Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
2 రాజులు 10-12

షోమ్రోను నాయకులకు యెహూ ఉత్తరాలు వ్రాయుట

10 షోమ్రోనులో అహాబుకి డెబ్భైమంది కుమారులుండిరి. యెహూ ఉత్తరాలు రాసి యెజ్రెయేలు రాజులకు నాయకులకు వాటిని షోమ్రోనుకు పంపాడు. అహాబు కుమారులను పెంచిన ప్రజలకు కూడా ఆ ఉత్తరాలు అతడు పంపాడు. ఆ ఉత్తరాలలో యెహూ ఇట్లు చెప్పాడు: 2-3 “మీకీ ఉత్తరం చేరగానే, మీ తండ్రి కుమారులలో సర్వశ్రేష్టుడైన వానిని ఎన్నుకోండి. మీకు రథాలు గుర్రాలు వున్నాయి. మీరు బలిష్టమైన నగరంలో ఉంటున్నారు. మీకు ఆయుధాలు కూడా వున్నాయి. మీరెన్నుకున్న అతని కుమారుని తండ్రి సింహాసనం మీద కుర్చోబెట్టండి. తర్వాత మీ తండ్రి వంశం కోసం పోరాడండి.”

కాని యెజ్రెయేలు పరిపాలకులు, నాయకులు చాలా భయపడిపోయారు. “ఆ రాజులిద్దరు (యెహోరాము మరియు అహజ్యా) యెహూని ఆపలేక పోయారు. కనుక మనము కూడా అతనిని ఆపలేము” అని వారు అనుకున్నారు.

అహాబు గృహ సంరక్షకుడు, నగరాన్ని అదుపులో ఉంచిన వాడు, అహాబు పిల్లలను పెంచిన పెద్దలు ప్రజలు యెహూకి ఒక సందేశం పంపారు. “మేము మీ సేవకులం. మీరేమి చెపితే మేమది చేస్తాము. మేమెవరిని రాజుగా చేసుకోవాలి. మీకు ఏది మంచిదిగా తోస్తే అది మాకు చెయ్యండి” అని తెలియజేసారు.

షోమ్రోను నాయకులు అహాబు పిల్లలను చంపుట

తర్వాత యెహూ రెండవ ఉత్తరం ఆ నాయకులకు రాశాడు. “మీరు కనుక నన్ను సమర్థిస్తే నా మాట పాటిస్తే, ఇప్పుడు అహాబు కుమారుల తలలు నరికి వేయండి. రేపు ఈపాటికి వాటిని యెజ్రెయేలులో నా వద్దకు తీసుకురండి” అని యెహూ చెప్పాడు.

అహాబుకి డెబ్భైమంది కుమారులు. వారు తమను పెంచిన నగర నాయకులతో ఉన్నారు. ఈ లేఖను నగర నాయకులు అందుకోగానే, వారు రాజ కుమారులు డెబ్భైమందిని తీసుకొని వెళ్లి చంపివేశారు. తర్వాత నాయకులు రాజ కుమారుల తలలను బుట్టలలో వేసి యెజ్రెయేలులోని యెహూకి ఆ బుట్టలు పంపారు. దూత యెహూని సమీపించి అతనికిది చెప్పాడు: “వాళ్లు రాజకుమారుల తలలు తెచ్చారు!”

తర్వాత యెహూ, “నగర ద్వారం వద్ద ఉదయం వరకు రెండు వరసలలో ఆ తలలు ఉంచండి” అని చెప్పాడు.

ఉదయాన, యెహూ వెలుపలికి వెళ్లి, ప్రజల యెదుట నిలచి వారితో ఇలా అన్నాడు: “మీరు అమాయకులు. చూడండి. నేను నా యజమానికి విరుద్ధంగా పథకాలు వేశాను. నేనతనిని చంపాను. కాని ఆహాబు పిల్లలందరినీ ఎవరు చంపారు? మీరే చంపారు. 10 యెహోవా చెప్పినదంతా జరుగుతుందని మీరు గ్రహించాలి. మరియు యెహోవా అహాబు వంశానికి సంబంధించిన యీ విషయాలు చెప్పేందుకు ఏలీయాని ఉపయెగించాడు. యెహోవా తాను చేస్తానన్న పనులు చేశాడు.”

11 అందువల్ల యెహూ యెజ్రెయేలులో నివసించే అహాబు వంశీయులనందరినీ చంపివేశాడు. యెహూ ముఖ్యులందరినీ, సన్నిహిత మిత్రుల్ని, యాజకులను చంపివేశాడు. అహాబు వంశంలోని వారు ఎవ్వరూ మిగలలేదు.

యెహూ అహజ్యా బంధువులను చంపుట

12 యెహూ యెజ్రెయేలు విడిచి షోమ్రోనుకు వెళ్లాడు. త్రోవలో యెహూ గొర్రెల కాపరులు శిబిరం అనేచోట ఆగాడు. ఆ చోట గొర్రెల కాపరులు గొర్రెల మీద ఉన్నిని కత్తిరిస్తున్నారు. 13 యూదా రాజయిన అహజ్యా యొక్క బంధువులను యెహూ కలుసుకున్నాడు. “ఎవరు మీరు?” అని యెహూ ప్రశ్నించాడు.

వారు, “మేము యూదా రాజయిన అహజ్యా బంధువులము. రాజకుమారులను రాణిగారి పిల్లలను చూసి వెళ్లుదామని వచ్చాము” అని సమాధానం చెప్పారు.

14 తర్వాత యెహూ, “వారిని సజీవులుగా తీసుకువెళ్లండి” అని తన మనుష్యులకు చెప్పాడు.

యెహూ మనుష్యులు అహజ్యా బంధువులను సజీవులుగా పట్టుకున్నారు. వారు నలభై రెండు మంది. బేతెకెదు బావి వద్ద యెహూ వారిని చంపివేశాడు. యెహూ ఒక్కరిని కూడా ప్రాణాలతో వుండనివ్వలేదు.

యెహూ యెహోనాదాబును కలుసుకొనుట

15 అక్కడినుంచి యెహూ వెళ్లిన తర్వాత, అతను రేకాబు కుమారుడైన యెహోనాదాబును కలుసుకున్నాడు. యెహూని కలుసుకోవాలని యెహోనాదాబు వెళ్లుచున్నాడు. యెహూ యెహోనాదాబును అభినందించి, “నేను నీకు నమ్మకస్థుడనైన స్నేహితునివలె, నీవు నాకు నమ్మకస్థుడనైన స్నేహితుడవేనా?” అని అడిగాడు.

“నేను నీకు నమ్మకస్థుడైన స్నేహితుడినే” అని యెహోనాదాబు బదులు చెప్పాడు.

“అలా అయితే, నీ చేయి నాకిమ్ము” అని యెహూ చెప్పాడు.

తర్వాత యెహూ యెహోనాదాబును లాగి తన రథంలోకి ఎక్కించుకున్నాడు.

16 “నాతోపాటురా. యెహోవాపట్ల నా భావాలు ఎంత దృఢంగా ఉన్నాయో చూడవచ్చు” అని యెహూ చెప్పాడు.

అందువల్ల యెహోనాదాబు యెహూ రథంలో వెళ్లాడు. 17 యెహూ షోమ్రోనుకి వచ్చి, అక్కడ ఇంకా సజీవులై వున్న అహాబు వంశీయులందరిని హతమార్చాడు. యెహూవా ఏలీయాతో చెప్పినట్లుగా, యెహూ అన్ని పనులు చేసాడు.

యెహూ బయలును పూజించే వారిని పిలుచుట

18 తర్వాత యెహూ ప్రజలందరినీ సమీకరించాడు. వారితో యెహూ, “అహాబు కొద్దిగా బయలు దేవుని సేవించాడు. కాని యెహూ అనే నేను బయలు దేవునికి ఎక్కువ సేవ చేస్తాను. 19 ఇప్పుడు బయలు దేవుని ప్రవక్తలను యాజకులను అందరినీ పిలవండి. బయలు దేవుని పూజించేవారినందరినీ పిలవండి. ఈ సమావేశానికి అందురూ హాజరు అయ్యేలా చూడండి. బయలు దేవునికి నేనొక గొప్పబలి సమర్పించాలి. ఈ సమావేశానికి రానివారిని నేను చంపుతాను” అని చెప్పాడు.

కాని యెహూ వారిపట్ల కుయుక్తి పన్నాడు. బయలు ఆరాధకులను యెహూ నాశనం చేయదలచాడు. 20 “బయలుకు ఒక పవిత్ర సమావేశం ఏర్పాటు చేయండి” అని యెహూ చెప్పాడు. మరియు యాజకులు సమావేశం ప్రకటించారు. 21 తర్వాత యెహూ ఇశ్రాయేలు దేశమంతటా ఒక సందేశం పంపాడు. బయలు ఆరాధకులందరూ వచ్చారు. ఎవ్వరూ ఇంట్లో వుండలేదు. బయలు దేవుని మందిరంలో బయలు ఆరాధకుందరూ వచ్చారు. మందిరం ప్రజలతో నిండిపోయింది.

22 దుస్తులు దగ్గర ఉంచబడిన వ్యక్తితో యెహూ ఇట్లనెను. “బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకురండి” అని చెప్పగా ఆ వ్యక్తి బయలు ఆరాధకులందరికి దుస్తులు తీసుకు వచ్చాడు.

23 తర్వాత యెహూ, రేకాబు కుమారుడైన యెహూనాదాబు బయలు మందిరంలోనికి పోయారు. బయలు ఆరాధకులను ఉద్దేశించి, “మీ చుట్టు ప్రక్కల చూడండి. మీతో యెహోవా యొక్క సేవకులెవరూ లేరని చూసుకోండి. బయలు ఆరాధకులు మాత్రమే ఇక్కడున్నారని నిర్ధారణ చేసుకోండి” అని యెహూ చెప్పాడు. 24 బయలు ఆరాధకులు గుడిలోకి వెళ్లారు; బలులు మరియు దహన బలులు అర్పించాలనుకున్నారు.

కాని వెలుపల, యెహూ ఎనభై మందితో వేచియున్నాడు. “ఎవ్వరూ తప్పించుకోకుండా చూడండి. ఎవరైనా ఒక్కనినైనా తప్పించినట్లయితే, ఆ వ్యక్తి తన ప్రాణమునే ఫలితంగా పెట్టవలసి వస్తుంది” అని యెహూ చెప్పాడు.

25 త్వరగా యెహూ తన దహన బలుల అర్పణ పూర్తి చేయగా, అతను కాపలాదారులకు, అధిపతులకు ఇలా చెప్పాడు. “లోపలికి వెళ్లి, బయలు ఆరాధకులను చంపండి. ఆలయంలోనుండి ఎవ్వరూ సజీవంగా బయటికి రాకుండా చూడండి” అని చెప్పాడు.

అందువల్ల అధిపతులు ఖడ్గాలు ప్రయోగించి బయలు ఆరాధకులను చంపివేశారు. ఆ తర్వాత కాపలా దార్లు, అధిపతులు బయలు ఆరాధకుల శరీరాలను బయటికి విసిరివేశారు. తర్వాత వారు బయలు దేవత ఆలయంలోని లోపలిగదిలోనికి వెళ్లారు. 26 బయలు ఆలయంలో వున్న జ్ఞాపక శిలలను[a] వారు వెలుపలికి తీసుకువచ్చి, దేవాలయాన్ని దగ్ధం చేశారు. 27 తర్వాత దేవాలయంలోని జ్ఞాపకశిలలను నుగ్గు నుగ్గు చేశారు. బయలు దేవాలయాన్ని కూడా నుగ్గు నుగ్గు చేశారు. వారు బయలు దేవాలయాన్ని ఒక మరుగుదొడ్డిగా మార్చారు. ప్రజలు ఇప్పటికి ఆ ప్రదేశమును బైలు గదిగా (పాయిఖానాగా) వాడతారు.

28 ఈ విధంగా యెహూ ఇశ్రాయేలులో బయలు ఆరాధనను నాశనం చేశాడు. 29 కాని నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాలు పూర్తిగా తొలగలేదు; అందువల్ల ఇశ్రాయేలు పాపం చేయవలసి వచ్చింది. బేతేలు, దానులలో బంగారు దూడలను యెహూ నాశనం చెయ్యలేదు.

ఇశ్రాయేలుమీద యెహూ పరిపాలన

30 యెహోవా యెహూని ఉద్దేశించి, “నీవు బాగుగా చేశావు. నేను చెప్పిన సంగతులను నీవు చేశావు. నేను ఆశించిన విధంగా నీవు అహాబు వంశాన్ని నాశనం చేశావు. అందువల్ల నీ సంతతి వారు ఇశ్రాయేలును నాలుగు తరాలవరకూ పరిపాలిస్తారు” అని చెప్పాడు.

31 కాని హృదయపూర్వకంగా యెహూ జాగ్రత్తగా యెహోవా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ నివసించలేదు. ఇశ్రాయేలును పాపానికి గురిచేసిన యరొబాము పాపాలను యెహూ ఆపలేకపోయాడు.

హజాయేలు ఇశ్రాయేలును ఓడించుట

32 ఆ సమయమున, యెహోవా ఇశ్రాయేలును భాగాలుగా ఛేదింపసాగాడు. సిరియా రాజయిన హజాయేలు ఇశ్రాయేలు ప్రతి సరిహద్దుననున్ను ఇశ్రాయేలు వారిని ఓడించాడు. 33 యోర్దాను నదికి తూర్పునవున్న ప్రదేశాన్ని హజాయేలు జయించాడు. గాదీయులకును, రూబేనీయులకును మరియు మనష్షేవంశాలకు చెందిన ప్రాంతాలను, గిలాదుప్రాంతములన్నీ, అర్నోను లోయ ప్రక్కనున్న అరోయేరు ప్రదేశంలోని గిలాదు, బాషాను ప్రాంతాల వరకూ హజాయేలు జయించాడు.

యెహూ మరణం

34 యెహూ కావించిన ఇతర గొప్ప పనులు “ఇశ్రాయేలు రాజుల వృత్తాంతము” అనే గ్రంథంలో వ్రాయబడినవి. 35 యెహూ మరణించగా, అతని పూర్వికులతో పాటుగా సమాధి చేయబడ్డాడు. షోమ్రోనులో ప్రజలు యెహూని సమాధి చేశారు. అతని తర్వాత, యెహూ కుమారుడైన యెహోయాహాజు ఇశ్రాయేలుకు కొత్తగా రాజయ్యాడు. 36 షోమ్రోనులో ఇశ్రాయేలు మీద యెహూ ఇరవై ఎనిమిది సంవత్సరాల పాటు పరిపాలించాడు.

అతల్యా యూదాలోని రాజకుమారులందరిని చంపుట

11 అతల్యా అహజ్యా యొక్క తల్లి. తన కుమారుడు చనిపోయినట్లు ఆమె చూసింది. అందువల్ల ఆమె లేచి రాజవంశం అంతటినీ చంపివేసింది.

యెహోషెబ రాజైన యెహోరాము యొక్క కుమార్తె. అహజ్యా సోదరి. యోవాషు రాజ కుమారులలో ఒకడు. మిగిలిన పిల్లలు చంపబడినప్పుడు యెహోషెబ యెవాషును తీసుకుని దాచింది. ఆమె యెవాషును అతని దాదిని ఆమె పడక గదిలో ఉంచింది. అందువల్ల యెహోషెబ మరియు దాది అతల్యాకి తెలియకుండా యెవాషును కాపాడారు. ఆ విధంగా యోవాషు మరణించలేదు.

తర్వాత యోవాషు మరియు యెహోషెబా యెహోవా యొక్క ఆలయంలో దాగివున్నారు. అక్కడ యోవాషు ఆరు సంవత్సరములు దాగివున్నాడు. మరియు అతల్యా యూదా దేశాన్ని పరిపాలించింది.

ఏడవ సంవత్సరమున ప్రధాన యాజకుడయిన యెహోయాదా సైనికుల అధిపతులను కాపలాదారులను రప్పించాడు. యెహోయాదా వారిని యెహోవా ఆలయములో ఒక చోట సమకూర్చాడు. తర్వాత యెహోయాదా వారితో ఒక ఒడంబడిక కుదుర్చుకున్నాడు. ఆలయంలో యెహోయాదా వారిని ఒక వాగ్దానం చేయమని నిర్భందించాడు. అప్పుడు వారికి రాజుగారి కుమారుడైన యెవాషును చూపించాడు.

తర్వాత యెహోయాదా వారికొక ఆజ్ఞ విధించాడు. “ఈ పని మీరు చెయ్యాలి. ప్రతి విశ్రాంతి రోజున మీలో ఒక మూడోవంతు రావాలి. మీరు రాజభవనాన్ని కాపలా కాయాలి. రెండో మూడోవంతు సూరు ద్వారం వద్ద వుండాలి. మరియు మరియొక మూడోవంతు కాపలాదారులకు వెనకాల ద్వారం వద్ద వుండాలి. ఈ విధంగా మీరు ఒక గోడవలె యెవాషును రక్షించాలి. ప్రతి విశ్రాంతి రోజు మీలో రెండువంతులు యెహోవా ఆలయాన్ని కాపలా కాయాలి. యెవాషు రాజుని రక్షించాలి. యెవాషు రాజు ఎప్పుడైనా ఎక్కడైనా వెళ్లినా మీరు అతని వెంట వుండాలి. మొత్తం రాజుని అవరించి వుండాలి. ప్రతి కాపలాదారుడు తన ఆయుధాన్ని చేత ధరించి వుండాలి. మీకు మరీ దగ్గరగా వచ్చే ఎవనినైనా మీరు హతమార్చాలి” అని అన్నాడు.

యెహోయాదా యాజకుడు ఆజ్ఞాపించిన అన్నిటినీ అధిపతులు పాటించారు. ప్రతి అధిపతి తన మనుష్యులను తీసుకున్నాడు. ఒక బృందమేమో శనివారంనాడు రాజుకు కాపలాగా ఉండాలి. వారం మిగిలిన రోజుల్లో ఇతర బృందాలు రాజుకు కాపలాగా వుండాలి. యెహోయాదా యాజకుని వద్దకు ఆ మనుష్యులందరు వెళ్లారు. 10 మరియు యాజకుడు బల్లెములు, కవచములు అధిపతులకు ఇచ్చాడు. ఆ బల్లెములు కవచములు యెహోవా ఆలయంలో దావీదు ఉంచినవి. 11 ఈ కాపలాదార్లు ఆయుధములు ధరించి ఆలయం కుడి మూలనుంచి మరియు ఆలయం ఎడమ మూలవరకు నిలబడ్డారు. వారు బలిపీఠం, ఆలయం చుట్టూ నిలబడ్డారు. వారు దేవాలయంలో రాజును కాపాడడానికి అతని చుట్టూ నిలబడ్డారు. 12 ఈ మనుష్యులు యోవాషును బయటకు తీసుకొని వచ్చి, అతని తల మీద వారు కిరీటం ఉంచారు. దేవునికీ రాజుకూ మధ్య జరిగిన ఒడంబడికను రాజుకి ఇచ్చారు. తర్వాత వారు అతనిని అభిషేకించి కొత్త రాజుగా చేశారు. “రాజు వర్ధిల్లుగాక!” అని వారు కరతాళ ధ్వనులు చేశారు; నినాదాలు చేశారు.

13 రాణి అతల్యా కాపలాదారులు మరియు ప్రజల నుండి శబ్ధం విన్నది. అందువల్ల ఆమె యెహోవా ఆలయం వద్దనున్న ప్రజల దగ్గరకు వెళ్లింది. 14 అతల్యా మామూలుగా రాజు నిలబడే స్తంభం వద్ద రాజుని చూసింది. రాజుకోసం బాకాలూదే నాయకులను ప్రజలను కూడా ఆమె చూసింది. అందరు మనుష్యులు చాలా సంతోషంగా వున్నట్లు ఆమె చూసింది. బూరలు మ్రోగాయి. ఆమె తలక్రిందులయినట్లుగా తెలుపడానికి తన వస్త్రములు చింపుకొన్నది. తర్వాత అతల్యా, “రాజ ద్రోహం, రాజద్రోహం” అని అరిచింది.

15 సైనికులు అధికారులుగానున్న అధిపతులకు యాజకుడు అయిన యెహోయాదా ఒక ఆజ్ఞ విధించాడు. “ఆలయం వెలుపలికి అతల్యాను తీసుకొని వెళ్లండి. ఆమెనూ, అనుచరులనూ చంపండి. కాని యెహోవా ఆలయంలో వారిని చంపకండి” అని యెహోయాదా వారికి చెప్పాడు.

16 అందువల్ల సైనికులు అతల్యాను లాగివేశారు. అంతఃపురానికి గుర్రాలు వెళ్లే ప్రవేశంగుండా ఆమె వెళ్లేటప్పుడు ఆమెను చంపివేశారు.

17 తర్వాత యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య ఒక ఒడంబడిక చేశాడు. ఈ ఒడంబడిక రాజు, ప్రజలు యెహోవాకి చెందిన వారని తెలుపుతుంది. యెహోయాదా రాజుకు, ప్రజలకు మధ్య కూడా ఒక ఒడంబడిక చేశాడు. ప్రజలకు రాజు ఏమి చేయాలో ఈ ఒడంబడిక తెలుపుతుంది. ప్రజలు విధేయులై రాజుని అనుసరిస్తారని ఈ ఒడంబడిక తెలుపుతుంది.

18 తర్వాత మనుష్యులు అందరు అసత్య దేవత బయలు ఆలయానికి వెళ్లారు. ఆ మనుష్యులు బయలు విగ్రహాన్ని, అతని బలిపీఠాలను ధ్వంసం చేశారు. వాటిని వారు ముక్కలు ముక్కలుగా చేశారు. ఆ మనుష్యులు బయలు యొక్క యాజకుడు మత్తానును బలిపీఠముల వద్ద చంపివేశారు.

అందువల్ల యాజకుడు అయిన యెహోయాదా యెహోవా ఆలయాన్ని ఆ మనుష్యుల అధికారమున నిర్వహణార్థం ఉంచాడు. 19 యాజకుడు మనుష్యులందరిని నడిపించాడు. వారు యెహోవా ఆలయంనుండి రాజు ఇంటివరకు వెళ్లారు. రాజు ప్రత్యేక కాపలాదార్లు, అధిపతులు రాజుతోపాటు వెళ్లారు. మరియు మనుష్యులందరూ వారిని అనుసరించారు. వారు రాజభవన ప్రవేశ ద్వారం వద్దకు వెళ్లారు. యెవాషు రాజు సింహాసనం మీద ఉన్నాడు. 20 మనుష్యులు అందరు చాలా సంతోషంగా వున్నారు. నగరం శాంతంగా ఉంది. మరియు రాణి అతల్యా రాజభవనం వద్ద కత్తితో చంపబడింది. 21 యోవాషు రాజయినప్పుడు, అతను ఏడేండ్లవాడు.

యోవాషు పరిపాలన ప్రారంభించుట

12 ఇశ్రాయేలు రాజుగా యెహూ పాలన సాగించిన ఏడవ సంవత్సరంనుండి యోవాషు తన పరిపాలన ప్రారంభించాడు. యెరూషలేములో యోవాషు 40 సంవత్సరములు పాలించాడు. యోవాషు తల్లి బెయేర్షెబాకు చెందిన జిబ్యా. యెహోవా దృష్టికి సరి అయిన పనులు యోవాషు జరిగించాడు. జీవితాంతమూ యోవాషు యెహోవా పట్ల విధేయుడై వుండెను. యాజకుడైన యెహోయాదా తనకు నేర్పించిన పనులు అతను చేశాడు. కాని అతను ఉన్నత స్థానాలను నాశనం చెయ్యలేదు. ఆ ఆరాధనా స్థలాలలో ఆనాటికీ ప్రజలు బలులు అర్పిస్తున్నారు, ధూపం వేస్తున్నారు.

యోవాషు ఆలయ పునరుద్ధరణకు ఆజ్ఞాపించుట

4-5 “యెహోవా ఆలయంలో చాలా ధనం వున్నది. ప్రజలు ఆలయానికి కొన్ని వస్తువులు సమర్పించారు. వారిని లెక్కించినప్పుడు ప్రజలు ఆలయం పన్ను చెల్లించారు. డబ్బు ఇవ్వాలనే వుద్దేశ్యంతో వారు ఇచ్చారు. యాజకులైన మీరు ఆ ధనం తీసుకొని యెహోవా ఆలయాన్ని బాగు చేయండి. తాను సేవచేసే ప్రజలనుండి లభించే డబ్బును ప్రతి యాజకుడు వినియోగించాలి. యెహోవా ఆలయానికి ఆ డబ్బుతో మంచిపనులు చేయాలి” అని యాజకులకు యోవాషు చెప్పాడు.

కాని యాజకులు మరమ్మతులు చేయలేదు. యోవాషు రాజుగావున్న 23వ సంవత్సరమున, యాజకులు అప్పటికి మరమ్మతులు చేయలేదు. అందువల్ల యోవాషు రాజు యెహోయాదా యాజకుని, ఇతర యాజకులను పిలిపించుకున్నాడు. యెవాషు, యెహోయాదా, ఇతర యాజకులతో, “మీరెందుకు ఆలయాన్ని మరమ్మతు చేయలేదు? మీరు సేవించే మనుష్యుల వద్దనుండి మీరు డబ్బును తీసుకోవడం నిలిపివేయండి. ఆ డబ్బును వాడకండి. ఆలయాన్ని మరమ్మతు చేయుటకే అది వినియోగించ బడాలి” అని చెప్పాడు.

ప్రజలవద్ద నుండి డబ్బు వసూలు చేయడాన్ని ఆపివేయడానికి యాజకులు సమ్మతించారు. అయితే ఆలయాన్ని బాగు చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందువల్ల యాజకుడైన యెహోయాదా ఒక పెట్టె తీసుకుని దానిమీద ఒక రంధ్రం చేశాడు. తర్వాత యెహోయాదా బలిపీఠపు దక్షిణ దిశగా పెట్టెను ఉంచాడు. ఈ పెట్టె యెహోవా ఆలయానికి ప్రజలు వచ్చే ద్వారానికి ప్రక్కగా వున్నది. కొందరు యాజకులు ఆలయంలోని ఆ ద్వారాన్ని కాపలా కాసారు. యెహోవాకి ప్రజలు సమర్పించిన డబ్బును ఆ యాజకులు తీసుకుని, ఆ పెట్టలో వేశారు.

10 తర్వాత ఆలయానికి వెళ్లినప్పుడల్లా ప్రజలు ఆ పెట్టెలో డబ్బు వేయడం మొదలుపెట్టారు. రాజుగారి కార్యదర్శి, ప్రధాన యాజకుడు ఆ పెట్టెలో డబ్బు చాలా ఉండడం చూసివప్పుడు, వారు ఆ పెట్టె నుండి డబ్బు తీసుకొని, ఆ డబ్బును సంచులలో వేసి లెక్కించారు. 11 యెహోవా ఆలయాన పనిచేసే వారికి వారు ఆ డబ్బు ఇచ్చి వేశారు. వడ్రంగులు మరి ఇతర ఆలయ కాపరులకు డబ్బు ఇచ్చారు. 12 రాళ్లు చెక్కే వారికి రాళ్లు మోసేవారికి ఇవ్వడానికి ఆ డబ్బు వినియోగించారు. మరియు కలపకొనడానికి, రాళ్లు ముక్కలు చేయడానికి, ఆలయ మరమ్మతు పనులకు వారు ఆ డబ్బు వినియోగించారు.

13-14 యెహోవా ఆలయానికి ప్రజలు డబ్బు ఇచ్చారు. కాని యాజకులు ఆ డబ్బును వెండి కప్పులు, దీపాలు వెలిగించేందుకు వుపయోగించే కప్పులు, గిన్నెలు, బూరలు, బంగారం, వెండి పాత్రలు చేసేందుకు వినియోగించలేక పోయారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడింది. ఆ పని వారు యెహోవా ఆలయాన్ని బాగు చేశారు. 15 ఆ డబ్బునంతా ఎవ్వరూ లెక్కించలేదు. ఆ డబ్బు ఏమి చేయబడినదో చెప్పమని ఏ పనివానిని నిర్భంధించ లేదు. ఎందుకనగా పనివారు నమ్మకస్థులుగా ఉన్నారు.

16 అపరాధ పరిహారార్థ బలులు, పాపపరిహారార్థ బలులు సమర్పించు సమయములో ప్రజలు ఆ డబ్బు ఇచ్చారు. ఆ డబ్బు పనివారికి ఇవ్వబడడం జరిగేదికాదు. ఆ డబ్బు యాజకులకు చెందినది.

హాజాయేలు నుండి యోవాషు యెరూషలేమును రక్షించుట

17 సిరియారాజు హాజాయేలు. గాతు నగరానికి ప్రతికూలంగా యుద్ధం చేయడానికి హజాయేలు వెళ్లాడు. హజాయేలు గాతుని ఓడించాడు. తర్వాత అతను యెరూషలేముకు ప్రతికూలంగా యుద్ధం చేయడానికి నిశ్చయించాడు.

18 యెహోషాపాతు, యెహోరాము, అహజ్యాలు యూదా రాజులుగా వున్నారు. వారు యోవాషు పూర్వికులు. వారు యెహోవాకు చాలా వస్తువులు సమర్పించారు. ఆ వస్తువులు ఆలయంలో ఉంచబడ్డాయి. యోవాషు కూడా చాలా వస్తువులు యెహోవాకు సమర్పించాడు. యోవాషు ఆలయంలోవున్న అన్ని వస్తువులు, బంగారం తీసుకున్నాడు. తన యింట్లో ఉన్న వాటిని కూడా తీసుకున్నాడు. తర్వాత యోవాషు ఆ విలువగల వస్తువులను సిరియా రాజైన హజాయేలుకు పంపాడు. అప్పుడు హజాయేలు యెరూషలేమునుండి వెళ్లిపోయాడు.

యోవాషు మరణం

19 యోవాషు చేసిన అన్ని ఘనకార్యాలు “యూదా రాజుల చరిత్ర” అనే గ్రంథంలో వ్రాయబడినవి.

20 యోవాషు అధికారులు అతనికి విరుద్ధంగా పథకం వేశారు. వారు సిల్లాకి వెళ్లే మార్గమున ఉన్న మిల్లో అనే ఇంట్లో యోవాషును చంపివేశారు. 21 షిమాతు కుమారుడైన యోజాకారు[b], షోమేరు కుమారుడైన యెహోజాబాదు యోవాషు అధికారులు. వారు యోవాషుని చంపివేశారు.

దావీదు నగరంలో అతని పూర్వికులతో పాటుగా యోవాషుని సమాధి చేశారు. యోవాషు కుమారుడైన అమజ్యా అతని తర్వాత క్రొత్తగా రాజయ్యాడు.

యోహాను 1:29-51

దేవుని గొఱ్ఱె పిల్ల

29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.

32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”

యేసు మొదటి శిష్యులు

35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. 36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.

37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. 38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు.

వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)

39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.

40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో 41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.

42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా[a] అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.

43 మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు. 44 అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు. 45 ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.

46 నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు.

“వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.

47 నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.

48 “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు.

యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.

49 నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.

50 యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు. 51 ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International