Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆమోసు 7-9

మిడుతలను గూర్చిన దర్శనం

యెహోవా నాకిది చూపించాడు: రెండవ పంట పెరగటం ప్రారంభమైనప్పుడు ఆయన మిడుతలను పుట్టిస్తున్నాడు. రాజు మొదటి పంట కోసాక పెరిగే రెండవ పంట ఇది. మిడుతలు దేశంలో వున్న గడ్డినంతా తినివేశాయి. దాని తరువాత నేనిలా అన్నాను: “నా ప్రభువైన యెహోవా, మమ్మల్ని క్షమించుమని నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు చాలా చిన్నవాడు!”

అప్పుడు యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది జరగదు” అని అన్నాడు.

అగ్నిని గూర్చిన దర్శనం

నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు నాకు చూపించాడు: దేవుడైన యెహోవా అగ్నిచేత తీర్పు తీర్చటానికి పిలవటం నేను చూశాను. ఆ అగ్ని గొప్ప అగాధ జలాన్ని నశింపజేసింది. ఆ అగ్ని భూమిని తినివేయటం ప్రారంభించింది. కాని నేనిలా అన్నాను, “దేవుడవైన ఓ యెహోవా, ఇది ఆపివేయి. నిన్ను నేను అర్థిస్తున్నాను! యాకోబు బతకలేడు! అతడు మిక్కిలి చిన్నవాడు!”

పిమ్మట యెహోవా ఈ విషయంలో తన మనస్సు మార్చుకొని “అది కూడా జరగదు” అని అన్నాడు!

మట్టపుగుండు దర్శనం

యెహోవా దీనిని నాకు చూపించాడు: మట్టపుగుండు[a] (మట్టపు గోడ నిటారుగా వచ్చేలా సరి చూడబడుతుంది)ను చేతబట్టుకొని యెహోవా ఒక గోడవద్ద నిలబడ్డాడు. “ఆమోసూ, నీవు ఏమి చూస్తున్నావు?” అని యెహోవా నన్ను అడిగాడు.

“ఒక మట్టపు గుండును” అని నేనన్నాను.

అప్పుడు నా ప్రభువు ఇలా అన్నాడు: “చూడు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులమధ్య ఒక మట్టపుగుండు పెడతాను. వారి ‘దుష్టత్వాన్ని’ ఇక ఎంత మాత్రం నేను చూసి చూడనట్లు వదలను. (ఆ దుష్ట భాగాలను నేను తొలగిస్తాను). ఇస్సాకు వంశస్థులు ఏర్పాటు చేసిన ఉన్నత ప్రదేశాలు నాశనం చేయబడతాయి. ఇశ్రాయేలు పవిత్ర స్థలాలన్నీ రాళ్ల గుట్టల్లా మార్చబడతాయి. నేను యరొబాము వంశంమీద పడి వారిని కత్తులతో చంపుతాను.”

ఆమోసు ప్రకటనలను అమజ్యా ఆపజూడటం

10 బేతేలులో ఒక యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజైన యరొబాముకు ఈ వర్తమానం పంపాడు: “ఆమోసు నీమీద కుట్ర పన్నుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు నీ మీదకు తిరగబడేలా చేయటానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. అతడు ఎంతగా మాట్లాడుతున్నాడంటే, ఈ దేశం అతని మాటల్ని సహించలేదు. 11 యరొబాము కత్తిచే చంపబడతాడనీ, ఇశ్రాయేలీయులు తమ దేశంనుండి బందీలుగా కొనిపోబడతారనీ ఆమోసు ప్రచారం చేస్తున్నాడు.”

12 ఆమోసుతో కూడ అమజ్యా ఇలా చెప్పాడు: “ఓ దీర్ఘదర్శీ (ప్రవక్తా), నీవు యూదాకు పారిపోయి అక్కడనే తిను. నీ బోధన అక్కడనే చేయి. 13 అంతేగాని, ఇక్కడ బేతేలులో ఎంతమాత్రమూ నీవు ప్రకటనలు చేయవద్దు. ఇది యరొబాము పవిత్ర స్థలం (రాజధాని). ఇది ఇశ్రాయేలు ఆలయం!”

14 అప్పుడు అమజ్యాకు ఆమోసు ఇలా సమాధానాం చెప్పాడు: “నేను వృత్తిరీత్యా ప్రవక్తను గాను. పైగా నేను ప్రవక్త వంశంనుండి వచ్చినవాడినీ కాను. నేను పశువులను కాస్తూ ఉంటాను. మేడి పండ్ల వృక్షాలను రక్షిస్తూ వుంటాను. 15 నేనొక గొర్రెల కాపరిని. అయితే యెహోవా నన్ను గొర్రెలను అనుసరించనీయకుండా పిలిచాడు. ‘నీవు వెళ్లి, నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ప్రకటనలు చేయి’ అని యెహోవా నాతోచెప్పాడు. 16 కావున యెహోవా వర్త మానాన్ని విను. నీవు, ‘ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా ప్రకటించవద్దు. ఇస్సాకు వంశానికి వ్యతిరేకంగా బోధనలు చేయవద్దు’ అని నాకు చెపుతున్నావు. 17 కాని యెహోవా చెప్పేదేమంటే: ‘నీ భార్య నగరంలో వేశ్య అవుతుంది. నీ కుమారులు, కుమార్తెలు కత్తులతో చంపబడతారు. అన్యజనులు నీ రాజ్యాన్ని వ పర్చుకొని, తమలో తాము దానిని పంచుకుంటారు. నీవు పరదేశంలో చనిపోతావు. ఇశ్రాయేలు ప్రజలు నిశ్చయంగా ఈ దేశంనుండి బందీలుగా తీసికొనిపోబడతారు.’”

పక్వానికి వచ్చిన పండు దర్శనం

యెహోవా ఇది నాకు చూపించాడు. వేసవి కాలపు పండ్లగంప నొకదానిని నేను చూశాను. “ఆమోసూ, నీ వేమి చూస్తున్నావు?” అని యెహోవా నన్నడిగాడు.

“ఒక గంపెడు వేసవి కాలపు పండ్లు” అని నేను చెప్పాను.

అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు: “నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అంతం వచ్చింది. నేనిక ఎంత మాత్రం వారి పాపాలను చూసి చూడనట్లు ఉండను. ఆలయంలో పాడే పాటలు శోక గీతాలుగా మారతాయి. నా ప్రభువైన యెహోవా ఆ విషయాలు చెప్పాడు. ప్రతి చోటా శవాలు పడి ఉంటాయి. ప్రజలు నిశ్శబ్దంగా శవాలను మోసుకుపోయి పీనుగుల గుట్టమీద వేస్తారు.”

ఇశ్రాయేలు వ్యాపారుల ధనాశ

నేను చెప్పేది వినండి! నిస్సహాయులైన ప్రజలపై మీరు నడిచి వెళ్తారు.
    ఈ దేశ పేదప్రజలను నాశనం చేయాలని మీరు ప్రయత్నిస్తున్నారు.
వర్తకులారా, మీరిలా అంటారు,
    “మేము ధాన్యాన్ని అమ్ముకొనేటందుకు అమావాస్య ఎప్పుడు వెళ్లిపోతుంది?
అమ్మకానికి మా గోధుమలు తేవటానికి
    విశ్రాంతిదినం ఎప్పుడైపోతుంది?
కొలతలు తగ్గించి, ధరలు పెంచుతాము.
    దొంగత్రాసు వేసి ప్రజలను మోసగిస్తాము.
పేదవారు ఎలాగో వారి అప్పులు తీర్చలేరు గనుక,
    మేము వారిని బానిసలనుగా కొంటాము.
జత చెప్పుల విలువకు ఆ నిస్సహాయులను మేము కొంటాము.
    ఆహా, నేలపై ఒలికిన ధాన్యాన్ని కూడా మేము అమ్ముకోవచ్చు.”

యెహోవా ఒక మాట ఇచ్చాడు. యాకోబుకు గర్వ కారణమైన తన పేరుమీద ఈ ప్రమాణం చేశాడు:

“ఆ ప్రజలు చేసిన పనులను నేనెన్నడూ మరువను.
ఆ పనుల కారణంగా భూమి అంతా కంపిస్తుంది.
    దేశంలో నివసించే ప్రతివాడు చనిపోయినవారి కొరకు విలపిస్తాడు.
ఈజిప్టులోని నైలు నదిలా భూమి అంతా ఉవ్వెత్తుగా లేచి పతనమవుతుంది.
    భూమి అటూ ఇటూ ఊగిసలాడుతుంది.”
యెహోవా ఈ విషయాలు కూడా చెప్పాడు:
“ఆ సమయంలో మధ్యాహ్న సమయంలో సూర్యుడు అస్తమించేలా నేను చేస్తాను.
    మబ్బులేని పగటి సమయంలో భూమిపై చీకటి కమ్మేలా చేస్తాను.
10 మీ పండుగ దినాలను చనిపోయినవారి కొరకు దుఃఖించే దినాలుగా మార్చుతాను.
    మీ పాటలన్నీ మృతులకొరకు విలాప గీతాలవుతాయి.
ప్రతివానిపైన విషాద సూచిక దుస్తులు వేస్తాను.
    ప్రతివాని తలను బోడితల చేస్తాను.
ఏకైక పుత్రుడు చనిపోయినప్పుడు కలిగే గొప్ప
    దుఃఖంలాంటి దుఃఖాన్ని నేను కలిగిస్తాను.
అది ఒక భయంకరమైన అంతం.”

దేవుని వాక్యంకొరకు కరువు

11 యెహోవా చెపుతున్నాడు:

“చూడు, దేశంలో కరువు పరిస్థితిని
    నేను కల్పించే సమయం వస్తూవుంది.
ప్రజలు ఆహారం కొరకు ఆకలిగొనరు.
    ప్రజలు నీటి కొరకు దప్పిగొనరు.
    కాని యెహోవా వాక్యాల కొరకు ప్రజలు ఆకలిగొంటారు.
12 ప్రజలు ఒక సముద్రంనుండి
    మరొక సముద్రం వరకు తిరుగుతారు.
    వారు ఉత్తరాన్నుండి తూర్పుకు పయనిస్తారు.
యెహోవా వాక్యం కొరకు ప్రజలు ముందుకు, వెనుకకు పోతారు.
    కాని వారు దానిని కనుగొనలేరు.
13 ఆ సమయంలో అందమైన యువతీ యువకులు
    దప్పికతో సొమ్మసిల్లుతారు.
14 షోమ్రోనుయొక్క పాపము సాక్షిగా ప్రమాణం చేసేవారు
    ఇలా అంటారు: ‘దానూ, నీ దేవుని జీవముతోడు.’
    ‘బెయేర్షెబా మార్గంతోడు’ అని. ఆ ప్రజలు పతనమవుతారు,
వారు మరెన్నడూ లేవరు.”

యెహోవా బలిపీఠం పక్కన నిల్చున్నట్లు దర్శనం

నా ప్రభువు బలిపీఠం పక్కన నిలబడినట్లు నేను చూశాను. ఆయన ఇలా అన్నాడు:

“స్తంభాల తలలపై కొట్టు.
    దానితో అది గుమ్మాల వరకు కదులుతుంది.
స్తంభాలు ప్రజల తలలపై పడేలా కొట్టు.
    ఇంకా ఎవరైనా మిగిలితే వారిని నేను కత్తితో చంపుతాను.
ఏ వ్యక్తి అయినా పారిపోవచ్చు; కాని అతడు తప్పించుకోలేడు.
    ప్రజలలో ఒక్కడు కూడా తప్పించుకోలేడు.
వారు పాతాళం లోపలికి పోయినా నేను వారిని
    అక్కడనుండి బయటకు లాగుతాను.
వారు ఆకాశంలోకి దూసుకుపోతే,
    నేను వారిని అక్కడనుండి కిందికి తెస్తాను.
వారు కర్మెలు పర్వత శిఖరంలో దాగినా వారిని నేనక్కడ కనుగొంటాను.
    వారిని అక్కడ పట్టుకొని తీసుకొస్తాను.
వారు నా నుండి సముద్ర గర్భంలో దాగటానికి ప్రయత్నించితే నేను పాముకు ఆజ్ఞ ఇస్తాను.
    అది వారిని కాటేస్తుంది.
వారు శత్రువు చేతజిక్కి బందీలుగా కొనిపోబడితే,
    నేను కత్తికి ఆజ్ఞ ఇస్తాను.
    అది వారిని అక్కడ చంపివేస్తుంది.
అవును. నేను వారిపై నిఘా వేసి ఉంటాను.
    వారికి కష్టాలు తెచ్చి పెట్టే ఉపాయాలను నేను అన్వేషిస్తాను.
    అంతేగాని, వారికి మంచి చేసే విధానాలను నేను చూడను.”

శిక్ష ప్రజలను నాశనం చేస్తుంది

నా ప్రభువును, సర్వశక్తిమంతుడును అయిన యెహోవా భూమిని తాకితే,
    అది కరిగిపోతుంది.
    అప్పుడు భూమిపై నివసించేవారంతా చనిపోయినవారి కొరకు విలపిస్తారు.
ఈజిప్టులో నైలు నదిలా
    భూమి పెల్లుబికి పడుతుంది.
యెహోవా తన పై అంతస్థు గదులు ఆకాశంపై నిర్మించాడు.
    ఆయన తన పరలోకాన్ని భూమికి మీదుగా ఏర్పాటు చేశాడు.
సముద్ర జలాలను ఆయన పిలుస్తాడు.
    పిలిచి, వాటిని వర్షంలా బయట భూమి మీద పారబోస్తాడు.
    ఆయన పేరు యెహోవా.

ఇశ్రాయేలు వినాశనానికి యెహోవా వాగ్దానం

యెహోవా ఇది చెపుతున్నాడు:

“ఇశ్రాయేలూ, మీరు నాకు ఇథియోపియనుల (కూషీయుల) వంటివారు.
    ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు దేశంనుండి బయటకు తీసికొని వచ్చాను.
    ఫిలిష్తీయులనుకూడ నేను కఫ్తోరునుండి బయటకు రప్పించాను.
    మరియు అరామీయులను (సిరియనులను) కీరునుండి బయటకు తీసుకొని వచ్చాను.”

నా ప్రభువైన యెహోవా ఈ పాపపు రాజ్యాన్ని (ఇశ్రాయేలును) గమనిస్తున్నాడు.
యెహోవా ఇది చెప్పాడు:
“ఈ భూమి ఉపరితలంనుండి ఇశ్రాయేలును తొలగిస్తాను.
    కాని యాకోబు వంశాన్ని పూర్తిగా నాశనం చేయను.
ఇశ్రాయేలు రాజ్యాన్ని నాశనం చేయటానికి ఆజ్ఞ ఇస్తున్నాను.
    ఇశ్రాయేలు ప్రజలను ఇతర దేశాలకు చెదర గొడతాను.
కాని అది పిండిని జల్లించువాని రీతిగా ఉంటుంది.
ఒక వ్యక్తి జల్లెడలో పిండిని జల్లిస్తాడు.
    అప్పుడు మెత్తని పిండి క్రిందికి దిగుతుంది. కాని బరక పిండి జల్లెట్లో మిగిలిపోతుంది. యాకోబు వంశం విషయంలోకూడ ఇదేరీతి జరుగుతుంది.

10 “నా ప్రజలలో పాపులైనవారు,
    ‘మాకేమీ కీడు జరుగదు!’ అని అంటారు.
కాని ఆ జనులందరూ కత్తులచే చంపబడతారు!”

రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దేవుడు మాట ఇచ్చుట

11 “దావీదు గుడారం పడిపోయింది.
    కాని నేను దానిని తిరిగి నిలబెడతాను.
గోడల కంతలు పూడ్చుతాను. శిథిలమైన భవనాలను తిరిగి నిర్మిస్తాను.
    దానిని పూర్వమున్నట్లు నిర్మిస్తాను.
12 అప్పుడు ఎదోములో బతికివున్న ప్రజలు,
    మరియు నా పేరుమీద పిలువబడే జనులందరూ సహాయం కొరకు యెహోవావైపు చూస్తారు.”
యెహోవా ఈ మాటలు చెప్పాడు.
    అవి జరిగేలా ఆయన చేస్తాడు.
13 యెహోవా చెపుతున్నాడు: “పంటకోయువాని వెనుక భూమిని దున్నే రోజులు వస్తున్నాయి.
    ద్రాక్షాపండ్లు తెంచేవాని వెనుకనే, పండ్లను తొక్కేవాడు వచ్చే సమయం రాబోతూవుంది.
కొండల నుంచి, పర్వతాల నుంచి
    మధురమైన ద్రాక్షారసం పారుతుంది.
14 నా ప్రజలైన ఇశ్రాయేలీయులను చెరనుండి
    తిరిగి తీసుకు వస్తాను.
వారు శిథిలమైన నగరాలను తిరిగి కడతారు.
    ఆ నగరాలలో వారు మళ్లీ నివసిస్తారు.
వారు ద్రాక్షాతోటలు వేస్తారు.
    ఆ తోటలనుంచి వచ్చిన ద్రాక్షారసాన్ని వారు తాగుతారు.
వారు తోటలను ఏర్పాటు చేస్తారు.
    వారు ఆ తోటలనుండి వచ్చే ఫలాలను తింటారు.
15 నా ప్రజలను తమ దేశంలో మళ్లీ స్థిరపర్చుతాను.
    నేను వారికిచ్చిన దేశాన్నుండి వారు మళ్లీ లాగి వేయబడరు.”
మీ దేవుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ప్రకటన 8

ఏడవ ముద్ర

ఆయన ఏడవ ముద్ర విప్పినప్పుడు పరలోకంలో అరగంటదాకా నిశ్శబ్దంగా ఉండెను. దేవుని ముందు నిలబడి ఉన్న ఆ ఏడుగురు దేవదూతల్ని చూసాను. వాళ్ళకు ఏడు బూరలు యివ్వబడ్డాయి.

బంగారు ధూపార్తి పట్టుకొన్న మరొక దూత వచ్చి ధూప వేదిక ముందు నిలుచున్నాడు. సింహాసనం ముందున్న ధూప వేదికలో ధూపం వేయటానికి అతనికి ఎన్నో ధూపద్రవ్యాలు యివ్వబడ్డాయి. పవిత్రుల ప్రార్థనలతో ధూపం వేయబడింది. దూత వేసిన సుగంధ ధూపము, పవిత్రుల ప్రార్థనలతో పాటు దేవునికి అందింది. దూత ధూపార్తిని తీసుకొని ధూప వేదికలో ఉన్న నిప్పు అందులో ఉంచి దాన్ని భూమ్మీదకు విసిరివేసాడు. దాంతో ఉరుములు, పెద్దగర్జనలు, మెరుపులు, భూకంపాలు కలిగాయి.

ఏడు బూరలు

ఏడు బూరలు పట్టుకొన్న ఆ ఏడుగురు దూతలు ఆ బూరలు ఊదటానికి సిద్ధపడ్డారు.

మొదటి దేవదూత బూర ఊదాడు. వెంటనే రక్తంతో, నిప్పుతో కూడిన వడగండ్లు భూమ్మీదికి విసిరివేయబడ్డాయి. భూమిపైనున్న మూడవ భాగం కాలిపోయింది. మూడవ భాగం చెట్లు కూడా కాలిపోయాయి. పచ్చగడ్డి పూర్తిగా కాలిపోయింది.

రెండవ దేవదూత బూర ఊదాడు. ఒక మండుతున్న పెద్ద పర్వతం లాంటిది సముద్రంలో పారవేయ బడింది. సముద్రంలో మూడవ భాగం రక్తంగా మారిపోయింది. సముద్రంలో ఉన్న ప్రాణులలో మూడవ భాగం చనిపోయాయి. మూడవ భాగం ఓడలు నాశనమయ్యాయి.

10 మూడవ దేవదూత తన బూర ఊదాడు. ఒక పెద్ద నక్షత్రం దివిటీలా మండుతూ ఆకాశం నుండి వచ్చి నదుల మూడవ భాగం మీద, నీటి ఊటల మీద పడింది. 11 ఆ నక్షత్రం పేరు మాచిపత్రి.[a] దానివల్ల మూడవ భాగం నీళ్ళు చేదుగా మారిపోయాయి. చేదుగా మారిన ఆ నీటివల్ల చాలామంది మరణించారు.

12 నాలుగవ దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యునిలో మూడవ భాగము, చంద్రునిలో మూడవ భాగము, నక్షత్రాలలో మూడవ భాగము నాశనమయ్యాయి. తద్వారా అవి చీకటిగా మారిపోయాయి. దాని మూలంగా దినంలో మూడవ భాగం, రాత్రిలో మూడవ భాగం చీకటితో నిండుకుపోయాయి.

13 నేను ఇంకా చూస్తూనే ఉన్నాను. ఇంతలో గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి గొప్ప స్వరంతో, “భూమ్మీద జనులకు శ్రమ! శ్రమ! శ్రమ! ఎందుకనగా ఇంకా ముగ్గురు దేవదూతలు ఊదబోతున్నారు” అని కేకలు వేయటం విన్నాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International