షాలను పడగొట్టండి.
    ఆ కర్రలతో, మట్టితో నగర గోడకు దిబ్బలు నిర్మించి గోడ ఎక్కటానికి వీలు కల్పించండి.
ఈ నగరం శిక్షించబడాలి.
    ఈ నగరంలో అక్రమం తప్ప మరేమీ లేదు.
బావి తన నీటిని తాజాగా ఉంచుతుంది.
    అలాగే, యోరూషలేము తన దుర్మార్గాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది.
ఈ నగరంలో దౌర్జన్యం, విధ్వంసం గూర్చి ఎప్పుడూ వింటున్నాను.
    యెరూషలేములో అస్వస్థత, గాయాలు నిత్యం నేను చూస్తూనే ఉన్నాను.
యెరూషలేమూ, ఈ హెచ్చరికను ఆలకించు.
    మీరు వినకపోతే, మీనుండి నేను వెనుదిరిగి పోతాను.
మీ దేశాన్ని ఒక పనికిరాని ఎడారిగా మార్చివేస్తాను.
    అక్కడ ఎవ్వరూ నివసించలేరు!”

సర్వశక్తిమంతుడగు యెహోవా ఇలా చెప్పినాడు:
“ఈ రాజ్యంలో మిగిలిన
    వారినందరినీ ప్రోగు చేయుము[c]
నీవు ద్రాక్షతోటలో చివరికు ఏరుకొనే
    ద్రాక్షా కాయల్లా కూడదీయుము.
ద్రాక్షకాయలను ఏరు వాని రీతిగా
    నీవు ప్రతి తీగను వెదకుము.”
10 నేనెవరితో మాట్లాడగలను?
    ఎవరిని హెచ్చరించగలను?
    నా మాట ఎవరు వింటారు?
ఇశ్రాయేలు ప్రజలు నా హెచ్చరికలు వినపడకుండా
    తమ చెవులు మూసుకున్నారు.
యెహోవా ఉపదేశములు వారికిష్టము లేదు.
    కావున నా హెచ్చరికలు వారు వినలేరు.
యెహోవా యొక్క బోధనలను ప్రజలు సహించరు.
    యెహోవా మాటలను వినుటకు వారు ఇష్టపడరు.
11 కాని యెహోవా కోపం నాలో (యిర్మీయా) నిండి ఉంది!
    దానిని నేను లోపల ఇముడ్చుకోలేక పోతున్నాను!
అప్పుడు యెహోవా ఇలా అన్నాడు: “నా కోపాన్ని వీధులలో ఆడుకొనే పిల్లల మీదను,
    గుమిగూడియున్న యువకుల మీదను కుమ్మరించు.
భార్యాభర్తలిరువురూ బందీలుగా పట్టుబడుదురు. వృద్ధులు, శతవృద్ధులు బందీలవుతారు.
12 వారి ఇండ్లు ఇతరులకు ఇవ్వబడతాయి.
    వారి పొలాలు, వారి భార్యలు ఇతరులకివ్వబడతారు.
నా చెయ్యెత్తి యూదా రాజ్య ప్రజలను శిక్షిస్తాను.”
ఈ వాక్కు యెహోవా నుండివచ్చినది.

13 “ఇశ్రాయేలు ప్రజలంతా ఇంకా, ఇంకా ధనం కావాలని కోరుతారు.
    క్రింది వర్గాలనుండి పై తరగతి వ్యక్తుల వరకు అందరూ ధనాపేక్ష కలిగి ఉంటారు!
    ప్రవక్తలు, యాజకులు అంతా కపట జీవనం సాగిస్తారు.
14 ప్రవక్తలు, యాజకులు నా ప్రజల గాయాలను మాన్పజూస్తారు.
    అవేవో స్వల్ఫ గాయాలుగా. భావిస్తారు.
‘ఏమీ పరవాలేదు, ఏమీ పరవాలేదు’ అని అంటారు.
    కాని, నిజానికి ప్రమాదం చాలా ఉంది.
15 ప్రవక్తలు, యాజకులు వారు చేయు చెడుకార్యాలకు సిగ్గుపడాలి!
    కాని వారికి సిగ్గనేది లేదు.
వారి పాపానికి తగిన కలవరపాటు వారెరుగరు.
    అందువల్ల ఇతరులందరితో పాటు వారుకూడా శిక్షించబడతారు.
    నేను వారిని శిక్షించేటప్పుడు వారు నేల కరచేలా క్ర్రిందికి తోయబడతారు.”
ఇది యెహోవా వాక్కు.

16 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు:
“నాలుగు మార్గాల కూడలి స్థలంలో నిలబడిచూడుము.
    పాతబాట ఏదో అడిగి తోలిసికో.
    ఏది మంచి మార్గమో అడిగి తెలుసుకో. అప్పుడు ఆ మార్గంపై పయనించుము.
అప్పుడు మీరు మీకొరకు విశ్రాంతిని కనుగొంటారు.
కాని మీరేమన్నారో తెలుసా? ‘మేము మంచి మార్గంపై పయనించ’ మన్నారు.
17 నేను మీపై కాపలా కాయుటకు, కాపలాదారులను ఎన్నుకొన్నాను.
    నేను వారితో చెప్పాను. ‘యుద్ధ బూర ధ్వని వినండి’ అని.
    కాని వారన్నారు: ‘మేము వినము.’
18 కావున, సర్వదేశవాసులారా వినండి!
    ఆయా దేశాల ప్రజలారా, ధ్యానముంచండి[d] నేను యూదా ప్రజలకు చేయబోయే విషయాలను వినండి!
19 భూలోకవాసులారా, ఇది వినండి:
    యూదా ప్రజలకు నేను ఘోర విపత్తు తెస్తున్నాను.
    ఎందుకంటే? ఆ ప్రజలు పన్నిన చెడు పనులన్నిటి కారణంగానే.
వారు నా వర్తమానాలను లెక్కచేయనందుకు ఫలితంగా ఇది జరుగుతుంది.
    నా న్యాయ మార్గాన్ని అనుసరించటానికి వారు నిరాకరించారు.”

20 యెహోవా ఇలా అన్నాడు:
“మీరు షేబ[e] దేశంనుండి నాకొరకు ధూపానికై సాంబ్రాణి ఎందుకు తెస్తున్నారు?
    దూరదేశాలనుండి సువాసనగల చెరుకును నాకు నైవేద్యంగా ఎందుకు తెస్తున్నారు?
మీ దహనబలులు నన్ను సంతోషపర్చవు!
    మీ బలులు నన్ను సంతృప్తి పర్చజాలవు”

21 అందువల్ల యెహోవా ఇలా చెప్పినాడు:
“యూదా ప్రజలకు నేను సమస్యలు సృష్టిస్తాను.
    ప్రజల ఎదుట అడ్డుబండలు నేను వేస్తాను. రాళ్లవలె అవి వుంటాయి.
తండ్రులు, కొడుకులు వాటిపై తూలిపోతారు.
    స్నేహితులు, పొరుగువారు చనిపోతారు.”

22 యెహోవా ఇలా అన్నాడు:
“ఉత్తర ప్రాంతం నుండి ఒక సైన్యం వచ్చి పడుతూవుంది.
    భూమి పైగల ఒక పెద్ద దేశం దూరంనుండి వస్తూవున్నది.
23 సైనికులు విల్లంబులు, ఈటెలు పట్టుకొనివస్తారు.
    వారు బహు క్రూరులు. వారికి దయా, దాక్షిణ్యం ఉండవు.
వారు మిక్కిలి శక్తిమంతులు!
    వారు గుర్రాలనెక్కి స్వారీ చేస్తూ వచ్చేటప్పుడు ఘోషించే మహా సముద్రంలా శబ్దం వస్తుంది.
ఆ సైన్యం సర్వ సన్నద్ధమై యుద్ధానికి వస్తుంది.
    ఓ సీయోను కుమారీ, ఆ సైన్యం నిన్నెదిరించటానికి వస్తూ ఉంది.”
24 ఆ సైన్యాన్ని గూర్చిన వర్తమానం మనం విన్నాము.
    భయకంపితులమై నిస్సహాయులంగా ఉన్నాము.
కష్టాల ఉచ్చులో పడినట్లు ఉన్నాము.
    స్త్రీ ప్రసవవేదన అనుభవించినట్లు మేము బాధలో ఉన్నాము.
25 మీరు పొలాల్లోకి వెళ్లవద్దు!
    మీరు బాట వెంబడి వెళ్లవద్దు.
ఎందువల్లనంటే శత్రువువద్ద కత్తులున్నాయి.
    పైగా ఎటు చూచినా ప్రమాదమేవుంది.
26 ఓ నా ప్రజలారా, మీరు గోనెపట్టలు ధరించండి.
    బూడిదలో పొర్లండి[f]
చనిపోయినవారి కొరకు బాగా దుఃఖించండి!
    మీకున్న ఒక్కగానొక్క కుమారుడు మరణించినట్లు విచారించండి.
ఇవన్నీ మీరు చేయండి;
    కారణమేమంటే శత్రువు శరవేగంతో మనపైకి వస్తాడు!

27 “యిర్మీయా, నేను (యెహోవా)
    నిన్నొక లోహపరీక్షకునిగా నియమించినాను.
నీవు నా ప్రజల నడవడిని పరీక్షించు,
    వారిని గమనిస్తూ ఉండుము.
28 నా ప్రజలే నాకు వ్యతిరేకులయ్యారు;
    వారు చాలా మొండివారు.
    వారు ఇతరుల గురించి చెడు విషయాలు చెప్తారు.
వారు తుప్పుతో కప్పబడియున్న కంచు,
    ఇనుము లాంటివారు. వారంతా దుష్టులు.
29 నీవొక వెండిని శుద్ధిచేసే పనివానిలా ఉన్నావు.
కొలిమి తిత్తిలో బాగా గాలి వూదబడింది. అగ్ని ప్రజ్వరిల్లింది.
    కాని మంటలోనుండి కేవలం సీసం మాత్రమే వచ్చింది![g]
శుద్ద వెండిని చేయాలనుకోవటం వృధా ప్రయాస.
    వృధా కాలయాపన.
అదే విధంగా నా ప్రజలలో దుర్నడత పోలేదు.
30 ‘తిరస్కరించబడిన వెండి’ వంటివారని నా ప్రజలు పిలవబడతారు.
యెహోవా వారిని ఆమోదించలేదు
    గనుక వారికాపేరు పెట్టబడింది.”

మత్తయి 20

ద్రాక్షతోటలోని పనివాళ్ళు

20 యేసు, “దేవుని రాజ్యాన్ని ద్రాక్షతోట యజమానితో పోల్చవచ్చు. అతడు తన తోటలో పని చెయ్యటానికి పనివాళ్ళను నియమించాలని ఉదయమే లేచి వెళ్ళాడు. ఆ రోజు పనివాళ్ళకు ఒక దెనారా యివ్వటానికి అంగీకరించి వాళ్ళను తన ద్రాక్షతోటకు పంపాడు.

“అతడు ఉదయం తొమ్మిదిగంటలకు మళ్ళీ సంతకు వెళ్ళాడు. అక్కడ మరికొంత మంది ఏ పనీ చేయకుండా వూరికే నిల్చొని ఉండటం చూసాడు. అతడు వాళ్ళతో ‘మీరు కూడా వెళ్ళి నా ద్రాక్షతోటలో పని చెయ్యండి. మీక్కూడా సమంజసమైన కూలి యిస్తాను’ అని అన్నాడు. వాళ్ళు దానికి అంగీకరించి వెళ్ళారు.

“అతడు పన్నెండు గంటలప్పుడు, మూడు గంటలప్పుడు కూడా వెళ్ళి మళ్ళీ అలాగే చేసాడు. అతడు అయిదు గంటలప్పుడు మళ్ళీ వెళ్ళి మరి కొంతమంది అక్కడ నిలుచొని ఉండటం గమనించాడు. అతడు వాళ్ళతో ‘మీరు ఏమీ చెయ్యకుండా దినమంతా యిక్కడ ఎందుకు నిలుచున్నారు?’ అని అడిగాడు.

“‘మాకెవ్వరూ పనివ్వలేదు’ అని వాళ్ళు సమాధానం చెప్పారు.

“అతడు వాళ్ళతో ‘మీరు కూడా నా ద్రాక్షతోటలో పని చెయ్యండి!’ అని అన్నాడు.

“సాయంత్రం కాగానే ఆ ద్రాక్షతోట యజమాని పెద్ద దాసునితో ‘పనివాళ్ళందరిని పిలిచి చివరకు వచ్చిన వాళ్ళతో మొదలుపెట్టి కూలి యిచ్చేయి!’ అని అన్నాడు.

“అయిదు గంటలప్పుడు పని మొదలు పెట్టిన కూలీలు వచ్చారు. వాళ్ళకు ఒక దెనారా లభించింది. 10 మొదట పని మొదలుపెట్టిన వాళ్ళువచ్చి తమకు ఎక్కువ కూలి లభిస్తుందని ఆశించారు. కాని వాళ్ళకు కూడా ఒక దెనారా లభించింది. 11-12 వాళ్ళు కూలి తీసికొని యజమానునితో ‘చివరకు వచ్చిన వాళ్ళు ఒకే గంట పని చేసారు. ఎండను సహించి దినమంతా పనిచేసిన మమ్మల్ని, వాళ్ళనూ మీరు సమానంగా చూస్తున్నారు’ అని సణగటం మొదలు పెట్టారు.

13 “కాని అతడు ఒక కూలి వానితో, ‘మిత్రమా నేను నీకు అన్యాయం చేయటం లేదు. ఒక దెనారాకు పని చేస్తానని నీవు ఒప్పుకోలేదా? 14 నీ కూలి తీసికొని వెళ్ళిపో! నీకిచ్చిన కూలినే చివరను వచ్చిన వానికి కూడా యివ్వాలనుకొన్నాను. 15 నా డబ్బుతో నా యిష్టంవచ్చినట్లు చేసుకొనే అధికారం నాకులేదా? నేను ఔదార్యం చూపుతున్నందుకు నీవు ఓర్వలేకుండా ఉన్నావా?’ అని అన్నాడు.

16 “ఈ విధంగా చివరనున్న వాళ్ళు ముందుకు వస్తారు; ముందున్న వారు చివరకు వెళ్తారు” అని అన్నాడు.

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మార్కు 10:32-34; లూకా 18:31-34)

17 యేసు యెరూషలేముకు వెళ్తూ పండ్రెండు మంది శిష్యులను ప్రక్కకు పిలిచి ఈ విధంగా అన్నాడు: 18 “మనమంతా యెరూషలేమునకు వెళ్తున్నాము. అక్కడ మనుష్యకుమారుడు ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింప బడతాడు. వాళ్ళు ఆయనకు మరణ దండన విధించి, 19 యూదులుకాని వాళ్ళకప్పగిస్తారు. ఆ యూదులుకాని వాళ్ళు ఆయన్ని హేళన చేసి కొరడా దెబ్బలు కొట్టి సిలువకు వేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు.”

ఒక తల్లి కోరిన కోరిక

(మార్కు 10:35-45)

20 ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది.

21 యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు.

ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది.

22 యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు.

“త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

23 యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు.

24 మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు. 25 యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. 26 మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. 27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. 28 మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.

ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం

(మార్కు 10:46-52; లూకా 18:35-43)

29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.

31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.

32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.

33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International