Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 దినవృత్తాంతములు 16

ఆసా కడపటి సంవత్సరాలు

16 ఆసా పాలనలో ముప్పై ఆరవ సంవత్సరంలో యూదా రాజ్యం మీదికి బయెషా దండెత్తాడు. బయెషా ఇశ్రాయేలు రాజు. అతడు రామా పట్టణానికి వెళ్లి దానిని కోటలా మర్చాడు. రామా పట్టణాన్ని బయెషా ఒక కీలక స్థానంగా వినియోగించి యూదా రాజు ఆసా వద్దకు వెళ్లటానికిగాని, అతని వద్ద నుండి బయటకు రావటానికి గాని ప్రజలకు ఆస్కారం లేకుండా చేశాడు. ఆలయం ఖజానాలో వున్న వెండి, బంగారు నిల్వలను ఆసా తీశాడు. రాజగృహంలో వున్న వెండి, బంగారాలను కూడా అతడు తీశాడు. తరువాత ఆసా తన దూతలను బెన్హదదు వద్దకు పంపాడు. బెన్హదదు అరాము (సిరియా) రాజు. అతడు దమస్కు (డెమాస్కస్) పట్టణంలో నివసిస్తున్నాడు. ఆసా పంపిన వర్తమానం యీలా వుంది. “బెన్హదదూ, మన ఇద్దరి మధ్య ఒక ఒడంబడిక కొనసాగేలా చూడు. అది నీ తండ్రికి, నా తండ్రికి మధ్య కొనసాగిన ఒడంబడికలా వుండాలి. చూడండి, మీకు నేను వెండి బంగారాలు పంపిస్తున్నాను. కనుక నీవిప్పుడు ఇశ్రాయేలు రాజైన బయెషాతో నీకున్న ఒడంబడికను రద్దు చేసుకోవాలి. తద్వారా అతడు నామీదకు రాకుండా, నన్ను ఒంటరిగా వదిలి, నన్ను బాధపెట్టడు.”

రాజైన ఆసా వర్తమానాన్ని బెన్హదదు అంగీకరించాడు. బెన్హదదు తన సైన్యాధిపతులను ఇశ్రాయేలు పట్టణాలపై దాడులు జరపమని పంపాడు. ఆ అధిపతులు ఈయోను, దాను ఆబేల్మాయీము పట్టణాలపై దాడి చేశారు. నఫ్తాలి ప్రాంతంలోవున్న పట్టణాలను కూడ వారు ఎదుర్కొన్నారు. ఈ పట్టణాలలో ధనాగారాలు వున్నాయి. ఇశ్రాయేలు పట్టణాలపై దాడులను గూర్చి బయెషా విన్నాడు. అది విని రామా పట్టణాన్ని దుర్గంగా మార్చే పనిని బయెషా విరమించుకున్నాడు. పనిని మధ్యలో ఆపివేశాడు. ఆ తరువాత రాజైన ఆసా యూదా ప్రజలను సమావేశపర్చాడు. వారంతా రామా పట్టణానికి వెళ్లి బయెషా కోట కట్టించటానికి తెప్పించిన రాళ్లను, కలపను పట్టుకుపోయారు. ఆసా, యూదా ప్రజలు ఆ రాళ్లను, కలపను గెబ, మిస్పా పట్టణాలను బలంగా కట్టడానికి వినియోగించారు.

ఆ సమయంలో దీర్ఝదర్శియైన హనానీ యూదా రాజైన ఆసా వద్దకు వచ్చాడు. హనానీ యీలా అన్నాడు: “ఆసా, నీకు సహాయం చేయటానికి నీవు అరాము (సిరియా) రాజుమీద ఆధారపడ్డావు గాని, దేవుడైన యెహోవాపై ఆధారపడలేదు. నీవు దేవుని మీద ఆధారపడవలసింది. నీవు సహాయానికి యెహోవాపై ఆధారపడలేదు గనుక, అరాము రాజు సైన్యం నీ అధీనం నుండి తప్పించుకున్నది. ఇథియోపియనులు లూబీయులు (లిబియావారు) చాలా శక్తివంతమైన పెద్ద సైన్యాలను కలిగియున్నారు. వారికి అనేక రథాలున్నాయి, రథసారధులు వున్నారు. కాని ఆసా, అంత పెద్ద సైన్యాన్ని ఓడించటానికి నీవు యెహోవాను నమ్ముకొని, ఆయన మీద ఆధారపడ్డావు. నీవు వారిని ఓడించేలా యెహోవా నీకు సహాయపడ్డాడు. యెహోవా కండ్లు భూమి నలుమూలలా పరిశీలించి తన పట్ల భక్తి విశ్వాసాలున్న వారిని చూస్తాయి. యెహోవా వారిని బలపర్చి రక్షిస్తాడు. ఆసా, నీవొక బుద్ధిలేని పని చేశావు. అందువల్ల ఇప్పటి నుండి నీవు యుద్ధాలు చేయవలసి వస్తుంది.”

10 అతడు చెప్పిన దానికి హనానీపై ఆసాకు కోపం వచ్చింది. ఆసాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అతడు హనానీని చెరసాలలో పెట్టించాడు. అదే సమయంలో ఆసా కొంతమంది మనుష్యులతో చాలా సంకుచితంగా, కఠినంగా ప్రవర్తించాడు.

11 మొదటి నుండి చివరి వరకు ఆసా చేసిన కార్యాలన్నీ యూదా, ఇశ్రాయేలు రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాయబడ్డాయి. 12 ఆసా రాజుగా కొనసాగిన ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో[a] అతని పాదాలకు జబ్బు చేసింది. అతని జబ్బు చాలా ప్రమాదంగా వున్నప్పటికీ, ఆసా యెహోవా నుండి సహాయం కోరలేదు. ఆసా వైద్యుల నుండి వైద్య సహాయంకొరకు చూశాడు. 13 ఆసా తన పరిపాలనలో నలబై ఒకటవ సంవత్సరంలో చనిపోయాడు. ఆ విధంగా ఆసా తన పూర్వీకులతో నిద్రించాడు. 14 దావీదు నగరంలో తనకై తాను సిద్ధపర్చుకున్న సమాధిలోనే ప్రజలు ఆసాను వుంచారు. ఆసాకు గౌరవ సూచకంగా సుగంధ దినుసులతోను, పరిమళ ద్రవ్యములతోను నిండిన పడక మీద జనులు వుంచి, అతనిని దహించారు.[b]

ప్రకటన 5

గ్రంథము, గొఱ్ఱెపిల్ల

ఆ తర్వాత, సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతిలో చుట్టబడియున్న ఒక గ్రంథాన్ని చూసాను. దాని యిరువైపులా ఏదో వ్రాయబడి ఉంది. దానిపై ఏడు ముద్రలు ఉన్నాయి. శక్తివంతమైన ఒక దేవదూత నాకు కనిపించాడు. అతడు పెద్ద స్వరంతో, “ఆ ముద్రలను విప్పి ఆ గ్రంథాన్ని తెరువగల యోగ్యుడెవరు?” అని ప్రకటించటం నేను చూసాను. పరలోకంలోగాని, భూమ్మీదగాని, పాతాళంలోగాని ఆ గ్రంథాన్ని తెరువగలవాడు, దాని లోపలవున్నది చూడగలవాడు ఎవ్వడూ నాకు కనిపించలేదు. ఆ గ్రంథాన్ని తెరువగలవాడు దాని లోపల ఏముందో చూడగల యోగ్యుడు కనిపించనందుకు నేను చాలా విలపించాను. అప్పుడు ఆ పెద్దల్లో ఒకడు నాతో, “విలపించవద్దు. యూదాతెగకు చెందిన సింహము, దావీదు వంశాంకురము విజయం పొందాడు చూడు. ఆ గ్రంథాన్ని, దాని ఏడు ముద్రల్ని తెరువగలవాడు ఆయనే!” అని అన్నాడు.

అప్పుడు నాకొక గొఱ్ఱెపిల్ల కనిపించింది. అది సింహాసనం మధ్య ఉంది. అది వధింపబడినదానిలా నాకు కనిపించింది. దాని చుట్టూ ఆ నాలుగు ప్రాణులు ఉన్నాయి. పెద్దలు ఉన్నారు. ఆ గొఱ్ఱెపిల్లకు ఏడు కొమ్ములు, ఏడు కళ్ళు ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు. దేవుడు ప్రపంచమంతా వ్యాపింపచేసింది ఈ ఆత్మలనే. ఆయన వచ్చి సింహాసనంపై కూర్చొన్నవాని కుడి చేతినుండి ఆ గ్రంథాన్ని తీసుకొన్నాడు. ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొన్న వెంటనే, ఆ నాలుగు జీవులు ఆ యిరవై నాలుగు మంది పెద్దలు, ఆ గొఱ్ఱెపిల్ల ముందు సాష్టాంగపడ్డారు. ప్రతి ఒక్కరి దగ్గర ఒక సితార ఉంది. సాంబ్రాణితో నిండిన బంగారు గిన్నెలు ఉన్నాయి. ఇవి విశ్వాసుల ప్రార్థనలన్న మాట. వాళ్ళు ఒక క్రొత్త కీర్తన పాడారు:

“నీవు వధింపబడినందుకు ప్రతి జాతినుండి ప్రతి భాషనుండి,
    ప్రతి దేశంనుండి,
ప్రతి గుంపునుండి,
    నీ రక్తంతో మానవుల్ని దేవుని కోసం కొన్నావు.
    కనుక ఆ గ్రంథాన్ని తీసుకొని దాని ముద్రలు విప్పే అర్హత నీవు పొందావు.
10 మా దేవుని కొరకు ఈ ప్రజలతో ఒక రాజ్యాన్ని సృష్టించావు. వాళ్ళను యాజకులుగా నియమించావు.
    వాళ్ళు ఈ ప్రపంచాన్ని పాలిస్తారు.”

11 ఆ తర్వాత చూస్తే నాకు చాలమంది దేవదూతల స్వరం వినిపించింది. వాళ్ళ సంఖ్య కోట్లకొలదిగా ఉంది. వాళ్ళు సింహాసనం చుట్టూ, ప్రాణుల చుట్టూ, పెద్దల చుట్టూ గుమికూడి ఉన్నారు. 12 వాళ్ళు బిగ్గరగా,

“శక్తిని, ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని, బలాన్ని, గౌరవాన్ని,
    మహిమను, స్తుతిని పొందటానికి వధింపబడిన గొఱ్ఱెపిల్ల యోగ్యమైనవాడు”

అని పాడారు.

13 ఆ తర్వాత పరలోకంలో, భూమ్మీద, పాతాళంలో, సముద్రం మీద ఉన్న ప్రతి ప్రాణి ఈ విధంగా పాడటం విన్నాను:

“సింహాసనంపై కూర్చున్న వానికి, గొఱ్ఱెపిల్లకు చిరకాలం స్తుతి,
    గౌరవము, మహిమ, శక్తి కల్గుగాక!”

14 ఆ నాలుగు ప్రాణులు, “ఆమేన్” అని అన్నాయి. పెద్దలు సాష్టాంగ నమస్కారం చేసి స్తుతించారు.

జెకర్యా 1

యెహోవా తన ప్రజలు తిరిగి రావాలని కోరుట

బెరక్యా కుమారుడు జెకర్యా. యెహోవా నుండి జెకర్యాకు ఒక వర్తమానం వచ్చింది. అది పర్షియా (పారశీకం) రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం, ఎనిమిదవ నెలలో వచ్చింది. (జెకర్యా తండ్రి పేరు బెరక్యా. బెరక్యా ఇద్దో కుమారుడు. ఇద్దో ఒక ప్రవక్త.) ఆ వర్తమానం ఇలా ఉంది.

యెహోవా మీ పూర్వీకుల పట్ల చాలా కోపంగా ఉన్నాడు. కావున ప్రజలకు నీవు ఈ విషయాలు తప్పక చెప్పాలి. “మీరు నా వద్దకు తిరిగి రండి; నేను మీ వద్దకు వస్తాను” అని సర్వశక్తి మంతుడైన యెహోవా చెపుతున్నాడు.

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులవలె మీరు ఉండవద్దు. గతంలో ప్రవక్తలు వారితో, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ చెడు జీవిత విధానాలను మార్చుకోమని మిమ్మల్ని కోరుతున్నాడు. చెడు కార్యాలు చేయటం మానండి!’ అని చెప్పాడు. కాని మీ పూర్వీకులు నా మాట వినలేదు.”

యెహోవా చెపుతున్నది యిదే. “మీ పూర్వీకులు పోయారు. ఆ ప్రవక్తలూ శాశ్వతంగా జీవించలేదు. ప్రవక్తలు నా సేవకులు. మీ పూర్వీకులకు నా ధర్మాన్ని, బోధనలను తెలియజెప్పటానికి నేను వారిని వినియోగించుకొన్నాను. చివరకు మీ పూర్వీకులు గుణపాఠం నేర్చుకున్నారు. ‘సర్వశక్తిమంతుడైన యెహోవా చేస్తానని చెప్పిన విషయాలు చేశాడు. మేము జీవించిన పద్ధతికి, మేము చేసిన చెడు పనులకు ఆయన మమ్మల్ని శిక్షించాడు’ అని వారు చెప్పారు. కావున వారు దేవుని వద్దకు తిరిగి వచ్చారు.”

నాలుగు గుర్రాలకు సంబంధించిన దర్శనం

పర్షియా రాజైన దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరం పదకొండవ నెల (షెబాటు) ఇరవై నాల్గవ రోజున జెకర్యా మరో వర్తమానాన్ని యెహోవానుండి అందుకున్నాడు. (జెకర్యా తండ్రి బెరక్యా, బెరక్యా తండ్రి ప్రవక్త అయిన ఇద్దో.)

రాత్రి వేళ ఒకడు ఎర్రగుర్రమునెక్కి స్వారీచేయటం నేను చూశాను. అతడు లోయలోని కదంబ చెట్ల మధ్య నిలుచున్నాడు. అతని వెనుక ఎర్రగుర్రాలు, చుక్కలు చుక్కలుగల గుర్రాలు మరియు తెలుపు గుర్రాలు ఉన్నాయి. “అయ్యా, ఈ గుర్రాలు ఏమిటి?” అని నాతో మాట్లాడుతున్న దేవదూతను నేను అడిగాను.

అప్పుడు దేవదూత నాతో మాట్లాడుతూ, “ఈ గుర్రాలు ఏనిటో నేను నీకు చెపుతాను” అని అన్నాడు.

10 అప్పుడు కదంబచెట్లమధ్య నిలుచున్న మనిషి, “యెహోవా ఈ గుర్రాలను భూలోకమంతా ఇటు అటు తిరగటానికి పంపించాడు” అని చెప్పాడు.

11 తరువాత కదంబ చెట్ల మధ్య నిలుచున్న యెహోవా దూతతో ఆ గుర్రాలు మాట్లాడాయి. “మేము భూలోకమంతా సంచరించాము. అంతా సవ్యంగా, శాంతంగా ఉంది” అని అవి చెప్పాయి.

12 అందుకు యెహోవా దూత, “ప్రభువా! యెరూషలేమును, యూదా నగరాలను ఓదార్చటానికి నీకు ఇంకా ఎంతకాలం పడుతుంది? ఇప్పటికి డెబ్బైయేండ్లగా ఈ నగరాలపై నీ కోపాన్ని చూపిస్తూ వచ్చావే” అన్నాడు.

13 అప్పుడు నాతో మాట్లాడుతూ వున్న దేవదూతకు యెహోవా సమాధానం చెప్పాడు. యెహోవా మంచివైన, ఓదార్పు మాటలు చెప్పాడు.

14 తరువాత దేవదూత నాతో ఇలా అన్నాడు: ఈ విషయాలను ప్రజలకు చెప్పు. సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు:

“యెరూషలేముపట్ల, సీయోనుపట్ల నాకు గాఢమైన ఆసక్తి ఉంది.
15     మిక్కిలి క్షేమంగా ఉన్నామని భావించే దేశాలపట్ల నేను చాలా కోపంగా వున్నాను.
నాకు కొంచెం కోపం వచ్చినప్పుడు.
    నా జనులను శిక్షించటానికి నేను ఆ రాజ్యాలను వినియోగించాను.
    కాని ఆ రాజ్యాలు వీరికి చాలా హాని చేశాయి.”
16 కాబట్టి యెహోవా ఏమి చెపుతున్నాడంటే, “నేను ప్రేమతో యెరూషలేముకు తిరిగి వచ్చి ఆమెను ఓదార్చుతాను. యెరూషలేము మళ్లీ నిర్మింపబడుతుంది.
    మరియు నా ఆలయం అక్కడ కట్టబడుతుందని సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు” అని చెప్పు.

17 “ప్రజలకు ఈ విషయాలు కూడా చెప్పు, సర్వశక్తిమంతుడైన యెహోవా,
    ‘నా పట్టణాలు మళ్లీ భాగ్యవంత మవుతాయి.
నేను సీయోనును ఓదార్చుతాను.
    నేను యెరూషలేమును నా ప్రత్యేక నగరంగా ఎంపిక చేసుకుంటాను’” అని చెపుతున్నాడు.

నాలుగు కొమ్ములు మరియు నలుగురు పనివారు

18 అప్పుడు నేను పైకిచూడగా అక్కడ నాలుగు కొమ్ములు చూశాను. 19 నాతో మాట్లాడుతున్న దేవదూతను, “ఈ కొమ్ముల అర్థమేమిటి?” అని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు: “ఇవి ఇశ్రాయేలు, యూదా, యెరూషలేము ప్రజలను ఇతర దేశాలకు పోయేలా ఒత్తిడి చేసిన కొమ్ములు.”

20 తరువాత యెహోవా నలుగురు పనివారిని నాకు చూపించాడు. 21 “ఈ నలుగురు పనివారు ఏమి చేయటానికి వస్తున్నారు?” అని నేనతనిని అడిగాను.

అతడు ఇలా చెప్పాడు, “ఈ మనుష్యులు ఆ కొమ్ములను నాశనం చేయటానికి వచ్చారు. ఆ కొమ్ములు యూదాప్రజలను అన్యదేశాలకు పోయేలా ఒత్తిడి చేశాయి. ఆ కొమ్ములు ఎవ్వరికీ కనికరం చూపలేదు. యూదా ప్రజలపై దాడిచేసి, వారిని అన్యదేశాలకు వెడలగొట్టిన రాజ్యాలకు చిహ్నలుగా ఈ కొమ్ములు ఉన్నాయి.”

యోహాను 4

యేసు సమరయ స్త్రీతో మాట్లాడటం

యేసు యోహాను కన్నా ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకుంటున్నాడని, అతని కన్నా ఎక్కువ మందికి బాప్తిస్మము నిస్తున్నాడని పరిసయ్యులు విన్నారు. నిజానికి, బాప్తిస్మము నిచ్చింది యేసు కాదు. ఆయన శిష్యులు. యేసు యిది గమనించి, యూదయ వదిలి మళ్ళీ గలిలయకు వెళ్ళిపోయాడు. ఆయన సమరయ ద్వారా ప్రయాణం చేయవలసివచ్చింది.

ప్రయాణం చేసి సమరయలోని సుఖారు అనే గ్రామాన్ని చేరుకున్నాడు. ఈ గ్రామాన్ని ఆనుకొని ఉన్న భూమిని, యాకోబు తన కుమారుడైన యోసేపుకు యిచ్చాడు. అక్కడ యాకోబు బావి ఉండేది. యేసు ప్రయాణంవల్ల అలసి ఆ బావి దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. ఒక సమరయ స్త్రీ నీళ్ళు తోడుకొని వెళ్ళటానికి వచ్చింది. యేసు ఆమెతో, “అమ్మా! నాకు త్రాగటానికి నీళ్ళిస్తావా?” అని అడిగాడు. ఆయన శిష్యులు ఆహారం కొనుక్కొని రావటానికి పట్టణంలోకి వెళ్ళారు.

ఆ సమరయ స్త్రీ ఆయనతో, “మీరు యూదులు, నేను సమరయ స్త్రీని, నన్ను నీళ్ళివ్వమని అడుగుతున్నారే?” అని అన్నది. యూదులు సమరయులతో స్నేహంగా ఉండరు.

10 యేసు సమాధానం చెబుతూ, “దేవుడు ఏమివ్వగలడో నీకు తెలియదు. నిన్ను నీళ్ళు ఎవరు అడుగుతున్నారో నీకు తెలియదు. అది నీకు తెలిసివుంటే నేను అడగటానికి బదులు నీవు నన్ను నీళ్ళు అడిగేదానివి. నేను నీకు జీవజలాన్నీ యిచ్చేవాణ్ణి” అని అన్నాడు.

11 ఆ స్త్రీ, “అయ్యా! బావి లోతుగా ఉంది. పైగా మీ దగ్గర చేదటానికి ఏమిలేదు. ఈ జీవజలం మీకెట్లాలభిస్తుంది? 12 మీరు మా తండ్రి యాకోబు కన్నా గొప్పవారా? అతడు ఈ బావి మాకిచ్చాడు. ఈ బావి నీళ్ళు అతడు, అతని కుమారులు, అతని గొఱ్ఱెలు త్రాగాయి” అని అన్నది.

13 యేసు, “ఈ నీళ్ళు త్రాగినా మళ్ళీ దాహం వేస్తుంది! 14 కాని నేనిచ్చే నీళ్ళు త్రాగినవానికి మళ్ళీ దాహం కాదు. నేనిచ్చిన నీళ్ళు అతనిలో ఒక సజీవమైన ఊటగా మారి అతనికి అనంత జీవితాన్నిస్తుంది” అని సమాధానం చెప్పాడు.

15 ఆ స్త్రీ, “అయ్యా! నాకు మళ్ళీ దాహం కలుగకుండా, నేను నీళ్ళు చేదటానికి ఇక్కడికి ప్రతిరోజూ రాకుండా ఉండేటట్లు నాకా జలాన్ని ప్రసాదించండి” అని అడిగింది.

16 ఆయన, “వెళ్ళి నీ భర్తను పిలుచుకొని రా!” అని ఆమెతో అన్నాడు.

17 “నాకు భర్తలేడు” అని ఆమె తెలియచెప్పింది.

యేసు, “నీకు భర్త లేడని సరిగ్గా సమాధానం చెప్పావు. 18 నిజానికి నీకు ఐదుగురు భర్తలుండిరి. ప్రస్తుతం నీవు ఎవరితో నివసిస్తున్నావో అతడు నీ భర్తకాడు. నీవు నిజం చెప్పావు” అని అన్నాడు.

19 ఆమె, “అయ్యా! మీరు ప్రవక్తలా కనిపిస్తున్నారు. 20 మా పూర్వులు ఈ కొండ మీద పూజించారు. కాని మీ యూదులు, ‘మేము పూజించవలసింది యిక్కడ కాదు, యెరూషలేములో పూజించాలి’ అని అంటున్నారు” అని అన్నది.

21 యేసు, “నన్ను నమ్మమ్మా! తండ్రిని ఆరాధించటానికి ఈ కొండ మీదికి గాని లేక యెరూషలేముకు గాని వెళ్ళవలసిన అవసరం తీరిపోయే సమయం వస్తుంది. 22 మీ సమరయ దేశస్థులు తెలియనిదాన్ని ఆరాదిస్తారు. రక్షణ యూదుల నుండి రానున్నది కనుక మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. 23 నిజమైన ఆరాధికులు తండ్రిని ఆత్మతోను, సత్యముతోను ఆరాధించే సమయం రానున్నది. ఆ సమయం ఇప్పుడే వచ్చింది కూడా. ఎందుకంటే తండ్రి అటువంటి ఆరాధికుల కోసమే ఎదురు చుస్తున్నాడు. 24 దేవుడు ఆత్మ అయివున్నాడు. కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను, సత్యముతోను ఆరాధించాలి” అని అన్నాడు.

25 ఆ స్త్రీ, “క్రీస్తు అనబడే మెస్సీయ రానున్నాడని నాకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మాకన్నీ విశదంగా చెబుతాడు” అని అన్నది.

26 యేసు, “నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే!” అని అన్నాడు.

27 అదే క్షణంలో ఆయన శిష్యులు తిరిగి వచ్చారు. ఆయనొక స్త్రీతో మాట్లాడటం చూసి ఆశ్చర్యపడ్డారు. కాని, “మీకేమి కావాలి?” అని కాని, లేక, “ఆమెతో ఎందుకు మాట్లాడుతున్నావు” అని కాని వాళ్ళు అడగలేదు.

28 ఆ స్త్రీ తన కడవనక్కడ వదిలి గ్రామంలోకి తిరిగి వెళ్ళిపోయింది. 29 ప్రజలతో, “రండి! నేను చేసిన వాటన్నిటీని చెప్పిన వ్యక్తిని చూడండి. ఈయనే క్రీస్తు అవును గదా” అని అన్నది. 30 వాళ్ళందరూ గ్రామంనుండి బయలుదేరి ఆయన దగ్గరకు వచ్చారు.

31 ఇంతలో ఆయన శిష్యులు, “రబ్బీ! భోజనం చెయ్యండి” అని వేడుకున్నారు.

32 కాని ఆయన వాళ్ళతో, “నా దగ్గర తినటానికి ఆహారం ఉంది. కాని ఆ ఆహారాన్ని గురించి మీకేమీ తెలియదు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు, “ఆయన కోసం ఎవరో భోజనం తెచ్చివుంటారు!” అని పరస్పరం మాట్లాడుకున్నారు.

34 యేసు, “నన్ను పంపిన వాని కోరిక తీర్చటం, ఆయన కార్యాన్ని పూర్తి చేయటమే, నా భోజనం. 35 ‘విత్తిన తర్వాత నాలుగు నెలల్లో పంట వస్తుంది!’ అని మీరంటున్నారు. కాని నేను చెప్పేదేమిటంటే కళ్ళు తెరచి పొలాల వైపు చూడండి. పంట కోయటానికి సిద్ధంగా ఉంది. 36 దాన్ని విత్తినవాడు, కోసేవాడు ఫలం పొందుతున్నారు. అనంత జీవితం కోసం, అతడు ఆ పంటను కోస్తున్నాడు. తద్వారా విత్తనం నాటినవాడు, పంట కోసే వాడు, యిద్దరూ ఆనందిస్తారు. 37 ‘విత్తనం ఒకడు నాటితె ఫలం ఇంకొకడు పొందుతాడు’ అన్న సామెత ఈ సందర్భంలో వర్తిస్తుంది. 38 మీరు కష్టపడి పని చెయ్యని పంట కోయటానికి మిమ్మల్ని పంపాను, దాని కోసం యితర్లు చాలా కష్టించి పని చేసారు. వాళ్ళ కష్టానికి మీరు ఫలం పొందుతున్నారు” అని చెప్పాడు.

39 ఆ పట్టణంలో ఉన్న సమరయ ప్రజలతో ఆ స్త్రీ, “నేను చేసినదంతా ఆయన చెప్పాడు” అని చెప్పింది. ఆ కారణంగా అనేకులు యేసును నమ్మారు. 40 అందువల్ల ఆ సమరయ ప్రజలాయన దగ్గరకు వెళ్ళి తమతో ఉండుమని వేడుకున్నారు. ఆయన వాళ్ళతో రెండు రోజులున్నాడు. 41 ఆయన చెప్పిన విషయాల వలన యింకా అనేకులు విశ్వాసులైయ్యారు.

42 ఆ సమరయ ప్రజలు ఆమెతో, “మొదట నీవు చెప్పిన విషయాలు విని ఆయన్ని విశ్వసించాము. కాని యిప్పుడు మేము ఆయన మాటలు స్వయంగా విన్నాము. కనుక ఆయన్ని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాము. ఆయన ప్రపంచాన్ని రక్షించటానికి వచ్చిన వాడని మాకు బాగ తెలిసిపోయింది” అని అన్నారు.

రాజ్యాధికారి కుమారునికి నయం చేయటం

(మత్తయి 8:5-13; లూకా 7:1-10)

43 రెండు రోజుల తర్వాత ఆయన గలిలయకు వెళ్ళాడు. 44 అక్కడ యేసు, “ప్రవక్తకు తన స్వగ్రామంలో గౌరవం లేదు” అని అన్నాడు. 45 ఆయన గలిలయ వచ్చాక అక్కడి ప్రజలు ఆయనకు స్వాగతమిచ్చారు. గలిలయ ప్రజలు కూడా పస్కా పండుగ కోసం యోరూషలేము వెళ్ళారు. కనుక, వాళ్ళు ఆయన అక్కడ పండుగ రోజుల్లో చేసిన వాటన్నిటిని చూశారు.

46 యేసు, తాను నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన గలిలయలోని “కానా” ను మళ్ళీ దర్శించాడు. కపెర్నహూము పట్టణంలో ఒక రాజ్యాధికారి ఉండేవాడు. అతని కుమారుడు జబ్బుతో ఉన్నాడు. 47 యేసు యూదయ నుండి గలిలయకు వచ్చాడని విని ఆ రాజ్యాధికారి ఆయన దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి చావుకు దగ్గరగా ఉన్న తన కుమారునికి నయం చేయుమని వేడుకున్నాడు. 48 “మహాత్కార్యాలు, అద్భుతాలు చూస్తే కాని మీరు నమ్మరు” అని యేసు అతనితో అన్నాడు.

49 ఆ రాజ్యాధికారి, “అయ్యా! నా కుమారుడు మరణించకముందే దయచేసి రండి!” అని అన్నాడు.

50 యేసు, “నీవు వెళ్ళు! నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్నాడు.

అతడు యేసు మాట విశ్వసించి వెళ్ళి పోయాడు. 51 అతడు యింకా దారిలో ఉండగానే అతని సేవకులు ఎదురుగా వచ్చి బాబుకు నయమై పోయిందని చెప్పారు.

52 అతడు వాళ్ళను తన కుమారునికి ఏ సమయంలో నయమైందని అడిగాడు.

వాళ్ళు, “నిన్న ఒంటిగంటకు జ్వరం విడిచింది” అని సమాధానం చెప్పారు.

53 సరిగ్గా అదే సమయానికి యేసు తనతో, “నీ కుమారుడు జీవిస్తాడు” అని అన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అందువల్ల అతడు, అతని యింట్లోని వాళ్ళంతా ప్రభువుని నమ్మారు.

54 యూదయ దేశం నుండి గలిలయకు వచ్చాక యిది యేసు చేసిన రెండవ మహాత్కార్యము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International