M’Cheyne Bible Reading Plan
22 “యెహోవా దేవుని ఆలయం మరియు దహనబలులకు బలిపీఠం ఇశ్రాయేలు ప్రజల ఉపయోగార్థం ఇక్కడ నిర్మింపబడతాయి” అని దావీదు అన్నాడు.
ఆలయ నిర్మాణానికి దావీదు ప్రణాళిక
2 ఇశ్రాయేలులో వుంటున్న అన్యజాతి వారందరినీ ఒకచోట చేరుమని దావీదు ఉత్తరువు ఇచ్చాడు. వారిలో నుండి రాళ్లు కొట్టే వారిని ఎంపిక చేశాడు. దేవాలయ నిర్మాణానికి రాళ్లు చెక్కి సిద్ధం చేయటం వారి పని. 3 దేవాలయ ద్వారపు తలుపులకు, బందులకు, మేకులకు కావలసిన ఇనుమును దావీదు సేకరించాడు. బరువు తూకం వేయలేనంత కంచును కూడ దావీదు సమకూర్చాడు. 4 దావీదు ఇంకా లెక్కలేనన్ని దేవదారు దూలాలను కూడా తెప్పించాడు. సీదోను, తూరు నగర ప్రజలు దావీదుకు చాలా దేవదారు కలప పంపారు.
5 దావీదు ఇలా అన్నాడు: “మనం యెహోవాకు ఒక గొప్ప ఆలయం కడదాము. నా కుమారుడు సొలొమోను చిన్నవాడు కావటంతో, అతను నేర్చుకోవాల్సిన విషయాలు ఇంకా నేర్చుకోలేదు. యెహోవా ఆలయం చాలా గొప్పదై వుండాలి. దాని అందచందాలలోను, ఔన్నత్యంలోను ఆ దేవాలయం సాటి రాజ్యాలన్నిటిలోను మేటిదై వుండాలి. అందువల్ల దేవాలయ నిర్మాణానికి అవసరమైన అనేక ఏర్పాట్లు చేస్తాను.” తాను చనిపోయే ముందు దేవాలయ నిర్మాణానికి దావీదు అనేక ఏర్పాట్లు చేశాడు.
6 పిమ్మట దావీదు తన కుమారుడైన సొలొమోనును పిలిచాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఒక ఆలయాన్ని కట్టుమని దావీదు సొలొమోనుకు చెప్పాడు. 7 సొలొమోనుతో దావీదు ఇలా అన్నాడు: “నా కుమారుడా! నా దేవుడైన యెహోవా నామమున నేనొక ఆలయం కట్టించాలనుకున్నాను. 8 కాని యెహోవా నాతో, ‘దావీదూ, నీవు చాలా యుద్ధాలు చేసి అనేకమందిని చంపావు. కావున నా పేరుమీద నీవు ఆలయం కట్టించలేవు. 9 కాని నీకొక శాంతి పరుడైన కుమారుడున్నాడు. నీ కుమారునికి శాంతియుత వాతావరణాన్ని కల్పిస్తాను. తనచుట్టూ వున్న అతని శత్రువులు అతనిని ఏమీ బాధపెట్టరు. అతని పేరు సొలొమోను.[a] సొలొమోను రాజుగా వున్న కాలంలో ఇశ్రాయేలు శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లేలా చేస్తాను. 10 నా పేరు మీద సొలొమోను ఒక ఆలయాన్ని నిర్మిస్తాడు. సొలొమోను నాకు కుమారినిలా వుంటాడు. నేనతనికి తండ్రిలా వుంటాను. నేను సొలొమోను రాజ్యాన్ని బలపరుస్తాను. పైగా అతని కుటుంబంలో నుండి ఎవ్వరో ఒక్కరు శాశ్వతంగా రాజవుతూనే వుంటారు!’”
11 దావీదు ఇంకా ఇలా అన్నాడు: “కుమారుడా ఇప్పుడు యెహోవా నీకు తోడై వుండుగాక! యెహోవా నీవు నిర్మిస్తావని చెప్పినట్లు, దేవాలయ నిర్మాణంలో నీవు విజయం సాధించెదవుగాక! 12 యెహోవా నిన్ను ఇశ్రాయేలుకు రాజుగా చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలను సమర్థవంతంగా పాలించే విధంగా యెహోవా నీకు తెలివితేటలు, అవగాహన యిచ్చు గాక! నీ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించు. 13 ఇశ్రాయేలు సంక్షేమం కొరకు దేవుడు మోషేకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని, నియమాలను నీవు పాటించే జాగ్రత్త తీసుకొంటే, నీవు విజయం సాధిస్తావు. నీవు శక్తిమంతుడవై, ధైర్యంగావుండు. నీవు భయపడవద్దు.
14 “సొలొమోనూ! యెహోవా ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేయటంలో నేను చాలా కష్టపడ్డాను. నేను మూడువేల ఏడువందల ఏభై టన్నుల బంగారాన్ని, ముఫై ఏడువేల ఐదువందల టన్నుల వెండిని, తూకం వేయటానికి సాధ్యం కానంత కంచును, ఇనుమును ఇచ్చాను. కలపను, రాయిని కూడ ఇచ్చాను. సొలొమోనూ, నేనిచ్చిన దానికి తోడు నీవింకా కొంత సామగ్రిని సమకూర్చవచ్చు. 15 నీ వద్ద చాలా మంది రాతిని చెక్కే శిల్పులు, వడ్రంగులు వున్నారు. ప్రతి పనిలోనూ నిపుణులైన వారు నీకున్నారు. 16 బంగారం, వెండి, కంచు, ఇనుము పనులలో నేర్పరులు, అనుభవం వున్న వారు నీవద్ద వున్నారు. ప్రవీణతగల పనివారు నీ వద్ద లెక్కకు మించి వున్నారు. ఇప్పుడు పని మొదలు పెట్టు. యెహోవా నీకు తోడై ఉండుగాక!”
17 తరువాత ఇశ్రాయేలు పెద్దలందరికీ తన కుమారుడు సొలొమోనుకు సహాయపడుమని దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. 18 ఆ పెద్దలందరికీ దావీదు యిలా చెప్పాడు: “మీ దేవుడైన యెహోవా మీతో వున్నాడు. ఆయన మీకు శాంతి నెలకొన్న కాలాన్ని ప్రసాదించాడు. మన చుట్టూ వున్న దేశాలను ఓడించేలా యెహోవా నాకు సహాయం చేశాడు. యెహోవా, ఆయన ప్రజలు ఇప్పుడీ దేశంమీద ఆధిపత్యం వహించి వున్నారు. 19 యెహోవా సంకల్పం నెరవేరటానికి మీరంతా హృదయపూర్వకంగా ఆయనకు అంకితమవ్వండి. యెహోవా దేవునికి పవిత్ర ఆలయాన్ని నిర్మించండి. యెహోవా పేరున ఆలయ నిర్మాణం చేయండి. పిమ్మట ఒడంబడిక పెట్టెను, ఇతర పవిత్ర పరికరాలను ఆలయంలోకి తీసుకురండి.”
భార్యభర్తలు
3 అదే విధంగా భార్యలు తమ భర్తలకు అణిగి ఉండాలి. అప్పుడు ఒకవేళ ఏ పురుషుడైనా దైవసందేశానుసారం నడుచుకోక పోతే ఆ సందేశాన్ని గురించి ప్రస్తావించకుండానే స్త్రీలారా, మీ నడత ద్వారా 2 మీ పవిత్రతను, భక్తిని వాళ్ళు చూడటంవల్ల మీ భర్తలు మంచి దారికి రాగలరు. 3 జడలు వేసి, బంగారు నగలు ధరించి, విలువైన దుస్తుల్ని కట్టుకొని శరీరాన్ని బాహ్యంగా అలంకరించటంకన్నా 4 మీ అంతరాత్మను సాత్వికత, శాంతత అనే నశించని గుణాలతో అలంకరించుకోండి. దేవుడు యిలాంటి అలంకరణకు ఎంతో విలువనిస్తాడు.
5 దేవుణ్ణి విశ్వసించి పవిత్రంగా జీవించిన పూర్వకాలపు స్త్రీలు యిలాంటి గుణాలతో అలంకరించుకునేవాళ్ళు. వాళ్ళు తమ భర్తలకు అణిగిమణిగి ఉండేవాళ్ళు. 6 శారా తన భర్త అబ్రాహాముకు అణిగిమణిగి ఉండి, అతణ్ణి “యజమాని” అని పిలిచేది. మీరు కూడా నీతిగా ప్రవర్తిస్తూ, భయపడకుండా ఉంటే దేవుడు మిమ్మల్ని శారా కుమార్తెల్లా పరిగణిస్తాడు.
7 భర్తలు, తమ భార్యలు తమకన్నా శారీరకంగా తక్కువ శక్తి కలవాళ్ళని గుర్తిస్తూ కాపురం చెయ్యాలి. మీతో సహ వాళ్ళు కూడా దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని పంచుకుంటున్నారు. కనుక వాళ్ళను మీరు గౌరవించాలి. అలా చేస్తే మీ ప్రార్థనలకు ఏ ఆటంకము కలుగదు.
నీతి కోసం బాధలనుభవించటం
8 చివరకు చెప్పేదేమిటంటే మీరంతా కలిసిమెలిసి ఉంటూ దయా సానుభూతులతో పరస్పరం సోదరులవలే ప్రేమించుకుంటూ, నమ్రతగలవారై జీవించండి. 9 అపకారం చేసిన వాళ్ళకు అపకారం చెయ్యకండి. అవమానించిన వాళ్ళను అవమానించకండి. అంతటితో ఆగక అలాంటి వాళ్ళను దీవించండి. ఎందుకంటే, దేవుడు తన దీవెనలకు మీరు వారసులు కావాలని మిమ్మల్ని పిలిచాడు. 10 లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడివుంది:
“బ్రతకాలని ఇష్టపడే వాడు,
మంచిరోజులు చూడదలచినవాడు,
తన నాలుక చెడు మాటలాడకుండా చూసుకోవాలి.
తన పెదాలు మోసాలు పలుకకుండా కాపాడుకోవాలి.
11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి.
శాంతిని కోరి సాధించాలి.
12 నీతిమంతులను దేవుడు గమనిస్తూ ఉంటాడు.
వాళ్ళ ప్రార్థనల్ని శ్రద్ధతోవింటూ ఉంటాడు.
కాని దుష్టుల విషయంలో ముఖం త్రిప్పుకుంటాడు.”(A)
13 ఉత్సాహంతో మంచి చేస్తున్న మీకు ఎవరు హాని చేస్తారు? 14 కాని ఒకవేళ నీతికోసం మీరు కష్టాలు అనుభవిస్తే మీకు దేవుని దీవెనలు లభిస్తాయి. “వాళ్ళ బెదిరింపులకు భయపడకండి. ఆందోళన చెందకండి.” 15 క్రీస్తును మీ హృదయ మందిరంలో ప్రతిష్టించండి. మీ విశ్వాసాన్ని గురించి కారణం అడుగుతూ ఎవరైనా ప్రశ్నిస్తే, అలాంటి వాళ్ళకు సమాధానమివ్వటానికి అన్ని వేళలా సిద్ధంగా ఉండండి. 16 కాని మర్యాదగా గౌరవంతో సమాధాన మివ్వండి. మీ మనస్సును నిష్కల్మషంగా ఉంచుకోండి. సత్ప్రవర్తనతో క్రీస్తును అనుసరిస్తున్న మిమ్మల్ని అవమానించి దుర్భాషలాడిన వాళ్ళు స్వయంగా సిగ్గుపడిపోతారు.
17 చెడును చేసి కష్టాలను అనుభవించటంకన్నా మంచి చేసి కష్టాలను అనుభవించటమే దైవేచ్ఛ. యిదే ఉత్తమం.
18 క్రీస్తు మీ పాపాల నిమిత్తం
తన ప్రాణాన్ని ఒకేసారి యిచ్చాడు.
దేవుని సన్నిధికి మిమ్మల్ని
తీసుకు రావాలని నీతిమంతుడైన
క్రీస్తు మీ పాపాల నిమిత్తం మరణించాడు.
వాళ్ళాయనకు భౌతిక మరణం కలిగించినా,
ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పునర్జీవం పొందాడు.
19 పరిశుద్ధాత్మ ద్వారా, చెరలోబడిన ఆత్మల దగ్గరకు వెళ్ళి బోధించాడు. 20 గతంలో ఈ ఆత్మలు దేవుని పట్ల అవిధేయతతో ప్రవర్తించాయి. నోవహు కాలంలో, నోవహు ఓడ నిర్మాణాన్ని సాగించినంతకాలం దేవుడు శాంతంగా కాచుకొని ఉన్నాడు. ఆ తర్వాత కొందరిని మాత్రమే, అంటే ఓడలో ఉన్న ఎనిమిది మందిని మాత్రమే నీళ్ళనుండి రక్షించాడు. 21 అదేవిధంగా మీరు బాప్తిస్మము పొందటంవల్ల దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు. బాప్తిస్మము పొదంటం అంటే శరీరం మీదినుండి మలినాన్ని కడిగివేయటం కాదు. దేవుణ్ణి స్వచ్ఛమైన మనస్సునిమ్మని వేడుకోవడం. ఇది యేసు క్రీస్తు చావు నుండి బ్రతికి రావటం వల్ల సంభవిస్తోంది. 22 ఆయన పరలోకానికి వెళ్ళి దేవుని కుడి చేతి వైపు కూర్చొని, దేవదూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద రాజ్యం చేస్తున్నాడు.
సమరయ, ఇశ్రాయేలులకు దండన
1 యెహోవా వాక్కు మీకాకు అందింది. ఇది యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, యెరూషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా చూశాడు.
2 ప్రజలారా, మీరంతా వినండి!
భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి!
నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయంనుండి వస్తాడు.
నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.
3 చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు.
ఆయన భూమియొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
4 దేవుడైన యెహోవా అగ్ని ముందు
మైనంలా పర్వతాలు కరిగిపోతాయి.
గొప్ప జలపాతంలా,
లోయలు వికలమై కరిగిపోతాయి.
5 యాకోబు పాపం కారణంగా,
ఇశ్రాయేలు ఇంటివారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది.
సమరయ పాప హేతువు
యాకోబు పాపానికి కారణం ఏమిటి?
దానికి కారణం సమరయ!
యూదాలో ఉన్నత స్థలమేది?[a]
అది యెరూషలేము!
6 మైదానంలో రాళ్లగుట్టలా నేను సమరయను మార్చుతాను.
అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది.
సమరయయొక్క నిర్మాణపు రాళ్లను పెరికి లోయలో పారవేస్తాను.
నేను దాని పునాదులను నాశనం చేస్తాను.
7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగగొట్టబడతాయి.
అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది.
దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను.
ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది.
కావున ఈ వస్తువులన్నీ నాపట్ల
అవిశ్వాసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.
మీకాయొక్క తీరని విచారం
8 ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను.
నేను పాదరక్షలుకూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను.
నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను.
నిప్పుకోళ్లలా మూల్గుతాను.
9 ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది.
ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది.
అది నా ప్రజల నగర ద్వారం వద్దకు చేరింది.
అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.
10 ఇది గాతులో చెప్పవద్దు.
అక్కడ ఏడ్వవద్దు.
బేత్లెయఫ్రలో విలపించి,
దుమ్ములో పొర్లాడు.
11 షాఫీరులో నివసించేవాడా,
దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పో!
జయనానులో నివసించేవాడు
బయటకు వెళ్లడు.
బేతేజెలులో ఉన్నవారు విలపిస్తారు.
దానికి కావలసిన ఆసరా మీనుండి తీసుకొంటుంది.
12 మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం
ఎదురుచూస్తూ నీరసించిపోయాడు.
ఎందుకంటే యెహోవానుండి
ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.
13 లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ,
రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు.
సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి.
ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.
14 కావున గాతులోని మోరెషెతుకు
మీరు వీడ్కోలు బహుమతులు ఇవ్వాలి.
అక్జీబులోని ఇండ్లు
ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి.
15 మారేషా నివాసులారా,
మీ మీదికి నేనొక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు.
ఇశ్రాయేలు మహిమ (దేవుడు)
అదుల్లాములో ప్రవేశిస్తుంది.
16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి.
ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకు మీరు దుఃఖిస్తారు.
రాబందుల్లాగా మీ తలలు బోడి చేసుకోండి.
ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.
యేసు తన డెబ్బది రెండు మంది శిష్యులను పంపటం
10 ఆ తర్వాత యేసు మరొక డెబ్బది రెండు[a] మంది శిష్యులను నియమించాడు. వాళ్ళను జతలు జతలుగా తాను వెళ్ళబోయే ప్రతి గ్రామానికి, పల్లెకు తన కంటే ముందు పంపుతూ, 2 “పంటబాగా పండింది. కాని పనివాళ్ళు తక్కువగా ఉన్నారు. అందువల్ల పంటనిచ్చిన ఆ ప్రభువును పని వాళ్ళను తన పొలాలకు పంపమని ప్రార్థించండి.
3 “వెళ్ళండి! తోడేళ్ళ మందలోకి గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. 4 మీ వెంటడబ్బు దాచుకొనే సంచి కాని, జోలి కాని, చెప్పులు కాని, తీసుకు వెళ్ళకండి. దారి మీద ఎవ్వరితో మాట్లాడకండి. 5 ఒకరి యింట్లోకి వెళ్ళేముందు, మొదట సమాధానం కలుగుగాక అని చెప్పండి. 6 ఆ యింటిలో శాంతి పొందనర్హుడైన వ్యక్తి ఉంటే మీ ఆశీస్సు అతనికి తోడౌతుంది. లేని పక్షంలో మీ ఆశీస్సు మీకు తిరిగివస్తుంది. 7 ఉన్న యింట్లోనే ఉండండి. ఇచ్చిన దాన్ని భుజించండి. పని చేసినవానికి కూలి దొరకాలి కదా! ఇల్లిల్లు తిరగకండి.
8 “ఒక గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగతమిచ్చి ఏది మీ ముందు పెడితే అది భుజించండి. 9 గ్రామంలో ఉన్న రోగులకు నయం చెయ్యండి. వాళ్ళతో, ‘దేవుని రాజ్యం మీ దగ్గరకు వస్తోంది’ అని చెప్పండి.
10 “మీరొక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్థులు స్వాగత మివ్వకుంటే 11 వీధిలోకి వెళ్ళి మీరు చేస్తున్నది తప్పని సూచించటానికి, ‘మా కాలికంటిన మీ ఊరి ధూళి కూడా దులిపి వేస్తున్నాము. కాని యిది మాత్రం నిజం. దేవుని రాజ్యం సమీపంలోనే ఉంది. తెలిసికోండి’ అని అనండి. 12 తీర్పు చెప్పబోయేరోజున, ఆ ఊరి ప్రజల్ని దేవుడు సొదొమ ప్రజలకన్నా ఎక్కువగా శిక్షిస్తాడని నేను చెబుతున్నాను.
యేసు విశ్వసించనివారిని హెచ్చరించటం
(మత్తయి 11:20-24)
13 “అయ్యో కొరాజీనా! అయ్యో బేత్సయిదా! మీకోసం చేసిన అద్భుతాలు తూరు, సీదోను పట్టణాలలో చేసివుంటే వాళ్ళు చాలా కాలం క్రిందటే గోనెపట్ట కట్టుకొని బూడిద తలపై వేసుకొని పశ్చాత్తాపం చెంది, మారుమనస్సు పొందివుండే వాళ్ళు. 14 కాని తీర్పు చెప్పబడే రోజున తూరు, సీదోను ప్రజలకన్నా మిమ్మల్ని ఎక్కువగా శిక్షిస్తాడు. 15 ఇక, ఓ కపెర్నహూమా! ఆకాశ మంత ఎత్తుగా హెచ్చించుకొందువా? పాతాళానికి త్రోసి వేయబడతావు.
16 “మీ బోధనలు వింటే నా బోధనలు విన్నట్టే. మిమ్మల్ని నిరాకరిస్తే నన్నును నిరాకరించినట్టే. నన్ను నిరాకరిస్తే నన్ను పంపినవానిని నిరాకరించినట్లే” అని వాళ్ళతో అన్నాడు.
సాతాను పడిపోవటం
17 ఆ డెబ్బది రెండు మంది శిష్యులు ఆనందంతో తిరిగి వచ్చి, “ప్రభూ! మీ పేరు చెప్పగానే దయ్యాలు కూడా మా మాటలకు లోబడ్డాయి” అని అన్నారు.
18 యేసు, “సైతాను ఆకాశం నుండి మెరుపువలే పడిపోవటం నేను చూశాను. 19 పాముల మీద నడవటానికి మీకు అధికారము యిచ్చాను. శత్రువును జయించే అధికారం యిచ్చాను. ఏది మీకు హాని చెయ్యలేదు. 20 దయ్యాలు మీ మాట వింటున్నంత మాత్రాన ఆనందించకండి. మీ పేరు పరలోకంలో వ్రాయబడినందుకు ఆనందించండి” అని అన్నాడు.
యేసు తండ్రిని ప్రార్థించటం
(మత్తయి 11:25-27; 13:16-17)
21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.
22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.
23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.
మంచి సమరయుని ఉపమానం
25 ఒక ధర్మశాస్త్ర పండితుడు యేసును పరీక్షించాలనుకొని లేచి, “బోధకుడా! నేను నిత్యజీవం[b] పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
26 దానికి యేసు, “ధర్మశాస్త్రంలో ఏమి వ్రాసారు? నీవు ఏమిచదివావు?” అని అడిగాడు.
27 అతడు, “‘నీ ప్రభువైనటువంటి దేవుణ్ణి సంపూర్ణమైన మనస్సుతో, సంపూర్ణమైన ఆత్మతో, సంపూర్ణమైన బుద్ధితోనూ, శక్తితోనూ ప్రేమించు.’ అంతేకాక, ‘నిన్ను ప్రేమించుకొన్నంతగా నీ పొరుగు వాళ్ళను ప్రేమించు’ అని వ్రాయబడివుంది” అని చెప్పాడు.
28 యేసు ఈ విధంగా అన్నాడు: “నీవు సరియైన సమాధానం చెప్పావు. ఆ విధంగా నడుచుకో, అనంత జీవితం పొందుతావు.”
29 ఆ పండితుడు తాను నీతిమంతుడనని రుజువు చేయటానికి యేసుతో, “మరి నా పొరుగువాడు ఎవరు?” అని అడిగాడు.
30 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఒకడు యెరూషలేము నుండి యెరికోకు ప్రయాణం చేస్తూ దార్లో దొంగల చేతిలో చిక్కాడు. వాళ్ళతణ్ణి నిలువు దోపిడి చేసి బాగాకొట్టి వదిలి వేసారు. అతడు కొన ప్రాణంతో ఉన్నాడు.
31 “అనుకోకుండా ఒక యాజకుడు ఆ దారిన రావటం తటస్థించింది. అతణ్ణి చూసి కూడా ఆ యాజకుడు ప్రక్కకు తొలిగి వెళ్ళిపొయ్యాడు. 32 అదే విధంగా ఒక లేవీయుడు కూడా వచ్చి అతణ్ణి చూసి ప్రక్కకు తొలిగి వెళ్ళి పొయ్యాడు.
33 “ఒక సమరయ ప్రాంతపువాడు ప్రయాణం చేస్తూ అతని దగ్గరకు వచ్చాడు. అతణ్ణి చూసి ఆ సమరయ వానికి చాలా జాలి కలిగింది. 34 అతని దగ్గరకు వెళ్ళి అతని గాయాలమీద ద్రాక్షారసం పోసి, నూనె రాచి, కట్లుకట్టాడు. ఆ తర్వాత తన దగ్గరున్న గాడిద మీద అతణ్ణి ఎక్కించుకొని ఒక సత్రానికి తీసుకు వెళ్ళాడు. ఈ విధంగా అతనికి చాలా ఉపకారం చేశాడు. 35 మరుసటి రోజు ఆ సత్రపు యజమానికి రెండు దేనారాలిచ్చి, ‘ఇతణ్ణి జాగ్రత్తగా చూసుకో. ఇతని కోసం నేనిచ్చిన దాని కన్నా ఎక్కువ ఖర్చు చేయవలసి వస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ డబ్బు నీకిస్తాను’ అని చెప్పి వెళ్ళి పొయ్యాడు.”
36 ఈ విషయం చెప్పి యేసు, “దొంగల చేతుల్లో చిక్కిన వానికి ఈ ముగ్గరిలో ఎవరు పొరుగువాడని నీ అభిప్రాయం?” అని అడిగాడు.
37 ఆ పండితుడు, “అతనిపై జాలి చూపిన వాడే!” అని సమాధానం చెప్పాడు.
దానికి యేసు, “నీవు కూడా అతనిలాగే నడుచుకో” అని చెప్పాడు.
యేసు మార్త యింటికి వెళ్ళటం
38 యేసు తన శిష్యులతో ప్రయాణం చేస్తూ ఒక గ్రామం చేరుకున్నాడు. ఆ గ్రామంలో మార్త అనే స్త్రీ ఆయన్ని తన యింటికి ఆహ్వానించింది. 39 ఆమెకు మరియ అనే ఒక సోదరి ఉంది. మరియ యేసు ప్రభువు కాళ్ళ దగ్గర కూర్చొని ఆయన చెప్పిన విషయాలు వింటూ ఉంది. 40 కాని మార్తకు పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. ఆమె యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరి యింటి పనులంతా నామీద వదిలి వేయటం మీకు న్యాయమనిపిస్తుందా? వచ్చి నాకు సహాయం చెయ్యమని ఆమెతో చెప్పండి” అని అన్నది.
41 ప్రభువు, “మార్తా! మార్తా! పనులు ఎక్కువగా ఉండటంవల్ల నీకు చింత, చిరాకు కలుగుతున్నాయి. 42 నిజంగా చెయ్యవలసింది ఒక్కటే పని. మరియ ఏది ఉత్తమమో దాన్ని ఎన్నుకొంది. దాన్ని ఆమెనుండి ఎవ్వరూ తీసుకోలేరు” అని అన్నాడు.
© 1997 Bible League International