M’Cheyne Bible Reading Plan
ప్రజలకు జ్ఞాపకాన్నిచ్చే రాళ్లు
4 ప్రజలంతా యొర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు: 2 “ప్రజల్లోనుండి 12 మందిని ఏర్పాటుచేయి. ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి. 3 నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ పన్నెండు రాళ్లను వెదికి వాటిని మీతోబాటు తీసుకొని వెళ్లాలి. ఈ రాత్రి మీరు నివాసంచేసే స్థలంలో ఆ రాళ్లను ఉంచండి.”
4 కనుక యెహోషువ ఒక్కొక్క వంశంనుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేసాడు. తర్వాత ఆ పన్నెండుమందినీ అతడు సమావేశపర్చాడు. 5 యెహోషువ వాళ్లతో ఇలా చెప్పాడు: “మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్లలో ఉన్న చోటుకు వెళ్లండి. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కొక్కరాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజంమీద మోయండి. 6 ఈ రాళ్లు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ‘ఈ రాళ్ల భావం ఏమిటి?’ అని మిమ్మల్ని అడుగుతారు. 7 యొర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా చేసాడు అని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్లలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొనేందుకు ఆ రాళ్లు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడుతాయి.”
8 కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యొర్దాను నది మధ్యలోనుండి పన్నెండు రాళ్లు వాళ్లు మోసుకొని వెళ్లారు. ఇశ్రాయేలీయుల పన్నెండు వంశాల్లో ఒక్కోదానికి ఒక్కోరాయిఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేసారు. ఆ మనుష్యులు ఆ రాళ్లు మోసుకొనిపోయి వారు నివాసము చేసిన చోట వాటిని ఉంచారు. 9 (యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యొర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోటకూడ యెహోషువ పన్నెండు రాళ్లు ఉంచాడు. నేటికీ ఆ రాళ్లు అక్కడ ఉన్నాయి.)
10 ప్రజలు చేయాల్సింది ఏమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక ఆ విషయాలన్నీ జరిగించేంతవరకు పవిత్ర పెట్టెను మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. 11 ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకొని వెళ్లారు.
12 రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగంమంది మగవాళ్లు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుష్యుల ముందు వీరు నదిని దాటారు. వీళ్లు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుడు వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు, మిగిలిన ప్రజలకు సహాయం చేయటానికి వీరు వెళ్తున్నారు. 13 యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు నలభై వేలమంది సైనికులు యెహోవా ఎదుట సాగిపోయారు. యెరికో మైదానాల దిశగా వారు సాగిపోయారు.
14 ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహామనిషిగా యెహోవా చేసాడు. అప్పట్నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్టే యెహోషువను కూడ వారు జీవితకాలమంతా గౌరవించారు.
15 ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే, 16 “యాజకులను నదిలోనుండి బయటకు రమ్మని ఆజ్ఞాపించు” అంటూ యెహోవా, యెహోషువతో చెప్పాడు.
17 కనుక యెహోషువ యాజకులకు, “యొర్దాను నదిలోనుండి బయటకు రండి” అని ఆజ్ఞాపించాడు.
18 యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకొని, నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు, నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే, నదిలో నీరు మరల ప్రవహించటం మొదలయింది. ప్రజలు నదిని దాటి వెళ్లక ముందులాగే నీరు గట్ల మీద పొర్లి పారుతున్నాయి.
19 మొదటి నెల పదో రోజున ప్రజలు యొర్దాను నది దాటారు. యెరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేసారు 20 యొర్దాను నదిలోనుంచి తీసుకొన్న పన్నెండు రాళ్లను ప్రజలు వారితో మోసుకొని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలువ బెట్టాడు. 21 అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు: “‘ఈ రాళ్లు ఏమిటి?’ అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రుల్ని అడుగుతారు 22 ‘ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేలమీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ రాళ్లు తోడ్పడుతాయి’ అని పిల్లలతో మీరు చెప్పాలి. 23 మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేసాడు. ప్రజలు దానిని దాటిపోయేంతవరకు నది ఎండిపోయింది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలకు యెహోవా ఏమి చేసాడో, యొర్దాను నది దగ్గరకూడ ఆయన అలానే చేసాడు. ప్రజలు దాటి వెళ్లగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. 24 యెహోవాకు మహాశక్తి ఉందని ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీనిని చేసాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు.”
యాత్ర కీర్తన.
129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
కాని వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
“యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
యాత్ర కీర్తన.
130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
2 నా ప్రభువా, నా మాట వినుము.
సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
3 యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
ఒక్క మనిషి కూడా మిగలడు.
4 యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.
5 యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
6 నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
7 ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
8 మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.
యాత్ర కీర్తన.
131 యెహోవా, నేను గర్విష్ఠిని కాను.
నేను ప్రముఖుడిని అన్నట్టు ప్రవర్తించ ప్రయత్నించను.
నేను గొప్ప పనులు చేయాలని ప్రయత్నించను.
నాకు మరీ కష్టతరమైన వాటిని గూర్చి నేను చింతించను.
2 నేను మౌనంగా ఉన్నాను. నా ప్రాణం నెమ్మదిగా ఉంది.
తల్లి చేతుల్లో సంతృప్తిగా ఉన్న ఒక శిశువులా
నా ప్రాణం మౌనంగా, నెమ్మదిగా ఉంది.
3 ఇశ్రాయేలూ, యెహోవానే నమ్ముకో.
ఇప్పుడు ఆయనను నమ్ముకో, ఎప్పటికీ ఆయన్నే నమ్ముకో.
64 నీవు ఆకాశాలను చీల్చుకొని
భూమి మీదికి దిగివస్తే అప్పుడు సమస్తం మారిపోతుంది.
పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.
2 మండుతున్న పొదల్లా, పర్వతాలు అగ్ని జ్వాలల్లో కాలిపోతాయి.
నిప్పుమీది నీళ్లలా పర్వతాలు కాగిపోతాయి.
అప్పుడు నీ శత్రువులు నిన్ను గూర్చి తెలుసుకొంటారు.
అప్పుడు రాజ్యాలన్ని నిన్ను చూడగా భయంతో వణుకుతాయి.
3 (కానీ నీ ఈ సంగతులు జరిగించాలని మేము నిజంగా కోరటంలేదు.
పర్వతాలు నీ ఎదుట కరగిపోతాయి.)
4 నీ ప్రజలు నిజంగా ఎన్నడూ నీ మాట వినలేదు.
నీవు చెప్పిన విషయాలను నీ ప్రజలు నిజంగా ఎన్నడూ వినలేదు.
నీవంటి దేవుణ్ణి ఏ మనిషీ ఎన్నడూ చూడలేదు. నీవు తప్ప ఇంక ఏ దేవుడూ లేడు.
ప్రజలు సహనంతో నీకొరకు కనిపెట్టివుంటే అప్పుడు నీవు వారికోసం గొప్ప కార్యాలు చేస్తావు.
5 మేలు చేయటంలో ఆనందించే మనుష్యులతో నీవు ఉన్నావు.
నీ జీవన విధానాలను ఆ మనుష్యులు జ్ఞాపకం చేసుకొంటారు.
కానీ చూడు, గతంలో మేము నీకు విరోధంగా పాపం చేశాము
అందుచేత నీవు మా మీద కోపగించావు.
6 మేమందరం పాపంతో మైలపడ్డాం.
మా “నీతి” అంతా పాత మైల గుడ్డల్లాంటిదే.
మేమందరం ఎండిపోయిన ఆకుల్లా ఉన్నాము.
మా పాపాలు మమ్మల్ని గాలిలా కొట్టుకుపోయాయి.
7 మేము నిన్ను ఆరాధించటం లేదు, నీ నామం మేము విశ్వసించలేదు.
నిన్ను వెంబడించాలనే సంబరం మాలో ఎవ్వరికీ లేదు.
అందుచేత నీవు మా వద్దనుండి తిరిగిపోయావు.
మేము పాపంతో నిండిపోయాం
గనుక నీ ఎదుట మేము నిస్సహాయులం.
8 కానీ, యెహోవా, నీవు మా తండ్రివి.
మేము మట్టిలాంటి వాళ్లం. నీవు కుమ్మరివి.
నీ చేతులే మమ్మల్ని అందర్ని చేశాయి.
9 యెహోవా, మా మీద ఇంకా కోపంతోనే ఉండకు.
మా పాపాలను శాశ్వతంగా జ్ఞాపకం చేసుకోవద్దు.
దయచేసి మమ్మల్ని చూడు,
మేము నీ ప్రజలము.
10 నీ పవిత్ర పట్టణాలు శూన్యంగా ఉన్నాయి. ఆ పట్టణాలు ఇప్పుడు అరణ్యాలవలె ఉన్నాయి.
సీయోను ఒక అరణ్యం.
యెరూషలేము నాశనం చేయబడింది.
11 మా పవిత్ర ఆలయం అగ్నిచేత కాల్చి వేయబడింది.
ఆ ఆలయం మాకు ఎంతో గొప్పది.
మా తండ్రులు అక్కడ నిన్ను ఆరాధించారు.
మాకు ఉండిన మంచి వస్తువులన్నీ ఇప్పుడు నాశనం చేయబడ్డాయి.
12 నీవు నీ ప్రేమను ఎన్నటికీ మాకు చూపకుండా ఉంచుతాయా ఈ వస్తువులు?
నీవు ఏమీ పలుకకుండనే కొనసాగుతావా?
శాశ్వతంగా నీవు మమ్మల్ని శిక్షిస్తావా?
యేసు విశ్రాంతి రోజుకు ప్రభువు
(మార్కు 2:23-28; లూకా 6:1-5)
12 ఒకప్పుడు ఒక విశ్రాంతి రోజున యేసు, తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆకలితో ఉండటం వల్ల కంకులు నలిపి తినటం మొదలు పెట్టారు. 2 పరిసయ్యులు ఇది చూసి యేసుతో, “విశ్రాంతి రోజు మీ శిష్యులు చెయ్యరాని పని చేస్తున్నారు” అని అన్నారు.
3-4 యేసు, “దావీదుకు, అతని అనుచరులకు ఆకలివేసినప్పుడు అతడు దేవాలయంలోకి ప్రవేశించారు. తర్వాత అతడు, అతని అనుచరులు దేవుని సన్నిధిలో పెట్టిన రొట్టెలు తిన్నారు. ఈ విషయాన్ని మీరు చదువలేదా? యాజకులకు తప్ప దావీదుకు కాని, అతని అనుచరులకు కాని, మరెవ్వరికి ఆ రొట్టెను తినే అధికారం లేదు. 5 అంతేకాక, యాజకులు విశ్రాంతి రోజు పని చేస్తారన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. ఇది మీరు చదువలేదా? వాళ్ళు అలా చెయ్యటం తప్పుకాదు. 6 నేను చెప్పేదేమిటంటే మందిరం కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. 7 ‘నాకు దయకావాలి, బలికాదు’(A) అన్న వాక్యంలోని అర్థం మీకు తెలిసివుంటే మీరు అమాయకుల్ని అవమానించే వాళ్ళు కాదు.
8 “విశ్రాంతి రోజుకు మనుష్యకుమారుడు ప్రభువు” అని అన్నాడు.
విశ్రాంతి రోజు యేసు నయం చేయటం
(మార్కు 3:1-6; లూకా 6:6-11)
9 ఆయన అక్కడి నుండి బయలుదేరి సమాజ మందిరానికి వెళ్ళాడు. 10 అక్కడ ఎండి పోయిన చేయిగలవాడొకడున్నాడు. యేసుపై నేరారోపణ చెయ్యాలని ఎదురుచూస్తున్న పరిసయ్యులు, ఆయన్ని, “విశ్రాంతి రోజు నయం చెయ్యటం ధర్మమా?” అని అడిగారు.
11 ఆయన వాళ్ళతో, “మీలో ఎవరి దగ్గరైనా ఒక గొఱ్ఱె ఉందనుకొండి. విశ్రాంతి రోజు అది గోతిలో పడితే దాన్ని పట్టి మీరు బయటికి లాగరా? 12 మరి మానవుడు గొఱ్ఱెలకన్నా ఎన్నోరెట్లు విలువైన వాడు కదా! అందువల్ల విశ్రాంతిరోజు మంచి చెయ్యటం ధర్మమే!” అని అన్నాడు.
13 అలా అన్నాక ఆ ఎండిపోయిన చెయ్యిగల వానితో, “నీ చేయి చాపు!” అని అన్నాడు. అతడు చేయి చాపాడు. చేయి పూర్తిగా నయమై రెండవ చెయ్యిలా అయింది. 14 కాని పరిసయ్యులు బయటికి వెళ్ళి, యేసును చంపటానికి పన్నాగం పన్నారు.
యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు
15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:
18 “ఆయన నేనెన్నుకున్న
నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(B)
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మార్కు 3:20-30; లూకా 11:14-23; 12:10)
22 ఆ తర్వాత కొందరు, దయ్యంపట్టి గ్రుడ్డివానిగా, మూగవానిగా అయిపోయిన ఒకతణ్ణి యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. యేసు అతనికి నయం చేసాడు. దానితో ఆ మూగ వానికి మాట, దృష్టి రెండూ వచ్చాయి. 23 ప్రజలందరికి ఆశ్చర్యమేసి, “ఈయన బహుశా దావీదు కుమారుడేమో!” అని అన్నారు.
24 పరిసయ్యులు ఇది విని, “దయ్యాల రాజైన బయెల్జెబూలు సహాయంతో యితడు దయ్యాలను వదిలిస్తున్నాడు. అంతే!” అని అన్నారు.
25 వాళ్ళ ఆలోచనలను యేసు తెలుసుకొన్నాడు. వాళ్ళతో, “విభాగాలైన ప్రతి రాజ్యం నశించి పోతుంది. విభాగాలైన ప్రతి పట్టణమూ, ప్రతి యిల్లు కూలిపోతుంది. 26 సైతాను సైతాన్ని పారద్రోలితే వాడు విడిపోతాడు. అప్పుడు వాని రాజ్యం ఏవిధంగా నిలుస్తుంది? 27 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాన్ని పారద్రోలుతున్నట్లైతే మీ కుమారులు ఎవరి ద్వారా పారద్రోలుతున్నారు? మీరంటున్నది తప్పని మీ వాళ్ళే ఋజువు చేస్తున్నారు. 28 ఒకవేళ నేను దేవుని ఆత్మ ద్వారా దయ్యాల్ని పారద్రోలుతున్నట్లైతే దేవుని రాజ్యం మీకు వచ్చినట్లేగదా! 29 అంతేకాక మొదట బలవంతుణ్ణి కట్టి వేయకుండా అతని యింట్లోకి వెళ్ళి అతని వస్తువుల్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఆ బలవంతుణ్ణి కట్టివేసాక అతని యింటిని దోచుకోగలరు. 30 నాతో ఉండని వాడు నాకు శత్రువుగా ఉంటాడు. నాతో కలసిమెలసి ఉండనివాడు చెదరిపోతాడు.
31 “అందువలన నేను చెప్పేదేమిటంటే మానవుడు చేసిన పాపాలన్నిటిని దేవదూషణను దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషించిన వాళ్ళను క్షమించడు. 32 మనుష్యకుమారుణ్ణి దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి దేవుడు క్షమిస్తాడు. కాని పవిత్రాత్మను దూషిస్తూ మాట్లాడిన వాణ్ణి ఈయుగంలో కాని, లేక రానున్న యుగంలో కాని క్షమించడు.
నీవు చేయునది నీవేమైయున్నావని చూపుతుంది
(లూకా 6:43-45)
33 “మీరు మంచిఫలాలు కావాలనుకుంటే, చెట్టును మంచిగా చేయాలి. నీ చెట్టు మంచిది కాకపోతే దానికి చెడ్డ ఫలాలు కాస్తాయి. పండును బట్టి చెట్టు ఎట్టిదో చెప్పబడుతుంది. 34 మీరు పాముల్లాంటి వాళ్ళు. దుష్టులు మంచి మాటలేవిధంగా ఆడగలుగుతారు. హృదయంలో ఉన్నదాన్ని నోరు మాట్లాడుతుంది. 35 మంచివానిలో మంచి ఉంటుంది. కనుక అతని నుండి మంచి బయటికి వస్తుంది. దుష్టునిలో చెడు ఉంటుంది కనుక అతని నుండి చెడు బయటికి వస్తుంది. 36 కాని నేను చెప్పేదేమిటంటే మానవులు తాము నిర్లక్ష్యంగా ఆడిన ప్రతి మాటకు తీర్పు చెప్పే రోజున లెక్క చెప్పవలసి ఉంటుంది. 37 ఎందుకంటే మీరాడిన మాటల్ని బట్టి మీరు నిరపరాధులో, అపరాధులో నిర్ణయింపబడుతుంది” అని అన్నాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మార్కు 8:11-12; లూకా 11:29-32)
38 ఆ తర్వాత కొందరు శాస్త్రులు, పరిసయ్యులు ఆయనతో, “బోధకుడా! మీరొక రుజువు చూపాలని మా కోరిక!” అని అన్నారు.
39 కాని ఆయన చెప్పాడు: “దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరంవాళ్ళు రుజువు చూపమని కోరుతారు. యోనా ప్రవక్త ద్వారా చూపిన రుజువు తప్ప మరే రుజువు చూపబడదు. 40 ఎందుకంటే, యోనా పెద్ద చేప కడుపులో మూడు పగళ్ళు, మూడు రాత్రులు గడిపాడు. అదే విధంగా మనుష్యకుమారుడు మూడు రాత్రులు, మూడు పగళ్ళు భూగర్భంలో గడుపుతాడు. 41 నీనెవె ప్రజలు యోనా ప్రకటించిన సందేశాన్ని విని మారు మనస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజు వాళ్ళు ఈ తరం వాళ్ళతో సహా నిలబడి ఈతరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తారు. కాని యిప్పుడు యోనా కంటె గొప్పవాడు యిక్కడున్నాడు.
42 “దక్షిణ దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని వినాలని చాలా దూరం నుండి వచ్చింది. కనుక తీర్పు చెప్పే రోజు ఆమె ఈ తరం వాళ్ళతో కలసి నిలబడి ఈ తరం వాళ్ళు నేరస్థులని నిర్ణయిస్తుంది. కాని యిప్పుడు సొలొమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు.
శూన్యమై ఉండుట అపాయము
(లూకా 11:24-26)
43 “దయ్యం పట్టిన వాని నుండి బయటికి వచ్చిన దయ్యం విశ్రాంతి కోసం వెతుకుతూ నీరులేని చోట తిరుగుతుంది. కాని దానికి విశ్రాంతి దొరకదు. 44 అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన నాయింటికి మళ్ళీ వెళ్తాను’ అని అనుకొంటుంది. అది తిరిగి వచ్చి, ఆయింటిని ఎవ్వరూ ఆక్రమించనట్లు, పైగా శుభ్రంగా వూడ్చి అన్నీ సరిదిద్దినట్లు గమనిస్తుంది. 45 అప్పుడది వెళ్ళి తనతో సహా, తనకన్నా దుష్టమైన ఏడు దయ్యాల్ని పిలుచుకు వస్తుంది. అన్నీ కలసి ఆ యింటిలోకి వెళ్ళి నివశిస్తాయి. అప్పుడా వ్యక్తి గతి మొదటికన్నా అధ్వాన్నం ఔతుంది. దుర్బుద్ధిగల ఈ తరం వాళ్ళకు ఇలాంటి గతి పడ్తుంది” అని చెప్పాడు.
యేసుని శిష్యులు ఆయన నిజమైన బంధువులు
(మార్కు 3:31-35; లూకా 8:19-21)
46 యేసు ప్రజలతో యింకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఇంతలో ఆయన తల్లి, సోదరులు ఆయనతో మాట్లాడాలనుకొని వచ్చి, బయట నిలబడ్డారు. 47 ఒకడు యేసుతో, “మీ తల్లి, సోదరులు మీతో మాట్లాడాలని బయట నిలుచొన్నారు!” అని అన్నాడు.
48 యేసు సమాధానం చెబుతూ, “ఎవరు నా తల్లి? ఎవరు నా సోదరులు?” అని అన్నాడు. 49 తన శిష్యుల వైపు చూపుతూ, “ఇదిగో నా తల్లి, నా సోదరులు. 50 ఎవరైతే పరలోకంలోని నా తండ్రి యిచ్చానుసారం నడుచుకొంటారో వాళ్ళే నా సోదరులు, నా చెల్లెండ్రు, నా తల్లి” అని అన్నాడు.
© 1997 Bible League International