Print Page Options
Previous Prev Day Next DayNext

M’Cheyne Bible Reading Plan

The classic M'Cheyne plan--read the Old Testament, New Testament, and Psalms or Gospels every day.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
న్యాయాధిపతులు 18

దాను లాయిషు నగరాన్ని పట్టుకొనుట

18 ఆ సమయంలో, ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. పైగా ఆ సమయంలో దాను వంశీయులు ఉండడానికిగాను ఒక చోటుకోసం అన్వేషిస్తున్నారు. తమకు సొంతమనదగిన ప్రదేశం వారికి లేదు. ఇశ్రాయేలుకి చెందిన ఇతర వంశాలవారికి స్వస్థలం ఉంది. కాని దాను వంశీయులకు సొంత ప్రదేశం లేదు.

అందువల్ల దాను వంశంవారు ఐదుగురు సైనికులను ఏదైనా ఒక ప్రదేశం అన్వేషించమని చెప్పి పంపించారు. వారు ఒక మంచి ప్రదేశం వెదికేందుకు గాను వెళ్లారు. ఆ ఐదుగురు జోర్యా, ఎష్తాయేలు నగరాల నుండి వచ్చారు. దాను వంశమునకు చెందిన అన్ని కుటుంబాల నుండి వచ్చినవారు. అందువల్లనే వారిని ఎంపిక చేయడం జరిగింది. “వెళ్లి ఏదైనా ఒక చోటు చూడండి” అని వారికి చెప్పబడింది.

ఆ ఐదుగురూ కొండ దేశమైన ఎఫ్రాయిముకు వచ్చారు. వారు మీకా ఇంటికి వచ్చారు. ఆ రాత్రి అక్కడే గడిపారు. వారు మీకా ఇంటికి అతి సమీపంగా వచ్చేసరికి, ఆ లేవీ యువకుడి కంఠస్వరం విన్నారు. ఆ గొంతుని వారు గుర్తుపట్టారు. అందువల్ల వారు మీకా ఇంటి దగ్గర ఆగిపోయారు. ఆ యువకుణ్ణి “ఎవరు నిన్నీ స్థలానికి తీసుకువచ్చారు? ఇక్కడ నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీ పనేమిటి?” అని వారు అడిగిరి.

ఆ యువకుడు మీకా తనకోసం చేసిన పనులను తెలియజేశాడు. “మీకా నన్ను జీతానికి ఉంచుకున్నాడు. నేనతని యాజకుడిని” అని అతను చెప్పాడు.

అప్పుడు వారతనితో ఇలా అన్నారు; “దయచేసి మాకోసంకూడా దేవుణ్ణి ఏదో ఒకటి అడుగు. ఏదైనా మేము తెలుసుకోదలచాము. ఉండడానికి చోటుకోసం వెతుకుతున్న మా అన్వేషణ విజయవంతమవుతుందా?”

యాజకుడు ఆ ఐదుగురితో ఇలా అన్నాడు, “అవుతుంది. నిశ్చింతంగా వెళ్లండి. మీ త్రోవలో, యెహోవా మిమ్మల్ని నడుపుతాడు.”

అందువల్ల ఐదుగురు వెళ్లిపోయారు. లాయిషు నగరానికి వారు వచ్చారు. ఆ నగరంలోని ప్రజలు భద్రత కలిగి ఉండడం వారు చూశారు. వారిని సీదోను ప్రజలు పరిపాలించారు. ప్రతిదీ ప్రశాంతంగా శాంతియుతంగా ఉండి, ప్రజలకు అంతా సమృద్ధిగా ఉండినది. తమకు హాని కలిగించే విరోధులు దగ్గరలో వారికి లేరు. పైగా సీదోను నగరానికి దూరంగా వారు నివసిస్తున్నారు. ప్రజలతో ఎలాంటి ఒడంబడికలూ చేసుకోలేదు.

ఆ ఐదుగురూ జోర్యా, ఎష్తాయేలు నగరాలకు తిరిగి వెళ్లారు. “సంప్రదింపులు చేశారా?” అని వారి బంధువులు అడిగారు.

ఆ ఐదుగురూ ఇలా బదులు చెప్పారు, “మేము ఒక ప్రదేశం చూశాము. అది చాలా బాగున్నది. వారిని మనం ప్రతిఘటించాలి. వేచి ఉండవద్దు! మనం వెళదాము, ఆ ప్రదేశాన్ని తీసుకుందాము. 10 మీరు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, అక్కడ చాలా ప్రదేశం ఉన్నదని మీరే తెలుసుకుంటారు. అక్కడ అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ప్రజలు ఏ ప్రతిఘటనను ఎదుర్కొంటారని అనుకోవడంలేదని మీరు తెలుసుకుంటారు. దేవుడే మనకు ఆ ప్రదేశం ఇచ్చాడు.”

11 అందువల్ల దాను వంశానికి చెందిన ఆరువందల మంది మనుష్యులు జోర్యా, ఎష్తాయేలు నగరాలకు బయలుదేరారు. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 12 లాయిషు నగరానికి వెళ్లే దారిలో, యూదాలోని కిర్యత్యారీము అనే నగరం వద్ద వారు ఆగారు. అక్కడ ఒక గుడారం వేసుకున్నారు. అందువల్లనే కిర్యత్యారీముకి పడమరగా వున్న ప్రదేశానికి మహనెదాను అని పేరు వచ్చింది. నేటికీ అదే పేరు. 13 ఆ ప్రదేశంనుండి, ఆ ఆరువందల మంది మనుష్యులూ కొండ దేశమైన ఎఫ్రాయిముకి ప్రయాణమయ్యారు. ఆ తర్వాత వారు మీకా ఇంటికి వచ్చారు.

14 లాయిషు చుట్టు ప్రక్కల ప్రాంతంలో సంచరించటానికి వెళ్లిన ఆ ఐదుగురూ వాళ్ల బంధువులతో అన్నారు: “ఒక ఇంట్లో ఏఫోదు ఉన్నది. పైగా గృహదేవతలు, చెక్కిన విగ్రహం మరియు వెండి విగ్రహం ఉన్నాయి. మీకేమి చేయాలో తెలుసు వాటిని తీసుకురావాలి.” 15 అందువల్ల వారు మీకా ఇంటి వద్ద నిలిచారు. అక్కడే యువకుడైన లేవీ మనిషి ఉన్నాడు. నీవెలా వున్నావని ఆ యువకున్ని వారడిగారు. 16 దాను వంశీయులైన ఆ ఆరువందల మంది మనుష్యులు వెలుపల ద్వారం వద్ద నిలిచారు. వారి వద్ద ఆయుధాలు ఉన్నాయి. యుద్ధానికి వారు సిద్ధంగా ఉన్నారు. 17-18 ఐదుగురు గూఢచారులు ఇంట్లోకి వెళ్లారు. వెలుపల ద్వారం పక్కగా యుద్ధ సన్నద్ధులైన ఆ ఆరువందల మంది మనుష్యులతో యాజకుడు నిలబడివున్నాడు. ఆ మనుష్యులు మలిచిన విగ్రహం, ఏఫోదు, గృహదేవతలు మరియు వెండి విగ్రహం తీసుకున్నారు. యువకుడైన లేవీ యాజకుడు, “మీరేమి చేస్తున్నారు?” అని అడిగాడు.

19 ఆ ఐదుగురు ఇలా బదులు చెప్పారు: “ఊరక వుండు! ఒక్కమాట కూడా మాట్లాడ వద్దు. మాతో పాటు రా. మా తండ్రిగా, యాజకుడుగా ఉండు. నీవు ఎన్నుకుని తీరాలి. కేవలం ఒక్క వ్యక్తికి తండ్రిగా, యాజకుడుగా ఉండటం మంచిదా? లేక ఇశ్రాయేలు ప్రజలలో ఒక వంశం వారికి యాజకుడుగా ఉండడం మంచిదా?”

20 లేవీ వ్యక్తికిది సంతోషదాయకమయింది. అందువల్ల అతను ఏఫోదు, గృహదేవతలు మరియు విగ్రహం తీసుకొని, దాను వంశం వారివద్ద నుంచి వచ్చిన మనుష్యులతో వెళ్లిపోయాడు.

21 తర్వాత దాను వంశానికి చెందిన ఆ ఆరువందల మంది మనుష్యులు లేవీ యాజకునితో కలిసి వెనుదిరిగి మీకా ఇల్లు విడిచి వెళ్లారు. వారు తమ చిన్న పిల్లలను, తమ జంతువులను తమ అన్ని వస్తువులను వారి ముందు విడిచిపెట్టి వెళ్లారు.

22 దాను వంశమునకు చెందిన ఆ మనుష్యులు ఆ చోటునుండి చాలా దూరం వెళ్లారు. మీకాదగ్గర నివసించే వారు ఒకటిగా కలుసుకున్నారు. తర్వాత దాను మనుష్యుల్ని వెంబడించారు. వారిని పట్టుకున్నారు. 23 దాను మనుష్యుల్ని మీకా మనుష్యులు కేకలు వేయసాగారు. దాను మనుష్యులు నిలబడ్డారు. “సమస్య ఏమిటి? ఎందుకు కేకలు వేస్తున్నారు?” అని మీకాని అడిగారు.

24 మీకా బదులు చెప్పెను: “దాను మనుష్యులైన మీరు నా విగ్రహాలు తీసుకుపోతున్నారు. వాటిని నా కోసం తయారు చేసుకున్నాను. మీరు నా యాజకుని కూడా తీసుకువెళ్తున్నారు. ఇక నాకు ఏమి మిగిలింది? ‘సమస్య ఏమిటి?’ అని మీరెలా అడుగుతారు?”

25 దాను వంశీయులు అందుకు ఇలా అన్నారు: “మాతో నీవు వివాదానికి పాల్పడడం మంచిది కాదు. మాలో కొందరు కోపిష్ఠులు. మమ్మల్ని నీవు కేకలు వేస్తే, వారు నిన్ను ప్రతిఘటించవచ్చు. నీవు, మీ కుటుంబాలవారూ చంపబడవచ్చు.”

26 తర్వాత దాను వంశానికి చెందిన మనుష్యులు వెనుదిరిగి తమ తోవను వెళ్లారు. ఆ మనుష్యులు తనకంటె బలాఢ్యులని మీకా గ్రహించాడు. అందువల్ల అతను ఇంటికి వెళ్లిపోయాడు.

27 కాగా మీకా చేసిన విగ్రహాలను దాను వంశీయులు తీసుకొనిపోయారు. మీకాతో ఉండిన యాజకుని కూడా తమతో పాటు తీసుకొనిపోయారు. తర్వాత వారు లాయిషుకి వచ్చారు. లాయిషులో నివసిస్తున్న వారి మీద దాడిచేశారు. ఆ మనుష్యులు శాంతముగా ఉన్నారు. వారు దాడిని ఎదురుచూడలేదు. దానుకు చెందిన మనుష్యులు వారిని తమ కత్తులతో చంపివేశారు. తర్వాత నగరాన్ని కాల్చివేశారు. 28 లాయిషులో నివసించేవారికి తమను కాపాడేవారు లేరు. వారు సీదోను నగరానికి చాలా దూరాన నివసించుటచే, ఆ నగర ప్రజలు సహాయం చేయలేకపోయారు. మరియు లాయిషు ప్రజలు అరాము ప్రజలతో ఒడంబడికయేమీ చేసుకొని ఉండలేదు. అందువల్ల వారు సహాయం చెయ్యలేదు. లాయిషు నగరం ఒక లోయలో ఉంది. అది బెత్రెహోబు పట్టణానికి చెందింది. దాను ప్రజలు ఆ ప్రదేశంలో ఒక కొత్త నగరం నిర్మించుకున్నారు. ఆ నగరం వారి నివాసమయింది. 29 దాను ప్రజలు ఆ నగరానికి కొత్త పేరు పెట్టారు. దానిని లాయిషు అన్నారు. కాని దానిని దాను అని మార్చివేశారు. ఆ నగరానికి ఇశ్రాయేలు కుమారులలో ఒకడైన దాను అను పూర్వీకుని పేరు పెట్టారు.

30 దాను వంశానికి చెందిన ప్రజలు దాను నగరంలో విగ్రహాలు ప్రతిష్ఠించారు. వారు గెర్షోము కుమారుడైన యోనాతానును తమ యాజకునిగా నియమించుకున్నారు. గెర్షోము మోషే[a] కుమారుడు. యోనాతాను మరియు అతని కుమారులు ఇశ్రాయేలు ప్రజల్ని బందీలుగా చేసి బబులోనుకు తీసుకు వెళ్లేంతవరకు దాను వంశం వారికి యాజకులుగా ఉన్నారు. 31 దాను ప్రజలు మీకా చేసిన విగ్రహాలను పూజిస్తూండేవారు. దేవాలయము షిలోహులో ఉన్నంత కాలము వారు ఆ విగ్రహాలను పూజించుచుండిరి.

అపొస్తలుల కార్యములు 22

పౌలు ప్రజలతో మాట్లాడటం

22 “పెద్దలారా! సోదరులారా! నా సమాధానం వినండి.”

అతడు హెబ్రీ భాషలో మాట్లాడటం విని వాళ్ళు మరింత నిశ్శబ్దం వహించారు.

పౌలు ఈ విధంగా చెప్పుకొంటూ పొయ్యాడు: “నేను యూదుణ్ణి, కిలికియ దేశంలోని తార్సు అనే పట్టణంలో జన్మించాను. ఈ పట్టణంలో పెరిగాను. మన పూర్వులు అప్పగించిన ధర్మశాస్త్రంలో గమలీయేలు వద్ద సంపూర్ణంగా శిక్షణ పొందాను. మీరు ఈనాడు దేవుని పట్ల ఏ పద్ధతిననుసరించి మీ భక్తిని ప్రదర్శిస్తున్నారో అదే పద్ధతిలో నేనూ ప్రదర్శిస్తూ ఉండేవాణ్ణి. నేను యేసు మార్గాన్ని అనుసరించినవాళ్ళను ఎన్నో హింసలు పెట్టాను. తద్వారా కొందరికి మరణం కూడా సంభవించింది. ఆడా, మగా అనే భేదం లేకుండా అందర్ని బంధించి కారాగారంలో వేసేవాణ్ణి.

“ప్రధానయాజకుడు, మహాసభకు చెందిన పెద్దలు దీనికి సాక్ష్యం. వాళ్ళను, డెమాస్కసులోని వాళ్ళ సోదరులకు ఉత్తరాలు వ్రాసి ఇవ్వమని అడిగి తీసుకొన్నాను. అక్కడికి వెళ్ళి యేసు మార్గాన్ని అనుసరిస్తున్నవాళ్ళను బంధించి యెరూషలేమునకు పట్టుకు వచ్చి వాళ్ళకు శిక్ష ఇవ్వాలనేదే నా ఉద్దేశ్యం.

పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం

“నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.

“‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.

10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.

12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.

14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.

17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.

19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.

21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”

22 ప్రజలు పౌలు చెప్పింది అంతదాకా విన్నారు. కాని అతడు ఈ మాట అనగానే, బిగ్గరగా, “అతడు బ్రతకటానికి వీల్లేదు, చంపి పారవేయండి!” అని కేకలు వేసారు. 23 వాళ్ళు తమ దుస్తుల్ని చింపి పారవేస్తూ, దుమ్ము రేపుతూ కేకలు వేసారు. 24 సేనాధిపతి పౌలును కోట లోపలికి తీసుకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ప్రజలు అతణ్ణి చూసి ఎందుకిలా కేకలు వేస్తున్నారో తెలుసుకోవటానికి పౌలును కొరడాలతో కొట్టమని ఆజ్ఞాపించాడు. 25 అతణ్ణి కొట్టటానికి కట్టి వేస్తుండగా పౌలు అక్కడున్న శతాధిపతితో, “నేరస్తుడని నిర్ణయం కాకముందే రోమా పౌరుణ్ణి కొరడా దెబ్బలు కొట్టటం న్యాయమేనా?” అని అడిగాడు.

26 ఇది విన్నాక ఆ సేనాధిపతి, సహస్రాధిపతి దగ్గరకు వెళ్ళి పౌలు అన్నది చెబుతూ, “మీరేమి చేస్తున్నారో మీకు తెలుసా? అతడు రోమా పౌరుడట!” అని అన్నాడు.

27 ఆ సహస్రాధిపతి పౌలు దగ్గరకు వెళ్ళి, “ఇప్పుడు చెప్పు! నీవు రోమా పౌరుడివా?” అని అడిగాడు.

“ఔను!” పౌలు సమాధానం చెప్పాడు.

28 సహస్రాధిపతి, “నేను రోమా పౌరుడవటానికి చాలా డబ్బు యివ్వవలసి వచ్చింది” అని అన్నాడు.

పౌలు, “నేను పుట్టినప్పటినుండి రోమా పౌరుణ్ణి!” అని అన్నాడు.

29 అతణ్ణి ప్రశ్నలడగాలనుకొన్నవాళ్ళు తక్షణమే వెనుకంజ వేసారు. ఆ సహస్రాధిపతి కూడా తాను రోమా పౌరుణ్ణి బంధించిన విషయం గమనించి భయపడిపోయాడు.

పౌలు యూదుల నాయకులతో మాట్లాడటం

30 అతడు పౌలుపై యూదులు మోపిన నిందకు సరియైన కారణం తెలుసుకోవాలనుకొన్నాడు. కనుక మరుసటి రోజు ప్రధానయాజకుల్ని, మిగతా సభ్యుల్ని సమావేశం కమ్మని ఆజ్ఞాపించాడు. పౌలును విడుదల చేసి వాళ్ళ ఎదుటకు పిలుచుకు వెళ్ళాడు.

యిర్మీయా 32

యిర్మీయా భూమిని కొనుట

32 యూదా రాజైన సిద్కియా పాలనలో పదవ సంవత్సరం[a] గడుస్తు ఉండగా యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది. సిద్కియా పాలన పదవ సంవత్సరం జరుగుతూ ఉండగా నెబుకద్నెజరు పాలన పదునెనిమిదవ సంవత్సరంలో ఇది జరిగింది. ఆ సమయంలో బబులోను రాజు సైన్యం యెరూషలేమును ముట్టడిస్తూ వచ్చింది. (యూదా రాజైన సిద్కియా యిర్మీయాను ఆ ప్రదేశంలో ఖైదు చేశాడు. యిర్మీయా, చెప్పిన భవిష్యవాణి సిద్కియాకు నచ్చలేదు. యిర్మీయా ఇలా చెప్పాడు: “యెహోవా ఇలా అన్నాడు, ‘యెరూషలేము నగరాన్ని నేను త్వరలో బబులోను రాజుకు ఇవ్వబోతున్నాను. నెబుకద్నెజరు ఈ నగరాన్ని స్వధీనపర్చుకుంటాడు. కల్దీయుల సైనికుల నుండి యూదా రాజైన సిద్కియా తప్పించుకోలేడు. అతడు నిశ్చయంగా బబులోను రాజుకు అప్పగించబడతాడు. సిద్కియా బబులోను రాజుతో ఎదురుపడి ముఖాముఖిగా మాట్లాడుతాడు. సిద్కియా స్వయంగా అతనిని తన కన్నులతో చూస్తాడు. బబులోను రాజు సిద్కియాను బబులోనుకు తీసికొని పోతాడు. సిద్కియాను. నేను శిక్షించేవరకు అతనక్కడ ఉంటాడు.’ ఇదే యెహోవా వాక్కు. ‘నీవు కల్దీయుల సైన్యంతో పోరాడినా నీవు గెలవలేవు.’”)

యిర్మీయా బందీగా వుండగా అతనిలా చెప్పాడు, “యెహోవా సందేశం నాకు అందినది. ఆ సందేశం ఇలా ఉంది: నీ పినతండ్రి కుమారుడైన హనమేలు త్వరలో నీ వద్దకు వస్తాడు. అతడు నీ తండ్రి సోదరుడైన షల్లూము కుమారుడు. హనమేలు నీ వద్దకు వచ్చి, ‘అనాతోతు వద్ధ నున్న తన పొలం కొనమని నిన్ను అడుగుతాడు. నీవు అతని దగ్గరి బంధువు గనుక తన పొలం కొనమని అడుగుతాడు. ఆ పొలాన్ని కొనటానికి నీకు హక్కు ఉన్నది. అది నీ బాధ్యత అయి కూడ ఉంది’ అని అంటాడు.

“తరువాత యెహోవా చెప్పినట్లే జరిగింది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు రక్షక భటుని ఆవరణలోనున్న నా యొద్దకు వచ్చాడు. హనమేలు నాతో ఇలా అన్నాడు, ‘యిర్మీయా, అనాతోతు పట్టణం వద్ద నున్న నా పొలాన్ని కొను. ఆ పొలం బెన్యామీను వంశం వారి రాజ్యంలో వుంది. నీవా పొలం కొనుగోలు చేయి. ఎందుకంటే అది నీవు కొని స్వంతం చేసికొనే హక్కు నీకుంది.’”

అయితే ఇది యెహోవా నుండి వర్తమానం అని నాకు అర్థమయ్యింది. అనాతోతు వద్ద వున్న పొలాన్ని నా పినతండ్రి కుమారుడైన హనమేలు నుండి కొన్నాను. దాని వెలగా పదునేడు తులాల వెండిని తూచి ఇచ్చినాను. 10 క్రయ దస్తావేజు మీద సంతకం చేశాను దాని ప్రతినొక దానిని తీసికొని ముద్రవేయించాను. ఇందుకు సాక్షులను కూడా నియమించాను. వారి ఎదుట వెండిని తూచాను. 11 మడత పెట్టి ముద్ర వేసిన దస్తావేజును, ముద్ర వేయించి దాని ప్రతిని నేను తీసుకున్నాను. 12 తరువాత వాటిని నేను బారూకునకు ఇచ్చినాను. బారూకు అనేవాడు నేరీయా కుమారుడు. నేరీయా అనేవాడు మహసేయా అను వాని కుమారుడు. ముద్ర వేసి మూసిన క్రయ దస్తావేజులో నేను పొలం ఖరీదు చేసిన నియమ నిబంధనావళి ఉంది. నా పినతండ్రి కుమారుడైన హనమేలు, మరియు ఇతర సాక్షుల యెదుట నేనా దస్తావేజులను బారూకునకు ఇచ్చాను. ఆ సాక్షులు కూడా దస్తావేజుల మీద సంతకాలు చేశారు. ఆ ఆవరణలో కూర్చుని వున్న అనేక మంది యూదా ప్రజలు కూడా నేను బారుకునకు దస్తావేజులను అప్పగించటం చూశారు.

13 ఆ ప్రజలంతా చూస్తూ ఉండగా, నేను బారూకుతో ఇలా చెప్పాను: 14 “సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా చెప్పుచున్నాడు: ‘ముద్ర వేసిన, ముద్ర వేయని దస్తావేజుల రెంటిని నీవు తీసికొని ఒక మట్టి కుండలో భద్రం చేయుము. ఆ దస్తావేజులు ఎక్కువ కాలం సురక్షితంగా ఉండేలాగున నీవు ఆ విధంగానే చేయుము.’ 15 ఇశ్రాయేలు దేవుడు, సర్వశక్తిమంతుడునగు యెహోవా ఇలా అంటున్నాడు: ‘భవిష్యత్తులో నా ప్రజలు తిరిగి ఇండ్లను, పొలాలను, ద్రాక్షతోటలను ఇశ్రాయేలులో కొనుగోలు చేస్తారు.’”

16 నేరీయా కుమారుడైన బారూకునకు దస్తావేజులను ఇచ్చిన పిమ్మట నేను దేవుని ప్రార్థించాను. నేనిలా అన్నాను:

17 “యెహోవా నా దేవా, చాపబడిన నీ బల ప్రభావాలచే నీవీ భూమ్యాకాశాలను సృష్టించావు. తిరుగులేని నీ మహిమచే వాటిని నీవు సృష్టించినావు. నీవు చేసే పనులలో నీకు ఆశ్చర్యకరమైనది, అసాధ్యమైనది ఏదియు లేదు. 18 యెహోవా, నీవు వేలాది ప్రజలకు దయామయుడవు, నమ్మకస్తుడవు అయివున్నావు. కాని పెద్దల తప్పులకు వారి పిల్లలను కూడా శిక్షింపగలవాడవు. మహోన్నతుడవు, శక్తి సంపన్నుడవు, సర్వశక్తిమంతుడైన యెహోవా అని నీకు పేరు. 19 దేవా, నీవు యోచించి ఘనమైన కార్యాలు సాధిస్తావు. ప్రజలు చేసే ప్రతీ పనినీ నీవు చూస్తావు. మంచి పనులు చేసేవారికి ప్రతిఫలాలిస్తావు. చెడుకార్యాలు చేసే వారికి తగిన శిక్ష విధిస్తావు. 20 యెహోవా, ఈజిప్టు రాజ్యంలో నీవు అమోఘమైన అద్భుతాలు జరిపించినావు. ఈ నాటి వరకు నీవు నీ శక్తివంతమైన కార్యాలు జరిపిస్తూనే ఉన్నావు. ఆ పనులు నీవు ఇశ్రాయేలులో మాత్రమే గాక, నీ ప్రజలు ఎక్కడ వుంటే అక్కడ నీవా అధ్భత కార్యాలు చేశావు. వీటి కారణంగా నీవు మిక్కిలి ఘనత వహించినావు. 21 యెహోవా, నీవు ఎన్నో మహాశక్తిగల అధ్భుతాలు జరిపించి, ఇశ్రాయేలు ప్రజలను ఈజిప్టునుండి బయటికి తీసికొని వచ్చావు. నీ శక్తవంతమైన హస్తాన్ని వినియోగించి నీవీ పనులు చేశావు! నీ శక్తి అశ్ఛర్యాన్ని కలుగ జేస్తూఉంది!

22 “యెహోవా, నీవీ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలకిచ్చావు. ఈ దేశాన్ని ఇస్తానని వారి పితరులకు నీవు ఏనాడో వాగ్దానం చేశావు. ఈ దేశం చాలా మంచిది. ఇది ఎన్నో మంచి వస్తువులతో నిండివున్నది. 23 ఇశ్రాయేలీయులు ఈ దేశంలోనికి వచ్చి దీనిని వారు స్వంతం చేసుకున్నారు. కాని ఆ ప్రజలే నీకు విధేయులు కాకుండా పోయారు. వారు నీ బోధనలను అనుసరించ లేదు. నీవు ఆజ్ఞాపించినట్లు వారు నడుచుకోలేదు. అందువల్లనే ఇశ్రాయేలు ప్రజలకు ఈ భయంకరమైనవన్నీ జరిగేటట్టు నీవు చేశావు.

24 “మరియు ఇప్పుడు శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు. యెరూషలేము నగర ప్రాకారం చుట్టూ దిమ్మలు, మెట్లు నిర్మిస్తున్నారు. తద్వారా వారు నగరపు గోడలు సులభంగా ఎక్కి నగరాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు. శత్రువుల కత్తుల మూలంగా కరువులు, రోగాలు మొదలైన ఈతి బాధల కారణంగా, కల్దీయుల సైన్యం యోరూషలేము నగరాన్ని ఓడిస్తుంది. ఇప్పుడు బబులోను సైన్యం నగరాన్ని ఎదుర్కొంటూ వుంది! యెహోవా, ఇది జరుగుతుందని నీవు చెప్పావు. పైగా అది నీవు చూస్తూ వుండగానే జరుగుతూ ఉంది.

25 “యెహోవా, నా ప్రభువా, ఆపద ముంచుకు వస్తున్నది. కాని, నీవు నాతో, ‘యిర్మీయా, వెండినిచ్చి పొలం కొనమనీ, ఆ కొనుగోలుకు సాక్షులను నియమించ!’ మనీ చెపుతున్నావు. కల్దీయుల సైన్యం నగరాన్ని కైవసం చేసికోడానికి సిద్ధంగా ఉన్న సమయంలో నీవు నాకీ విషయం చెపుతున్నావు. నా ధనం అలా ఎందుకు వృధా చేయాలి?”

26 అప్పుడు యెహోవా నుండి ఈ వర్తమానం యిర్మీయాకు వచ్చింది: 27 “యిర్మీయా, నేనే యెహోవాను, ఈ భూమి మీద ప్రతి వానికి నేనే దైవాన్ని. యిర్మీయా, నాకు అసాధ్యమైనదేదీ లేదని నీకు తెలుసు.” 28 యెహోవా ఇంకా ఇలా అన్నాడు: “యెరూషలేము నగరాన్ని నేను అతి త్వరలో కల్దీయుల సైన్యానికి, బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. ఆ సైన్యం నగరాన్ని పట్టుకుంటుంది. 29 కల్దీయుల సైన్యం ఇప్పటికే యెరూషలేము నగరాన్ని ఎదుర్కొంటూ వుంది. వారు త్వరలో నగరం ప్రవేశించి నిప్పు పెడతారు. వారీ నగరాన్ని తగులబెడతారు. బూటకపు దేవతైన బయలుకు ప్రజలు ఇండ్ల పైకప్పులపై బలులు అర్పించారు. అలా నాకు కోపం తెప్పించిన కొన్ని ఇండ్లు ఈ నగరంలో వున్నాయి. విగ్రహాలకు మద్యం సమర్పించి పూజించిన వారు కూడ ఉన్నారు. ఆ నివాసములన్నిటినీ కల్దీయుల సైన్యం తగుల బెడుతుంది. 30 ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను నేను గమనిస్తూవున్నాను. వారు చేసే ప్రతీదీ దుష్టకరమైనది! వారి చిన్నతనం నుండి వారు చెడు కార్యాలకు పాల్పడ్డారు. ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం తెప్పించారు. చేతులతో చేసిన విగ్రహాలను పూజించి ఇశ్రాయేలీయులు నాకు మిక్కిలి కోపం కలుగజేశారు!” ఇది యెహోవా వాక్కు. 31 “యెరూషలేము కట్టబడినప్పటి నుండి ఇప్పటి వరకు ఆ నగర ప్రజలు నాకు కోపం కల్గిస్తూనే ఉన్నారు. ఈ నగరం నాకెంతో కోపం తెప్పించింది. కావున నేను దానిని నా దృష్టి పథం నుండి తొలగిస్తాను. 32 ఇశ్రాయేలు, యూదా ప్రజలు చేసిన చెడు కార్యాల కారణంగా నేను యెరూషలేము నగరాన్ని నాశనం చేస్తాను. ప్రజలు, రాజులు, నాయకులు, వారి యాజకులు, ప్రవక్తలు, యూదాప్రజలు, యెరూషలేము నగర వాసులు అందరూ నాకు కోపం కలుగజేశారు.

33 “ఆ ప్రజలు సహాయం కొరకు నన్ను చేరవలసింది. కాని వారు నాకు విముఖులైనారు. వారికి నేను పదే పదే బుద్ధి చెప్ప చూశాను. కాని వారు నా మాట వినిపించుకోలేదు. నేను వారిని సరిజేయ చూశాను. అయినా వారు పట్టించుకోలేదు. 34 వారు విగ్రహాలను చేస్తూనే వచ్చారు. నేనా విగ్రహాలను ఏవగించుకున్నాను. పైగా నా పేరు మీద పిలవబడే ఆలయంలో వారా విగ్రహాలను ప్రతిష్టించారు. ఈ విధంగా వారు నా మందిరాన్ని ‘అపవిత్రం’ చేశారు.

35 “బెన్‌హిన్నోము[b] లోయలో వారు బూటకపు దేవత బయలుకు ఉన్నత పూజా స్థలాలు ఏర్పాటు చేశారు. వారా పూజా స్థలాలలో తమ కుమారులను, కుమార్తెలను శిశు బలులుగా మొలెకుకు సమర్పించటానికి ఏర్పాటు చేశారు. అటువంటి భయంకరమైన పని చేయమని నేనెప్పుడు ఆజ్ఞ ఇవ్వలేదు! అటువంటి ఘోరమైన పని యూదా ప్రజలు చేస్తారని కూడా నేనెప్పుడు అనుకోలేదు!

36 “మీ ప్రజలిలా అంటున్నారు, ‘బబులోను రాజు యెరూషలేమును పట్టుకుంటాడు. అతడు కత్తిని వినియోగిస్తాడు. కరువు, రోగాలు ఆవరిస్తాయి. ఈ నగరాన్ని ఓడించటానికి అతనికి అవి తోడ్పడుతాయి.’ కాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు: 37 ‘ఇశ్రాయేలు, యూదా ప్రజలను తమ దేశం వదిలి పోయేలా నేనే ఒత్తిడి చేశాను. నేను వారి పట్ల మిక్కిలి కోపగించియున్నాను. కాని వారందరిని నేను మరల ఈ ప్రదేశానికి తీసికొని వస్తాను! నేను బలవంతంగా పంపిన అన్ని దేశాల నుండి వారిని మరల కూడదీస్తాను. కూడదీసి ఈ దేశానికి మరల తీసికొనివస్తాను. వారు శాంతి కలిగి జీవించేలా చేస్తాను. 38 ఇశ్రాయేలు, యూదా ప్రజలు నా ప్రజలుగా వర్ధిల్లుతారు. నేను వారి దేవుడనవుతాను. 39 వాస్తవంగా వారంతా ఒకే ప్రజగా జీవించాలనే ఆకాంక్ష నేను వారికి కలిగిస్తాను. వారంతా తమ జీవితాంతం నిజంగా నన్నే ఆరాధించాలనే ధ్యేయ్యం కలిగివుంటారు. నన్ను ఆరాధించి, గౌరవించటం వారికిని, వారి పిల్లలకు మంచిని చేస్తుంది.

40 “‘ఇశ్రాయేలు, యూదా ప్రజలతో నేనొక ఒడంబడిక కుదుర్చుకుంటాను. ఈ నిబంధన శాశ్వతంగా ఉంటుంది. ఈ నిబంధన ప్రకారం నేనెప్పుడూ వారికి దూరం కాను. నేను వారికెప్పుడు సుముఖంగా ఉంటాను. వారు నన్ను గౌరవించాలనే కోరికతో ఉండేలా చేస్తాను. వారిక ఎన్నడూ నాకు విముఖులు కారు. 41 వారు నన్ను సంతోష పర్చుతారు. వారికి మేలు చేయటానికి నేనెంతో ఉత్సాహం చూపిస్తాను. వారిని ఖచ్చితంగా ఈ దేశంలో నాటి వారు బాగా ఎదిగేలా తోడ్పడతాను. ఇది నా పూర్ణ హృదయంతోను, ఆత్మ సాక్షిగాను చేస్తాను.’”

42 యెహోవా ఇంకా ఇలా అంటున్నాడు: “ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఈ మహా విపత్తును నేనే సంభవింపజేశాను. అదే మాదిరి నేను వారికి మేలు కూడా చేస్తాను. వారికి శుభం కలుగజేస్తానని వాగ్దానం చేస్తున్నాను. 43 ప్రజలు, ఈ దేశం వట్టి ఎడారి భూమి. ఇందులో మనుష్యులు లేరు, జంతువులు గాని లేవు. కల్దీయుల సైన్యం ఈ దేశాన్ని నాశనం చేసింది లేదు అని అనుకుంటారు. కాని భవిష్యత్తులో ప్రజలు మళ్లీ ఇక్కడ పొలాలు కొంటారు. 44 ప్రజలు తమ ధనాన్ని వెచ్చించి పంట భూములు కొంటారు. ప్రజలు తమ క్రయదస్తావేజులపై సంతకాలు చేసి వాటిపై ముద్రలు వేసి భద్రపరుస్తారు. ప్రజలు తమ దస్తావేజులపై సంతకాలు చేయునట్లు సాక్షులను నియమిస్తారు. బెన్యామీను వంశస్తులు నివసించే ప్రాంతంలో కూడా ప్రజలు మళ్లీ భూములు కొంటారు వారు యెరూషలేము చుట్టుపట్ల పొలాలు కొంటారు. వారు యూదా పట్టణ ప్రాంతాలలోను, మన్య ప్రాంతాలలోను, పడమటి కొండవాలు ప్రాంతంలోను, మరియు దక్షిణ ఎడారి ప్రాంతంలోను భూములు కొంటారు. మీ ప్రజలందరిని నేను తిరిగి స్వదేశానికి తీసికొని వస్తాను. గనుక ఇదంతా జరుగుతుంది.” ఈ సందేశం యెహోవా నుండి వచ్చినది.

కీర్తనలు. 1-2

మొదటి భాగం

(కీర్తనలు 1–41)

ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
    అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
    అతడు పాపులవలె జీవించనప్పుడు,
    దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
    ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
    సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
    అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.

అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
    వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
    ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
    చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International