M’Cheyne Bible Reading Plan
సమూయేలు సౌలును అభిషేకించుట
10 సమూయేలు ఒక పాత్రలో ప్రత్యేక నూనె తీసుకుని సౌలు తలమీద పోసాడు. సమూయేలు సౌలును ముద్దు పెట్టుకొని, “యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు నిన్ను నాయకునిగా ఉండేందుకు అభిషేకించాడు. నీవు దేవుని ప్రజలకు ఆధిపత్యం వహించాలి. చుట్టూరా వున్న శత్రువుల బారినుండి వారిని నీవు కాపాడతావు. యెహోవా తన ప్రజల మీద పాలకునిగా ఉండేందుకు నిన్ను అభిషేకించాడు. ఇది సత్యమని ఋజువు చేసే గుర్తు ఇది. 2 ఈ రోజు నీవు నా వద్దనుండి వెళ్లగానే బెన్యామీను సరిహద్దుల్లో సెల్సహు వద్దనున్న రాహేలు సమాధి దగ్గర నీవు ఇద్దరు వ్యక్తులను కలుస్తావు. ‘నీవు వెదకబోయిన గాడిదలు దొరుకుతాయి. నీ తండ్రి గాడిదలను గూర్చి చింత పడటం మానేసాడు. ఇప్పుడు ఆయన నీ విషయంలో చింతిస్తున్నాడు. నా కుమారుని సంగతి నేనేమి చేయాలి? అని ఆయన అంటున్నాడు’” అని ఆ ఇద్దరు మనుష్యులు నీతో అంటారు.
3 “ఆ తరువాత తాబోరు వద్ద సింధూర మహా వృక్షంవరకూ నీవు ఆగకుండా ప్రయాణం చేస్తావు. అక్కడ మళ్లీ ముగ్గురు మనుష్యులు నిన్ను కలుస్తారు. వారు బేతేలు పట్టణంలో దేవుని ఆరాధించటానికి వెళుతూఉంటారు. వారిలో ఒకడు మూడు మేక పిల్లలను మోసుకొని వస్తాడు. రెండవ వానివద్ద మూడు రొట్టెలు ఉంటాయి. మూడవ వానివద్ద ఒక తిత్తినిండా ద్రాక్షారసం ఉంటుంది. 4 ఆ ముగ్గురు వ్యక్తులూ నిన్ను పలకరించి రెండు రొట్టెలు నీకు ఇస్తారు. ఆ రెండిటినీ వారినుండి నీవు తీసుకుంటావు. 5 తరువాత నీవు ఫిలిష్తీయుల కోటవున్న గిబియ-ఎలోహిముకు[a] వెళతావు. నీవు ఆ పట్టణం దరిచేరగానే ఒక ప్రవక్తల గుంపు బయటకు రావటం నీవు చూస్తావు. వీరు ఆరాధనా స్థలంనుండి వస్తూ ఉంటారు. వీణలు, తంబూరా, వేణువు, తంతి వాయిద్యాలను ముందు వాయిస్తూ దేవుని గూర్చిన విషయాలు చెబుతూ వస్తారు. 6 యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు. 7 ఈ సూచనలన్నీ ఋజువయ్యాక, నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చును. దేవుడు నీకు తోడై ఉంటాడు.
8 “నాకంటె ముందుగా నీవు గిల్గాలుకు వెళ్లు. నేను తరువాత వచ్చి నిన్ను కలుస్తాను. అప్పుడు నేను దహన బలులు, సమాధాన బలులు అర్పిస్తాను. కానీ, నీవు ఏడు రోజులు ఆగవలసి వుంటుంది. అప్పుడు నిన్ను కలిసి నీవు ఏమి చేయాలో చెబుతాను” అన్నాడు.
సౌలు ప్రవక్తలా మాట్లాడుట
9 సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి. 10 సౌలు, అతని సేవకుడు గిబియ-ఎలోహిముకు చేరగానే సౌలు కొంతమంది ప్రవక్తలను కలిసాడు. దేవుని ఆత్మ సౌలు మీదికి అతి శక్తివంతంగా దిగాడు. మిగిలిన ప్రవక్తలతో కలసి సౌలుకూడ దేవుని విషయాలు చెప్పసాగాడు. 11 ఇదివరకు సౌలును ఎరిగిన ప్రజలు అతడు ఇతర ప్రవక్తలతో కలసి ప్రవక్తలా మాట్లాడటం చూసారు. వారంతా “కీషు కొడుకు సౌలుకు ఏమయ్యిందో ఏమో! సౌలుకూడా ప్రవక్తలలో ఒకడయ్యాడా?” అంటూ ఆశ్చర్యపోయారు.
12 గిబియ-ఎలోహిములో నివసిస్తున్న ఒకడు, “అవును, అతడు వారి నాయకుడిలా[b] కనబడుతున్నాడు” అన్నాడు. అందుకే, “సౌలుకూడా ప్రవక్తల్లో ఒకడా?” అనే నానుడి ప్రసిద్ధికెక్కింది.
సౌలు ఇల్లు చేరుట
13 దేవుని విషయాలు ప్రవచించటం అయిన తర్వాత సౌలు తన ఇంటివద్ద ఉన్న ఆరాధనా స్థలం దగ్గరకు వచ్చాడు.
14 సౌలు తన సేవకుని కలిసి ఇంటికి వెళ్లగానే అతని పినతండ్రి, “ఎక్కడికి పోయారు” అని వారిని అడిగాడు.
“గాడిదలను వెదకటానికి వెళ్లాము. అవి దొరకక పోయేసరికి సమూయేలును చూడటానికి వెళ్లాము.” అని సౌలు చెప్పాడు.
15 “సమూయేలు నీకు ఏమి చెప్పాడో దయచేసి నాకు చెప్పు” అన్నాడు సౌలు పినతండ్రి.
16 “గాడిదలు దొరికినట్లు వెల్లడి చేశాడని సౌలు అన్నాడు.” అంతేగాని రాజ్యాన్ని గురించి సమూయేలు చెప్పినదేదీ సౌలు తన పినతండ్రికి చెప్పలేదు.
సౌలును రాజుగా సమూయేలు ప్రకటించుట
17 మిస్పావద్ద యెహోవాను కలుసుకొనేందుకు ఇశ్రాయేలీయులంతా సమావేశం కావాలని సమూయేలు పిలుపునిచ్చాడు. 18 సమూయేలు ఇలా అన్నాడు: “నేను ఇశ్రాయేలును ఈజిప్టునుంచి బయటకు తీసుకుని వచ్చాను. ‘నేను మిమ్మల్ని ఈజిప్టు బంధంనుండి విడుదల చేశాను. మిమ్మల్ని బాధించటానికి ప్రయత్నించిన ఇతర రాజ్యాలనుండి కూడా మిమ్మల్ని రక్షించాను.’ అని ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు చెప్పాడు: 19 మళ్లీ ఇశ్రాయేలీయులతో సమూయేలు ఇలా అన్నాడు: ‘మీ అందరి కష్టనష్టాల నుండి మీ దేవుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తూనే వున్నాడు. కానీ నేడు మీరు మీ దేవుని తిరస్కరించారు. మిమ్మల్ని పాలించటానికి మీకో రాజు కావాలని అడుగుతున్నారు.’ సరే. రండి! మీమీ వంశాల వారీగా, కుటుంబాల వారీగా దేవుని ముందర నిలబడండి.”
20 ఇశ్రాయేలు వంశాల వారినందరినీ సమూయేలు ఒక చోట చేర్చాడు. వారిలో బెన్యామీను వంశం ఎన్నుకోబడింది. 21 బెన్యామీను వంశంలో వున్న కుటుంబాల వారందరినీ గుంపు గుంపుగా వరుసగా నడిపించాడు. వాటిలో మథ్రీ కుటుంబం ఎన్నుకోబడింది. మరల మథ్రీ కుటుంబంలోని వారందరినీ వరుసుగా నడిపించాడు. వారిలో కీషు కుమారుడు సౌలు ఎంపిక చేయబడ్డాడు.
సౌలును చూడాలని వచ్చిన ప్రజలు అతనికోసం వెదకగా అతడు కనిపించలేదు. 22 “ఆ మనిషి ఇక్కడ ఉన్నాడా?” అని ప్రజలు అడిగారు.
“సౌలు సామానుల వెనుక దాగి ఉన్నాడని” యెహోవా చెప్పాడు.
23 జనం పరుగెత్తుకుంటూ పోయి సామాన్ల వెనుక దాగుకొని ఉన్న సౌలును తీసుకుని వచ్చారు. సౌలు వారందరిలో నిలబడి ఉన్నపుడు అతను అందరికంటె ఎత్తుగా, ఆజానుబాహుడుగా కనబడ్డాడు.
24 “ఇదిగో చూడండి, యెహోవా ఎంపిక చేసిన మనిషి, ప్రజలలో సౌలువంటివాడు ఒక్కడూ లేడు.” అని సమూయేలు ప్రజలందరితో అన్నాడు.
అప్పుడు ప్రజలు, “రాజు దీర్ఘకాలం జీవించునుగాక!” అని అరిచారు.
25 నూతన రాజ్యంలో నిబంధనావళిని సమూయేలు ప్రజలకు వివరించాడు. రాజ్యపరిపాలన నియమాలను, నిబంధనలను ఒక పుస్తకంలో వ్రాసి సమూయేలు యెహోవా ముందర ఉంచాడు. అలా చేసి సమూయేలు ప్రజలను తమ తమ ఇండ్లకు వెళ్లమన్నాడు.
26 సౌలు గిబియాలో వున్న తన ఇంటికి వెళ్లిపోయాడు. దేవుడు అక్కడ వున్న ధైర్యవంతుల హృదయాలను ప్రేరేపించాడు. ఈ ధీరులంతా సౌలు వెంట వెళ్లారు. 27 కాని పనికిమాలినవారు కొందరు “ఈ వ్యక్తి మనలను ఎలా రక్షించగలడు” అని అంటూ సౌలును చులకనగా చేసి, అతనికి కానుకలను పట్టుకు వెళ్లటానికి నిరాకరించారు. సౌలు ఏమీ పలకలేదు.
అమ్మోనీయుల రాజు నాహాషు
అమ్మోనీయుల రాజైన నాహాషు గాదీయులను, రూబేనీయులను క్రూరంగా బాధిస్తూండేవాడు. వారిలో ప్రతి ఒక్కడి కుడి కంటినీ రాజు తీసివేస్తూండేవాడు. వారిని ఎవరైనా రక్షించటం కూడా అతడు సహించలేదు. అమ్మోనీయుల రాజైన నాహాషు యొర్దాను నదికి కుడి వైపున ఉన్న ఇశ్రాయేలీయులలో ప్రతి ఒక్కరి కుడి కన్నూ తోడివేసాడు. కాని ఏడువేలమంది అమ్మోనీయుల నుండి పారిపోయి యాబేష్గిలాదుకు చేరారు.
ఆత్మ ద్వారా జీవము
8 అందువల్ల, ప్రస్తుతం యేసు క్రీస్తులో ఐక్యత పొంది జీవిస్తున్న వాళ్ళకు దేవుడు శిక్ష విధించడు. 2 దేవుని ఆత్మ మనం యేసు క్రీస్తుతో ఐక్యత పొందటంవల్ల మనలో జీవాన్ని కలుగచేశాడు. ఆ ఆత్మ యొక్క నియమం మన పాపానికి, మరణానికి చెందిన నియమం నుండి నాకు విముక్తి కలిగించింది. 3 ధర్మశాస్త్రం అన్నీ చెయ్యలేక పోయింది. పాపస్వభావం దాన్ని బలహీనంచేసింది. అందువల్ల దేవుడు తన కుమారుణ్ణి పాపాలు చేసే మానవుని రూపంలో పాపాలకు బలిగా పంపాడు. ఆయన వచ్చి మానవునిలో ఉన్న పాపాలకు శిక్ష విధించాడు. 4 ధర్మశాస్త్రం ఆదేశించిన నీతికార్యాలు మన ద్వారా జరగాలని ఆయన ఉద్దేశ్యం. మనము పాపస్వభావంతో జీవించటంలేదు. పరిశుద్ధాత్మ చెప్పినట్లు జీవిస్తున్నాము.
5 ప్రాపంచికంగా జీవించేవాళ్ళ మనస్సు ప్రాపంచిక విషయాలకు లోనై వుంటుంది. కాని దేవుని ఆత్మ చెప్పినట్లు జీవించేవాళ్ళ మనస్సు ఆ ఆత్మకు సంబంధించిన విషయాలకు లోనై ఉంటుంది. 6 ప్రాపంచిక విషయాలకు లోనవటంవల్ల మరణం సంభవిస్తుంది. కాని పరిశుద్ధాత్మకు లోనవటంవల్ల జీవం. శాంతం లభిస్తాయి. 7 ఎందుకంటే, ప్రాపంచిక విషయాలకు లోనైనవాని మనస్సు దేవుణ్ణి ద్వేషిస్తుంది. అలాంటి మనస్సు దేవుని ధర్మశాస్త్రానికి ఆధీనమై ఉండదు. ఉండజాలదు. 8 ప్రాపంచికంగా జీవించేవాళ్ళు దేవుని మెప్పుపొందలేరు.
9 దేవుని ఆత్మ మీలో నిజంగా నివసిస్తున్నట్లైతే, మీరు ఈ లోక సంబంధంగా జీవించటంలేదన్నమాట. అంటే మీరు ఆత్మీయంగా జీవిస్తున్నారన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ తనలో లేనివాడు క్రీస్తుకు చెందడు. 10 ఒకవేళ క్రీస్తు మీలో జీవిస్తున్నట్లైతే పాపం కారణంగా మీ శరీరం చనిపోయినా మీలో వున్న దేవుడు మిమ్మల్ని నీతిమంతులుగా చేసాడు కనుక, ఆయన ఆత్మ మీకు జీవాన్నిస్తాడు. 11 మరణించిన యేసును దేవుడు లేపినాడు. దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నట్లైతే, నశించిపోయే మీ దేహాలకు ఆయన జీవం పోస్తాడు. మృతి నుండి యేసును లేపినవాడు దేవుడే కావున మీలో నివసిస్తున్న ఆయన ఆత్మద్వారా దేవుడు మీ శరీరాలను జీవింపచేస్తాడు.
12 అందువల్ల సోదరులారా! మనము మన ఐహిక వాంఛల ప్రకారం బ్రతకనవసరం లేదు. 13 ఎందుకంటే, ఐహికవాంఛలతో జీవిస్తే మీరు మరణిస్తారు. కాని శరీరం చేస్తున్న చెడ్డ పనుల్ని ఆత్మద్వారా రూపు మాపితే మీరు జీవిస్తారు.
14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. 15 మీరు బానిసలయ్యే ఆత్మను పొందలేదు. మీరు దేవుని కుమారులుగా అయ్యే ఆత్మను పొందారు. ఇది మీలో భయం కలిగించదు. దానికి మారుగా మనము దేవుణ్ణి, “అబ్బా! తండ్రీ!” అని పిలుస్తున్నాము 16 మనం దేవుని పుత్రులమని దేవుని ఆత్మ మన ఆత్మతో కలిసి సాక్ష్యం చెపుతున్నాడు. 17 మనము దేవుని సంతానము కనుక మనము ఆయన వారసులము. క్రీస్తుతో సహవారసులము. మనము ఆయనలో కలిసి ఆయన తేజస్సును పంచుకోవాలనుకొంటే, ఆయనతో కలిసి ఆయన కష్టాలను కూడా పంచుకోవాలి.
రానున్న తేజస్సు
18 మనకు వ్యక్తం కానున్న తేజస్సు, మనం ప్రస్తుతం అనుభవిస్తున్న కష్టాలకన్నా ఎన్నో రెట్లు గొప్పదని నా అభిప్రాయం. 19 దేవుడు తన కుమారుల్ని బయలు పర్చాలని సృష్టి అంతా ఆతృతతో కాచుకొని ఉంది. 20 సృష్టి నాశనంకు అప్పగింపబడింది. అయితే తన కోరిక ప్రకారం కాకుండా, దాన్ని లోబర్చిన వాని చిత్తప్రకారం నిరీక్షణలో అప్పగించబడింది. 21 బానిసత్వంతో క్షీణించిపోతున్న ఈ సృష్టి ఒక రోజు విడుదలపొంది, దేవుని సంతానం అనుభవింపనున్న తేజోవంతమైన స్వేచ్ఛను అనుభవిస్తుందనే ఒక విశ్వాసం ఉంది.
22 సృష్టి అంతా ప్రసవించునప్పుడు స్త్రీకి కలిగే బాధలాంటి నొప్పులతో మూలుగుతూ ఈనాటి వరకు బాధపడుతుందని మనకు తెలుసు. 23 అంతేకాదు, దేవుని ఆత్మను మొదటి ఫలంగా పొందిన మనము కూడా మన మనస్సులో మూలుగుతున్నాము. మనం దత్త పుత్రులం కావాలనీ, మన శరీరాలకు విముక్తి కలగాలనీ ఆతృతతో కాచుకొని ఉన్నాము. 24 మనం రక్షింపబడినప్పుడు ఈ నిరీక్షణ మనలో ఉంది. కాని విశ్వాసంతో ఎదురు చూస్తున్నది లభించిన తర్వాత దాని కోసం ఆశించవలసిన అవసరం ఉండదు. తన దగ్గరున్న దానికోసం ఎవరు ఎదురు చూస్తారు? 25 కాని మన దగ్గర లేనిదాని కోసం ఆశిస్తే దానికోసం ఓర్పుతో నిరీక్షిస్తాము.
26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.
28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.
క్రీస్తు యేసులో దేవుని ప్రేమ
31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)
37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.
ఫిలిప్తీయుల గురించిన సందేశం
47 ప్రవక్తయైన యిర్మీయాకు యెహోవా నుండి ఈ సందేశం వచ్చింది. ఆ వర్తమానం ఫిలిష్తీయులను గురించినది. గాజా నగరంపై ఫరో దాడి చేయటానికి ముందుగా ఈ వర్తమానం వచ్చింది.
2 యెహోవా ఇలా చెపుతున్నాడు,
“చూడు, శత్రుసైనికులు ఉత్తరాన సమకూడుతున్నారు.
శరవేగంతో పొంగి ప్రవహించే నదిలా వారు వస్తారు.
దేశాన్నంతా ఒక మహా వెల్లువలా వారు ఆవరిస్తారు.
వారు అన్ని పట్టణాలను, వాటి ప్రజలను చుట్టుముడతారు. దేశంలో ప్రతి పౌరుడూ సహాయంకొరకు ఆక్రందిస్తాడు.
3 పరుగెత్తే గుర్రపు డెక్కల చప్పుడు వారు వింటారు.
రథాల చప్పుడు వారు వింటారు. కదిలే చక్రాల రణగొణ ధ్వని వారు వింటారు.
తండ్రులు తమ పిల్లలకు రక్షణ కల్పించలేరు.
ఆ తండ్రులు సహాయం చేయలేనంత బలహీనులవుతారు.
4 ఫిలిష్తీయులనందరినీ యెహోవా
త్వరలో నాశనం చేస్తాడు!
తూరు, సీదోనులకు సహాయపడే మిగిలిన
వారందరినీ నాశనం చేస్తాడు.
ఫిలిష్తీయులను యెహోవా అతి త్వరలో నాశనం చేస్తాడు.
క్రేతు[a] ద్వీపవాసులలో మిగిలిన వారందరినీ ఆయన నాశనం చేస్తాడు.
5 గాజా ప్రజలు ధుఃఖంతో తమ తలలు గొరిగించుకుంటారు.
ఆష్కెలోను ప్రజల నోరు నొక్కబడుతుంది.
లోయలో మిగిలిన ప్రజలారా, ఎంతకాలం మిమ్మల్ని మీరు గాయపర్చుకుంటారు?[b]
6 “ఓ యెహోవా ఖడ్గమా, నీవు ఎంతకాలము పోరాడెదవు.
నీ ఒరలోనికి నీవు వెళ్లుము!
ఆగిపో! శాంతించు, అని మీరంటారు.
7 కాని యెహోవా ఖడ్గం ఏ విధంగా విశ్రాంతి తీసుకుంటుంది?
యెహోవా దానికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు.
అష్కెలోను నగరాన్ని, సముద్ర తీరాన్ని
ఎదుర్కొనమని యెహోవా దానికి ఆజ్ఞ ఇచ్చాడు.”
దావీదు కీర్తన.
23 యెహోవా నా కాపరి
నాకు కొరత ఉండదు
2 పచ్చటి పచ్చిక బయళ్లలో ఆయన నన్ను పడుకో పెడతాడు.
ప్రశాంతమైన నీళ్లవద్దకు ఆయన నన్ను నడిపిస్తాడు.
3 ఆయన తన నామ ఘనత కోసం నా ఆత్మకు నూతన బలం ప్రసాదిస్తాడు.
ఆయన నిజంగా మంచివాడని చూపించేందుకు ఆయన నన్ను మంచితనపు మార్గాల్లో నడిపిస్తాడు.
4 చివరికి మరణాంధకారపు లోయలో నడిచినప్పుడు కూడా
నేను భయపడను. ఎందుకంటే, యెహోవా, నీవు నాతో ఉన్నావు.
నీ చేతికర్ర, నీ దండం నన్ను ఆదరిస్తాయి కనుక.
5 యెహోవా, నా శత్రువుల ఎదుటనే నీవు నాకు భోజనం సిద్ధం చేశావు.
నూనెతో నా తలను నీవు అభిషేకిస్తావు.
నా పాత్ర నిండి, పొర్లిపోతుంది.
6 నా మిగిలిన జీవితం అంతా మేలు, కరుణ నాతో ఉంటాయి.
మరియు నేను ఎల్లకాలం యెహోవా ఆలయంలో నివసిస్తాను.
దావీదు కీర్తన.
24 భూమి, దాని మీద ఉన్న సమస్తం యెహోవాకు చెందినవే.
ప్రపంచం, దానిలో ఉన్న మనుష్యులు అంతా ఆయనకు చెందినవారే.
2 జలాల మీద భూమిని యెహోవా స్థాపించాడు.
ఆయన దానిని పారుతున్న నీళ్ల మీద నిర్మించాడు.
3 యెహోవా పర్వతం మీదికి ఎవరు ఎక్కగలరు?
యెహోవా పవిత్ర ఆలయంలో ఎవరు నిలువగలరు?
4 అక్కడ ఎవరు ఆరాధించగలరు?
చెడుకార్యాలు చేయని వాళ్లు, పవిత్రమైన మనస్సు ఉన్న వాళ్ళునూ,
అబద్ధాలను సత్యంలా కనబడేట్టు చేయటం కోసం నా నామాన్ని ప్రయోగించని మనుష్యులు,
అబద్ధాలు చెప్పకుండా, తప్పుడు వాగ్దానాలు చేయకుండా ఉన్న మనుష్యులు.
అలాంటి మనుష్యులు మాత్రమే అక్కడ ఆరాధించగలరు.
5 మంచి మనుష్యులు, ఇతరులకు మేలు చేయుమని యెహోవాను వేడుకొంటారు.
ఆ మంచి మనుష్యులు వారి రక్షకుడైన దేవుణ్ణి మేలు చేయుమని వేడుకొంటారు.
6 దేవుని వెంబడించటానికి ప్రయత్నించేవారే ఆ మంచి మనుష్యులు.
సహాయంకోసం యాకోబు దేవుణ్ణి వారు ఆశ్రయిస్తారు.
7 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి.
పురాతన తలుపుల్లారా తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
8 ఈ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు యెహోవా. ఆయన శక్తిగల సైన్యాధిపతి.
యెహోవాయే ఆ రాజు. ఆయన యుద్ధ వీరుడు.
9 గుమ్మాల్లారా, మీ తలలు పైకెత్తండి!
పురాతన తలుపుల్లారా, తెరచుకోండి.
మహిమగల రాజు లోనికి వస్తాడు.
10 ఆ మహిమగల రాజు ఎవరు?
ఆ రాజు సర్వశక్తిగల యెహోవాయే. ఆయనే ఆ మహిమగల రాజు.
© 1997 Bible League International