Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
1 సమూయేలు 14

యోనాతాను ఫిలిష్తీయులపై పడటం

14 సౌలు కుమారుడైన యోనాతాను తన ఆయుధాలు మోసే యువకుని పిలిచి “లోయ ఆవలి పక్కన వున్న ఫిలిష్తీయుల గుడారాల వద్దకు వెళదాము” అన్నాడు. కాని ఈ విషయం మాత్రం తన తండ్రికి చెప్పలేదు.

మిగ్రోనులో ఒక కొండ కొనలో ఒక దానిమ్మ చెట్టు క్రింద సౌలు కూర్చుని ఉన్నాడు. ఇది అక్కడ ఉన్న కళ్లానికి దగ్గర్లో ఉంది. సౌలుతోకూడ ఆరువందల మంది మనుష్యులు ఉన్నారు. వారిలో ఒకడు అహీయా. ఈకాబోదు సోదరుడగు అహీటూబు కుమారుడు అహీయా. ఈకాబోదు ఫీనెహాసు కుమారుడు. ఫీనెహాసు ఏలీ కుమారుడు. షిలోహు పట్టణంలో యెహోవా యాజకునిగా అహీయా పని చేస్తున్నాడు. అతడు ఏఫోదు అనబడే పవిత్ర వస్త్రం ధరించాడు.

కనుమకు ఇరుప్రక్కలా నిటారైన బండలున్నాయి. యోనాతాను ఆ కనుమగుండా ఫిలిష్తీయుల శిబిరమునకు వెళ్లాలని నిర్ణయించాడు. ఒక పక్కనున్న కొండ పేరు బొస్సేసు. రెండవ పక్కనున్న నిడుపు కొండ పేరు సెనే. ఒక బండ మిక్మషు వైపు ఉత్తరానికి ఉంది. మరొక బండ గిబియా వైపు దక్షిణంగా ఉంది.

యోనాతాను తన ఆయుధాలు మోసే యువకునితో వారి మీదికి వెళదాము రమ్మన్నాడు. “బహుశః యెహోవా మనకు సహాయం చేయవచ్చు. మనతో ఎక్కువ మంది వున్నారా, తక్కువమంది ఉన్నారా, అన్నది సమస్య కాదు. దేవుడు సంకల్పిస్తే ఇవేమీ అడ్డురావు విజయానికి” అన్నాడు యోనాతాను.

“మీ చిత్తమొచ్చినట్లు చేయండి. నేను ఎంతసేపూ నిన్ను కనిపెట్టుకొనే ఉంటాను” అన్నాడు ఆ యువసైనికుడు.

“అయితే, రా! ఫిలిష్తీయుల దగ్గరకు పోదాము. వారు మనలను చూసేలా వెళదాము. వాళ్లు గనుక మనల్ని చూసి ‘తాము వచ్చే వరకూ ఆగండని’ అంటే, మనము అప్పుడు ఎక్కడ వుంటే అక్కడే ఆగిపోదాము. వారి వద్దకు పోవద్దు. 10 కానీ ‘మా దగ్గరకు పైకి రండి’ అని ఫిలిష్తీయులు చెబితే, మనం వాళ్ల దగ్గరకు ఎక్కి పోదాము. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చే గుర్తు గనుక. మనం వారిని ఓడించేలా యెహోవా చేస్తాడని దాని అర్థం.” అని యోనాతాను తన యువ సైనికునితో చెప్పాడు.

11 ఫిలిష్తీయులు వారిని చూసేలా యోనాతాను, అతని సహాయకుడు ఇద్దరూ కలిసి వెళ్లారు. వీరిని చూసిన ఫిలిష్తీయులు వారిలో వారు, “చూడండి! హెబ్రీ సైనికులు వారు దాగిన బొరియలనుండి బయటికి వస్తున్నారు!” అని అనుకున్నారు. 12 శిబిరంలో వున్న ఫిలిష్తీయులు వారిద్దరినీ చూసి, “మావద్దకు పైకి రండి. మీకు మంచి గుణపాఠం చెబతాము” అన్నారు.

అది విన్న యోనాతాను తన సహాయకునితో, “నా వెనుకనే కొండ ఎక్కు. యెహోవా ఫిలిష్తీయులను ఇశ్రాయేలుకు అప్పగించాడు!” అని చెప్పాడు.

13-14 అప్పుడు యోనాతాను తన కాళ్లు, చేతులతో మీదికి ఎగబాకినాడు. భటుడు అతని వెనుకనే అనుసరించాడు. యోనాతాను మరియు అతని సహాయకుడు ఫిలిష్తీయులను ఎదుర్కొన్నారు. మొదటి వధయందు వారు ఇరవై మంది ఫిలిష్తీయులను అర ఎకరము నేల పొడవున చంపారు. యోనాతాను ఎదురుగా వచ్చిన వారితో పోరాడాడు. ఆయుధాలు మోసేవాడు అతని వెనుకనే వస్తూ చావకుండా గాయపడ్డవారిని చంపేసాడు.

15 ఫిలిష్తీయులంతా చాలా భయపడిపోయారు. మెరుపు దాడులను చేయగల దళంవారితో సహా శిబిరంలో ఉన్న వారంతా మిక్కిలిగా భయపడ్డారు. భూమి కూడ కంపించింది! వారు చాలా భయంతో వణకిపోయారు.

16 బెన్యామీను దేశంలోని గిబియా వద్ద ఉన్న సౌలు సైనికులు, ఫిలిష్తీ సైనికులు చెల్లాచెదురై పారిపోవటం చూశారు. 17 సౌలు తనతోకూడ ఉన్న సైన్యంతో “మనుష్యుల్ని లెక్కబెట్టండి. శిబిరాన్ని విడిచిపోయింది ఎవరో నేను తెలుసుకోవాలి” అన్నాడు.

వారు లెక్క పెట్టి చూస్తే, అక్కడ లేని వారు యోనాతాను, అతని ఆయుధము మోసేవాడు.

18 “దేవుని పవిత్ర పెట్టెను తెమ్మని” యాజకుడైన అహీయతో సౌలు చెప్పాడు. (ఆ సమయంలో పవిత్ర పెట్టె ఇశ్రాయేలీయుల వద్ద ఉంది). 19 సౌలు యాజకునితో మాట్లాడుతూ వుండగానే ఫిలిష్తీయులలో అలజడి ఎక్కువయ్యింది. అప్పుడు సౌలు అసహనంతో, “నీ ప్రార్థన యిక చాలు, నీ చేతులు క్రిందికి దించు” అని యాజకునితో చెప్పాడు.

20 సౌలు, మరియు అతనితోవున్న సైన్యం సమకూడి యుద్ధానికి దిగారు. ఫిలిష్తీయులు గందరగోళంగా ఉన్నారని వారు గమనించారు. కొంతమంది ఫిలిష్తీయులు తమలో తామే కత్తులతో పొడుచు కొంటున్నట్టువారు చూశారు. 21 గతంలో వారి క్రింద పని చేసిన హెబ్రీయులు కొందరు ఫిలిష్తీయుల శిబిరంలో ఉన్నారు. ఈ హెబ్రీయులు సౌలు, యోనాతానుతో వున్న ఇశ్రాయేలీయులకు మద్దతు ఇచ్చారు. 22 ఎఫ్రాయిము కొండల దేశంలో దాగివున్న ఇశ్రాయేలీయులంతా పారిపోతున్న ఫిలిష్తీయుల గూర్చి విన్నారు. వీరంతా యుద్ధంలో చేరి ఫిలిష్తీయులను తరిమికొట్టారు.

23 ఆ విధంగా ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా గొప్ప విజయాన్ని ఇచ్చాడు. యుద్ధం బేతావెను దాటిపోయింది. సైన్యమంతా సౌలు దగ్గర ఉంది. సుమారు పదివేల మంది అతని వద్ద ఉన్నారు. తరువాత ఎఫ్రాయిము రాజ్యంలోని ప్రతి నగరానికీ యుద్ధం వ్యాపించింది.

సౌలు చేసిన మరో తప్పు

24 ఆరోజు సౌలు ఒక పెద్ద తప్పు చేశాడు. ఇశ్రాయేలు సైనికులు ఆకలితో నకనకలాడి పోయారు. దీనికంతటికీ కారణం వారిని సౌలు ఒక ప్రమాణం క్రింద వుంచటమే! “సాయంత్రమయ్యేలోగా గాని, లేక నా శత్రువులను నేను ఓడించక ముందుగాని ఎవ్వరైనా భోజనం చేస్తే వారు శపించబడతారు!” అని వారికి సౌలు ముందుగానే చెప్పాడు. దానితో ఇశ్రాయేలు సైనికులు ఎవ్వరూ ఆహారం ముట్టలేదు.

25 ఆ ప్రాంతంలో ఒక తేనెతుట్ట వుంది. 26 సైనికులు దానివద్దకు వచ్చేసరికి వాళ్ల ప్రమాణం జ్ఞాపకం రావటంతో తేనె ముట్టటానికి భయపడిపోయారు. 27 అయితే సౌలు చేయించిన ఈ ప్రమాణం గురించి యోనాతానుకు తెలియదు. అతను తన చేతికర్రను తేనెతుట్టలోనికి గుచ్చి లాగగానే తేనెవచ్చింది. అతడు దానిని తాగగా అతనికి ఎంతో హాయినిచ్చింది.

28 సైనికులలో ఒకడు యోనాతానుకు “నీ తండ్రి సైనికులతో ప్రమాణము చేయించి, ఆహారము పుచ్చుకొనువాడు శపించబడును అని చెప్పాడు. అందువల్లనే ఏ ఒక్క సైనికుడు కూడా ఆ రోజు ఏమీ తినలేదని అన్నాడు. అందువల్లనే సైనికులంతా విపరీతంగా అలసిపోయారని” చెప్పాడు.

29 “మా తండ్రి దేశానికి లేనిపోని తిప్పలు తెచ్చిపెట్టాడు. చూడండి! ఈ తేనెను నేను కొంచెం రుచిచూస్తేనే నాకు చాలా హాయిగా వుంది! 30 ఈ రోజు శత్రువుల వద్ద తీసుకున్న ఆహారమంతా మన సైనికులు గనుక తినివుంటే, వారు ఎంత హాయిగా ఉండేవారు! ఇంకా చాలా మంది ఫిలిష్తీయులను కూడ చంపి ఉండే వాళ్లు!” అన్నాడు యోనాతాను.

31 ఆ రోజు మిక్మషునుండి అయ్యాలోను వరకూగల ఫిలిష్తీయులనందరినీ ఇశ్రాయేలు సైనికులు ఓడించారు. ఆ తరువాత వారు బాగా నీరసించి పోయారు. 32 వారు ఫిలిష్తీయుల గొర్రెలను, పశువులను, దూడలను పట్టుకొన్నారు. ఆకలికి తట్టుకోలేక వారు ఆ పశువులను నేలమీదే చంపి రక్తంతో నిండిన మాంసాన్నే తినివేశారు.

33 ఒక వ్యక్తి వెళ్లి సౌలుతో, “చూశావా! సైనికులంతా యెహోవా పట్ల పాపం చేస్తున్నారు. రక్తం కలసివున్న మాంసాన్నే వారు తింటున్నారు” అని చెప్పాడు.

అది విని సౌలు, “మీరు పాపం చేశారు! ఒక పెద్ద బండను ఇక్కడికి దొర్లించండి” అన్నాడు. 34 “నీవు వెళ్లి ప్రతి ఒక్కడ్నీ తన ఎద్దును, గొర్రెను ఇక్కడికి తీసుకుని రమ్మను. వారు వచ్చి తమ పశువులను ఇక్కడ బండ మీద వధించాలి. దేవుని పట్లపాపం చేయవద్దు. రక్తం కలిసివున్న మాంసాన్ని తినకండి” అన్నాడు సౌలు.

ఆ రాత్రి ప్రతి ఒక్కడూ తన పశువులను తెచ్చి అక్కడ వధించాడు. 35 తరువాత సౌలు యెహోవాకు ఒక బలిపీఠాన్ని నిర్మించాడు. అది సౌలు తానే యెహోవాకి నిర్మించిన మొదటి బలిపీఠం.

36 “పదండి! ఈ రాత్రి ఫిలిష్తీయులను తరుముదాము. వాళ్లనందరినీ చంపివేసి వాళ్ల వస్తువులన్నీ తీసుకుందాము!” అన్నాడు సౌలు.

“నీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయి” అని సైనికులు జవాబిచ్చారు.

కానీ “మనము దేవుని అడుగు దాము” అని యాజకుడు చెప్పాడు.

37 అందువల్ల సౌలు లేచి, “దేవా! నేను వెళ్లి ఫిలిష్తీయులను తరిమికొట్టనా? మేము వాళ్లను ఓడించేలా సహాయం చేస్తావా?” అని అడిగాడు. కాని ఆ రోజు సౌలుకు యెహోవా సమాధానం ఇవ్వలేదు.

38 “నాయకులందరినీ నా దగ్గరకు తీసుకుని రండి. ఈ వేళ ఎవరు పాపం చేసారో మనము తెలుసు కొందాము. 39 ఇశ్రాయేలును రక్షించే యెహోవా తోడుగా నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ పాపం నా స్వంత కుమారుడు యోనాతాను చేసినా, అతడు చావాల్సిందే” అని చెప్పాడు సౌలు. సైన్యంలో ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు.

40 సౌలు ఇశ్రాయేలీయులందరినీ పిలిచి వారందరినీ ఒక పక్కన నిలబెట్టి, తన కుమారునితో కలిసి తానొక పక్కన నిలబడ్డాడు.

“మీకు ఎలా మంచిదనిపిస్తే అలా చేయండి” అని సైనికులంతా చెప్పారు.

41 “ఓ ఇశ్రాయేలీయుల దేవుడవై యెహోవా, నీ సేవకుడనైన నా ప్రార్థన ఈ రోజున ఎందుకు ఆలకించలేదు! నేను గాని, నా కుమారుడు యోనాతాను గాని పాపం చేస్తే మాకు ఊరీము పడేలా చేయుము. నీ ప్రజలయిన ఇశ్రాయేలీయులు పాపం చేస్తే, వారికి తుమ్మీము[a] పడేలా చేయము” అని సౌలు ప్రార్థన చేశాడు.

సౌలు యోనాతాను పాపం చేసినట్టు ఊరీము పడింది. అందుచేత ప్రజలు నిర్దోషులని తేలటంతో వారు వెళ్లిపోయారు. 42 సౌలు, యోనాతానుల మధ్య మళ్లీ వేస్తే యోనాతాను దోషి అని తేలింది.

43 “ఏమి చేసావో చెప్పు” అని సౌలు యోనాతానును అడిగాడు.

“నేను కేవలం నా చేతికర్ర చివరన అంటిన తేనెనురుచి చూసాను. దానికే నేను మరణశిక్ష అనుభవించాలా?” అన్నాడు యోనాతాను.

44 సౌలు “దేవునికి నేను తీవ్రమైన ప్రమాణం చేసాను. నా ప్రమాణాన్ని గనుక నేను నిలబెట్టుకోక పోతే నాకు ఎన్నో దారుణాలు చేయుమని నేను దేవుని అడిగాను. కనుక యోనాతానూ, నీవు మరణించాల్సిందే” అన్నాడు.

45 అయితే సైనికులు, “ఈవేళ ఇశ్రాయేలీయులను మహా విజయానికి నడిపించిన వాడు యోనాతానే. అలాంటప్పుడు యోనాతాను మరణించాలా? వీల్లేదు. సజీవ దేవుని తోడు, యోనాతాను తలమీదనుండి ఒక్క వెంట్రుక నేలరాలదుగాక! ఈ వేళ ఫిలిష్తీయులతో యుద్ధం చేయటానికి దేవుడే యోనాతానుకు సహాయం చేసాడు!” అని సౌలుతో చెప్పారు. అందుచేత సైనికులు యోనాతానును కాపాడారు. అతడు చంపబడలేదు.

46 కనుక ఫిలిష్తీయులను తరమటం సౌలుమానుకున్నాడు. ఫిలిష్తీయులు వారి స్థలానికి వెళ్లి పోయారు.

ఇశ్రాయేలు శత్రువులతో సౌలు పోరాటం

47 సౌలు పరిపాలన సాగించిన కాలంలో, ఇశ్రాయేలు చుట్టూవున్న దాని శత్రువులందరితో అతడు యుద్ధం చేశాడు. మోయాబీయులతోను అమ్మోనీయులతోను, ఎదోమీయులతోను, సోబాదేశపు రాజులతోను, ఫిలిష్తీయులతోను సౌలు యుద్ధంచేశాడు. సౌలు ఎక్కడికి వెళితే అక్కడ శత్రువులను ఓడించి విజయంసాధించాడు. 48 సౌలు చాలా ధైర్యవంతుడు. అతడు అమాలేకీయులను సహా జయించాడు. ఇశ్రాయేలును కొల్లగొట్టాలని ప్రయత్నించిన దాని శత్రువులందరినీ సౌలు చీల్చి చెండాడి ఇశ్రాయేలును రక్షించాడు.

49 యోనాతాను, ఇష్వీ, మెల్కీషూవ, ఈ ముగ్గురూ సౌలు కుమారులు. సౌలు పెద్ద కుమార్తె పేరు మేరబు. అతని చిన్న కుమార్తె మీకాలు. 50 సౌలు భార్య పేరు అహీనోయము. ఆమె అహిమయస్సు అనే వాని కుమార్తె. సౌలు సైన్యాధికారి పేరు అబ్నేరు.

అతడు నేరు అనేవాని కుమారుడు. నేరు సౌలు పినతండ్రి. 51 సౌలు తండ్రి కీషు; అబ్నేరు తండ్రి నేరు-ఇద్దరూ అబీయేలు అనే వాని కుమారులు.

52 సౌలు ధైర్యశాలిగా ఉన్నాడు. ఫిలిష్తీయులతో తీవ్రంగా పోరాడాడు. సౌలు తన రాజ్యంలో ఎప్పుడయినా, ఎక్కడయినా ఒక ధైర్యవంతుని గాని బలశాలిని గాని చూస్తే వానిని తన కోటలోని ప్రత్యేక సైనిక దళంలో చేర్చుకొనేవాడు.

రోమీయులకు 12

క్రొత్త జీవితము

12 అందువల్ల నా సోదరులారా! నేను మీకీ విజ్ఞప్తి చేస్తున్నాను, దేవుడు తన అనుగ్రహం చూపించాడు కనుక మీ జీవితాల్ని ఆయనకు అర్పించుకోండి. ఆయనకు ఆనందం కలిగేటట్లు పవిత్రంగా జీవించండి. ఇదే మీరు చేయవలసిన నిజమైన సేవ! ఇక మీదట ఈ లోకం తీరును అనుసరిస్తూ జీవించకండి. మీ మనస్సు మార్చుకొని మీరు కూడా మార్పు చెందండి. అప్పుడు మీరు దైవేచ్ఛ ఏమిటో తెలుసుకొని, అది ఉత్తమమైనదనీ, ఆనందం కలిగిస్తుందనీ, పరిపూర్ణమైనదనీ గ్రహిస్తారు!

దేవుడు నాకిచ్చిన అనుగ్రహాన్ని ఆధారంగా తీసుకొని మీలో ప్రతి ఒక్కరికీ నేను చెప్పేదేమిటంటే, మిమ్మల్ని గురించి మీరు ఉన్నదాని కంటే గొప్పగా భావించకండి. సక్రమంగా ఉండి దేవుడిచ్చిన విశ్వాసంతో మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. దేహానికి ఎన్నో అవయవాలుంటాయి. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉండదు. అదే విధంగా అధిక సంఖ్యలో ఉన్న మనమంతా క్రీస్తులో ఒకే దేహంగా రూపొందింపబడ్డాము. ప్రతి సభ్యునికి మిగతా సభ్యులతో సంబంధం ఉంది.

దేవుని అనుగ్రహం వల్ల మనందరికి రకరకాల కృపావరాలు లభించాయి. దైవసందేశాన్ని గురించి మాట్లాడే వరాన్ని పొందినవాళ్ళు ఆ పనిని విశ్వాసంతో చెయ్యాలి. సేవ చేసే వరం పొందినవాళ్ళు సేవ చెయ్యాలి. బోధించే వరం పొందినవాళ్ళు బోధించాలి. ప్రజలను ప్రోత్సాహపరచే వరం పొందినవాళ్ళు ప్రోత్సాహ పరచాలి. దానం చేసే వరం పొందినవాళ్ళు ధారాళంగా దానం చెయ్యాలి. నాయకత్వం వహించాలని వరం పొందినవాళ్ళు శ్రద్ధతో నాయకత్వం చెయ్యాలి. దయ చూపాలని వరం పొందినవాళ్ళు ఆనందంగా దయ చూపాలి.

ప్రేమలో నిజాయితీగా ఉండండి. దుర్మార్గాన్ని ద్వేషించండి. మంచిని అంటి పెట్టుకొని ఉండండి. 10 సోదర ప్రేమతో, మమతతో ఉండండి. మీ సోదరులను మీకన్నా అధికులుగా భావించి గౌరవిస్తూ ఉండండి. 11 ఉత్సాహాన్ని వదులుకోకుండా ఉత్తేజితమైన ఆత్మతో ప్రభువు సేవ చేయండి. 12 పరలోకం లభిస్తుందన్న ఆశతో ఆనందం పొందుతూ, కష్ట సమయాల్లో సహనం వహించి, అన్ని వేళలా విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉండండి. 13 మీ సహాయం అవసరమున్న దేవుని ప్రజలతో మీకున్న వాటిని పంచుకోండి. ఆతిథ్యాన్ని మరువకండి.

14 మిమ్మల్ని హింసిస్తున్న వాళ్ళను ఆశీర్వదించండి. ఆశీర్వదించాలి కాని, దూషించకూడదు. 15 ఆనందంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ ఆనందాన్ని, దుఃఖంగా ఉన్నవాళ్ళతో వాళ్ళ దుఃఖాన్ని పంచుకోండి. 16 అందరి విషయంలో ఒకే విధంగా ప్రవర్తించండి. గర్వించకండి. తక్కువ స్థాయిగలవాళ్ళతో సహవాసం చెయ్యండి. మీలో మాత్రమే జ్ఞానం ఉందని భావించకండి.

17 కీడు చేసినవాళ్ళకు కీడు చెయ్యకండి. ప్రతి ఒక్కరి దృష్టిలో మంచిదనిపించేదాన్ని చెయ్యటానికి జాగ్రత్త పడండి. 18 అందరితో శాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. 19 మిత్రులారా! పగ తీర్చకోకండి. ఆగ్రహం చూపటానికి దేవునికి అవకాశం ఇవ్వండి. ఎందుకంటే లేఖనాల్లో,

“పగ తీర్చుకోవటం నా వంతు.
    నేను ప్రతీకారం తీసుకొంటాను”(A)

అని వ్రాయబడి ఉంది. 20 దానికి మారుగా,

“మీ శత్రువు ఆకలితో ఉంటే
    అతనికి ఆహారం ఇవ్వండి.
అతనికి దాహం వేస్తుంటే నీళ్ళివ్వండి.
    ఇలా చేయటం వల్ల కాలే నిప్పులు అతని
తలపై కుమ్మరించినట్లు అతనికి అనిపిస్తుంది”(B)

అని వ్రాయబడి ఉంది. 21 చెడు మీపై గెలుపు సాధించకుండా జాగ్రత్త పడండి. చెడ్డతనాన్ని మంచితనంతో గెలవండి.

యిర్మీయా 51

51 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“నేనొకపెనుగాలి వీచేలా చేస్తాను.
    అది బబులోను, కల్దీయ ప్రజల మీదికి వీచేలా చేస్తాను.
బబులోనును తూర్పార బట్టటానికి నేను క్రొత్తవారిని పంపుతాను.
    వారు బబులోనును తూర్పార బడతారు. వారు బబులోనునుండి ప్రతీది తీసుకొంటారు.
సైన్యాలు నగరాన్ని చుట్టుముట్టుతాయి.
    భయంకరమైన విధ్వంసకాండ జరుగుతుంది.
బబులోను సైనికులు తమ ధనుర్బాణాలను వినియోగించలేరు.
    ఆ సైనికులు తమ కవచాలను కూడ ధరించలేరు.
బబులోను యువకులను గురించి విచారించవద్దు.
    దాని సైన్యాన్ని సర్వ నాశనం చేయుము.
బబులోను సైనికులు కల్దీయుల రాజ్యంలో చంపబడతారు.
    బబులోను వీధుల్లో వారు తీవ్రంగా గాయపర్చబడతారు.”

సర్వశక్తిమంతుడైన యెహోవా ఇశ్రాయేలును, యూదాను ఒక విధవరాలివలె ఒంటరిగా వదిలి వేయలేదు. దేవుడు ఆ ప్రజలను వదిలిపెట్టలేదు.
    లేదు! ఆ ప్రజలే ఇశ్రాయేలు పవిత్ర దైవాన్ని వదిలివేసిన పాపానికి ఒడిగట్టారు.
వారే ఆయనను వదిలారు గాని
    ఆయన వారిని విడిచివేయలేదు.

బబులోను నుంచి పారిపొండి.
    మీ ప్రాణ రక్షణకై పారిపొండి!
    మీరు ఆగకండి. బబులోను పాపాల కారణంగా మీరు చంపబడవద్దు!
వారు చేసిన దుష్కార్యాలకు బబులోను ప్రజలను యెహోవా శిక్షించవలసిన సమయం వచ్చింది.
    బబులోనుకు తగిన శాస్తి జరుగుతుంది.
యెహోవా చేతిలో బంగారు గిన్నెలా బబులోను ఉండేది.
    బబులోను ప్రపంచాన్నంతటినీ తాగించింది.
బబులోను ఇచ్చిన మధ్యాన్ని దేశాలు సేవించాయి.
    కావున వారికి వెర్రి పట్టింది.
బబులోను అకస్మాత్తుగా పడి ముక్కలై పోతుంది.
    దాని కొరకు విలపించండి!
దాని బాధ నివారణకు మందుతెండి!
    బహుశః ఆమెకు నయం కావచ్చు!

బబులోనుకు స్వస్థత చేకూర్చాలని యత్నించాము.
    కాని ఆమె స్వస్థతనొందలేదు.
కావున ఆమెను వదిలివేసి
    మనందరం మన మన దేశాలకు వెళ్లిపోదాం.
వరలోకంలో దేవుడు బబులోనుకు శిక్ష నిర్ణయిస్తాడు.
    బబులోనుకు ఏమి సంభవించాలో ఆయన నిర్ణయిస్తాడు.
10 యెహోవా మనకోసం శత్రువుల మీద పగతీర్చుకొన్నాడు.
    రండి! ఈ విషయం మనం సీయోనులో చెప్పుదాం.
మన దేవుడైన యెహోవా చేసిన పనులను గూర్చి చెప్పుదాం.

11 మీ బాణాలకు పదును పెట్టండి.
    మీ డాళ్లను చేపట్టండి!
యెహోవా మాదీయుల రాజును ప్రేరేపిస్తున్నాడు.
    ఆయన బబులోనును నాశనంచేయ సంకల్పించాడు.
కావున ఆయన వారిని ప్రేరేపిస్తున్నాడు.
    బబులోను ప్రజలకు అర్హమైన శిక్షను యెహోవా విధిస్తాడు.
బబులోను సైన్యం యెరూషలేములో యెహోవా ఆలయాన్ని నాశనం చేసింది.
    కావున వారికి తగిన దండన యెహోవా విధిస్తాడు.
12 బబులోను ప్రాకారాలకు ఎదురుగా జెండా ఎగురవేయండి.
    ఎక్కువమంది కావలివారిని నియమించండి.
రక్షణ భటులను వారి వారి స్థానాలలో నిలపండి.
    రహస్య దాడికి సిద్ధంగా ఉండండి!
యెహోవా తను యోచించిన ప్రకారం చేస్తాడు.
    యెహోవా బబులోనుకు వ్యతిరేకంగా ఏమి చేస్తానని చెప్పియున్నాడో అది చేసి తీరుతాడు.
13 బబులోనూ, నీవు పుష్కలంగా నీరున్నచోట నివసిస్తున్నావు.
    నీవు ధనధాన్యాలతో తులతూగుతున్నావు.
కాని ఒక రాజ్యంగా నీవు మనగలిగే కాలం అంతమవుతూవుంది.
    నీకు వినాశనకాలం దాపురించింది.
14 సర్వశక్తిమంతుడైన యెహోవా తన పేరుమీద ప్రమాణం చేసి ఈ విషయాలు చెప్పాడు,
“బబులోనూ, నిశ్చయముగా నిన్ను అనేక శత్రు సైనికులతో నింపుతాను. వారు మిడుతల దండులా వచ్చి పడుతారు.
    ఆ సైనికులు యుద్ధంలో నీ మీద గెలుస్తారు.
    వారు నీపై నిలబడి విజయధ్వనులు చేస్తారు.”

15 యెహోవా తన అనంత శక్తి నుపయోగించి భూమిని సృష్టించాడు.
    ఆయన తన జ్ఞానాన్ని వినియోగించి ప్రపంచాన్ని నిర్మించాడు.
తన ప్రజ్ఞతో ఆయన ఆకాశాన్ని విస్తరించాడు.
16 ఆయన గర్జిస్తే ఆకాశంలో సముద్రాలు ఘోషిస్తాయి.
    భూమిపైకి మేఘాలను ఆయన పంపిస్తాడు.
ఉరుములు మెరుపులతో వర్షం పడేలా చేస్తాడు.
    తన గిడ్డంగుల నుండి ఆయన పెనుగాలులు రప్పిస్తాడు.
17 కాని ప్రజలు బహుమూర్ఖులు.
    దేవుడు ఏమి చేశాడో తెలిసికోలేరు.
నేర్పరులైన పనివారు బూటకపు దేవతల విగ్రహాలను చేస్తారు.
    ఆ విగ్రహాలన్నీ బూటకపు దేవతలే.
కావున ఆ పని వాడు ఎంత మూర్ఖుడో అవి చాటి చెపుతాయి.
    ఆ విగ్రహాలు నిర్జీవ ప్రతిమలు.
18 ఆ విగ్రహాలు నిరుపయోగం!
    ప్రజలు చేసిన ఆ విగ్రహాలు నవ్వులాట బొమ్మలు!
వారికి తీర్పు తీర్చే కాలం వస్తుంది.
    అప్పుడా విగ్రహాలు నాశనం చేయబడతాయి.
19 కాని యాకోబు స్వాస్థ్యము (దేవుడు) ఆ పనికి మాలిన విగ్రహాల్లాటివాడు కాదు.
    ప్రజలు దేవుణ్ణి చేయలేదు.
దేవుడే తన ప్రజలను చేశాడు!
    దేవుడు సమస్తాన్నీ సృష్టించినాడు!
ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

20 యెహోవా ఈ విధంగా అంటున్నాడు: “బబులోనూ, నీవు నా చేతి దుడ్డుకర్రవి
    రాజ్యాలను మోదటానికి నిన్ను వినియోగించాను.
    సామ్రాజ్యాలను నాశనం చేయటానికి నిన్ను వాడాను.
21 గుర్రాన్ని, రౌతును బాదటానికి నిన్ను వాడాను.
    రథాన్ని, సారథిని చిదుకగొట్టటానికి నిన్నుపయోగించాను.
22 స్త్రీ పురుషులను చితుకగొట్టుటకు నిన్ను వాడాను.
    వృద్ధులను, యువకులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.
    యువకులను, యువతులను చితకగొట్టుటకు నిన్ను వాడాను.
23 గొర్రెల కాపరులను, మందలను నాశనం చేయటానికి నిన్ను ఉపయోగించాను.
    రైతులను, ఆవులను నాశనం చేయుటకు నిన్ను ఉపయోగించాను.
    పాలకులను, ముఖ్య అధికారులను దండించటానికి నిన్ను వాడాను.
24 కాని బబులోనుకు తగిన శాస్తి నేను చేస్తాను. కల్దీయులందరికీ తగిన శాస్తి చేస్తాను. సీయోనుకు వారు చేసిన కీడంతటికి తగిన శాస్తి చేస్తాను.
    యూదా, నీ కన్నుల ఎదుటనే నేను వారికి తగిన శాస్తి చేస్తాను.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

25 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోనూ, నీవొక విధ్వంసకర పర్వతానివి.
    నేను నీకు వ్యతిరేకిని.
బబులోనూ, భూమినంతటినీ నీవు నాశనంచేశావు.
    నేను నీకు విరోధిని. నీ మీదికి నా చేయి చాస్తున్నాను.
కొండ శిఖరాల నుంచి నిన్ను దొర్లిస్తాను.
    నిన్నొక కాలిపోయిన కొండలా చేస్తాను.
26 పునాది రాళ్లకు పనికివచ్చే పెద్ద బండలను ప్రజలు చూడరు.
    వారి భవనాల పునాదులకు ప్రజలు పెద్ద రాళ్లను బబులోను నుంచి తీసికొనిపోరు.
ఎందువల్లనంటే శ్వతంగా ఈ నగరం ఒక నలిగిన రాళ్లపోగులా మారుతుంది.”
    ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

27 “రాజ్యంలో యుద్ధ పతాకాన్నెగుర వేయండి!
    దేశాలన్నిటిలో బూర వూదండి!
బబులోనుతో యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి!
    బబులోనుతో యుద్ధానికి అరారాతు, మిన్నీ, అష్కనజు అనే రాజ్యాలను పిలవండి.
దాని మీదికి సైన్యాన్ని నడపటానికి ఒక అధికారిని ఎంపిక చేయండి.
    మిడతల దండులా దానిమీదికి ఎక్కువ గుర్రాలను పంపండి.
28 దానిమీదకి యుద్ధానికి దేశాలను సిద్ధం చేయండి.
    మాదీయుల రాజులను సమాయత్తపర్చండి.
మాదీయుల పాలకులను, ముఖ్యాధికారులను సిద్ధంచేయండి.
    వారు పాలించే దేశాలన్నిటినీ బబులోను మీద యుద్ధానికి సిద్ధంచేయండి.
29 బాధలో వున్నట్లు ఆ రాజ్యం వణికిపోతుంది.
    యెహోవా తన పధకాన్ని అమలుపర్చటం మొదలు పెట్టినప్పుడు అది కంపించిపోతుంది.
బబులోనును వట్టి ఎడారిగా మార్చటమే యెహోవా సంకల్పం.
    అక్కడ ఎవ్వరూ నివసించరు.
30 బబులోను సైనికులు పోరాడటం మానివేశారు.
    వారు తమ కోటల్లోనే ఉండిపోయారు.
వారి శక్తి తరిగిపోయింది.
    వారు బెదరిపోయిన స్త్రీలవలె అయినారు.
బబులోనులో ఇండ్లు తగులబడుతున్నాయి.
    దాని ద్వారాల కడ్డీలు విరిగిపోయాయి.
31 ఒక దూత మరో దూతను అనుసరిస్తాడు.
    దూత తరువాత దూత వస్తాడు.
అతని నగరమంతా పట్టుబడిందని
    వారు బబులోను రాజుకు తెలియజేస్తారు.
32 మనుష్యులు నదులను దాటే స్థలాలన్నీ పట్టుబడ్డాయి.
    చిత్తడి నేలలు సహితం మండుతున్నాయి.
    బబులోను సైనికులంతా భయపడ్డారు.”

33 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడూ అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోను నగరం పంటకళ్లంలా ఉన్నది.
    పంటకోయు కాలంలో రైతులు కోసిన పైరును కొట్టి పొట్టునుండి ధాన్యాన్ని వేరుచేస్తారు.
    బబులోనును కొట్టే కాలం దగ్గర పడుతోంది.”

34 “గతంలో బబులోను రాజు నెబుకద్నెజరు మమ్మల్ని నాశనం చేశాడు.
    గతంలో నెబుకద్నెజరు మమ్మల్ని గాయపర్చాడు.
ఇదివరలో అతడు మా ప్రజలను చెరగొన్నాడు.
    మేము వట్టి జాడీల్లా అయ్యాము.
అతడు మాకున్న మంచి వస్తువులన్నిటినీ తీసికొన్నాడు.
    కడుపు పగిలేలా అన్నీ తిన్న పెద్దరాక్షసిలా అతడున్నాడు.
అతడు మా మంచి వస్తువులన్నీ
    తీసికొని మమ్మల్ని నెట్టివేశాడు.
35 మమ్మల్ని బాధించటానికి బబులోను భయంకరమైన పనులు చేసింది.
    ఇప్పుడు అవన్నీ బబులోనుకు జరగాలని నేను కోరుకుంటున్నాను.”

సీయోనులో నివసిస్తున్న ప్రజలు ఈ విషయాలు చెప్పారు:
“బబులోను వారు మా ప్రజలను చంపిన నేరస్థులు.
    వారు చేసిన దుష్ట కార్యాలకు వారిప్పుడు శిక్షింపబడతారు.”
    యెరూషలేము నగరం ఆ విషయాలు చెప్పింది.
36 కావున యెహోవా ఇలా చెపుతున్నాడు,
“యూదా, నిన్ను రక్షిస్తాను.
    బబులోను తప్పక శిక్షింపబడేలా చేస్తాను.
బబులోను సముద్రం ఎండిపోయేలా చేస్తాను.
    ఆమె ఊటలు ఎండిపోయేలా నేను చేస్తాను.
37 బబులోను కూలిపోయిన భవంతుల గుట్టలా తయారవుతుంది.
    బబులోను పిచ్చికుక్కలు తిరుగాడే స్థలంగా మారుతుంది.
ఆ రాళ్లగుట్టను చూచిన ప్రజలు ఆశ్చర్యపోతారు. బబులోనును చూచి జనులు బాధతో తలలాడిస్తారు.
    బబులోను నిర్మానుష్యమైపోతుంది.
38 బబులోను ప్రజలు గర్జించు యువ సింహాల్లా ఉన్నారు.
    వారు పులి పిల్లల్లా గుర్రుమంటున్నారు.
39 ఆ ప్రజలు కొదమ సింహాలలా ప్రవర్తిస్తున్నారు.
    వారికి నేనొక విందు. ఇస్తాను.
    వారు బాగా మద్యం సేవించేలా చేస్తాను.
వారు నవ్వుతూ విలాసంగా కాలక్షేపం చేస్తారు.
    తరువాత వారు శాశ్వతంగా నిద్రపోతారు.
    వారిక మేల్కొనరు.”

యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
40 “బబులోను ప్రజలను చంపటానికి నేను తీసికొని వెళతాను.
    నరకబడటానికి వేచివుండే గొర్రెల్లా, పొట్టేళ్లలా, మేకల్లా బబులోను ప్రజలుంటారు.

41 “షేషకు ఓడింపబడుతుంది.
    అత్యుత్తమమైన, గర్వించదగిన దేశం చెరబట్టబడుతుంది.
ఇతర రాజ్యాల ప్రజలు బబులోనువైపు చూస్తారు.
    వారు చూసే విషయాలు వారిని భయపెడతాయి.
42 బబులోను మీదికి సముద్రం పొంగివస్తుంది.
    ఘోషించే అలలు దానిని ముంచివేస్తాయి.
43 బబులోను పట్టణాలు పాడుపడి, ఖాళీ అవుతాయి.
    బబులోను భూమి ఎండి ఎడారిలా మారుతుంది.
అది నిర్మానుష్యమైన భూమి అవుతుంది.
    కనీసం ప్రజలు బబులోను గుండానైనా పయనించరు.
44 బబులోనులో బేలు దేవతను నేను శిక్షిస్తాను.
    తను మింగిన మనుష్యులను అతడు కక్కేలా చేస్తాను.
ఇతర రాజ్యాల వారు బబులోనుకు రారు.
    బబులోను నగరపు చుట్టున్న ప్రాకారం కూలిపోతుంది.
45 నా ప్రజలారా, బబులోను నగరం నుండి బయటకు రండి.
    మీ ప్రాణరక్షణకు పారిపొండి.
    యెహోవా యొక్క భయానక కోపంనుండి దూరంగా పారిపొండి.

46 “నా ప్రజలారా, విచారించకండి.
    వదంతులు వ్యాపిస్తాయి; కాని భయపడవద్దు.
ఒక వదంతి ఈ సంవత్సరం వ్యాపిస్తుంది.
    మరొక వదంతి మరు సంవత్సరం వస్తుంది.
దేశంలో భీకరపోరాటం గురించిన వదంతులు లేస్తాయి.
    పాలకులు ఇతర పాలకులతో పోట్లాడుతున్నట్లు వదంతులు వస్తాయి.
47 బబులోనువారి బూటకపు దేవతలను నేను శిక్షించే సమయం ఖచ్చితంగా వస్తుంది.
    బబులోను రాజ్యం యావత్తు అవమాన పర్చబడుతుంది.
అనేకమంది ప్రజలు చనిపోయి నగర వీధుల్లో పడివుంటారు.
48 అప్పుడు పరలోకంలోను, భూమి మీద ఉన్న వారంత
    బబులోనుకు జరిగిన దాని విషయమై సంతోషంతో కేకలు పెడతారు.
శత్రు సైన్యాలు ఉత్తరాన్నుండి వచ్చి బబులోనుతో యుద్ధం చేస్తాయి
    గనుక వారునూ కేకలు పెడతారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

49 “బబులోను ఇశ్రాయేలు ప్రజలను చంపింది.
    భూమి మీద ప్రతి ప్రాంతంలోని ప్రజలనూ బబులోను చంపింది.
    కావున బబులోను తప్పక పతనమవ్వాలి!
50 కత్తివాతబడకుండా తప్పించుకున్న ప్రజలారా త్వరపడండి;
    బబులోనును వదిలిపొండి.
    ఆగకండి!
మీరు ఎంతో దూరానగల దేశంలో వున్నారు.
    కాని మీరున్న చోటనే యెహోవాను తలుచుకోండి. యెరూషలేమును గుర్తుచేసుకొనండి.

51 “యూదా ప్రజలమైన మేము సిగ్గుపడుతున్నాము.
    మేము అవమానింపబడినందున మేము సిగ్గుపడుతున్నాము.
అది ఎందువల్లనంటే పరాయివాళ్లు మా దేవుని దేవాలయంలోని
    పవిత్ర స్థలాల్లో ప్రవేశించారు.”

52 యెహోవా ఇలా చెపుతున్నాడు, “బబులోను విగ్రహాలను
    నేను శిక్షించే సమయం వస్తోంది.
ఆ సమయంలో, ఆ రాజ్యంలోని ప్రతిచోటా
    గాయపడిన ప్రజలు బాధతో మూలుగుతారు.
53 ఆకాశాన్నంటే వరకు బబులోను పెరగవచ్చు.
    బబులోను తన కోటలను పటిష్ఠం చేసికోవచ్చు
కాని ఆ నగరంతో పోరాడటానికి నేను జనాన్ని పంపుతాను.
    ఆ ప్రజలు దానిని నాశనం చేస్తారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పాడు.

54 “బబులోనులో ప్రజల ఆక్రందనలు మనం వినగలం.
    కల్దీయుల రాజ్యంలో ప్రజలు చేస్తున్న విధ్వంసకాండ శబ్దాలను మనం వింటాం.
55 అతి త్వరలో యెహోవా బబులోనును ధ్వంసం చేస్తాడు.
    నగరంలో వినవచ్చే గొప్ప సందడిని ఆయన అణచి వేస్తాడు.
మహాసముద్రపు అలలు ఘోషించినట్లు శత్రువులు వచ్చిపడతారు.
    చుట్టు పట్లవున్న ప్రజలు ఆ గర్జన వింటారు.
56 సైన్యం వచ్చి బబులోనును ధ్వంసం చేస్తుంది.
    బబులోను సైనికులు పట్టుబడతారు. వారి ధనుస్సులు విరిగిపోతాయి.
ఎందువల్లనంటే, వారు చేసిన పాపాలకు యెహోవా ఆ ప్రజలను శిక్షిస్తాడు.
    వారికి తగిన పూర్తి దండన యెహోవా విధిస్తాడు.
57 బబులోను యొక్క ముఖ్యమైన అధిపతులను,
    జ్ఞానులను మత్తిల్లజేస్తాను.
దాని పాలకులను, అధికారులను,
    సైనికులను కూడ మత్తిల్లజేస్తాను.
దానితో వారు శాశ్వతంగా నిద్రిస్తారు.
    వారు ఎప్పిటికీ మేల్కొనరు.”
ఈ విషయాలు రాజు చెప్పియున్నాడు.
    ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.

58 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా చెపుతున్నాడు,
“బబులోను యొక్క మందమైన, బలమైన గోడ కూలగొట్టబడుతుంది.
    దాని ఉన్నత ద్వారాలు తగులబెట్టబడతాయి.
బబులోను ప్రజలు కష్టపడి పనిచేస్తారు.
    కాని అది వారికి సహాయపడదు!
నగరాన్ని రక్షించటంలో వారు మిక్కిలి అలసిపోతారు.
    కాని వారు ఎగసేమంటల్లో కేవలం సమిధలవుతారు!”

యిర్మీయా బబులోనుకు సందేశం పంపుట

59 యిర్మీయా ఈ సందేశాన్ని అధికారియైన శెరాయాకు[a] పంపాడు. శెరాయా నేరీయా కుమారుడు. నేరీయా మహసేయా కుమారుడు. యూదా రాజైన సిద్కియాతో పాటు శెరాయా బబులోనుకు వెళ్లాడు. సిద్కియా యూదాకు రాజైన పిమ్మట నాల్గవ సంవత్సరంలో[b] ఇది జరిగింది. ఆ సమయంలో అధికారి శెరాయాకు యిర్మీయా ఈ వర్తమానాన్ని పంపించాడు. 60 బబులోనుకు సంభవించే భయంకర విషయాలన్నీ యిర్మీయా ఒక పుస్తకపు చుట్టలో వ్రాశాడు. బబులోను గురించి అతడీ విషయాలన్నీ వ్రాశాడు.

61 శెరాయాకు యిర్మీయా ఇలా చెప్పాడు, “శెరాయా, బబులోనుకు వెళ్లు. ప్రజలంతా వినేటట్లు ఈ సమాచారం తప్పకుండా చదువు. 62 తరువాత, ‘ఓ దేవా, ఈ ప్రదేశమగు బబులోనును నీవు నాశనం చేస్తానని అన్నావు. నరులుగాని, జంతువులు గాని నివసించని విధంగా దానిని నాశనం చేస్తానని అన్నావు. ఈ చోటు శాశ్వతంగా పట్టి శిథిలాలు పోగు అవుతుంది’ అని చెప్పు. 63 నీవీ పుస్తకం చదవటం పూర్తి చేయగానే దానికి ఒక రాయి కట్టు. తరువాత దానిని యూఫ్రటీసు నదిలోకి విసురు. 64 అప్పుడు, ‘ఇదే రీతిగా బబులోను మునిగిపోతుంది. బబులోను మరి పైకి లేవదు! నేను ఇక్కడ కలుగజేసే భయంకరమైన పరిణామాల కారణంగా బబులోను మునిగిపోతుంది’” అని చెప్పు.

యిర్మీయా మాటలు సమాప్తమాయెను.

కీర్తనలు. 30

దావీదు కీర్తన. ఆలయ ప్రతిష్ఠ కీర్తన.

30 యెహోవా, నా కష్టాల్లో నుంచి నీవు నన్ను పైకి ఎత్తావు.
    నా శత్రువులు నన్ను ఓడించి, నన్ను చూచి నవ్వకుండా నీవు చేశావు. కనుక నేను నిన్ను ఘనపరుస్తాను.
యెహోవా, నా దేవా నేను నిన్ను ప్రార్థించాను.
    నీవు నన్ను స్వస్థపరచావు.
సమాధిలో నుండి నీవు నన్ను పైకి లేపావు.
    నీవు నన్ను బ్రతకనిచ్చావు. చచ్చిన వాళ్లతోబాటు నేను గోతిలొ[a] ఉండవలసిన పనిలేదు.

దేవుని అనుచరులారా! యెహోవాకు స్తుతులు పాడండి.
    ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
దేవునికి కోపం వచ్చింది కనుక “మరణం” నిర్ణయం చేయబడింది. కాని ఆయన తన ప్రేమను చూపించాడు.
    నాకు “జీవం” ప్రసాదించాడు.
రాత్రి పూట, నేను ఏడుస్తూ పండుకొంటాను.
    మర్నాటి ఉదయం నేను సంతోషంగా పాడుతూ ఉంటాను.

ఇప్పుడు నేను ఇది చెప్పగలను, ఇది సత్యం అని నాకు గట్టిగా తెలుసు.
    నేను ఎన్నటికీ ఓడించబడను.
యెహోవా, నీవు నామీద దయ చూపావు.
    బలమైన పర్వతంలా నీవు నన్ను నిలువబెట్టావు.
కొద్దికాలంపాటు, నీవు నా నుండి తిరిగిపోయావు.
    మరి నేను చాలా భయపడిపోయాను.
దేవా, నేను మరల, నిన్ను ప్రార్థించాను.
    నామీద దయ చూపించమని నేను నిన్ను అడిగాను.
“దేవా, నేను మరణించి,
    సమాధిలోకి దిగిపోతే ఏమి లాభం?
ధూళి నిన్ను స్తుతిస్తుందా?
    అది నీ నమ్మకమును గూర్చి చెబుతుందా?
10 యెహోవా, నా ప్రార్థన విని నామీద దయ చూపించుము.
    యెహోవా, నాకు సహాయం చేయుము” అని అడిగాను.

11 నేను ప్రార్థించినప్పుడు, నీవు నాకు సహాయం చేశావు.
నా ఏడ్పును నీవు నాట్యంగా మార్చావు. నా దుఃఖ వస్త్రాలను నీవు తీసివేశావు.
    నీవు నాకు సంతోషమనే వస్త్రాలు ధరింపజేశావు.
12 యెహోవా, నా దేవా, నిన్ను నేను శాశ్వతంగా స్తుతిస్తాను.
    ఎన్నటికీ మౌనంగా ఉండను. నా దేవా! నిన్ను ఎల్లప్పుడూ స్తుతిస్తాను.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International