Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 దినవృత్తాంతములు 16-18

16 దేవుని ఒడంబడిక పెట్టెను లేవీయులు తెచ్చి దావీదు దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గుడారంలో వుంచారు. పిమ్మట వారు దేవునికి దహన బలులు, సమాధాన బలులు సమర్పించారు. దావీదు దహన బలులు, సమాధాన బలులు ఇచ్చిన తర్వాత యెహోవా పేరుతో ప్రజలను ఆశీర్వదించాడు. అప్పుడతడు ఒక రొట్టెను, ఖర్జూర పండ్లను, ఎండు ద్రాక్షాపండ్లను ఇశ్రాయేలు స్త్రీ పురుషులందరికీ పంచిపెట్టాడు.

ఆ తరువాత దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు సేవచేయటానికి కొందరు లేవీయులను దావీదు ఎంపిక చేశాడు. వారు ఇశ్రాయేలు దేవుని ఉత్సవాలు చేయటానికి, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించేందుకు, ఆయనకు జయజయ ధ్వనులు చేసేందుకు నియమింపబడ్డారు. వీరిలో మొదటి జట్టు వారికి ఆసాపు పెద్ద. ఆసాపు వర్గం వారు తాళాలు మోగించేవారు. జెకర్యా రెండవ జట్టు వారికి అధిపతి. మిగిలిన లేవీయులు ఎవరనగా ఉజ్జీయేలు, షెమీరామోతు, యెహీయేలు, మత్తిత్యా, ఏలీయాబు, బెనాయా, ఓబేదెదోము మరియు యెహీయేలు. వీరు తీగలు గల వీణ, సితార వాద్యాలను వాయించేవారు. యాజకులైన బెనాయా, యహజీయేలు ఎల్లప్పుడూ దేవుని ఒడంబడిక పెట్టెకు ముందు బూరలు వూదే వారు. అదే సమయంలో దావీదు ప్రథమంగా ఆసాపు, అతని సోదరులు యెహోవాకి ఈ స్తుతిగీతం పాడే పని అప్పజెప్పాడు.

దావీదు కృతజ్ఞతా స్తోత్ర గీతం

యెహోవాను స్తుతించండి ఆయన నామమును ప్రకటించండి.
    యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి.
యెహోవాకి భజన చేయండి! యెహోవాకు స్తుతిగీతాలు పాడండి.
    యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి!
10 యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి;
    యెహోవా సహాయం కోరిన వారందరూ సుఖసంతోషాలు పొందెదరు గాక!
11 యెహోవాను శరణు కోరండి; ఆయన బలాన్ని ఆశ్రయించండి.
    ఆయన సన్నిధిని నిత్యం వెదకండి.
12 యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘనకార్యాలను మననం చేసుకోండి.
13 యెహోవా సేవకులగు ఇశ్రాయేలు బిడ్డలారా,
    యాకోబు సంతతి వారలారా మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు.
14 యెహోవాయే మన దేవుడు
    ఆయన శక్తి ప్రతి స్థలములో వ్యాపించి వున్నది!
15 తన ఒడంబడికను ఆయన జ్ఞాపకముంచుకుంటాడు.
    ఆయన మాట వేయితరాల పంట!
16 అది అబ్రాహాముతో యెహోవా చేసుకొన్న ఒడంబడిక.
    అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం
17 యాకోబుకు యెహోవా దానిని శాసనంగా చేశాడు.
    అది ఇశ్రాయేలుకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక.
18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను.
    వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!”
    అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు.
19 దేవుని ప్రజలు అప్పుడు కొద్దిమంది మాత్రమే.
    వారు ఆ రాజ్యంలో పరాయి వారు.
20 వారు ఒక దేశాన్నుండి మరో దేశానికి వెళ్లారు.
    వారు ఒక రాజ్యం నుండి మరో రాజ్యానికి తరలిపోయారు.
21 కాని ఎవ్వరూ వారికి హాని కలుగజేయకుండా యెహోవా కాపాడాడు.
    యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు.
22 “నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు;
    నా ప్రవక్తలకు హాని కలుగు జేయవద్దు!”
    అని యెహోవా రాజులకు చెప్పియున్నాడు.
23 భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి!
    యెహోవా మనలను కాపాడుతున్న సువార్తను ప్రతినిత్యం చాటండి!
24 యెహోవా మహిమను అన్ని దేశాలలోను చాటండి.
    దేవుని అద్భుత కార్యాలను గురించి ప్రజలందరికి తెలియ జెప్పండి!
25 యెహోవా గొప్ప మహిమాన్వితుడు; ఆయనను మిక్కిలిగా సన్నుతించండి
    అన్య దేవతల కన్న యెహోవా ఘనంగా ఆరాధించబడాలి.
26 ఎందువల్లననగా మిగిలిన ప్రజలందరి దేవుళ్లు విగ్రహాలే!
    కాని యెహోవా ఈ విశాల ఆకాశాన్ని కలుగజేశాడు.
27 యెహోవా మహిమయు, ఘనతయు కల్గినవాడు.
    యెహోవా మిక్కిలి ప్రకాశమానంగా వెలుగొందే జ్యోతివంటి వాడు!
28 పలు వంశీకులారా, సర్వ ప్రజలారా, యెహోవా మహిమను, శక్తిని పొగడండి!
29 యెహోవా మహిమను కొనియాడండి ఆయన నామాన్ని ఘనపర్చండి!
    మీ అర్పణలను యెహోవా సన్నిధికి తీసుకొని రండి
    యెహోవాను, అతిశయించిన ఆయన పవిత్ర సౌందర్యాన్ని ఆరాధించండి!
30 భూలోక ప్రజలారా, యెహోవా ముందు గజగజ వణకండి.
    కాని ఆయన ఈ భూమిని బలంగా నిర్మించాడు; అది కదల్చబడదు.
31 భూలోకం, పరలోకాలు సంతోషంగా వుండును గాక!
    “యెహోవా పరిపాలిస్తున్నాడు” అని ప్రజలు ప్రతిచోట చెప్పుకొందురు గాక!
32 సముద్రము, దానిలోని ప్రతిదీ ఘోషించుగాక!
    పొలాలు, వాటిలోనివన్నీ తమ సంతోషాన్ని వెలిబుచ్చుగాక!
33 అడవిలోని చెట్లన్నీ యెహోవాముందు ఉల్లాసంగా పాడుతాయి!
    ఎందువల్లననగా యెహోవా వస్తున్నాడు గనుక. ఆయన ప్రపంచానికి తీర్పు ఇవ్వటానికి వస్తున్నాడు.
34 ఆహా, యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించు. ఆయన మంచివాడు!
    యెహోవా ప్రేమ నిరంతరం కొనసాగుతుంది.
35 “మా సంరక్షకుడవగు ఓ దేవా!
    మమ్ములను రక్షింపుము!
మమ్ములను ఒక దగ్గరికి చేర్చి
    మమ్మల్ని పరాయి రాజ్యాల నుండి కాపాడుము.
అప్పుడు నీ పవిత్ర నామాన్ని మనసార స్తుతించుకోగలుగుతాము.
    మేము నీకు స్తుతిగీతాలు పాడగలుగుతాము!” అని యెహోవాకు విన్నవించండి.
36 ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు
    సర్వకాల సర్వావస్థలయందు జయమగు గాక!

అప్పుడు ప్రజలంతా “ఆమేన్” అన్నారు! యెహోవాను స్తుతించారు!

37 పిమ్మట ఆసాపును, అతని సోదరులను దావీదు ఒడంబడిక పెట్టె ముందు ఉంచాడు. నిత్యం దాని ముందు సేవ చేయటానికి దావీదు వారిని అక్కడ నియమించాడు. 38 ఓబేదెదోమును, మరి అరువది ఎనిమిది మంది లేవీయులను కూడ ఆసాపుతోను, అతని సోదరులతోను కలిసి సేవచేయటానికి దావీదు నియమించాడు. ఓబేదెదోము, హోసా ద్వార పాలకులు. ఓబేదెదోము తెడ్రి పేరు యెదూతూను.

39 యాజకుడైన సాదోకును, గిబియోనులో ఉన్నత స్థలంలో అతనితో కలిసి దేవుని గుడారంలో సేవ చేసిన ఇతర యాజకులను కూడా దావీదు అక్కడ నియమించాడు. 40 దహన బలిపీఠం మీద ప్రతిరోజు ఉదయం, సాయంత్రం సాదోకు, ఇతర యాజకులు దహన బలులు సమర్పించారు. యెహోవా ఇశ్రాయేలుకిచ్చిన ధర్మశాస్త్ర నియమాలకు అనుగుణంగా వారాపని చేశారు. 41 హేమాను, యెదూతూను, ఇతర యాజకులు పేరు పేరునా ఎంపిక చేయబడి యెహోవాకు స్తుతిగీతాలు పాడటానికి నియమింపబడ్డారు. ఎందువల్లననగా దేవుని ప్రేమ నిరంతరం కొనసాగుతుంది గనుక. 42 హేమాను, యెదూతూను వారితో వుండి బాకాలు వూదుతూ, తాళాలు వాయించారు. దేవునిపై భక్తిగీతాలు పాడేటప్పుడు వారు ఇతర వాద్య విశేషాలను కూడ వాయించేవారు. యెదూతూను కుమారుడు ద్వారాల వద్ద కాపలాకై నియమింపబడ్డాడు.

43 పిమ్మట అందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయారు. దావీదు కూడ తన కుటుంబం వారిని ఆశీర్వదించటానికి ఇంటికి వెళ్లాడు.

దావీదుకు దేవుని వాగ్దానం

17 దావీదు తన కొత్త ఇంట్లో ప్రవేశించాక యాజకుడైన నాతానును పిలిచి ఇలా అన్నాడు: “చూడండి, నేను దేవదారు కలపతో నిర్మించిన ఇంటిలో వుంటున్నాను. కాని దేవుని ఒడంబడిక పెట్టె మాత్రం గుడారంలోనే వుంది! నేను దేవునికి ఒక ఆలయం నిర్మింపదలిచాను.”

“నీవు ఏది చేయదలచుకొంటే అది చేయవచ్చు. దేవుడు నీకు తోడై వున్నాడు” అని నాతాను దావీదుకు సమాధానమిచ్చాడు.

కాని ఆ రోజు రాత్రి దేవుని వాక్కు నాతానుకు వినిపించింది. యెహోవా ఇలా అన్నాడు:

“నీవు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఈ విషయాలు చెప్పు: యెహోవా ఇలా అంటున్నాడు: ‘దావీదూ, నేను నివసించటానికి ఆలయం కట్టించేది నీవు కాదు. 5-6 ఇశ్రాయేలీయులను నేను ఈజిప్టు నుండి బయటికి తీసుకొని వచ్చినప్పటి నుండి ఈనాటి వరకు నేను ఒక ఆలయంలో నివసించలేదు. ఇక్కడికీ, అక్కడికీ నేను గుడారంలో వుండి కదలి వెళ్తూనే వున్నాను. ఇశ్రాయేలు ప్రజలకు ప్రత్యేక నాయకులను నేను ఎంపిక చేస్తూ వచ్చాను. ఆ నాయకులు నా ప్రజలకు గొర్రెల కాపరులవలె వున్నారు. ఇశ్రాయేలులో నేను ఒక చోటినుండి మరియొక చోటికి వెళ్లెటప్పుడు ఆ నాయకులెవ్వరితోనూ, “మీరు నాకు దేవదారు కలపతో ఒక ఆలయాన్ని ఎందుకు కట్టలేదు?” అని నేను అనలేదు.’

“కనుక, ఇప్పుడు ఈ విషయాలు నా సేవకుడైన దావీదుకు చెప్పుము: సర్వశక్తిమంతుడగు యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘పొలాల్లో గొర్రెల మందలను కాస్తున్న నిన్ను నేను తీసుకొన్నాను. నా ప్రజలకు నిన్ను రాజుగా చేశాను. నీవు వెళ్లిన ప్రతిచోటా నేను నీతో వున్నాను. నీకు ముందుగా నేను నడిచాను. నీ శత్రువులను సంహరించాను. నిన్ను ఇప్పుడు ఈ భూమిమీద మిక్కిలి ప్రముఖ వ్యక్తిగా చేసాను. ఈ ప్రదేశాన్ని నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్నాను. వారు తమ మొక్కలను నాటుతారు. వారి చెట్లక్రింద వారు ప్రశాంతంగా కూర్చుంటారు. ఇక ఏ మాత్రం వారు అవస్థపడవలసిన అవసరం లేదు. దుష్టులెవ్వరూ ఇకమీదట పూర్వంవలె వారిని బాధించరు. 10 ప్రమాదాలు సంభవించినందువల్లనే నా ప్రజలైన ఇశ్రాయేలీయుల సంరక్షణకై నేను నాయకులను ఎంపిక చేశాను. నేనింకా నీ శత్రువులను ఓడిస్తాను.

“‘యెహోవా నీకు ఒక నివాసం ఏర్పాటు చేయునని నేను నీకు చెప్పుచున్నాను.[a] 11 నీవు చనిపోయి నీ పూర్వీకులను చేరినప్పుడు నీ సంతానాన్ని నూతన రాజుగా చేస్తాను. కొత్త రాజు నీ కుమారులలో ఒకడవుతాడు. అతని రాజ్యాన్ని నేను బలపర్చుతాను. 12 నీ కుమారుడు నాకొక ఆలయం కట్టిస్తాడు. నీ కుమారుని సంతానం సదా పరిపాలించేలా నేను చేస్తాను. 13 నేను అతనికి తండ్రిలా వుంటాను. అతను నాకు బిడ్డలా వుంటాడు. నీకు ముందు సౌలు రాజుగా వున్నాడు. సౌలుకు నా మద్దతును ఉపసంహరించుకున్నాను. కాని నీ కుమారుని మాత్రం నేను సదా ప్రేమిస్తాను 14 ఎప్పటికీ అతని అధీనంలో నా ఆలయాన్ని, ఈ రాజ్యాన్ని వుంచుతాను. అతని పాలన శాశ్వతంగా కొనసాగుతుంది!’”

15 తనకు కల్గిన దైవ దర్శనాన్ని గురించి, దేవుడు చెప్పిన విషయాలన్నిటి గురించి దావీదుకు నాతాను వివరింగా చెప్పాడు.

దావీదు ప్రార్థన

16 అది విన్న రాజైన దావీదు పవిత్ర గుడారంలోకి వెళ్లి యెహోవా ముందు కూర్చున్నాడు. దావీదు ఇలా ప్రార్థన చేశాడు:

“యెహోవా దేవా, నీవు నాకు, నా కుటుంబానికి ఎంతో మేలు చేశావు! కారణం మాత్రం నాకు తెలియదు. 17 వాటన్నిటికీ మించి, భవిష్యత్తులో నా కుటుంబానికి ఏమి జరుగుతుందో కూడ నీవు నాకు తెలియపర్చావు. నన్నొక ముఖ్యమైన వ్యక్తిగా నీవు పరిగణించావు! 18 నేను ఇంతకంటే ఏమి చెప్పగలను? నీవు నాకు ఎంతో చేసావు! కేవలం నేను నీ సేవకుడను. అది నీకు తెలుసు! 19 యెహోవా, ఈ అద్భుత క్రియ నీవు నాపట్ల జరిపించావు. నీవు సంకల్పించావు గనుక నీవది చేసావు! 20 నీవంటి దేవుడు మరొక్కడు లేడు ప్రభూ! నీవు తప్ప వేరొక దేవుడు లేడు! ఈ విధంగా మరేదైవం అద్భుత కార్యాలు జరిపించినట్లు మేము వినలేదు! 21 ఇశ్రాయేలు వంటి మరో దేశం వున్నదా? లేదు! ఈ అద్భుతకార్యాలు నీవు జరిపించిన దేశం భూమి మీద ఇశ్రాయేలు ఒక్కటే. నీవు మమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు తీసుకొని వచ్చి మాకు స్వేచ్ఛ కలుగజేశావు. ఆ విధంగా నీ ఘనతను చాటావు! నీ ప్రజలకు ముందుగా నీవు నడిచి అన్యులు మా కొరకు వారి రాజ్యాన్ని విడిచి పోయేలా చేశావు! 22 ఇశ్రాయేలును నీవు స్వీకరించి శాశ్వతంగా వారిని నీ ప్రజలుగా చేసుకొన్నావు. ప్రభువా, నీవు వారికి దేవుడవై యున్నావు!

23 “యెహోవా నాకు, నా కుటుంబానికి నీవు ఈ వాగ్దానం చేశావు. సదా నీ మాట నిలబెట్టుకో. దేవా! నీవు చేస్తానని చెప్పినదంతా జరిగేలా చెయ్యి! 24 నీవు నమ్మతగిన వాడవని నిరూపించు తండ్రీ! ప్రజలు నీ పేరును ఎల్లప్పుడూ గౌరవించుదురుగాక! అప్పుడు ‘సర్వశక్తుడగు యెహోవా ఇశ్రాయేలు దైవమని’ ప్రజలు అంటారు! నేను నీ సేవకుడను! దయచేసి నా కుటుంబాన్ని బలపర్చి, నీ సన్నిధిలో వర్థిల్లేలా చేయి.

25 “నా దేవా, నీవు నాకొక నివాసం ఏర్పాటు చేస్తాను అని అన్నావు. అందుచే నీ సేవకుడనైన నేను మనోధైర్యము కలిగివున్నాను. అందుచే నేను నిన్ను ఈ సంగతులను చేయమని అడుగుతున్నాను. 26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు. 27 యెహోవా, నా కుటుంబాన్ని దీవించటంలో నీవు చాలా ఉదారంగా వ్యవహరించావు! నీ సన్నిధిలో నా కుటుంబం సదా మెలగుతుందని నీవు అన్నావు. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించావు. యెహోవా, నా కుటుంబం ఎల్లవేళలా నీ ఆశీర్వాదం పొందుతుంది.”

దావీదు వివిధ రాజ్యాలను జయించుట

18 తరువాత దావీదు ఫిలిష్తీయులపైకి దండెత్తి వారిని ఓడించాడు. ఫిలిష్తీయులనుండి గాతు నగరాన్ని, దాని చుట్టు ప్రక్కలనున్న పట్టణాలను వశపర్చుకున్నాడు.

పిమ్మట దావీదు మోయాబు దేశాన్ని ఓడించాడు. మోయాబీయులు దావీదుకు దాసులయ్యారు. వారు బంగారం, ఇతర కానుకలను దావీదుకు కప్పంగా చెల్లించారు.

హదదెజెరు సైన్యంతో కూడ దావీదు యుద్ధం చేశాడు. సోబా రాజు హదదెజెరు. ఆ సైన్యంలో దావీదు హమాతు పట్టణం వరకు యుద్ధం నిర్వహించాడు. దావీదు అలా ఎందుకు యుద్ధం చేశాడనగా హదదెజెరు తన సామ్రాజ్యాన్ని యూఫ్రటీసు నదివరకు విస్తరింపచేయటానికి ప్రయత్నించాడు. హదదెజెరుకు చెందిన వెయ్యి రథాలను, ఏడువేల రథసారధులను, ఇరవైవేల మంది కాల్బలాన్ని దావీదు వశపర్చుకున్నాడు. హదదెజెరుకు చెందిన రథాల గుర్రాలలో చాలా వాటి కాళ్లను దావీదు విరుగగొట్టాడు. కాని వందరథాలను లాగటానికి కావలసినన్ని మంచి గుర్రాలను మాత్రం దావీదు రక్షించాడు.

దమస్కు నగరంలోని అరామీయులు (సిరియనులు) హదదెజెరుకు సహాయపడే నిమిత్తం వచ్చారు. హదదెజెరు సోబాకు రాజు. కాని దావీదు వారిని ఓడించి ఇరవై రెండు వేల సిరియను సైనికులను చంపివేశాడు. తరువాత దావీదు అరాము దేశంలోగల దమస్కు నగరంలో తన సైనిక స్థావరాలు నెలకొల్పాడు. అరామీయులు దావీదుకు సేవకులై కప్పం చెల్లించారు. ఆ విధంగా దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయాన్ని చేకూర్చాడు.

హదదెజెరు సైన్యాధికారుల నుండి బంగారు డాళ్లను దావీదు తీసుకొని యెరూషలేముకు తెచ్చాడు. తెబహు (టిబ్హతు), కూను పట్టణాల నుండి దావీదు చాలా కంచును పట్టుకువచ్చాడు. ఈ పట్టణాలు హదదెజెరుకు చెందినవి. తరువాత కాలంలో లోహాన్నే సొలొమోను ఆలయానికి, కంచు సముద్రం, కంచు స్తంభాలు, ఇతర వస్తు సామగ్రి చేయటానికి వినియోగించాడు.

హమాతు రాజు పేరు తోహూ. సోబారాజు పేరు హదదెజెరు. హదదెజెరు సైన్యాన్నంతా దావీదు ఓడించాడని తోహూ విన్నాడు. 10 తోహూ తన కుమారుడైన హదోరమును రాజైన దావీదు వద్దకు తాను శాంతి కోరుతున్నట్లు, తనను దీవించమని అడగటానికి పంపాడు. హదదెజెరుతో దావీదు యుద్ధం చేసి అతనిని ఓడించిన సందర్భంగా తోహూ ఇది చేసాడు. ఇంతకు ముందు తోహూ కూడ హదదెజెరుతో యుద్ధం చేసియున్నాడు. హదోరము తనతో వెండి, బంగారం, కంచు లోహాలతో చేసిన రకరకాల వస్తువులు దావీదుకు కానుకలుగా తీసుకొని వెళ్లి ఇచ్చాడు. 11 రాజైన దావీదు ఆ వస్తువులన్నిటినీ పవిత్రపరచి యెహోవాకు సమర్పించాడు. పైగా ఎదోము, మోయాబుల నుండి, అమ్మోనీయుల నుండి, ఫిలిష్తీయులనుండి, అమాలేకీయుల నుండి తెచ్చిన వెండి బంగారాలను కూడ దావీదు యెహోవాకి సమర్పించాడు.

12 సెరూయా కుమారుడైన అబీషై “ఉప్పులోయ” అని పిలవబడే స్థలంలో పద్దెనిమిదివేల ఎదోమీయులను చంపివేసాడు. 13 ఎదోములో అబీషై సైనిక స్థావరాలు కూడ ఏర్పాటు చేసాడు. ఎదోమీయులంతా దావీదుకు సేవకులయ్యారు. దావీదు ఎక్కడికి వెళితే అక్కడ యెహోవా అతనికి విజయం చేకూర్చి పెట్టాడు.

దావీదు ముఖ్య అధికారులు

14 ఇశ్రాయేలంతటికీ దావీదు రాజు. ప్రతి పౌరునికీ ఏది మంచిదో, న్యాయమైనదో దావీదు వారికి అది చేశాడు. 15 సెరూయా కుమారుడు యోవాబు దావీదు సైన్యానికి అధిపతి. అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దావీదు చేసిన విషయాలన్నీ గ్రంథ రూపంలో రాశాడు. 16 సాదోకు, అబీమెలెకు యాజకులు. సాదోకు తండ్రి పేరు అహీటూబు. అబీమెలెకు తండ్రి అబ్యాతారు. షవ్షా లేఖకుడు. 17 కెరేతీయులకు, పెలేతీయులకు (రాజు అంగరక్షకులు) నాయకుడుగా బెనాయా నియమితుడయ్యాడు. బెనాయా తండ్రి పేరు యెహోయాదా. దావీదు కుమారులు ముఖ్యవ్యక్తులై దావీదు రాజుకు సహాయకులుగా వున్నారు.

యోహాను 7:28-53

28 అప్పుడు యేసు మందిరంలో ఇంకను మాట్లాడుతూ ఉండినాడు. ఆయన బిగ్గరగా, “ఔను! నేనెవరినో మీకు తెలుసు. నేను స్వతహాగా యిక్కడికి రాలేదు నన్ను పంపించినవాడు సత్యవంతుడు. ఆయనెవరో మీకు తెలియదు. 29 కాని ఆయన నన్ను పంపాడు కాబట్టి ఆయన దగ్గర నుండి నేను యిక్కడికీ వచ్చాను. కాబట్టి ఆయనెవరో నాకు తెలుసు” అని అన్నాడు.

30 ఇది విని వాళ్ళు ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. కాని ఆయన సమయం యింకా రాలేదు కనుక ఆయన మీద ఎవ్వరూ చేయి వేయలేదు. 31 అక్కడున్న వాళ్ళలో చాలా మంది ఆయన్ని విశ్వసించారు. వాళ్ళు, “క్రీస్తు వచ్చినప్పుడు ఈయన కన్నా గొప్ప అద్భుతాలు చేస్తాడా?” అని అన్నారు.

యూదా నాయకులు యేసును బంధించుటకు ప్రయత్నించటం

32 ప్రజలు ఆయన్ని గురించి యిలా మాట్లాడు కోవటం పరిసయ్యులు విన్నారు. వాళ్ళు, ప్రధాన యాజకులు కలిసి ఆయన్ని బంధించటానికి భటుల్ని పంపారు. 33 కనుక యేసు ప్రజలతో, “నేను మీతో కొద్దికాలమే ఉంటాను. ఆ తర్వాత నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తాను. 34 నా కోసం మీరు వెతుకుతారు. కాని నన్ను కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు” అని అన్నాడు.

35 యూదులు తమలో తాము, “మనం కనుక్కోకుండా ఉండేటట్లు ఇతడు ఎక్కడికి వెళ్ళదలిచాడు? గ్రీకుల మధ్య నివసిస్తున్న మనవాళ్ళ దగ్గరకు వెళ్ళి గ్రీకులకు బోధిస్తాడా? 36 ‘నా కోసం వెతుకుతారు, కాని కనుక్కోలేరు. నేనున్న చోటికి మీరు రాలేరు’ అని అతడు అనటంలో అర్థమేమిటి?” అని మాట్లాడుకున్నారు.

యేసు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడటం

37 పండుగ చివరి రోజు చాలా ముఖ్యమైనది. ఆ రోజు యేసు నిలుచుని పెద్ద గొంతుతో, “దాహం వేసినవాడు నా దగ్గరకు రావచ్చు. వచ్చి తన దాహం తీర్చుకోవచ్చు. 38 లేఖనాలు చెప్పినట్లు, నన్ను నమ్మిన వాని లోపలి నుండి జీవపు ఊటలు ప్రవహిస్తాయి” అని అన్నాడు. 39 అంటే, తనను నమ్మిన వాళ్ళకు ముందుగా లభించబోయే ఆత్మను గురించి ఈ మాటలు చెప్పాడు. ఆయన మహిమ పర్చబడలేదు. కనుక దేవుడు యింత వరకు ఆత్మను ఎవ్వరికీ యివ్వలేదు.

ప్రజలు యేసును గురించి వాదించటం

40 ఆయన మాటలు విన్నాక కొందరు, “ఈయన తప్పక ప్రవక్త అయివుండాలి” అని అన్నారు.

41 మరికొందరు, “ఈయన క్రీస్తు అయ్యి ఉండాలి” అని అన్నారు.

కాని యితర్లు, “క్రీస్తు గలిలయనుండి ఎట్లావస్తాడు? 42 ఆయన దావీడు వంశంనుండి, దావీదు నివసించిన బేత్లెహేమునుండి వస్తాడని లెఖానాల్లో వ్రాసారు కదా!” అని అన్నారు. 43 యేసును బట్టి అక్కడున్న ప్రజలలో భేధాభిప్రాయం కలిగింది. 44 కనుక ఆయన్ని బంధించాలనుకున్నారు. కాని ఎవ్వరూ ఆయన పై చెయ్యి వెయ్యలేదు.

యూదుల నాయకులు విశ్వసించకపోవటం

45 చివరకు భటులు ప్రధానయాజకుల దగ్గరకు, పరిసయ్యుల దగ్గరకు తిరిగి వెళ్ళిపొయ్యారు. వాళ్ళు ఆ భటుల్ని, “అతణ్ణెందుకు పిలుచుకొని రాలేదు?” అని అడిగారు.

46 వాళ్ళు, “అతడు మాట్లాడినట్లు ఇంత వరకు ఎవ్వరూ మాట్లాడలేదు!” అని అన్నారు.

47 పరిసయ్యులు, “అంటే! మిమ్మల్ని కూడా అతడు మోసం చేసాడా? 48 పాలకుల్లో కాని, పరిసయ్యుల్లో కాని అతణ్ణి నమ్మిన వాళ్ళెవ్వరూ లేరు. 49 ధర్మశాస్త్రాన్ని గురించి ఏమీ తెలియని ఆ ప్రజల మీద దేవుని శాపం ఉందన్నట్లే!” అని అన్నారు.

50 నీకొదేము వాళ్ళలో ఒకడు. ఇతడు ఇదివరలో యేసు దగ్గరకు వెళ్ళి వచ్చాడు. 51 అతడు, “మన ధర్మశాస్త్రం విచారణ చేయకుండా, అతని వాదన వినకుండా, అతడు చేసింది తేలుసుకోకుండా శిక్షవిధిస్తుందా?” అని అడిగాడు.

52 వాళ్ళు, “నీవు కూడా గలిలయవాడవా? ధర్మశాస్త్రాన్ని చదువు. ప్రవక్త గలిలయనుండి రాడని నీకే తెలుస్తుంది” అని సమాధానం చెప్పారు.

వ్యభిచరించిన స్త్రీ

53 [a] ఆ తర్వాత అందరూ తమ తమ ఇళ్ళకు వెళ్ళి పొయ్యారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International