M’Cheyne Bible Reading Plan
8 ఎఫ్రాయిము వారికి గిద్యోను మీద కోపం వచ్చింది. ఎఫ్రాయిము వారికి గిద్యోను కనబడినప్పుడు, “ఎందుకు నీవు మాపట్ల ఇలా వ్యవహరించావు. నీవు మిద్యాను ప్రజలమీద యుద్ధానికి వెళ్లినప్పుడు నీవు మమ్మల్ని ఎందుకు పిలవలేదు?” అని వారు గిద్యోనును అడిగారు.
2 ఎఫ్రాయిము మనుష్యులకు గిద్యోను ఇలా జవాబు ఇచ్చాడు: “మీరు చేసినట్టు నేనేమీ చేయలేదు. మా అబీయెజెరు వంశస్థులకంటె, మీ ఎఫ్రాయిము వారికి ఎక్కువ పంట వచ్చింది. కోతకాలంలో మా వారు కూర్చే ద్రాక్షపళ్లకంటె, మీరు పొలంలో పరిగె విడిచిపెట్టే ద్రాక్షపళ్లు ఎక్కువ ఉంటాయి. అది నిజం కాదా? 3 (అలాగే, ఇప్పుడు కూడా మీకు ఎక్కువ పంట వచ్చింది) మిద్యాను నాయకులు ఓరేబు, జెయేబలను పట్టుకొనేందుకు దేవుడు మీకు అనుమతి ఇచ్చాడు. మీరు చేసినదానితో నా విజయాన్ని నేను ఎలా పోల్చుకోగలను?” గిద్యోను మాటలు ఎఫ్రాయిము వారు విన్నప్పుడు, వారు ముందు కోపపడినంత కోపపడలేదు.
మిద్యాను రాజులు ఇద్దరిని గిద్యోను పట్టుకున్నాడు
4 అప్పుడు గిద్యోను, అతని మూడు వందల మంది మనుష్యులు యోర్దాను నది దగ్గరకు వచ్చి దానిని దాటి అవతలికి వెళ్లారు. కానీ వారు అలసిపోయి ఆకలితో[a] ఉన్నారు, 5 “నా సైనుకులు భోజనం చేసేందుకు ఏమైనా పెట్టండి. నా సైనికులు చాలా అలసిపోయారు. మిద్యాను రాజులు జెబహు, సల్మున్నాలను మేము ఇంకా తరుముతున్నాము” అని గిద్యోను సుక్కోతు పట్టణం వారితో చెప్పాడు.
6 కానీ సుక్కోతు పట్టణ నాయకులు, “నీ సైనికులు భోజనం చేసేందుకు ఏదైనా మేము ఎందుకు పెట్టాలి? జెబహు, సల్మున్నాలను మీరు ఇంకా పట్టుకోలేదు గదా?” అని గిద్యోనుతో చెప్పారు.
7 అప్పుడు గిద్యోను, “మీరు మాకు భోజనం పెట్టరు. జెబహు, సల్మున్నాలను పట్టుకొనేందుకు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఆ తర్వాత నేను తిరిగి ఇక్కడికి వస్తాను. అడవి ముళ్లకంపతోను, నూర్చుకొయ్యతోను మిమ్మల్ని కొడతాను” అని చెప్పాడు.
8 గిద్యోను సుక్కోతు పట్టణం విడిచి, పెనూయేలు పట్టణం వెళ్లాడు. సుక్కోతు వారిని అడిగినట్టే, గిద్యోను భోజనం కోసం పెనూయేలు వారిని అడిగాడు. కాని సుక్కోతు వారు ఇచ్చిన జవాబే పెనూయేలు వారు గిద్యోనుకు ఇచ్చారు. 9 కనుక గిద్యోను, “నేను విజయం సాధించిన తర్వాత, నేను ఇక్కడకు తిరిగి వచ్చి ఈ గోపురాన్ని కూలగొట్టేస్తాను” అని పెనూయేలు వారితో చెప్పాడు.
10 జెబహు, సల్మున్నా, వారి సైన్యం కర్కోరు పట్టణంలో ఉన్నారు. వారి సైన్యంలో పదిహేను వేలమంది సైనికులు ఉన్నారు. తూర్పు ప్రాంతపు ప్రజలందరి సైన్యంలో మిగిలిన సైనికులు వీరు. ఆ సైన్యంలో లక్షా ఇరవై వేల మంది బలమైన సైనికులు అప్పటికే చంపివేయబడ్డారు. 11 గిద్యోను, అతని మనుష్యులు గుడారవాసుల మార్గం ఉపయోగించారు. ఆ మార్గం నోబహు, యొగ్భెహ పట్టణాలకు తూర్పున ఉంది. గిద్యోను కర్కోరు పట్టణం వచ్చి శత్రువుమీద దాడి చేశాడు. ఈ దాడిని శత్రుసైన్యం ఊహించలేదు. 12 మిద్యాను ప్రజల రాజులు జెబహు, సల్మున్నాలు పారిపోయారు. కానీ గిద్యోను ఆ రాజులను తరిమి పట్టుకొన్నాడు. గిద్యోను, అతని మనుష్యులు శత్రు సైన్యాన్ని ఓడించారు.
13 అప్పుడు యోవాషు కుమారుడైన గిద్యోను యుద్ధం నుండి తిరిగి వచ్చాడు. గిద్యోను, అతని మనుష్యులు హెరెసు కనుమ అనబడిన పర్వత మార్గం గుండా ప్రయాణం చేసి తిరిగి వచ్చారు. 14 గిద్యోను సుక్కోతు పట్టణం నుండి ఒక యువకుని పట్టుకొన్నాడు. గిద్యోను ఆ యువకుని కొన్ని ప్రశ్నలు అడిగాడు. ఆ యువకుడు గిద్యోనుకు కొన్ని పేర్లు వ్రాసి ఇచ్చాడు. సుక్కోతు పట్టణపు నాయకులు, పెద్ద మనుష్యుల పేర్లు ఆ యువకుడు వ్రాసిపెట్టాడు. డెభ్భై ఏడు మంది పేర్లు అతడు ఇచ్చాడు.
15 అప్పుడు గిద్యోను సుక్కోతు పట్టణానికి వచ్చాడు. ఆ పట్టణంవారితో “ఇదిగో, జెబహు, సల్మున్నాలు. ‘అలసిపోయిన నీ సైనికులకు మేము భోజనం ఎందుకు పెట్టాలి? మీరు జెబహు, సల్మున్నాలను పట్టుకోలేదుగా?’ అంటూ మీరు నన్ను హేళన చేసారు” అని అతడు చెప్పాడు. 16 గిద్యోను సుక్కోతు పట్టణపు పెద్ద మనుష్యులను పట్టుకొని, వారిని శిక్షించేందుకు అడవినుండి తెచ్చిన ముళ్లకంపతో, నూర్చేడి కొయ్యతో వారిని కొట్టాడు. 17 పెనూయేలు పట్టణంలో ఉన్న గోపురాన్ని కూడా గిద్యోను కూలగొట్టివేశాడు. తరువాత అతడు ఆ పట్టణంలో నివసించేవారిని చంపివేశాడు.
18 అప్పుడు గిద్యోను, “తాబోరు కొండ మీద మీరు కొందరిని చంపేశారు. ఆ మనుష్యులు ఎలా ఉంటారు?” అని జెబహు, సల్మున్నాలను అడిగాడు.
“ఆ మనుష్యులు నీలాంటి వారే, వారిలో ప్రతి ఒక్కడూ యువరాజులా కనిపించాడు” అని జెబహు, సల్మున్నాలు జవాబు ఇచ్చారు.
19 “ఆ మనుష్యులు నా సోదరులు! నా తల్లి కుమారులు! యెహోవా తోడు, మీరు గనుక వారిని చంపి ఉండకపోతే ఇప్పుడు నేను మిమ్మల్ని చంపను” అన్నాడు.
20 అప్పుడు గిద్యోను యెతెరువైపు తిరిగాడు. గిద్యోను పెద్ద కుమారుడు యెతెరు. “ఈ రాజులను చంపు” అని గిద్యోను అతనితో చెప్పాడు. కాని యేతెరు చిన్న పిల్లవాడు గనుక అతడు భయపడ్డాడు. కనుక అతడు తన ఖడ్గం బయటకు తీయలేదు.
21 అప్పుడు జెబహు సల్మున్నాలు, “రా, నీవే మమ్మల్ని చంపు. నీవు మగవాడివి, ఈ పని చేయటానికి తగిన బలం ఉన్నవాడివి” అని గిద్యోనుతో చెప్పారు. కావున గిద్యోను లేచి జెబహు, సల్మున్నాలను చంపివేశాడు. అప్పుడు గిద్యోను వారి ఒంటెల మెడల మీద చంద్రాకారంలో ఉన్న నగలను తీసుకున్నాడు.
గిద్యోను ఏఫోదును తయారు చేయుట
22 ఇశ్రాయేలు ప్రజలు, “మిద్యాను ప్రజల నుండి నీవు మమ్మల్ని రక్షించావు. కనుక ఇప్పుడు నీవే మమ్మల్ని పాలించు. నీవూ, నీ కుమారుడు, నీ మనుమళ్లు మా మీద అధికారులుగా ఉండాలని మేము కోరుతున్నాము” అని గిద్యోనుతో చెప్పారు.
23 అయితే గిద్యోను, “యెహోవాయే మిమ్మల్ని పాలించేవాడు. నేను మీ మీద అధికారిగా ఉండను. నా కుమారుడు మీ మీద ఏలుబడి చేయడు” అని ఇశ్రాయేలీయులతో చెప్పాడు.
24 ఇశ్రాయేలు వారు ఓడించిన మనుష్యులలో కొందరు ఇష్మాయేలీయులుండిరి. ఇష్మాయేలు మనుష్యులు బంగారు పోగులు ధరించారు. కనుక గిద్యోను: “మీరు నా కోసం ఈ ఒక్క పనిచేయండి. యుద్ధంలో మీరు తీసుకున్న బంగారు పోగులు ఒక్కొక్కరు ఒక్కొక్కటి నాకు ఇవ్వండి” అని ఇష్మాయేలు ప్రజలతో చెప్పాడు.
25 కనుక ఇష్మాయేలు ప్రజలు, “నీకు కావలసినది మేము సంతోషంగా ఇస్తాము” అని గిద్యోనుతో చెప్పారు. కనుక వారు ఒక అంగీ నేలమీద పరిచారు. 26 ఆ బంగారు పోగులు ప్రోగు చేయబడినప్పుడు వాటి బరువు నలభై మూడు పౌనులు (1,700 తులములు) అయినది. ఇష్మాయేలు ప్రజలు గిద్యోనుకు ఇచ్చిన ఇతర కానుకలు ఈ బరువులో లేవు. చంద్రాకారములో ఉన్న నగలు, వంకాయరంగు వస్త్రాలు వారు అతనికి ఇచ్చారు. ఈ వస్తువులు మిద్యాను ప్రజల రాజులు ధరించినవి. మిద్యాను రాజుల ఒంటెల మీది గొలుసులను కూడ వారు అతనికి ఇచ్చారు.
27 ఒక ఏఫోదు చేసేందుకు గిద్యోను ఆ బంగారాన్ని ఉపయోగించాడు. అతడు తన స్వంత ఊరు ఒఫ్రాలో ఆ ఏఫోదును ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ఏఫోదును పూజించారు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి నమ్మకంగా ఉండక, ఏఫోదును పూజించారు. గిద్యోను మరియు అతని కుటుంబము పాపం చేసేందుకు ఆ ఏఫోదు ఒక ఉచ్చులా తయారైంది.
గిద్యోను మరణం
28 మిద్యాను ప్రజలు ఇశ్రాయేలు ప్రజల పాలన క్రింద ఉండేందుకు బలవంతం చేయబడ్డారు. మిద్యాను ప్రజలు ఇంకెంత మాత్రం చిక్కు కలిగించలేదు. గిద్యోను జీవించినంత కాలం, నలభై సంవత్సరాలు దేశంలో శాంతి ఉంది.
29 యోవాషు కుమారుడైన యెరుబ్బయలు (గిద్యోను) ఇంటికి వెళ్లాడు. 30 గిద్యోనుకు డెబ్బై మంది సొంత కుమారులు ఉన్నారు. అతనికి చాలా మంది భార్యలు ఉన్నారు గనుక అంతమంది కుమారులు ఉన్నారు. 31 గిద్యోను దాసి ఒకతె షెకెము పట్టణంలో నివసించినది. ఆ దాసి ద్వారా అతనికి ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారునికి అబీమెలెకు అని అతడు పేరు పెట్టాడు.
32 యోవాషు కుమారుడైన గిద్యోను మంచి వృద్ధాప్యంలో చనిపోయాడు. గిద్యోను అతని తండ్రి యోవాషుకు స్వంతంగా ఉన్న సమాధిలో పాతిపెట్టబడ్డాడు. ఆ సమాధి అబీయెజ్రీ వంశం వారు నివసించే ఒఫ్రా పట్టణంలో ఉంది. 33 గిద్యోను చనిపోగానే ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మరలా నమ్మకంగా ఉండక, వారు బయలును వెంబడించారు. బయలు బెరీతును వారు వారి దేతవగా చేసుకున్నారు. 34 ఇశ్రాయేలు ప్రజలు చుట్టూరా నివసిస్తున్న వారి శత్రువులందరి బారి నుండి యెహోవా వారిని రక్షించినప్పటికీ, ఇశ్రాయేలు ప్రజలు వారి దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోలేదు. 35 యెరుబ్బయలు (గిద్యోను), ఇశ్రాయేలు ప్రజల కోసం ఎన్నో మంచిపనులు చేసినప్పటికీ వారు అతని కుటుంబానికి నమ్మకంగా ఉండలేదు.
హింసలు
12 ఆ రోజుల్లోనే హేరోదు రాజు సంఘానికి చెందిన కొందర్ని హింసించటం మొదలు పెట్టాడు. 2 అతడు యోహాను సోదరుడైన యాకోబును కత్తితో నరికి వేయించాడు. 3 ఈ సంఘటనకు యూదులు ఆనందించారు. ఇది గమనించి అతడు పేతురును కూడా బంధించాలని వెళ్ళాడు. ఈ సంఘటన యూదులు పులియని రొట్టెలు తినే పండుగ రోజుల్లో సంభవించింది. 4 అతణ్ణి బంధించి కారాగారంలో వేసాడు. పూటకు నలుగురి చొప్పున కాపలా కాయుమని చెప్పి పదహారుగురు భటులకు అతణ్ణి అప్పగించాడు. పస్కా పండుగ జరిగాక అతణ్ణి ప్రజల ముందుకు తెచ్చి విచారణ జరిపించాలని అతని ఉద్దేశ్యం. 5 పేతురును అంతవరకు కారాగారంలో ఉంచాడు. పేతురు కోసం సంఘానికి చెందినవాళ్ళు దీక్షతో దేవుణ్ణి ప్రార్థించారు.
ప్రభువు దూత పేతురును విడిపించటం
6 హేరోదు రేపు విచారణ చేస్తాడనగా ఆ నాటి రాత్రి పేతురు యిరువురి సైనికుల మధ్య నిద్రిస్తూ ఉన్నాడు. సైనికులు అతణ్ణి రెండు యినుప గొలుసులతో కట్టివేసి ఉంచారు. మరి కొందరు సైనికులు కారాగారం ముందు కాపలా కాస్తూ ఉన్నారు. 7 అకస్మాత్తుగా ప్రభువు దూత ప్రత్యక్షం అయ్యాడు. ఆ గది అంతా వెలుగుతో నిండిపోయింది. ప్రభువు దూత పేతురు భుజం తట్టి, “త్వరగా లెమ్ము!” అని అంటూ అతణ్ణి నిద్రలేపాడు. మణికట్లకు కట్టిన సంకెళ్ళు ఊడిపోయాయి. 8 ఆ దూత, “లేచి, నీ దుస్తులు సరిచేసుకొని, చెప్పులు తొడుక్కో!” అని అన్నాడు. పేతురు అలాగే చేసాడు. “నీ దుప్పటి శరీరం మీద కప్పుకొని నా వెంట రా!” అని ఆ దూత అన్నాడు.
9 పేతురు అతణ్ణి అనుసరిస్తూ కారాగారంనుండి వెలుపలికి వచ్చాడు. కాని దేవదూత చేస్తున్నదంతా నిజంగా జరుగుతుందని అతడు అనుకోలేదు. తానొక కలకంటున్నాననుకొన్నాడు. 10 వాళ్ళు మొదటి కాపలావాణ్ణి, రెండవ కాపలావాణ్ణి దాటి పట్టణంలోకి వెళ్ళే యినుప ద్వారం దగ్గరకు వచ్చారు. అది వాళ్ళ కోసం దానంతట అదే తెరుచుకుంది. వాళ్ళు దాన్ని దాటి వెళ్ళారు. కొంత దూరం నడిచాక అకస్మాత్తుగా ఆ ప్రభువు దూత అతణ్ణి వదిలి వెళ్ళిపోయాడు.
11 అప్పటికి పేతురుకు తెలివి వచ్చింది. అతడు, “ప్రభువు తన దూతను పంపి హేరోదు బంధంనుండి మరియు కీడు కలగాలని ఎదురు చూస్తున్న యూదులనుండి, నన్ను రక్షించాడు. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు” అని తనలో తాను అనుకొన్నాడు.
12 జరిగిన వాటిని గ్రహించాక యోహాను తల్లియైన మరియ యింటికి వెళ్ళాడు. యోహాన్ని మార్కు అని కూడా పిలిచేవాళ్ళు. అక్కడ చాలా మంది సమావేశమై ప్రార్థిస్తూ ఉన్నారు. 13 పేతురు తలుపు తట్టాడు. “రొదే” అనే పనిపిల్ల తలుపు తీయటానికి వచ్చింది. 14 ఆమె పేతురు స్వరం గుర్తించి చాలా ఆనందించింది. ఆ ఆనందంలో తలుపు కూడా తెరవకుండా లోపలికి పరుగెత్తి, “పేతురు తలుపు ముందున్నాడు” అని కేక వేసింది. 15 వాళ్ళంతా “నీకు మతిపోయింది” అని అన్నారు. కాని ఆమె తాను చెప్పింది నిజమని నొక్కి చెప్పింది. దానికి వాళ్ళు, “అది అతని దూత అయివుంటుంది” అని అన్నారు.
16 పేతురు ఇంకా తలుపు తడుతూనే ఉన్నాడు. వాళ్ళు వెళ్ళి తలుపు తెరిచి చూసి చాలా ఆశ్చర్యపడ్డారు. 17 పేతురు వాళ్ళందర్ని నిశ్శబ్దంగా ఉండమని సంజ్ఞ చేసాడు. ఆ తదుపరి దేవుడు తనను కారాగారంనుండి ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో అందరికీ విశదంగా చెప్పాడు. “యాకోబుకు, మిగతా సోదరులకు దీన్ని గురించి చెప్పండి” అని చెప్పి, వాళ్ళను వదిలి వేరే ప్రదేశానికి వెళ్ళిపొయ్యాడు.
18 ఉదయం సైనికుల్లో అలజడి చెలరేగింది. “పేతురు ఏమై ఉంటాడు?” అని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. 19 హేరోదు పేతుర్ని వెతకటానికి అంతా గాలించమన్నాడు. కాని పేతురు కనిపించలేదు. హేరోదు కాపలావాళ్ళను అడ్డు ప్రశ్నలు వేసి విచారించాడు. ఆ తదుపరి ఆ కాపలావాళ్ళను చంపమని ఆజ్ఞాపించాడు. ఇది జరిగిన తదుపరి హేరోదు యూదయనుండి కైసరియకు వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపాడు.
హేరోదు మరణం
20 హేరోదు తూరు, సీదోను ప్రజల పట్ల చాలా కోపంతో ఉన్నాడు. వాళ్ళంతా యిప్పుడు ఒకటై హేరోదుతో మాట్లాడటానికి వెళ్ళారు. రాజు ఆంతరంగిక స్నేహితుడైన బ్లాస్తు రాజా, నీకెప్పుడూ నేను అన్యాయం చెయ్యలేదు అని దానియేలు బదులు చెప్పాడు. ను తమ వైపు త్రిప్పుకొని శాంతి కావాలని అడిగారు. వీళ్ళ రాజ్యం తమ ఆహారధాన్యాల కోసం హేరోదు రాజ్యంపై ఆధారపడి ఉండటమే దీనికి కారణం.
21 ఒక నియమితమైన రోజు హేరోదు రాజ దుస్తులు ధరించాడు. సింహాసనంపై కూర్చొని ప్రజల్ని సంబోధిస్తూ ఒక ఉపన్యాసం యిచ్చాడు. 22 “ఇది దేవుని కంఠం. మనిషిది కాదు” అని ప్రజలు ఆపకుండా కేకలు వేసారు. 23 దేవునికి చెందవలసిన ఘనత అతడు అంగీకరించినందుకు ప్రభువు దూత అతణ్ణి తక్షణమే రోగంతో పడవేసాడు. పురుగులు పట్టి అతడు చనిపోయాడు.
24 దైవసందేశం విని విశ్వసిస్తున్న ప్రజల సంఖ్య పెరుగుతూ వచ్చింది.
25 బర్నబా, సౌలు తమ పని ముగించుకొని యెరూషలేమునుండి తిరిగి వచ్చారు. తమ వెంట మార్కు అని పిలువబడే యోహాన్ను కూడా పిలుచుకు వచ్చారు.
సిద్కియా రాజు అభ్యర్థనను దేవుడు తిరస్కరించుట
21 యెహోవా వర్తమానం మళ్లీ యిర్మీయాకు వినిపించింది. అప్పుడు యూదా రాజు సిద్కియా అనేవాడు, రాజు పషూరు[a] అనే వానిని, యాజకుడగు జెఫన్యాను పిలిపించి యిర్మీయా వద్దకు పంపినపుడు రాజుకు ఈ వార్తను వినిపించిరి. పషూరు అనేవాడు మల్కీయా కుమారుడు. జెఫన్యా అనేవాడు మయశేయా అనువాని కుమారుడు. పషూరు, జెఫన్యాలిరువురూ యిర్మీయాకు ఒక వర్తమానం తెచ్చారు. 2 యిర్మీయాతో పషూరు, జెఫన్యాలు ఇలా అన్నారు. “మా కొరకు దేవుని ప్రార్థించుము. మాకు ఏమి జరుగుతుందో యెహోవాను అడిగి తెలుసుకొనుము. బబులోను రాజైన[b] నెబుకద్నెజరు మా మీదికి దండెత్తి వస్తున్నాడు. కనుక ఇది మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. గతంలో చేసినట్లు బహుశః యెహోవా మా కొరకు ఘనమైన కార్యాలు జరిపించవచ్చు. బహుశః నెబుకద్నెజరు మామీదికి రాకుండా ఆపి అతనిని యెహోవా వెనుకకు పంపించవచ్చు.”
3 అప్పుడు పషూరు, జెఫన్యాలకు యిర్మీయా ఇలా సమాధానమిచ్చినాడు: “రాజైన సిద్కియాకు ఇలా చెప్పండి: 4 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఏమి చెప్పుచున్నాడనగా, ‘నీ చేతిలో మారణా యుధాలున్నాయి. నీవా ఆయుధాలను బబులోను రాజు నుండి, కల్దీయుల[c] నుండి నిన్ను రక్షించుకోవటానికి ఉపయోగించనున్నావు. కాని ఆ ఆయుధాలన్నీ నిరుపయోగమయ్యేలా నేను చేస్తాను.
“‘బబులోను సైన్యం నగరం చుట్టూ వున్న రక్షణగోడ వెలుపల మూగి ఉంది. ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. త్వరలోనే ఆ సైన్యాన్ని యెరూషలేము లోనికి రప్పిస్తాను. 5 యూదా ప్రజలైన మీతో నేనే యుద్ధం చేస్తాను. శక్తివంతమైన నా చేతితో నేనే మీతో పోరాడతాను. నేను మీ పట్ల మిక్కిలి కోపంగా ఉన్నాను. అందువల్ల నా శక్తివంతమైన చేతితో కఠినంగా నేను మీతో పోరాడతాను. నేను మీతో యుద్ధం చేసి, మీపట్ల నేనెంత కోపంగా వున్నానో తెలియజేస్తాను. 6 యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను చంపుతాను. మనుష్యులతో పాటు పశువులను కూడా చంపుతాను. నగరమంతా వ్యాపించే భయంకరమైన వ్యాధుల ద్వారా వారంతా చనిపోతారు. 7 అదే జరిగిన తరువాత యూదా రాజైన సిద్కియాను బబులోను రాజైన నెబుకద్నెజరుకు అప్పగిస్తాను.’” ఇదే యెహోవా వాక్కు. “‘అంతేకాదు, సిద్కియా అధికారులను కూడా నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యెరూషలేములో కొందరు ప్రబలిన వ్యాధులకు గురియై చనిపోతారు. మరికొంత మంది శత్రువు కత్తివాతకి గురియై చనిపోతారు. మరికొంత మంది ఆకలితో మాడి చావరు. కాని నేనా ప్రజలను నెబుకద్నెజరుకు అప్పగిస్తాను. యూదా యొక్క శత్రువు గెలిచేలా నేను చేస్తాను. నెబుకద్నెజరు సైన్యం యూదా ప్రజలను హతమార్చాలని చూస్తూ వుంది. కావున యూదా ప్రజలు, యెరూషలేము నగరవాసులు కత్తివాతకి చనిపోతారు. నెబుకద్నెజరు ఏ మాత్రం కనికరం చూపడు. ఆ ప్రజల గతికి అతడు విచారించడు.’
8 “యెరూషలేము నగర వాసులకు ఈ విషయాలు కూడా చెప్పండి. యెహోవా ఇలా చెపుతున్నాడు: ‘బతకటమో, చనిపోవటమో అనే విషయాన్ని నేను మీకే వదిలి వేస్తున్నానని అర్థం చేసుకోమనండి! 9 యెరూషలేములో ఉండే వాడెవడైనా చనిపోతాడు! వాడు కత్తివల్లగాని, ఆకలిచే గాని, లేక భయంకర వ్యాధివల్ల గాని చనిపోతాడు! ఎవరైతే యోరూషలేము నుండి బయటికి పోయి కల్దీయుల సైన్యానికి లొంగిపోతారో వారే బతుకుతారు! ఆ సైన్యం నగరాన్ని చుట్టు ముట్టింది. అందువల్ల ఎవ్వడూ నగరంలోనికి ఆహారాన్ని చేరవేయలేడు. కాని ఎవడు నగరం వదిలి పోతాడో వాడు తన ప్రాణాన్ని రక్షించుకోగలడు. 10 యెరూషలేము నగరానికి విపత్తు వచ్చేలా చేయటానికి నేను సంకల్పించాను.’” ఇదే యెహోవా వాక్కు “‘బబులోను రాజుకు ఈ యెరూషలేము నగరాన్ని ఇచ్చి వేస్తాను. దీనిని అతడు అగ్నితో తగులబెడతాడు.’”
11 “యూదా రాజ కుటుంబానికి ఈ విషయాలు చెప్పండి:
‘యెహోవా వర్తమానాన్ని వినండి!
12 దావీదు వంశమా, యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
నీవు ప్రతి రోజూ ప్రజల పట్ల సరియైన న్యాయ నిర్ణయం చేయాలి.
నేరస్థుల దౌష్ట్యానికి గురి అయిన వారిని సంరక్షించుము.
నీవది చేయకపోతే
నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం ఎవ్వరూ ఆపలేని
దహించు అగ్నిలా ఉంటుంది.
మీరు దుష్ట కార్యాలు చేశారు
గనుక ఇది జరుగుతుంది.’
13 “యెరూషలేమా, నేను నీకు వ్యతిరేకినైనాను.
నీవు పర్వత శిఖరంపై కూర్చుంటావు.
నీవు ఈ లోయలో మహరాణిలా కూర్చుంటావు.
యెరూషలేము వాసులారా
‘మమ్మల్ని ఎవ్వరూ ఎదుర్కొన లేరు,
ఎవ్వడూ మా పటిష్ఠమైన నగరం లోకి ప్రవేశించలేడు’ అని మీరంటారు.”
కాని యెహోవా నుండి వచ్చిన ఈ వర్తమానం వినండి.
14 “మీకు తగిన శిక్ష మీరనుభవిస్తారు!
మీ అడవుల్లో అగ్ని చెలరేగేలా చేస్తాను.
ఆ అగ్ని మీ చుట్టూ ఉన్న ప్రతి దానిని కాల్చి వేస్తుంది.”
దేవుని ప్రేమ మరియు మానవ సాంప్రదాయం
(మత్తయి 15:1-20)
7 యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులు,[a] శాస్త్రులు యేసు చుట్టూ చేరారు. 2 వాళ్ళు, యేసు శిష్యుల్లో కొందరు అపరిశుభ్రమైన చేతులతో, అంటే ఆచారం ప్రకారం చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం గమనించారు. 3 పరిసయ్యులే కాక యూదులందరూ పెద్దలు చెప్పిన ఆచారం ప్రకారం తమ చేతుల్ని ప్రత్యేకంగా శుభ్రం చేసుకోకుండా భోజనం చెయ్యరు. 4 వాళ్ళు వీథిలోకి వెళ్ళివస్తే చేతులు కడుక్కోకుండా భోజనం చెయ్యరు. ఇదేకాక వాళ్ళింకా అనేకమైన ఆచారాలు పాటిస్తారు. లోటాలను, చెంబులను, గిన్నెలను[b] శుద్ధి చేయటం వాళ్ళ ఆచారం.
5 అందువల్ల పరిసయ్యులు, శాస్త్రులు యేసుతో, “మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం ఎందుకు చేస్తారు? పెద్దలు చెప్పిన ఆచారం ఎందుకు పాటించరు?” అని అడిగారు.
6 యేసు సమాధానంగా, “యెషయా వేషధారులైన మిమ్మల్ని గురించి సరిగ్గా ప్రవచించాడు. అతడు తన గ్రంథంలో ఇలా ప్రవచించాడు:
‘వీళ్ళు మాటలతో నన్ను గౌరవిస్తారు.
కాని వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి.
7 వాళ్ళు మానవ కల్పితమైన నియమాలను బోధిస్తారు.
కనుక వాళ్ళ ఆరాధన నిరర్థకం.’(A)
8 దేవుని ఆజ్ఞల్ని పాటించటం మానేసి, మానవుడు కల్పించిన ఆచారాల్ని పట్టుకొని మీరు పాటిస్తున్నారు.
9 “మీరు దేవుని ఆజ్ఞల్ని కాదని, మీ ఆచారాలను స్థాపించటంలో ఘనులు. 10 ఉదాహరణకు, మోషే మీ తల్లితండ్రుల్ని గౌరవించమని(B) మరియు తల్లిని కాని, తండ్రిని కాని దూషించినవారికి మరణ దండన విధించమని ఆజ్ఞాపించాడు.(C) 11 కాని ఒక మనిషి దగ్గర తన తల్లితండ్రులకు సహాయం చెయ్యటానికి కొంత ధనం ఉన్నా అతడు వాళ్ళతో, అది అంటే దేవునికి అర్పితం అని అంటే, 12 ఆ మనిషి తన తల్లి తండ్రులకు సహాయం చేయనవసరంలేదని మీరు అతణ్ణి సమర్థిస్తున్నారు. 13 మీ పెద్దల ఆచారం దేవుని ఆజ్ఞను రద్దు చేస్తోంది. ఇలాంటివి మీరు ఎన్నో చేస్తున్నారు” అని అన్నాడు.
14 యేసు మళ్ళీ, ప్రజల్ని తన దగ్గరకు పిలిచి, “ప్రతి ఒక్కళ్ళు ఇది వినండి. అర్థం చేసుకోండి. 15 బయట ఉన్నవేవీ మనిషి కడుపులోకి వెళ్ళి అతణ్ణి అపవిత్రం చేయవు. 16 మనిషినుండి బయటకు వచ్చేది. అతణ్ణి అపవిత్రం చేస్తొంది” అని అన్నాడు.
17 యేసు ప్రజల్ని వదిలి యింట్లోకి వెళ్ళాక ఆయన శిష్యులు ఆ ఉపమానాన్ని గురించి అడిగారు. 18 యేసు, “మీరింత అజ్ఞానులా! బయట ఉన్నది లోపలికి వెళ్ళి మనిషిని అపవిత్రం చెయ్యటం లేదని మీరు గమనించటం లేదా! 19 అది మనిషి హృదయంలోకి వెళ్ళదు. కడుపులోకి వెళ్ళి అక్కడ నుండి బయటకు వచ్చేస్తుంది” అని అన్నాడు. (యేసు ఈ విధంగా చెప్పి అన్ని ఆహార పదార్థాలు తినడానికి పవిత్రమైనవి అని సూచించాడు.)
20 ఆయన మళ్ళీ ఈ విధంగా అన్నాడు: “మనిషి నుండి బయటకు వచ్చేవి అతణ్ణి అపవిత్రం చేస్తాయి. 21 ఎందుకంటే, మానవుల హృదయాల నుండి దురాలోచనలు, జారత్వం, దొంగతనం, నరహత్యలు, వ్యభిచారం, 22 లోభం, చెడుతనం, కృత్రిమం, కామవికారం, మత్సరం, దేవదూషణ, అహంభావం, అవివేకం బయటకు వస్తాయి. 23 ఇవే లోపలనుండి బయటకు వచ్చి నరుని అపవిత్రం చేస్తాయి.”
యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం
(మత్తయి 15:21-28)
24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[c] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.
27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[d] అని అన్నాడు.
28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.
29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.
30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.
చెముడు, నత్తి ఉన్న వానికి నయం చేయటం
31 ఆ తర్వాత యేసు తూరు ప్రాంతం వదిలి, సీదోను వెళ్ళి అక్కడినుండి దెకపొలి ద్వారా గలిలయ సముద్రం చేరుకొన్నాడు. 32 అక్కడ కొందరు చెముడు, నత్తి ఉన్న ఒక మనిషిని యేసు దగ్గరకు పిలుచుకు వచ్చారు. అతనిపై తన చేయి పెట్టమని వాళ్ళు యేసును వేడుకొన్నారు.
33 యేసు అతణ్ణి ప్రజలనుండి ప్రక్కకు పిలుచుకు వెళ్ళి తన చేతి వ్రేళ్ళను అతని చెవుల్లో ఉంచాడు. ఉమ్మివేసి ఆ వ్యక్తి యొక్క నాలుక తాకాడు. 34 ఆకాశం వైపుచూసి నిట్టూర్చి, “ఎఫ్ఫతా” అని అన్నాడు. (ఎఫ్ఫతా అంటే “తెరుచుకో” అని అర్థం.) 35 వెంటనే అతని చెవులు తెరుచుకొన్నాయి. అతని నాలుక వదులైంది. అతడు స్పష్టంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.
36 యేసు దీన్ని ఎవ్వరికీ చెప్పవద్దని ఆజ్ఞాపించాడు. కాని ఆయన చెప్పినకొద్దీ వాళ్ళు దాన్ని గురించి యింకా ఎక్కువగా చెప్పారు. 37 ప్రజల ఆశ్చర్యానికి అంతులేక పోయింది. వాళ్ళు, “ఈయన అన్నీ బాగా చేస్తాడు. పైగా చెవిటివాడు వినేటట్లు, నత్తివాడు మాట్లాడేటట్లు కూడా చేస్తున్నాడు” అని అన్నారు.
© 1997 Bible League International