M’Cheyne Bible Reading Plan
సొలొమోను ప్రార్థన
12 సొలొమోను యెహోవా బలిపీఠానికి ఎదురుగా నిలబడ్డాడు. సమావేశమైన ఇశ్రాయేలు ప్రజల కెదురుగా అతడు నిలబడ్డాడు. పిమ్మట సొలొమోను తన రెండు చేతులూ చాచాడు. 13 సొలొమోను కంచుతో ఒక ఎత్తైన వేదిక నిర్మించాడు. దాని పొడవు ఏడున్నర అడుగులు; వెడల్పు ఏడున్నర ఆడుగులు; ఎత్తు ఎడున్నర అడుగులు అతడు దానిని బయట ఆవరణలో మధ్యగా వుంచాడు. అతడు దానిమీదకు ఎక్కి, సమావేశమైన ఇశ్రాయేలు ప్రజానీకం ముందు మోకరించాడు. సొలొమోను తన చేతులను ఆకాశంవైపుకు ఎత్తాడు. 14 పిమ్మట సొలొమోను యిలా ప్రార్థన చేశాడు:
“ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీవంటి దేవుడు భూమిమీదగాని, ఆకాశంలోగాని మరొక్కడు లేడు. ప్రేమ, కరుణతో కూడిన నీ ఒడంబడికను నీవు నిలబెట్టుకున్నావు. నీ ప్రజలంతా పూర్ణహృదయంతో సన్మార్గులై, నిన్ను అనుసరిస్తే నీ ఒడంబడిక కొనసాగిస్తావు. 15 నీ సేవకుడైన దావీదుకు నీవిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు. దావీదు నా తండ్రి. స్వయంగా నీ నోటితో ఆ వాగ్దానం చేశావు. ఈనాడు ఆ వాగ్దానాన్ని స్వయంగా నీ చేతులతో నిజమయ్యేలా చేశావు. 16 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, ఇప్పుడు నీవు నీ సేవకుడైన దావీదుకు ఇచ్చిన మాట నిలబెట్టుము. నీవిలా మాట యిచ్చావు: ‘దావీదూ, నా సన్నిధిలో ఇశ్రాయేలు సింహాసనంపై నీ కుటుంబంలో ఒకడు తప్పక కొనసాగుతాడు. నీ కుమారులు వారు చేసే కార్యాలలో తగిన జాగ్రత్త వహిస్తేనే ఇది జరుగుతుంది. నా ధర్మాశాస్త్రాన్ని నీవు అనుసరించిన రీతిలో, నీ కుమారులు కూడ నా ధర్మాశాస్త్రాన్ని పాటించాలి.’ 17 ఇశ్రాయేలు దేవుడవగు ఓ ప్రభూ, నీ వాగ్దానం నిజమగుగాక! ఈ వాగ్దానం నీ సేవకుడైన దావీదుకు యిచ్చాయున్నావు.
18 “ఓ దేవా, నీవు నిజంగా మానవులతో కలిసి భూమి మీద నివసించవని మాకు తెలుసు. ఆకాశాలు గాని, మహా ఆకాశాలు గాని నిన్ను నిలుపజాలవు! అటువంటప్పుడు నేను నిర్మించిన ఈ చిన్న ఆలయం నిన్ను భరింపలేదని కూడా మాకు తెలుసు! 19 కానీ నీ కరుణ కొరకు నేను చేయు ప్రార్థనను, అభ్యర్థనను ఆలకించు. నా దేవుడైన ప్రభూ, నా మొరాలకించుము! నీ కొరకు నా ప్రార్థనయందు శ్రద్ధ వహించుము. నేను నీ సేవకుడను. 20 ఈ ఆలయాన్ని నీవు కన్నులార రాత్రింబవళ్లు చూడాలని నా ప్రార్థన. ఈ స్థలంలో నీ పేరును ప్రతిష్ఠిస్తావని నీవు చెప్పియున్నావు. ఈ ఆలయాన్ని చూస్తూ నేను చేసే నా ప్రార్థనను నీవు విందువుగాక! 21 నేను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు చేయు ప్రార్థనలను ఆలకించుము. ఈ ఆలయాన్ని చూస్తూ మేము చేయు ప్రార్థనలయందు లక్ష్యముంచుము. ఆకాశంలో నీవున్న చోటు నుంచే మా ప్రార్థన వినుము. నీవు మా ప్రార్థనలను విన్నప్పుడు మమ్మల్ని మన్నించుము.
22 “ఒక మనిషి వేరొక మనిషిపట్ల అపచారం చేసిన నేరానికి పాల్పడవచ్చు. అది జరిగినప్పుడు నిందితుడు నీపేరు మీద ఒక ప్రమాణం చేయాలి. ఆలయంలోని నీ బలిపీఠం ముందు అతడు ప్రమాణం చేయటానికి వచ్చినప్పుడు 23 నీవు ఆకాశంలోని నీ నివాసము నుండి వినుము. అప్పుడు నీ సేవకులను విచారించి చర్య తీసుకొనుము. దుష్టుని శిక్షించుము. అతడు ఇతరులను బాధ పెట్టిన విధంగా తానుకూడా ఆ బాధను అనుభవించేలా చేయుము. మంచి కార్యములు చేసిన వాని నిర్దోషిత్వాన్ని నిరూపింపుము.
24 “నీ ప్రజలైన ఇశ్రాయేలీయులు నీపట్ల పాపం చేసిన కారణంగా ఒక శత్రువు వారిని ఓడించవచ్చు. తరువాత ఇశ్రాయేలీయులు తిరిగి వచ్చి నీ నామస్మరణ చేసి నిన్నాశ్రయించి ఈ ఆలయంలో నిన్ను ప్రార్థస్తూ వేడుకుంటే, 25 ఆకాశంలో వుండి నీ ఇశ్రాయేలీయుల రోదన విని వారిని క్షమింపుము. నీవు వారికి, వారి పూర్వీకులకు ఇచ్చిన రాజ్యానికి వారిని తిరిగి తీసుకొని రమ్ము.
26 “వర్షాలు లేకుండ ఆకాశం కుంచుకుపోవచ్చు. ఇశ్రాయేలు ప్రజలు నీపట్ల పాపం చేసినట్లయితే ఇది జరుగుతుంది. కాని ఇశ్రాయేలీయులు నీ శిక్షకు గురియై తమ తప్పు తెలిసికొని పశ్చాత్తాపము పొంది, ఆలయం వైపు తిరిగి నీ నామస్మరణ చేసి ప్రార్థిస్తే, 27 నీవు ఆకాశంలో నుండి వారి మొరాలకించుము. వారి విన్నపము ఆలకించి వారి పాపాలను క్షమించుము. ఇశ్రాయేలు ప్రజలు నీ సేవకులు. వారు జీవించవలసిన సన్మార్గాన్ని వారికి బోధించుము. నీ రాజ్యంలో వర్షాలు కురిపించుము. నీవు ఈ రాజ్యాన్ని నీ ప్రజలకు ఇచ్చావు.
28 “ఈ రాజ్యంలో కరువు రావచ్చు. వ్యాధులు వ్యాపించవచ్చు. పంటలకు తెగుళ్లు సోకవచ్చు. తోటలకు తేనెమంచు వ్యాధుల, మిడతల, పురుగుల పీడ సంభవించవచ్చు. ఇశ్రాయేలీయుల నగరాలపై శత్రుదాడులు జరిగినప్పుడుగాని, ఇశ్రాయేలులో ఏ రకమైన వ్యాధులు ప్రబలినా, 29 ఇశ్రాయేలు ప్రజలు తమ బాధలు గ్రహించి నిన్ను ప్రార్థించి వేడుకుంటే, ఏ బాధితుడేగాని ఈ ఆలయాన్ని చూస్తూ చేతులెత్తి ప్రార్థిస్తే, 30 నీ నివాస స్థలమైన ఆకాశంనుండి వారి అభ్యర్థన ఆలకించుము. వారి మొరాలకించి, వారిని క్షమించుము. ప్రతి వ్యక్తికి వానికి అర్హమైన దాని నివ్వుము. ఎందువల్లననగా ప్రతివాని హృదయం నీకు తెలుసు. మానవ హృదయాలను తెలుసుకొనే శక్తి నీ వొక్కనికే వుంది. 31 అప్పుడు మా పూర్వీకులకు నీవిచ్చిన ఈ రాజ్యంలో ప్రజలు నివసించినంత కాలం నీపట్ల భయభక్తులు కలిగి వుంటారు. 32 నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు చెందని పరదేశీయుడెవడైనా తన సుదూరదేశం నుండి ఇక్కడికి రావచ్చును. అతడు నీ మహోన్నత నామం వినిగాని, తిరుగులేని నీ బాహుబలం గూర్చి వినిగాని, చాచిన నీ చేతుల ప్రభావం వినిగాని రావచ్చును. అతడు వచ్చి నీ ఆలయంవైపు చూస్తూ ప్రార్థన చేస్తే, 33 నీ ఆకాశ నివాసం నుండి వాని ప్రార్థన ఆలకించుము. ఆ పరదేశి కోరిన సహాయాన్ని అందించుము. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ నీ నామ మహిమను, నీ ప్రభావాన్ని తెలుసుకొని, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులవలె నీ పట్ల భయ భక్తులతో మెలుగుతారు. దానితో ప్రపంచ ప్రజలంతా నేను నిర్మించిన ఈ ఆలయం నీ పేరు మీద పిలువ బడుతూ వుందని తెలుసుకుంటారు.
34 “నీవు నీ ప్రజలను తమ శత్రువుల మీదికి ఒక చోటికి యుద్దానికి పంపితే, వారు ఈ నగరంవైపు, నేను నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి నిన్ను తలంచి ప్రార్థన చేసిన పక్షంలో 35 వారి ప్రార్థన ఆకాశంనుండి నీవు ఆలకించి తగిన సహాయం చేయుము.
36 “ప్రజలు నీకు విరుద్ధంగా పాపం చేస్తారు. సామాన్యంగా పాపం చేయని మానవులుండరు. అలాగే ఈ ప్రజలు నీపట్ల పాపం చేసినప్పుడు నీకు వారిపై కోపం రావటం సహజం. ఒకానొక శత్రువు వచ్చి వారిని ఓడించి బందీలుగా దూరదేశానికో, దగ్గర దేశానికో తీసుకొని పోయేలా నీవు చేయవచ్చు. 37 కాని వారు బందీలుగా వున్న రాజ్యంలో వున్నప్పుడు వారిలో పరివర్తన వచ్చి నిన్ను ప్రాధేయపడవచ్చు. ‘మేము పాపం చేశాము; మేము తప్పు చేశాము; మేము దుర్మార్గంగా ప్రవర్తించాము,’ అని వారు పరితపించవచ్చు. 38 పరితపించి వారు మళ్లీ హృదయపూర్వకంగా, ఆత్మ సాక్షిగా తాము బందీలుగా వున్న దేశంలోనే వారు నిన్ను ఆశ్రయించవచ్చు. నీవు వారి పితరులకు యిచ్చిన దేశంవైపు, నీవు ఎంపిక చేసిన నీ నగరంవైపు చూస్తూ నిన్ను ప్రార్థించవచ్చు. నేను నీ పేరు మీద నిర్మించిన ఈ ఆలయంవైపు తిరిగి ప్రార్థించవచ్చు. 39 ఇలా జరిగిన సందర్భంలో ఆకాశంలో నుండి నీవు వారి మొర ఆలకించుము. ఆకాశం నీ నివాసం. నీపట్ల పాపం చేసిన నీ ప్రజలైన వారి ప్రార్థన, వారి మనవి ఆలకించి, వారిని క్షమించి సహాయపడుము. 40 ఓ నాప్రభూ, నీ నేత్రాలను విప్పమని, నీ చెవులను ఒగ్గుమని నేను ప్రాధేయపడుచున్నాను. ఈ స్థానంలో మేము చేసే ప్రార్థనపట్ల శ్రద్ధ వహించుము.
41 “ఓ ప్రభూ, మేలుకో తండ్రీ, నీ మహత్తర శక్తికి నిదర్శనమైన ఒడంబడిక పెట్టెతో
నీ విశ్రాంతి ఆలయాన్ని ప్రవేశించుము.
నీ యాజకులు రక్షణ పొందుదురు గాక!
ఓ ప్రభూ, దేవా, పవిత్రులైన నీ ప్రజలకు సుఖశాంతులను కలుగజేయుము!
42 ఓ దేవా, నీవల్ల అభిషిక్తుడైన వానిని తిరస్కరించవద్దు.
నీ సేవకుడైన దావీదు చేసిన విశ్వాసపాత్రమైన కార్యాలను జ్ఞాపకముంచు కొనుము!”
దేవుని కుమారునిలో విశ్వాసము
5 యేసే క్రీస్తు అని నమ్మినవాణ్ణి దేవుడు తన సంతానంగా పరిగణిస్తాడు. తండ్రిని ప్రేమించిన ప్రతీ ఒక్కడు కుమారుణ్ణి ప్రేమించినట్లుగా పరిగణింపబడతాడు. 2 దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞల్ని పాటించటం వల్ల ఆయన కుమారుణ్ణి ప్రేమిస్తున్నట్లు మనము తెలుసుకోగలము. 3 ఆయన ఆజ్ఞల్ని పాటించి మనము మన ప్రేమను వెల్లడి చేస్తున్నాము. ఆయన ఆజ్ఞలు కష్టమైనవి కావు. 4 దేవుని కారణంగా జన్మించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మనలో ఉన్న ఈ విశ్వాసం వల్ల మనము ఈ ప్రపంచాన్ని జయించి విజయం సాధించాము. 5 యేసు దేవుని కుమారుడని విశ్వసించే వాళ్ళే ప్రపంచాన్ని జయిస్తారు.
దేవుడు తన కుమారుణ్ణిగూర్చి మనకు చెప్పాడు
6 యేసు క్రీస్తు నీళ్ళద్వారా, రక్తంద్వారా వచ్చాడు. ఆయన నీళ్ళద్వారా మాత్రమే రాలేదు. నీళ్ళద్వారా, రక్తంద్వారా కూడా వచ్చాడు. ఆత్మ సత్యవంతుడు. అందుకే ఆ ఆత్మ సాక్ష్యం చెపుతున్నాడు. 7 సాక్ష్యం చెప్పేవారు ముగ్గురున్నారు. 8 ఆత్మ, నీళ్లు, రక్తం. ఈ ముగ్గురూ ఒకే సాక్ష్యాన్ని చెపుతున్నారు.
9 మనము మనుష్యుల సాక్ష్యం అంగీకరిస్తాము. కాని యిది దేవుని సాక్ష్యం కనుక యింకా గొప్పది. ఈ సాక్ష్యం తన కుమారుణ్ణి గురించి యిచ్చింది. 10 దేవుని కుమారుని పట్ల విశ్వాసమున్నవాడు ఈ సాక్ష్యాన్ని నమ్ముతాడు. దేవుడు తన కుమారుని విషయంలో యిచ్చిన సాక్ష్యం నమ్మనివాడు దేవుడు అసత్యవంతుడని నిందించినవాడౌతాడు. 11 ఆ సాక్ష్యం యిది! దేవుడు మనకు నిత్యజీవం యిచ్చాడు. ఈ జీవము ఆయన కుమారునిలో ఉంది. 12 కుమారుణ్ణి స్వీకరించినవానికి ఈ జీవము లభిస్తుంది. ఆ కుమారుణ్ణి స్వీకరించనివానికి జీవం లభించదు.
చివరి మాట
13 దేవుని కుమారుని పేరులో విశ్వాసం ఉన్న మీకు నిత్యజీవం లభిస్తుంది. ఈ విషయం మీకు తెలియాలని యివన్నీ మీకు వ్రాస్తున్నాను. 14 దేవుణ్ణి ఆయన యిష్టానుసారంగా మనము ఏది అడిగినా వింటాడు. దేవుణ్ణి సమీపించటానికి మనకు హామీ ఉంది. 15 మనమేది అడిగినా వింటాడని మనకు తెలిస్తే మన మడిగింది మనకు లభించినట్లే కదా!
16 మరణం కలిగించే పాపము తన సోదరుడు చెయ్యటం చూసినవాడు తన సోదరుని కోసం దేవుణ్ణి ప్రార్థించాలి. అప్పుడు దేవుడు అతనికి క్రొత్త జీవితం యిస్తాడు. ఎవరి పాపం మరణానికి దారితీయదో వాళ్ళను గురించి నేను మాట్లాడుతున్నాను. మరణాన్ని కలిగించే పాపం విషయంలో ప్రార్థించమని నేను చెప్పటం లేదు. 17 ఏ తప్పు చేసినా పాపమే. కాని మరణానికి దారితీయని పాపాలు కూడా ఉన్నాయి.
18 దేవుని బిడ్డగా జన్మించినవాడు పాపం చెయ్యడని మనకు తెలుసు. తన బిడ్డగా జన్మించినవాణ్ణి దేవుడు కాపాడుతాడు. సాతాను అతణ్ణి తాకలేడు. 19 మనము దేవుని సంతానమని, ప్రపంచమంతా సాతాను ఆధీనంలో ఉందని మనకు తెలుసు. 20 దేవుని కుమారుడు వచ్చి నిజమైనవాడెవడో తెలుసుకొనే జ్ఞానాన్ని మనకు యిచ్చాడు. ఇది మనకు తెలుసు. మనము నిజమైనవానిలో ఐక్యమై ఉన్నాము. ఆయన కుమారుడైన యేసు క్రీస్తులో కూడా ఐక్యమై ఉన్నాము. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నిత్యజీవం. 21 బిడ్డలారా! విగ్రహాలకు దూరంగా ఉండండి.
దేవునికి హబక్కూకు ఫిర్యాదు చేయటం
1 ప్రవక్తయైన హబక్కూకునకు ఇవ్వబడిన వర్తమానం ఇది.
2 యెహోవా, నేను సహాయం కొరకు అర్థిస్తూనే వున్నాను. నీవు నా మొర ఎన్నడు ఆలకిస్తావు? దౌర్జన్యం విషయంలో నేను నీకు మొరపెట్టాను. కాని నీవేమీ చేయలేదు! 3 ప్రజలు వస్తువులను దొంగిలిస్తున్నారు. ఇతరులను బాధపెట్టుతున్నారు. ప్రజలు వాదులాడుతూ, కలహిస్తున్నారు. నీవెందుకు నన్నీ భయంకర విషయాలు చూసేలా చేస్తున్నావు? 4 న్యాయవ్యవస్థ బలహీనపడింది. ప్రజలకు న్యాయం జరుగటం లేదు. మంచివారిపై దుష్టులు తమ తగాదాలలో గెలుస్తున్నారు. అందువల్ల న్యాయం ఎంతమాత్రం పక్షపాత రహితంగా లేదు.
దేవుడు హబక్కూకునకు సమాధానమివ్వటం
5 యెహోవా సమాధానమిచ్చాడు: “ఇతర జనులవైపు చూడు! వారిని గమనించు. నీకు విస్మయం కలుగుతుంది. నీ జీవిత కాలంలో నీకు విస్మయం కలిగించే ఒక పని చేస్తాను. నీవు అది నమ్మాలంటే చూసి తీరాలి. దాని విషయం నీకు చెపితే అది నీవు నమ్మవు. 6 బబులోను ప్రజలను నేను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దుతాను. ఆ ప్రజలు నీచులు; శక్తిగల యుద్ధవీరులు. వారు భూమికి అడ్డంగా నడుస్తారు. వారికి చెందని ఇండ్లను, నగరాలను వారు వశపర్చుకుంటారు. 7 బబులోనువారు ఇతర ప్రజలను భయపెడతారు. బబులోనువారు వారు చేయదల్చుకున్నది చేస్తారు; వెళ్ళదల్చుకున్న చోటుకి వెళతారు. 8 వారి గుర్రాలు చిరుతపులులకంటే వేగం కలవి. సూర్యుడు అస్తమించాక అవి తోడేళ్ళకంటె నీచంగా ఉంటాయి. వారి గుర్రపు దళంవారు దూరప్రాంతలనుండి వస్తారు. ఆకలిగొన్న గరుడ పక్షి ఆకాశంనుండి కిందికి దూసుకు వచ్చినట్లు, వారు తమ శత్రువులను వేగంగా ఎదుర్కొంటారు. 9 వారంతా చేయకోరుకునే ఒకే ఒక్క విషయం యుద్ధం. వారి సైన్యాలు ఎడారిలో గాలిలా వేగంగా నడుస్తాయి. మరియు బబులోను సైనికులు అనేకానేక మందిని చెరబడతారు. ఇసుక రేణువుల్లా లెక్కలేనంత మందిని పట్టుకుంటారు.
10 “బబులోను సైనికులు ఇతర దేశాల రాజులను చూసి నవ్వుతారు. పరదేశ పాలకులు వారికి హాస్యగాండ్రవలె ఉంటారు. పొడవైన, బలమైన గోడలు గల నగరాలను చూచి బబులోను సైనికులు నవ్వుతారు. ఆ సైనికులు గోడమీదికంటె మట్టి బాట సునాయాసంగా నిర్మించి, నగరాలను తేలికగా జయిస్తారు. 11 పిమ్మట వారు గాలిలా వెళ్లి మరో ప్రాంతంలో యుద్ధం చేస్తారు. బబులోనువారు ఆరాధించే ఒకే ఒక్క వస్తువు వారి స్వయంశక్తి.”
హబక్కూకు రెండవ ఫిర్యాదు
12 పిమ్మట హబక్కూకు చెప్పాడు:
“యెహోవా, నీవు ఎల్లకాలములయందు ఉండే దేవుడవు!
నీవు చావులేని పవిత్ర దేవుడవు!
యెహోవా, జరుగవలసిన కార్యం జరిపించటానికే నీవు బబులోను ప్రజలను సృష్టించావు.
మా ఆశ్రయ దుర్గమా, యూదా ప్రజలను శిక్షించటానికి నీవు వారిని సృష్టించావు.
13 నీ కండ్లు దుష్టత్వాన్ని చూడలేవు.
ప్రజలు తప్పు చేయటాన్ని నీవు చూడలేవు.
మరి అటువంటి నీవు ఆ దుష్టులు జయించటం ఎలా చూడగలుగుతున్నావు?
దుష్టులు మంచివారిని ఓడించటం నీవెలా చూడగలుగుతున్నావు?
14 “నీవు ప్రజలను సముద్రంలో చేపల్లా తయారు చేశావు.
నాయకుడులేని చిన్న సముద్ర జంతువుల్లా వారున్నారు.
15 వారందరినీ గాలాలు, వలలు వేసి శత్రువు పట్టుకుంటాడు.
శత్రువు వారిని తన వలలో పట్టి లాగుతాడు,
తను పట్టుకున్న దానిని చూసి శత్రువు చాలా సంతోషిస్తాడు.
16 శత్రువు తను భాగ్యవంతుడుగా నివసించటానికి,
మంచి ఆహారం తినటానికి అతని వల అతనికి సహాయపడుతుంది.
కావున శత్రువు తన వలను ఆరాధిస్తాడు.
తన వల యొక్క గౌరవార్థం అతడు దానికి బలులు అర్పించి, ధూపంవేస్తాడు.
17 తన వలతో ధనాన్ని తీసుకుపోవటం అతడు కొనసాగిస్తాడా?
దయా దాక్షిణ్యం లేకుండా అతడు (బబులోను సైన్యం) ప్రజలను నాశనం చేయటం కొనసాగిస్తాడా?”
యూదా నాయకులు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 21:23-27; మార్కు 11:27-33)
20 ఒక రోజు మందిరంలో యేసు ప్రజలకు బోధిస్తూ, సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రధానయాజకులు, శాస్త్రులు, పెద్దలు అంతా కలిసి ఆయన దగ్గరకు వచ్చారు. 2 “ఎవరిచ్చిన అధికారంతో నీవు ఇవన్నీ చేస్తున్నావు? నీకీ అధికారం ఎవరిచ్చారు? చెప్పు” అని వాళ్ళు అడిగారు.
3 ఆయన, “నన్నొక ప్రశ్న అడుగనివ్వండి. 4 యోహానుకు బాప్తిస్మము నిచ్చే అధికారం ఎవరిచ్చారు? దేవుడా? లేక ప్రజలా” అని అన్నాడు.
5 వాళ్ళు పరస్పరం ఈ విధంగా చర్చించుకున్నారు: “దేవుడంటే, అతడు ‘మరి మీరు యోహానును ఎందుకు నమ్మలేదు?’ అని అంటాడు 6 ప్రజలంటే, ‘ప్రజలు యోహానును ఒక ప్రవక్త అని విశ్వాసిస్తూ ఉండేవాళ్ళు కనుక వాళ్ళు మనల్ని రాళ్ళతో కొడతారు.’ 7 అందువల్ల ఆ అధికారం ఎక్కడినుండి వచ్చిందో మాకు తెలియదు” అని సమాధానం చెప్పారు.
8 యేసు, “మరి అలాగైతే నేను కూడా ఎవరి అధికారంతో యివన్నీ చేస్తున్నానో చెప్పను” అని అన్నాడు.
రైతుల ఉపమానం
(మత్తయి 21:33-46; మార్కు 12:1-12)
9 ఆ తర్వాత ప్రజలకు ఈ ఉపమానం చెప్పటం మొదలు పెట్టాడు: “ఒకడు ఒక ద్రాక్షాతోట వేసి రైతులకు కౌలుకిచ్చి చాలాకాలం దేశాంతరం వెళ్ళి పోయ్యాడు. 10 పండ్లు కోసే సమయానికి తన పాలు వసూలు చేసుకురమ్మని సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కొట్టి వట్టి చేతుల్తో పంపారు. 11 ఆ ఆసామి మరొక సేవకుణ్ణి పంపాడు. ఆ రైతులు అతణ్ణి కూడా బాగా కొట్టి అవమానించి వట్టిచేతుల్తో పంపారు. 12 అతడు మూడవవాణ్ణి పంపాడు. వాళ్ళతణ్ణి తీవ్రంగా గాయపరచి తరిమి వేసారు.
13 “ఆ ద్రాక్షాతోట యజమాని, ‘నేనేం చెయ్యాలి? ఆ! నా ముద్దుల కొడుకుని పంపుతాను. బహుశా వాళ్ళతణ్ణి గౌరవించవచ్చు’ అని అనుకున్నాడు. 14 కాని రైతులు అతని కుమారుణ్ణి చూసి, తమలో ‘ఇతడు వారసుడు కనుక యితణ్ణి చంపేద్దాం. అప్పుడు ఈ తోట మనకే ఉంటుంది’ అని నిశ్చయించుకొన్నారు. 15 అతణ్ణి ద్రాక్షాతోట నుండి బైటకు తరిమి చంపివేసారు.
“ఆ ద్రాక్షాతోట ఆసామి వాళ్ళనేమి చేస్తాడు? 16 వచ్చి ఆ రైతుల్ని చంపేసి ఆ ద్రాక్షాతోట యింకొకరికి కౌలుకు యిస్తాడు” అని అన్నాడు.
ప్రజలు యిది విని, “అలా ఎన్నటికి జరుగకూడదు” అని అన్నారు. 17 యేసు వాళ్ళవైపు సూటిగా చూసి, “మరి అలాగైతే లేఖనాల్లో వ్రాయబడిన ఈ వాక్యానికి అర్థమేమిటి:
‘పనికి రానిదని ఇళ్ళుకట్టేవాళ్ళు పారవేసిన రాయి ముఖ్యమైన రాయి అయింది’?(A)
18 ఆ రాయిమీద ఎవరు పడతారో వాళ్ళు ముక్కలై పోతారు. ఆ రాయి ఎవరి మీద పడుతుందో వాళ్ళు నలిగిపోతారు” అని అన్నాడు.
19 శాస్త్రులు, ప్రధాన యాజకులు ఈ ఉపమానం తమను ఉద్దేశించి చెప్పిందని గ్రహించి ఆయన్ని బధించటానికి వెంటనే ప్రయత్నించారు. కాని ప్రజల్ని చూసి భయపడి పోయారు.
యూదా నాయకులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మత్తయి 22:15-22; మార్కు 12:13-17)
20 వాళ్ళు సరియైన అవకాశం కోసం ఎదురు చూడసాగారు. కనుక వాళ్ళు తమ వాళ్ళను కొందర్ని రహస్యంగా ఆయన దగ్గరకు పంపారు. వాళ్ళు మంచి వాళ్ళుగా నటిస్తూ యేసు చెప్పిన విషయాల్లో ఏదైనా తప్పు పట్టి ఆయన్ని ఆ ప్రాంతం యొక్క రాజ్యాధికారికి అప్పగించటానికి ప్రయత్నించసాగారు. ఆ రాజ్యాధికారికి శిక్షించటానికి అధికారం ఉంది. 21 ఒక రోజు వాళ్ళు యేసుతో, “బోధకుడా! మీరు సత్యం మాట్లాడుతారు. సత్యం బోధిస్తారు. పక్షపాతం చూపరు. దేవుని మార్గాన్ని ఉన్నది ఉన్నట్లు బోధిస్తారని మాకు తెలుసు. 22 మరి మేము చక్రవర్తికి పన్నులు కట్టాలా వద్దా?” అని అడిగారు.
23 వాళ్ళ పన్నాగం గమనించి 24 యేసు, “ఒక దేనారా చూపండి. దాని మీద ఎవరి బొమ్మవుంది? ఎవరి పేరు ఉంది?” అని అడిగాడు.
“చక్రవర్తిది” అని వాళ్ళు సమాధానం చేప్పారు.
25 ఆయన, “అలాగైతే చక్రవర్తికి చెందింది చక్రవర్తికి యివ్వండి. దేవునికి చెందింది దేవునికి యివ్వండి” అని అన్నాడు.
26 ఆయన అక్కడ ప్రజల సమక్షంలో చెప్పిన ఈ సమాధానంలో వాళ్ళు ఏ తప్పూ పట్టలేక పోయారు. పైగా వాళ్ళాయన సమాధానానికి ఆశ్చర్యపడి మౌనం వహించారు.
కొందరు సద్దూకయ్యులు యేసును మోసగించుటకు ప్రయత్నించటం
(మత్తయి 22:23-33; మార్కు 12:18-27)
27 చనిపొయ్యాక మళ్ళీ బ్రతికిరారని వాదించే సద్దూకయ్యుల తెగకు చెందిన కొందరు యేసు దగ్గరకు వచ్చి ఈ విధంగా ప్రశ్నించారు: 28 “బోధకుడా! మోషే ‘ఒక వ్యక్తి సంతానం లేకుండా మరణిస్తే అతని సోదరుడు ఆ చనిపోయిన వానికి సంతానం కలుగ చేయటానికి అతని భార్యను వివాహం చేసుకోవాలి’ అని వ్రాశాడు. 29 ఒక్కప్పుడు ఏడుగురు సోదరులుండే వారు. మొదటి వాడు పెళ్ళి చేసుకొని సంతానం లేకుండా మరణించాడు. 30 రెండవవాడు ఆమెను పెళ్ళి చేసుకొని మరణించాడు. 31 మూడవవాడును ఆమెను పెళ్ళి చేసుకొన్నాడు. అదేవిధంగా ఆ ఏడుగురు సోదరులు సంతానం లేకుండా మరణించారు. 32 చివరకు ఆమెకూడా మరణించింది. 33 మరణించిన వాళ్ళందరూ బ్రతికి వచ్చినప్పుడు ఆమెను ఆ ఏడుగురూ పెళ్ళి చేసుకొంటారు గనుక ఆమె ఎవరి భార్య అవుతుంది?” అని అడిగారు.
34 యేసు, “ఈ భూమ్మీద వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తారు. చేసుకొంటారు. 35 పరలోకమునకు పునరుత్థానమగుటకు అర్హత ఉన్నవాళ్ళు అనంత జీవితం పొంది రానున్న కాలంలో జీవిస్తారు. అప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, చెయ్యరు. 36 వాళ్ళు దేవదూతల వలె, దేవుని కుమారులవలె ఉంటారు. కనుక వారిక చావరు. వాళ్ళు మరణాన్ని జయించి బ్రతికి వచ్చిన వాళ్ళు కనుక దేవుని సంతానంగా పరిగణింపబడతారు. 37 మండుచున్న పొదను గురించి వ్రాస్తూ, ‘ప్రజలు చావునుండి బ్రతికింపబడతారు’ అని మోషే సూచించాడు. ఎందుకంటే, అతడు ప్రభువును గురించి ప్రస్తావిస్తూ ‘ప్రభువు అబ్రాహాముకు, ఇస్సాకుకు, యాకోబుకు దేవుడు’(B) అని వ్రాసాడు. 38 ప్రభువు చనిపోయిన వాళ్ళకు దేవుడు కాదు. ఆయన సజీవంగా ఉన్నవాళ్ళకే దేవుడు. ఆయన అందర్ని జీవిస్తున్న వాళ్ళుగా పరిగణిస్తాడు” అని అన్నాడు.
39 కొందరు శాస్త్రులు, “బోధకుడా! చక్కగా చెప్పారు” అని అన్నారు. 40 ఆ తదుపరి ఆయన్ని ప్రశ్నించటానికి ఎవరికి ధైర్యం చాలలేదు.
క్రీస్తు దావీదు కుమారుడా లేక దావీదుకు ప్రభువా?
(మత్తయి 22:41-46; మార్కు 12:35-37)
41 ఆ తర్వాత యేసు వాళ్ళతో, “క్రీస్తు దావీదు కుమారుడని వాళ్ళు ఎందుకు అంటున్నారు? 42-43 దావీదు, తన కీర్తనలో ఈ విధంగా వ్రాశాడు కదా!
‘ప్రభువు నా ప్రభువుతో:
నేను నీ శత్రువుల్ని నీ పాదపీఠంగా చేసేవరకూ
నా కుడి వైపు కూర్చో’(C)
44 దావీదు ఆయన్ని ‘ప్రభూ!’ అని అన్నాడు కదా! అలాంటప్పుడు ఆయన దావీదు కుమారుడెట్లా ఔతాడు?” అని అన్నాడు.
శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)
45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
© 1997 Bible League International