Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 71:1-6

71 యెహోవా, నేను నిన్ను నమ్ముకొన్నాను.
    కనుక నేను ఎన్నటికీ నిరాశ చెందను.
నీ మంచితనాన్ని బట్టి నీవు నన్ను రక్షిస్తావు. నీవు నన్ను తప్పిస్తావు.
    నా మాట వినుము. నన్ను రక్షించుము.
భద్రత కోసం నేను పరుగెత్తి చేరగల గృహంగా, నా కోటగా ఉండుము.
    నన్ను రక్షించుటకు ఆజ్ఞ ఇమ్ము.
నీవు నా బండవు కనుక నా క్షేమస్థానమై ఉన్నావు.
నా దేవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రమైన దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
నా ప్రభువా, నీవే నా నిరీక్షణ.
    నేను నా యౌవనకాలంనుండి నిన్ను నమ్ముకొన్నాను.
నేను పుట్టినప్పటినుండి నీమీదనే ఆధారపడ్డాను.
    నా తల్లి గర్భమునుండి నీవు నన్ను జన్మింపజేశావు.
    నేను ఎల్లప్పుడూ నిన్నే ప్రార్థించాను.

2 దినవృత్తాంతములు 34:1-7

యూదా రాజుగా యోషీయా

34 యోషీయా రాజయ్యేనాటికి ఎనిమిది సంవత్సరాలవాడు. అతడు యెరూషలేములో ముప్పై యొక్క సంవత్సరాలు రాజుగా వున్నాడు. ఏది న్యాయమైనదో అది యోషీయా చేశాడు. యెహోవా చేయుమని చెప్పినవన్నీ అతడు చేశాడు. తన పూర్వీకుడైన దావీదువలె అతడు మంచి కార్యాలు చేశాడు. యోషీయా మంచిపనులు చేయటానికి ఎన్నడూ వెనుకాడలేదు. యోషీయా రాజైన పిమ్మట ఎనిమిదవ సంవత్సరం నుండి తన పూర్వీకుడైన దావీదు కొలిచిన దేవుడినే ఆరాధించాడు. దేవుని అనుసరించే నాటికి యోషీయా ఇంకా చిన్నవాడే. రాజుగా యోషీయా పన్నెండవ సంవత్సరంలో వుండగా యూదా, యెరూషలేములలో వున్న ఉన్నత స్థలాలను, అషేరా దేవతా స్తంభాలను, చెక్కిన, పోతపోసిన విగ్రహాలను నాశనం చేయటం మొదలు పెట్టాడు. బయలు దేవతలకు నిర్మించిన బలిపీఠాలన్నిటినీ ప్రజలు పగులగొట్టారు. వారీపని యోషీయా ఎదుటనే చేశారు. ప్రజలకు అందనంత ఎత్తుగా వున్న ధూప పీఠాలను పిమ్మట యోషీయా పడగొట్టాడు. చెక్కిన విగ్రహాలను, పోత విగ్రహాలను అతడు పగులగొట్టాడు. అతడా విగ్రహాలన్నిటినీ చూర్ణం చేశాడు. తరువాత యోషీయా ఆ చూర్ణాన్ని బయలుదేవతలను ఆరాధించి, బలులు అర్పించిన వారి సమాధులపై చల్లాడు. బయలు దేవతలకు సేవ చేసిన యాజకుల ఎముకలను ఆ బలిపీఠాలపైనే యోషీయా కాల్చినాడు. ఈ రకంగా యోషీయా యూదాలోను, యెరూషలేములోను విగ్రహాలను, విగ్రహారాధనను తుడిచివేశాడు. మనష్షే, ఎఫ్రాయిము, షిమ్యోను దేశాలలో వున్న పట్టణాలలోను, నఫ్తాలి వరకుగల పట్టణాలలో కూడ యోషీయా ఇదేరకంగా చేశాడు. ఆ పట్టణాల పరిసరాలలో వున్న పాడుబడ్డ ప్రదేశాలలో కూడ అతడీ పని చేశాడు. యోషీయా పీఠాలన్నీ పగులగొట్టి, అషేరా దేవతా స్తంభాలను పడగొట్టినాడు. విగ్రహాలన్నిటినీ పిండిగా పగుల గొట్టాడు. ఇశ్రాయేలులో బయలు దేవతలకు నిర్మించిన ధూప పీఠాలన్నిటినీ అతడు పిండిగా పగులగొట్టాడు. పిమ్మట యోషీయా యెరూషలేముకు తిరిగి వెళ్లాడు.

అపొస్తలుల కార్యములు 10:44-48

దేవుడందర్ని అంగీకరిస్తాడని చూపించాడు

44 పేతురు యింకా మాట్లాడుతుండగానే అతని సందేశాన్ని వింటున్న అక్కడివాళ్ళందరి మీదికి పరిశుద్ధాత్మ వచ్చాడు. 45 పేతురుతో వచ్చిన వాళ్ళందరు యూదులు. 46 యేసునందు విశ్వసించినవారు. వీళ్ళు యూదులు కానివాళ్ళు యితర భాషల్లో మాట్లాడటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. దేవుడు తన పరిశుద్ధాత్మను వరంగా యూదులు కానివాళ్ళకు కూడా యిచ్చాడని గ్రహించి వాళ్ళకు ఆశ్చర్యం వేసింది. తదుపరి పేతురు యిలా అన్నాడు: 47 “వీళ్ళకు బాప్తిస్మము నివ్వటానికి అడ్డు చేప్పే ధైర్యం ఎవరికుంది? మనలాగే వీళ్ళు కూడా దేవుని పరిశుద్ధాత్మ పొందారు.” 48 యేసు పేరిట వాళ్ళు బాప్తిస్మం పొందాలని పేతురు ఆజ్ఞాపించాడు. ఇదంతా ముగిసాక వాళ్ళు పేతురును తమతో కొద్దిరోజులు ఉండమని అడిగారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International