M’Cheyne Bible Reading Plan
రాజైన హిజ్కియా అభివృద్ధి కార్యక్రమం చేయటం
31 పస్కా పండుగ పూర్తి అయ్యింది. యెరూషలేముకు పండుగ నిమిత్తం వచ్చిన ఇశ్రాయేలీయులు యూదాలో వున్న పట్టణాలకు వెళ్లి, అక్కడ వున్న రాతి విగ్రహాలన్నిటినీ ముక్కలు చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వారు ఈ రాతి విగ్రహాలను ఉపయోగించేవారు. ప్రజలు అషేరా స్తంభాలను కూడా నరికివేశారు. యూదా, బెన్యామీను రాజ్యాలలో వున్న ఉన్నత స్థలాలను, బలిపీఠాలను కూలదోశారు. ఎఫ్రాయిము, మనష్షే ప్రాంతాలలో కూడా ఈ ప్రజలు అదే పని చేశారు. బూటకపు దేవతల ఆరాధనలో వినియోగించే వస్తువులన్నీ నాశనమయ్యే వరకు ప్రజలీపని చేస్తూనే వున్నారు. తరువాత ఇశ్రాయేలీయులంతా తమ తమ పట్టణాలకు వెళ్లిపోయారు. ప్రతి వ్యక్తీ తన ఇంటికి వెళ్లిపోయాడు.
2 రాజైన హిజ్కియా మళ్లీ యాజకుల, లేవీయుల వంశాలను వారివారి విధులు నిర్వర్తించటానికి ఎంపిక చేశాడు. ప్రతి గుంపుకీ ప్రత్యేకమైన పని నిర్దేశించబడింది. దహనబలులు, సమాధానబలులు యివ్వటానికి కూడ హిజ్కియా మళ్లీ యాజకులను, లేవీయులను ఎంపిక చేశాడు. ఆ యాజకులు ఆలయంలో సేవ చేసి, దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చేశారు. 3 దహన బలులుగా అర్పించటానికి హిజ్కియా తన స్వంత జంతువులను కొన్నిటిని ఇచ్చాడు. ఈ దహనబలులు ఉదయ, సాయంకాల సమయాలలోను, వారం చివర సబ్బాతు దినాలలోను (శనివారం), అమావాస్యలందు, మరి ఇతర పండుగ దినాలలోను అర్పించేవారు. ఈ కార్యక్రమమంతా దేవుని ధర్మశాస్త్ర ప్రకారం జరిగింది.
4 యాజకులకు, లేవీయులకు చెందిన భాగాన్ని వారికి ఇవ్వమని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు హిజ్కియా ఆజ్ఞాపించాడు. తద్వారా యాజకులు, లేవీయులు తమ పూర్తి కాలాన్ని యెహోవా సేవలో, ధర్మశాస్త్రం బోధించేందుకు వినియోగించగలరు. 5 రాజాజ్ఞ దేశమంతా ప్రచారం చేయబడిన వెంటనే, ఇశ్రాయేలు ప్రజలు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చారు. తమ పంటలైన ధాన్యం, ద్రాక్ష, నూనె, తేనె, ఇంకను వారి పొలాల్లో పండిన తదితర పంటల నుండి మొదటి భాగాన్ని ధారాళంగా ఇచ్చారు. వారి పంటలో పదవ భాగాన్ని స్వచ్ఛందంగా తీసుకొని వచ్చారు. ఈ సేకరణే చాలా పెద్ద మొత్తమయ్యింది. 6 యూదా పట్టణాలలో నివసిస్తున్న ఇశ్రాయేలు, యూదా ప్రజలు కూడా తమ పశుసంపదలో పదవవంతు తెచ్చారు. వారింకా యెహోవా కొరకు విడిగా ఒక చోట నిల్వచేసిన వస్తువులలో పదవవంతు తెచ్చారు. వారీ వస్తువులన్నీ తాము ఆరాధించే దేవుడైన యెహోవా నిమిత్తం తెచ్చారు. వారు తెచ్చిన పదార్థాలు, వస్తువులు అన్నీ రాశులుగా పోశారు.
7 మూడవ నెలలో (మే/జూన్) ప్రజలు నిల్వచేసిన వస్తువులన్నీ తేవటం మొదలుపెట్టి ఏడవ నెలలో (సెప్టెంబర్/అక్టోబర్) పూర్తి చేశారు. 8 హిజ్కియా, మరియు ఇతర పెద్దలు వచ్చి ప్రజలు తెచ్చిన వస్తుసంపద రాశులుగా పడివుండటం చూశారు. వారు దేవునికి స్తోత్రం చేసి, ఆయన ప్రజలైన ఇశ్రాయేలీయులను శ్లాఘించారు.
9 అప్పుడు హిజ్కియా రాసులుగా పడివున్న వస్తుసంపద గురించి యాజకులను, లేవీయులను అడిగి తెలుసుకున్నాడు. 10 సాదోకు కుటుంబానికి చెందిన ప్రముఖ యాజకుడు అజర్యా రాజైన హిజ్కియాతో యిలా చెప్పాడు: “ప్రజలు ఆలయానికి కానుకలు తేవటం మొదలు పెట్టినప్పటి నుండి తినటానికి మాకు సమృద్ధిగా ఆహార పదార్థాలు లభిస్తున్నాయి. అంతేగాదు, మా వద్ద ఇంకా అనేక పదార్థాలు మిగిలివున్నాయి. యెహోవా తన ప్రజలను ఆశీర్వదించాడు. అందుచే మావద్ద ఇదంతా మిగిలివుంది.”
11 పిమ్మట ఆలయంలో సరుకు నిల్వచేసే గదులు కట్టించమని హిజ్కియా యాజకులకు ఆజ్ఞాపించగా, వారు వాటిని కట్టించారు. 12 తరువాత యాజకులు కానుకలను, దశమ భాగాలను, తదితర వస్తువుల్లో యెహోవాకై ప్రత్యేకించబడిన కానుకను తెచ్చారు. అలా సేకరించిన ఆ వస్తుసంపదను ఆలయ గిడ్డంగులలో భద్రపర్చారు. లేవీయుడైన కొనన్యా వీటిపై పర్యవేక్షకుడుగా నియపింపబడ్డాడు. అతని తరువాత అధికారిగా షిమీ నియమితుడయ్యాడు. కొనన్యా సోదరుడే షిమీ. 13 కొనన్యా, అతని సోదరుడు షిమీలిద్దరూ యెహీయేలు, అజజ్యాహు, నహతు, అశాహేలు, యెరీమోతు, యోజాబాదు, ఎలీయేలు, ఇస్మక్యాహు, మహతు మరియు బెనాయాలపై పర్యవేక్షణ అధికారులుగా నియమింపబడ్డారు. రాజైన హిజ్కియా, ఆలయపు నిర్వహణాధికారి అజర్యాలిద్దరూ ఈ మనుష్యులను ఎంపికచేశారు.
14 ప్రజలు దేవునికి ఇచ్చే ఉచిత కానుకల విషయమై శ్రద్ధ తీసుకోనే అధికారి పేరు కోరే. దేవునికి ఇవ్వబడిన కానుకల పంపిణీ విషయంలో ఇతడు శ్రద్ధ తీసుకొంటాడు. దేవునికి ఇవ్వగా పవిత్ర పర్చబడిన ధానాల పంపిణీ విషయంలో కూడా బాధ్యత ఇతనిదే. కోరే తూర్పు ద్వారపాలకుడు. ఇతని తండ్రి లేవీయుడైన ఇమ్నా. 15 ఏదెను, మిన్యామీను, యేషూవ, షెమయా, అమర్యా మరియు షెకన్యా అనేవారు కోరేకు సహాయ కులుగా పనిచేశారు. వారంతా యాజకులు నివసించే పట్టణాలలో విశ్వాసపాత్రంగా పనిచేశారు. యాజకులలో ప్రతి వర్గం వారి బంధువులకు సేకరించిన వస్తువులను వారు ఇచ్చేవారు. అవే వస్తువులను మిక్కిలి గొప్పవారికి, అతి పేదవారికి కూడ వారివారి భాగాలను వారు ఇచ్చేవారు.
16 లేవీయుల వంశ చరిత్రల్లో చేర్చబడిన మూడేండ్లు అంతకు పైబడిన వయస్సుగల మగ పిల్లలకు కూడ సేకరించిన రాశులనుండి వారు భాగాలను పంచిపెట్టేవారు. ఈ మగవారంతా నిత్యం ఆలయానికి వెళ్లి అనుదిన సేవా కార్యక్రమాలలో తమ తమ విధులు నిర్వర్తించవలిసినవారు. లేవీయులో ప్రతి వంశంవారికి ఒక బాధ్యత అప్పగించబడింది. 17 సేకరించిన వస్తుసంపద నుంచి యాజకులకు తమ భాగం యివ్వబడింది. ఇది వారి కుటుంబాల వారీగా వంశ చరిత్రలలో వ్రాయబడిన క్రమంలో ఈ పని జరుపబడింది. సేకరించిన సంపదలో ఇరవైయేండ్లు, అంతకు పైబడిన వయస్సుగల లేవీయులకు వారి వంతు భాగాలు ఇవ్వబడ్డాయి. ఇది వారి వారి బాధ్యతలను బట్టి, వారి వారి కుటుంబాలను బట్టి జరిగింది. 18 లేవీయుల పసిపిల్లలు, భార్యలు, కుమారులు, కుమార్తెలు సేకరించిన సంపదలో భాగస్వాములయ్యారు. వంశచరిత్రలో వ్రాయబడిన లేవీయులందరికీ యిలా భాగాలు ఇవ్వ బడ్డాయి. లేవీయులు విశ్వాస పాత్రంగా సదా పవిత్రులైవుండి, ప్రభుసేవా పరాయణులైనందువల్ల ఆ విధంగా ఏర్పాటు చేయబడింది.
19 అహరోను వంశస్థులైన కొంతమంది యాజకులు లేవీయులు నివసిస్తున్న పట్టణాలకు దగ్గరలో కొన్ని పంట భూములు కలిగియున్నారు. ఆ పట్టణాలలో అహరోను సంతతి వారు కూడ కొందరు నివసిస్తున్నారు. అట్టి అహరోను సంతతి వారికి భాగాలు యివ్వటానికి ప్రతి పట్టణంలోను నివసిస్తున్న పురుషులు పేర్ల వారీగా ఎంపిక చేయబడ్డారు. పురుషులు, లేవీయుల వంశ చరిత్రలో వ్రాయబడినవారు సేకరించిన పదార్థాలలో భాగం పొందారు.
20 రాజైన హిజ్కియా అలాంటి మంచి పనులు యూదా రాజ్యమంతటా చేశాడు. యెహోవా దృష్టికి మంచిదైన న్యాయమైన విశ్వసనీయమైన ప్రతి పనినీ అతడు చేశాడు. 21 తలపెట్టిన ప్రతి పనిలోను, ఆలయంలో సేవాకార్యక్రమం పునః ప్రారంభించటంలోను, దేవుని ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను పాటించటంలోను మరియు అతడు దేవుని అనుసరించటంలోను అతను విజయం సాధించాడు. హిజ్కియా ఈ పనులన్నీ తన హృదయపూర్వకంగా చేశాడు.
మృగముపైనున్న స్త్రీ
17 ఏడు పాత్రలున్న ఏడుగురి దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో ఈ విధంగా అన్నాడు: “అది పేరుగాంచిన వేశ్య. బహు జనముల మీద కూర్చున్న ఆ వేశ్యకు యివ్వబడే శిక్షను నీకు చూపిస్తాను. నా వెంట రా. 2 దానితో భూపతులు వ్యభిచరించారు. ఈ భూమ్మీద నివసించే ప్రజలు అది అందించే వ్యభిచారమనే మద్యంతో మత్తెక్కిపోయారు.”
3 ఆ తర్వాత ఆ దేవదూత నన్ను ఆత్మద్వారా ఒక ఎడారి ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ ఒక స్త్రీ ఎరుపు, ఊదా రంగుగల మృగం మీద కూర్చొని ఉండటం చూసాను. ఆ మృగం మీద దూషణలు వ్రాయబడి ఉన్నాయి. ఆ మృగానికి ఏడు తలలు, పది కొమ్ములు ఉన్నాయి. 4 ఆ స్త్రీ ఊదా, ఎరుపు రంగుగల వస్త్రాల్ని కట్టుకొని ఉంది. బంగారుతో, రత్నాలతో, ముత్యాలతో చేసిన మెరిసే ఆభరణాలను వేసుకొని ఉంది. అది తన చేతిలో ఒక బంగారు పాత్రను పట్టుకొని ఉంది. ఆ పాత్ర అసహ్యమైన వాటితో, అది చేసిన వ్యభిచార కల్మషంతో నిండి ఉంది. 5 ఈ పేరు దాని నుదుటి మీద వ్రాయబడి ఉన్నది:
మర్మము, మహా బాబిలోను
వేశ్యలకు తల్లి!
ప్రపంచంలోని కల్మషాలకు తల్లి!
6 ఆ స్త్రీ భక్తుల రక్తాన్ని త్రాగి, మత్తుగా ఉండటం చూసాను. ఆ రక్తం యేసును గురించి సాక్ష్యం చెప్పిన వాళ్ళది.
నేనా స్త్రీని చూసి ఆశ్చర్యపడ్డాను. 7 అప్పుడు ఆ దేవదూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవెందుకు అంత ఆశ్చర్యపడుతున్నావు? ఆ స్త్రీ యొక్క రహస్యం నీకు చెబుతాను. ఆమె స్వారీ చేసే ఏడుతలల, పది కొమ్ముల మృగాన్ని గురించి చెపుతాను. 8 నీవు చూసిన మృగం ప్రస్తుతం లేదు. ఒకప్పుడు ఉండింది. పాతాళం నుండి లేచి వచ్చి అది నాశనమౌతుంది. ఆ మృగం ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదు. భవిష్యత్తులో వస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఆ మృగాన్ని చూసి దిగ్ర్భాంతి చెందుతారు. సృష్టి మొదలైనప్పటి నుండి వీళ్ళ పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడలేదు.
9 “దీన్ని అర్థం చేసుకోవటానికి బుద్ధి అవసరం.” ఆ ఏడుతలలు ఆ స్త్రీ కూర్చొన్న ఏడుకొండలు. ఆ ఏడు తలలు ఏడుగురు రాజులతో పోల్చబడ్డాయి. 10 ఐదుగురు పడిపోయారు. ఒకడు ఉన్నాడు. ఇంకొకడు యింకా రాలేదు. అతడొచ్చాక కొద్దికాలం ఉంటాడు. 11 ఒకప్పుడు ఉండి ప్రస్తుతము లేని మృగము ఎనిమిదవ రాజు. అతడు ఏడుగురిలో ఒకడు. అతడు కూడా నాశనమౌతాడు.
12 “నీవు చూసిన ఆ పది కొమ్ములు పదిమంది రాజులు. వాళ్ళకు యింకా రాజ్యము లభించలేదు. కాని వాళ్ళకు రాజులకున్న అధికారము, మృగంతో పాటు ఒక గంట సమయం మాత్రమే లభిస్తుంది. 13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. 14 వాళ్ళు గొఱ్ఱెపిల్లతో యుద్ధం చేస్తారు. కాని గొఱ్ఱెపిల్ల ప్రభువులకు ప్రభువు. రాజులకు రాజు. కనుక విజయం పొందుతాడు. ఆయన వెంట ఆయన పిలిచినవాళ్ళు, ఆయన ఎన్నుకొన్నవాళ్ళు, ఆయన్ని విశ్వసించేవాళ్ళు ఉంటారు.”
15 ఆ తర్వాత దూత నాతో ఈ విధంగా అన్నాడు: “నీవు ఆ వేశ్య కూర్చున్న నీళ్ళను చూసావు. ఆ నీళ్ళు ప్రజల గుంపుల్ని, జాతుల్ని, దేశాలను, భాషలను సూచిస్తోంది. 16 నీవు చూసిన మృగము, దాని పది కొమ్ములు ఆ వేశ్యను ద్వేషిస్తాయి. అవి ఆమె దగ్గర ఉన్నవన్నీ తీసుకొని ఆమెను నగ్నంగా వదిలేస్తాయి. ఆమె దేహాన్ని తిని, ఆమెను మంటల్లో కాల్చివేస్తాయి. 17 దేవుడు తన ఉద్దేశ్యం నెరవేర్చుమని వాటి హృదయాలకు చెప్పాడు. కనుక ఆ పది కొమ్ములు తమ రాజ్యాన్ని దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు ఆ మృగానికి యివ్వటానికి అంగీకరించాయి. 18 నీవు చూసిన ఆ స్త్రీ భూలోకంలోని రాజులను పాలించే మహానగరం.”
బూటకపు ప్రవక్తలు ఇక వుండరు
2 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు, “ఆ సమయంలో విగ్రహాలన్నిటినీ భూమిపైనుండి తొలగిస్తాను. ప్రజలు కనీసం వాటి పేర్లయినా గుర్తు పెట్టుకోలేరు. ఈ భూమిపైనుండి బూటకపు ప్రవక్తలను, మురికి దయ్యాలను నేను తొలగిస్తాను. 3 ఎవ్వరైనా భవిష్య ప్రకటనలు చేస్తే అట్టి వ్యక్తి శిక్షింపబడతాడు. అతని తల్లిదండ్రులు సహితం అతనితో, ‘యెహోవా పేరుమీద నీవు అబద్ధాలు చెప్పావు. కావున నీవు తప్పక చనిపోవాలి!’ అని అంటారు. అతని స్వంత తల్లిదండ్రులు అతడు భవిష్య ప్రకటనలు చేసినందుకు కత్తితో పొడుస్తారు. 4 అప్పుడు ప్రవక్తలు తమ దర్శనాలపట్ల, తమ ప్రకటనలపట్ల సిగ్గు చెందుతారు. తాము ప్రవక్తలమని తెలియజేసే ముతక బట్టను వారు ధరించరు. భవిష్య ప్రకటనల పేరుతో అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించటానికి వారు ఆ బట్టలు ధరించరు. 5 ఆ జనులు ఇలా అంటారు: ‘నేను ప్రవక్తను కాను. నేనొక వ్యవసాయదారుడిని. నా చిన్నతనంనుండి నేను వ్యవసాయదారునిగానే పని చేశాను.’ 6 ‘అయితే, నీ చేతులమీద ఈ గాయాలు ఏమిటి?’ అని ఇతరులు అడుగుతారు. అందుకతడు, ‘నా స్నేహితుల ఇంటిలో నాకు దెబ్బలు తగిలాయి’ అని అంటాడు.”
7 సర్వశక్తిమంతుడైన యెహోవా చెపుతున్నాడు: “ఖడ్గమా, గొర్రెల కాపరిని నరుకు! నా స్నేహితుని నరుకు! కాపరిని నరుకు! గొర్రెలన్నీ పారిపోతాయి. నేను ఆ చిన్నవాటిని శిక్షిస్తాను. 8 దేశ జనాభాలో మూడింట రెండు వంతులు బాధింపబడగా చనిపోతారు. మూడింట ఒకవంతు బతుకుతారు. 9 చనిపోగా మిగిలినవారిని నేను పరీక్షిస్తాను. వారికి నేను ఎన్నో కష్టాలు కలుగ జేస్తాను. వెండిని శుద్ధి చేయటానికి కాల్చబడే అగ్నిలా ఆ కష్టాలు వుంటాయి. ఒకడు బంగారాన్ని పరీక్ష చేసినట్లు నేను వారిని పరీక్ష చేస్తాను. అప్పుడు సహాయం కొరకు వారు నన్ను పిలుస్తారు. నేను వారికి సమాధానమిస్తాను. ‘మీరు నా ప్రజలు’ అని నేను అంటాను. అప్పుడు వారు ఇలా అంటారు: ‘యెహోవా మా దేవుడు.’”
16 “మీ విశ్వాసం చెదిరిపోకూడదని ఈ విషయాలన్నీ మీకు చెప్పాను. 2 వాళ్ళు మిమ్మల్ని సమాజ మందిరాల నుండి వెలి వేస్తారు. నిజం చెప్పాలంటే, మిమ్మల్ని చంపితే దేవుని సేవ చేసిన దానితో సమానంగా భావించే కాలం వస్తుంది. 3 వాళ్ళకు నా గురించి కాని, తండ్రిని గురించి కాని, తెలియదు కనుక అలా చేస్తారు. 4 ఆ సమయం వచ్చినప్పుడు నేను హెచ్చరించినట్లు మీకు జ్ఞాపకం ఉండాలని ఈ విషయం చెపుతున్నాను. ఇన్నాళ్ళు మీతో ఉన్నాను. కనుక మీకీ విషయం మొదట చెప్పలేదు.
పవిత్రాత్మ చేసిన క్రియలు
5 “కాని యిప్పుడు నేను నన్ను పంపిన వాని దగ్గరకు వెళ్తున్నాను. కాని మీలో ఒక్కరైనా నేను ఎక్కడికి వెళ్తున్నానని అడగలేదు. 6 నేను ఈ విషయం చెప్పటంవల్ల మీ హృదయాలు దుఃఖంతో నిండిపోయాయి. 7 కాని నేను వెళ్ళటం మీ మంచి కోసమే. ఇది నిజం. నేను వెళ్ళకపోతే మీకు సహాయం చెయ్యటానికి ఆదరణకర్త రాడు. నేను వెళ్తే ఆయన్ని పంపగలను.
8 “ఆయన వచ్చాక పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ప్రపంచాన్ని ఒప్పింప చేస్తాడు. 9 ప్రజలు నన్ను విశ్వసించలేదు కనుక వాళ్ళలో ‘పాపం’వుందని రుజువు చేస్తాడు. 10 మీరు చూడలేని చోటికి, అంటే తండ్రి దగ్గరకు, వెళ్తున్నాను. కనుక తండ్రితో నాకున్న సంబంధాన్ని ఆయన రుజువు చేస్తాడు. 11 కనుక నీతి విషయంలో ఈ లోకాధికారియైన సైతానుకు ఇదివరకే శిక్ష విధింపబడింది. కనుక ‘తీర్పు’ విషయంలో ఒప్పింప చేస్తాడు.
12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. 14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. 15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.
దుఃఖము సంతోషముగా మారటం
16 “కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు. ఆ తదుపరి మరి కొంత కాలం గడిచాక మీరు నన్ను చూస్తారు.”
17 ఆయన శిష్యుల్లో కొందరు, “‘కొంత కాలం గడిచాక మీరు నన్ను చూడరు’ అని అనటంలోను మరియు, ‘మరి కొంత కాలం గడిచాక మీరు మళ్ళీ నన్ను చూస్తారు’ అని అనటంలో అర్థమేమిటి? పైగా ‘నేను తండ్రి దగ్గరకు వెళ్తున్నాను’ అని అంటున్నాడే! అంటే ఏమిటి?” అని పరస్పరం మాట్లాడుకున్నారు. 18 “‘కొంత కాలం’ తర్వాత అని అనటంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? ఆయనేమంటున్నాడో అర్థం కావటం లేదు!” అని వాళ్ళు మళ్ళీ మళ్ళీ అనుకొన్నారు.
19 ఈ విషయాన్ని గురించి వాళ్ళడగాలని అనుకుంటున్నారని యేసు గ్రహించాడు. అందువలన ఆయన వాళ్ళతో ఈ విధంగా అన్నాడు, “‘కొంత కాలం గడిచాక నన్ను చూడరు, మరి కొంత కాలం గడిచాక నన్ను చూస్తారు’ అని నేనటంలో అర్థమేమిటని పరస్పరం మాట్లాడుకుంటున్నారా? 20 మీరు దుఃఖిస్తున్నప్పుడు ప్రపంచం ఆనందిస్తుంది. మీ మనస్సుకు చాలా బాధ కలుగుతుంది. కాని మీ దుఃఖం ఆనందంగా మారుతుంది. ఇది నిజం.
21 “ప్రసవించే సమయం వచ్చినప్పుడు గర్భంతో ఉన్న స్త్రీ నొప్పులు అనుభవిస్తుంది. శిశువు పుట్టాక ఒక జీవిని ఈ ప్రపంచంలోకి తెచ్చిన ఆనందంలో తన వేదన మరచి పోతుంది. 22 అదే విధంగా యిది మీరు దఃఖించే సమయం. కాని నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అప్పుడు మీ హృదయాలు ఆనందంతో నిండిపోతాయి. ఆ ఆనందాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. 23 ఆ రోజు మీరు నన్ను ఏమీ అడగరు. ఇది నిజం. నా పేరిట మీరేది అడిగినా తండ్రి మీకిస్తాడు. 24 ఇంత కాలం మీరు నా పేరిట ఏమీ అడగలేదు. ‘అడగండి; మీకు లభిస్తుంది’ అప్పుడు మీకు సంపూర్ణమైన ఆనందం కలుగుతుంది.
లోకముపై జయము
25 “నేను యింతవరకూ ఉపమానాలతో మాట్లాడుతూ వచ్చాను. కాని యిలాంటి భాష ఉపయోగించకుండా నేను స్పష్టంగా మాట్లాడే సమయం వస్తోంది. అప్పుడు నేను మీకు తండ్రిని గురించి స్పష్టంగా చెబుతాను. 26 ఆ రోజు మీరు నా పేరిట తండ్రిని అడుగుతారు. మీ పక్షాన నేను తండ్రిని అడుగుతున్నానని అనటం లేదు. 27 నేను తండ్రి నుండి వచ్చానని మీరు నమ్మారు. మీకు నా పట్ల ప్రేమ ఉంది. కనుక తండ్రికి స్వయంగా మీ పట్ల ప్రేమ ఉంది. 28 నేను తండ్రి నుండి ఈ ప్రపంచంలోకి వచ్చాను. ఇప్పుడు నేనీ ప్రపంచాన్ని వదిలి తండ్రి దగ్గరకు వెళ్తున్నాను.”
29 శిష్యులు, “ఇప్పుడు మీరు ఉపమానాల ద్వారా కాకుండా స్పష్టంగా మాట్లాడుతున్నారు. 30 మీకు అన్నీ తెలుసునని మేము ఇప్పుడు గ్రహించాము. ఎవరునూ మీకు ప్రశ్న వేయవలసిన అవసరం లేదు. అందువల్ల మీరు దేవుని నుండి వచ్చారని విశ్వసిస్తున్నాము” అని అన్నారు.
31 యేసు, “చివరకు నమ్ముతున్నారన్న మాట! 32 మీరు నన్ను ఒంటరిగా ఒదిలి మీమీ యిండ్లకు వెళ్ళే సమయం రానున్నది. ఇప్పుడే వచ్చింది. నా తండ్రి నాతో ఉన్నాడు. కనుక నేను ఒంటరిగా ఉండను.
33 “నా ద్వారా మీకు శాంతి కలగాలని యివన్నీ మీకు చెప్పాను. ఈ ప్రపంచంలో మీకు కష్టాలు కలుగుతాయి. కాని ధైర్యంగా ఉండండి. నేను ప్రపంచాన్ని జయించాను” అని అన్నాడు.
© 1997 Bible League International