Old/New Testament
34 ఎలీహు మాట్లాడటం కొన సాగించాడు:
2 “జ్ఞానంగల మనుష్యులారా, నేను చెప్పే విషయాలు వినండి.
తెలివిగల మనుష్యులారా నా మాటలు గమనించండి.
3 చెవి తను వినే సంగతులను పరీక్షిస్తుంది.
అదే విధంగా నాలుక, తను తాకే వాటిని రుచి చూస్తుంది.
4 అందుచేత మనం ఈ పరిస్థితిని పరిశీలించాలి. ఏది సరైనదో మనమే నిర్ణయించాలి.
ఏది మంచిది అనేది కూడా మనం అంతా ఏకంగా నేర్చుకొంటాం.
5 యోబు అంటున్నాడు, ‘యోబు అనే నేను నిర్దోషిని.
కానీ దేవుడు నాకు న్యాయం చేయలేదు.
6 నాది సరిగ్గా ఉంది, కానీ ప్రజలు నాది తప్పు అనుకొంటారు.
నేను అబద్దీకుణ్ణి అని వాళ్లు అనుకొంటారు. నేను నిర్దోషిని అయినప్పటికి నా గాయం మానదు.’
7 “యోబులాంటి వ్యక్తి మరొకడు లేడు.
మీరు యోబును అవమానించినప్పటికి అతడు లెక్క చేయడు.
8 చెడ్డ వాళ్లతో యోబు స్నేహంగా ఉన్నాడు.
దుర్మార్గులతో కలిసి సహవాసం యోబుకు యిష్టం.
9 ‘ఎందుకంటే, ఒకడు దేవునికి విధేయత చూపించేందుకు ప్రయత్నిస్తే
దానివల్ల అతనికి ప్రయోజనం ఏమీ కలుగదు’ అని యోబు చెబుతున్నాడు.
10 “కనుక గ్రహించగలిగిన ఓ మనుష్యులారా, నా మాట వినండి.
దేవుడు ఎన్నటికీ చెడు చేయడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఎన్నటికీ తప్పు చేయడు.
11 ఒకడు చేసిన విషయాలనే తిరిగి దేవుడు అతనికి చెల్లిస్తాడు.
మనుష్యులకు రావలసిందే దేవుడు వారికి ఇస్తాడు.
12 ఇది సత్యం. దేవుడు తప్పు చేయడు.
సర్వశక్తిమంతుడైన దేవుడు ఎల్లప్పుడూ న్యాయంగానే ఉంటాడు.
13 భూమికి పర్యవేక్షకునిగా ఉండేందుకు దేవుణ్ణి ఎవరు నియమించారు?
భూభారాన్ని దేవునికి ఎవరు అప్పగించారు? (దేవుడు అన్నింటినీ పుట్టించాడు మరియు అన్నీ ఆయన అధీనంలో ఉంటాయి.)
14 దేవుడు తన ఆత్మను,
తన ప్రాణవాయువును మనుష్యుల్లోనుండి తీసివేయాలని ఒకవేళ అనుకొంటే
15 అప్పుడు భూమి మీద మనుష్యులు అందరూ చనిపోతారు.
అప్పుడు మనుష్యులు మరల మట్టి అయిపోతారు.
16 “మీరు జ్ఞానంగల వారైతే,
నేను చెప్పేది వినండి.
17 న్యాయంగా ఉండటం యిష్టంలేని మనిషి పరిపాలకునిగా ఉండజాలడు.
యోబూ, బలమైన మంచి దేవుణ్ణి నీవు దోషిగా తీర్చగలవని నీవు తలుస్తున్నావా?
18 ‘మీరు పనికిమాలిన వాళ్లు’ అని రాజులతో చెప్పేవాడు దేవుడు.
‘మీరు దుర్మార్గులు’ అని నాయకులతో దేవుడు చెబుతాడు.
19 దేవుడు నాయకులను మనుష్యులకంటె ఎక్కువేమీ ప్రేమించడు.
దేవుడు ధనికులను దరిద్రుల కంటే ఎక్కువేమీ ప్రేమించడు.
ఎందుకంటే, ప్రతి మనిషినీ దేవుడే చేశాడు గనుక.
20 ఒక వ్యక్తి రాత్రిపూట అకస్మాత్తుగా మరణించవచ్చును.
మనుష్యులను దేవుడు రోగులుగా చేస్తాడు.
వారు మరణిస్తారు.
ఏ కారణం లేకుండానే శక్తిగల మనుష్యులు మరణిస్తారు.
21 “మనుష్యులు ఏమి చేస్తున్నదీ దేవుడు గమనిస్తూ ఉంటాడు.
ఒక వ్యక్తి నడిచే ప్రతి నడత దేవునికి తెలుసు.
22 దుర్మార్గుడు దేవునికి కనబడకుండా దాగుకొనేందుకు చీకటి చోటు ఏమీ లేదు.
ఏ చోటైన చీకటిగా ఉండదు.
23 మనుష్యులను మరింత పరీక్షించేందుకు దేవునికి ఒక నిర్ణీత సమయం అవసరం లేదు.
మనుష్యులకు తీర్పు తీర్చేందుకు దేవుడు వారిని తన ఎదుటికి తీసుకొని రానవసరం లేదు.
24 దేవుడు ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు.
కానీ దేవుడు శక్తివంతమైన వారిని నాశనం చేసి ఇతరులను వారి స్థానంలో ఉంచుతాడు.
25 కనుక మనుష్యులు ఏమి చేస్తారో దేవునికి తెలుసు.
అందుకే దేవుడు దుర్మార్గులను రాత్రిపూట ఓడించి, వారిని నాశనం చేస్తాడు.
26 చెడ్డవాళ్లు చేయు దుర్మార్గపు పనులను బట్టి దేవుడు వారిని నాశనం చేస్తాడు.
ఆ చెడ్డవారిని అందరూ చేసేలా ఆయన శిక్షిస్తాడు
27 ఎందుకంటే ఆ చెడ్డవాళ్లు దేవునికి విధేయత కావటం మానివేశారు గనుక.
మరియు ఆయన కొరిన వాటిని చేయటం ఆ చెడ్డవాళ్లు లక్ష్య పెట్టలేదు గనుక.
28 పేద ప్రజలను బాధించి, వారు సహాయం కోసం దేవునికి మొర పెట్టేలాగా ఆ చెడ్డవాళ్లు చేశారు.
మరియు పేదవారు సహాయం కోసం మొరపెట్టినప్పుడు ఆయన వింటాడు.
29 కానీ ఒకవేళ పేద ప్రజలకు సహాయం చేయకూడదని
కనుక దేవుడు నిర్ణయంచేస్తే ఎవరూ ఆయనను దోషిగా నిర్ణయించలేరు
ఒకవేళ దేవుడు ప్రజలకు తన ముఖం మరుగు చేసికొంటే వారికి సహాయం చేయగలవాడు ఎవడూ ఉండడు.
అయితే ఆయన వ్యక్తులను, రాజ్యాలను పాలిస్తాడు.
30 తర్వాత దేవునికి విరోధంగా ఉండి మనుష్యులను మోసగించే వ్యక్తిని
దేవుడు పాలకునిగా ఉండనివ్వడు.
31 “ఒకవేళ ఒక వ్యక్తి దేవునితో అనవచ్చును:
‘నేను దోషిని, నేను ఇంకెంత మాత్రం పాపం చేయను.
32 దేవా, నాకు తెలియని విషయాలు నాకు నేర్పించు.
నేను తప్పు చేసి ఉంటే ఇకమీదట ఎన్నటికి మరల దానిని చేయను.’
33 కానీ యోబూ, నీవు మారటానికి తిరస్కరిస్తూ ఉండగా,
నీవు ఏ విధంగా ప్రతిఫలం కావాలని కోరుకొంటావో అలా దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలా?
యోబూ, ఇది నీ తీర్మానం, నాది కాదు.
నీవు ఏమి అనుకొంటున్నావో నాకు చెప్పు.
34 జ్ఞానం గలిగి, గ్రహింపు ఉన్న ఏ మనిషిగాని నాతో ఏకీభవిస్తాడు.
నా మాటలు వినే జ్ఞానం గల మనిషి ఎవరైనా సరే అని అంటారు,
35 ‘యోబు తెలియనివానిలా మాట్లాడతాడు.
యోబు చెప్పే మాటలకు అర్థం లేదు.’
36 యోబును పరీక్షించేందుకు అతనికి ఇంకా ఎక్కువ కష్టాలు వస్తే బాగుండునని, నా ఆశ.
ఎందుకంటే ఒక దుర్మార్గుడు జవాబిచ్చినట్టుగా యోబు మనకు జవాబు ఇస్తున్నాడు గనుక.
37 యోబు తన పాపం అంతటికి తిరుగుబాటుతనం అదనంగా కలిపాడు.
యోబు మనలను అవమానించి, మన ఎదుట దేవుణ్ణి హేళన చేస్తున్నాడు.”
35 ఎలీహు మాట్లాడటం కొనసాగించాడు. అతడు అన్నాడు:
2 “యోబూ, యోబు అనే నేను
‘దేవునికంటె ఎక్కువ సక్రమంగా ఉన్నాను’ అని నీవు చెప్పటం న్యాయం కాదు.
3 యోబూ, నీవు దేవుణ్ణి,
‘దేవా, ఒక మనిషి, దేవుని సంతోష పరచుటవలన ఏమి పొందుతాడు?
నా పాపం నిన్నెలా బాధిస్తుంది?
నేను పాపం చేయక పోతే నాకేం మంచి లభిస్తుంది?’ అని అడుగు.
4 “యోబూ, ఎలీహు అనే నేను నీకు, ఇక్కడ నీతో ఉన్న స్నేహితులకు జవాబు ఇవ్వగోరుతున్నాను.
5 యోబూ, పైన ఆకాశం చూడు.
పైకి చూచి, మేఘాలు నీకంటే ఎత్తుగా ఉన్నాయని తెలుసుకో.
6 యోబూ, నీవు పాపం చేస్తే అది దేవుణ్ణి బాధపెట్టదు.
ఒకవేళ నీ పాపాలు చాలా ఉంటే అవి దేవునికి ఏమీ చేయలేవు.
7 యోబూ, నీవు మంచివానిగా ఉంటే అదేమి దేవునికి సహాయం చేయదు.
నీనుండి దేవునికి ఏమీ రాదు.
8 యోబూ, నీవు చేసే మంచిచెడ్డలు నీలాంటి వాళ్లను మాత్రమే బాధిస్తాయి.
(అవి దేవునికి సహాయకారి కావు మరియు దేవుణ్ణి బాధించవు.)
9 “మనుష్యులు దుర్మార్గంగా, అన్యాయంగా పరామర్శించబడితే సహాయం కోసం వారు మొరపెడతారు.
శక్తివంతమైన వాళ్లు తమకు సహాయాన్ని చేయాలని వారు బతిమలాడుతారు.
10 కానీ సహాయం కోసం వారు దేవుణ్ణి వేడుకోరు.
‘నన్ను తయారు చేసి, నా ఆనందం కోసం రాత్రులలో పాటలు ఇచ్చినటువంటి దేవుడెక్కడ? అని ఎవరూ అనరు.
11 సహాయం కోసం వారు దేవుణ్ణి అడగరు. దేవుడే మనుష్యుల్ని జ్ఞానం గల వారినిగా చేశాడు.
జంతువులను, పక్షులను దేవుడు జ్ఞానంగల వాటినిగా చేయలేదు.’
12 “కాని చెడ్డవాళ్లు గర్వంగా ఉంటారు.
కనుక వారు సహాయం కోసం దేవునికి మొరపెడితే దేవుడు వారికి జవాబు ఇవ్వడు.
13 వారి పనికిమాలిన విన్నపం దేవుడు వినడు, అది నిజం.
సర్వశక్తిగల దేవుడు వారిపట్ల శ్రద్ధ చూపడు.
14 యోబూ, అదే విధంగా దేవుడు నీకు కనబడలేదని నీవు చెప్పినప్పుడు,
దేవుడు నీ మాట వినడు.
దేవుణ్ణి కలుసుకొని, నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొనే అవకాశంకోసం
నిరీక్షిస్తున్నానని నీవు అంటున్నావు.
15 “యోబూ, దేవుడు దుర్మార్గులను శిక్షించడనీ,
పాపాన్ని దేవుడు లక్ష్యపెట్టడనీ నీవు తలస్తున్నావు.
16 కనుక యోబు తన పనికిమాలిన మాటలు కొనసాగిస్తున్నాడు.
యోబు మాట్లాడుతోంది ఏమిటో అతనికే తెలియదు.”
యెరూషలేములో సమావేశం
15 కొందరు యూదయనుండి అంతియొకయకు వచ్చి అక్కడున్న సోదరులకు, “సున్నతి అనే మోషే ఆచారాన్ని పాటిస్తే తప్ప మీకు రక్షణ లభించదు” అని బోధించారు. 2 ఈ కారణంగా పౌలు, బర్నబా వాళ్ళతో తీవ్రమైన వాదనలు, చర్చలు చేసారు. అపొస్తలుల్ని ఈ విషయాన్ని గురించి సంప్రదించాలనే ఉద్దేశ్యంతో పౌలును, బర్నబాను, మరి కొంతమందిని యెరూషలేమునకు పంపాలనే నిర్ణయం జరిగింది.
3 అక్కడున్న సంఘం వీళ్ళకు వీడ్కోలు యిచ్చింది. వీళ్ళు ఫోనీషియ, సమరయ పట్టణాల ద్వారా ప్రయాణం చేస్తూ యూదులు కానివాళ్లలో వచ్చిన మార్పును గురించి అక్కడి వాళ్ళకు చెప్పారు. ఇది సోదరులందరికీ చాలా ఆనందం కలిగించింది. 4 వీళ్ళు యెరూషలేము చేరగానే సంఘము, అపొస్తలులు, పెద్దలు అంతా కలిసి వీళ్ళకు స్వాగతం యిచ్చారు. పౌలు, బర్నబా దేవుడు తమ ద్వారా చేసిన వాటిని వాళ్ళకు చెప్పారు. 5 పరిసయ్యుల తెగకు చెందిన కొందరు భక్తులు లేచి, “యూదులు కానివాళ్ళు తప్పక సున్నతి చేసుకోవాలి. మోషే ధర్మశాస్త్రాన్ని పాటించాలి” అని అన్నారు.
6 అపొస్తలులు, పెద్దలు కలిసి ఈ విషయాన్ని పరిశీలించారు. 7 ఎన్నో చర్చలు జరిగాక పేతురు లేచి యిలా అన్నాడు: “సోదరులారా! యూదులు కానివాళ్ళు నా నోటినుండి సువార్త విని విశ్వాసులు కావాలని చాలా కాలం క్రిందటే దేవుడు మనందరినుండి నన్నెన్నుకొన్నట్లు మీకు తెలుసు. 8 మానవుల మనస్సు తెలిసిన దేవుడు, మనకిచ్చినట్లే పవిత్రాత్మను వాళ్ళకు కూడా యిచ్చి వాళ్ళను అంగీకరించినట్లు మనకు తెలియ చేసాడు. 9 మనకు, వాళ్ళకూ వ్యత్యాసం చూపలేదు. వాళ్ళు విశ్వసించారు. కనుక వాళ్ళ హృదయాలను పవిత్రం చేసాడు. 10 మరి అలాంటప్పుడు బరువైన ఈ కాడిని శిష్యుల మెడపై ఎందుకు పెడ్తున్నారు? ఈ బరువును మనము, మన పెద్దలు కూడా మోయలేక పోయాము కదా! దేవుడు కోప్పడుతాడో లేదో చూడాలని ఉందా? 11 యేసు ప్రభువు దయతో మనము, వీళ్ళు కూడా రక్షింపబడుతామని నమ్ముతున్నాము.”
12 సభలో ఉన్నవాళ్ళందరూ నిశ్శబ్దం వహించారు. బర్నబా, పౌలు యూదులు కానివాళ్ళలో దేవుడు తమ ద్వారా చేసిన మహిమల్ని గురించి, అద్భుతాల్ని గురించి చెప్పగా వాళ్ళు విన్నారు. 13 పౌలు, బర్నబా మాట్లాడటం ముగించాక యాకోబు ఈ విధంగా అన్నాడు: “సోదరులారా! నా మాటలు వినండి! 14 దేవుడు మొదట్లో యూదులు కానివాళ్ళ పట్ల తన అభిమానాన్ని చూపి వాళ్ళనుండి కొందర్ని ఎన్నుకొని తన ప్రజలుగా ఎలా చేసుకొన్నాడో సీమోను మనకు వివరించి చెప్పాడు. 15 ఈ సంఘటనను ప్రవక్తలు ఈ వాక్యాల్లో సరిగ్గా వర్ణించారు:
16 ‘కూలిపోయిన దావీదు యింటిని పునర్నిర్మిస్తాను!
ఆ శిథిలాలతో క్రొత్త యింటిని నిర్మిస్తాను!
17 మిగతా వాళ్ళంతా ప్రభువును వెతుకుతారు!
నేనెన్నుకొన్న యూదులుకాని ప్రజలు కూడా వెతుకుతారు.’(A)
18 ‘అని ప్రభువు చాలా కాలం క్రిందటే తెలియచేసాడు.’
19 “దేవుడు యూదులు కానివాళ్ళను కూడా అంగీకరించాడు కాబట్టి, దేవుని వైపు మళ్ళుతున్న వాళ్ళ మనస్సుకు కష్టం కలిగించ కూడదని నా అభిప్రాయం. 20-21 కాని తరతరాలనుండి మోషే ధర్మశాస్త్రాన్ని ప్రతి పట్టణంలో ప్రకటిస్తూ, వాటిని ప్రతి విశ్రాంతి రోజు సమాజ మందిరాల్లో చదివారు కాబట్టి,
విగ్రహాలకు నైవేద్యం పెట్టిన ఆహారం ముట్టరాదని,
లైంగిక పాపము చేయరాదని,
గొంతు నులిమి చంపిన జంతువుల మాంసం ముట్టరాదని, జంతువుల రక్తాన్ని తినరాదని వాళ్ళకు మనం వ్రాయాలి.”
© 1997 Bible League International