M’Cheyne Bible Reading Plan
ఆలయ సేవకై లేవీయులకు ఏర్పాట్లు
23 దావీదు ముసలివాడయ్యాడు. అందువల్ల అతడు తన కుమారుడైన సొలొమోనును ఇశ్రాయేలుకు కొత్త రాజుగా చేసాడు. సొలొమోను దావీదు కుమారుడు. 2 ఇశ్రాయేలు పెద్దలందరినీ దావీదు పిలిపించాడు. అతడు యాజకులను, లేవీయులను కూడ పిలిచాడు. 3 లేవీయులలో ముఫైయేండ్ల వారిని, అంతకు పైబడిన వయస్సు వారిని దావీదు లెక్కించాడు. ఆ లేవీయులు మొత్తం ముప్పై ఎనిమిది వేలమంది వున్నారు. 4 దావీదు ఇలా చెప్పాడు: “ఇరవై నాలుగు వేలమంది లేవీయులు దేవాలయ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఆరువేల మంది రక్షక భటులుగాను, న్యాయాధిపతులుగాను వ్యవహరిస్తారు. 5 నాలుగు వేల మంది లేవీయులు ద్వారపాలకులుగా పనిచేస్తారు. మరి నాలుగు వేలమంది లేవీయులు ఆలయ గాయకులుగా వుంటారు. వారికొరకు నేను ప్రత్యేక వాద్యపరికరాలను సిద్ధం చేశాను. వారా వాద్య విశేషాలను యెహోవాను స్తుతించటానికి వినియోగిస్తారు.”
6 దావీదు లేవీయులను మూడు వర్గాలుగా విభజించాడు. ఆ మూడు వర్గాలకు లేవీ ముగ్గురు కుమారులు ఆధిపత్యం వహించారు. గెర్షోను, కహాతు, మెరారి అని ఆ ముగ్గురు కుమారుల పేర్లు.
గెర్షోను వంశం
7 లద్దాను, షిమీ అనేవారు గెర్షోను వంశంలోని వారు. 8 లద్దానుకు ముగ్గురు కుమారులు. అతని పెద్ద కుమారుని పేరు యెహీయేలు. అతని మిగిలిన కుమారుల పేర్లు జేతాము, యోవేలు. 9 షిమీ కుమారులు షెలోమీతు, హజీయేలు, హారాను అనువారు. ఈ ముగ్గురు కుమారులు లద్దాను వంశంలో పెద్దలు.
10 షిమీకి మరి నలుగురు కుమారులు. వారి పేర్లు యహతు, జీజా,[a] యూషు, బెరీయా. 11 యహతు పెద్ద కుమారుడు. జీజా రెండువవాడు. కాని యూషుకు, బెరీయాకు ఎక్కువ మంది పిల్లలు లేరు. కావున యూషు, బెరీయా లిరువురూ ఒకే కుటుంబంగా పరిగిణింపబడ్డారు.
కహాతు సంతతివారు
12 కహాతుకు నలుగురు కుమారులు. వారు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. 13 అమ్రాము కుమారుల పేర్లు అహరోను, మోషే. అహరోను చాలా ప్రత్యేకమైన వ్యక్తిగా చూడబడ్డాడు. అహరోను, అతని సంతతి వారు ఎల్లకాలమూ ప్రత్యేకమైన వ్యక్తులుగానే ఎంపిక చేయబడ్డారు. వారు శాశ్వత ప్రాతిపదికపై యాజకులుగా వుండటానికి ప్రత్యేకింపబడ్డారు. అందువల్లనే వారు శాశ్వతంగా వేరుచేయబడ్డారు. అహరోను, అతని సంతతి వారు యెహోవా ముందు ధూపం వేయటానికి నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. వారు యాజకులుగా యెహోవా సేవకు నియమితులయ్యారు. ఎల్లకాలమూ యెహోవా పేరుమీద వారు ప్రజలను ఆశీర్వదించటానికి ఎంపిక చేయబడ్డారు.
14 మోషే దైవజనుడు. మోషే కుమారులు కూడ లేవి వంశానికి చెందినవారుగానే పరిగణింపబడ్డారు. 15 గెర్షోము, ఎలీయెజెరు అనువారు మోషే కుమారులు. 16 గెర్షోము పెద్ద కుమారుని పేరు షూబాయేలు.[b] 17 ఎలీయెజెరు మొదటి కుమారుని పేరు రెహబ్యా. ఎలీయెజెరుకు కుమారులు మరెవ్వరూ లేరు. కాని రెహబ్యాకు మాత్రం చాలామంది కుమారులు కలిగారు.
18 ఇస్హారు పెద్ద కుమారుని పేరు షెలోమీతు.
19 హెబ్రోను పెద్ద కుమారుని పేరు యెరీయా. హెబ్రోను రెండవ కుమారుడు అమర్యా. మూడవవాడు యహజీయేలు. నాల్గవవాని పేరు యెక్మెయాము.
20 ఉజ్జీయేలు పెద్ద కుమారుని పేరు మీకా. రెండవవాడు యెషీయా.
మెరారి సంతతివారు
21 మెరారి కుమారులు మహలి, మూషి అనేవారు. మహలి కుమారుల పేర్లు ఎలియాజరు, కీషు. 22 ఎలియాజరు కుమారులు లేకుండగనే మరణించాడు. అతనికి కేవలం కుమార్తెలు మాత్రం వున్నారు. ఎలియాజరు కుమార్తెలు తమ బంధువులనే వివాహమాడారు. కీషు కుమారులు వారి బంధువులు. 23 మూషి కుమారులు మహలి, ఏదెరు, యెరీమోతు అనే ముగ్గురు.
లేవీయుల పని
24 లేవి సంతతివారు వారి వారి వంశకర్తలననుసరించి లెక్కింపబడ్డారు. వారు తమ తమ కుటుంబాలకు పెద్దలు. ప్రతి ఒక్కని పేరు పట్టికలో వ్రాయబడింది. అలా ఎంచబడిన వారిలో ఇరవై ఏండ్లవారు, అంతకు పైబడిన వయస్సువారు వున్నారు. వారు దేవాలయంలో సేవ చేశారు.
25 దావీదు ఇలా అన్నాడు: “ఇశ్రాయేలు దేవుడగు యెహోవా తన ప్రజలకు శాంతి సమకూర్చిపెట్టాడు. యెహోవా ఇశ్రాయేలులో శాశ్వతంగా వుండటానికి వచ్చాడు. 26 కావున లేవీయులు ఇక మీదట పవిత్ర గుడారాన్ని గాని, దేవుని సేవలో వినియోగించే ఇతర పరికరాలను గాని మోసే పనిలేదు.”
27 దావీదు ఇశ్రాయేలు వారికి లేవి వంశంవారిని లెక్కించుమని చివరిసారిగా ఆజ్ఞ ఇచ్చాడు. వారు లేవీయులలో ఇరవై ఏండ్లు, అంతకు పైబడిన వారిని లెక్కించారు.
28 అహరోను సంతతివారికి లేవీయులు ఆలయంలో యెహోవా సేవలో తోడ్పడేవారు. వారు ఆలయ ఆవరణ, పక్క గదుల పరిశుభ్రత విషయంలో కూడ శ్రద్ధ తీసుకొనేవారు. అన్ని పవిత్ర వస్తువులను అపవిత్రపడకుండ చూసేవారు. ఆ విధంగా దేవాలయంలో సేవ చేయటం వారి పని. 29 ప్రత్యేకంగా తయారుచేసిన రొట్టెను అర్పణగా ఆలయంలో బల్ల మీద వుంచటం వారి బాధ్యత. పిండి తయారు చేయటం, ధాన్యార్పణను చెల్లించటం, పులియనిరొట్టె తయారుచేయటం కూడ వారి బాధ్యత. రొట్టెలుచేసే పెనాలు, రకరకాల కలగలుపు అర్పణల విషయంలో వారు శ్రద్ధ తీసుకొనేవారు. ఆయా ద్రవ్యాల కొలతల విషయంలో కూడ వారు జాగ్రత్త తీసుకొనే వారు. 30 లేవీయులు ప్రతి ఉదయం నిలబడి యెహోవాకి కృతజ్ఞతాస్తుతులు అర్పించి, స్తుతి పాటలు పాడేవారు. వారలా ప్రతి సాయత్రం కూడ చేసేవారు. 31 ప్రత్యేక విశ్రాంతి దినాలలోను, అమావాస్య విందుల సమయంలోను మరియు ప్రత్యేక సెలవు దినాలలోను లేవీయులు యెహోవాకి దహన బలులు సమర్పించే వారు. వారు నిత్యం యెహోవా సన్నిధిలో సేవ చేసేవారు. ప్రతిసారీ ఎంతమంది లేవీయులు సేవ చేయాలి అనే విషయంలో వారికి ప్రత్యేక నియమాలుండేవి. 32 కావున తాము ఏఏ పనులు చేయాలో అవన్నీ లేవీయులు నిర్వహించేవారు. వారు పవిత్ర గుడారం, పవిత్ర స్థలాల విషయంలో కూడ తగిన జాగ్రత్తలు తీసుకొనేవారు. ఆ విధంగా వారి బంధువులగు అహరోను వంశీయులకు వారు సహాయపడ్డారు. అహరోను సంతతివారెవరనగా యాజకులు, ప్రధాన యాజకులు. ఆలయంలో యెహోవా సేవలో ఈ యాజకులకు లేవీయులు సహాయపడ్డారు.
మారిన జీవితాలు
4 క్రీస్తు శారీరకమైన బాధననుభవించాడు గనుక మీరు కూడా ఆ గుణాన్ని ఆయుధంగా ధరించండి. 2 ఎందుకంటే శారీరకమైన బాధననుభవించే వ్యక్తి తన మిగతా భౌతిక జీవితాన్ని, మానవులు కోరే దురాశల్ని తీర్చుకోవటానికి ఉపయోగించకుండా దైవేచ్ఛ కోసం ఉపయోగిస్తాడు. అలాంటివానికి పాపంతో సంబంధముండదు. 3 గతంలో మీరు యూదులుకాని వాళ్ళవలే పోకిరి చేష్టలకు, దురాశకు, త్రాగుడుకు, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుడు విందులకు, చేయతగని విగ్రహారాధనలకులోనై జీవించారు. వారి ఇష్టము నెరవేర్చుచుండుటకు గడచిన కాలమే చాలును.
4 కాని ప్రస్తుతం మీరు వాళ్ళవలె మితిమీరిన దుష్ప్రవర్తనకు లోనై వాళ్ళతో సహ పరుగెత్తనందుకు, వాళ్ళు ఆశ్చర్యపడి మిమ్మల్ని దూషిస్తున్నారు. 5 అయితే చనిపోయినవాళ్ళ మీద బ్రతికియున్నవాళ్ళ మీద, తీర్పు చెప్పే ఆ దేవునికి వాళ్ళు సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. 6 ఈ కారణంగానే సువార్త ఇప్పుడు చనిపోయినవాళ్ళకు కూడా ప్రకటింపబడింది. వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా జీవించాలని దేవుడు మానవులపై తీర్పుచెప్పినట్లుగానే వాళ్ళమీద కూడా తీర్పు చెపుతాడు.
దేవుని వరాలకు మంచి నిర్వాహకులుగా ఉండండి
7 అన్నీ అంతమయ్యే సమయం దగ్గరకు వచ్చింది. అందువల్ల స్థిరబుద్ధితో, ఆత్మనిగ్రహంతో ఉండండి. అప్పుడే మీరు ప్రార్థించ గలుగుతారు. 8 అన్నిటికన్నా ముఖ్యంగా, “ప్రేమ” పాపాలన్నిటినీ కప్పివేస్తుంది గనుక పరస్పరం హృదయపూర్వకంగా ప్రేమించుకోండి. 9 సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. 10 ప్రతి ఒక్కడూ ఆత్మీయంగా తాను పొందిన వరాన్ని యితర్ల సేవ చేయటానికి ఉపయోగించాలి. అనేక రకాలుగా లభించిన ఈ దైవానుగ్రహాన్ని విశ్వాసంతో ఉపయోగించాలి. 11 మాట్లాడాలని అనుకున్నవాడు దైవసందేశానుసారం మాట్లాడాలి. సేవ చేయదలచినవాడు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి సేవ చెయ్యాలి. అలా చేస్తే, శాశ్వతంగా తేజోవంతుడూ, శక్తివంతుడూ అయినటువంటి దేవుణ్ణి యేసు క్రీస్తు ద్వారా అన్ని విషయాల్లో స్తుతించినట్లు అవుతుంది.
క్రీస్తు అనుచరుడిగా శ్రమపడటం
12 నా ప్రియమైన సోదరులారా! మీకు అగ్నిపరీక్ష జరుగుతోంది. తద్వారా ఏదో జరుగరానిది జరిగినట్లు ఆశ్చర్యపడకండి. 13 క్రీస్తు కష్టాల్లో మీరు పాలు పంచుకుంటున్నందుకు ఆనందించండి. అలా చేస్తే ఆయన మహిమ వ్యక్తమైనప్పుడు మీరు చాలా ఆనందిస్తారు. 14 ఒకవేళ క్రీస్తు పేరు కారణంగా మీకు అవమానం కలిగితే, మీరు ధన్యులు. అంటే దేవుని తేజోవంతమైన ఆత్మ మీలో ఉన్నాడన్నమాట. 15 హత్య చేసి కాని, దొంగతనం చేసి కాని, దుర్మార్గంగా ప్రవర్తించి గాని, లేక యితర్ల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వలన కాని, మీరు శిక్షను అనుభవించకూడదు. 16 మీరు క్రైస్తవులైనందువలన శిక్షననుభవించవలసివస్తే సిగ్గుపడనవసరం లేదు. మీరు క్రైస్తవులైనందుకు దేవుణ్ణి స్తుతించండి. 17 ఎందుకంటే, తీర్పు చెప్పే సమయం దగ్గరకు వచ్చింది. మొదట దేవుని కుటుంబానికి చెందిన వాళ్ళ మీద తీర్పు చెప్పబడుతుంది. మరి ఆ తీర్పు మనతో ప్రారంభమైతే దేవుని సువార్తను నిరాకరించిన వాళ్ళగతేమౌతుంది? 18 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“నీతిమంతులకే రక్షణ లభించటం కష్టమైతే,
నాస్తికుని గతి, పాపాత్ముని గతి ఏమౌతుంది?”(A)
19 అందువలన, దైవేచ్ఛ ప్రకారం కష్టాలనుభవించేవాళ్ళు, విశ్వసింప దగిన సృష్టికర్తకు తమను తాము అర్పించుకొని సన్మార్గంలో జీవించాలి.
ప్రజల దుష్ట పథకాలు
2 పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి.
ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు.
తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు.
ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తి ఉంది.
2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు.
వారు ఇండ్లను కోరి వాటిని ఆక్రమిస్తారు.
వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు.
వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు.
ప్రజలను శిక్షించటానికి యెహోవా పథకం
3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను.
మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు.
మీరు గర్వంగా నడవలేరు.
ఎందుకంటే అది కీడుమూడే సమయం.
4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు.
ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు:
‘మేము నాశనమయ్యాము!
యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు.
అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు.
యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు.
5 ప్రజలు మీ భూమిని కొలవలేరు.
భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు.
ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’”
మీకాను ఇక బోధించవద్దనటం
6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు.
మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు.
మాకు ఏ కీడూ జరుగబోదు.”
7 కాని, యాకోబు వంశీయులారా!
నేనీ విషయాలు చెప్పాలి.
మీరు చేసిన పనుల పట్ల
యెహోవా కోపగిస్తున్నాడు.
మీరు ధర్మంగా ప్రవర్తిస్తే
నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని.
8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు.
దారిన పోయే వారివద్దనుండి మీరు బట్టలు దొంగిలిస్తారు.
ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు.
కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.
9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన,
సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు.
వారి చిన్నపిల్లల మధ్యనుండి
నా మహిమను మీరు తీసివేశారు.
10 లేచి వెళ్లిపొండి!
ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు!
మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!
11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు,
“నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు.
అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!
యెహోవా తన ప్రజలను ఒక్క చోటికి చేర్చటం
12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను.
ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను.
దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోని మందల్లా, వారిని నేను సమకూర్చుతాను.
అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.
13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి, తన ప్రజల ముందుకు వస్తాడు.
ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు.
వారి రాజు వారిముందు నడుస్తాడు.
యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.
యేసు ప్రార్థన గురించి బోధించటం
(మత్తయి 6:9-15)
11 ఒక రోజు యేసు ఒక చోట ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థించటం ముగించాక ఆయన శిష్యుల్లో ఒకడు, “ప్రభూ! యోహాను తన శిష్యులకు ప్రార్థించటం నేర్పించినట్లు మాక్కూడా ప్రార్థించటం నేర్పండి” అని అడిగాడు.
2 ఆయన వాళ్ళతో, “మీరు ఈ విధంగా ప్రార్థించాలి:
‘తండ్రీ! నీ పేరు పవిత్రంగానే ఉండాలి!
నీ రాజ్యం రావాలి!
3 మాకు ప్రతి రోజు ఆహారం యివ్వు!
4 మా పట్ల పాపం చేసిన వాళ్ళను మేము క్షమించినట్లు
మా పాపాలు క్షమించు.
మమ్మల్ని శోధనలో పడనివ్వవద్దు!’”
నీకు కావల్సినవాటికై దేవుని అడుగుము
(మత్తయి 7:7-11)
5-6 ఆ తర్వాత ఆయన వాళ్ళతో, “ఒక వేళ మీలో ఒకడు అర్ధరాత్రివేళ తన స్నేహితుని యింటికి వెళ్ళి, ‘నా స్నేహితుడు ఒకడు అకస్మాత్తుగా మా యింటికొచ్చాడు. మా యింట్లో తినటానికి ఏమి లేదు. మూడు రొట్టెలుంటే యిస్తావా?’ అని అడిగాడనుకొండి. 7 ఆ స్నేహితుడు యింటి నుండి బయటకు రాకుండా, ‘నేను, నా పిల్లలు పడుకున్నాం. తలుపులు కూడా తాళం వేసాం. అనవసరంగా బాధ పెట్టొద్దు. అయినా యిప్పుడు లేచి నేను రొట్టెలివ్వలేను’ అని అన్నాడనుకోండి. నేను చెప్పేదేమిటంటే, 8 అతడు తన స్నేహితుడైనందుకు రొట్టెలు యివ్వకపోయినా మొండిగా అడగటం వల్ల తప్పక లేచి అతడడిగిన రొట్టెలు యిస్తాడు. 9 కనుక, నేను మీకు చెప్పేదేమంటే; అడగండి, మీకు లభిస్తుంది. వెతకండి దొరుకుతుంది. తలుపు తట్టండి, అది మీకోసం తెరుచుకుంటుంది. 10 ఎందుకంటే, అడిగిన ప్రతి ఒక్కనికి లభిస్తుంది. వెతికిన వానికి దొరుకుతుంది. తలుపు తడితే అది అతని కోసం తెరుచుకుంటుంది. 11 మీలో ఏ తండ్రి తన కుమారుడు చేప నడిగితే, చేపకు బదులుగా పామునిస్తాడు? 12 లేక గ్రుడ్డునడిగితే తేలునిస్తాడు? 13 మీరు చెడ్డవాళ్లైనా మీ కుమారులకు మంచి బహుమతులు ఎట్లా యివ్వాలో మీకు తెలుసు. కనుక పరలోకంలో ఉన్న మీ తండ్రి తన్నడిగినవాళ్ళకు పవిత్రాత్మను తప్పక యిస్తాడని గ్రహించండి” అని చెప్పాడు.
యేసుని శక్తి దేవునినుండి వచ్చినది
(మత్తయి 12:22-30; మార్కు 3:20-27)
14 ఒక రోజు యేసు ఒక మూగ దయ్యాన్ని పారద్రోలుతూ ఉన్నాడు. ఆ దయ్యం వెళ్ళిపోగానే అది పట్టిన మనిషి మాట్లాడటం మొదలు పెట్టాడు. అది చూసి ప్రజలు దిగ్భ్రాంతి చెందారు. 15 కొందరు, “బయెల్జెబూలు అనే దయ్యాలరాజు ద్వారా అతడు దయ్యాల్ని పారద్రోలుతున్నాడు” అని అన్నారు.
16 మరి కొందరు యేసును పరీక్షించుచూ ఒక అద్భుతం పరలోకం నుండి చూపుమని అడిగారు. 17 యేసుకు వాళ్ళ అభిప్రాయం తెలిసిపోయింది. అందువల్ల వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “చీలికలు కలిగిన యిల్లు పడిపోతుంది. 18 సైతానురాజ్యంలో చీలికలు కలిగితే వాని రాజ్యం ఎలా నిలుస్తుంది? ఇలా ఎందుకు అంటున్నానంటే బయెల్జెబూలు సహాయంతో నేను దయ్యాల్ని వదిలిస్తున్నానని మీరు అంటున్నారు. 19 నేను బయెల్జెబూలు ద్వారా దయ్యాల్ని వదిలిస్తున్నట్లైతే, మీ వాళ్ళు దేని సహయంతో దయ్యాల్ని వదిలిస్తున్నారు? అందువల్ల మీ వాదన తప్పని మీ వాళ్ళే రుజువు చేస్తున్నారు. 20 కాని నేను దైవశక్తితో దయ్యాల్ని వదిలిస్తున్నాను కనుక, దేవుని రాజ్యం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తొంది.
21 “ఒక బలవంతుడు ఆయుధాల్ని ధరించి తన యింటిని కాపలా కాస్తే అతని యింట్లోని వస్తువులు భధ్రంగా ఉంటాయి. 22 కాని అతని కన్నా బలవంతుడు వచ్చి మీదపడి అతన్ని ఓడిస్తే అతడిన్నాళ్ళు నమ్ముకున్న ఆయుధాలన్నీ ఇంటివానియొద్ద నుండి తీసుకొని, ఆదోచుకొన్న వస్తువుల్ని అందరికి పంచి పెడ్తాడు.
23 “నాతో ఉండని వాడు నాకు వ్యతిరేకంగా ఉన్న వానితో సమానము. నాతో కలిసి గొఱ్ఱెల్ని ప్రోగుచేయటానికి సహాయం చెయ్యనివాడు వాటిని చెదరగొట్టిన వానితో సమానము.
శూన్యమై ఉండుట అపాయము
(మత్తయి 12:43-45)
24 “దయ్యము ఒక మనిషి నుండి వెలుపలికి వచ్చాక విశ్రాంతి కోసం నీరులేని స్థలాల్లో వెతుకుతుంది. కాని దానికి విశ్రాంతి లభించదు. అప్పుడది, ‘నేను వదిలి వచ్చిన యింటికి వెళ్తాను’ అని అనుకుంటుంది. 25 అక్కడికి వెళ్ళాక ఆ యిల్లు ఊడ్చబడి వుండటం ఎక్కడి వస్తువులక్కడ సక్రమంగా వుండటం చూస్తుంది. 26 అది మళ్ళీ బయటికి వెళ్ళి తనకన్నా దుర్మార్గులైన ఏడు దయ్యాలను తనవెంట తీసుకువస్తుంది. ఆ దయ్యాలన్నీ కలిసి ఆ యింట్లో నివసించటానికి వెళ్తాయి. అప్పుడు ఆ మనిషి స్థితి మొదటిస్థితికన్నా అధ్వాన్నంగా ఉంటుంది.”
దేవుడు దీవించు జనులు
27 యేసు ఈ విషయాలు చెబుతుండగా ప్రజల్లో ఒక స్త్రీ బిగ్గరగా, “నిన్ను కని, పెంచిన ఆ తల్లి ధన్యురాలు” అని అన్నది.
28 ఆయన, “అవునుగాని, దైవసందేశం విని దాన్ని పాటించే వాళ్ళు ఇంకా ధన్యులు” అని సమాధానం చెప్పాడు.
కొందరు యేసు అధికారాన్ని సందేహించటం
(మత్తయి 12:38-42; మార్కు 8:12)
29 ప్రజల గుంపు పెరుగుతూ పోయింది. యేసు ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: “ఈ కాలం వాళ్ళు చెడ్డవాళ్ళు, గనుక అద్భుతాలు అడుగుతారు. దేవుడు యోనాను పంపి యిచ్చిన రుజువు తప్ప, మరే రుజువు మీకు యివ్వబడదు. 30 ఎందుకంటే, నీనెవె ప్రజలకు యోనా ఏ విధంగా ఒక రుజువో అదే విధంగా మనుష్యకుమారుడు ఈ తరం వాళ్ళకు ఒక రుజువు.
31 “దక్షిణ దేశపు రాణి సొలొమోను రాజు బోధిస్తున్న జ్ఞానాన్ని వినటానికి చాలా దురం నుండి వచ్చింది. కాని యిప్పుడు సొలోమోను కన్నా గొప్పవాడు యిక్కడున్నాడు. ఈనాటి ప్రజలు ఆయన మాటలు వినటం లేదు. కనుక తీర్పు చెప్పబడే రోజు ఆ రాణి వీళ్ళతో సహా నిలబడి వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తుంది.
32 “నీనెవె ప్రజలు యోనా బోధనలు విని మారుమానస్సు పొందారు. కనుక తీర్పు చెప్పబడే రోజున వాళ్ళు ఈనాటి ప్రజలతో సహా నిలుచొని వీళ్ళు తప్పు చేశారని నిరూపిస్తారు. కాని యిప్పుడు యోనా కన్నా గొప్పవాడు ఇక్కడున్నాడు.
దేహం యొక్క వెలుగు
(మత్తయి 5:15; 6:22-23)
33 “దీపాన్ని వెలిగించి, యింటికి వచ్చే పోయే వాళ్ళకు కనిపించేలా ఒక ఎత్తైన బల్ల మీద పెడ్తాము కాని, గంప క్రింద దాచి ఉంచము. 34 మీ కళ్ళు దేహానికి దీపం లాంటివి. మీ కళ్ళు బాగుంటే మీ దేహమంతా కాంతితో వెలుగుతుంది. కాని, అవి చెడిపోతే, మీ దేహమంతా చీకటైపోతుంది. 35 అందువలన మీలో ఉన్న వెలుగు చీకటైపోకుండా చూసుకొండి. 36 మీ దేహమంతా కొంచెం కూడా చీకటిలో లేకుండా వెలుగుతూ ఉంటే అది సంపూర్ణంగా వెలుగుతూ ఉంటుంది. ఆ దేహం దీపపు వెలుగు ప్రకాశించినట్లు ప్రకాశిస్తుంది.”
యేసు పరిసయ్యుల్ని, శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 20:45-47)
37 యేసు మాట్లాడటం ముగించాడు. ఒక పరిసయ్యుడు యేసును తన యింటికి ఆహ్వానించాడు. యేసు అతని యింటికి వెళ్ళి భోజనానికి కూర్చుని ఉన్నాడు. 38 యేసు భోజనానికి ముందు చేతులు కడుక్కోకుండా కూర్చోవటం గమనించి పరిసయ్యునికి ఆశ్చర్యం వేసింది. 39 అప్పుడు ప్రభువు అతనితో, “మీ పరిసయ్యులు గిన్నెల్ని, పళ్ళేల్ని వెలుపలి భాగం శుభ్రం చేస్తారు. కాని లోపల దురాశ, దుష్టత్వము నిండివుంటాయి. 40 మూర్ఖులారా! వెలుపలి భాగం సృష్టించిన వాడే లోపలి భాగం సృష్టించలేదా? 41 మీరు దాచుకున్న వాటిని పేదవాళ్ళకు దానం చెయ్యండి. అప్పుడు మీరు పూర్తిగా శుభ్రమౌతారు.
42 “మీరు మీ తోటలో పండిన పుదీనా, సదాప మొదలగు కూరగాయల యొక్క పదవవంతు దేవునికి యిస్తారు. కాని న్యాయాన్ని, దేవుని ప్రేమని నిర్లక్ష్యం చేస్తున్నారు. కనుక మీకు శ్రమ. పదవవంతు ఇవ్వటం మానుకోకుండా న్యాయాన్ని, దేవుని ప్రేమను కూడా అలవరచుకోవలసింది.
43 “మీరు సమాజ మందిరాల్లో ఉన్నత స్థలాల్లో కూర్చోవటానికోసం ప్రాకులాడుతారు. దారి మీద వెళ్తూవుంటే ప్రజలు గౌరవమివ్వాలని ఆశిస్తారు. కనుక మీకు శ్రమ తప్పదు. 44 ప్రజలు తమకు తెలియకుండా త్రొక్కుతూ నడిచే సమాధుల్లాంటి వాళ్ళు మీరు. మీకు శ్రమ తప్పదు” అని అన్నాడు.
45 ధర్మశాస్త్రంలో పాండిత్యం ఉన్న ఒకడు లేచి, “బోధకుడా! మీరీ విధంగా మాట్లాడి మమ్మల్ని కూడా అవమానిస్తున్నారు” అని అన్నాడు.
46 యేసు, “ధర్మశాస్త్ర పండితులారా! మీరు ప్రజలపై వాళ్ళు మోయలేని భారం వేస్తున్నారు. కాని వాటిని లేపటానికి మీరు ఒక్క వ్రేలు కూడా కదల్చరు. కనుక మీకు శ్రమ తప్పదు. 47 మీరు ప్రవక్తల కోసం సమాధులు కట్టిస్తారు. కాని మీ పూర్వికులు వాళ్ళను చంపారు. కనుక మీకు శిక్ష తప్పదు. 48 అంటే పూర్వికులు చేసిన దాన్ని అంగీకరిస్తున్నట్లు నిరూపించుకొంటున్నారన్న మాట. వాళ్ళు ప్రవక్తల్ని చంపారు. మీరు సమాధులు కట్టించారు. 49 అందువల్లే దేవుడు దివ్యజ్ఞానంతో ఈ విధంగా చెప్పాడు: ‘నేను వాళ్ళకోసం ప్రవక్తల్ని, అపొస్తలులను పంపుతాను. కొందర్ని వాళ్ళు చంపుతారు. మిగతా వాళ్ళను హింసిస్తారు.’
50 “అందువలన ప్రపంచం పుట్టిన నాటినుండి ప్రవక్తలు కార్చిన రక్తానికి ఈ తరం వాళ్ళు బాధ్యులు. 51 హేబెలు హత్య మొదలుకొని ధూప వేదికకు, మందిరానికి మధ్య చంపబడిన జెకర్యా హత్యదాకా వీళ్ళు బాధ్యులు. ఔను. ఈ కాలం వాళ్ళు వీటికి బాధ్యులని నేను చెబుతున్నాను.
52 “ధర్మశాస్త్ర పండితులారా! జ్ఞానం యొక్క తాళం చెవి మీరు తీసుకున్నారు. దాని తలుపులు తెరిచి మీరు లోనికి వెళ్ళలేరు. పైగా వెళ్తున్న వాళ్ళను అడ్డగిస్తారు. మీకు శిక్ష తప్పదు” అని చెప్పాడు.
53 యేసు అక్కడినుండి వెళ్ళిన తర్వాత పరిసయ్యులును, శాస్త్రులును ఆయనను ఇంకా ఎక్కువగా వ్యతిరేకించారు. ప్రశ్నలతో ఆయన్ని వేధించారు. 54 ఆయనను మాటలలో చిక్కించాలని ప్రయత్నించారు.
© 1997 Bible League International