Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 15

మోషే పాట

15 అప్పుడు మోషే, అతనితో బాటు ఇశ్రాయేలు ప్రజలూ యెహోవాకు ఈ పాట పాడటం మొదలు పెట్టారు.

“యెహోవాను గూర్చి నేను గానం చేస్తాను.
    ఆయన గొప్ప కార్యాలు చేసాడు గనుక గుర్రాలను,
రౌతులను ఆయనే సముద్రంలో పడవేసాడు.
యెహోవా నా బలం,
నన్ను రక్షించేది ఆయనే ఆయన్ని గూర్చి
    నేను స్తుతిగీతాలు పాడుకొంటాను.
యెహోవా నా దేవుడు,
    ఆయన్ని నేను స్తుతిస్తాను.
నా పూర్వీకుల దేవుడు[a] యెహోవా
    ఆయన్ని నేను ఘనపరుస్తాను.
యెహోవా గొప్ప వీరుడు. ఆయన పేరే యెహోవా.
ఫరో రథాలను, అశ్వదళాలను
    యెహోవా సముద్రంలో పడవేసాడు.
ఫరో ప్రధాన అధికారులు
    ఎర్ర సముద్రంలో మునిగిపోయారు.
లోతైన జలాలు వారిని కప్పేసాయి
    లోతు నీటిలో బండల్లా వాళ్లు మునిగిపొయ్యారు.

“నీ కుడిచేతిలో ఆశ్చర్యం కలిగించేటంత బలం ఉంది.
    ప్రభూ, నీ కుడిచేయి శత్రువును పటాపంచలు చేసింది.
నీకు వ్యతిరేకంగా నిలిచిన వారిని
    నీ మహా ఘనత చేత నాశనం చేసావు.
గడ్డిని తగుల బెట్టినట్టు
    నీ కోపం వారిని నాశనం చేసింది.
నీవు విసరిన పెనుగాలి
    నీళ్లను ఉవ్వెత్తున నిలిపేసింది
వేగంగా ప్రవహించే నీళ్లు గట్టి గోడలా అయ్యాయి సముద్రం,
    దాని లోపలి భాగాలవరకు గడ్డ కట్టెను.

“శత్రువు, ‘నేను వాళ్లను తరిమి పట్టుకొంటాను
    వాళ్ల ఐశ్వర్యాలన్నీ దోచుకొంటాను
    నేను నా కత్తి ప్రయోగించి, వాళ్ల సర్వస్వం దోచుకొంటాను
    సర్వం నా కోసమే నా చేతుల్తో దోచుకొంటాను’ అని అన్నాడు.
10 కానీ నీవు వాళ్ల మీదకి గాలి రేపి
    సముద్రంతో వాళ్లను కప్పేసావు
సముద్ర అగాధంలో సీసం మునిగిపోయినట్టు వాళ్లు మునిగిపొయ్యారు.

11 “యెహోవా, నీలాంటి పరాక్రమముగల దేవుడు మరొకడు లేడు
పరిశుద్ధతలో నీవు గొప్పవాడవు.
    స్తుతి కీర్తనలతో ఆరాధించబడుటకు యోగ్యుడవు
    ఆశ్చర్యకార్యములు చేయువాడవు నీకు సాటి వేరెవ్వరూ లేరు.
12 నీ కుడి హస్తాన్ని పైకెత్తి
    ప్రపంచాన్నే నాశనం చేయగలవు!
13 నీవు రక్షించిన ప్రజల్ని
    నీ దయతో నీవు నడిపిస్తావు
ఉల్లాసకరమైన నీ పవిత్ర దేశానికి
    నీ బలంతో నీవు వీళ్లను నడిపిస్తావు.

14 “ఈ గాథను ఇతర జన సమూహాలు వింటారు
    ఎంతైనా వాళ్లు భయపడ్తారు.
ఫిలిష్తీ ప్రజలు భయంతో వణకిపోతారు.
15 తరువాత ఎదోము నాయకులు భయంతో వణకిపోతారు.
మోయాబు నాయకులు భయంతో వణకిపోతారు.
కనాను ప్రజలు తమ ధైర్యం కోల్పోతారు.
16 ఆ ప్రజలు నీ బలాన్ని చూచి
    భయంతో నిండిపోతారు
యెహోవా ప్రజలు దాటి పొయ్యేంత వరకు
    ఆ ప్రజల్ని నీవు దాటించేంత వరకు వాళ్లు బండలా మౌనంగా ఉండిపోతారు.
17 యెహోవా నీవు నీ సింహాసనం కోసం సిద్ధం చేసిన
    నీ పర్వతానికి నీ ప్రజల్ని నడిపిస్తావు
    ఓ ప్రభూ, నీ హస్తాలతో నీ ఆలయాన్ని నిర్మించు.

18 “యెహోవా శాశ్వతంగా సదా ఏలునుగాక!”

19 ఫరో గుర్రాలు, రౌతులు, రథాలు సముద్రంలోకి వెళ్లిపొయ్యాయి. సముద్ర జలాలతో యెహోవా వాళ్లను కప్పేసాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు పొడి నేల మీద సముద్రంలో నడిచివెళ్లారు.

20 అప్పుడు అహరోను సోదరి, మహిళా ప్రవక్తి మిర్యాము తంబుర పట్టుకొంది. మిర్యాము, మిగతా స్త్రీలు పాటలు పాడుతూ నాట్యం చేయడం మొదలు పెట్టారు. మిర్యాము ఈ మాటనే మరల మరల పల్లవిగా పలికింది,

21 “ఆయన గొప్ప కార్యాలు చేసాడు
    గనుక యెహోవాకు గానం చేయండి గుర్రాలను,
దాని రౌతులను ఆయన సముద్రంలో పడవేసాడు.”

ఇశ్రాయేలీయులు ఎడారిలోనికి వెళ్లటం

22 మోషే మాత్రం ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం నుండి దూరంగా నడిపిస్తూనే ఉన్నాడు. ప్రజలు షూరు ఎడారిలోకి వెళ్లారు. ఎడారిలో మూడు రోజులు వాళ్లు ప్రయాణం చేసారు. ప్రజలకు నీళ్లు ఏవీ దొరకలేదు. 23 మూడురోజుల తర్వాత ప్రజలు మారాకు ప్రయాణమై వెళ్లారు. మారాలో నీళ్లున్నాయి గాని అవి త్రాగలేకపోయారు. ఆ నీళ్లు త్రాగలేనంత చేదుగా ఉన్నాయి. అందుకే ఆ స్థలానికి మారా[b] అని పేరు.

24 ప్రజలు మోషేకు ఫిర్యాదు చేయటం మొదలు బెట్టారు, “ఇప్పుడు మేము ఏమి త్రాగాలి?” అన్నారు ప్రజలు.

25 మోషే యెహోవాకు మొర పెట్టాడు. యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడు. మోషే ఆ చెట్టును నీళ్లలో వేసాడు. అతను యిలా చేయగానే ఆ నీళ్లు తాగే మంచి నీళ్లయ్యాయి.

ఆ స్థలంలో ప్రజలకు యెహోవా తీర్పు తీర్చి వారికి ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఆ ప్రజల విశ్వాసాన్ని కూడ యెహోవా పరీక్షించాడు. 26 “మీ యెహోవా దేవునికి మీరు విధేయులు కావాలి. ఆయన ఏవి సరైనవని చెబతాడో వాటిని మీరు చేయాలి. యెహోవా ఆజ్ఞలకు, చట్టానికి మీరు విధేయులైతే, ఈజిప్టు వాళ్లలా మీరు రోగులు అవ్వరు. నేను, యెహోవాను, ఈజిప్టు వాళ్ల మీదకు పంపిన రోగాలు ఏవీ మీ మీదకు పంపించను. నేనే యెహోవాను. మిమ్మల్ని స్వస్థపరచేవాడ్ని నేనే.”

27 అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత ఆ నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.

లూకా 18

పట్టు వదలని వితంతువు యొక్క ఉపమానం

18 నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను. అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది. చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు. కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”

ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా! మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా! ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.

పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు

తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’

13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మత్తయి 19:13-15; మార్కు 10:13-16)

15 యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు. 16 కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే. 17 యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మత్తయి 19:16-30; మార్కు 10:17-31)

18 ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.

19 “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు. 20 నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.

21 “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.

22 ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు. 23 ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.

24 యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.

ఎవరు రక్షింపబడగలరు

26 ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.

27 “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.

28 పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.

29 యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు. 30 ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.

యేసు తన మరణాన్ని గురించి మళ్ళీ మాట్లాడటం

(మత్తయి 20:17-19; మార్కు 10:32-34)

31 యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి. 32 ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు, 33 కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు. 34 శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; మార్కు 10:46-52)

35 యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు. 36 అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.

37 వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.

38 ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.

39 ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.

40 యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి 41 “ఏమి కావాలి?” అని అడిగాడు.

“ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.

42 యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.

43 వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.

యోబు 33

33 “అయితే యోబూ, దయచేసి నా సందేశాన్నివిను.
    నేను చెప్పే మాటలు గమనించు.
త్వరలోనే నేను మాట్లాడటం మొదలు పెడతాను. చెప్పటానికి నేను దాదాపు సిద్ధంగా ఉన్నాను.
నా హృదయం నిజాయితీ గలది. కనుక నిజాయితీగల మాటలను నేను చెబుతాను.
    నాకు తెలిసిన సంగతులను గూర్చి నేను సత్యం చెబుతాను.
దేవుని ఆత్మ నన్ను చేసింది.
    నా జీవం సర్వశక్తిమంతుడైన దేవుని నుండి వచ్చింది.
యోబూ, విను. నీవు చెప్పగలవనుకొంటే నాకు జవాబు చెప్పు.
    నీవు నాతో వాదించగలిగేందుకు నీ జవాబులు సిద్ధం చేసుకో.
దేవుని ఎదుట నీవు, నేను సమానం.
    మన ఇద్దరిని చేసేందుకు దేవుడు మట్టినే ఉపయోగించాడు.
యోబూ, నన్ను గూర్చి భయపడకు.
    నేను నీ యెడల కఠినంగా ఉండను.

“కాని యోబూ, నీవు చెబుతూండగా
    నేను విన్నది ఇదే.
నీవు అన్నావు: ‘యోబు అనే నేను నిర్దోషిని,
    నేను పాపం చేయలేదు. లేక ఏ తప్పు చేయలేదు. నేను దోషిని కాను.
10 నేను ఏ తప్పు చేయక పోయినప్పటికి దేవుడు నాలో ఏదో తప్పుకనుగొన్నాడు.
    యోబు అనేనేను దేవుని శత్రువును అని ఆయన తలుస్తున్నాడు.
11 కనుక దేవుడు నా పాదాలకు సంకెళ్లు వేస్తున్నాడు.
    నేను చేసేది సమస్తం దేవుడు గమనిస్తున్నాడు.’

12 “కాని యోబూ, దీని విషయం నీది తప్పు అని నేను నీతో చెప్పాలి.
    ఎందుకంటే దేవునికి అందరి కంటే ఎక్కువ తెలుసు కనుక.
13 యోబూ, నీవు ఎందుకు ఆరోపణ చేస్తూ దేవునితో వాదిస్తావు?
    దేవుడు చేసే ప్రతిదాని గూర్చీ ఆయన నీకు వివరించటం లేదని నీవెందుకు ఆలోచిస్తావు?
14 అయితే దేవుడు చేసే దాన్ని గూర్చి ఆయన వివరిస్తాడు.
    దేవుడు వేరువేరు విధానాలలో మాట్లాడతాడు. కానీ మనుష్యులు దాన్ని గ్రహించరు.
15-16 ఒక వేళ మనుష్యులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు కలలో లేక రాత్రి వేళ దర్శనంలో ఆయన వారి చెవులలో చెబుతాడేమో.
    అప్పుడు వారు దేవుని హెచ్చరికలు విని చాలా భయపడతారు.
17 మనుష్యులు చెడు సంగతులు జరిగించటం మాని వేయాలని,
    గర్విష్టులు, కాకుండా ఉండాలని దేవుడు హెచ్చరిస్తాడు.
18 మనుష్యులు మరణస్థానానికి వెళ్లకుండా రక్షించాలని హెచ్చరిస్తాడు.
    ఒక వ్యక్తి నాశనం చేయబడకుండా రక్షించటానికి దేవుడు అలా చేస్తాడు.

19 “లేక ఒక వ్యక్తి పడక మీద ఉండి దేవుని శిక్ష అనుభవిస్తున్నప్పుడు దేవుని స్వరం వినవచ్చును.
    ఆ వ్యక్తిని దేవుడు బాధతో హెచ్చరిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎముకలన్నీ నొప్పి పెట్టినట్లు అతడు బాధ పడుతున్నాడు.
20 ఆ వ్యక్తి భోజనం చేయలేడు.
    శ్రేష్టమైన భోజనం కూడ అసహ్యించుకొనేంతగా అతడు బాధ పడతాడు.
21 అతని చర్మం వేలాడేటంతగా, అతని ఎముకలు పొడుచుకొని వచ్చేంతగా
    అతని శరీరం పాడైపోతుంది.
22 ఆ మనిషి ఖనన స్థలానికి సమీపంగా ఉన్నాడు.
    అతని జీవితం చావుకు దగ్గరగా ఉంది.
23 కాని ఒకవేళ ఆ మనిషికి సహాయం చేయటానికి ఒక దేవదూత ఉండునేమో.
    నిజంగా దేవునికి వేలాది దూతలు ఉంటారు. అప్పుడు ఆ దూతలు ఆ మనిషి చేయాల్సిన సరియైన సంగతిని అతనికి తెలియజేస్తాడు.
24 మరియు ఆ దేవదూత ఆ మనిషి ఎడల దయగా ఉంటాడు,
    ‘ఈ మనిషిని చావు స్థలం నుండి రక్షించండి.
    అతని పక్షంగా చెల్లించేందుకు నేను ఒక మార్గం కనుగొన్నాను’
25 అప్పుడు ఆ మనిషి శరీరం మరల యవ్వనాన్ని, బలాన్ని పొందుతుంది.
    ఆ మనిషి యువకునిగా ఉన్నప్పటివలెనే ఉంటాడు.
26 ఆ మనిషి దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవుడు అతని ప్రార్థన వింటాడు.
    అప్పుడు ఆ మనిషి దేవుని ఆరాధిస్తూ సంతోషంగా ఉంటాడు.
    ఎందుకంటే, దేవుడు అతనికి సహజమైన మంచి జీవితాన్ని మరల ఇస్తాడు గనుక.
27 అప్పుడు ఆ మనిషి ప్రజల దగ్గర ఒప్పుకొంటాడు. అతడు చెబుతాడు, ‘నేను పాపం చేశాను.
    మంచిని నేను చెడుగా మార్చాను.
    కానీ దేవుడు శిక్షించాల్సినంత కఠినంగా నన్ను శిక్షించలేదు.
28 నా ఆత్మ ఖనన స్థలానికి వెళ్లకుండా దేవుడు నన్ను రక్షించాడు. నేను చాలా కాలం జీవిస్తాను.
    నేను మరల జీవితాన్ని అనుభవిస్తాను.’

29 “ఒక మనిషికి దేవుడు ఈ సంగతులను మరల మరల చేస్తాడు.
30 ఆ మనిషిని హెచ్చరించి, అతని ఆత్మను మరణ స్థలం నుండి రక్షించేందుకు.
    ఆ మనిషి తన జీవితాన్ని అనుభవించవచ్చు.

31 “యోబూ, నా మాట గమనించు. నా మాటవిను.
    మౌనంగా ఉండి, నన్ను మాట్లాడనియ్యి.
32 యోబూ, నీవు చెప్పాల్సింది ఏమైనా ఉంటే నన్ను విననీ.
    ఎందుకంటే, నీవు నిర్దోషివి అని రుజువు చేయగోరుతున్నాను గనుక.
    నీ వాదాన్ని సరిదిద్దేలాగా నాకు వినిపించు.
33 కానీ యోబూ, నీవు చెప్పాల్సింది ఏమీ లేకపోతే నా మాట విను.
    మౌనంగా ఉండు, జ్ఞానం గలిగి ఉండటం ఎలాగో నేను నేర్పిస్తాను.”

2 కొరింథీయులకు 3

క్రొత్త నిబంధన యొక్క సేవకులు

ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.

మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.

క్రొత్త నిబంధన యొక్క మహిమ

రాతిపలకపై అక్షరాలతో చెక్కబడిన నియమాలను దేవుడు యిచ్చినప్పుడు, మోషే ముఖం మీద మహిమాప్రకాశం కనిపించింది. తదుపరి ఆ మహిమ తగ్గుతూ పోయింది. అయినా ఇశ్రాయేలు ప్రజలు అతని ముఖం చూడలేక పోయారు. చావును కలిగించే పాలనలో మహిమ అంత గొప్పగా ఉంటే, దేవుని ఆత్మనిచ్చే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. శిక్షను కలిగించే పాలనలో అంత మహిమ ఉంటే, నీతిని స్థాపించే పాలనలో యింకెంత మహిమ ఉంటుందో ఆలోచించండి. 10 ఇప్పుడు మనకు లభించిన గొప్ప మహిమతో పోలిస్తే, గతంలో ఉండిన ఆ మహిమకు ప్రకాశం లేదు. 11 నశించిపోతున్న ఆ మహిమకు అంత ప్రకాశం ఉంటే చిరకాలం ఉండే మహిమకు యింకెంత ప్రకాశం ఉంటుందో ఆలోచించండి.

12 మాకు అంత నిరీక్షణ ఉంది కనుకనే మాలో యింత ధైర్యముంది. 13 తగ్గిపోతున్న తన ప్రకాశాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడరాదని మోషే తన ముఖానికి ముసుగు వేసుకొన్నాడు. మేము మోషేలాంటివాళ్ళము కాదు. 14 వాళ్ళు అర్థం చేసుకోలేదు. ఈ నాటికీ వాళ్ళు పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు వాళ్ళకు ముసుగు కనిపిస్తూవుంటుంది. దాన్ని ఎవ్వరూ తీయలేరు. క్రీస్తు మాత్రమే ఆ ముసుగు తీసివేయగలడు. 15 ఈ నాటికీ మోషే గ్రంథాలు చదివినప్పుడు ఆ ముసుగు వాళ్ళ బుద్ధిని కప్పివేస్తుంది. 16 కాని ప్రభువు వైపుకు మళ్ళినవాళ్ళ “ముసుగు తీసివేయబడింది.”(A) 17 ప్రభువే “ఆత్మ”. ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటే అక్కడ స్వేఛ్చ ఉంటుంది. 18 ముసుగు తీసివేయబడ్డ మా ముఖాల్లో ప్రభువు మహిమ ప్రకాశిస్తోంది. అది ఆత్మ అయినటువంటి ప్రభువు నుండి వచ్చింది. అనంతమైన ఆ మహిమ మమ్మల్ని ప్రభువులా మారుస్తోంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International