Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఓబద్యా

ఎదోముకు శిక్ష

ఇది ఓబద్యాకు వచ్చిన దర్శనం. నా ప్రభువైన యెహోవా ఎదోమును[a] గురించి ఈ విషయం చెప్పాడు:

దేవుడైన యెహోవా నుండి ఒక సమాచారం మేము విన్నాము.
    వివిధ దేశాలకు ఒక దూత పంపబడ్డాడు.
“మనం వెళ్లి ఎదోము మీద యుద్ధం చేద్దాం” అని అతడన్నాడు.

ఎదోముతో యెహోవా మాట్లాడటం

“చూడు, సాటి దేశాలలో నిన్ను అల్పునిగా చేస్తాను.
    ప్రజలు నిన్ను మిక్కిలి అసహ్యించుకుంటారు.
నీ గర్వం నిన్ను మోసపుచ్చింది. కొండశిఖరంమీద గుహలలో నీవు నివసిస్తున్నావు.
    నీ ఇల్లు కొండల్లో ఎత్తున ఉంది.
అందువల్ల, ‘నన్నెవరూ కిందికి తేలేరు’
    అని, నీకు నీవు మనస్సులో అనుకుంటున్నావు.”

ఎదోము తగ్గంచబడుతుంది

దేవుడైన యెహోవా ఇది చెప్పాడు:
“నీవు గ్రద్దలా ఎత్తుగా ఎగిరినా,
    నీ గూటిని నీవు నక్షత్రాల్లో కట్టుకున్నా,
    అక్కడనుండి నిన్ను కిందికి దించుతాను
నీవు నిశ్చయంగా నాశనమవుతావు!
    దొంగలు నీవద్దకు వస్తారు!
రాత్రిపూట దోపిడిగాండ్రు వస్తారు!
    ఆ దొంగలు వారికి కావలసినవన్నీ ఎత్తుకు పోతారు!
ద్రాక్షాపండ్లు ఏరటానికి పనివారు నీ పొలాలకు వచ్చినప్పుడు,
    వారు కొన్ని పండ్లు పరిగె ఏరుకొనేవారుకు వదిలిపెడతారు.
ఏశావు[b] రహస్య ధనసంపద కొరకు శత్రువులు వెదకుతారు.
    వాటిని వారు కనుగొంటారు!
నీ స్నేహితులైన ప్రజలంతా
    నిన్ను దేశంనుండి పంపివేస్తారు.
నీతో సంధి చేసుకొన్నవారు
    నిన్ను మోసగించి, ఓడిస్తారు.
నీ వద్దనే రొట్టెలు తిన్న మనుష్యులు,
    నిన్ను పట్టటానికి వల పన్నుతున్నారు.
వారు ఇలా అంటున్నారు: ‘ఇలా అవుతుందని అతడు అనుమానించడు’”

యెహోవా ఇలా చెపుతున్నాడు: “ఆ రోజున
    ఎదోము జ్ఞానులను ఎదోము పర్వతాలలోనున్న వివేకులను నేను నాశనం చేయగోరుదును.
తేమానూ, నీ యోధులు భయపడతారు.
    ఏశావు పర్వతంమీద ప్రతి ఒక్కడూ చంపబడతాడు.
    అనేక మంది చంపబడతారు.
10 అవమానం నిన్ను ఆవరిస్తుంది.
    నీవు శాశ్వతంగా నాశనమవుతావు.
    ఎందుకంటే, నీవు నీ సోదరుడైన యాకోబుపట్ల చాలా క్రూరంగా ఉన్నావు.
11 పరదేశీయులు ఇశ్రాయేలు ధనరాశులను ఎత్తుకుపోయినప్పుడు
    ఇశ్రాయేలు శత్రువులతో నీవు చేతులు కలిపావు.
పరదేశీయులు ఇశ్రాయేలు నగర ద్వారంలోకి వచ్చి,
    యెరూషలేములో ఎవరు ఏ భాగాన్ని ఆక్రమించుకోవాలనే విషయంలో చీట్లు వేశారు.
    ఆ సమయంలో, ఆ వచ్చిన వారిలో ఒకనిమాదిరిగా నీవు ఉన్నావు.
12 నీ సోదరుని కష్టకాలం చూసి నీవు నవ్వావు.
    నీవాపని చేసియుండకూడదు.
ఆ జనులు యూదాను నాశనం చేసినప్పుడు నీవు సంతోషించావు.
    నీవలా చేసియుండకూడదు.
యూదా ప్రజల కష్టకాలంలో నీవు గొప్పలు చెప్పుకున్నావు.
    నీవది చేసియుండకూడదు.
13 నా ప్రజల నగరద్వారాన ప్రవేశం చేసి,
    నీవు వారి సమస్యలను చూసి నవ్వావు.
నీవది చేసియుండకూడదు.
    వారికి కష్టకాలం వచ్చినప్పుడు.
నీవు వారి ఆస్తిని దోచుకున్నావు.
    నీవాపని చేసియుండకూడదు.
14 నీవు నాలుగు బాటలు కలిసిన స్థానంలో నిలబడి తప్పించుకొని పారిపోయే ప్రజలను చంపివేశావు.
    నీవాపని చేయకుండా ఉండవలసింది. తప్పించుకునేవారిలో కొందరిని సజీవంగా పట్టుకున్నావు.
    నీవాపని చేయకుండా ఉండవలసింది.
15 అన్ని దేశాలపై యెహోవా తీర్పురోజు త్వరలో వస్తూ ఉంది.
    నీవు ఇతర ప్రజలకు కీడు చేశావు.
అదే కీడు నీకూ జరుగుతుంది.
    అవే చెడ్డపనులు నీ తలమీదికి వచ్చి పడతాయి.
16 ఎందుకంటే, నా పవిత్ర పర్వతంమీద నీవు రక్తాన్ని చిందించావు.
    అలాగే ఇతర జనులు నీ రక్తాన్ని చిందిస్తారు.
నువ్వు అంతరిస్తావు
    నువ్వెప్పుడూ లేనట్లుగా ఉంటుంది.
17 కాని సీయోను కొండమీద మాత్రం మిగిలినవారు ఉంటారు.
    వారు నా ప్రత్యేక ప్రజలుగా ఉంటారు.
యాకోబు వంశం తనకు చెందిన
    వస్తువులను తిరిగి తీసుకొంటుంది.
18 యాకోబు వంశం అగ్నిలా తయారవుతుంది.
    యోసేపు[c] సంతతివారు మంటలా తయారవుతారు.
కాని ఏశావు వంశం బూడిదలా ఉంటుంది.
    యూదా ప్రజలు ఎదోమీయులను కాల్చివేస్తారు.
యూదా ప్రజలు ఎదోమీయులను నాశనం చేస్తారు.
అప్పుడు ఏశావు సంతతివారిలో బ్రతికినవాడంటూ ఏ ఒక్కడూ ఉండడు.”
    దేవుడైన యెహోవా దాన్ని చెప్పాడు గనుక అది జరుగుతుంది.
19 యూదాకు దక్షిణానగల ఎడారి ప్రాంత ప్రజలు ఏశావు కొండను ఆక్రమించుకుని నివసిస్తారు.
    కొండకింది (మైదాన) ప్రాంతంవారు ఫిలిష్తీయుల దేశాన్ని ఆక్రమిస్తారు.
ఆ ప్రజలు ఎఫ్రాయిము, సమరయ (షోమ్రోను) భూములను ఆక్రమించి నివసిస్తారు.
    గిలాదు దేశం బెన్యామీనుకు చెంది ఉంటుంది.
20 ఇశ్రాయేలు ప్రజలు వారి ఇండ్లు వదిలిపోయేలా ఒత్తిడి చేయబడ్డారు.
    కాని ఆ ప్రజలే కనానీయుల దేశాన్ని సారెపతువరకు ఆక్రమిస్తారు.
యెరూషలేమునుండి సెఫారాదుకు చెరపట్టబడ్డవారు
    దక్షిణ ప్రాంత పట్టణాలను ఆక్రమించుకొంటారు.
21 జయించినవారు సీయోను కొండమీద ఉంటారు
    ఆ మనుష్యులు ఏశావు కొండమీద నివసిస్తున్న వారిని పరిపాలిస్తారు.
    అప్పుడు రాజ్యం యెహోవాకు చెంది ఉంటుంది.

ప్రకటన 9

పాతాళం నుండి మిడుతలు

ఐదవ దేవదూత తన బూర ఊదినప్పుడు ఆకాశం నుండి భూమ్మీద పడ్డ నక్షత్రాన్ని చూశాను. పాతాళం[a] యొక్క తాళం చెవి ఈ నక్షత్రానికి యివ్వబడింది. అతడు పాతాళాన్ని తెరిచాడు. అప్పుడు దాన్నుండి పెద్ద పొగ లేచింది. అది ఒక పెద్ద కొలిమి నుండి వచ్చినట్లు అనిపించింది. పాతాళం నుండి వచ్చిన పొగవల్ల సూర్యుడు, ఆకాశం చీకటైపోయాయి.

ఆ పొగనుండి మిడతలు భూమ్మీదికి వచ్చాయి. తేళ్ళవలె కుట్టే శక్తి ఆ మిడతలకివ్వబడింది. భూమ్మీద ఉండే గడ్డికి కాని, మొలకకు కాని, చెట్టుకు కాని హాని చేయవద్దని, నుదుటిమీద దేవుని ముద్రలేనివాళ్ళకు మాత్రమే హాని కలిగించమని ఆ మిడతలకు చెప్పబడింది. మనుష్యుల్ని ఐదు నెలల దాకా హింసించే శక్తి వాటికి యివ్వబడింది. వాళ్ళను చంపే శక్తి వాటికి యివ్వబడలేదు కాని అవి కుట్టినప్పుడు తేళ్ళు కుట్టినట్లు నొప్పి కలుగుతుంది. ఆ కాలంలో మనుష్యులు చావే మంచిదని చావును వెతుకుతారు. కాని వాళ్ళకది దొరకదు. వాళ్ళు చావాలని చాలా ఆశిస్తారు. కాని చావు వాళ్ళను తప్పించుకొని వెళ్ళిపోతుంది.

ఆ మిడుతలు యుద్ధానికి సిద్ధం చేయబడిన గుఱ్ఱాలలా కనిపించాయి. వాటి తలలమీద బంగారు కిరీటాల్లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుష్యుల ముఖాల్లా ఉన్నాయి. వాటి తలవెంట్రుకలు స్త్రీల తలవెంట్రుకల్లా ఉన్నాయి. వాటి కోరలు సింహపు కోరల్లా ఉన్నాయి. అవి ఇనుప కవచాలు వేసుకొని ఉన్నాయి. వాటి రెక్కల ధ్వని గుఱ్ఱాలు, రథాలు యుద్ధానికి వెడుతున్నప్పుడు కలిగే ధ్వనిలా ఉంది. 10 వాటి తోకలు తేళ్ళ తోకల్లా కొండ్లతో ఉన్నాయి. వాటి తోకల్లో ఐదు నెలల దాకా ప్రజల్ని హింసించే శక్తి ఉంది. 11 పాతాళ లోకపు దూత వాటికి రాజుగా ఉన్నాడు. హీబ్రూ భాషలో వాని పేరు అబద్దోను. గ్రీకు భాషలో వాని పేరు అపొల్లుయోను.

12 మొదటి శ్రమ సమాప్తమయింది. మిగతా రెండు శ్రమలు యింకా జరుగవలసి ఉన్నాయి.

ఆరవ బూర ఊదబడింది

13 ఆరవ దేవదూత తన బూర ఊదాడు. దేవుని ముందున్న బంగారు ధూపవేదిక యొక్క నాలుగు కొనల నుండి నాకు ఒక స్వరం వినిపించింది. 14 ఆ స్వరం బూర ఊదుతున్న ఆరవ దూతతో, “యూఫ్రటీసు మహానది దగ్గర బంధింపబడిన నలుగురు దూతల్ని విడుదల చేయి” అని అనింది. 15 ఇదే గడియ, ఇదే రోజు, ఇదే నెల, ఇదే సంవత్సరము విడుదల చేయబడటానికి వాళ్ళు యింతవరకు బంధింపబడ్డారు. మనుష్యులలో మూడవ భాగాన్ని హతమార్చటానికి వాళ్ళు విడుదల చేయబడ్డారు. 16 ఆ రౌతుల సంఖ్య ఇరవై కోట్లు అన్నట్లు నేను విన్నాను.

17 నాకు కనిపించిన రౌతులు, గుఱ్ఱాలు ఈ విధంగా ఉన్నాయి. రౌతుల కవచాలు అగ్నివలె ఎరుపు, ముదురు నీలం, గంధకాన్ని పోలిన పసుపు రంగుల్లో ఉన్నాయి. గుఱ్ఱాల తలలు సింహాల తలల్లా ఉన్నాయి. వాటి నోళ్ళనుండి మంటలు, పొగ, గంధకము బయటికి వచ్చాయి. 18 వాటి నోళ్ళనుండి వచ్చిన ఈ మూడు పీడలు, అంటే మంటలు, పొగలు, గంధకాల వల్ల మనుష్యులలో మూడవ భాగం హతులై పోయారు. 19 ఆ గుఱ్ఱాల శక్తి వాటి నోళ్ళల్లో, తోకల్లో ఉంది. వాటి తోకలు పాముల్లా ఉన్నాయి. ఆ తోకలకు పాము తలలు ఉన్నాయి. వాటితో అవి కాటువేసి బాధిస్తాయి.

20 ఈ మూడు పీడలు యింత నాశనం చేసినా, మరణించని మానవ జాతి తాము చేసిన పాపాలకు పశ్చాత్తాప పడలేదు. వాళ్ళు దయ్యాల్ని పూజించటం మానుకోలేదు. బంగారము, వెండి, కంచు, రాయి, చెక్కతో చేసిన విగ్రహాలను పూజించటం వాళ్ళు మానుకోలేదు. ఈ విగ్రహాలు చూడకపోయినా, వినకపోయినా, కదలకపోయినా, వాటిని పూజించటం మానుకోలేదు. 21 అంతేకాక, వాళ్ళు తాము చేసిన హత్యలకు, మంత్రతంత్రాలకు, లైంగిక అవినీతికి, దొంగతనాలకు మారుమనస్సు పొందలేదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International