Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
సంఖ్యాకాండము 26-28

జనులు వెక్కిరించబడ్డారు

26 ఆ మహా రోగం తర్వాత మోషేతో, అహరోను కుమారుడు యాజకుడైన ఎలియాజరుతో యెహోవా మాట్లాడాడు: “ఇశ్రాయేలు ప్రజలందరినీ లెక్కించండి. ప్రతి కుటుంబాన్నీ చూచి, 20 సంవత్సరాలు, అంతకంటె ఎక్కువ వయస్సు ఉన్న పురుషులందరిని లెక్కించండి. వీరు ఇశ్రాయేలు సైన్యంలో పని చేయటానికి సమర్థులు” అని ఆయన చెప్పాడు.

ఇప్పటికి మోయాబు మైదానంలోనే ప్రజలు నివాసం చేస్తున్నారు. ఇది యెరికోకు ఎదురుగా యొర్దాను నది దగ్గర ఉంది. కనుక మోషే, యాజకుడైన ఎలియాజరు ప్రజలతో మాట్లాడారు. వారు “20 గాని, అంతకంటె ఎక్కువ వయసు గాని ఉన్న మగవాళ్ల సంఖ్య లెక్కించాలి. ఇది మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞ అన్నారు.”

ఈజిప్టు నుండి బయటకు వచ్చిన ఇశ్రాయేలు ప్రజల జాబితా ఇది:

రూబేను సంతతి వాళ్లు వీరే. (యాకోబుకు) ఇశ్రాయేలు పెద్ద కుమారుడు రూబేను వంశాలు:

హనోకు – హనోకీల వంశం

పల్లు – పల్లువారి వంశం

హెస్రోను – హెస్రోనీల వంశం

కర్మి – కర్మీల వంశం

రూబేను సంతతిలోని వంశాలు అవి. మొత్తం 43,730 మంది పురుషులు.

పల్లు కుమారుడు ఏలీయాబు. నెమూయేలు, దాతాను, అబీరాము ముగ్గురూ ఏలీయాబు కుమారులు. మోషే, అహరోనులకు ఎదురు తిరిగిన నాయకులు దాతాను, అబీరాము అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు కోరహు ఎదురు తిరిగినప్పుడు వారు కోరహును వెంబడించారు. 10 అప్పుడే భూమి తెరచుకొని, కోరహును, అతని అనుచరులు అందరినీ మింగివేసింది. చనిపోయిన వారి సంఖ్య మొత్తం 250 మంది పురుషులు. ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇది ఒక హెచ్చరిక, గుర్తు. 11 అయితే కోరహు కుటుంబంలోని ఇతరులు మరణించలేదు.

12 షిమ్యోను సంతతిలోని వంశాలు ఇవి:

నెమూయేలు – నెమూయేలీ వంశం

యామీను – యామీనీల వంశం

యాకీను – యాకీనీల వంశం

13 జెరహు – జెరహీల వంశం

షావూలు – షావూలీ వంశం

14 షిమ్యోను సంతతిలోని వంశాలు అవి. వారు మొత్తం 22,200 మంది.

15 గాదు సంతతిలోని వంశాలు ఇవి:

సెపోను – సెపోనీల వంశం

హగ్గి – హగ్గీల వంశం

షూనీ – షూనీల వంశం

16 ఓజని – ఓజనీల వంశం

ఏరీ – ఏరీల వంశం

17 అరోది – అరోదీల వంశం

అరేలి – అరేలీల వంశం

18 అవి గాదు సంతతిలోని వంశాలు. వారు మొత్తం 40,500 మంది పురుషులు.

19-20 యూదా సంతతిలోని వంశాలు ఇవి:

షేలా – షేలావారి వంశం

పెరెసు – పెరెసీల వంశం

జెరహు – జెరహీల వంశం

(యూదా కుమారులు ఏరు, ఓనాను అనే ఇద్దరు కనానులో చనిపోయారు.)

21 పెరెసు వంశాలు ఇవి:

హెస్రోను – హెస్రోనీల వంశం

హములు – హములీల వంశం

22 యూదా సంతతిలోని వంశాలు ఇవి. పురుషుల సంఖ్య మొత్తం 76,500.

23 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు ఇవి:

తోల – తోలాలీ వారి వంశం

పువ్వా – పువ్వీల వంశం

24 యాషూబు – యాషూబీల వంశం

షిమ్రోను – షిమ్రోనీల వంశం

25 ఇశ్శాఖారు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 64,300.

26 జెబూలూను సంతతిలోని వంశాలు:

సెరెదు – సెరెదీల వంశం

ఏలోను – ఏలోనీల వంశం

యహలేలు – యహలేల వంశం

27 జెబూలూను సంతతిలోని వంశాలు అవి. పురుషులు సంఖ్య మొత్తం 60,500.

28 యోసేపు ఇద్దరు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము. ఒక్కో కుమారుడు కొన్ని స్వంత వంశాలతో కూడిన ఒక్కో సంతతి అయ్యారు. 29 మనష్షే సంతతి ఏవనగా:

మాకీరు – మాకీరువారి వంశం (మాకీరు గిలాదుకు తండ్రి,)

గిలాదు – గిలాదీల వంశం

30 గిలాదు వంశాలు:

ఈజరు – ఈజరీల వంశం

హెలెకు – హెలెకీవారి వంశం

31 అశ్రీయేలు – అశ్రీయేలీల వంశం

షెకెము – షెకెమీల వంశం

32 షెమిద – షెమిదీల వంశం

హెపెరు – హెపెరీల వంశం

33 హెపెరు కుమారుడు సెలోపెహాదు. కానీ అతనికి కుమార్తెలు తప్ప కుమారులు లేరు. అతని కుమార్తెల పేర్లు మహల, నోయా, హొగ్ల, మిల్కా, తిర్సా.

34 అవన్నీ మనష్షే సంతతిలోని వంశాలు. పురుషుల సంఖ్య మొత్తం 52,700.

35 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు ఏవనగా:

షుతల – షుతలీల వంశం

బేకరు – బేకరీల వంశం

తహను – తహనీల వంశం

36 షుతలహు వంశం వాడు ఏరాను.

అతని వంశం ఏరానీల వంశం

37 ఎఫ్రాయిము సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 32,500.

యోసేపు సంతతికి చెందిన మొత్తం మనుష్యులు వారే.

38 బెన్యామీను సంతతిలోని వంశాలు:

బెలా – బెలాలీ వంశం

అష్బెలు – అష్బెలీ వంశం

అహీరం – అహీరమీయీల వంశం

39 షుపం – షుపామీల వంశం

హుపం – హుపామీల వంశం

40 బెలా వంశాలు ఏవనగా:

ఆర్దు – ఆర్దీల వంశం

నయమాను – నయమానీల వంశం

41 బెన్యామీను సంతతిలోని వంశాలన్నీ అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,600.

42 దాను సంతతిలోని వంశాలు:

షూషాము – షూషామీల వంశం.

అది దాను సంతతిలోని కుటుంబం. 43 షూషామీల వంశంలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. పురుషుల సంఖ్య మొత్తం 64,400.

44 ఆషేరు సంతతిలోని వంశాలు:

ఇమ్నా – ఇమ్నా వారి వంశం

ఇష్వి – ఇష్వీల వంశం

బెరీయ – బెరీయాల వంశం

45 బెరీయా వంశాలు:

హెబెరు – హెబెరీల వంశం

మల్కీయేలు – మల్కీయేలీల వంశం.

46 (ఆషేరుకు శెరహు అనే కూతురు కూడ ఉంది.) 47 ఆషేరు సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 53,400.

48 నఫ్తాలీ సంతతిలోని వంశాలు:

యహసియేలు – యహసియేలీల వంశం

గూనీ – గూనీల వంశం

49 యెసెరు – యెసెరీల వంశం

షిల్లేము – షిల్లేమీల వంశం

50 నఫ్తాలీ సంతతిలోని వంశాలు అవి. పురుషుల సంఖ్య మొత్తం 45,400.

51 కనుక ఇశ్రాయేలు పురుషుల సంఖ్య మొత్తం 6,01,730.

52 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: 53 “ప్రతి వంశానికి దేశం లభిస్తుంది. ఇది నేను వారికి వాగ్దానం చేసిన దేశం. లెక్కించబడిన ప్రజలందరికీ సరిపడినంత భూమి ప్రతి వంశానికి లభిస్తుంది. 54 పెద్ద వంశానికి ఎక్కువ భూమి లభిస్తుంది. చిన్న వంశానికి తక్కువ భూమి లభిస్తుంది. అయితే నేను వాగ్దానం చేసిన దేశం ప్రతి వంశానికీ లభిస్తుంది. మరియు వారికి లభించే భూమి, లెక్కించబడిన వారందరికీ సరిపోయేటంత ఉంటుంది. 55 ప్రతి వంశానికీ ఆ భూమి ఇవ్వబడుతుంది. ఏ వంశం వారి భూమికి ఆ పేరే పెట్టబడుతుంది. 56 ప్రజలకు ఇస్తానని నేనే వాగ్దానం చేసినంతగా ఉంటుంది ఆ భూమి. పెద్ద వంశాలకీ, చిన్నవాటికీ అందివ్వబడుతుంది.”

57 లేవీ సంతతి కూడ లెక్కించబడింది. లేవీ సంతతిలోని వంశాలు ఇవి:

గెర్షోను – గెర్షోనీల వంశం

కహాతు – కహాతీల వంశం

మెరారి – మెరారిల వంశం

58 ఇవి కూడ లేవీ సంతతిలోని వంశాలే:

లిబ్నీల వంశం

హెబ్రోనీల వంశం

మహ్లీల వంశం

మూషీల వంశం

కోరహీల వంశం

అమ్రాము కహాతు వంశం వాడు. 59 అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె కూడ లేవీ సంతతిలోనిదే. ఆమె ఈజిప్టులో పుట్టింది. అమ్రాము, యోకెబెదులకు అహరోను, మోషే ఇద్దరు కుమారులు. వారికి మిర్యాము అని ఒక కుమార్తె కూడ ఉంది.

60 నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారులకు తండ్రి అహరోను. 61 కానీ నాదాబు, అబీహు చనిపోయారు. అంగీకారం కాని అగ్నితో దేవునికి అర్పణచేసినందువల్ల వారు చనిపోయారు.

62 లేవీ సంతతిలో పురుషుల సంఖ్య మొత్తం 23,000, అయితే ఇతర ఇశ్రాయేలు మనుష్యులతో వీరు లెక్కించబడలేదు. మిగిలినవారికి యెహూవా వాగ్దానం చేసిన భూమి మాత్రం లేదు.

63 మోషే, యాజకుడైన ఎలియాజరు ఈ ప్రజలందరినీ లెక్క వేసారు. మోయాబు మైదానాల్లో వారు ఇశ్రాయేలు ప్రజలను లెక్క తీసారు. ఇది యెరికో ఎదుట యొర్దాను నది అవతల జరిగింది. 64 చాలకాలం క్రిందట సీనాయి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలందరినీ మోషే, యాజకుడైన అహరోనూ లెక్కపెట్టారు. అయితే వాళ్లంతా చనిపోయారు. మోషే మోయాబు మైదానాల్లో లెక్కపెట్టిన వారు వేరు, అంతకుముందు లెక్కపెట్టిన వారు వేరు. 65 వారు అందరూ ఎడారిలోనే చస్తారు అని ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా చెప్పినందువల్ల ఇలా జరిగింది. సజీవంగా ఉన్నవాళ్లు యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ మాత్రమే.

సెలోపెహాదు కుమార్తెలు

27 హెసెరు కుమారుడు సెలోపెహాదు. హెసెరు గిలాదు కుమారుడు. గిలాదు మాకీరు కుమారుడు. మాకీరు మనష్షే కుమారుడు. మనష్షే యోసేపు కుమారుడు. సెలోపెహాదుకు ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వారి పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా. సన్నిధి గుడారం దగ్గర సమావేశం అవుతోన్న మోషే, యాజకుడైన ఎలియాజరు, పెద్దలు, ప్రజలు అందరి ముందరకు ఈ అయిదుగురు స్త్రీలూ వెళ్లి, సన్నిధి గుడారం ఎదుట నిలబడ్డారు.

ఈ ఐదుగురు కూతుళ్లు ఈ విధంగా చెప్పారు: “మనం అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడే మా తండ్రి చనిపోయాడు. అతడు కోరహు గుంపులో చేరినవాడు కాడు. (కోరహు యెహోవానుంచి తొలగి ఎదురు తిరిగినవాడు.) మా తండ్రిది సహజ మరణం. కానీ మా తండ్రికి కుమారులు లేరు. అంటే మా తండ్రి పేరు కొనసాగదు. మా తండ్రి పేరు కొనసాగక పోవటం సక్రమం కాదు. ఆయనకు కుమారులు లేరు గనుక ఆయన పేరు అంతం అవుతుంది. అందుచేత మా తండ్రి సోదరులకు వచ్చే భూమిలో మాకు కొంత ఇవ్వవలసిందిగా మేము మీకు మనవి చేస్తున్నాము.”

కనుక ఏమి చేయాలని యెహోవాను మోషే అడిగాడు. అతనితో యెహోవా ఇలా అన్నాడు, “సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది సరియైనదే. వాళ్లు వారి తండ్రి సోదరులతో పాటు భూమిని పంచుకోవలసిందే. కనుక నీవు వారి తండ్రికిచ్చిన భూమిని వారికి ఇవ్వాలి.

“కనుక ఇశ్రాయేలు ప్రజలకు, ఇలా చట్టం తయారు చేయి. ‘ఒకనికి కుమారులు లేకుండానే అతడు చనిపోతే, అతని ఆస్తి అంతా అతని కుమార్తెలకు ఇవ్వాలి. అతనికి కుమార్తెలు లేకపోతే, అతని ఆస్తి అంతా అతని సోదరులకు ఇవ్వాలి. 10 అతనికి సోదరులు లేకపోతే అతని ఆస్తి అంతా అతని తండ్రి సోదరులకు ఇవ్వాలి. 11 అతని తండ్రికి సోదరులు లేకపోతే, అతని ఆస్తి అంతా, అతని కుటుంబంలో దగ్గర బంధువులకు ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఇది ఒక చట్టంగా ఉండాలి. యెహోవాయే ఈ ఆజ్ఞను మోషేకు ఇస్తున్నాడు.’”

కొత్త నాయకుడుగా యెహోషువ

12 అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “ఆ కొండమీదికి ఎక్కు. యొర్దాను నదికి తూర్పున ఉన్న కొండల్లో అది ఒకటి. ఇశ్రాయేలు ప్రజలకు నేను ఇస్తున్న దేశాన్ని నీవు అక్కడ నుండి చూస్తావు. 13 నీవు ఈ దేశాన్ని చూశాక, నీ సోదరుడు అహరోను మరణించినట్టే నీవు మరణిస్తావు. 14 సీను అరణ్యంలో నీళ్లకోసం ప్రజలు కోపగించుకోవటం జ్ఞాపకం చేసుకో. నీవూ, అహరోనూ కూడ నా ఆజ్ఞకు విధేయులయ్యేందుకు నిరాకరించారు. ప్రజల ముందు నీవు నన్ను ఘనపర్చలేదు, పవిత్రంగా చూడలేదు.” (ఇది సీను అరణ్యంలో కాదేషు దగ్గర మెరీబా నీళ్ల సంగతి.)

15 యెహోవాతో మోషే ఇలా అన్నాడు: 16 “ప్రజల ఆలోచనలు తెలిసిన దేవుడు యెహోవా ప్రభువు, నీవే ఈ ప్రజలకోసం మరో నాయకుడిని ఎంచుకోమని మనవి చేస్తున్నాను. 17 ఈ దేశంలోనుండి వీరిని బయటకు నడిపించి, కొత్త దేశంలో చేర్చగల నాయకుడిని ఎంచవలసిందిగా నేను యెహోవాకు మనవి చేస్తున్నాను. అప్పుడు యెహోవా ప్రజలు కాపరి లేని గొర్రెల్లా ఉండరు.”

18 కనుక మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “నూను కుమారుడైన యెహోషువ నాయకుడుగా ఉంటాడు. యెహోషువ ఆత్మను పొందినవాడు. అతడిని కొత్త నాయకునిగా చేయి. 19 యాజకుడైన ఎలియాజరు ఎదుటా, ప్రజలందరి ఎదుటా నిలబడమని అతనితో చెప్పు. అప్పుడు అతడిని కొత్త నాయకునిగా నీవు చేయి.

20 “అతడిని నీవు నాయకునిగా చేస్తున్నావని ప్రజలకు చూపెట్టు, అప్పుడు ప్రజలంతా అతనికి లోబడతారు. 21 ఒకవేళ యెహోషువ ఒక కొత్త నిర్ణయం ఏదైనా చేయాలంటే అతడు యాజకుడైన ఎలియాజరు దగ్గరకు వెళతాడు. యెహోవా జవాబు తెలుసుకొనేందుకు ఎలియాజరు ఊరీమును ప్రయోగిస్తాడు. అప్పుడు యెహోషువ, ప్రజలందరూ దేవుడు చెప్పిన వాటిని చేస్తారు. ‘యుద్ధానికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు యుద్ధానికి వెళ్తారు. ఒకవేళ ‘ఇంటికి వెళ్లండి’ అని అతడు చెబితే వారు ఇంటికి వెళతారు.”

22 మోషే యెహోవాకు విధేయుడయ్యాడు. యాజకుడైన ఎలియాజరు ముందు, ప్రజలందరి ఎదుట నిలబడమని యెహోషువాతో చెప్పాడు. మోషే, 23 అప్పుడు అతడే కొత్త నాయకుడు అని చూపెట్టేందుకు అతనిమీద మోషే చేతులు పెట్టాడు. అతనితో యెహోవా చెప్పినట్టే అతడు చేసాడు.

ప్రతిదిన అర్పణలు

28 అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు ప్రజలకు ఈ ఆజ్ఞ ఇవ్వాలి. ప్రత్యేక కానుకలను సరైన సమయంలోనే నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ధాన్యార్పణలు, దహనబలులు నాకు ఇవ్వాలని వారితో చెప్పు. ఆ దహనబలుల వాసన యెహోవాకు ఇష్టం. వారు యెహోవాకు ఇవ్వవలసిన దహనబలులు ఇవే. ప్రతిరోజూ పుష్టిగల, ఒక సంవత్సరం వయసున్న రెండు మగ గొర్రె పిల్లలు. ఒక గొర్రెపిల్ల ఉదయం, మరో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. మరియు ఒక పావు ఒలీవనూనెతో కలుపబడ్డ రెండుపావుల మంచి పిండి ధాన్యార్పణగా పెట్టాలి.” సీనాయి కొండ దగ్గర వారు ప్రతి దినం అర్పణలు అర్పించటం మొదలుపెట్టారు. ఆ దహనబలి అర్ఫణల వాసన యెహోవాకు ఇష్టమయినది. దహనబలి అర్పణతో బాటు ప్రజలు పానార్పణ కూడ అర్పించాలి. ప్రతి గొర్రె పిల్లతోబాటు వారు ముప్పావు ద్రాక్షారసం అర్పించాలి. పవిత్ర స్థలంలో బలిపీఠం మీద పానార్పణం పోయాలి. ఇది యెహోవాకు కానుక. రెండో గొర్రెపిల్లను సాయంకాలం అర్పించాలి. సరిగ్గా ఉదయార్పణలాగే దీనిని అర్పించాలి. అలాగే అదే రకం పానార్పణం ఇవ్వాలి. ఈ దహనబలి యెహోవాకు సువాసనగా ఉంటుంది.

సబ్బాతు అర్పణలు

“విశ్రాంతి దినం శనివారం నాడు, ఒక సంవత్సరం వయసుగల లోపంలేని రెండు గొర్రె పిల్లల్ని, తూమెడు పిండిలో రెండు పదోవంతుల మంచి పిండి ఒలీవ నూనెలో కలిపిన పానార్పణం మీరు అర్పించాలి. 10 విశ్రాంతి దినం కోసం ఇది ప్రత్యేక అర్పణ. ప్రతి రోజూ ఇచ్చే అర్పణ, పానార్పణ గాక ఇది అదనం.

నెలసరి సమావేశాలు

11 “ప్రతి నెలా మొదటి రోజున ప్రత్యేకమైన దహనబలి మీరు యెహోవాకు అర్పించాలి. ఈ అర్పణలో లోపంలేని రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు గొర్రెపిల్లలు ఏడు. 12 మరియు ఒలీవ నూనెతో కలుపబడిన తూమెడు మంచి పిండితో మూడు పదోవంతులను ధాన్యార్పణగా ప్రతి కోడె దూడతోబాటు అర్పించాలి. అలాగే, ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును పొట్టేలుతో బాటు ధాన్యార్పణగా అర్పించాలి. 13 ఒలీవ నూనెతో కలుపబడిన మంచి పిండిలో ఒక పదోవంతును ఒక్కో గొర్రెపిల్లతోబాటు ధాన్యార్పణగా అర్పించాలి. ఇది యెహోవాకు సువాసన ఇచ్చే దహనబలి. 14 ప్రతి కోడె దూడతోబాటు పడిన్నర ద్రాక్షారసం, పొట్టేలుతోబాటు ఒక్క పడి ద్రాక్షారసం, ప్రతి గొర్రెపిల్లతోబాటు ముప్పావు ద్రాక్షారసం పానార్పణం. ఇది సంవత్సరంలో నెలనెలా అర్పించాల్సిన దహనబలి. 15 ప్రతి రోజూ అర్పించే దహనబలి, పానార్పణంగాక ఒక మగ మేకను యెహోవాకు మీరు అర్పించాలి. ఆ మేక పాప పరిహారార్థ బలి.

పస్కా పండుగ

16 “మొదటి నెల (నిసాను) పదునాలుగవ రోజున పస్కా. 17 పులియని రొట్టెల పండుగ అదే నెల పది హేనో రోజున ప్రారంభం అవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు ఉంటుంది. పొంగని రొట్టెలు మాత్రమే మీరు తినాలి. 18 ఈ పండుగ మొదటి రోజున మీరు ఒక ప్రత్యేక సభ జరపాలి. ఆ రోజు మీరు ఏ పనీ చేయకూడదు. 19 మీరు యెహోవాకు దహనబలులు అర్పించాలి. దహనబలులు రెండు కోడె దూడలు, ఒక పొట్టేలు, అంగవిహీనం లేని సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు. 20-21 ఒక్కొక్క కోడె దూడతో తూములో మూడు పదివంతులును, పొట్టేలుతో రెండు పది వంతులును, ఒక్కో గొర్రెపిల్లతో, ఒక్కో పదోవంతు మంచి పిండి ఒలీవ నూనెతో కలిపి ధాన్యార్పణంగా పెట్టాలి. 22 ఒక మగ మేకను కూడ మీరు ఇవ్వాలి. ఆ మేక మీ కోసం పాప పరిహారార్థబలి అవుతుంది. అది మీ పాపాలను కప్పి పుచ్చుతుంది. 23 ప్రతి ఉదయం మీరు అర్పించే దహనబలి అర్పణ కాక ఈ అర్పణలు మీరు అర్పించాలి.

24 “అదే విధంగా ఏడు రోజులపాటు మీరు ఆహార అర్పణలు అర్పించాలి. ప్రతి రోజూ దానిని హోమాంగా మీరు అర్పించాలి. ఈ అర్పణ యెహోవాకు ఇష్టమైన సునాసన. మీరు దహనబలిని, దాని పానార్పణను క్రమంగా అర్పించాలి. ఇవిగాక ఆహారం (ప్రజలకు) మీరు అర్పించాలి.

25 “అప్పుడు పస్కా పండుగ ఏడవ రోజున మీకు ఒక ప్రత్యేక సభ జరుగుతుంది. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు.

వారాల పండుగ (పెంతెకొస్తు)

26 “ప్రథమ ఫలాల పండుగలో (వారాల పండుగ) కొత్త ధాన్యంలోనుంచి మీరు ధాన్యార్పణ యెహోవాకు ఇవ్వవలెను. ఆ సమయంలో కూడ మీరు ఒక ప్రత్యేక సభ ఏర్పాటు చేయాలి. ఆ రోజున మీరు ఏ పనీ చేయకూడదు. 27 మీరు దహనబలులు అర్పించాలి. ఆ బలి అర్పణలు యెహోవాకు ఇష్టమైన సువాసన. రెండు కోడెదూడలు, ఒక పొట్టేలు, ఒక సంవత్సరపు మగ గొర్రె పిల్లలు ఏడు మీరు అర్పించాలి. 28 ప్రతి కోడెదూడతోను, నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదోవంతులు, ప్రతి పొట్టేలుతో రెండు పదోవంతులు 29 ఒక్కో గొర్రె పిల్లతో ఒక్కో పదోవంతును మీరు అర్పించాలి. 30 మీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒక మగ మేకనుకూడ మీరు బలి ఇవ్వవలెను. 31 రోజువారీ దహనబలులు, ధాన్యార్పణాలు గాక వీటిని మీరు అర్పించాలి. జంతువులు అంగహీనము కానివిగా ఉండేటట్టు తప్పక చూడాలి. పానార్పణం పరిశుభ్రమయినదిగా ఉండాలి.

మార్కు 8

యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మత్తయి 15:32-39)

ఆ రోజుల్లో మళ్ళీ ఒకసారి పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ ఉండనందువల్ల యేసు శిష్యుల్ని పిలిచి, “నాకు జాలివేస్తోంది. వాళ్ళిప్పటికే మూడు రోజులనుండి నా దగ్గరున్నారు. తినటానికి వాళ్ళ దగ్గర ఏమీలేదు. నేను వాళ్ళను ఆకలితో యింటికి పంపివేస్తే వాళ్ళలో కొందరు చాలా దూరం నుండి వచ్చారు. కనుక వాళ్ళు దారిలో మూర్ఛపోవచ్చు” అని అన్నాడు.

ఆయన శిష్యులు, “ఈ ఎడారి ప్రాంతంలో వాళ్ళు తినటానికి చాలినంత ఆహారం ఎక్కడనుండి తెమ్మంటారు?” అని అన్నారు.

“ఎన్ని రొట్టెలున్నాయి” అని యేసు అడిగాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు ప్రజల్ని కూర్చోమని చెప్పాడు. ఆ ఏడు రొట్టెలు తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచాడు. ఆ రొట్టెముక్కల్ని తన శిష్యులకిచ్చి ప్రజలకు పంచమన్నాడు. వాళ్ళు అలాగే చేసారు. వాళ్ళ దగ్గర కొన్ని చేపలుకూడా ఉన్నాయి. వాటి కోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని కూడా పంచమని తన శిష్యులకు యిచ్చాడు.

ప్రజలు వాటిని తిని సంతృప్తి చెందారు. ఆ తర్వాత ప్రజలు తినగా మిగిలిన ముక్కల్ని ఏడు గంపలనిండా నింపారు. నాలుగు వేలమంది ప్రజలు అక్కడవున్నారు. వాళ్ళను పంపివేసి వెంటనే 10 యేసు తన శిష్యులతో కలిసి పడవనెక్కి దల్మనూతా ప్రాంతానికి వెళ్ళాడు.

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మత్తయి 16:1-4; లూకా 11:16, 29)

11 పరిసయ్యులు వచ్చి యేసును ప్రశ్నించటం మొదలుపెట్టారు. ఆయన్ని పరీక్షించే ఉద్దేశ్యంతోనే ఆకాశంనుండి ఒక రుజువు చూపమన్నారు. 12 ఆయన పెద్దగా నిట్టూర్చి, “ఈ కాలపు వాళ్ళు అద్భుతాల్ని రుజువులుగా చూపమని ఎందుకు అడుగుతారు? ఇది నిజం. మీకు ఏ రుజువూ చూపబడదు” అని అన్నాడు. 13 ఆ తర్వాత ఆయన వాళ్ళను వదిలి పడవనెక్కి అవతలి ఒడ్డు చేరుకొన్నాడు.

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మత్తయి 16:5-12)

14 శిష్యులు రొట్టెలు తేవటం మరిచిపోయారు. వాళ్ళ దగ్గర ఒక రొట్టె మాత్రమే ఉంది. 15 యేసు, “జాగ్రత్తగా ఉండండి. పరిసయ్యుల పులుపును హేరోదు పులుపును[a] గమనిస్తూ ఉండండి” అని వాళ్ళను హెచ్చరించాడు.

16 ఇది వాళ్ళు పరస్పరం చర్చించుకొంటూ, “మన దగ్గర రొట్టెలు లేవని అలా అంటున్నాడా!” అని అనుకొన్నారు.

17 వాళ్ళు ఏమి చర్చించుకొంటున్నారో యేసు కనిపెట్టి, “రొట్టెలులేవని ఎందుకు చర్చించుకుంటున్నారు? మీకు యింకా అర్థంకాలేదా? మీరు చూడలేదా? మీ బుద్ధి మందగించిందా? 18 మీకు కళ్ళున్నాయి కాని చూడలేరు. చెవులున్నాయి కాని వినలేరు. మీకు జ్ఞాకపం లేదా? 19 నేను ఐదు రొట్టెల్ని విరిచి ఐదువేల మందికి పంచిపెట్టినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపలనిండా నింపారు?” అని అడిగాడు.

“పన్నెండు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

20 “మరి ఏడు రొట్టెలు విరిచి నాలుగు వేలమందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని ఎన్ని గంపలనిండా నింపారు?” అని యేసు అన్నాడు.

“ఏడు” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

21 “యింకా మీకు అర్థం కాలేదా?” అని ఆయన వాళ్ళతో అన్నాడు.

బేత్సయిదాలో గ్రుడ్డివానికి నయం చేయటం

22 యేసు, ఆయన శిష్యులు బేత్సయిదాకు వచ్చారు. అక్కడి ప్రజలు గ్రుడ్డివాణ్ణి యేసు దగ్గరకు తీసుకు వచ్చారు. అతణ్ణి తాకమని వాళ్ళు ఆయనను వేడుకొన్నారు. 23 యేసు ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరి బయటకు తీసుకు వెళ్ళాడు. యేసు ఆ గ్రుడ్డివాని కళ్ళ మీద ఉమ్మివేసి తన చేతుల్ని వాటిపైవుంచి, “నీకేమైనా కనబడుతోందా” అని అడిగాడు.

24 ఆ గ్రుడ్డివాడు తలెత్తి, “మనుష్యులు నడుస్తున్నట్లు కనబడుతున్నారు. కాని వాళ్ళు చెట్లలా కనబడుతున్నారు” అని అన్నాడు.

25 యేసు మళ్ళీ ఒకసారి అతని కళ్ళపై తన చేతుల్ని ఉంచాడు. వెంటనే అతని కళ్ళు తెరుచుకున్నాయి. అతనికి దృష్టి వచ్చింది. అన్నీ స్పష్టంగా చూడగలిగినాడు. 26 యేసు అతణ్ణి యింటికి పంపుతూ, “గ్రామంలోకి వెళ్ళవద్దు”[b] అని అన్నాడు.

పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం

(మత్తయి 16:13-20; లూకా 9:18-21)

27 యేసు తన శిష్యులతో కలిసి, కైసరయ ఫిలిప్పి పట్టణానికి చుట్టూవున్న పల్లెలకు వెళ్ళాడు. దారిలో యేసు వాళ్ళతో, “ప్రజలు నేనెవరని అనుకొంటున్నారు?” అని అడిగాడు.

28 వాళ్ళు, “బాప్తిస్మము నిచ్చే యోహాను అని కొందరు, ఏలీయా అని కొందరు, ప్రవక్తలలో ఒకడై ఉండవచ్చని మరికొందరు అంటున్నారు” అని సమాధానం చెప్పారు.

29 “మరి మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని అడిగాడు.

పేతురు, “మీరే క్రీస్తు”[c] అని సమాధానం చెప్పాడు.

30 తనను గురించి ఎవ్వరికి చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు.

యేసు తన మరణాన్ని గురించి చెప్పటం

(మత్తయి 16:21-28; లూకా 9:22-27)

31 ఆ తదుపరి యేసు వాళ్ళకు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు: “మనుష్య కుమారుడు కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధానయాజకులు, శాస్త్రులు, ఆయన్ని తృణీకరిస్తారు. ఆయన చంపబడి మూడు రోజుల తర్వాత మళ్ళీ బ్రతికివస్తాడు.” 32 యేసు ఈ విషయాన్ని గురించి స్పష్టంగా మాట్లాడాడు.

పేతురు ఆయన చేయిపట్టుకొని వారించటం మొదలు పెట్టాడు. 33 కాని యేసు వెనక్కు తిరిగి తన శిష్యుల వైపు ఒకసారి చూసి, పేతురుతో “సైతానా! నాముందు నుండి వెళ్ళిపో! నీవు మానవరీతిగా ఆలోచిస్తున్నావు కాని, దేవుని రీతిగా కాదు” అని అన్నాడు.

34 ఆ తర్వాత తన శిష్యుల్ని, ప్రజల్ని దగ్గరకు పిలిచి, “మీరు నన్ను అనుసరింపదలిస్తే, తనను తాను విసర్జించుకొని తన సిలువను మోస్తూ అనుసరించాలి. 35 ఎందుకంటే, తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నాకోసం, సువార్త కోసం ప్రాణాన్ని పోగొట్టుకొన్నవాడు దాన్ని కాపాడుకొంటాడు. 36 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని వదులుకొన్న మనిషికి ఏంలాభం కలుగుతుంది? 37 తన ప్రాణాన్ని తిరిగి పొందటానికి మనిషి ఏంయివ్వగలడు? 38 ఈ తరం వ్యభిచారంతో, పాపంతో నిండివుంది. నా విషయంలో కాని, నా బోధనల విషయంలో కాని ఎవ్వడు సిగ్గుపడతాడో, మనుష్య కుమారుడు తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతలతో కలసి వచ్చినప్పుడు వాని విషయంలో సిగ్గుపడతాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International