Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆమోసు 8:1-12

పక్వానికి వచ్చిన పండు దర్శనం

యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. “ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు.

“ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను.

అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను. ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా మారతాయి. నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద వేస్తారు.”

ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ

నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు.
    ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
వర్తకులారా, మీరిలా అంటారు,
    “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది?
అమ్మకానికి మా గోధుమలు తేవటానికి
    విశ్రాంతిదినం ఎప్పుడైపోతుంది?
కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము.
    దొంగత్రాసు వేసి ప్రజలను మోసగిస్తాము.
పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చలేరు గనుక,
    మేము వారిని బానిసలనుగా కొంటాము.
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము.
    ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”

యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది.
    దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు.
ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది.
    భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు:
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను.
    మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
10 మీ పండుగ దినాలను చనిపోయినవారి కొరకు దుఃఖించే దినాలుగా మార్చుతాను.
    మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి.
ప్రతివానిపైన విషాద సూచిక దుస్తులు వేస్తాను.
    ప్రతివాని తలను బోడితల చేస్తాను.
ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప
    దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను.
అది ఒక భయంకరమైన అంతం.”

దేవుని వాక్యంకొరకు కరువు

11 యెహోవా చెపుతున్నాడు:

“చూడు, దేశంలో కరువు పరిస్థితిని
    నేను కల్పించే సమయం వస్తూవుంది.
ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు.
    ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు.
    కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
12 ప్రజలు ఒక సముద్రంనుండి
    మరొక సముద్రం వరకు తిరుగుతారు.
    వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు.
యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు.
    కాని వారు దానిని కనుగొనలేరు.

కీర్తనలు. 52

సంగీత నాయకునికి: దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.

52 పెద్ద మనిషీ, దైవజనులకు విరోధంగా చేసే చెడ్డ పనులను గూర్చి నీవెందుకు అతిశయిస్తున్నావు?
వంకర పనులు చేయాలనే నీవు పథకం వేస్తుంటావు.
    నీ నాలుక పదునుగల కత్తిలా ఉంది. ఎందుకంటే నీ నాలుక అబద్ధాలు పలుకుతుంది.
మంచి కంటె కీడునే నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావు.
    సత్యం పలుకుటకంటె ఎక్కువగా అబద్ధాలు చెప్పటం నీకు ఇష్టం.

నీవూ, నీ అబద్ధాల నాలుక మనుష్యులను బాధించటానికే ఇష్టపడుతుంది.
అందుచేత దేవుడు నిన్ను శాశ్వతంగా నాశనం చేస్తాడు.
    ఆయన నిన్ను పట్టి నీ గుడారము నుండి బయటకు లాగివేస్తాడు. సజీవుల దేశంలోనుండి ఆయన నిన్ను వేళ్లతో పెళ్లగిస్తాడు.

మంచి వాళ్లు ఇది చూచి,
    దేవునిని గౌరవిస్తారు.
వారు నిన్ను చూచి నవ్వి ఇలా అంటారు,
    “దేవుని మీద ఆధారపడని ఆ మనిషికి ఏమి సంభవించిందో చూడండి.
    ఆ మనిషి తనకు సహాయం చేసేందుకు ఐశ్వర్యాన్ని, తనకున్న దానిని మూర్ఖంగా నమ్ముకున్నాడు.”

అయితే దేవుని ఆలయంలో నేను పచ్చని ఒలీవ మొక్కలా ఉన్నాను.
    నేను శాశ్వతంగా ఎప్పటికీ దేవుని ప్రేమనే నమ్ముకొన్నాను.
దేవా, నీవు చేసిన వాటి మూలంగా నేను నిన్ను శాశ్వతంగా స్తుతిస్తాను.
    నీ అనుచరుల సముఖములో నీవు మంచివాడవని నేను ప్రకటిస్తాను.

కొలొస్సయులకు 1:15-28

క్రీస్తు యొక్క గొప్పతనము

15 క్రీస్తు కనిపించని దేవుని ప్రతిబింబం. ఆయన
    అన్నిటికన్నా పూర్వంనుండి అనగా జగత్తుకు
    పునాది వేయుటకు ముందునుండి ఉన్నవాడు.
16 క్రీస్తు అన్నిటినీ సృష్టించాడు.
    పరలోకంలో ఉన్న వాటిని, భూమ్మీద కనిపించే వాటిని, కనిపించని వాటిని,
    సింహాసనాలను, ప్రభుత్వాలను, పాలకులను, అధికారులను, అన్నిటినీ ఆయనే సృష్టించాడు.
అన్నీ తన కోసం సృష్టించుకొన్నాడు.

17 క్రీస్తు ఆదినుండి ఉన్నాడు.
    ఆయనలో అన్నీ ఐక్యమై ఉన్నాయి.
18 సంఘం ఆయన శరీరం. ఆయన సంఘానికి శిరస్సు.
    ఆయనే అన్నిటికీ మూలం.
    చనిపోయి తిరిగి బ్రతికినవాళ్ళలో ఆయన మొదటివాడు.
అన్నిటిలో ఆయనకు ప్రాముఖ్యత ఉండాలని దేవుడు యిలా చేసాడు.

19 దేవుడు తనలో ఉన్న పరిపూర్ణత ఆయనలో ఉండటానికి ఆనందంగా అంగీకరించాడు.
20     దేవుడు అన్నిటినీ, అంటే భూమ్మీద ఉన్నవాటినీ, పరలోకంలో ఉన్నవాటిని,
    కుమారుని ద్వారా తిరిగి తనలో చేర్చుకోవాలనుకొన్నాడు.
తన కుమారుడు సిలువపై చిందించిన రక్తం ద్వారా ఈ సంధి కలగాలని ఆయన ఉద్దేశ్యం.

21 మీ దుష్ప్రవర్తనలవల్ల, మీ మనస్సులో ఉన్న దురాలోచనలవల్ల ఒకప్పుడు మీరు దేవునికి దూరంగా ఉండి, ఆయనకు శత్రువులుగా జీవించారు. 22 కాని ప్రస్తుతం తన కుమారుని భౌతిక మరణం ద్వారా మీతో సంధి చేసి, మిమ్మల్ని పవిత్రం చేసి, మిమ్మల్ని నిష్కళంకులుగా, నిరపరాధులుగా తన ముందు నిలబెట్టుకోవాలని ఆయన ఉద్దేశ్యం.

23 మీరు విన్న సువార్త వలన రక్షణ కలుగుతుందన్న ఆశ మీలో కలిగింది. దాన్ని పోగొట్టుకోకుండా, దృఢంగా, స్థిరంగా ఆయన్ని విశ్వసిస్తూ ఉంటేనే అది సంభవిస్తుంది. మీరు విన్న ఈ సువార్త ఆకాశం క్రింద ఉన్న ప్రతీ జీవికి ప్రకటింపబడింది. నేను ఈ సందేశానికి సేవకుణ్ణి అయ్యాను.

సంఘం కోసం పౌలు పడిన శ్రమ

24 మీ కొరకు నేను కష్టాలు అనుభవించినందుకు యిప్పుడు నాకు ఆనందం కలుగుతోంది. ఎందుకంటే క్రీస్తు సంఘం అనబడే తన శరీరం ద్వారా అనుభవించవలసిన కష్టాలు నా దేహం అనుభవించి పూర్తి చేస్తోంది. 25 తన సందేశాన్ని మీకు సంపూర్ణంగా ఉపదేశించమని దేవుడు నన్ను నియమించాడు. తత్కారణంగా నేను క్రీస్తు సంఘానికి సేవకుణ్ణి అయ్యాను. 26 యుగయుగాలనుండి, తరతరాలనుండి రహస్యంగా దాచబడిన ఈ దైవసందేశం ప్రస్తుతం భక్తులకు చెప్పబడింది. 27 భక్తులకు ఈ రహస్యంలోని గొప్ప మహత్యాన్ని తెలియచేసి, యూదులు కానివాళ్ళకు చూపాలని ఆయన ఉద్దేశ్యం. మీలో ఉన్న “క్రీస్తే” ఆ రహస్యం. ఆయన వల్ల మహిమను తప్పక పొందుతామనే ఆశ మనలో ఉంది. 28 ఆయన్ని గురించి మేము ప్రకటిస్తున్నాము. మాలో ఉన్న జ్ఞానాన్నంతా ఉపయోగించి ప్రతి ఒక్కరికీ బోధిస్తున్నాము. సలహాలిస్తున్నాము. ఈ విధంగా ప్రతి ఒక్కరినీ క్రీస్తు ద్వారా దేవుని ముందు ఆధ్యాత్మికతలో పరిపూర్ణత పొందినవాళ్ళలా నిలబెట్టాలని మా ఉద్దేశ్యము.

లూకా 10:38-42

యేసు మార్త యింటికి వెళ్ళటం

38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.

41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International